చదువు' కొనేందుకు ' కిడ్నీ విక్రయం

  తల్లిదండ్రులు బాగా చదువుకోమని చెప్పి,పెద్ద చదువులు చెప్పిస్తుంటే, చదవడానికి ఇబ్బంది పడేవారందరూ తెలుసుకోవాల్సిన దయనీయ గాథ ఇది. ఆ కుర్రాడికి చదువంటే ప్రాణం..అతని కష్టానికి ఫలితంగా ఐఐటీలో సీటు లభించింది..కానీ సరస్వతీ కటాక్షం ఉన్న ఆ అబ్బాయికి,లక్ష్మీ కటాక్షం లేదు..చదువు పూర్తి చేయడానికి,అతని ఆర్ధిక పరిస్ధితి అడ్డుపడింది..చదువు మీద ప్రేమ చంపుకోలేక,తన కిడ్నీనే అమ్మాలనుకున్నాడు..ఇంతలోనే ఓ సంఘటన అతని జీవితంలో మార్పు తెచ్చింది..   మహేశ్,.వారణాసికి చెందిన దళిత విద్యార్థి. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా చదువులో మాత్రం టాపర్.. కష్టపడి ఐఐటీ భువనేశ్వర్‌లో సీటు సంపాదించాడు. కానీ చదవడానికి ఆర్థిక స్థోమత చాలలేదు. దీంతో దాదాపు రెండు లక్షలు అప్పు చేసి చదువుకున్నాడు..కానీ ఆ అప్పును తీర్చే మార్గం అతనికి కనబడలేదు..దాంతో తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు..మూత్రపిండాలు అమ్మాలనుకుంటున్నాను,తీసుకుని డబ్బులివ్వండి అంటూ చాలా ఆసుపత్రులు తిరిగాడు..కానీ అతని కిడ్నీ ఎవరూ తీసుకోలేదు..   ప్రస్తుతం ఐఐటీ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్‌ తన చదువు కోసం 2.7లక్షలు లోన్‌ తీసుకున్నా,అతని చికిత్స కోసమే డబ్బులో సగం ఖర్చయ్యేది. చదువు కొనసాగించడానికి డబ్బులేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆఖరిని రాజస్థాన్‌లోని అల్వార్‌లో రోడ్లు కూడా వూడ్చాడు. తన బతుకుపై విరక్తి కలిగి చనిపోవాలని ఉందంటూ ఎన్నోసార్లు స్నేహితులతో చెప్పుకుని కుమిలిపోయాడు.ఇలా ఎన్నో ఒడిదుడుకులతో సాగుతున్న మహేశ్‌ జీవితంలో అనుకోకుండా, ప్రముఖ సామాజికవేత్త సందీప్‌ పాండే రూపంలో సాయం దొరికింది.మరికొంతమంది విద్యార్థుల నుంచి నిధులు కూడా సేకరించి మహేశ్‌ అప్పును తీర్చేశాడు.   మహేశ్‌ తండ్రికి పక్షవాతం రావడంతో తల్లే పాచిపని చేస్తూ ఇంటిని నెట్టుకొస్తోంది. అప్పు అయితే తీర్చగలిగాడు కానీ ఇంకా కూలీ పని చేస్తూనే ఇటు చదువు, అటు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. తన వంటి పేదల్లో,చదువుకోవాలన్నా వీలుపడక,జీవితంపై విరక్తి కలిగి కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే, చాలా తక్కువ మందికి మాత్రమే, సాయం లభిస్తోందని బాధపడుతున్నాడు మహేశ్.ఇలాంటి పేద సరస్వతీ పుత్రులను ఆదుకోకపోతే,దేశం ఎంతో మంది భవిష్య పౌరులను నష్టపోవాల్సి వస్తుందంటూ, ఆవేదన చెందుతున్నాడు.

లోకేశ్ చేతిలో వైసీపీ నేతల జుట్టు.. నిజమా..?

దేవుడి చుట్టూ ప్రదిక్షణాలు చేస్తే కనీసం పుణ్యం వస్తుంది.. కానీ పాపం వైసీపీ నేతలకు ఆ ఛాన్స్ కూడా లేదు.. ఎందుకంటే వారు ప్రదిక్షణాలు చేస్తున్నారు కానీ.. అది దేవుని చుట్టూ కాదు జైళ్ల చుట్టూ.. పాపం ప్రస్తుతానికి ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఈ పార్టీలోని నేతలందరూ వరుస పెట్టి కేసుల్లో ఇరుక్కొంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆపార్టీకి చెందిన మిథున్ రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే పోలీసులు ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి.. ఈయక గారి దూకుడికి తగ్గట్టే పలు కేసుల్లో కేసులు నమోదయి.. ఆ కేసుల్లో భాగంగా జైళ్ల చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. అయితే వీరు ఇలా తీరిక లేకుండా జైళ్ల చుట్టూ తిరగడానికి గల కారణం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబుకి అంత తీరిక లేదని.. ఏపీ అభివృద్ది చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలతో బిజీగా ఉన్నారని.. అయితే దీనికి చంద్రబాబు కారణం కాదు కానీ.. కొడుకు లోకేశ్ కే కారణమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో టీడీపీ నేతలపై దూకుడిగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల గురించి రిపోర్టు తెప్పించుకొని మరీ యాక్షన్ తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాదు అందరి సంగతేమో కానీ చెవిరెడ్డి విషయంలో మాత్రం లోకేశ్ కాన్సట్రేషన్ పెట్టి రఫ్పాడించేందుకు చిత్తూరు - నెల్లూరు పోలీసులకు లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కానీ దీనికి లోకేశ్ మాత్రం ఈ విషయానికి నాకు సంబంధం లేదని ఖండిస్తున్నా తాను చేసిన ఒక వ్యాఖ్య వల్ల అది నిజమనే తెలుస్తోంది. అదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వరుసగా కేసులు పెట్టి జైళ్ల చుట్టు తిప్పడంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన  గత ప్రభుత్వాలు పెట్టిన కేసులే చెవిరెడ్డిపై 45 ఉన్నాయని అందుకే జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అంతే లోకేశ్ నెంబరు తోసహా చెబుతుంటే సరికి అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇంత కరెక్ట్ గా నెంబరు తోసహా చెబుతుంటే లోకేశ్ మొత్తం రిపోర్టు తెప్పించుకుని ఆడిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమేంతుందో తెలియదుకాని ఈ వార్తల వల్ల వైసీపీ నేతలు మాత్రం కాస్త ఆలర్ట్ అయ్యారంట. మొత్తానికి లోకేశ్ కు వైసీపీ నేతల పిలకలు బానే దొరికినట్టున్నాయి.  

