వివేకా హత్యను గుర్తు తెచ్చేలా పులివెందులలో పరిస్థితులు.. సునీత

వివేకా హత్య సీబీఐ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. అలాగే  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ సొంత నియోజకవర్గంలో రాజకీయం వేడి పెరిగింది.  ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప ఎస్పీతో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో  గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. తన తండ్రి వివేకా హత్య గుర్తుకు వస్తోందన్నారు. ఈ సందర్భంగానే ఆమె గతంలో తన తండ్రి హత్యకు  ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవిలే కారణమంటూ సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తీసుకుని వచ్చారనీ, కానీ తాను ఆ లేఖపై సంతకం చేయలేదనీ గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సునీత ఎస్పీకీ తెలిపారు. అలాగే.. తన తండ్రి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంటే.. గుండెపోటు అని చెప్పారనీ, ఆ తరువాత తెలుగుదేశం నేతల హత్య చేశారంటూ కథనాలు వండివార్చారనీ, స్థానిక పోలీసులను బెదరించి క్రైమ్ సీన్ ను ట్యాంపర్ చేసి మార్చేశారనీ సునీత పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు పులివెందులలో నాటి పరిస్థితులు గుర్తుకు తెచ్చేలా వాతావరణం ఉందని ఎస్పీకి సునీత చెప్పారు.  తన బంధువు బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి  చేశారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా తన తండ్రి వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాననీ.. , ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

భారత్ అంటే ట్రంప్ కు కడుపుమంట ఎందుకో తెలుసా?

