జీహెచ్ఎంసీ ఎన్నికలు.. జగన్ జెండా ఎక్కడా..?

గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి వారు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. గెలవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక అధికార పార్టీ అయితే సెటిలర్లను ఆకర్షించడానికి బానే కష్టపడుతున్నారు. ప్రచారంలో సీమాంధ్రులు మెచ్చే మాటలు మాట్లాడుతున్నారు. కానీ అన్ని పార్టీల సంగతి పక్కన పెడితే.. వైసీపీ హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల బరిలో నుండి వైసీపీ తప్పుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైకాపా అధినేత జగన్ కూడా ఈ గ్రేటర్ ఎన్నికల బరిలో దిగకూడదని నిర్ణయించుకన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కారణమట. వరంగల్ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేసింది. వైసీపీ నుండి త‌న పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలో దింపి ఎన్నికల ప్రచారానికి జగన్ కూడా వెళ్లారు. కానీ అభ్యర్ధికి మాత్రం 20వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో వైకాపాకు తెలంగాణ‌లో త‌మ బ‌లం ఏ స్థాయిలో ఉందో జగన్ కు ఓ క్లారిటీ వ‌చ్చిందంట. అందుకే ఆ పార్టీ గ్రేట‌ర్ బ‌రి నుంచి త‌ప్పుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు వైసీపీ పార్టీ నేతలు కూడా ఎన్నికల్లో దిగే ఛాన్స్ లేదని అనుకుంటున్నారట. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తాము తప్పుకుంటున్నట్లు.. ఈ విషయాన్ని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం కొంతమంది పార్టీ నేతలకు అసంతృప్తికరంగా ఉందంట. గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓట్లు పడే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే వాస్తవానికి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ నుండి అభ్యర్ధులు కూడా ఎవరూ లేరంట. జగన్ కొంతమందిని పిలిచి ఎన్నికల్లో పోటీచేయాలని అడిగినా ఎవరూ ఆసక్తి చూపించలేదంట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో జగన్ తన జెండాను పీకేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కు తెలంగాణలో తమకున్న పట్టు ఏంటో తెలిసింది. అనవసరంగా ఎన్నికల్లో పాల్గొని పరువు పోవడం కంటే సైలెంట్ గా ఎన్నికల నుండి తప్పుకుంటే మంచిదని అనుకున్నట్టున్నారు. మరి ముందుముందైన వచ్చే ఎన్నికల్లో అయినా పాల్గొంటారో లేదో చూడాలి.

కేటీఆర్ కు కేసీఆర్ వార్నింగ్.. కంట్రోల్ యువర్ టంగ్..

ఎన్నికల ముందు అతిగా ఆవేశపడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్.. ఎవరు ఎవరికి క్లాస్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా.. తెలంగాణ సీఎం కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ కు తీసుకున్న క్లాస్ ఇది. ఎందుకంటారా.. రాజకీయ నేతలు ఆచి తూచి మాట్లాడకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందునా ఎక్కడ ఏ పాయింటో దొరుకుతుందా.. ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేద్దామా.. అని ఎదురుచూస్తున్న రోజుల్లో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. కానీ ఇటీవల కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు విమర్సించే ఛాన్స్ ఇచ్చారు.. దీంతో తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే క్లాస్ తీసుకునే పరిస్థితి వచ్చిందట. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్న సంగతి తెలసిందే. అయితే గ్రేటర్లో సీమాంధ్రులు ఎక్కువ కాబట్టి వారి ఓట్లు కూడా పడాలంటే కాస్త వారు మెచ్చే మాటలు కూడా నాలుగు మాట్లాడాల్సిందే. అందుకే కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తన వాక్యాతుర్యాన్ని ఉపయోగించి సీమాంధ్రులను ఆకర్షించడానికి పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా తెరాసను భ‌విష్య‌త్తులో ఏపీకి కూడా విస్త‌రిస్తామని.. అప్పుడు నేను భీమవరం నుండి పోటీ చేస్తాను.. అక్కడైతే నేను తేలికగా గెలుస్తాను.. ఎందుకంటే కోడి పందేలు లీగల్ చేస్తే నాకే ఓట్లు వేస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే తాను వ్యాఖ్యానించడం వరకూ బానే ఉంది కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసీఆర్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట.  ఈ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ‌లో మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది..నువ్వు భీమ‌వ‌రం నుండి పోటీచేస్తాన‌న్న మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌లు త‌ప్పుగా అర్ధం చేసుకుంటే ఇబ్బంద‌ని కేసీఆర్ కేటీఆర్‌కు క్లాస్ పీకార‌ట‌. ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఎప్పుడూ మాట్లాడ‌కూడ‌దు… అలా మాట్లాడితే ఓట్ల కోసం ఏమైనా చేస్తారా అన్న ఆలోచన వారికి వెళుతుంది..కంట్రోల్ యువ‌ర్ టంగ్ అని కేసీఆర్ కేటీఆర్‌తో అన్న‌ట్టు స‌మాచారం. ఇక దీంతో కేటీఆర్ తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారు. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి మరీ తాను సరదాగా వ్యాఖ్యానించానని.. టీఆర్ఎస్ ను ఏపీ విస్తరించేది లేదని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ కొడుకని కూడా చూడకుండా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడైనా కేటీఆర్ కంట్రోల్ గా మాట్లాడుతారో లేదో చూడాలి.

