68 రూపాయలకే ఐ-ఫోన్‌

ఈ ప్రకటన ఆన్‌లైన్లో కనిపిస్తే ఎగబడంది ఎవరు. కానీ 30,000 విలువ చేసే  iPhone 5S ని ఎవరన్నా 68 రూపాయలకి అమ్ముతారా? అంటే అదే జరిగింది మరి! స్నాప్‌డీల్‌ సంస్థ చేసిన ఈ పొరపాటు ఓ వినియోగదారుడికి కలిసి వచ్చింది. ఈ నెల 12వ తేదీన స్నాప్‌డీల్‌ వెబ్‌సైట్లో కొత్త ఐఫోన్‌ విలువని పొరపాటుగా 68 రూపాయలు అంటూ పేర్కొంది. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు కనిపిస్తాయా అని కాచుకుని కూర్చున్న నిఖిల్‌ బన్సల్‌ అనే విద్యార్థి మరుక్షణంలోనే దానిని ఆర్డరు చేసేసుకున్నాడు. స్నాప్‌డీల్ తన పొరపాటుకి చింతించి వెంటనే ఆ ధరని మార్చేసింది. కానీ అప్పటికే ఫోన్ కొనేసిన నిఖిల్‌ ఊరుకుంటాడా! స్నాప్‌డీల్ తనని మోసం చేసిందంటూ పంజాబులోని ఓ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు నిఖిల్‌కి అనుకూలంగా తీర్పుని ఇవ్వడమే కాకుండా నష్టపరిహారంగా ఓ రెండు వేలు చెల్లించమని చెప్పింది. అయినా స్నాప్‌డీల్‌కి మనసు ఒప్పలేదు. ఇదంతా ఓ సాంకేతిక పొరపాటు అంటూ ఓ వినియోగదారుల పోరంలో కేసుని దాఖలు చేసింది. అక్కడా స్నాప్‌డీల్‌కి చుక్క ఎదురైంది. ఈసారి నష్టపరిహారం 10,000కి పెరిగింది. అదీ సంగతి! ఇటూ ఐ-ఫోనూ చవకగా దొరికింది. అటు నష్టపరిహారమూ దక్కింది.

అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ కు కోర్టు సమన్లు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు జగన్మోహన్‌రెడ్డికి ఆక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఫార్మ కంపెనీలైన అరబిందో, హెటిరో వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును గురువారం ఈడీ ప్రత్యేక కోర్టు, మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈకేసులో నిందితుడైన జగన్ కు కి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి టి రజని సమన్లు జారీ చేశారు. మార్చి 28న  వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేశారు.

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లై అరెస్ట్..

అండర్‌వరల్డ్‌ డాన్‌ కుమార పిళ్లైను పోలీసులు పట్టుకున్నారు. ముంబైలోని పలు నేరాలలో నిందితుడిగా ఉన్న కుమార పిళ్లై కోసం పోలీసులు గత కొంత కాలంగా పరారీలో ఉన్నారు. ఈయన కోసం పోలీసులు చాలా కాలం నుండి గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే కుమార పిళ్లైని సింగపూర్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. గతంలో ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ అయింది. అయితే ఇప్పుడు సింగపూర్ లో అరెస్ట్ చేసిన వ్యక్తి కూమార్ పిళ్లె అవునా ..కాదా? అని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దీనిపై  ముంబయి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు కుమార పిళ్లై అని నిర్ధరణ అయిన తర్వాత సింగపూర్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

మోడీ, షరీఫ్ మరోసారి..

పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి వలన జనవరిలో జరగాల్సిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరగాల్సిన భేటీ ఆగిపోవడంతో వీరిద్దరూ మరోసారి కలవనున్నట్టు తెలుస్తోంది. మార్చి నెలలో ప్రారంభమయ్యే.. ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. కాగా ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. మరి అది ఎంత వరకూ నిజమే చూడాలి.

రైలు ఢీకొని నలుగురు మృతి..

ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు గ్యాంగ్ మెన్ లపైకి సబర్బన్ రైలు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. వివరాల ప్రకారం.. సబర్బన్‌ కుర్లా- విద్యావిహార్‌ స్టేషన్ల మధ్య గ్యాంగ్‌మెన్లు పట్టాలపై మరమ్మతులు చేస్తుండగా... ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు(సీఎస్‌టీ) వెళ్తున్న లోకల్‌ రైలు వీరిపై నుంచి దూసుకెళ్లినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అయితే వారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణంపై విచారిస్తున్నామని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

రంగలోకి దిగనున్న బీజేపీ అధ్యక్షుడు..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ చేసింది ఏం లేదు. దీంతో బీజేపీ పై రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఆందోళనలు..దీక్షలు చేపట్టడం కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు తమ పార్టీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. దీనిలో భాగంగానే ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ఒక భారీ ప్రచార ప్రణాళికను ఆయన రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టు సమాచారం.. అయితే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి పైసా, ప్రతి అనుమతీ ప్రజల ముందు పెట్టడమేనట. అంతేకాదు మార్చి ఆరో తేదీన రాజమండ్రి లో జరిగే పార్టీ బహిరంగ సభ నుంచే అమిత్‌షా ఈ ప్రణాళికను అమలులో పెట్టబోతున్నారట. చూద్దాం.. ఈ ప్రణాళిక ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

చెన్నై ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య.. కారణం అదేనా..?

