టి20 అప్ డేట్ : న్యూజిలాండ్ స్కోర్ 126/7

న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రెగులర్ గా వికెట్లు తీస్తూ, భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కుదురుకోనివ్వలేదు. పిచ్ విపరీతంగా టర్న్ అవుతుండటంతో, బౌలింగ్ ను చాలా కష్టంగా ఎదుర్కొన్నారు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్. బౌలర్లలో హార్ధిక్ పాండ్యాకు తప్పితే, అందరికీ ఒక వికెట్ లభించింది. బుమ్రా, రైనా బౌలర్స్ లో టాప్ గా నిలిచారు. ఇద్దరూ తమ నాలుగు ఓవర్లలో 15 పరుగులే ఇవ్వడం విశేషం. బుమ్రా యార్కర్లకు బ్యాట్స్ మెన్ వద్ద సమాధానం లేదు. నెహ్రా వేసిన చివరి ఓవర్లో ఇక సిక్స్, ఒక ఫోర్ పడటంతో, కనీసం 126 వరకూ అయినా న్యూజిలాండ్ చేరుకోగలిగింది. కోరే ఆండర్సన్ (34, 42 బంతుల్లో), ల్యూక్ రాంచీ (21, 11 బంతుల్లో) రాణించారు. 13 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. పిచ్ స్పిన్ అనుకూలిస్తుండటంతో, ముగ్గురు స్పిన్నర్లున్న న్యూజిలాండ్ ను భారత బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కోబోతున్నారో చూడాలి. భారత విజయ లక్ష్యం 20 ఓవర్లలో 127 పరుగులు

టి20 అప్ డేట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  ఇండియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో, ఈరోజు ఇండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ తో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభంతో టోర్నీ మొదలెట్టాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ కూడా బలమైన ఇండియాను సమర్ధంగా ఎదుర్కోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ప్రస్తుతం టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ లో జరగబోయే ఈ మ్యాచ్ కు బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. భారీ స్కోర్లు నమోదవడం ఖాయం.   ఇండియా ఆసియా కప్ గెలిచిన టీంతోనే రంగంలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ మాత్రం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల సూత్రాన్ని ఎంచుకుంది. టిమ్ సౌతీ, బౌల్ట్, మెక్ గ్లెనాగన్ లాంటి తమ టాప్ బౌలర్లను ఈ మ్యాచ్ కు పక్కన పెట్టి వారి స్థానంలో స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, ఇష్ సోథీ, మిచెల్ సాంట్నెర్ లకు చోటు కల్పించింది న్యూజిలాండ్. కేవలం ఆడం మిల్నే, కోరీ యాండర్సన్ లు మాత్రమే న్యూజిలాండ్ కు పేస్ బౌలింగ్ చేయబోతున్నారు. తమ టాప్ బౌలర్లను పక్కన పెట్టి, స్పిన్నర్లను తీసుకోవడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది. న్యూజిలాండ్ సెకండ్ బౌలింగ్ చేస్తుండటంతో, మంచు ప్రభావాన్ని ముగ్గురు స్నిన్నర్లు ఎంతవరకూ అడ్డుకుంటారనేది ఆసక్తికరం..

మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్..

తను జీవించి ఉన్నంతకాలం ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ గడిపిన మదర్ థెరిస్సాకు వాటికన్ సెయింట్ హుడ్ ను ప్రకటించింది. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ కాననైజేషన్ (మహిమాన్విత హోదాను ప్రకటిస్తూ తయారుచేసిన ఉత్తర్వుల పత్రం)పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ సైతం హాజరవుతారని అంచనా. ఈ సెయింట్ హుడ్ ప్రకటించడం ద్వారా మదర్‌ థెరిస్సాను కేవలం ఓ సేవా మూర్తిగానే కాకుండా దైవశక్తులు ఉన్న ఓ దేవదూతగా చూస్తారు.   కాగా మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1950లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుది శ్వాస విడిచారు

భారతీయ విద్యార్ధులకు సపోర్ట్ గా ట్రంప్..

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే సగం ఫేమస్ అయ్యారు. మొన్నటికి మొన్న ఇస్లాం మతంపై విరుచుకుపడ్డారు. గతంలో భారతీయ విద్యార్దుల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాజాగా వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అమెరికా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి తెలివైన పిల్లలను అమెరికాలో ఉంచాలని అన్నారు. వారు ఫీజులు కట్టి చదువుకుంటున్నారు.. వారిలో చాలామంది తెలివైనవారు ఉన్నారు.. మనకు అలాంటి వారే కావాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇండియన్స్ అయితే తిరిగి ఇండియాకు వెళ్లి కంపెనీలు పెట్టుకొని ఉద్యోగాలు సృష్టించాలి' ట్రంప్ మరో సలహా కూడా ఇచ్చారు.