చంద్రబాబును కూడా ఇరుకున పెట్టిన రాయపాటి.. టీడీపీ నేతలు ఫైర్..

టీడీపీ నేత.. నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ గురించి కామెంట్లు చేసి సొంత పార్టీ ఎంపీతోనే తిట్టుంచుకున్న పరిస్థితి ఏర్పడింది. తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖకు రైల్వే జోన్ ఎందుకని రాయపాటి కామెంట్ చేయగా.. దానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించి.. తుఫాన్ల పేరుతో వచ్చే రైల్వేజోన్లు కూడా రాకుండా చేస్తారా.. ఏం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అది అయిపోయిందో లేదో ఇప్పుడు మరో విషయంపై కూడా అలానే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత అయిన చంద్రబాబును సైతం ఇరుకున పెట్టేలా వ్యాఖ్యనించారు రాయపాటి. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గుంటూరు వెళ్లిన సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి.. రాయపాటి మిత్రులు కావడంతో రాయపాటి వారిని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. ఇక్కడి వరకూ బానే ఉంది. దీని తరువాత మీడియాసమావేశంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అనుకున్నంత సహకారం అందడంలేదని.. రాష్ట్రానికి నిధులివ్వడం లేదని రాజధానికీ సొమ్ములు కేటాయించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా పరిస్థితులు ఇలానే కొనసాగితే తాము భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటుందా? అని ప్రశ్నించగా ' భవిష్యత్తు పరిణామాలపై త్వరలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఏం జరుగుతుందో చూస్తుండండి' అని బాబును ఇరికించారు. దీంతో టీడీపీ నేతలు రాయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాయపాటి వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి మాత్రం కౌంటర్ ఇచ్చినట్టు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మేము చాలా కాలం నుండి మిత్రులం కాబట్టి తాను పిలవగానే విందుకు వచ్చాను కాని అంతకుమించి ఇంకా రాజకీయ ప్రాధాన్యత ఏం లేదని అన్నారు. ఇంకా పొత్తు గురించి రాయపాటి చేసిన వ్యాఖ్యలకు గాను.. బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నంతకాలం తాము కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో టీడీపీ తో కలిసి పనిచేశాం.. కానీ గత ఏడాది మాత్రం చంద్రబాబు బీజేపీతో పొత్తు ఏర్పాటు కుదుర్చుకున్నారు.. అయినా పొత్తు గురించి ఇప్పుడే మాట్లాటడం అనవసరమని అన్నారు. మరి బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలైనప్పటికీ వారి మధ్య అప్పుడప్పుడు విబేధాలు తలెత్తుతూనే ఉన్నాయి. బీజేపీ నేత కన్నా ఇటీవలే టీడీపీ నేతలపై మండిపడ్డారు. మరి ఇప్పుడు రాయపాటి చేసిన వ్యాఖ్యలకు ఒకపక్క టీడీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా చంద్రబాబు రాయపాటి వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి.

బీజేపీకి ముప్తీ మహబూబా షరతులు.. కాంగ్రెస్ తో జతకట్టేందుకా.?

జమ్ము కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి చెందిన అనంతరం.. ఆ పదవిని తన కూతురు ముప్తీ మహబూబాకు కట్టబెట్టాలని పీడీపీ నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మరణం తర్వాత ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు ముగిసేవరకూ తాను ప్రమాణ స్వీకారం చేయబోనని మహబూబా ముఫ్తీ చెప్పారు. దీంతో, ఈ వారం ఆమె బాధ్యతలు చేపట్ట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్న ఇక్కడే అసలు రాజకీయం బయటపడుతోంది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి చెందిన నేపథ్యంలో ముఫ్తీని మహబూబాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు విడివిడిగా ఆమెను కలిసి పరామర్శించారు. దీంతో పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము కలిసింది ముఫ్తీని మహబూబాను పరామర్సించడానికే అని వారు చెబుతున్నా.. అందులో వేరే రాజకీయ ఉద్దేశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో జమ్ము కాశ్మీర్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎందుకంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి అనంతరం ముప్తీ మహబూబాను సీఎం చేయాడానికి మద్దతు తెలిపిన వారిలో బీజేపీ ఉంది. ముప్తీ మహబూబాకు పూర్తి మద్దతిస్తామని బీజేపీ తెలిపింది. కానీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న ముప్తీ మహబూబా మాత్రం బీజేపీకి కొన్ని షరతులు పెట్టిందంట. అదేంటంటే.. ఉప ముఖ్యమంత్రి పదవులు.. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వంటి కీలక పదవులు బీజేపీ ఇవ్వమని అడగవద్దని.. అలా అయితేనే బీజేపీ-టీడీపీ కలిసి ఉంటుందని ఖచ్చితంగా చెప్పారంట. దీంతో బీజేపీ పార్టీ నేతలు షాక్ తిన్నా.. దానికి కౌంటర్ గా వారు కూడా మరో షరతు పెట్టారంట. అది ముఖ్యమంత్రి పదవిని కొన్నేళ్లు పిడిపి, మరికొన్నేళ్లు బిజెపికి చెందిన వారు కొనసాగించాలని అన్నారంట. కానీ దీనికి ముప్తీ మహబూబా ఒప్పుకోలేదట. ఇదిలా ఉండగా ముప్తీ మహబూబా ఇలాంటి షరతులు విధించడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో మాట్లాడిన తరువాతే ముప్తీ మహబూబా ఇలా అంటున్నారని.. కాంగ్రెస్ తో జతకట్టేందుకే ఇలాంటి షరతులు విధిస్తున్నారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి పిడిపి వర్సెస్ బీజేపీ లా తయారైంది. మరి బీజేపీ షరతులకు పిడిపి ఒప్పుకుంటుందా.. పిడిపి షరతులకు బీజేపీ ఒప్పుకుంటుందా.. లేక కాంగ్రెస్ తో జతకడుతుందా ఈ విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇప్పుడు ఏం చెబుతారు కేసీఆర్..

తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెట్టిన సంగతి తెలిసిందే. కనీసం రాష్ట్రం విడిపోయిన తరువాత అయిన తమ కష్ట్రాలు తీరిపోతాయి అని అనుకున్నారు చాలా మంది ఉద్యమకారులు. కానీ అప్పటికీ.. ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రం ఉద్యమ కారులకు అది చేస్తాం..ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన నాయకులకు మాత్రం వాటి గురించి ఆలోచించే తీరిక లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు అవి తగ్గాయి కదా అనుకునే లోపు మరో వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కరుణాసాగర్ అనే కళాకారుడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాసాగర్ తెలంగాణ ధూం-ధాం కార్యక్రమాల్లో - తెలంగాణ సాధన యాత్రల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చేవాడు. దాదాపు 10 ఏళ్ల నుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొని.. పాటలు రాయడమే కాకుండా పాడాడు కూడా. అయితే తెలంగాణ రాష్ట్ర వచ్చాక కళాకారుల కోటాలో సాంస్కృతిక శాఖలో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. కానీ నిరాశే ఎదురైంది. దాదాపు సంవత్సరకాలం పాటు ఎదురుచూసినా జాబ్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన కరుణాసాగర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు కరుణాసాగర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని తల్లిదండ్రులు పుట్టుగుడ్డివారు.. నలుగురు అక్కచెల్లెళ్ళు మరో తమ్ముడు కూడా ఉన్నారు. కరుణాసాగర్ మృతితో తాము అనాథలమయ్యాయని ఆవేదన వ్యక్తి చేస్తున్నారు. మరి కరుణాసాగర్ మృతితో అయినా కేసీఆర్ ఉద్యమంలో ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయో లేదో చూడాలి. కరుణాకర్ లాంటి ఎంతో మంది ఉద్యమకారుల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి మరిచిపోయి.. ఎంత వరకూ రాజకీయ నాయకులు మాత్రమే పదవులు పొందుతూ ఉండటం కాదని తెలంగాణవాదులు అంటున్నారు. మరి కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.

రాయ‌పాటి యాక్షన్.. రామ్మోహన్ నాయుడి రియాక్షన్..

ద‌శాబ్దాలుగా పార్ల‌మెంటేరియ‌న్‌గా ఉన్న సీనియ‌ర్ ఎంపీ అయిన రాయ‌పాటిపై.. తొలిసారిగా ఎంపీగా గెలిచి.. ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్న యువ ఎంపీ.. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  విజయవాడలో టీడీపీ ఎంపీలకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న రాయపాటి విశాఖ జోన్ ఉద్దేశించి.. తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖలో రైల్వే జోన్ ఎందుకు.. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రైల్వే జోనులు ఏర్పాటు చేయాలని అన్నారు. అంతే దీంతో రామ్మోహన్ నాయుడికి చిర్రెత్తుకొచ్చినట్టుంది.. రాయపాటిపై ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుఫాన్లు రావా.. తుఫాన్ల పేరు చెప్పి రైల్వేజోన్‌ను కూడా ఎగరేసుకుపోదామనుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నారు? అని మండిపడ్డారంట. అంతే అక్కడునన్న నేతలు మొదట రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు షాక్ తిన్న ఆతరువాత తను మాట్లాడినదాంట్లో కూడా నిజం ఉందని గ్రహించి అతనిని ప్రశంసించారంట. రామ్మోహన్ నాయుడికి కోరస్ గా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వెంటనే అందుకుని ”బాధ్యతగా మాట్లాడండి.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం” అని హితవు పలికారట. మొత్తానికి పార్లమెంట్ లో ఎలా అయితే తన ప్రసంగంతో అందరిని మెప్పించాడో.. ఇప్పుడు కూడా అలానే అందరి ప్రశంసలు అందుకొని యువకెరటంలా రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నాడు. మరి దీనికి రాయపాటి ఎలాంటి యాక్షన్ చూపిస్తారో చూడాలి.

ఇదెక్కడి ఎన్నికల ప్రచారంరా బాబు..?

ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలు ఎలాగూ ప్రచారం చేస్తారు కాని.. కేంద్ర మంత్రులతో ప్రచారం చేయిస్తే నాలుగు ఓట్లు ఎక్కువ రాలుతాయి అని ఆశతో స్థానిక నేతలు కేంద్రం నుండి తమ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి నేతలను తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు తిప్పలంతా.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీజేపీ తరపు నుండి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాధామోహన్ సింగ్, హన్సరాజ్ గంగారామ్, వెంకయ్యనాయుడు పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగూ పార్టీ గురించి నాలుగు మాటలు చెబుతూ.. ప్రతిపక్ష పార్టీ గురించి నాలుగు విమర్సలు చేస్తూ మాట్లాడటం సహజం. ఇక్కడి వరకూ బానే.. అదే కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి అయన కేసీఆర్ ను.. ఆయన చేపట్టిన పథకాలను పొగడటం.. కేసీఆర్ చేత కూడా వాళ్లను పొగిడించుకోవడంతో తాము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపుతున్నట్టు ఉందని..స్థానిక బీజేపీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందట.  అంతేకాదు ఇప్పటికే బీజేపీలో ఉన్న బండారు దత్తాత్రేయ ఇలానే వ్యవహరిస్తున్నారు.. ఇప్పుడు కేంద్రం నుండి వచ్చే కేంద్ర మంత్రులు కూడా అలానే చేస్తున్నారని స్థానిక బీజేపీ తెగ ఫీలవుతున్నారంట. అంతేకాదు ప్రచారంలో పాల్గొని ప్రతిపక్ష నేతలను విమర్శించాల్సింది పోయి.. ఆ నేతలను పొగడటం ఏంటని.. ఇదెక్కడి ప్రచారంరా దేవుడా అని మదనపడుతున్నారంట. దీనిపై త్వరలో పార్టీ అధినేత అమిత్ షాకు కూడా కంప్లైట్ ఇవ్వాలని చూస్తున్నారంట. చూద్దాం ఆ తరువాతైనా నేతల ధోరణి మారుతుందేమో.

టీఆర్ఎస్ కు టీడీపీ రివర్స్ పంచ్.. ఆపరేషన్ స్వగృహా

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదన్న విషయం రాజకీయానుభవం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఒక పక్క ఎన్నికల్లో విజయ పరంపర సాగిస్తూనే.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురు పార్టీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ.. మరోవైపు ప్రచారంలో జోరు సాగిస్తూ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తుంది. దీంతో ఏ పార్టీ నాయకుడు ఎప్పుడు షాక్ ఇస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ రివర్స్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తరహాలో.. టీడీపీ కూడా ఆపరేషన్ స్వగృహా అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది .ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఇతర నతేలను తమ పార్టీ లోకి చేర్చుకుంటారు. అయితే ఆపరేషన్ స్వగృహా ద్వారా పార్టీని విడిచి వెళ్లిపోయిన వారంద‌రినీ తిరిగి పార్టీలో చేర్చుకుంటుంది. దీనిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ `ఆపరేషన్ స్వగృహ` ప్రారంభించిందని.. హైదరాబాద్ లో, తెలంగాణలో పార్టీని వీడి వెళ్లిపోయినవారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్ల‌డించారు. అయితే దీనికి కూడా మంచి రెస్పాన్సే వచ్చినట్టు కనిపిస్తోంది. అలా ప్రారంభించారో లేదో.. గతంలో పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎల్బీనగర్ నుంచి ఎస్.వి.ప్ర‌సాద్, శేరీలింగపల్లి నుంచి నార్నె శ్రీనివాస్, కుకట్ పల్లి నుంచి గోనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు.  దీంతో ప్రారంభించిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింనందుకు గాను టీడీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ కు ధీటుగా టీడీపీ నేతలు ఆపరేషన్ స్వగృహాను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా టీఆర్ఎస్ కు గట్టిగానే సమాధానం ఇచ్చారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

దాసరిని జగన్ గోకడం కరెక్టేనా..?

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, దాసరి నారాయణరావులు భేటీ ఆయిన సంగతి తెలిసిందే. వీళ్లద్దరు భేటీ అవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ దాసరిని తన పార్టీలోకి ఆహ్వానించడం.. దాసరి కూడా దానికి సముఖత చూపడం.. అంతేకాదు దాసరి కూడా జగన్ ను పొగడటంతో ఇక దాసరి వైసీపీలోకి చేరడమే తరువాయి భాగం అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఉన్న పళంగా జగన్ దాసరిని పార్టీలోకి ఆహ్వానించడానికి గల కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకే దాసరిని జగన్ అప్రోచ్ అయ్యారని అంటున్నారు. అయితే జగన్ దాసరిని కలవడం.. అతనిని పార్టీలోకి ఆహ్వానించడం.. అవసరమైతే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడానికి కూడా రెడీ అవ్వడంపై ఆయనకు ఉన్న రాజకీయ పరిణతి ఏమిటో అర్ధమవుతుందని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ-బీజేపీలకు కాపు ఓట్లు సాధించిపెడుతున్న పవన్ కళ్యాణ్ కు పోటీగా దాసరిని రంగంలోకి దింపాలన్నది జగన్ ప్లాన్. అయితే పవన్ కళ్యాణ్ కు పోటీగా  ఇంకా వేరే ఎవరినైనా జగన్ ఎంచుకుంటే బావుండేదని.. ప్రస్తుతం దాసరికి ఇమేజ్ లేదు.. అందులోనూ ఇప్పటికే దాసరి బొగ్గు గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..ఆయన వల్ల పార్టీకి కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు.. చెప్పాలంటే పార్టీ వల్లే అతనికి ఇంకా ఎక్కువ లాభం చేకూరుతుందే తప్ప వేరే ఏం లేదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో జగన్ ఎలాంటి కాలిక్యూలేషన్స్ లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దాని వల్ల పార్టీకి చెడ్డ పేరు కూడా వస్తుందని.. అనుకుంటున్నారు.  