చెన్నై లో యువ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతం ఎగ్మోర్‌లో ఎన్‌ హరీశ్ ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన  చెన్నైలోని ఎగ్మోర్‌ ప్రాంతంలో ఐపీఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అయితే ఈరోజు ఈయన కోసం కార్యలయ సిబ్బంది రాగా ఆయన మాత్రం ఎంతసేపటికీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే హరీశ్‌ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే అధికారుల సమాచారం ప్రకారం కాస్త కొద్ది రోజుల నుండి హరీశ్‌ ప్రమోషన్ పై విచారణ జరుగుతోందని.. అతని బ్యాచ్ వాళ్లకి రెండేళ్ల కిందటే ప్రమోషన్స్‌ వచ్చాయి దీంతో హరీశ్ మనస్తాపం చెందినట్టు తెలిపారు. అయితే ఇప్పుడు హరీశ్‌ ఆత్మహత్యకు పదోన్నతి అంశమే కారణమా? లేక వేరే ఏదైనా ఉందా? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

దిల్లీ ప్రొఫెసరు గిలానీ- తీహార్‌ జైలుకి!

దిల్లీ విశ్వవిద్యాలయపు మాజీ ప్రొఫెసరు గిలానీకి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్‌ కస్టడీని విధించింది. ఈ మేరకు ఆయనను కొద్దిసేపటి క్రితమే తీహార్‌ జైలుకి తరలించారు. ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్న గిలానీ ఈ నెల 10వ తేదీన అఫ్జల్‌గురుకి అనుకూలంగా ప్రెస్‌క్లబ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గురుకి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. గిలానీ మొదటి నుంచీ కూడా కశ్మీర్ వేర్పాటవాదులకు మద్దతుగా వ్యవహరించేవారు. 2001లో పార్లెమంటు మీద జరిగిన దాడిలో కూడా గిలానీ ముఖ్య పాత్రను పోషించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సరైన సాక్ష్యధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేయక తప్పలేదు. మరోసారి దేశద్రోహం కేసు కింద అరెస్టైన గిలానీ విషయంలో న్యాయస్థానం ఏ తీర్పుని వినిపించబోతోందో చూడాలి.

పాముల పెట్టెలో తల పెట్టిన క్రికెటర్.. కాటేసింది..

పాము పుట్టలో చేయి పెడితే కాటు వేయకుండా ఉంటుందా.. వేసే తీరుతుంది. అలాంటిది కావాలని పెడితే ఇంక ఊరుకుంటుందా.. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఇంతకీ పాము పుట్టలో చేయి ఎవరు పెట్టారబ్బా అనుకుంటున్నారా.. పెట్టింది చేయి కాదు.. తల అది కూడా క్రికెటర్ షేన్‌వార్న్. ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఓ రియాల్టీ షోకు వార్న్ హాజరయ్యాడు.  ఈ రియాల్టీ షోలో ఓ చిన్న సైజు అనకొండలతో ఓ టాస్క్  చేయాల్సి ఉంది. దీనిలో భాగంగానే అతను తన తలను అనకొండలు ఉన్న బాక్స్ లో దూర్చాడు. అంతే అందులో ఉన్న ఒక అనకొండ వార్న్ తలపై కాటేసింది. అయితే అదృష్టం ఏంటంటే.. అది విషపూరితం కాకపోవడం, మరీ పెద్దగా కాటేయకపోవడం. అదే గట్టిగా కాటేస్తే.. సుదీర్ఘ కాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదట. మరి ఇలాంటి రిస్కీ రియాల్టీ షోలు ఎంతవరకూ అవసరమో..?

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..

చిత్తూరు జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఓ వ్యవసాయ కూలీ పన్నెండేళ్ల తన కూతురిపై ఇప్పటికీ మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. అయితే ఒకరోజు తన తండ్రి అత్యాచారానికి ప్రయత్నించగా బాలికి తప్పించుకొని ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైం తల్లి బాలికను తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా బాలిక తండ్రి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు

ఆదాయపు పన్ను ఉచ్చులో కపిల్‌దేవ్‌!