పాపం జగన్ కు బ్యాడ్ డేస్..?

ప్రస్తుతానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయనే చెప్పొచ్చు. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అధికార పార్టీపై ఎత్తు గడలు వేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవడం సరికదా రివర్స్ లో అధికార పార్టీ పన్నే వ్యూహాల్లో ఈజీగా పార్టీ నేతలు చిక్కుకుంటున్నారు. కారణమేదైనా కానీ గత కొంతకాలంగా జగన్ కు వరుస పెట్టి చిక్కులు ఎదురవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కూడా పార్టీ నేతల వల్ల.  కొద్ది రోజుల క్రితం గుడివాడ‌లో పార్టీ కార్యాల‌యం ఖాళీ చేసే విష‌యంలో ఎమ్మెల్యే కొడాలి నానికి.. టీడీపీ కి మధ్య వాగ్వాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని అరెస్ట‌య్యారు కూడా. ఈ వ్యవహారంతో మొదలైన తల నొప్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దాని తరువాత తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన హడావుడికి గాను పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక చెవిరెడ్డి సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూనే ఉంటాడు.  సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదు అయిన కేసులో పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కటకటాల పాలయ్యారు. దీంతో పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్ నుండి పీలేరు.. పీలేరు నుండి నెల్లూరు తిప్పుతూ ఆడుకుంటున్నారు. ఇంకో నేత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రహదారుల నిర్మాణం అడ్డుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. ఇలా వరుసపెట్టి పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నందుకు జగన్ కు ఏం చేయాలో అర్ధంకావట్లేదట. ఇదిలా ఉండగా జగన్ పార్టీ గురించి.. పార్టీ నేతల గురించి చాలా హాస్యాస్పదంగా మాట్లాడుకున్నాయి రాజకీయ వర్గాలు. తమ పార్టీ అధినేతే కేసులంటూ తిరుగుతున్నాడు.. ఇప్పుడు తమ పార్టీ అధినేత బాటలోనే నేతలు కూడా నడుస్తున్నారని అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్ మేలుకోవాలని.. ఓదార్పు యాత్రలంటూ తాను తిరుగుతుంటే ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో అని అనుకుంటున్నారు. మరి జగన్ ఏం చేస్తాడో చూడాలి.

రోహిత్ మరణం.. ఇవి సామాన్యుల ప్రశ్నలు..!

ఇప్పుడు విశ్వం చూపంతా భాగ్యనగర విశ్వవిద్యాలయంపైనే -  పోయిన పసిప్రాణం మీదే...వచ్చిన ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అగ్నికి ఆజ్యం పోసి వెళిపోతున్నవారే...ఆర్పే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు...దీని మూలంగా ఎన్ని జీవితాలు రగులుతాయో ఆలోచించేవారేరి...?? కాని కొన్ని సందేహాలు ..ప్రశ్నలు గా మారి ..సామాన్యులని ఇబ్బంది పెడుతున్నాయి... అందులో మొదటిది 1. జరిగిన ఓ విషాధ ఘటనకి దళిత వర్ణం అద్ది... మంత్రి ఇంటిపైకి జనాలని ఉసిగొల్పిన జాగృతి దళ నేతలంతా ఇప్పుడు మూగ వారైపోయారేం...?? 2. కూతురు రగిల్చిన మంటలు ఆర్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి , అతని అనుచరులు వర్గం చోద్యం చూస్తున్నారేం ...?? ౩. అసలింత జరుగుతున్నా ... ఆ రాష్ట్ర హోం మినిష్టర్ ఏ ప్రకటనా చేయకపోవటంలో ఆంతర్యం ఏమిటి...?? 4. ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చి మూలాలు తెలుసుకోకుండా మాట్లాడి వెళ్ళిపోయారు గానీ - ఇక్కడ ఆ పార్టీ పెద్దలు ఉత్తమ్ కుమార్ , దానం , మధుయాష్కీ , వీహెచ్ ల నాలుకలు కదలటం లేదేం...?? 5. పఠాన్ కోట్ , మాల్దా ల గురించి అడిగినప్పుడు నేను ఆ రాష్ట్రం వాడిని కాదు నాకేంటి సంబంధం అన్న కేజ్రీవాల్ ... ఇంత ఇదిగా లగెత్తుకుని ఎందుకొచ్చాడు...?? 6. ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు తూతూమంత్రంగా వచ్చి హడావిడి చేసి పోయాడే గానీ - ఈ రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ ప్రతినిధులెవరూ నోరెత్తి మాట్లాడరేం...?? 7. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో లేకపోతే - ఆయన తరువాతే అన్నీ తానే ... అనే ఆయన కుమారుడైనా మాట్లాడిలిగా ... ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ?? 8. యూపీలో ఎందరో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని నిత్యం వార్తలొస్తున్నా పట్టించుకోని మాయావతి ఇక్కడ విషయంపై ఎందుకు మాట్లాడుతుందో...?? 9. కమ్యూనిస్టుల పిల్లలెవరూ ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనరో  - ఎరక్కపోయి ఇరుక్కుపోయి ఊపిరిపోగొట్టుకుంటున్న అమాయక పేద పిల్లలకి తెలుసా...?? సామాన్య ప్రజలే కాదు - కనీసం .... వీళ్ళంతా తమని ఉద్ధరించడానికే ఆగమేఘాలపై వచ్చారని భ్రమ పడుతున్న  దళిత విద్యార్ధులు కూడా ఆలోచించలేకపోతున్నారేం...?? ఎందుకంటే - ఇక్కడ ఎవడిగోల వాడిది...గ్రేటర్ ఎలక్షన్లు అనేవే లేకపోయుంటే... ఒక్కడు కాదు మరో వంద మంది చనిపోయినా ఏ ఒక్కడూ గుమ్మం కూడా కదిలేవాడు కాదు. ప్రపంచం చూపంతా ఓ ఘటనపై నిలిచేలా చేసి ...పెద్దలంతా ప్రపంచానికి కనపడనీయకుండా చాప క్రింద నీరులా చక్కబెడుతున్న ఘనకార్యాలేమిటో ??