అసహనంపై ఆమీర్ ఖాన్.. తాను తీసుకున్నగోతిలో తానే..!

  బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ అసహనంపై వ్యాఖ్యాలు చేసి పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమీర్ చేసిన వ్యాఖ్యలపై అందరూ అతనిపై విమర్శల వర్షం కురిపించారు. అయితే ఆతరువాత పరిస్థితి కొంచెం నెమ్మదించిన దాని ప్రభావం మాత్రం అమీర్ ఖాన్ పై అలానే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆమిర్ పదేళ్ల పాటు ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచార సారథిగా ఉన్న సంగతి తెలిసిందే అయితే అసహనంపై వ్యాఖ్యాలు చేసిన ఆయనకు భారత పర్యాటక శాఖ షాక్ ఇచ్చింది. అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" నుండి ఆయనను తొలగించి ఆస్థానంలో మరో సూపర్ స్టార్ ను రీప్లేస్ చేయనున్నారు. అంతేకాదు అమీర్ చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్రం సీరియస్ గా తీసుకొని అతనిని అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి అతడిని తొలగించిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే కేంద్ర పర్యాటక శాఖ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ఖాన్ కాంట్రాక్ట్ పూర్తయింది అందుకే ఆయన తప్పుకున్నారు అని చెబుతుంది. మరోవైపు "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" నుండి తనను తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను ఉన్నా లేకున్నా భారతదేశం మాత్రం ఎప్పటికీ అద్భుతం అమోఘమైన దేశంగానే ఉంటుందని పేర్కొన్నాడు. అంతకుమించి మాట్లాడితే సీను ఇంకా బ్యాడ్ అవుతుందని ఆయనకు ఇప్పటికే అర్థమైనట్లుంది. మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అన్నట్టు అసహం ఎఫెక్ట్ ఆమీర్ ఖాన్ పై బాగానే పడినట్టు తెలుస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలకు ఇంతలా రియాక్షన్ వస్తుందని అమీర్ ఖాన్ కూడా ఊహించి ఉండడేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాను తీసుకున్న గోతిలో తాను పడినట్టు.. ఇక అమీర్ ఖాన్ భవిష్యత్తులో ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

పవన్ కు టీఆర్ఎస్ భయపడుతోందా..

రాష్ట్ర విభజన తరువాత అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయపంధాలో దూసుకుపోతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉన్నా లేనట్టు అయిపోయింది పరిస్థితి. ఈ ధీమాతోనే టీఆర్ఎస్ నేతలు కూడా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నుండి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ టీఆర్ఎస్ ఎదురులేకుండా.. ఎలాంటి భయం లేకుండా గెలుపును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పరిస్థితి వేరు.. గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు కొంచం కష్టపడాల్సి వస్తుంది. అయితే తమ ప్రచారంలో తాము ఉండగా ఇప్పుడు టీఆర్ఎస్ మాత్రం ఒక వ్యక్తికి భయపడుతుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ-టీడీపీ కలిపి ప్రచారానికి పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే అలర్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడికి దిగుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఈ పవన్ వ్యతిరేక దాడిని మొదలు పెట్టారు. పవన్ ది పవనిజం కాదని అది బ్రోకరిజమని.. ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని రవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్కల్యాన్ ఎదుగుతున్నారని... ఇక్కడి రాజకీయాల్లో వేలుబెట్టి ఆడియన్సును పోగొట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అసలు ప్రచారానికి వస్తారో?రారో అని ఇంకా తెలియక ముందే టీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఎదురుదాడికి దిగుతోంది. ఆయన వస్తారు అన్న వార్తలు వచ్చినందుకే టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారంటే.. పవన్ కి భయపడ్డారని.. ఆయన వస్తే తమకు వచ్చే ఓట్లు కూడా పోతాయని భావిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఎవరికి భయపడని టీఆర్ఎస్ ను పవన్ భయపడేలా చేశారు. పవనా.. మజాకానా అని నిరూపించాడు.

అసలు దొంగ ఎస్పీ సల్వీందర్ సింగేనా.. ?