  ఆదాయపు పన్ను ఉచ్చులో కపిల్‌దేవ్‌!భారతదేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్‌దేవ్‌. తరచూ సాటి క్రికెటర్ల మీద వివాదాస్ప వ్యాఖ్యలు చేసే కపిల్ ఈసారి తానే ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. నోయిడాకు చెందిన ఓ కంపెనీ షేర్లని కపిల్‌ చాలా తక్కువ ధరకే పొందాడన్నది ఈ ఆరోపణ. సదరు కంపెనీ గతంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ఓ ఇంజనీరుది కావడంతో ఇదేమంత త్వరగా తేలే విషయంలా కనిపించడం లేదు. ఏదో సహాయం చేయడం వల్లే కపిల్‌ వాస్తవ ధరకంటే తక్కువకే షేర్లను పొందారన్నది అధికారుల అనుమానం. కానీ కపిల్‌ వాదన మాత్రం వేరే విధంగా ఉంది. ‘నేనొక సాధారణ క్రికెటర్‌ను మాత్రమే. నేను వ్యాపారవేత్తలకు ఎలా సాయపడగలను?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే మ్యాచ్‌ ఫిక్సింగ్‌లాంటి తీవ్రమైన ఆరోపణలను సైతం సునాయాసంగా ఎదుర్కొన్న కపిల్‌కు ఈ ఆరోపణలను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాకపోవచ్చు.

రాహుల్ గాంధీ కాదు.. రాహుల్ మెమెన్..!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శల బాణాలు సంధించారు. జేఎన్‌యు వ్యవహారంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి విద్యార్థి సంఘాలకు మద్దతు తెలపడంపై కిషన్ రెడ్డి ఆయనపై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ దృష్టిలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారు దేశభక్తులా? అఫ్జల్‌గురు, యాకూబ్‌ మెమెనల నుంచి ఆయన స్ఫూర్తి పొందారా? తీవ్రవాదులు, ఉగ్రవాదులపై మీ విధానం మారిందా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఈసందర్భంగా ఆయన 'రాహుల్‌ మెమెన్‌ లేదా రాహుల్‌ అఫ్జల్' అనో పేరు మార్చుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో కావాలనే కుట్రలు జరుపుతున్నారని ఆరోపించారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉగ్రవాదానికే బలయ్యారనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు.

రైతు ఆత్మహత్యలపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాషనైపోయింది..

రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంపీ గోపాల్‌ శెట్టి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 124మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక వచ్చింది. అయితే దీనిమీద స్పందించిన ఎంపీ గోపాల్‌ శెట్టి ఈ ఆత్మహత్యలన్నీ నిరుద్యోగం, పేదరికం కారణంగానే జరగడం లేదని.. రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్‌ అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అంతే దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఇదే అవకాశంగా ఎంపీ గారిపై మండిపడుతుంది. రైతులు పంటలు విఫలమై, అప్పులతో ఆత్మహత్య చేసుకుంటోంటే వారి గురించి ఇంత దారుణంగా మాట్లాడటం అన్యాయమని అన్నారు. ఇక చేసేది లేక తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తనను క్షమించాలని కోరారు.

భర్త అంత్యక్రియల కోసం... కొడుకులను తాకట్టుపెట్టిన సావిత్రి

  పేదరికం ఎంతటి సవాళ్లును ముందుంచుతుందో చెప్పే కథ ఇది. జనవరి 26న దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటుంటే... ఓ స్త్రీ మాత్రం తన భర్తకి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నకొడుకులునే 5,000కి తాకట్టు పెట్టింది. ఒడిషాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనలో రైబా అనే పేదవాడు గత నెల 26వ తేదీన చనిపోయాడు. రైబా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతుండటంతో, అప్పటికే అతని చికిత్స కోసం ఇల్లు గుల్లైపోయింది. రైబా చనిపోయేనాటికి ఇంట్లో చిల్లిగవవ్వ కూడా మిగల్లేదు. అతని అంత్యక్రియల కోసమని రైబా భార్య సావిత్రి, ఆర్థికసాయం చేయమంటూ తమ ఊరిలోని ప్రతి గడపనీ తట్టింది. కానీ ఉపయోగం లేకపోవడంతో చివరికి తన ఐదుగురు పిల్లల్లో పెద్దవారైన ఇద్దరిని (ముఖేష్‌- 13, సుఖేష్‌- 11) పొరుగింటాయనకి తాకట్టు పెట్టింది. ఈ సంఘటనను స్థానిక అధికారులు కొట్టిపడవేస్తున్నప్పటికీ, తాకట్టు జరిగిన మాట నిజమేనని గ్రామస్తులు చెబుతున్నారు. పురాణాలలో సతీసావిత్ర భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు అష్టకష్టాలూ పడితే, ఒడిషాలో నేటి సావిత్రి అతనికి శవసంస్కారం జరిపించేందుకు కూడా ఎంతో త్యాగాన్ని చేయాల్సి వచ్చింది. ఎంతైనా కలియుగం కదా!