అయ్యో ఏ కైసే హోగయా మోదీ జీ

మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య బాగా డల్‌ అయిపోయారండీ.. ఎందుకంటే.. 56 ఇంచులున్న ఆయన చెస్ట్‌ సైజు ఇప్పుడు 50 ఇంచులకు పడిపోయిందట. వామ్మో ఎంత డేంజరో కదా..  హెల్త్‌ ప్రాబ్లమ్‌ ఏమీ లేదంట. కంగారు పడాల్సిందేమీ లేదు. అయినా ఒక్కసారిగా అంత తగ్గిపోతే.. ఇంకేమైనా ఉందా.. పాపం. మోదీజీ ఏ  కైసే హోగయా జీ అని.. ఆయన ఫ్రెండ్సంతా గుడ్డుపై ఈకలు పీకినట్టు.. లాజిక్కులు అడుగుతున్నారంట.. ఎన్నికలప్పుడు ఫుల్‌ జోష్‌తో ఉన్న నరేంద్రుడు.. ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. మెల్లగా మోడీకి రాష్ట్రాల ఎన్నికల వేడి తగలడం మొదలయ్యాక ఇలా ఇంచులకొద్దీ కరిగిపోతున్నారు పాపం.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ క్రేజీగా గెలిచేశారు.. దేశ రాజధానిలో విచ్చుకోవాల్సిన కమలం పువ్వు కకావికలమయ్యేసరికి.. సార్‌  చెస్టు, ఠపీమని ఒక ఇంచు తగ్గిపోయిందట.   ఆ తర్వాత బీహార్‌ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేసరికి.. ఆయన మరింత కుంగిపోయారట. దాంతో ఇంకో ఇంచు కూడా సారీ చెప్పేసి సెలవు తీసుకుందట. ఇలా వన్‌ బై వన్‌ ఇన్సిడెంట్లు జరగడం.. ఇంచ్‌ బై ఇంచ్‌ కరిగిపోవడం.. మోదీ గారికి చాలా బాధ కలిగిస్తోంది.. ఏం చేద్దాం.. వీటితో పాటు పాక్‌ ప్రెసిడెంట్‌ నవాజ్‌ షరీఫ్‌తో భేటీ, పఠాన్‌ కోట్‌ ఎపిసోడ్‌ ఆయన బాడీపై వెయిట్‌ పెంచాయంట. ఇలా ఒక్కో ఇన్సిడెంట్తో ఒక్కో ఇంచ్‌ తగ్గుకూ 56 నుంచి 50 ఇంచులకు చెస్ట్‌ సైజు పడిపోయింది. అయినా మోదీ గారిని ఇంత బాగా వాచ్‌ చేస్తున్నది ఎవరో తెలుసా.. ఇంకెవరు..  క్లాసికల్‌ మహారాజా ఆఫ్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మిస్టర్‌ రాహుల్‌ గాంధీయే.. ఆయన చెస్ట్‌ సైజును బాగా అబ్జర్వ్‌ చేసి.. ఇలా అనలైజ్‌ చేశారు మరి.. రాహుల్‌ జీ మీరెంత గొప్ప మాస్టరో.. ఇంకా పార్లమెంటులో ల్యాండ్‌ అక్విజైషన్‌ బిల్లు కూడా పాస్‌ కాలేదు.. ఈ బిల్లు కావాలంటే..మామూలు విషయమా అప్పుడే ఏమైంది.. ఇన్‌ ఫ్రంటాఫ్‌ క్రోకొడైల్‌ ఫెస్టివల్‌ అని రాహుల్‌ మోదీ ఛాతీపై కూర్చుని కొలతలేస్తున్నట్టున్నారు.   రాబోయే పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అస్సాం ఎన్నికల్లో కూడా ఇదే సీన్‌ రిపీటైతే.. మోదీ చెస్ట్‌.. 50 ఇంచుల నుంచి 5.6 ఇంచులకు పడిపోతుందని. కావాలంటే మీరే చూడండని రాహుల్‌ జీ భలే ఖుషీగా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో రాహుల్‌ చేసిన ఈ కామెంట్లో షికారు చేస్తున్నాయి.. ఏమైనా రాహుల్‌లో కూడా మాంచి కమెడియన్‌ ఉన్నాడు.

"కాపు" కోసం చంద్రబాబు కాపు..?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్టు వార్తాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న వేళ ఇంత సడెన్ గా ఆయన సింగపూర్ వెళ్లడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారా..? అని లేక రాజకీయంగా వెళ్లారా అని అనుకుంటున్న వేళ పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సింగపూర్ లో కలుసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే సింగపూర్లో కలుసుకున్న వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారా అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎక్కడా కాకుండా.. సింగపూర్ వెళ్లి మరీ అంత చర్చించుకోవాల్సిన విషయం ఏంటని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎన్నికల నేపథ్యానికి గురించి వీరు మాట్లాడుకున్నారని.. ముద్రగడ పద్మనాభం నిర్వహిస్తున్న కాపు గర్జనకు కాపులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిన చంద్రబాబు… ఈ అంశానికి సంబంధించే పవన్ తో చర్చలు జరిపి ఉంటారని పలువురు భావిస్తున్నారు. పవన్ సహకారంతో కాపులు అటు వైపు మళ్లకుండా టీడీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు నిజంగానే పవన్ సింగపూర్లో చంద్రబాబుతో భేటీ ఆయ్యారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే పవన్ సింగపూర్ వెళ్లడం మాత్రం నిజం. మరి దీని గురించి తెలియాలంటే చంద్రబాబు కాని.. పవన్ కాని ఇద్దర్లో ఎవరో ఒకళ్లు నోరు విప్పాల్సిందే..

ఇదెక్కడి గోల రా బాబు..!