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో అందరి అనుమానాలు గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పైనే ఉన్నాయి. అయితే ఎన్ఐఏ విచారణలో బయటపడుతున్న విషయాలను బట్టి చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సల్వీందర్ సింగ్ పై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో వెలువడిన విషయాలను చూస్తే నిజమనే అనిపిస్తుంది ఎవరకైనా. ఎన్ఐఏ దర్యాప్తులోసల్వీందర్ సింగ్ తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని చెప్పారు. కానీ దర్గా అధిపతి సోమ్ మాత్రం తాను ఎప్పుడూ సల్వీందర్ సింగ్ ను చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు కూడా తెలియజేశారు. డిసెంబర్ 31 వ తేదిన ఉదయం ఎస్పీ మిత్రుడు.. అతని వంటవాడు దర్గాకు వచ్చి కొంచెంసేపు గడిపి వెళ్లారని.. అదేరోజు రాత్రి సల్వీందర్ సింగే స్వయంగా ఫోన్ చేసి దర్గాను తెరిచి ఉంచాలని కోరారని చెప్పారు. అయితే తాను దర్గా మూసేసే టైమ్ అయిందని చెప్పినా సల్వీందర్ సింగ్ ఊరుకోలేదని..తెరచి ఉంచాల్సిందేనని ఆదేశించారని అన్నారని తెలియజేశారు. దీంతో సిల్విందర్ సింగ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. మరోవైపు సల్వీందర్ సింగ్ పై ఐఎస్ఐ అమ్మాయిల ఎర వేసిందన్న దిశలో కూడా విచారించగా సల్వీందర్ సింగ్ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడినట్టు ఎన్ఐఏ తెలుపుతోంది. అంతేకాదు సల్వీందర్ సింగ్ గతంలో లేడి కానిస్టేబుళ్లను కూడా లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇంకా పలు విషయాలు తెలియాల్సి అవసరం ఉంది. ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని సల్విందర్ సింగ్ చెబుతున్నా అతని మాటల్లో ఎంత వరకూ నిజం ఉంది? ఇంకా ఉగ్రవాదుల ముప్పు ఉందని అలర్ట్ చేసిన ప్రాంతానికి సల్విందర్ సింగ్ ఎందుకు వెళ్లారు.. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలకు సల్విందర్ సింగ్ సమాధానాలు చెప్పాల్సి ఉంది. మరి ముందు ముందు విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. మొత్తానికి ఇంటి దొంగను ఈశ్వరుడైన పసిగట్టలేడు అన్న చందాన మన ఇంటి దొంగను మనమే పట్టుకోలేనట్టయింది.

చంద్రబాబుకి తలనొప్పిగా.. అప్పుడు వాళ్లిద్దరు.. ఇప్పుడు వీళ్లు

ఈమధ్య టీడీపీ పార్టీల్లో నేతల మధ్య బేధాభిప్రాయాలు ఎక్కువయ్యాయి. మొన్నటి వరకూ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ల మధ్య వివాదాలు అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు కొత్తగా స్పీకర్, యనమల వంతు మొదలైంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఇద్దరి మధ్య గొడవ ఏంటంటే.. అసంబ్లీ సమావేశాల గురించి. స్పీకర్ కోడెల న‌వ్యాంధ్ర‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు.. మొన్న జరిగిన శీతాకాల సమావేశాలు కూడా నవ్యాంధ్రలోనే జరగాలని అనుకున్నారు.. కానీ అది కుదరలేదు. అదే సమయంలో సమయంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ అనుకున్నారు. అయితే చంద్ర‌బాబు అక్క‌డ స‌మావేశాలు పెడితే విద్యార్థుల చ‌దువుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని..అలాగే ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావించిన చంద్ర‌బాబు ఇందుకు సుముఖత తెలపలేదు. ఇక ఇదే అసెంబ్లీ విషయంలో యనమల బడ్జెట్ సమావేశాలు వైజాగ్ లో జరపాలని భావిస్తున్నట్టు ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి. దీంతో స్పీకర్ యనమల తనతో సంప్రదించకుండా ప్రకటన చేశారని నొచ్చుకున్నారంట. దీంతో ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య చిన్న గ్యాప్ వచ్చిందట. ఏదో చిన్న నేతలైతే సర్ది చెప్పొచ్చుకాని.. ఇద్దరు సీనియర్ నేతలను చెప్పాలంటే కొంచెం కష్టమైన పనే. మరి వారిమధ్య విబేధాలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి. ఇదిలా ఉండగా ఏపీలో సమావేశాలు జరగాలని స్పీకర్ కోరిన మేరకు చంద్రబాబు కూడా దానికి సముఖత తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఖర్చు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోవాలని కూడా సూచించారట. దీంతో ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 23నుంచి మంగ‌ళ‌గిరి స‌మీపంలో ఉన్న హాయ్‌లాండ్‌లో జ‌రిగే అవ‌కాశం ఉన్నట్టు సమాచారం.

రెంటికి చెడ్డ రేవ‌డిలా ఆదినారాయ‌ణ‌రెడ్డి..

క‌డ‌ప జిల్లా జ‌మ్ముల‌మ‌డుగు వైకాపా ఎమ్మెల్యే  ఆదినారాయ‌ణ‌రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా అయింది. ఎప్పటినుండో టీడీపీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఆదినారాయణరెడ్డికి మాత్రం ఇప్పటి వరకూ ఎంట్రీకి ఛాన్స్ మాత్రం రాలేదు. అయితే ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి టీడీపీ సీనియర్ నేత పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ రామ‌సుబ్బారెడ్డి మాత్రం ఒప్పుకోవడంలేదు. ఇదే విషయాన్ని ఆయన అధినేత చంద్రబాబుకు కూడా చెప్పారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణ రెడ్డి ఎంట్రీపై డైలమాలో పడ్డారు. దీంతో రామ‌సుబ్బారెడ్డి ఒత్తిడితో ఆదినారాయ‌ణ‌రెడ్డిని టీడీపీలో చేర్చుకునే విష‌యంలో టీడీపీ వెన‌క్కు త‌గ్గిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆది నారయణ రెడ్డి కనుక వస్తే తాను వైసీపీ లోకి వెళతానని కూడా బెదిరించారట రామ‌సుబ్బారెడ్డి. ఇక తన ఎంట్రీకి రామ సుబ్బారెడ్డి అడ్డుపడుతున్నాడని గమనించిన ఆదినారాయణరెడ్డి లాభం లేదని టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నాన‌ని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అయినా కూడా ఆదినారాయణరెడ్డి ఎంట్రీకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు టీడీపీలో చేరాల‌ని తాము ఎవ్వ‌రిని ఆహ్వానించ‌లేద‌ని…అది కేవ‌లం మీడియా సృష్టే అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు జగన్ కూడా ఆదినారాయణ రెడ్డి టీడీపీ చేరికపై స్పందిచినట్టు తెలుస్తోంది. ఇటీవల జ‌మ్ముల‌మ‌డుగు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన జగన్ పార్టీ నుండి ఎవరు వెళ్లిపోయినా పర్వాలేదు..ఉన్న‌వాళ్లే నావాళ్లు అని పరోక్షంగా ఆదినారాయ‌ణ‌రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆదినారాయణరెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రాక.. ఇటు వైసీపీ కి కూడా చేరువ కాలేక ఎటూ తేల్చుకోలేక రెంటికి చెడ్డ రేవ‌డిలా అయింది.