అజిత్ ధోవ‌ల్ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా తెలిసిన వార్త ఏంటంటే పుతిన్ భార‌త్ ప‌ర్య‌ట‌న త్వ‌ర‌లో ఖ‌రారు కానుంద‌ని. ఇదిలా ఉంటే,  మోడీ ఐదేళ్ల త‌ర్వాత చైనా ప‌ర్య‌టించ‌నున్నారు.   ఈ రెండు వార్త‌లూ వేర్వేరే అయినా.. ట్రంప్ మాత్రం ఈ ముగ్గురూ క‌ల‌సి ఏదైనా చేస్తారా? అన్న టెన్ష‌న్ తో అల్లాడుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయ‌న భార‌త్ పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్ప‌టికే  50 శాతం సుంకాలు పెంచిన ట్రంప్ ఆపై అంత‌క‌న్నా మించి ఉండొచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. భార‌త్- అమెరికా, భార‌త్- ర‌ష్యా వీటి మ‌ధ్య గ‌ల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎంత‌న్న‌ది కూడా ఈ పరిస్థితుల్లో  ఒక చ‌ర్చ‌గా మారింది. ఆపై భార‌త్- ర‌ష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయ‌కుంటే వ‌చ్చే లాభ‌మేంటి? వాటిల్లే న‌ష్ట‌మేంట‌న్న ప్ర‌శ్న‌తెరమీదకు వస్తోంది. ఎవ‌రు అవున‌న్నా,  కాద‌న్నా భారత్ ర‌ష్యాక‌న్నా, అమెరికాతోనే  ఎక్కువ వ్యాపారం చేస్తున్నది. భార‌త్, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 130 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైమాట‌. ఇక భార‌త్, ర‌ష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ  68 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మేన‌ట‌. ఇందులో మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే, అమెరికాకు భార‌త్ 86 బిలియ‌న్ డాల‌ర్ల ఎగుమ‌తులు చేస్తుంది.. అదే  అమెరికా భార‌త్ కి కేవ‌లం 45 బిలియ‌న్ డాల‌ర్ల ఎగుమ‌తి మాత్ర‌మే చేస్తుంది. ఇదిలా ఉంటే ర‌ష్యా నుంచి మ‌నం ఏటా 9 నుంచి 11 మిలియ‌న్  బేర‌ళ్ల ఆయిల్ గానీ కొన‌కుంటే..  96 వేల కోట్ల మేర న‌ష్టం వాటిల్లుతుంది.  2022 నాటి ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం వ‌ర‌కూ భార‌త్ ర‌ష్యా నుంచి 0. 2 శాతం మాత్ర‌మే ఆయిల్ కొనుగోలు చేసేది. అదే ర‌ష్యా నాటో దేశాల నుంచి ఆంక్ష‌లు ఎదుర్కొనడం మొద‌ల‌య్యాక‌  విప‌రీత‌మైన రాయితీల‌ను ఇచ్చింది. ఈ రాయితీల‌ కారణంగానే భార‌త్ ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు పెంచింది.  ఇప్పుడా  కొనుగోళ్లు  35 నుంచి 40 శాతానికి చేరాయి. ఒక వేళ మూడో అతి పెద్ద చ‌మురు దిగుమ‌తి దారైన భార‌త్ గానీ అంత‌మేర ఆయిల్ ర‌ష్యా నుంచి కొనకుంటే ఆ మొత్తం ఇత‌ర దేశాల మీద ఆధార‌ప‌డ్డం వ‌ల్ల‌.. డిమాండ్ పెరిగి ప్ర‌పంచ వ్యాప్తంగా అమాంతంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగే ప్ర‌మాద‌ముంది. ఇదెంత  విడ‌మ‌ర‌చి చెప్పినా అమెరికాకి అర్ధం కావ‌డం లేదు. అలాగ‌ని మీరు ర‌ష్యా నుంచి ఎలాంటి దిగుమ‌తులు చేసుకోవ‌డం లేదాని ట్రంప్ ని ఆయ‌న వైట్ హౌస్ లోనే అడిగేశారు మీడియా వాళ్లు. ఆ విష‌యం తనకు తెలీద‌న్నారాయ‌న‌.  నిజానికి యూఎస్ ర‌ష్యా నుంచి ఎరువులు యురేనియం వంటి వాటిని 24 బిలియ‌న్ డాల‌ర్ల మేర దిగుమ‌తి చేసుకుంటుంది. నిక్కీ హేలి వంటి వారు మ‌రో ప్ర‌శ్న కూడా సంధించారు.. మ‌రి చైనా మాత్రం భార‌త్ క‌న్నా ఎక్కువ‌గా ర‌ష్యా నుంచి చ‌మురు దిగుమ‌తి చేసుకోవ‌డం లేదా? అని నిల‌దీశారు. మ‌రో విచిత్ర‌మేంటంటే చైనాక‌న్నా భార‌త్ పైనే ట్రంప్ సుంకాలు ఎక్కువ‌గా విధించారు.  ట్రంప్ కి భార‌త్ అంటే ఎందుకంత క‌డుపు మంట అంటే.. ఆయ‌నకి నోబుల్ శాంతి బ‌హుమ‌తి ప్ర‌తిపాద‌న పాక్ చేయ‌గా.. భార‌త్ మాత్రం స‌సేమిరా అంది. దానికి తోడు మా పాల‌న వైట్ హౌస్ నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ర‌గ‌దు. కావాలంటే పాకిస్తాన్ ని అక్క‌డి నుంచి పాలించుకోవ‌చ్చ‌ని భార‌త్ తెగేసి చెప్పింది.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భార‌త్, యూఎస్ సంబంధాలు మెరుగుప‌డే దారేది? అంటే అందుకు త‌గిన స‌మాధానం దొర‌క‌డం లేదు. ర‌ష్యా నుంచి ఆయిల్ కొన‌డం మాత్ర‌మే ట్రంప్ అభ్యంత‌రం కాదు. ర‌ష్యా, చైనాతో స‌మానంగా భార‌త్ అంత‌కంత‌కూ ఎదుగుతోంది. ఈ మూడు బ్రిక్స్ దేశాలూ క‌లిస్తే ఎక్క‌డ త‌మ అగ్ర నాయ‌క‌త్వానికి ముప్పు ఏర్ప‌డుతుందో అన్న ఆందోళ‌న కార‌ణంగా ట్రంప్ ఇలా భార‌త్ అంటేనే సుంకాల‌తో విరుచుకుప‌డుతున్నార‌ని.. వారికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థ‌లు ఉద్యోగాలు ఇవ్వ‌రాద‌ని అంటున్నార‌ని అంటున్నారు అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు. మ‌రి చూడాలి... ఈ సుంకాల యుద్ధం క్లైమాక్స్ ఎలా ఉంటుందో?  