ఈ మధ్య కాలంలో అందరికి మంచి హాట్ టాపిక్ గా నిలిచిన మేటర్ ఏంటంటే.. అది జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్యల వివాదం అని టక్కున చెప్పొచ్చు. అలా ఇప్పుడు బాబాయ్ తోనే ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. అది కూడా టీ టీడీపీ నేతల వల్ల. అది కూడా తనకు ఏమాత్రం సంబంధం లేకుండా.. దీనంతటికి కారణం గ్రేటర్ ఎన్నికలు కావడం విశేషం. ఏపీ లో అధికారంలో ఉన్న టీ టీడీపీ కి అక్కడ ఎలాంటి డోకా లేదనే చెప్పొచ్చు. అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంది. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుపు పంథాలో దూసుకుపోతుంది. ఆ పార్టీని అధిగమించాలంటే మిగిలిన పార్టీలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ టీడీపీ పరిస్థితి వేరు. ప్రస్తుతానికి నాయ‌కుల మ‌ధ్య విభేదాలతో.. తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఇక్కడ పరిస్థితిపపై శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు తెలంగాణలో పార్టీ కోసం పనిచేసి.. పార్టీలో పున‌రుత్తేజాన్ని నెలకొల్పే నేత కోసం కొంద‌రు ఎదురుచూస్తున్నారట. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నేత ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. అంతేకాదు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ టీడీపీ బాధ్య‌త‌లు ఎన్టీఆర్‌కి అప్ప‌గించాల‌ని కొంత‌మంది టీడీపీ నాయ‌కులు ఏకంగా పార్టీ కార్యాల‌యంలోనే ధ‌ర్నాచేశారు. అక్కడితో ఆగకుండా..అక్కడున్న లోకేష్ కటౌట్లను, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసినట్లు చూపించే ఫ్లెక్సీలను చించేశారట. గ్రేటర్ టికెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు, నాయకులు సీట్లు అమ్ముకోవడం వంటివాటిపై విచారణ జరిపించాలని అందులో కోరారట. అసలు తనకు ఏమాత్రం సంబంధం లేని ఈ వివాదంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తనపాటికి తాను నాన్న‌కు ప్రేమ‌తో సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. తనను ఈరొంపులోకి లాగడం ఏంటని.. ఇప్పటికే బాబాయ్‌తో విభేదాలున్నాయ‌న్న కార‌ణంగా.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య ఏంటని.. అనవసరంగా ఎన్టీఆర్ ను ఆ వివాదంలోకి లాగుతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

రాహుల్‌ వాటీజ్‌ దిస్

 ఓ వారసత్వపు  మేధావి దేశాన్ని ఏలాలని ఆరాటపడుతున్నాడు. కానీ.. ఎప్పుడు ఏమీ చేయాలో తెలియక సతమతమవుతుంటాడు.. అయినా అంతా  సరిగ్గానే చేశానని బిల్డప్పులిస్తుంటాడు..  ఆ  మేధావి ఎవరో ప్రత్యేకం గా చెప్పాలా ?  .. దాద్రీలో  గొడవపై నో రియాక్షన్‌.. చివరకు వరంగల్‌ ఉప ఎన్నిక సమయంలో తమ పార్టీ అభ్యర్థి  ఇంట్లో జరిగిన ఘోరంపైనా స్పందించని గొప్ప రాజకీయనేత.  అప్పట్లో వరంగల్లో ఘటన జరిగింది కూడా దళితుడి ఇంట్లోనే.. రాజయ్య కోడలు బిసి అయినా.. మన దేశంలో పెళ్లితర్వాత భర్త పేరును బట్టే భార్య ఇంటిపేరు కూడా మారుతుంది.  అలా చూసినప్పుడు  రాజయ్య కోడలు కూడా దళితురాలే.. ఆమెతో పాటు చనిపోయిన ముగ్గురు ముద్దులొలికే అభం శుభం తెలియని చిన్నారులు కూడా దళితులే.. మరి వీళ్లను పలకరించడానికి ఆనాడు రాహుల్‌ రాలేదే. మరిప్పుడు మాత్రం రోహిత్‌ మరణ వార్త తెలియగానే. ఆగమేఘాల మీద, ప్రత్యేక విమానంలో రావడానికి గల కారణమేంటో ? అంటూ జనాలు చెవులు కొరుక్కోవటం కాదు, ఏకంగా  సోషల్ మీడియా లో కోడై కూస్తున్నారు ..చదువుకున్న మేధావి ఏం చేసినా చెల్లుతుంది. పైగా రాజకీయాల్లో ఉంటే ఇంకా బాగా చెల్లుబాటవుతుంది అంటూ పెదవులు విరుస్తున్నారు . వాటీజ్‌ దిస్‌ రాహుల్‌ జీ...ఏదన్నా చేసేముందు కాస్త వెనకా ముందు ఆలోచించు అంటూ కొంచం ఘాటు గానే విమర్శిస్తున్నారు. అయినా , ఏమయినా రాహుల్ తోచిందే చేస్తాడు, అనిపించిందే చెప్తాడు..అది తనని , తన పార్టీ ని ఎంత అభాసుపాలు చేసినా కాని. ఇబ్బందులు పెట్టినా కాని. దట్ ఈస్ రాహుల్ .

ఆవిషయంలో కేసీఆర్ చంద్రబాబునే అధిగమించేశారు..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని ఉపయోగించడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అందరికి తెలిసిన విషయమే. అలా టెక్నాలజీని ఉపయోగించుకొని.. అభివృద్ధి పంథాలో దూసుకెళుతుంటారు చంద్రబాబు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ విభాగం అంత అభివృద్ది చెందడానికి.. హైదరాబాద్ గురించి పలు దేశాలు చెప్పుకోవడానికి కారణం ఎవరంటే ముందు చెప్పేది చంద్రబాబు గురించే. అందుకే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు పేరు అందరికి తెలుసు.   అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబును ఒక విషయంలో అధిగమించారంట. అదేంటీ అనుకుంటున్నారా.. ఇంతకీ విషయం ఏంటంటే. ఇప్పటి వరకూ ఆన్ లైన్ పాపులారిటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుంటే ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబును అధిగమించి ముందున్నార‌ట. ఈవిషయం ఎవరో కాదు గూగుల్ ట్రెండ్సే చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ పాపులారిటీ ఎక్కువైందనే చెప్పొచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రెడిట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన చేపట్టిన ఆయుత చండీయాగం గురించి కూడా మీడియా అంతా పాపుల‌ర్ అయిపోయారు. అంతేకాదు సింగపూర్, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో కూడా కేసీఆర్ గురించి సెర్చ్ చేశారంట. దీంతో ఆన్ లైన్ పాపులారిటీలో కేసీఆర్ చంద్రబాబును మించిపోయారు. మొత్తానికి రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతున్న ఇద్దరు సీఎంలు.. ఇలా ఆన్ లైన్ పాపులారిటీలో కూడా పోటీ పడుతున్నారన్నమాట. మరి కేసీఆర్ ను ఈసారి చంద్రబాబు అధిగమిస్తారో లేదో చూద్దాం..

