ఈ తొమ్మిది రోజులు ఎవరినీ తిట్టను.. కవిత

రాజకీయ నాయకులకు తిటుకోవడానికి.. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఆరోజు.. ఈరోజు అంటూ ఏమి ఉండదు. తమపై విమర్శలు చేసిన నేతలపై వారు కూడా వెంటనే విమర్శలు చేసి వారు కూడా ఏం తక్కువ తినలేదని నిరూపించుకుంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత విమర్శలకు పండుగరోజు మినహాయించింది. అదేంటనుకుంటున్నారా.. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంపీ కవిత పై పలు రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే కేసీఆర్ లాగే కవిత కూడా తమ ప్రత్యర్ధులను మాటలతో చీల్చి చెండాడుతుంది. అలాంటి కవిత ఈ బతుకమ్మ పండుగ సందర్బంగా.. తొమ్మిది రోజులు తాను ఎవరిని విమర్శించనని చెప్పింది. బతుకమ్మ పండుగ సందర్భంగా చేస్తున్న విమర్శలపై తాను మాట్లాడనని.. పవిత్రమైన రోజుల్లో పూజలు చేసుకోవటం మానేసి.. ఈ విమర్శలేంటి అని కవిత అంటున్నారు. అంతేనా తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తున్న ఆశావర్కర్లను సైతం తమ నిరసనలు పక్కన పడేసి బతుకమ్మ ఆడాలని సూచించారట. అయితే బతుకమ్మ ఆడాలని.. చెప్పే బదులు.. తమ సమస్యను తీరీస్తే నిజంగానే సంతోషంగా బతుకమ్మ ఆడుకుంటాం కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రైతు రుణమాఫీలపై టీడీపీ, జీజేపీ నిరసనలు.. టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

రైతు రుణమాఫీలపై తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. లక్షలోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని.. వారికి కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నేతలు అబిడ్స్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ పోలీసులు నేతలను అడ్డుకొనగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీ సహా మరికొందరు నేతలను అరెస్టు చేసి ఆబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను మరిచిపోయారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 1000 కోట్లు మార్కెట్‌ ఫండ్‌ విడుదల చేస్తామని.. ఖరీఫ్‌లో రైతులకు రూ. 15వేల కోట్ల వరకు రుణాలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందులో కనీసంఅయిదు వేల కోట్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంకా ఈ నిరసనలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని.. లక్షలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.  

తలసాని జుట్టే కాదు.. పదవి నకిలీదే.. రేవంత్ రెడ్డి

  టీటీడీపీ ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేంది రేవంత్ రెడ్డినే. ప్రత్యర్ధులను విమర్శించాలన్నా.. వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలన్నా రేవంత్ రెడ్డి తరువాతే. అందుకే మాటలతో చవాకులు పేల్చే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కొంత భయపడేది. అధికార పార్టీపై తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తలసానికి శ్రీనివాస్ యాదవ్ పై కామెంట్స్ విసిరారు. తమ పార్టీపై తలసాని చేస్తున్న విమర్శలకు ధీటుగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ జుట్టే కాదు ఆయన మంత్రి పదవి కూడా నకిలీదేనని సరైన కౌంటర్ ఇచ్చారు. కాగా రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కచరా అని.. కేసీఆర్ చుట్టూ ఉన్నది కచరా బ్యాచ్ అని విమర్శించిన సంగతి తెలిసిందే.

5 నిమిషాల టైం ఇవ్వండి మోడీ.. కాంగ్రెస్ ఎంపీలు

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జైరామ్ రమేశ్, జేడీ శీలం ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలందరూ కలిసి ప్రధానికి ఓ లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తమకు ప్రత్యేక హోదా గురించి.. ప్రత్యేక ప్యాకేజీల మాట్లాడేందుకు ఓ ఐదు నిమిషాల టైం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నేరవేర్చాలని అన్నారు. అలాగే హామీలను ఎవరు అమలు చేశారన్నది ముఖ్యం కాదని అమలయ్యాయా లేదా? అన్నదే ప్రధానమని శీలం విలేకరులతో చెప్పారు. మరి మోడీ వాళ్లకి టైం కేటాయిస్తారో లేదో చూడాలి.

జగన్ ప్రాణాలు పణంగా పెట్టొద్దు.. దిగ్విజయ్

జగన్ చేస్తున్న దీక్షకు రాష్ట్ర పార్టీల నేతలతో పాటు అటు తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి తను సొంతగా పార్టీ పెట్టుకున్నా.. పార్టీ పరంగా ఎలాంటి రాజకీయ విభేదాలున్నా తను చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని.. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తానని మోదీ చెపుతున్నారు.. అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా ఎలా ఇస్తారని ప్రశ్సించారు. కేసీఆర్ తన కుటుంబంకోసమే పాలన సాగిస్తున్నట్టు ఉంది కాని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదని.. కాని రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందని అన్నారు. 