పాకిస్థాన్ టీమ్ కు మోడల్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తా..

భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తారు. ఇదంతా ఒకఎత్తైతే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు ఓ మోడల్  ఓ ప్రకటన చేసింది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ను పాక్ జట్టు ఓడిస్తే, యావత్ పాక్ ప్రజల ముందు 'స్ట్రిప్ డ్యాన్స్' చేస్తానంటూ పాకిస్థాన్‌కు చెందిన మోడల్ కాందీల్ ప్రకటించింది. కాగా గతంలో పూనమ్ పాండే కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2011లో భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ ఈ భామ అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

వెనక్కి తగ్గిన పుతిన్.. సైనిక దళాలు వచ్చేయాలని ఆదేశం..

రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. సిరియాలో సైనిక దళాలను మోహరించి రష్యా యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం సిరియాలో సైనిక దాడులను ప్రారంభించి, సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్-అసద్ కు వెన్నుదన్నుగా నిలిచిన రష్యా వందలాది మంది ఉగ్రవాదుల సహా పౌరుల మరణానికీ కారణమైంది. అయితే దీనిపై పలు విమర్సలు తలెత్తుతుండటంతో ఇప్పుడు సైనిక దళాలను వెనక్కు రావాలని ఆయన ఆదేశించిట్టు తెలుస్తోంది. ఈవిషయాన్ని అసద్ కు ఫోన్ చేసి పుతిన్ స్పష్టం చేశారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు.

వైసీపీకి మరో ఓటమి.. వీగిపోయిన స్పీకర్పపై అవిశ్వాస తీర్మానం

స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని ఆయనపై వైసీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆయన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా.. తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లు.. వ్యతిరేకంగా 97 ఓట్లు రాగా తీర్మానం వీగిపోయింది. తిరిగి తన స్థానానికి వచ్చిన తరువాత తనపై విశ్వాసం ఉంచినందుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదువుకొని డాక్టరయ్యాను.. పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వైద్య వృత్తిని ఎంచుకున్నానని అన్నారు. ఏదో అనుకోని పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చానని.. ఎన్టీఆర్ వల్ల రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

నా ఉద్దేశం అది కాదు.... షాహిద్‌ ఆఫ్రిదీ వివరణ

పాకిస్తాన్‌కంటే భారతదేశంలోనే తమను ఎక్కువగా ప్రేమిస్తారంటూ షాహిద్‌ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించిన విషయం తెలిసిందే! ఈ విషయమై పాకిస్తాన్‌ మాజీ ఆటగాళ్లతో సహా పలువులు అభిమానులు మండిపడటంతో ఆఫ్రిదీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తాను కేవలం ఒక క్రికెటర్‌గా ఆ మాటలు అనలేదనీ, పాకిస్తాన్‌ తరఫున భారత్‌లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా వారి మనసుని గెల్చుకునేందుకు అలా అన్నాననీ, ఈ క్రికెట్‌ యోధుడు పేర్కొన్నాడు. తనకు పాకిస్తాన్ అభిమానులను చులకన చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదనీ, అసలు తన ఉనికే పాకిస్తాన్‌తో ముడిపడి ఉందనీ, వివరణ ఇచ్చుకున్నాడు. భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంగా ఆరాధిస్తారు కాబట్టే, ఇక్కడ తమకు దక్కే అభిమానాన్ని గురించి ప్రత్యేకించి చెప్పాననీ, తన సీనియర్లైన వసీం అక్రం వంటి క్రికెటర్లు కూడా తన మాటలతో ఏకీభవిస్తారనీ చెప్పుకొచ్చాడు. ఆఫ్రిదీ తెలివిగా తన సీనియర్లందిరినీ ఉట్టంకించడం వల్ల, ఇప్పుడు వాళ్లు కూడా ఈ వివాదం మీద తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆఫ్రిదీ మాటలకు పాక్‌ అభిమానులు సంతృప్తి చెందుతారో లేకపోతే కేసులు మీద కేసులు వేసి ధర్నాల మీద ధర్నాలను నిర్వహిస్తారో వేచిచూడాలి.

కంగనా రౌనత్ కు హృతిష్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలి

బాలీవుడ్ హీరో హృతిష్ రోషన్ బాలీవుడ్ నటి  కంగనా రౌనత్ కు నోటీసులు పంపించారంట. ఇంతకీ కంగనా రౌనత్ ఏ చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. సుజానే తో విడిపోయిన తరువాత హృతిక్ కంగనాను ప్రేమించాడని.. తరువాత విడిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా కొందరు కావాలనే ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని.. ఈ వార్తల వల్లే హృతిక్ తనను ఆషికి-3 నుంచి తప్పించాడని వ్యాఖ్యానించింది. అయితే కంగనా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న హృతిక్..తన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నందుకు గాను.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి కంగనా మాత్రం..  తానెన్నడూ హృతిక్ పేరును చెప్పలేదని, ఆయన పరువు ఎక్కడ పోయిందని కంగనా తిరిగి ప్రశ్నిస్తోంది.

