స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?

  ప్రత్యేక హోదా గురించి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ స్పెషల్ స్టేటస్ కా దౌర్ సమాప్త్ హో చుకా హై అని అన్నారు. అంటే ప్రత్యేక హోదా శకం ముగిసిందని వ్యాఖ్యానించారన్నమాట. అయితే ఇప్పుడు అరుణ్ జైట్లీ బీహార్ ను ఉద్దేశించి ఆమాటలు అన్నా.. అది ఏపీ ప్రత్యేక హోదాకి కూడా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టే అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పన్నుల ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీకి 14వ ఆర్థిక సంఘం రాజ్యాంగం ప్రకారం ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజికి అర్థం లేదని అన్నారు. అంతేకాదు ఇప్పటికే బీహార్ ప్రధాని మోడీ లక్షా 65వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని.. దీనితో పాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల కోసం మరో 40 వేల రూపాయలు ప్రకటించారని చెప్పారు.

బీఫ్ వివాదం... పద్మభూషణ్ వెనక్కి...

  బీఫ్ వివాదంపై దేశవ్యాప్తంగా ఇంకా తీవ్ర నిరసలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, ఇప్పటికే పలువురు రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయగా మరికొందరు అదే దారిలో నడుస్తున్నారు, తాజాగా ప్రముఖ సైంటిస్ట్ పీఎం భార్గవ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ ను వెనక్కి ఇచ్చేయాలని డిసైడయ్యారు, ప్రజలు ఏం తినాలో... ఏం తినకూడదో ప్రభుత్వమే చెబుతుందా అంటూ ప్రశ్నించిన పీఎం భార్గవ... ప్రజలు ఏం చేయాలన్నదానిపై రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు, బీఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చలేదన్న పీఎం భార్గవ... నిరసనగా పద్మభూషణ్ ను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నానన్నారు. ఇప్పటికే వందమందికి పైగా రచయితలు... సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేయగా, ఇప్పుడు సైంటిస్ట్ పీఎం భార్గవ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

చండీయాగం... నీ డబ్బుతో చేసుకో...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తన చండీయాగాన్ని సొంత డబ్బుతో చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు, సొంత మొక్కులకు ప్రభుత్వ డబ్బును ఖర్చుచేస్తే ఊరుకునేది లేదన్న సురవరం... ప్రజాధనంతో చండీయాగం చేయొద్దని కేసీఆర్ కి సూచించారు, గతంలోనూ ప్రభుత్వ డబ్బుతో వివిధ దేవాలయాలకు మొక్కుకున్న మొక్కలు తీర్చుకున్నారని, ఈసారి మాత్రం అలాచేస్తే అంగీకరించబోమని అన్నారు, మత విశ్వాసాలు అనేవి వ్యక్తిగతమైనవన్న సురవరం సుధాకర్ రెడ్డి... వాటిని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం సరికాదన్నారు. గతంలోనూ ప్రభుత్వ డబ్బుతో కేసీఆర్ మొక్కులు చెల్లించడంపై విమర్శలు చెలరేగాయి, మరి చండీయాగం సొంత ఖర్చులతో నిర్వహిస్తారో... లేక ప్రతిపక్షాల విమర్శలను లెక్కచేయకుండా ప్రభుత్వ డబ్బుతో చేస్తారో చూడాలి?

తలసాని మంత్రి పదవిపై మరో పిటిషన్

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై మరో పిటిషన్ దాఖలైంది, టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమంటూ శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం వేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ఆర్నెళ్లకు పైగా మంత్రి పదవిలో కొనసాగడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ శివప్రసాద్ రెడ్డి... మంత్రి పదవి నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ ను బర్తరఫ్ చేయాలని కోరారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుంటే ఇప్పటివరకూ ఎందుకు ఆమోదించలేదని, అయినా ఆర్నెళ్లకు మించి అలా పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టుకు నివేదించాడు, అయితే పిల్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

కనీసం సెకండ్ ప్లేస్... లేదంటే ఇబ్బందులే...

  వరంగల్ ఉపఎన్నిక కోసం అధికార పార్టీతోపాటు మిగతా ప్రధాన పార్టీలన్నీ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి, వరంగల్ ను తిరిగి నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్, ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ-టీడీపీ కూటమి, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది, అయితే వరంగల్ రిజర్వుడు సీటు కావడంతో అన్ని పార్టీలూ... ఆర్ధిక బలమున్న అభ్యర్ధుల కోసం వెదుకుతున్నాయి, అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలిసింది, ఆర్ధిక బలమున్న వివేక్ ను బరిలోకి దించితేనే మంచిదని కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ నేతలు నివేదించినట్లు తెలిసింది, పోటీకి వివేక్ ఒప్పుకోని పక్షంలోనే ఇతర అభ్యర్ధుల వైపు చూడాలని సూచించారు, దాంతో వివేక్ ను పోటీ చేయాలని అధిష్టానం కోరిందని టాక్ వినిపిస్తోంది, మరోవైపు వరంగల్ ఉపఎన్నికను బీజేపీ-టీడీపీ కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని, లేదంటే కనీసం రెండో ప్లేస్ లోనైనా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని టీపీసీపీ నేతలు అంటున్నారు.