జగన్ దీక్ష.. అసలు షర్మిళ ఎక్కడ?

గుంటూరు జిల్లా నల్లపాడులో ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ రోజు జగన్ దీక్షను భగ్నం చేసిన సంగతి విదితమే. అయితే జగన్ దీక్షకు ఎన్నో పార్టీలు మద్దుతు తెలిపాయి.. ఎంతో మంది నేతలు వచ్చి పరామర్శించారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అసలు జగన్ దీక్ష చేస్తున్న సమయంలో జగన్ చెల్లి షర్మిళ ఎక్కడా కనిపించకపోవడం. అంత పెద్ద దీక్షను తెలపెట్టిన జగన్ కు మద్దతు పలకడానికి ఎంతో మంది నాయకులు రాగా.. తల్లి విజయమ్మ.. భార్య భారతి పక్కన ఉన్నా షర్మిళ మాత్రం జగన్ దీక్ష ప్రారంభించిన తరువాత అసలు రానేలేదు. మరోవైపు జగన్ దీక్షకు షర్మిళ రాకపోవడంపై పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే షర్మిళ రాకపోవడానికి పలు కారణాలు చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్టీలో రాజేశేఖర్ రెడ్డి తరువాత జగన్.. జగన్ తరువాత షర్మిళ కు  అంత ఆదారణ ఉంది కాబట్టి.. తన చెల్లెలు తనకు పోటీ అవుతుందని.. తనను డామినేట్ చేస్తుందని జగనే షర్మిళను దీక్షకు రావద్దని చెప్పారని అంటున్నారు. మరోవైపు షర్మిళ తెలంగాణలో యాత్రలు చేస్తూ బిజీగా ఉందని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ తన చెల్లెలే తనకు పోటీగా వస్తుందని భయపడినట్టున్నారు.. అందుకే దీక్షవైపు షర్మిళ రాకుండా అడ్డుకట్టవేశారు.

ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా రోజమ్మా..

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా పార్టీ అధినేత జగన్ తలపెట్టిన నిరాహార దీక్షను ఏపీ ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున భగ్నం చేసింది. జగన్ దీక్ష తలపెట్టి ఈ రోజుకి ఏడు రోజులు కావడంతో.. అందులోనూ జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు అంతా కలిసి ఏదో ఒక రకంగా దీక్షను విరమించాలని అనుకున్నారు. కానీ ఈలోగా ప్రభుత్వం చొరవ తీసుకొని దీక్షను భగ్నం చేసింది. అయితే దీక్షను భగ్నం చేసినందుకు పార్టీ నేతలు ఊపిరి పీల్చుకొని..సంతోషపడుతున్నా ఏదో పైపైకి మాత్రం బలవంతంగా దీక్షను విరమింపజేశారు అని మాటలు చెపుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  అయితే అందరి సంగతి ఎలా ఉన్నా ఆపార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాని మాత్రం రోజా సంతోషం వచ్చినా తిడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. జగన్ దీక్షను ప్రభుత్వం విరమించినందుకు గాను చంద్రబాబు అత్యంత అప్రజాస్వామికంగా జగన్ దీక్షను భగ్నం చేశారని.. దీక్ష భగ్నం చేసినంతమాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకూ జగన్ చేస్తున్న దీక్షను విమర్శిస్తూ ఇప్పుడు దొంగ దారిన దీక్షను విరమిస్తారా అని తెగ ఫైర్ అవుతుంది. ప్రత్యేక హోదాకోసం టీడీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకోకపోగా.. తమ నాయకుడిని బతికించారన్న సంతోషంలో రోజా ఇలా మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఇంకొంత మందైతే ఇప్పుడు ఈ డైలాగ్స్ అవసరమా అని కూడా అనుకుంటున్నారు.