జగన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టండి.. దరిద్రం పోతుంది.. అచ్చెన్నాయుడు

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఈరోజు స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చలో భాగంగా అచ్చెన్నాయుడు మళ్లీ జగన్ పై తీవ్ర  స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటంతో సభా వ్యవహారాలన్నీ భ్రష్టుపట్టిపోయానని.. స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి కాకుండా అన్నీ మాట్లాడుతున్నారు.. మాట్లాడేందుకు సరుకు లేకపోతే ఊరుకోవాలని ఆయన అన్నారు. అసలు ప్రభుత్వం.. స్పీకర్ పై కాదు.. ఆపార్టీ సభ్యులు తమ అధినేతపై అవిశ్వాస తీర్మానం పెడితే సగం దరిద్రం వదిలిపోతుందని.. అప్పుడు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. ఇది నా సలహా అని ఎద్దేవ చేశారు.

ఆ హంతకుడి మీద చేయి వేయడానికి వీల్లేదు!

అండమాన్‌లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఓ ఐదేళ్ల పసికందుని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ విషయాన్ని ధృవీకరించేందుకు సాక్ష్యులు కూడా ఉన్నారు. కానీ హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. ఈ చిత్రమైన పరిస్థితికి కారణం, హంతకుడు జారవా అనే స్థానిక తెగకి సంబంధించినవాడు కావడమే! వేల సంవత్సరాలుగా ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న ఈ తెగలు ఇప్పుడిప్పుడే మిగతా ప్రజలను చూసీ చూడనట్లు ఊరుకుంటున్నాయి. ఇదివరకైతే తమ ప్రాంతంలో బయటి వ్యక్తులు ఎవరు కనిపించినా వారి మీద దాడి చేసి తీరేవి. ప్రత్యేకమైన ఈ ఆదివాసీల సంస్కృతిని గమనించిన భారత ప్రభుత్వం కూడా వారి జోలికి వెళ్లేది కాదు. వారి ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని, అక్కడి అధికారులకు ఖచ్చితమైన హెచ్చరికలను జారీ చేసింది భారత ప్రభుత్వం. మరి తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ హత్యను చూసీచూడనట్లు ఊరుకుంటుందా! లేకపోతే హంతకులకి తగిన శిక్ష విధిస్తుందా! అన్నది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

అసలు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదు.. వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీకి తాము చేసిన పనులు గురించి ప్రస్తావించారు. ఏపీలో ఎన్నో కేంద్రం విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశాం.. తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నషనల్ స్థాయికి తీసుకెళ్లామని, అమరావతి సమీపంలోని విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రూ. 65 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు.. విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేశామని వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి గుంటూరు, విజయవాడల అభివృద్ధికి రూ. 500 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. వైజాగ్, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్ణయించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి మండళ్లుగా గుర్తించామని వెంకయ్య తెలిపారు. ఏపీ హామీల విషయంలో కేంద్రం చిత్త శుద్దితో ఉంది.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఒక్క రాష్ట్రానికి ఇంత సాయం చేయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు.. ఇంత అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంటే, ఈ వ్యతిరేకత ఏంటని ప్రశ్నించారు. చట్ట రూప కల్పనలో కాంగ్రెస్ అప్పుడు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వైలెంట్ అవుతుందని ఎద్దేవ చేశారు.

తన పౌరసత్వంపై రాహుల్ గాంధీ.. దీనిని ఎదుర్కొంటా..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే చాలా సార్లు రాహుల్ పౌరసత్వంపై విమర్శలు చేశారు. రాహుల్ లండన్ లో ఒక కంపెనీ పెట్టేందుకు గాను తాను బ్రిటన్ పౌరుడనని చెప్పుకున్నట్టు స్వామీ ఆరోపించారు. అయితే ఇప్పుడు దీనిపై రాహుల్ వివరణ ఇవ్వాలని బీజేపీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ.. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని.. ప్రధాని తన తాబేదార్ల ద్వారా తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని..  దీనిని ఎదుర్కొంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.

