ఒకరికి బుల్లెట్ తగిలిందంటున్న ఖాకీలు

  హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్ లో జరిగిన పోలీస్ కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు, పోలీసులు కాల్పులు జరిపినా చాకచక్యంగా తప్పించుకున్న స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయమైందని అనుమానిస్తున్నారు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల్లో ఒకరికి బుల్లెట్ తగిలిందని భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు... దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, స్నాచర్లు.... ఆటోనగర్ నుంచి చింతల్ కుంట, సాగర్ రింగ్ రోడ్, కర్మాన్ ఘాట్ మీదుగా కంచన్ బాగ్ వైపు పారిపోయినట్లు పోలీసులు సమాచారం సేకరించారు, దాంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ పేషెంట్ల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

రాజకీయాల్ని జూదంలా మార్చారు.. కేసీఆర్ పై జైపాల్ రెడ్డి ఫైర్

రాజకీయ నాయకులకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడుతుంటారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన రాజకీయ మార్పుల వల్ల కొంతమంది యాక్టివ్ లీడర్స్ కూడా ఎందుకో సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా నోరు తెరిచి విమర్శలు చేస్తూ మేము కూడా ఉన్నామంటూ గుర్తుచేస్తున్నారు. అలాగే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్ రెడ్డి మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్ని జూదంలాగ మార్చేసిందని.. కేసీఆర్ కాసినో పాలిటిక్స్ నడిపిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక కేసీఆర్ కు గుణపాఠం చెబుతుందని.. అసలు ఈ ఉపఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనకు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. మొత్తానికి జైపాల్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. తను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవడానికి వస్తున్నట్టు సంకేతాలు పంపారు.

వరంగల్ అభ్యర్ధిని ప్రకటించిన వైసీపీ

  వరంగల్ ఉపఎన్నికకు వైసీపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది, వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తమ అభ్యర్ధిగా నల్లా సూర్యప్రకాశ్ ను అనౌన్స్ చేసింది, నల్లా సూర్యప్రకాశ్ ఎంపికను అధికారికంగా ప్రకటించిన తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... ఆయనకు పార్టీ బీఫామ్ ను అందజేశారు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే నల్లా సూర్యప్రకాశ్ ను వరంగల్ బరిలోకి దింపుతున్నట్లు పొంగులేటి ప్రకటించారు. వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను తాము క్షమించబోమని, అన్ని పార్టీలకూ బుద్ధిచెప్పడానికే తాము పోటీ చేస్తున్నట్లు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు, తనకు టికెట్ ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సూర్యప్రకాశ్... ఇది కార్యకర్తకు లభించిన గౌరవమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై చేగొండి వివరణ

  చంద్రబాబునాయుడుపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, కేవలం తనకు తెలిసిన విషయాలను, అప్పట్లో జరిగిన సంఘటనలను మాత్రమే పుస్తకంలో వివరించానని మాజీ మంత్రి చేగొండి హరిరామజోయ్య అన్నారు, పుస్తకంలో తాను రాసిన విషయాలన్నీ జరిగినవేనని, తాను వాస్తవమని నమ్మిన వాటిని మాత్రమే రాశానన్నారు, 1988లో రంగా హత్య జరిగితే... ఆనాడే ఎందుకు చెప్పలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే తాను శివరామరాజు చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని, కానీ హత్య జరిగాక నమ్మానని చెప్పుకొచ్చారు, చంద్రబాబు అనుమతితోనే రంగా హత్య జరిగిందన్న విషయాన్ని ఆ తర్వాత చాలాసార్లు చెప్పానని, సీబీఐ తనను వివరాలు అడిగి ఉంటే వాళ్లకూ చెప్పేవాడినన్నారు, నా పుస్తకంలో ఒక్క చంద్రబాబు మీదే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మీద రాశానని చేగొండి హరిరామజోయ్య గుర్తుచేశారు.

దాసరి హస్తం కూడా ఉంది.. సీబీఐ

  బొగ్గు గనుల కేటాయింపు కేసు ఇంకా విచారణలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సీబీఐ నివేదికను న్యాయస్థానానికి అందించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు.. అంతా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయంతోనే జరిగిందని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు అన్నా ఇప్పుడు సీబీఐ వాటిని ఖండించి దీనిలో దాసరి ప్రమేయం కూడా ఉందని చెప్పింది. జిందాల్ గ్రూపు కంపెనీలైన.. జిందాల్ స్టీల్ అండ్ పవర్.. గగన్ స్పాంజ్ ఐరన్ లకు అమరకొండా ముర్గాదంగల్ బొగ్గు గనులను కేటాయించేందుకు గాను పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, మాజీ బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా కలిసి జార్ఖంట్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని సీబీఐ చెప్పింది. దీనికి సంబంధించిన నివేదిక న్యాయస్థానానికి అందించింది.

వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం సర్వేనా?

వరంగల్ ఉపఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను బరిలోకి దించిన సంగతి తెలిసిందే. అయితే రాజయ్యను బరిలో దించడానికి ముందే ఆ స్థానం నుండి పోటీ చేయడానికి మాజీ ఎంపీ వివేక్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకున్నారని తెలుసు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకున్నా.. ఎక్కువ శాతం మాత్రం వివేక్ నే బరిలో దించాలని సోనియా ప్రయత్నించారు. ఒకవేళ వివేక్ పోటీచేయని పక్షంలో సర్వేను బరిలో దింపుదామనకున్నారు. కానీ వారిద్దరూ కాకుండా కాంగ్రెస్ పార్టీ రాజయ్యను పోటీలోకి దించింది. అయితే వివేక్ బరిలోకి దిగకపోవడానికి అసలు కారణం సర్వే సత్యనారాయణేనట. అతని వల్లే కాంగ్రెస్ పార్టీ వివేక్ కాకుండా రాజయ్యకు టికెట్ ఇచ్చిందట. మొదట వరంగల్ ఉపఎన్నికకు పోటీచేయడానికి వివేక్ అంతలా సముఖత చూపించలేదు.. అది తెలిసిన విషయమే.. కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమని ఒత్తిడి తీసుకురావడంతో వివేక్ కూడా అందుకు సిద్దపడ్డారంట. కానీ మాదిగలు ఎక్కువగా ఉన్న ఈ స్థానం నుండి వివేక్ ను ఎలా బరిలోకి దింపుతారు అని సర్వే అభ్యంతరం తెలిపారట. అంతేకాదు.. రీసెంట్ గా వివేక్ టీఆర్ఎస్ లో చేరుతారు అన్న వార్తలు వచ్చాయి.. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావుతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి వెళ్లొచ్చిన వివేక్ కు టికెట్ ఎలా ఇస్తారు అని దిగ్విజయ్ కి చెప్పడంతో దిగ్విజయ్ సోనియాకు తెలియజేయడంతో.. సోనియా తప్పక రాజయ్యను బరిలోకి దించాల్సి వచ్చిందట. మొత్తానికి వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడం వెనుక సర్వే హస్తం ఉందని తెలిసింది.

కాంగ్రెస్ చెప్పింది ఈ శతాబ్దపు జోక్ లా ఉంది.. వెంకయ్య

దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ మాట్లాడే అంశం ఒకటే మత అసహనం. ఎవరు చూసినా ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరూ అంతలా చర్చించుకుంటున్న ఈ విషయాన్ని మాత్రం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్ గా అభివర్ణించడం గమనార్హం. అందరిలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మత అసహనంపై వ్యాఖ్యలు చేసింది. దేశంలో సహనం తగ్గిందని.. అసహనం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అనగా దానిపై వెంకయ్యనాయుడు స్పందించి.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఈ శతాబ్దపు జోక్ గా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో విభజన రాజకీయాలకు బీజం వేస్తుందని..సహనశీలతపై బీజేపీకి కాంగ్రెస్ పాఠాలు చెప్పటం దెయ్యాలు వేదాలు బోదించినట్లు అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పి ఇప్పుడు సహనశీలతపై మాటలు చెబితే బాగుంటుందని సూచించారు.

నాయిని సంచలన వ్యాఖ్యలు.. అడిగితే తన్నండి

  కార్మిక సంఘం వార్షికోత్సవానికి హాజరైన తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయిని ఈ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా కార్మిక శాఖలో జరిగే అవినీతి ఉదంతాల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎవరైనా అధికారులు లంచం అడిగితే కొట్టమని చెప్పారు. అంతేకాదు వారిని తన్నిన తర్వాత తమకు ఫిర్యాదు చేస్తే సదరు లంచం అడిగిన అధికారిని సస్పెండ్ చేస్తామని చెప్పారు. అయితే నాయిని చెప్పడం బానే ఉంది కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఎంత మాత్రం లంచానికి పాల్పడితే వారిని తన్నమని.. కొట్టమని చెబుతారా.. ఒక ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం సరికాదని అంటున్నారు. అంతేకాదు తప్పు చేస్తే నిలదీయటం.. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామనడం మంచిదే కానీ తన్నండి.. కొట్టేయండంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా కొత్త సమస్యలు వస్తాయి అని అభ్రిపాయపడుతున్నారు.

చోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు.. నన్ను చంపడానికి చూస్తున్నారు

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండోనేసియాలోని బాలి జైలులో ఉన్న ఛోటారాజన్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులు నన్ను హింసించారు.. వారిలో కొంతమంది దావూద్ ఏజెంట్లు ఉన్నారని అన్నారు. 22 ఏళ్లుగా దావూద్ తో పోరాడుతున్నాను.. దావూద్ అంటే నాకు భయంలేదు.. కానీ ముంబై పోలీసులు దావూద్ తో చేతులు కలిపి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాదు భారత ప్రభుత్వం నన్ను ఏ జైలుకు పంపించినా వెళ్తానని చెప్పాడు. కాగా ఛోచా రాజన్ ను ఈ రోజు భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది.

వరంగల్ ఉపఎన్నిక.. ప్రచారానికి చంద్రబాబు వస్తారా?రారా?

  వరంగల్ ఉపఎన్నిక బరిలో బీజేపీ-టీడీపీ నుండి బరిలోకి దిగబోయే అభ్యర్ధిగా దేవయ్య పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బరిలో దించడానికి అనేక మంది పేర్లు పరిశీలించిన బీజేపీ ఆఖరికి దేవయ్యను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న బీజేపీ.. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారా? అని అందరి సందేహం. ఎందుకంటే గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఏపీ సీఎం, తెలంగాణ సీఎంల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇరువురి మధ్య కాస్త వివాదాలు తగ్గి.. ఇప్పుడే స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. మరి ఈ సమయంలో ఆయన ప్రచారానికి వచ్చి కేసీఆర్ పై విమర్శలు చేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గెలుస్తోమో.. లేదో అంతగా నమ్మకం లేని ఈ ఎన్నిక ప్రచారానికి వెళ్లడం కంటే రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాస్త లాభం ఉంటుందని చంద్రబాబుకి పార్టీ నేతలు చెబుతున్నారంట. మరోవైపు బీజేపీ నేతలు కనుక ప్రచారంలో పాల్గొనమని ఒత్తిడి తెస్తే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్- రాజయ్య, వామపక్షాలు- గాలి వినోద్‌కుమార్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

అప్పటికల్లా అందరూ రావాల్సిందే.. చంద్రబాబు

సోమవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. చాలా సేపు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను వదిలి రానంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు.. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి విజయవాడకు రావాల్సిందిగా తేల్చి చెప్పారు. అంతేకాదు ఈవిషయంలో ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదని.. ఏపీ సచివాలయ ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండాలన్న అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. ఇక ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా అందరూ ఉద్యోగులు బెజవాడ వచ్చే విషయంలో ఎంత మాత్రం ఉపక్షేంచకూడదన్న భావనకు మంత్రి వర్గం వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రాజధాని అమరావతి ఇంకా అనేక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చలు జరిపింది.

కొండవలస కన్నుమూత

  తెలుగు సినిమా హాస్య నటుడు, ‘నేనొప్పుకోను... ఐతే ఓకే’ అంటూ అందర్నీ అలరించిన నటుడు కొండవలస లక్ష్మణరావు కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా అధిక రక్తపోటు, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అమీర్ పేట ప్రాంతంలో నివాసం వుంటున్న ఆయన సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని నిమ్స్‌కి తరలించారు. అక్కడ ఆయన మరణించారు. మంగళవారం నాడు కొండవలస అంత్యక్రియలు జరుగుతాయి. కొండవలస లక్ష్మణరావు మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. 1946 ఆగస్టు 10వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో కొండవలస లక్ష్మణరావు జన్మించారు. నాటకాలు వేయడంలో, బుర్రకథలు చెప్పడంలో అభిరుచి వున్న కొండవలస ఆ దిశగా కృషి చేశారు. నాటక రంగంలో నంది అవార్డును కూడా అందుకున్నారు. దర్శకుడు వంశీ దృష్టిలో పడిన ఆయన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలోని తన ఊతపదం.. ‘నేనొప్పుకోను... ఐతే ఓకే’ ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన హాస్య నటుడిగా బిజీ అయ్యారు. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఆయన షూటింగ్‌లో భాగంగా ఒక నీటి మడుగులో దూకారు. అయితే అది లోతు ఎక్కువగా వుండి, కలుషిత నీటితో నిండిన మడుగు. దానిలో ఆయన మునిగిపోయి, ఆ నీటిని తాగేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొండవలస కన్నుమూత పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ బీజేపీ-టీడీపీ అభ్యర్థి దేవయ్య

  వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ అభ్యర్థిగా దేవయ్యను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు అధికారికంగా ప్రకటిస్తారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్- రాజయ్య, వామపక్షాలు- గాలి వినోద్‌కుమార్‌లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన దేవయ్య మీడియాతో మాట్లాడుతూ, తాను పుట్టిన ఊరుకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వరంగల్‌ను స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. దేవయ్య స్వస్థలం వరంగల్‌ జిల్లా కిసలాపురం. ఉస్మానియా యూనివర్సిటీలో దేవయ్య వైద్య విద్యను అభ్యసించారు.