ఏం పనిలేదా దాని గురించే మాట్లడటానికి.. వెంకయ్య

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని.. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లడటం లేదని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలకు ధీటుగా వెంకయ్య సమాధానం చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి.. దీనికి సంబంధించి నీతి అయోగ్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుందని అన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నవాడు పనిచేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడాలని అన్నారు. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతిరోజూ  ప్రత్యేక హోదా గురించి మాట్లాడడమే పనా? వేరే పనంటూ లేదా? అని వెంకయ్య ప్రశ్నించారు. మాకు మాటల కంటే చేతలే ముఖ్యమని.. వెంకయ్య చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే విశాఖకు మెట్రోరైలు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్డీయే చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

జగన్ కోలుకుంటున్నారు.. ఇంకా 24 గంటలు ఉంచాలి.. జీజీహెచ్

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు ఉదయం ఆయనను కలిసిన పోలీసులు ఆయనతో  మాట్లాడి అనంతరం అంబులెన్స్ల్ లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు జగన్ ఇంకా 24 గంటలు తమ పర్యవేక్షణలోనే ఉండాలని.. ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది.. బిపి 130/80, యూరిక్ యాసిడ్ 13.2గా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేయడంపై పార్టీనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఏపీలో అన్ని జిల్లాల్లో వైసిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హోదా పై ఎలాంటి ప్రకటన చేయకుండా జగన్ దీక్షను భగ్నం చేయడం సరికాదని.. ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రత్యేక హోదాపై ఎలాంటి భవిష్యత్ కార్యాచరణలు తలపెట్టాలి అనే విషయాన్ని జగన్ కోలుకున్న తరువాత ఆయనను సంప్రదించి ఆతరువాత నిర్ణయం తీసుకోనున్నారు.

టీ సర్కార్ పై మధుయాష్కీ ఫైర్.. కవిత సాయం అంటే కేసీఆర్ విఫలమా?

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీకి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా తెలంగాణ అధికార పార్టీపై  నిప్పులు చెరిగారు. రాహుల్ టీంతో క్లోజ్ గా ఉంటూ రాజకీయాలు చేసే మధుయాష్కీ రాష్ట్రం విడిపోయిన తరువాత పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఓడిపోయి.. ఆతరువాత సైలెంట్ ఉంటూ.. కనీసం అధికార పార్టీని కూడా విమర్శించే వారు కాదు. అలాంటిది.. ఇప్పుడు అందరూ తనని మరిచిపోతున్నారు అని అనుకున్నారేమో ఉన్నట్టుంది కేసీఆర్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె.. ఎంపీ కవిత.. మేనల్లుడు హరీశ్.. మంత్రి పోచారం..పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ ఏం పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని.. రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కూతురు జాగృతి సంస్ధ ద్వారా సాయం చేయడానికి ముందుకొచ్చారు.. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదని ఒప్పుకుందా అని ప్రశ్నించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలపై మంత్రి పోచారం కూడా అబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవ చేశారు. ఒకపక్క రైతు ఆత్మహత్యలతో వారి భార్యల పసుపుతాళ్లు తెగిపోతుంటే మరోపక్క కవిత బతకమ్మ ఆడుతూ తిరుగుతుందని అన్నారు. అంతేకాదు కవిత లాక్మే షోరూంలు పెట్టుకున్నారు.. మంత్రి హరీశ్ రావు.. ఆంధ్రా వ్యాపారులతో కలిసి టూవీలర్ వెహికిల్స్ బిజినెస్ చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి చాలా రోజులకి నోరు విప్పిన మధుయాష్కీ ఇన్నీ రోజులదంతా ఒకేసారి వెళ్లగక్కినట్టున్నారు.

శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటా.. ప్రత్తిపాటి

ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్ట్ ఆస్తులను విక్రయించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇవన్నీ తప్పుడు ఆరోపణలని మండిపడుతున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి తన పేరు మీద కాని.. తన కుటుంబసభ్యుల పేరుమీద కాని ఒక్క సెంటు భూమికూడా రిజిస్టర్ చేయించుకోలేదని అన్నారు. కావాలనే వైసీపీ నేతలు తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. వాళ్లకి దమ్ము, ధైర్యం ఉంటే తాను అగ్రిగోల్డ్ ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్టు రుజువు చేయాలని.. వాళ్లు కనుకు రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని.. శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. ఒకవేళ అలా చేయకపోతే వైసీపీ నేతలు రాజీనామాకి సిద్దంగా ఉండాలి అని అన్నారు. అగ్రిగోల్డ్ సంస్ధ ద్వారా చాలా మంది నష్టపోయారు.. ఆ బాధితులకు న్యాయం జరగడానికి చంద్రబాబు చాలా ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు.

కేసీఆర్ అంటే కచరా అంటా.. రేవంత్ కొత్త భాష

తెలంగాణ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం కొత్తేమి కాదు.. అయితే ఓటుకు నోటు కేసులో తనను ఇరికించినందుకు కాను ఇప్పుడు మరింత ఎక్కువగా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు కేసీఆర్ తిట్టడంలో కొత్త కొత్త పదాలు కూడా కనిపెట్టి మరీ విమర్శిస్తున్నారు. అదేంటనుకుంటున్నారా.. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించేప్పుడు కచరా అనే పదం ఉపయోగించారు. కచరా అంటే ఈ జగతిలో తానోక్కడే అని అర్ధమని.. అది క అంటే కల్వకుంట్ల.. చ అంటే చంద్రశేఖర్ అని.. రా అంటే రావు అని వివరించి మరి విమర్శించారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లో ఉన్నరోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని అన్నారు. 