కృష్ణాన‌గ‌రే మామా!..సినిమా కష్టాల వెత!

తెలుగు సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాతలు! సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాత‌లు అస‌లు గొడ‌వేంటి? పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ  నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ వీరిక‌స‌లు టాలెంటే లేదు. ఐనా ఐటీ ఎంప్లాయిస్కి ఇచ్చే దానిక‌న్నా భారీ వేత‌నాల‌ను ఇస్తున్నామ‌ని అంటున్నారు. మ‌రో ప‌క్క చూస్తే మూడేళ్లు అయ్యింది.  మా వేత‌నాలు పెంచి..  30 శాతం పెంచ‌ండని డిమాండ్ చేస్తున్నారు తెలుగు సినీ కార్మికులు. అయితే యూనియ‌న్ల అక్ర‌మాలు, అవినీతి కార‌ణంగా సినిమా ఫీల్డ్ లోకి నైపుణ్యం గ‌ల వారు రావ‌డం లేదంటూ,  అందుకు ఉదాహ‌ర‌ణగా  డ్యాన్స‌ర్ల వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. యూనియ‌న్లు ఒక్కో కార్డు కోసం ల‌క్ష‌లాది రూపాయ‌ల మేర డ‌బ్బు వ‌సూలు చేస్తున్నార‌నీ.. మాలాంటి వారు సిఫార్సు చేసినా కార్డు ఇవ్వ‌డం లేద‌నీ.. దీంతో వారికి తెలిసిన వారినే వెంట తెస్తూ.. ఆపై నైపుణ్యం లేని వారిని సినిమా ఫీల్డ్ లోకి తెస్తున్నార‌ని ఆరోపించారాయ‌న‌. దీంతో తాము   డాన్స‌ర్ల‌ను తేవ‌ల్సి వ‌స్తోంద‌నీ, దీంతో  ఖ‌ర్చు త‌డిసి మోపెడౌతోందపీ అంటున్నారు  నిర్మాత విశ్వ ప్ర‌సాద్. ఆ మాట‌కొస్తే ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మ‌మాల పుట్ట అని తానెప్పుడో  చెప్పానని ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాననీ చెబుతున్నారు.  త‌మ‌కంత టాలెంట్ లేకుంటే ఏడు జాతీయ అవార్డులు ఎలా వ‌స్తాయంటారు సినీ కార్మిక సంఘం అధ్య‌క్షుడు అమ్మిరాజు. ఇక బాహుబ‌లి నుంచి పుష్ప వ‌ర‌కూ తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయ స్తాయికి చేరింది, మ‌రి ఇదెలా సాధ్య‌మైంది? మొన్నామ‌ధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌  ఆస్కార్ సాధించింది. ఇందులో ఉన్న‌దంతా తెలుగు వారి ప్ర‌తిభా పాట‌వాలే. అలాగే  మ‌న త‌గ్గేదేలే, బ్రో ఐ డోంట్ కేర్ వంటి మేన‌రిజ‌మ్స్.. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి కదా.. మ‌న పాట‌లు, మాట‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియ‌న్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి..  ఇదంతా తెలుగు వారి ప్ర‌తిభ కాదా?  అని నిల‌దీస్తున్నారు సినీ కార్మికులు. ఒక‌రైతే విశ్వ ప్ర‌సాద్ గారూ మీరు నిర్మాణ సంస్థ  స్థాపించి ఇన్నేళ్ల‌య్యింది. 17 సినిమాల వ‌ర‌కూ తీశారు. అందులో ఓ మూడు నాలుగు త‌ప్ప ఏవైనా పెద్ద‌గా ఆడాయా? మ‌రి  మీకంత టాలెంట్ ఉంది క‌దా? ఎందుకు సాధ్యం కాలేద‌ని నిల‌దీశారు. ఇదంతా అలా ఉంచితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చిన్న సినిమా  నిర్మాత‌లైతే ఇప్పుడిస్తున్న వేత‌నాల్లోంచి 25 శాతం వారే త‌గ్గించుకోవాల‌ని అంటారు. ఆల్రెడీ కార్డున్న వాళ్లే కాదు లేని వాళ్లు కూడా ఫీల్డ్ లోకి వ‌చ్చేలాంటి స్ట్ర‌క్చ‌ర్ రావాల‌ని విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లంద‌రి త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తుంటే.. చిన్న సినిమా నిర్మాత‌ల  త‌ర‌ఫున సీ క‌ళ్యాణ్ వ‌చ్చి ఈ బాంబు పేల్చారు. కొంద‌రు నిర్మాత‌లైతే.. 10 శాతం మేర అయితే పెంచ‌గ‌లంగానీ.. ఇంత పెద్ద మొత్తం త‌మ వ‌ల్ల కాదంటున్నారు. ఫైన‌ల్ గా నిర్మాత‌లు వ‌ర్సెస్ కార్మికుల వ్య‌వ‌హారంలో అస‌లు పేచీ ఎక్క‌డ‌ అని చూస్తే... వారేమో వెంట‌నే 30 శాతం వేత‌నాలు పెంచాల‌ని కోరుతుంటే.. వీరేమో.. మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి.. ఇక్క‌డ స‌రైన నిపుణులు లేన‌పుడు బ‌య‌ట రాష్ట్రాల నుంచి టెక్నీషియ‌న్ల‌ను తెప్పించుకునే వెస‌లుబాటు క‌ల్పించాలి. షూటింగ్ ఎక్క‌డ జ‌రిగినా రేషియో అనేది ఉండ‌కూడ‌దు. సెకండ్ సండే, ఫెస్టివ‌ల్స్ లో వ‌ర్క్ కి మాత్ర‌మే డ‌బుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్.. ఈ నాలుగు ప్ర‌తిపాద‌న‌లపై ఫెడ‌రేష‌న్ నిర్ణ‌యం చెబితే.. అప్పుడు వేత‌నాల పెంపు గురించి ఆలోచిస్తామ‌ని అంటున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు మ‌రో చ‌ర్చ‌కు కూడా తెర‌లేచింది.. చిరంజీవి, బాల‌కృష్ణ వీరెవ‌రిలో ఇండ‌స్ట్రీ పెద్ద అయ్యే అవ‌కాశ‌ముంద‌న్న చ‌ర్చ‌ సైతం జ‌రుగుతోంది. చిరంజీవి అనేదాన్నిబ‌ట్టీ చూస్తే ఇది నిర్మాత‌లు, కార్మికుల స‌మ‌స్య‌... కాబ‌ట్టి వారే తీర్చుకోవాల‌ని అంటే..  బాల‌కృష్ణ మాత్రం ఇటు నిర్మాతలు,  అటు కార్మికులు ఇద్ద‌రికీ న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. మ‌రి వీరిలో పెద్ద కాద‌గిన అర్హ‌త ఎవ‌రికుంది? అన్న‌దొక స‌స్పెన్స్ గా మారింది. చూడాలి.. ఈ కృష్ణాన‌గ‌ర్ సినిమా క‌ష్టాల వెత ఎక్క‌డి వ‌ర‌కూ వ‌స్తుందో ?

సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి.

పీ4లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపు ఎంత సంపాదించినా కలగని తృప్తి మనస్పూర్తిగా సాటి మనిషికి సాయం చేసినప్పుడు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో గురువారం (ఆగస్టు 7)న సమావేశమైన ఆయన పీ4లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  సీఎం పిలుపుతో కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన ఇండస్ట్రియలిస్టులను చంద్రబాబు అభినందించారు. సాయం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం కో స్పాన్సర్ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.   గతంలో తాను పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరాననీ, ఇప్పుడు పెట్టుబడులతో పాటు  పేదలకు అండగా నిలవాలని కోరుతున్నట్లు చెప్పారు.   సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చూశాను, చేశాను కానీ,  పీ4   ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వలేదన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణల ఫలాలను  అందుకుని ఉన్నత స్థాయికి చేరిన వారు.. సమాజంలో అసమానతలను తొలగించే బాధ్యత తీసుకోవాలన్నారు.  చేసే చిన్న సాయం కూడా.. పేదరికంలో ఉన్నవారికి భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వం చేసేది సంక్షేమం అయితే మీరు చేసేది బాధ్యతాయుత సాయం అవుతుందన్నారు. కేవలం పేదలకు అండగా నిలవమని పిలుపునివ్వడంతో సరిపెట్టకుండా.. తాను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వ పరంగా పేదల కోసం   పింఛన్లు, తల్లికి వందనం, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు కూడా బాధ్యతాయుతంగా అసమానతలను రూపుమాపడానికి కుటుంబాలను దత్తత తీసుకోవాలని, దత్తత కుటుంబాలలో నైపుణ్యాలను పెంచడం ద్వారా  వారి ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. సీఎం పిలుపునకు పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అదే విధంగా పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు.  