వైకాపాలో చేరనున్న దాసరి నారాయణ రావు

  మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు వైకాపాలో చేరబోతున్నారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇవ్వాళ్ళ తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ లోని దాసరి నారాయణ రావు నివాసానికి వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అది కేవలం మర్యాదపూర్వక సమావేశమే అని దాసరి నారాయణ రావు చెప్పుకొన్నప్పటికీ, ఆయన వైకాపాలో చేరబోతున్నట్లు వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దృవీకరించారు.   ఈ సందర్భంగా దాసరి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. నాకు ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డితో కూడా మంచి అనుబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా గొప్ప నాయకుడిగా ఎదగాలని నేను కోరుకొంటున్నాను. ఆయనకి నా ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి,” అని అన్నారు.   దాసరి నారాయణ రావుని ఇంత అకస్మాత్తుగా వైకాపాలో చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం అందుకోసం ఆయన స్వయంగా దాసరి ఇంటికి వెళ్లి కలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని  వైకాపా వైపు తిప్పుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ వంటి నేతలు అనేకమంది పార్టీలో ఉన్నారు. దాసరిని కూడా చేర్చుకొంటే ఆ వర్గానికి చెందిన పెద్దమనుషులు అనేకమంది వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని జగన్ భావిస్తున్నారేమో? 

విజయవాడ తిరిగివచ్చిన మల్లాది విష్ణు

  ఎట్టకేలకు విజయవాడ నగర కాంగ్రెస్ అద్యక్షుడు మల్లాది విష్ణు తన నెలరోజుల అజ్ఞాతవాసం ముగించుకొని ఈరోజు ఉదయం విజయవాడలోని తన స్వగృహం చేరుకొన్నారు. కృష్ణ లంకలో ఆయనకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంటులో కల్తీ మద్యం త్రాగి డిశంబర్ 8వ తేదీన ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఆయనను కూడా నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్దపడటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన విజయవాడ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కానీ దానిని కోర్టు తిరస్కరించింది. రేపటిలోగా లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఆయన ఇవ్వాళ్ళ నగరానికి తిరిగి వచ్చేరు.   ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధము లేకపోయినా రేపు కృష్ణలంక పోలీసుల ముందు లొంగిపోయి, ఈ కేసు విచారణకు అన్ని విధాల సహకరిస్తానని మీడియాకి చెప్పారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి అన్ని నిజాలు బయటపెడతానని చెప్పారు. స్వర్ణా బార్ అండ్ రెస్టారెంటులో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు మరణించిన వెంటనే, ఆ బార్ తో తనకు ఎటువంటి సంబంధము లేదని, అది తన బంధువులదని వాదించారు. కానీ పోలీసుల విచారణలో ఆ బార్ లైసెన్స్ మల్లాది విష్ణు కుటుంబీకుల పేరిటే ఉన్నట్లు కనుగొన్నారు. ఎక్సయిజ్స్ శాఖ దానిని ద్రువీకరించింది. అప్పుడే ఆయనను ఈ కేసులో తొమ్మిదవ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసారు. అప్పటి నుండి అజ్ఞాతంగ గడిపిన మల్లాది విష్ణు ఇప్పుడు కూడా తనకు ఆ బార్ కి, కల్తీ మద్యం మృతుల కేసుకి ఎటువంటి సంబంధం లేదని వాదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సంబంధం లేదనప్పుడు మరి ఇన్నాళ్ళు పోలీసులకి భయపడి దాక్కోవడం ఎందుకో?

జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో ముగింపు?

  జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా 45 రోజులలో పూర్తయ్యే ఎన్నికల ప్రక్రియను కేవలం 15 రోజులలోనే పూర్తి చేసేవిధంగా చట్ట సవరణలు చేసింది. దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుండి కేవలం 15 రోజులలోనే ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన మూడురోజులలోగా అభ్యర్ధులు నామినేషన్లు వేయడం నాల్గవ రోజున వాటి పరిశీలన, ఆ మరునాడు ఒక్కరోజే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలు పూర్తిచేయవలసి ఉంటుంది.   నేడో రేపో జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని వార్తలు వస్తున్న నేపద్యంలో ఒకవేళ ఇవ్వాళ్ళ అది వెలువడినట్లయితే, ఈ నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగించవలసి ఉంటుంది. జనవరి 15లోగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. అదే కనుక జరిగితే హైదరాబాద్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు ఎవరూ ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆ సమయంలో సంక్రాంతి పండుగకి తమతమ స్వస్థలాలు వెళ్లి ఉంటారు.   అందుకే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను ఈనెల 28వ తేదీన నిర్వహించాలనుకొంటున్నట్లు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. ఆంధ్రా ఓటర్ల ఓట్లతోనే తమ పార్టీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలుస్తుందని మంత్రి కె.టి.ఆర్. చెపుతున్నారు. ఒకవేళ అదే నిజమనుకొంటే ఎన్నికలకు నోటిఫికేషన్ సంక్రాంతి పండుగ తరువాతనే ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే ఆంధ్రా ఓటర్లు ఈ ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఇంత ఆకస్మికంగా ఎన్నికల నిర్వహణ చట్టానికి సవరణలు చేయడం వలన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఈ ఎన్నికలకి తెరాస దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్దంగా ఉంది. కానీ తెదేపా, బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇంకా దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ నేడోరేపో నోటిఫికేషన్ విడుదలయినట్లయితే అవి తమ అభ్యర్ధుల పేర్లను హడావుడిగా ఖరారు చేసుకోవలసి రావచ్చును. అదే జరిగితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాసదే పైచెయ్యి అవుతుంది.

ఇరాన్ తో దౌత్య సంబంధాలు త్రెంచుకొన్న సౌదీ అరేబియా

  సౌదీ అరేబియా ఇరాన్ తో దౌత్య సంబంధాలు త్రెంచుకొంటున్నట్లు నిన్న ప్రకటించింది. సౌదీలోని ఆ దేశ రాయబారికి ఈ విషయం తెలియజేసి, 48గంటలలోగా సౌదీలోని ఇరాన్ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసివెళ్లిపోవాలని కోరింది. మొన్న శనివారంనాడు సౌదీ అరేబియాలో 47మందికి బహిరంగంగా తలలు నరికి మరణశిక్ష అమలుచేసారు. వారిలో షియా వర్గానికి చెందిన షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్, మరో ఇద్దరికి మరణశిక్ష అమలుచేసింది. సున్నీ మతస్తులు అధికంగా ఉన్న సౌదీలో మైనార్టీ షియా తెగ ముస్లింల కూడా సమాన హక్కులు కావాలని షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్ చెందిన వర్గంవారు సుమారు పదేళ్ళ క్రిందట నిరసనలు తెలియజేశారు. ఆ సందర్భంగా వారికీ పోలీసులకి మధ్య ఘర్షణలో కొందరు పోలీసులు మరణించారు. వారి నిరసనలను తిరుగుబాటుగా భావించిన సౌదీ ప్రభుత్వం అనేకమందిని అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిని మొన్న బహిరంగంగా శిరచేధనం చేసింది.   షియా ముస్లింలుండే ఇరాన్ దేశం అందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ రాజకుటుంబం కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఇరాన్ షియా ముస్లిం మతపెద్ద ఆయతొల్లా అలి ఖెమైనీ హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ఆ మరణశిక్షను నిరసించారు. షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్ మరణశిక్ష విధించినందుకు తీవ్ర ఆగ్రహం చెందిన తెహ్రాన్ నగరంలో ప్రజలు అక్కడి సౌదీ దౌత్యకార్యాలయంపై దాడి చేశారు.   ఈ సంఘటనల కారణంగా ఇరాన్ తో సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు త్రెంచుకొంటున్నట్లు ప్రకటించింది. తమదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఉపేక్షించమని ఇరాన్ కోరడం చాలా అనుచితంగా ఉందని సౌదీ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌదీ నిర్ణయాన్ని ఇరాన్ తో బాటు అమెరికా కూడా తప్పు పట్టింది. ఇరుగుపొరుగు దేశాలతో బలమయిన దౌత్యసంబంధాలు కలిగి ఉన్నప్పుడే ఎటువంటి సమస్యలనయినా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది,” అని అమెరికా అభిప్రాయపడింది.

త్వరలో రాహుల్ గాంధికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు?

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధికి త్వరలో పార్టీ పగ్గాలు అప్పగించడానికి పార్టీలో సన్నాహాలు మొదలయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇదివరకే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతుంటే పార్టీలో నేతలు అభ్యంతరాలు చెప్పినందుకు ఆయన పార్టీ మీద అలిగి విదేశాలకు వెళ్లిపోయారని వార్తలు వచ్చేయి. మళ్ళీ ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళుతున్నారో ఆయన చెప్పకపోయినా బహుశః మళ్ళీ అదే కారణంతో వెళ్లి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన విదేశాలు వెళ్ళగానే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాకు ఈవిధంగా లీకులు ఇవ్వడంతో ఆ అనుమానాలు నిజమేనని నమ్మవలసివస్తోంది.   ఆయన జనవరి 8 తరువాత భారత్ తిరిగి వస్తారని వారు చెపుతున్నారు. ఆయన రాగానే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు చెపుతున్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినందునే ఆయన పార్టీపై అలిగి విదేశాలకు వెళ్లిపోయినపుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి సుముఖంగానే ఉన్నారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.