ఎంపీ గారి పదవికి చిక్కులు.. సర్వే ప్లాన్ పారుద్దా..?

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీచేసి పసునూరి దయాకర్ రావు ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంపీగారి పదవికి చిక్కులొచ్చి పడ్డాయా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 2014 లో వరంగల్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. అయితే తరువాత ఆయనను డిప్యూటీ సీఎం చేయడం.. అనంతరం ఆపదవికి ఆయన రాజీనామా చేయడంతో వరంగల్ ఉపఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎల్ తరుపున పసునూరి దయాకర్ రావును బరిలో దింపారు కేసీఆర్. అందరూ అనుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీనే లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఉపఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన పసునూరి దయాకర్‌కు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని, ఆ స్థానం నుంచి తాను గెలుపొందినట్లుగా ప్రకటించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నామినేషన్‌ దాఖలు నాటికి దయాకర్‌కు ప్రభుత్వ సంస్థ భారత్‌ పెట్రోలియంతో ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్‌గా కాంట్రాక్టు ఉందని.. ప్రభుత్వరంగ సంస్థలతో కాంట్రాక్టు ఒప్పందం ఉన్న వ్యక్తులు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951,సెక్షన్‌ 9ఏ కింద ఎన్నికలలో పోటీకి అనర్హులని పిటిషన్లో పేర్కొన్నాడు. సర్వే నారాయణ కాంగ్రెస్ పార్టీ తరుపున వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అసలు మొదట రాజయ్యకు ఎంపీ టికెట్ ఇవ్వగా.. కొన్ని అనుకొని పరిణామాల వల్ల ఆ టికెట్ సర్వేకు ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన సర్వే రెండో స్థానంలో గెలుపొందాడు. మరి సర్వే చెప్పినట్టు పసునూరి గురించి నిజ నిజాలు తెలియాలంటే కోర్టులో విచారణ జరగాల్సిందే. ఒకవేళ అది నిజమని తెలిస్తే దయాకర్ కు పదవి గండం మాత్రం తప్పదు. మరి ఈలోపు అధికార పార్టీ సైలెంట్ గా ఉంటుందా.. ఏదో మతలబు చేసి అందులో నిజం లేదని చెప్పించినా చెప్పించవచ్చు.. చూద్దాం ఏం జరుగుతుందో.

ఇప్పుడు చెబుతున్న పాఠాలు అప్పుడు ఏమయ్యాయి రాహుల్..?

నరం లేని నాలుక ఎన్ని రకాలుగా అయిన మాట్లాడుతుంది అన్న సామెత మన రాజకీయ నేతలకు బాగా సూటవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు చూస్తే అలానే అనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. ఈసందర్భగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూనివర్శిటీకి వచ్చి రోహిత్ కుటుంబ సభ్యుల్ని.. విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ యూనివర్శిటీకీ చెందిన విద్యార్ది ఆత్మహత్య చేసుకుంటే వారికి సంబంధించిన వారిని పరామర్శించాల్సిన బాధ్యత వర్సటీ వీసీ మీద లేదా? అంటూ రాహుల్ ప్రశ్నించారు. అయితే రాహుల్ గాంధీ ప్రశ్నించినంత వరకూ బానే ఉంది కాని.. ఈ ప్రశ్న రాహుల్ గాంధీ వేయడంతో చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నందుకు రాహుల్ గాంధీ అంతలా రియాక్ట్ అయి ఇక్కడికి వచ్చి పరామర్శించారు..అలాంటిది తమ పార్టీ తరుపున ఎంతోమంది కార్యకర్తలు పలు సందర్బాల్లో మరణించారు కానీ వారిని పరామర్శించడానికి ఎన్నడూ రాలేదు.. అంతేకాదు గత పదియేళ్లు హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పడంలో సందేహం లేదు.. అలాంటి నేత ప్రమాదవశాత్తు మరణించారు. అలాంటి నేత మరణించినప్పుడు చాలా మంది కార్యకర్తలే మరణించారు. మరి అప్పుడు కనీసం ఒక్కరిని కూడా పరామర్శించలేదు సరికదా ఓదార్పు యాత్రలు మొదలు పెట్టిన జగన్ ను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆయనపై చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడలేదు. అలాంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఇలా మాట్లాడటం.. విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి నీతులు ఉన్నది చెప్పడానికే కాని పాటింటడానికి కాదు అన్నట్టు రాహుల్ గాంధీ ఇలాంటి నీతులు చెప్పెటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుందని అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

రోజాకు పోటీగా జయసుధ.. గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలనా..?