నేడు సిట్ ఎదుటకు కేంద్ర మంత్రి బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8)  ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ఎదుట హాజరు కానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులనే కాకుండా, బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్న సిట్ అందులో భాగంగానే బండి సంజయ్ కూ నోటీసులు పంపింది. ఆ నోటీసుల మేరకు  వాంగ్మూలం ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ఎదుట హాజరుకానున్నారు.   బీఆర్ఎస్ హయాంలో  తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన సీట్ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఇక పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పబడుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నది. ఇందు కోసం కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నాడు వీరు కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులతో భేటీ  అయ్యారు. 

విశ్వనగరం కాదు విశ్వనరకం!

విశ్వనగరంగా ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరం గురువారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి విశ్వనరకంగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు నానా యాతనలూ పడ్డారు.   గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీ,  పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ తాలలో వాహనాలు నిలిచిపోయి చీమలబారును తలపించాయి.   ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గురువారం (ఆగస్టు 7) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.3 సెంటీమీటర్లు,  రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 14, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 13.2,  వలిగొండ వెంకటపల్లెలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 12.7 సెంటీమీటర్లు,  సరూర్‌నగర్‌లో 12.8, ఖైరతాబాద్‌లో 12.6, గండిపేటలో 12.2, యూసుఫ్‌గూడలో 12.4 సెంటీటర్లు, అదే విధంగా  ఉప్పల్‌లో 11.7, ఎల్బీనగర్‌లో 11.3,   అమీర్‌పేటలో 11.1, షేక్‌పేటలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. వారాంతాలలో అయితే తిరుమల కొండ భక్త జన సముద్రాన్ని తలపిస్తుంటుంది. శుక్రవారం ( ఆగస్టు 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.  ఇక గురువారం (ఆగస్టు 7) శ్రీవారిని మొత్తం 65 వేల 234 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.  

హైదరాబాద్‌లో రికార్డు స్ధాయి వర్షం..జనజీవనం అస్తవ్యస్తం

  హైదరాబాద్‌ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాల్లో వరదనీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్ లో భారీ వర్షం కురవడంతో దేవరకొండబస్తీ లో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్‌తో ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.  బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం‌.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, జలమండలి (హైడ్రా) అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన గట్టిగా సూచించారు. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. 123.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. ఆ తర్వాత శ్రీనగర్‌ కాలనీలో 111.3 మి.మీ, ఖైరతాబాద్‌లోని సెస్‌ వద్ద 108.5 మి.మీ, యూసఫ్‌గూడ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో 104.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

  ఏపీలో  ట్రైబల్ శాఖలో  ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్‌సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.  

బీసీ రిజర్వేషన్లు విషయంలో అన్ని ప్రయత్నాలు చేశాము : సీఎం రేవంత్

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  అపాయింట్‌మెంట్‌ రాకుండా ప్రధాన మంత్రి మోదీ, హొం శాఖ మంత్రి అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇందుకోసం హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా విధానం అని పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు.  హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. నిన్నటి ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే రాలేదన్న వాదన అర్థరహితం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు  

హైదరాబాద్‌‌కు క్లౌడ్ బరస్ట్ ముప్పు..ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని  వాతవరణ నిపుణులు చెబుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం..చెరువులను తలపించిన రోడ్లు

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.. రోడ్ల‌న్నీ జ‌లమ‌యం కావ‌డంతో.. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ప‌లు కాల‌నీల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా ఎమ‌ర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల  కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి కేంద్ర హోంశాఖ

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది. ఇప్పుకు ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ విషయమై ఆరా తీసేందుకు కేంద్ర హోంశాఖ అదికారులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరు గురువారం (ఆగస్టు 7) కేంద్ర మంత్ిర బండి సంజయ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులూ కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బండి సంజయ్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.  