ముస్లిం మహిళలకూ సమాన హక్కులు

  దేశంలో ముస్లిం మహిళల గౌరవానికి, భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ముఖ్యంగా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడం, భర్త రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడంలాంటి విషయాల్లో ముస్లిం మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఆ విషయంలో వాళ్లకి భద్రత ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది, ఎన్నో చట్టాలున్నా ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైనా, వివక్షపైనా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది, భారతదేశ చట్ట ప్రకారం అందరిలాగే ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ఈ విషయంలో ముస్లిం మహిళలపై ఎందుకు వివక్ష చూపాలని వ్యాఖ్యానించింది, దీనిపై కేంద్రం వైఖరి ఏంటో తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.... అటార్నీ జనరల్ కు నోటీసులు ఇచ్చింది, అందరినీ సమానంగా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తితోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది.

హైదరాబాద్ లో పోటీకి జనసేన సన్నాహాలు?

  జనసేన పార్టీని తెలంగాణ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ చేయడం, జనసేన పార్టీని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్ధతిచ్చిన పవన్... గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది, అయితే ఒంటరిగా బరిలోకి దిగుతారా? లేక బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు పవన్ సన్నిహితులు, అయితే పార్టీ నిర్మాణం జరగనందున ఈసారికి పొత్తు పెట్టుకుని... కొన్ని సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేయొచ్చని అంటున్నారు.

కేసీఆర్ మెడకు చుట్టుకుంటోన్న మరో కేసు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఈఎస్ఐ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ విషయంలో ఇప్పటికే కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించగా, ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం బయటికొచ్చింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు... సహారా గ్రూప్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, సహారా గ్రూప్ లో ఐదు కంపెనీలు సొంతంగా ప్రావిడెండ్ ఫండ్ నిర్వహించే వెలుసుబాటు కల్పిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ నిర్ణయంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది, దాంతో సీబీఐ దీనిపైనా ఫోకస్ పెట్టిందని, సహారా పీఎఫ్ అకౌంట్లపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది, పైగా సహారా గ్రూప్ చేపట్టిన డిపాజిట్ల సేకరణ వివాదాస్పదం కావడం, ఏడాదికాలంగా సుబ్రతారాయ్ జైల్లో ఉన్న నేఫథ్యంలో ఈ కేసు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశముందని అంటున్నారు.

మంత్రులపై చంద్రబాబు సీరియస్

  మంత్రుల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలామంది మంత్రులు సీరియస్ గా తీసుకోలేదని, తాను రేయింబవళ్లు పనులను పర్యవేక్షించినా మంత్రులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారట. వచ్చామావెళ్లామా అన్నట్లుగా మీడియాకి కనబడి వెళ్లిపోయారని, కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల మంత్రులు కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్వాల్స్ కాలేదని చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే చంద్రబాబు... అమరావతి శంకుస్థాపన కార్యక్రమం మీద కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారని, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే చంద్రబాబు ... మంత్రులపై సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు, అయితే మంత్రులు కూడా బాబు తీరుపై అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది, తమకు బాధ్యతలు అప్పగించకుండా బొమ్మల్లా ఉంచితే తామేం చేయాలని, అయినా కమిటీలు వేసి అన్ని పనులూ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకే అప్పగిస్తే... మాకు ఏం పని ఉంటుందని మంత్రులు వాపోయారట.

ఫొటోలు వేయొద్దనడం సరికాదు... కేంద్రం

  ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో ముఖ్యమంత్రులు లేదా మంత్రుల ఫొటోలు వేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రకటనల్లో వేయొద్దని చెప్పడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకు తెలిపిన కేంద్రం... ఈ మేరకు అటార్జీ జనరల్ తో అఫిడవిట్ దాఖలు చేయించింది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని, అలాంటప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలను వాడొద్దనడం సరికాదని అటార్జీ జనరల్ ధర్మాసనానికి నివేదించారు, ఓ ఎన్జీవో సంస్థ వేసిన పిల్ ను విచారించిన సుప్రీం...  ప్రభుత్వ ప్రకటనల్లో ప్రభుత్వాధినేతల ఫొటోలు వేయొద్దని ఆదేశించింది, అయితే ఇప్పుడు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది

నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ అమలు

  ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది, ఇప్పటికే 33వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తోంది, అమరావతి ప్రాంతంలో ఇంకా సుమారు 300 ఎకరాలు భూమి అవసరం కానుందని, అందుకే నవంబర్ ఫస్ట్ వీక్ లో భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు, సమీకరణ ద్వారానే రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అందుకు మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని, రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ఆయన తెలిపారు, భూసేకరణ చట్టం అమలుపై ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందని, ఇక రాజీపడే ప్రసక్తే లేదన్నారు

తెలంగాణ మంత్రికి మావోయిస్టుల వార్నింగ్

  తెలంగాణ మంత్రి చందూలాల్ పై మావోయిస్ట్ పోస్టర్లు వెలిశాయి, చందూలాల్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్నాడంటూ వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోయిస్టులు పోస్టులు వేశారు, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ మావోయిస్ట్ కార్యదర్శి దామోదర్ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మంత్రి చందూలాల్ ను హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చారు, ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో వెలిసిన ఈ పోస్టర్లపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, కమలాపురం గ్రామంలో పలువురిని పోలీసులు ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే గిరిజన మంత్రి చందూలాల్ ను బెదిరిస్తూ మావోయిస్టు పోస్టర్లు వెలియడంతో వరంగల్ జిల్లాలో కలకలరం రేగుతోంది.

వరంగల్ ఉపఎన్నిక.. వివేక్ లేదా సర్వేకు టికెట్

  వరంగల్ ఉపఎన్నికకు పోటీ చేసేందుకుగాను అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే టీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో చర్చలు జరిపారు. వరంగల్ ఉపఎన్నిక గురించి రాహుల్ ఉత్తమ్ తో భేటీ అయి.. ఈ ఎన్నికకు అభ్యర్ధులుగా వివేక్ ను, సర్వే నారాయణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీలో నిలబడాలని వివేక్ పై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ఒకవేళ వివేక్ కనుక ఒప్పుకోకపోతే సర్వే నారాయణను బరిలో దింపాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం కుదిరింది. ఎన్నిక బరిలో దిగేందుకు టీడీపీ, బీజేపీకే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంక టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు బరిలో దిగుతారనేది కేసీఆర్ ఢిల్లీ నుండి వచ్చిన తరువాతనే తెలుస్తోంది.

కేసీఆర్ ను కరుణించని మోడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్ధులపై ఎలా విరుచుకుపడతారో తెలిసిన విషయమే. వాళ్లూ.. వీళ్లూ అని చూడరూ.. తన మాటల తూటాలకి అందరిని బలి చేసేస్తుంటారు. కానీ ఇప్పుడు అదే తీరు కేసీఆర్ కు కాస్తంత ఇబ్బందికరంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు పేల్చుకోవడం మామూలే కానీ కేసీఆర్ కాస్తంత దూకుడిగా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా అదే రీతిలో విమర్శలు చేశారు. మరి అప్పుడు అన్న మాటల్ని మోడీ అంత త్వరగా మర్చిపోతారా.. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎప్పటినుండో కేంద్రంతో కేసీఆర్ కు అంత మంచి సంబంధాలు లేవు.. అందుకే ఎప్పుడు కేసీఆర్ మోడీని కలుద్దామనుకున్నా మోడీ  మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో కేసీఆర్ కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పనిలో పనిగా మోడీని కలుద్దామనుకున్నారు. కానీ మోడీ మాత్రం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ నుండి తప్పిపోయి పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు ఉన్న గీత తిరిగి భారత్ కు వచ్చిన నేపథ్యంలో స్వయంగా ప్రధాని ఆమెను కలిసి.. ఆమెతో కాసేపు ముచ్చటించారు కూడా. అయితే అదే రోజు అపాయింట్ మెంట్ అడిగిన కేసీఆర్ కు మాత్రం తనను కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే కేసీఅర్ కు ఇదే మెుదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా చాలాసార్లు మోడీ తనను కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మొన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీతో కేసీఆర్ కాస్తంత దగ్గరగా మెలిగినట్టు కనిపించినా ఈ సారి కూడా అపాయింట్ మెంట్ కరువైంది. దీనిని బట్టి అర్ధమైన విషయం ఏంటంటే ఏంత బలమున్న నాయకుడైనా ఢిల్లీ ముందు చిన్న నాయకుడే అని. కేసీఆర్ ఇప్పటికి ఈ విషయం గ్రహించినట్టున్నారు. అందుకే మోడీని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి కేసీఆర్ పొగడ్తలకు మోడీ పడతారో.. లేదో.. ఈ సారైనా కేసీఆర్ కు మోడీని కలిసే ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

వరంగల్ మాదే... నారాయణఖేడ్ కూడా మాదే...

  వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... కేసీఆర్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతోంది. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ విధానాల పట్ల 80శాతం పైగా ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి అన్నారు, దాదాపు 57శాతం ఓట్లతో వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని, అలాగే నారాయణఖేడ్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు, విపక్షాలు ఎంత గింజుకున్నా ఉపయోగం లేదని, ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలకు అసలు అభ్యర్ధులే దొరకడం లేదన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి... టీఆర్ఎస్ టికెట్ కో్సం పాతికమంది పోటీపడుతున్నారని అన్నారు.

కేసీఆర్ రావడమే ఆలస్యం.. వెంటనే ప్రకటన

  వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికకు పోటీచేసే విషయంపై టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కుదిరినట్టు, టీడీపీ బీజేపీకే ఆఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చమొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపైనే జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ తరుపున ఎవరు బరిలో దిగుతారు అన్న విషయంపై ఇంతవరకూ ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. ఆయన వస్తేకాని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుండి తిరిగి రాగానే పార్టీ నేతలతో..వరంగల్ జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనేథ్యంలో రేపు కేసీఆర్ పార్టీ నేతలతో భేటీకానున్నారు. కాగా ఇప్పటికే ఈ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ నుండి పదవిని ఆశిస్తున్న వారిలో పసునూరి దయాకర్.. గుడిమల్ల రవికుమార్.. ప్రొఫెసర్ సాంబయ్య.. డాక్టర్ రమేశ్.. ఎర్రోళ్ల శ్రీనివాస్.. కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కడియం శ్రీహరి మాత్రం తన కూతురు ఈ బరిలో లేదని తేల్చి చెప్పారు. అయితే వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కేసీఆర్ పూర్తి అవగాహనతో ఉన్నారని.. ఈవిషయంలో కేసీఆర్ ఎప్పుడో క్లారిటీతో ఉన్నారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన వరంగల్ ఉపఎన్నిక విషయంలో కేసీఆర్ ఎప్పుడో కసరత్తు చేశారని.. అభ్యర్ధి ప్రకటన విషయంలో సరైన సమయం కోసం చూస్తున్నారని అనుకుంటున్నారు. ఏదీఏమైనా కేసీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయిన అభ్యర్ధి ఎవరో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

జూన్ 2 తరువాత విజయవాడ నుండే పాలన

  రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పదహారు నెలలు పైనే అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న శాఖల్లో కొన్ని శాఖలు విజయవాడకు తరలిపోయాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 2 నుండి ఎట్టి పరిస్థితిల్లోనూ విజయవాడనుండే పాలన సాగించాలని అధికారులకు సూచించడంతో ఆదిశగా ఉద్యోగులను సమాయత్తపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా మంగళవారం ఒక సర్కులర్ జారీ చేశారు. దీనిలో ఆయన ఉద్యోగులందరికీ మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  అవి నవంబర్‌ 30 లోపు ఎవరెవరు వెళ్తారు? వచ్చే ఫిబ్రవరి ఆఖరుకు ఎవరు వెళ్తారు? జూన్‌ 1 నాటికి ఎవరు వెళ్తారు? అని అందులో అడిగారు. అందరూ ఒకేసారి వెళ్లడం కంటే..దశలవారీగా వెళితేనే బావుంటుందని.. అక్కడ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాడు చేయడానికి కూడా వీలుంటుందని తెలుపుతూ.. నెలాఖరులోపు వివరాలు అందజేయాలని సూచించారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా మీనా జారీ చేసిన సర్కులర్ పై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆప్షన్లు ఇస్తే కష్టమని అందరికి, గందరగోళం తలెత్తుతుందని..సచివాలయం మొత్తానికి ఒకే రకమైన పద్ధతిని అమలు చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి వచ్చే ఏడాది నుండి పరిపాలన మొత్తం విజయవాడనుండే జరగబోతుందన్నమాట.

కేసీఆర్ యాగం వెనుక అసలు కారణం అదా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ చివరి వారంలో చండీయాగం చేయడానికి పూనుకున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ఇంత సడన్ గా చండీయాగం చేయాలనుకోవడానికి గల కారణాలు ఏంటి.? ఆయనకు కొంచం దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ యాగం చేయాలనుకుంటున్నారా? లేక ఏదైన కారణంతో ఈ యాగానికి పూనుకున్నారా? అని ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేసీఆర్ యాగం చేయడానికి పూనుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. కేసీఆర్ కు వచ్చే ఏడాది పదవీ గండం ఉందని.. అది ఏ రూపంలోనైనా రావచ్చని జ్యోతిష్కులు చెప్పారంట.. దీంతో కేసీఆర్ ఈ చండీయాగానికి పూనుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.. దానికి తోటు రీసెంట్ గా సీబీఐ కేసుతో కూడా కొంత సమస్య ఉంది.. అన్ని ఒకత్తైతే అసలు సమస్య రాజకీయంగా ఇంటిపోరు సమస్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేసీఆర్ ఈయాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏంటో కేసీఆర్ కే తెలియాలి.