ముల్లును ముల్లుతోనే తీయాలి.. గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలి.. ఇదెక్కడి సామెత అనుకుంటున్నారా.. ప్రస్తుతం రాజకీయ వర్గాల టాక్ ఇదే. ఈ సామెత ప్రకారమే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా జయసుధను టీడీపీలోకి ఆహ్వానించినట్టు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. సినీ నటి జయసుధ గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ మద్దతుతో "మా" ఎన్నికల్లో నిలబడి  ప్రత్యర్ది సినీనటుడు రాజేంద్రప్రసాద్‌పై ఓటమిపాలైయ్యారు. ఇక ఆతరువాత నుండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిగా పనిచేస్తున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు టీడీపీ చేరికపై మురళీ మోహన్ ఆమెతో చర్చించడం.. టీడీపీలోకి చేరాలని కోరడంతో ఆమె కూడా దానికి అంగీకరించి టీడీపీలోకి చేరారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా జయసుధ ఎంట్రీకి ఏమాత్రం బ్రేక్ వేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గతంలో రోజా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండేవారు. ఆతరువాత రోజా పార్టీ మారిపోయారు. ఇక టీడీపీలో ఉన్న కవిత, మంత్రి పీతల సుజాత ఉన్నా.. వారు రోజాకు ధీటుగా విరుచుకుపడటానికి ప్రయత్నిస్తున్నా అవేమి వర్కవుట్ కావట్లేదు. జయప్రద కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసి..ఎంపిగా డిల్లీ స్దాయిలో వెళ్లారు. తరువాత మారిన రాజకీయ సమీకరణాలలో రోజా తెలుగుదేశం పార్టీకి దూరమై సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇక అందుకే గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలని చంద్రబాబు కూడా ఆలోచించి.. తమ పార్టీలోకి చేరాలనుకున్న జయసుధకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాదు  రోజాను ఢీకొట్టడానికి జయసుధను వాడుకోబోతున్నారంట.. ఈ నేపథ్యంలోనే ఆమెను ఏపీ రాజకీయల్లో కీలకంగా చేసి రోజాపై జయసుధను అ్రస్తంగా తయారు చేయటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి రోజా ముందు జయసుధ తట్టుకోగలదా.. రోజా మాటలకి జయసుధ అంతే ధీటుగా సమాధానం చెప్పగలదా.. చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా అన్న సందేహాలు వస్తున్నాయి. మరి చూద్దాం.. జయసుధ ఎలా రోజాను ఎదుర్కొంటుందో..

రేవంత్ రెడ్డి సీట్ల సర్దుబాటు.. చంద్రబాబు కంటే మొండిగా రేవంత్ రెడ్డి..!

తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో.. తను అనుకున్నది సాధించేవరకూ అంతే మొండిగా ఉంటాడు. గ్రేటర్ ఎన్నికల్లో ఇది ఇంకోసారి నిజం చేశాడు రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీలు సీట్ల సర్దుబాటు విజయవంతంగా అయిందని అందరికి తెలిసిందే. మొత్తం 150 డివిజన్లలో 90 స్థానాల్లో టీడీపీ.. 60 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు గాను ఒప్పందం కుదిరింది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్న అసలు ఉన్న మొత్తం డివిజన్లలో సగం సీట్లు తమకు కావాలని బీజేపీ మొదట పట్టు పట్టిందంట. కానీ దీనికి రేవంత్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలేదంట. మొదట్నుంచి టీఆర్ఎస్ పై విజయం సాధించాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో చాలా మొండిగా వ్యవహరించారంట. ఒకవేళ బీజేపీకి కనుక అడిగిన సీట్లు ఇస్తే తాను వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని.. ఎక్కువ సీట్లు బీజేపీకి ఇవ్వడం ద్వారా… టీడీపీ కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుందని… అప్పుడు తమలాంటి నేతలు పార్టీని నమ్ముకుని ఉన్నా పెద్ద ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి పార్టీ చంద్రబాబుకే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారంట. అంతేకాదు ఉన్న 150 డివిజన్లలో ఏ స్థానం నుండి బీజేపీ చేయాలని.. ఏ స్థానం నుండి టీడీపీ పోటీ చేయాలని అనేది కూడా రేవంత్ రెడ్డే డిసైడ్ చేశారంట. అంతేకాదు ఇదే విషయంపై బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు కంటే ఎక్కువగా రేవంత్ మొండిగా వ్యవహరించాడని.. లేకపోతే తమకు మరిన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం దక్కేదని బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ అన్నట్టు టాక్. మొత్తానికి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. మరి సీట్లు సర్దుబాటులో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. గెలుపు విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

పవన్ అడిగిన సీటు ఇస్తారా..? ప్రచారానికి వస్తారా..?

గ్రేటర్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ తన ప్రచారాన్ని షురూ చేశాయి. అయితే ఇప్పుడు అందరి సందేహం మాత్రం ఒక్కటే. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అని. ఎందుకంటే ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేని నేపథ్యంలో టీడీపీ బీజేపీ కూటమికి ఓటు వేయాలంటూ ఆయన బహిరంగంగా ప్రకటిస్తారో లేదో కూడా ఇరు పార్టీల నాయకులకు అర్థంకావడం లేదట. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 150 డివిజన్లు ఉండగా బీజేపీ-టీడీపీ పార్టీల సీట్ల సర్ధుబాటు జరిగింది. టీడీపీ 90 స్థానాలకు గాను.. బీజేపీ 60 స్థానాలకు గాను పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ  సన్నిహితులకు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో బాగంగానే జూబ్లీహిల్స్ డివిజన్ సీటును బీజేపీ టీడీపీ కూటమి తరపున తన సన్నిహితుడు సుభాష్ రెడ్డికి ఇప్పించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నారంట. అంతేకాదు ఈ విషయంపై గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ను ఫోన్ చేసి మరీ అడిగారట. అయితే ఆ సీటు బీజేపీకి ఇచ్చామని ఆయన చెప్పడంతో.. ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో మాట్లాడేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు పవన్ కోరిక మేరకు బీజేపీ అడిగిన ఒక్క టికెట్ ను ఇస్తుందా అని డౌట్. మరోవైపు పవన్ కోరితే  బీజేపీ కూడా అడ్డు చెప్పదని..ఆ సీటును ఆయన సన్నిహితుడికి ఇస్తుందని.. ఎలాగూ అతని గెలుపు బాధ్యతను పవన్ తీసుకుంటాడనే ధీమా ఆ పార్టీకి కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి బీజేపీ పవన్ అడిగిన టికెట్ ఇస్తుందా.. ఒకవేళ పవన్ అడిగిన టికెట్ ఇవ్వకపోతే పవన్ బీజేపీ-టీడీపీ తరపు ప్రచారానికి వస్తారా.. లేదా.. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ప్రచారానికి రానని చెబుతారా.. ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే వెయిట్ చేయాల్సిందే.

టీఆర్ఎస్..సీమాంధ్రులపై ఈరోజు ఉన్న ప్రేమ రేపు ఉంటుందా..?