గుర్రం కాలు విరగ్గొట్టినందుకు... బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ముసోరి ఎమ్మెల్యే అయిన గణేష్‌ జోషికి ప్రభుత్వం మీద కొపం వచ్చింది. తన కోపాన్ని వెళ్లగక్కేందుకు ఆయన ధర్నాకు దిగారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ధర్నాను అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులని చూసేసరికి జోషిగారి అవేశం హెచ్చింది. అందులోనూ సదరు పోలీసులు, గుర్రాల మీద వచ్చేసరికి ఆయన అహం దెబ్బతిన్నట్లుంది. వెంటనే ఒక లాఠీని తీసుకుని ఓ గుర్రం మీద తన ప్రతాపమంతా చూపారు. పాపం! గుర్రం కాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. వెంటనే దాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లినా, విరిగిన కాలు బాగుపడేందుకు చాలా రోజులే పడేటట్లు కనిపిస్తోంది. అమాయకమైన జీవిని అకారణంగా చావబాదినందుకు జోషి మీద పలు కేసులను నమోదు చేశారు పోలీసులు. జోషిగారు మాత్రం తనకే పాపం తెలియదంటున్నారు. తన పార్టీ కార్యకర్తల మీదకు వచ్చినందుకు గాను, ఆ గుర్రాన్ని ఊరికే అదిలించాననీ, వేరే ఎక్కడో దాని కాలు ఇరుక్కుపోయి దెబ్బతిని ఉంటుందని అమాయకత్వాన్ని ఒలకబోస్తున్నారు. కానీ గుర్రం మీద జోషిగారు చూపిన ప్రతాపం అంతా వీడియోల రూపంలో ఉండటంతో, పోలీసులు మాత్రం ఆయనను న్యాయస్థానం ముందర నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

కన్నయ్య సహా నలుగురు విద్యార్ధులను బహిష్కరించండి..!

జెఎన్ యూ లో జరిగిన ఘటనలపై విచారణ జరపేందుకు గత నెలలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు నెల రోజుల పాటు ఘటనలపై పరిశీలించిన ఈ కమిటీ.. విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యలతో పాటు మరో ఇద్దరు విద్యార్ధులను యూనివర్శిటీ నుండి బహిష్కరించాలని సూచించింది. దీనిపై వైస్ చాన్స్ లర్ ఎం జగదీశ్ కుమార్, చీఫ్ ప్రాక్టర్ ఏ దిమ్రీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అయితే కమిటీ సిఫార్స్ ను కనుక వీరు ఆమోదించినట్టుయితే వారిని బహిష్కరించక తప్పదు. ఒకవేళ అదే కనుకు జరిగితే యూనివర్శిటీలో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం.. వర్శిటీ క్రమశిక్షణా నిబంధనలను వీరు ఉల్లంఘించారని.. భవిష్యత్తులో ఇలాంటి తరహా గొడవలు జరగకుండా ఉండాలంటే బహిష్కరించాలని అభిప్రాయపడుతున్నారు. మరి కమిటీ నివేదిక ఇప్పటికే వైస్ చాన్స్ లర్ కార్యాలయానికి చేరగా, దీనిపై ముఖ్య అధికారులు చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

ఏపీ ప్రత్యేక హోదా చర్చపై రాజ్యసభలో రచ్చ..

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ ఎపీ ప్రత్యేక హోదాపై నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఏపీని విభజించారు.. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు వచ్చింది.. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు.. వెనుక బడిన ప్రాంతాలకు  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.. ఇప్పుడు ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు..కనీసం ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు అని అన్నారు.   మేం ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటే వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలన్నారు.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు.   ఏపీకి రెవెన్యూలోటు తీరుస్తామని హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఆనాడు ఎన్టీఏ, యూపీఏ రెండూ అంగీకరించాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరుతున్నామని కేవీపీ కోరారు.

ఉస్మానియా మెడికో విద్యార్ధులు మృతి.. కేసీఆర్ దిగ్భ్రాంతి

విజయవాడ, గొల్లపూడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మెడికల్ విద్యార్థులు మృతి చెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన రెండు విద్యార్థి బృందాలు ధనుంజయ్ అనే ప్రైవేటు ఏజెన్సీ బస్సుల్లో అమలాపురంలోని కిమ్స్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్‌కు వెళ్లాయి. ఈ కార్యక్రమం ఆదివారమే ముగియడంతో రెండు బృందాల్లో ఒక బృందం ఆరోజే ఇంటికి చేరుకున్నారు. ఇంకో బృందం మాత్రం.. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ను చూసేందుకు వెళ్లింది. అయితే వారు తిరిగి వచ్చే సరికి తమ పర్సులు ఇంక తమ వస్తువులు డ్రైవర్ శంకర్, క్లీనర్ దొంగలించారని గుర్తించి వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో గొడవ జరుగుతుండగానే డ్రైవర్ బస్సును నడిపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును చెట్టుకు ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా..31 మంది తీవ్రంగా గాయపడ్డారు.   ఇదిలా ఉండగా మెడికోల మృతికి  సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.