చంద్రబాబుకు కేసీఆర్ ఎక్కువా? పవన్ ఎక్కువా?

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికి ఆహ్వానాలు పంపే కార్యక్రమంలో పడ్డారు. ఇప్పుటికే ప్రధాని నరేంద్ర మోడీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా ఆయన కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఇంకా అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాను.. రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజనకు కారణమైన కేసీఆర్ ను సైతం పిలవడానికి సిద్దమయ్యారు. వట్టిగా ఆహ్వానించడం కాదు.. కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్న ఇప్పుడు ఒకరి ఆహ్వానం విషయంలో మాత్రం ఆసక్తి నెలకొంది. అది ఎవరో కాదు.. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతు పలికి.. వారు గెలుపులో పాలుపంచుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని విభజించే వరకూ నిద్రపోని.. నిరంతరం ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని తిట్టి.. ఎప్పుడూ ఏదో విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిట్టుకుంటున్నా.. చంద్రబాబు కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తాను అని క్లారిటీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు తన పార్టీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ని చంద్రబాబే స్వయంగా పిలుస్తారా లేక మంత్రులతో పిలిపిస్తారా అన్నది ఇప్పుడు అందరి సందేహం. పవన్ కళ్యాణ్ కు గౌరవ ప్రధమైన స్థానం కల్పిస్తారా అన్నది అందరి ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్తారా అనేది మరికొందరి అనుమానం. అంతేకాదు చంద్రబాబుకు కేసీఆర్ ఎక్కువనా లేక పవన్ కళ్యాణ్ ఎక్కువనా అని ఇద్దరికి ముడిపెట్టి చూసేవారూ ఉన్నారు. ఇన్ని అనుమానాలకు తెరపడాలంటే ఇంకా వేచి చూడాల్సిందే. 

జగన్ దీక్షకి పోలీసులు ఫుల్ స్టాప్!

  ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షని ఈరోజు తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేసారు. ఆయనని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తరువాత అక్కడ వైద్యులు ఆయనకి బలవనతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. తరువాత అన్ని పరీక్షలు చేసి.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని ప్రకటించారు. ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, అందరూ ఆసుపత్రిలోనే జగన్ తో ఉన్నారు. జగన్ దీక్ష ముగియడంతో తరువాత కార్యాచరణ గురించి చర్చించేందుకు వైకాపా ముఖ్యనేతలు గుంటూరులో నేడు సమావేశం అవుతున్నారు.

ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులకు బెదిరింపు లేఖ!

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లను చంపివేస్తామని హెచ్చరిస్తూ ఒక బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాక ఆంద్రప్రదేశ్ లో నౌకాశ్రయాలను, విశాఖ విమానాశ్రయాన్ని, శ్రీహరి కోట రాకెట్ సెంటర్ ని కూడా పేల్చి వేస్తామని ఆ లేఖలో హెచ్చరిక ఉంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తెలుగులో వ్రాసి ఉన్న ఆ లేఖని ముఖ్యమంత్రుల కార్యాలయానికో లేక పోలీస్ ఉన్నతాధికారులకో లేక ఏ మీడియా సంస్థకో పంపించకుండా విశాఖ విమానాశ్రయ డైరక్టర్ కి పోస్టులో పంపబడింది. నిజామాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఆ లేఖ పోస్ట్ చేయబడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను ఎవరు వ్రాసారో, ఏ ఉద్దేశ్యంతో వ్రాసారనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని చినట్లు విశాఖ పోలీస్ కమీషనర్ అమిత్ గర్గ్ అన్నారు. ఒకవేళ మావోయిష్టులు ఆ లేఖ వ్రాసి ఉండి ఉంటే వారు దైర్యంగా తామే వ్రాసామని స్వయంగా ప్రకటించుకొనేవారు. కానీ మావోయిష్టులు ఆ లేఖను వ్రాసినట్లు కమీషనర్ చెప్పలేదు కనుక వేరే ఎవరో వ్రాసి ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదుల మద్దతుదారులు ఎవరయినా ఆ లేఖ వ్రాసారా? లేక ఎవరో ఆకతాయి ఈ లేఖ వ్రాశాడా? అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇద్దరు ముఖ్యమంత్రుల భద్రత, లేఖలో పేర్కొన్న సంస్థల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేసారు.