నిన్న రైట్ అనిపించింది ఈరోజు తప్పు అవ్వచ్చు.. ఈరోజు తప్పనిపించింది రేపు రైటవ్వచ్చు.. ఇదేదో సినిమాలో డైలాగ్ లా అనిపిస్తుంది కదా.. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినైతే నిన్న మొన్నటి వరకూ తిట్టారో.. ఎవరి మీద కోపంతో ప్రత్యేకరాష్ట్రం కోరారో అలాంటి వారు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలపై విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు. దీనంతటికి కారణం గ్రేటర్ ఎన్నికలు. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల సంగతేమే కాని టీఆర్ఎస్ పార్టీ మాత్రం సీమాంధ్ర ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకున్న కేటీఆర్ అయితే అందరి కంటే కొంచం ఎక్కువ ప్రేమనే కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లు ఉండగా అందులో 15 మంది సీమాంధ్రులకు టీఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. తమ పార్టీ స్థాపించిన ఇన్నేళ్లో ఎప్పుడూ సీమాంధ్రులకు టికెట్లు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు మాత్రం 15 టికెట్లును సీమాంధ్రులకు కేటాయించారు. అది కూడా సీమాంధ్రుల ఓట్లు ఎక్కువ ఉన్న డివిజన్లలో..తమకు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన సమర్థులైన 15 మందిని ఎంపిక చేసి..కూకట్ పల్లి - అమీర్ పేట - సోమాజిగూడ - మియాపూర్ - జూబ్లీహిల్స్ - వెంగళరావు నగర్ - లాంటి సీమాంధ్రుల ప్రభావం ఉన్న డివిజన్లలో రంగలోకి దించడానికి రెడీ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ డివిజన్ల గెలుపు తమదే అని ధీమాగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసారిగా షాకయ్యేలా చేశారు. మరోవైపు అభ్యర్ధుల్ని పోటీలోకి దించినా.. గెలవాలి కదా అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. మరి ఇప్పుడైతే సీమాంధ్రుల మీద బానే ప్రేమ కురిపిస్తున్న అధికార పార్టీ తరువాత భవిష్యత్ లో కూడా ఇలానే ఉంటుందా..? హైదరాబాద్ లో ఉన్న వారంతా ఒక్కటే.. ఇక్కడున్నవారందరూ హైదరాబాదీయులే సెటిలర్లు కాదు అని.. ఆ మాటకొస్తే నేను కూడా సెటిలర్ నే.. నాది సిద్దిపేట అని మాటలు చెప్పిన కేటీఆర్ ఆ తరువాత కూడా అలాగే ఉంటారా.. ఇప్పుడు చూపిస్తుంది ఉత్తుత్తి ప్రేమ.. లేక నిజమైన ప్రేమనా..?ఇవన్నీ తెలియాలంటే ఇంకా చాలా రోజులు ఆగాల్సిందే.

ఎర్రబెల్లి ఖాతాలో మరో శత్రువు..

టీడీపీలో రోజుకో సమస్య తలెత్తుతుంది. ఒక సమస్య అయిపోయింది అంటే మరో సమస్య వెంటనే తెరపైకి వస్తుంది. గతంలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య గొడవ.. వారి గొడవ కాస్త నెమ్మదించగా.. ఇటీవల స్పీకర్ కోడెల.. యనమల రామకృష్ణ మధ్య విభేధాలు.. ఇప్పుడు తాజాగా కొత్త ఇన్‌చార్జులను ఎంపిక విషయంలో కష్టాలు వస్తున్నాయి. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో  ఆ నియోజకవర్గానికి ఇన్ చార్జీగా ఎవరు ఉండాలనే అంశంపై ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య వివాదం ఏర్పడింది. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన అల్లుడు మదన్ మోహన్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు ఇదే నియోజక వర్గానికి ఇన్‌చార్జ్ బాధ్యతను తాను చూస్తానని పెద్దిరెడ్డి పార్టీ నేతల సమావేశంలో చెప్పారంట. అంతేకాదు తనకు కుకట్ పల్లి ఇన్ చార్జి బాధ్య‌తలు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి హెచ్చరించారట. దీంతో ఇప్పుడు ఈ నియోజక వర్గానికి ఇంఛార్జ్ బాధ్యతల విషయంలో టీడీపీకి కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఎన్నికల వరకూ ఈ ఇద్దరు నేతలు కలిసి ఇంఛార్జ్ బాద్యతలు చూసుకోవాలని.. ఆతరువాత నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారట. ఇదిలా ఉండగా ఎర్రబెల్లి ఖాతాలో మరో శత్రువు వచ్చి చేరినట్టుయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పోరు సాగుతుంది ఇప్పుడు మళ్లీ పెద్దిరెడ్డి రూపంలో మరో శత్రువు వచ్చి చేరినట్టయిందని రాజకీయ వర్గాలు చర్చింకుంటున్నాయి.

టీడీపీలోకి మైసూరా..? ప్రత్యేక రాయలసీన ఉద్యమం ఏమైందో..!

కొంతమంది నేతలు ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్లు పెట్టి.. అనవసరంగా హంగామా చేసి నాలుగు మాటలు మాట్లాడి ఫేమస్ అయిపోదామని చూస్తారు. అలాంటి వారిలో వైసీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ ముఖ్యమంత్రి అమరావతి రాజధానిపైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు అంటూ.. రాయలసీమను పట్టించుకోవడం లేదని.. రాయలసీమకు అన్యాయం జరగనివ్వం.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. కానీ ఎవరిమీదైతే విమర్శలు చేశారో ఇప్పుడు అదే పార్టీలో చేరడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటూ కొన్నిరోజులు హడావుడి చేసిన వైసీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ పార్టీలో తనకు అంత ప్రాధాన్య ఇవ్వకపోవడం.. అందునా తనకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించినా అది కూడా వచ్చే అవకాశం లేనందున మైసూరా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. దీంతో కనీసం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పేరుతో అయిన కాస్త పేరు తెచ్చుకుందామని అనుకున్నా ఓ రెండు రోజులు దాని గురించి హడావుడి చేశారు అంతే.. తరువాత అది కూడా మరిచిపోయారు. ఇక ఇవేమి వర్కవుట్ కావని అనుకున్నారేమో వేరే పార్టీలోకి జంప్ అవుదామని చూస్తున్నారంట. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో చేరుడానికి మైసూరారెడ్డి చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో కంటే టీడీపీలో ఉంటేనే మేలని ఆయన ఈ నిర్ణయానికి వచ్చారంట. అంతేకాదు వైసీపీ పై ఉన్న అసంతృప్తి కారణంగా మైసూరాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారంట. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేశ్ మైసూరాను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంట. దీనిలో భాగంగానే మైసూరా గురించి చంద్రబాబుతో కూడా చర్చించినట్టు.. మైసూరాతో జగన్ కు చెక్ చెప్పొచ్చని చెప్పడంతో చంద్రబాబు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు కావాలంటే మైసూరాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి కూడా చంద్రబాబు అంగీకరించారని సమాచారం. మరోవైపు మైసూరా టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా అలర్ట్ అయి మైసూరాను బుజ్జగించే పనిలో పడ్డారంట. మొత్తానికి ఇప్పటికే చాలామంది వైసీపీని వీడుతున్న తరుణంలో ఇప్పుడు మైసూరా కూడా వైసీపీని వీడితే జగన్ కు మరో షాక్ తగిలినట్టే. ఇక మైసూరా రెడ్డి విషయమైతే ప్రత్యేక ఉద్యమం అన్న మైసూరా ఇప్పుడు ఆ సంగతేమైంది.. రెండు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసిన మైసురా పాపం ఇప్పుడు పార్టీ మారే పరిస్థితి వచ్చింది అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