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

  భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతుండగా.. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏక బదిలీ ఓటు పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.  ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ జులై 21న ఆరోగ్య కారణాలతో ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఆయన పదవీకాలం వాస్తవానికి ఆగస్టు 2027 వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎంపీలందరూ (ఎన్నికైనవారు, నామినేటైనవారు) పాల్గొంటారు.

ఒకే వ్యక్తి నాలుగు చోట్ల ఓట్లు వేశాడు..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

  నకిలీ ఓటర్ల జాబితాలతో  ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్‌ చోరీ పేరిట నేడు ఢిల్లీ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌  మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో అగ్రనేత కీలక వ్యాఖ్యలు చేశారు. గురుక్రీత్ సింగ్ అనే వ్యక్తి పేరు కర్ణాటక ఓటర్ల లిస్టులో 4 సార్లు వచ్చింది. ఓకే నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాల్లో అతను ఓటేశారు. సేమ్ పేరు, అడ్రస్‌తోనే అంతా జరిగింది.  ఇలాంటి ఘటనలు వేలల్లో ఉన్నాయి. కొందరి పేర్లు యూపీ, కర్నాటక, మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ ఆరోపించారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు. పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ మహదేవ్‌పూర్‌ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు.  మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందించారు. ఫేక్ ఓట్లపై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. లేదంటే ఆరోపణలు ఉపసంహరించుకోవాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

తురకా కిశోర్‌‌ అరెస్ట్ నిబంధనలకు విరుద్దం..విడుదల చేయాలి : హైకోర్టు

  వైసీపీ నేత తూరకా కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్‌ను అరెస్ట్ చేశారని  హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందినట్లు రిమాండ్‌ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. అరెస్టుతో పాటు రిమాండ్‌ విధింపు విషయంలో చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని ఒక్క నిమిషం కూడా జైలులో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది.  ఓ దశలో రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. కిశోర్‌ విడుదలకు ఆదేశాలిస్తామని తెలిపింది. కిశోర్‌ను అరెస్టు చేసే సమయంలో బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌-47 (అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం), సెక్షన్‌-48 (అరెస్టుకు గల కారణాల) కింద ఇచ్చిన నోటీసులు నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.   

చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ : సీఎం చంద్రబాబు

    చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా హ్యాండ్లూమ్  మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేత కార్మికులు సీఎం అన్నారు.  టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని.. నేతన్నాలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ చేనేత అని చంద్రబాబు తెలిపారు. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు.  నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు. చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.  ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికాకు చుక్కలు చూపేలా మోడీ వ్యూహం!?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.  రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే పన్నుల కొరడా ఝుళిపిస్తానంటూ  భారత్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ తాను కేవలం హచ్చరికలతో ఊరుకునే రకాన్ని కాననీ, చేసి చూసుతాననీ అదనంగా పాతిక శాతం సుంకాల విధింపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి చూపించారు. దీంతో అప్రమత్తమైన ఇండియా.. ప్రతి వ్యూహాలతో సిద్ధమైంది.   అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే కౌంటర్ అటాక్ ఇచ్చింది.  అక్కడితో ఆగకుండా అమెరికాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో పడింది.  ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారును రష్యా పర్యటనకు పంపింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 31న రెండు రోజుల పర్యటన కోసం చైనా బయలుదేరుతున్నారు. పేరుకు అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు అని చెబుతున్నా.. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తో భేటీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.  డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా చేస్తున్న ట్రేడ్ వార్ కు దీటైన సమాధానం ఇచ్చే విషయంలో ఈ మూడు దేశాలూ ఉమ్మడిగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాయనడానికి అజిత్ దోవల్  రష్యా పర్యటన, మోడీ చైనా పర్యటనలు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ మూడు దేశాలూ చేతులు కలిపి ట్రంప్ ట్రేడ్ వార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే.. అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఇదే వ్యూహంతో  ప్రధాని మోడీ ట్రంప్‌పై ఒత్తిడి పెంచి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.