ఫలక్ నుమా ప్యాలస్ వరల్డ్ నెంబర్: 1

  హైదరాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది చార్మినారే ఆ తరువాత గోల్కొండా, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్ వగైరా వగైరాల పేర్లు చెప్పుకొంటారు. కానీ వాటిలో ఫలక్ నుమా ప్యాలస్ కూడా ఉన్నపటికీ దాని పేరు చాలా అరుదుగా వినబడుతుంది. అందుకు కారణం అత్యద్భుతమయిన ఆ రాజమహల్లోకి సామాన్యులు అడుగుపెట్టే అవకాశం లేకపోవడమే. లేకుంటే దాని పేరు కూడా ప్రజల నోళ్ళలో నిత్యం వినబడుతుండేది. కానీ “ట్రిప్ అడ్వయిజర్” అనే సంస్థ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్యాలెస్ హోటల్స్ పై ఒక సర్వే నిర్వహించగా వివిధ దేశస్తులు ఫలక్ నుమా ప్యాలెస్ కే ఓటేయడంతో అది ప్రపంచంలో నెంబర్: 1 ప్యాలెస్ హోటల్ స్థానం కైవసం చేసుకొంది. ఫలక్ నుమా ప్యాలెస్ ని స్టార్ హోటల్ గా మార్చి దానిని తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది.

జగన్ కు షుగర్.. బీపీతో పనేంటి.. గాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్నదీక్షపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ చేసే దీక్షలో క్లారిటీ లేదని.. జగన్ కుర్చీకోసం దీక్ష చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేయట్లేదని మండిపడ్డారు. జగన్ షుగర్ లెవల్స్ పడిపోయాయని.. బీపీ రేట్ తగ్గిపోతుందని వార్తలు వస్తున్నాయి.. అసలు దీక్ష చేసేప్పుడు జగన్ కు షుగర్ తో.. బీపీతో పనేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జగన్‌కు హాని జరగాలని తామెవరమూ కోరుకోవడం లేదని, జగన్ ఉంటే తమకే రాజకీయంగా మేలని ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడుగుతున్నారా? రాష్ర్టాన్ని అడుగుతున్నారా ? కేంద్రాన్ని అడిగితే జగన్‌ ఢిల్లీలో దీక్ష చేయాలని మంత్రి సూచించారు.

అవి ఊహాగానాలు మాత్రమే.. నాగం

తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని నాగం జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నాగం జనార్ధనరెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని.. తాను బీజేపీని వీడి టీడీపీలోకి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేశారు. హోం మంత్రి ఆహ్వానం మేరకే ఢిల్లీ వచ్చానని.. తాను ప్రారంభించిన బచావో తెలంగాణ మిషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న విషయాన్ని రాజ్‌నాథ్‌కు వివరించానని వెల్లడించారు. అంతేకాదు రైతు సమస్యలు తెలుసుకునేందుకు తాను రైతు యాత్ర చేశానని.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై రాజ్ నాథ్‌తో చర్చలు జరిపినట్లు నాగం చెప్పుకొచ్చారు.

సినీ పరిశ్రమకు చంద్రబాబు గాలం

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సినీ పరిశ్రమ కూడా ఏపీకి తరలిరావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత సినీ పరిశ్రమ కూడా విడిపోతుందని అందరూ భావించినా అది జరగలేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తెలంగాణకు సంబంధించ నటీ నటుల కంటే ఏపీకి సంబంధించిన వారే ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సందేహాలు వచ్చాయి. కాకపోతే దానికి భిన్నంగా సినీ పరిశ్రమ విడిపోకుండా.. ఇక్కడ సకల సౌకర్యాలు ఉండటంతో మారే ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ సినీ పరిశ్రమ ఏపీలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారే కాకపోయినా.. నెమ్మదిగా సినీ పరిశ్రమలు వైజాగ్ లాంటి ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన భీమలి-విశాఖపట్నం రోడ్డులోని వజ్ర ఆశ్రమం దగ్గర ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ (ఎఫ్ ఎన్ సీసీ)కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సొసైటీని డెవలప్ చేయబోతుండటం విశేషం. అయితే ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు స్టూడియోను నిర్మించినా అందులో పెద్దగా షూటింగ్ లు జరగడంలేదు. ఒక్కసారి ఇక్కడ షూటింగ్ లు ప్రారంభమైతే ఆటోమేటిక్ గా అందరూ వస్తారని.. మున్ముందు సినీ పరిశ్రమను వైజాగ్ కు రప్పించడానికి మరిన్ని చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి చంద్రబాబు సినీ పరిశ్రమకు గాలం వేసినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తుందా..