హరిరామ జోగయ్యకు గాలి కౌంటర్.. ముందే తెలిస్తే చెప్పొచ్చుగా

  టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు వైకాపా నేత హరిరామ జోగయ్యపై మండిపడ్డారు. వంగవీటి మోహనరంగ హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగిందని ఆయన "అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం" అనే పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పందించి.. కేవలం పుస్తకం అమ్ముకునేందుకే హరిరామజోగయ్య అసత్యాలు రాశారని.. తాను రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకానికి ప్రచారం కోసం వివాదాస్పద అంశాలను ఎంచుకున్నారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు హరిరామ జోగయ్యకు రంగా హత్య అంశం ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

వెంకయ్యనాయుడు కూడా అదే రూట్లో

రాజకీయాల్లో రాజకీయ వారసత్వానికి ఎప్పటినుండో పునాది పడిందన్న సంగతి తెలిసిందే. ప్రతి రాజకీయ నాయకుడు తమ వారసత్వానికి పగ్గాలు కట్టబెట్టడం పారిపాటి అయిపోయింది. ప్రజలకు కూడా ఈ సంప్రదాయానికి బాగానే అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో వెంకయ్యనాయుడు కూడా చేరిపోయారు. వెంకయ్యనాయుడు కూడా తన కూతురు దీపా వెంకట్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్పుడే ఢిల్లీలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే దీపా వెంకట్ స్వర్ణభారతి ట్రస్టు ద్వారా సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.. అయితే ఇప్పటి వరకూ నెల్లూరికే పరిమితమైన దీనికి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ప్రారంభించాలని చూడడం.. దీనికి సంబంధించి శంషాబాద్ సమీపంలో ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాదు ఢిల్లీలో  జరిగిన వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలకు సంబంధించిన ఏర్పట్లను ఆమెనే స్వయంగా చూడటం.. అన్నీ తానై వ్యవహరించడం చూసి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజక వర్గం నుండి ఆమె బరిలోకి దిగుతుందని అనుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. అందుకే కేసీఆర్ గడువు అడిగింది..శశిథర్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని.. గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడిగిన గడువు నేపథ్యంలో కాంగ్రెస్ నేత మర్రి శశిథర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. హైదరాబాద్ లో మొత్తం 30 శాతం మంది సీమాంధ్రులు ఉన్నారు.  కాబట్టి వారు సంక్రాంతి పండుగ సందర్బంగా ఊర్లు వెళ్లి 10 నుండి 20 రోజుల వరకూ అక్కడే ఉంటారు. ఈ కారణంగా జనవరి 31 లోపు ముఖ్యంగా సంక్రాంతికి ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని.. అప్పుడైతే సీమాంధ్ర ప్రజలు వారి వారి స్వస్థలాలకు వెళతారు కాబట్టి వాళ్లు ఓట్లు వేసే అవకాశం ఉండదు.. దీంతో కేసీఆర్ కు కొంత నష్టం తగ్గుతుందని భావించి అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. చూడబోతే శశిథర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా కొంత నిజముందనిపిస్తోంది.

ఏం నేను రాకూడదా..మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ లాలూ, నితీష్ కుమార్లపై విమర్శల వర్షం కురింపించారు. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. బీహార్ ను ఒకటి కాదు రెండు కాదు 25 ఏళ్లు పాలించారని.. 25 ఏళ్లలో ఏం చేశారని.. బీహార్ కు ఏమిచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో లాలూ, నితీష్ కుమార్ ఆలోచించుకోవాలని.. బీహార్ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రస్తుత పాలనపై బీహార్ మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. బీహార్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లాలుకి, నితిశ్ కుమార్ కు ఉందని అన్నారు. బీహార్ లో అటవిక పాలన నడుస్తోందని విమర్శించారు. తాను బీహార్‌కు వస్తుంటే మహాకూటమి నేతలు విమర్శిస్తున్నారని... తాను బీహార్‌కు రాకూడదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని జోస్యం చెప్పారు.