కేసీఆర్ కంటే కేటీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి.. ఆయన వాక్చాతుర్యం గురించి.. ఆయన మాటలకు ఉన్న పదును గురించి రాజకీయానుభవం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. తన మాటలతోనే ప్రజలను ఆకర్షిస్తారు కేసీఆర్. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేసీఆర్ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తుంది. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపిస్తున్నాడు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే. గ్రేటర్ ఎన్నికల పూర్తి బాధ్యతను కేటీఆర్ తన భుజాల పై వేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేటీఆర్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభల్లో కేటీఆర్ ప్రసంగాలు చూస్తుంటే సీమాంధ్రులను ఆకట్టుకోవడానికి బానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. తాను భీమవరం నుండి పోటీ చేస్తానని సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీనిపై విమర్శలు కూడా అలానే తలెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు అయితే ఉద్యమంలో సీమాంధ్రులను ఏకిపారేసిన కేసీఆర్ అండ్ టీం ఇప్పుడు ఓట్ల కోసం ఇలా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. దీంతో ఒకానొక సందర్భంలో కేసీఆర్ కూడా కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వీటన్నింటికి విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలకు గాను కేటీఆర్ ఇచ్చిన క్లారిటీ చూస్తుంటే అందరూ షాకవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోణంలోనే తమ మాటలు ఆచరణలు ఉంటున్నాయని అన్నారు. అంతేకాదు ఉద్యమ సమయంలో సీమాంధ్రులు కూడా మమ్మల్ని విమర్సించారు కాబట్టి మేము విమర్శించాము.. అంతేకాని మాకు ఎవరిపై ద్వేషాలు లేవు అంటూ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా హైదరాబాదీయులేనని.. ఇక్కడ సెటిలర్లు అంటూ ఎవరూ లేరని.. ఆ మాటకొస్తే మేము కూడా సెటిలర్లమే.. మా సొంత ఊరు సిద్దిపేట అని చెప్పుకొచ్చారు. మొత్తానికి కేటీఆర్ తన తండ్రి దగ్గర రాజకీయ పాఠాలు బాగానే నేర్చుకున్నట్టున్నారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న విషయం బాగా వంటపట్టినట్టుంది. మరి ముందు ముందు ఇంకెలా మాట్లాడుతారో చూద్దాం.

కేటీఆర్ ది అతి విశ్యాసమా? ఆత్మవిశ్వాసమా..?

తాను ఏమాత్రం తక్కువ కాదని.. తనకూ పార్టీని గెలిపించే సత్తా ఉందని నిరూపించుకోవడానికేమో కానీ గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కొడుకు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కాస్త దూకుడుగానే ప్రవరిస్తున్నారు. అంతేకాదు తన తండ్రికి కాని.. బావ హరీశ్ కు కాని ఛాన్స్ ఇవ్వకుండా గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకన్నాడు. అయితే గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ల ఓట్లు పడాలంటే కాస్త కష్టపడాల్సిందే. ఎందుకంటే ఉద్యమ సమయంలో సీమాంధ్రులను తిట్టిన తిట్లు అలాంటివి మరి. అలాంటప్పుడు సెటిలర్లు మనసు గెలిచి వారి ఓట్లు సంపాదించి గెలవాలంటే కాస్త రిస్కే. అయితే కేటీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని అప్పుడే జోస్యం కూడా చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా మొత్తం 150 డివిజన్లు ఉండగా అందులో వంద డివిజన్లలో తమ పార్టీ గెలుస్తుందని..  ఒకవేళ గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పుడు కేటీఆర్ విసిరిన సవాల్ పైనే అసలు చర్చంతా జరుగుతుంది. గెలుపుపై అంత ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే తన మంత్రి పదవికి నిజంగానే రాజీనామా చేస్తారా అని అందరి ప్రశ్న. ఆవేశంగా కేటీఆర్ అయితే సవాల్ చేశారు.. మరి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందా.. కేసీఆర్.. హరీశ్ రావు అంటే రాజకీయ ఉద్దండులు కాబట్టి వారి వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునేవారు.. మరి కేటీఆర్ కూడా సెటిలర్ల మనసును గెలుచుకోగలరా.. గెలిచి తమ గెలుపును కైవసం చేసుకోగలరా.. ఇదంతా కేటీఆర్ అతి విశ్యాసమా.. లేక ఆత్మవిశ్వాసమా అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా కండీషనల్ సవాల్ అని… ఇతర పార్టీల నాయకులు తన సవాల్ ను ఒప్పుకోలేదు కాబట్టి తాను కూడా దాన్ని లైట్ తీసుకున్నానని కేటీఆర్ అనే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరి కేటీఆర్ సవాల్ గురించి ఏది తెలియాలన్న ఎన్నికలు అవ్వాల్సిందే.. ఫలితాలు రావాల్సిందే.. అప్పటి వరకూ ఆగాల్సిందే.