ఎర్రకార్డు చూపించినందుకు ప్రాణాలు తీశాడు

  ఫుట్ బాల్ ఆడేటప్పుడు రిఫరీ ఎర్రకార్డుని చూపిస్తే ఏ ఆటగాడికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ఆటగాడు తక్షణం ఆట నుంచి తప్పుకోవలసి వస్తుంది. అతని బదులు మరో ఆటగాడితో ఆటని కొనసాగించే అవకాశం కూడా సదరు జట్టుకి ఉండదు. అర్జెంటీనాలో ఇలాగే ఒక ఆటగాడికి ఎర్రకార్డుని చూసి కోపం వచ్చింది. అంతే నేరుగా తన సంచిలో ఉన్న పిస్తోలుని తీసి ‘సీజర్ ఫ్లోర్స్‌’ అనే రిఫెరీని కాల్చిపారేశాడు. నేరుగా తలలోకీ, గుండెల్లోనూ తూటాలు దూసుకుపోవడంతో రిఫరీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అర్జెంటీనా దేశంలోని యువతకు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం. తిండీతిప్పలు లేకపోయిన ఫుట్‌బాల్ లేకపోతే తట్టుకోలేరు. అందుకనే ఆ దేశం ఫుట్ బాల్ ప్రపంచకప్‌ని రెండుసార్ల కైవసం చేసుకుంది. ఫుట్ బాల్ పట్ల ఆ దేశ యువతలో ఉన్న ఇలాంటి వ్యామోహమే తరచూ ప్రాణాంతకమైన గొడవలకు కూడా దారి తీస్తుంది. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లతో బాహాబాహీకి తలపడటం, రిఫరీ తనకి అనుకూలంగా లేడని అతని మీద ముష్టిఘాతాలు కురిపించడం... వంటి సంఘటనలు అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. పోయిన ఏడాది ఒక రిఫరీ ఇలాగే ఆటగాళ్ల దబ్బలకు తాళలేక కోమాలోకి జారిపోయాడు.

సర్దార్జీ జోకులని ఎలా ఆపగలం- సుప్రీంకోర్టు!

  సర్దార్జీల గురించి మనకు తెలియదు. మనలో చాలామందికి సిక్కులతో పరిచయమూ లేదు. కానీ సర్దార్జీల మీద వచ్చే జోకులని మాత్రం బాగా ఆస్వాదిస్తాం. పదేపదే చదువుకుని పడీపడీ నవ్వుకుంటాం. దేశమంతా ఇలా తాము నవ్వులపాలు కావడం చూసి సర్దార్జీలకి ఒళ్లు మండింది. తమని లక్ష్యంగా పెట్టుకుని వస్తున్న ఇలాంటి జోకులకు అడ్డుకట్ట వేయాలంటూ సుప్రీంకోర్టుని హర్వీందర్‌ చౌదురి అనే న్యాయవాది కేసుని దాఖలు చేశారు. సర్దార్జీలను అమయకులుగా, అసమర్ధులుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఇలాంటి జోకుల వల్ల... తమ పిల్లలు సిక్కులమని చెప్పుకోవడానికి కూడా అవమానపడుతున్నారన్నది చౌదురి వాదన.మొదట్లో ఈ కేసుని సుప్రీంకోర్టు తేలికగానే తీసుకుంది.   కానీ దిల్లీ సిక్కు గురుద్వారా కూడా ఈ కేసుకి తన మద్దతు తెలుపడంతో కేసుని విచారించక తప్పలేదు. కానీ ఈ విషయంలో న్యాయపరంగా తాము తీసుకోదగ్గ చర్యలు పెద్దగా ఏమీ ఉండబోవంటూ న్యాయస్థానం పెదవి విరిచింది. ‘సిక్కులంటే మాకు అపారమైన గౌరవం ఉంది. సిక్కులలో ఎందరో పెద్దలు మన దేశానికి వన్నె తెచ్చారు. కానీ ఇలాంటి జోకులను చట్టపరంగా ఎలా అడ్డుకోగలం. పైగా మీ వర్గానికి చెందిన కుష్వంత్‌ సింగ్‌ వంటి రచయితలే వీటికి ప్రచారాన్ని కల్పించారు.’ అంటూ సుప్రీం తన నిస్సహాయతను వెల్లడి చేసింది. కావాలంటే మీరే కొన్ని చర్యలను సూచించంది అంటూ ప్రతివాదులకు ఆరు వారాల గడువుని ఇచ్చింది.  

మరోసారి పేలిన శత్రుఘన్ సిన్హా

  బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన శత్రుఘన్‌ సిన్హా మరోసారి తన సొంత పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఈసారి నేరుగా జేఎనయూలో జరుగుతున్న వివాదం మీదే తన వాగ్బాణాలను గురిపెట్టారు. జెఎన్‌యూలో జాతివిద్రోహక చర్యలు సాగుతున్నాయనీ, అక్కడి విద్యార్థి నాయకుడు కన్నయా కుమార్‌ ఒక తీవ్రవాద అనుకూల కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొంటూ ప్రభుత్వం అతడిని నిర్బంధించిన విషయం తెలిసిందే. కానీ తాను కన్నయా కుమార్‌ ఉపన్యాసాన్ని విన్నాననీ, అతను అన్న మాటలలో తప్పేమీ తనకు కనిపించడం లేదనీ శత్రుఘన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.   ఓ పక్క బీజేపీ ఆనాటి విద్యార్థులని జాతివిద్రోహులుగా ముద్రవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, అది సరైన పద్ధతి కాదంటూ శత్రుఘన్‌ మండిపడ్డారు. ‘అలాంటి ఆరోపణలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, మన పిల్లల్లాంటివారి మీద అలాంటి ఆరోపణలు తగవనీ’ ట్వీటారు. పైగా కన్నయా కుమార్‌ తమ బీహార్‌ బాబనీ, ఆయన తొందరలోనే విడుదల కావలని కోరుకుంటున్నాననీ ట్విట్టర్‌ సాక్షిగా దేవుని ప్రార్థించారు. అసలే ఈ గొడవలోంచి ఎలా బయటపడదామా అని ప్రయత్నిస్తున్న బీజేపీ, ఇప్పుడు తన పార్టీ సహచరుడే అయిన శత్రుఘన్‌ చేస్తున్న వ్యాఖ్యలతో తలపోటు పట్టుకుంది. అలాగని ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిద్దామా అంటే, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న మనిషి, బయటకి వెళ్తే ఇంకేం అరుస్తారో అని భయం!  

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మిస్‌ఫైరింగ్ మిస్టరీ!

  నిన్న హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన మిస్‌ఫైరింగ్‌ మిస్టరీ ఇక వీడేటట్లు లేదు. పోలీసుకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అక్బర్‌కి గన్నులంటే మహా ముచ్చట. దానికి తోడు అతని పక్కనే ఉండే ఎమ్మెల్యే గనమెన్‌ చేతిలో ఎప్పుడూ తుపాకీ ఉండటంతో నిన్న దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించడం మొదలుపెట్టాడు. అది కాస్తా లోడ్‌ చేసి ఉండటంతో, మిస్‌ఫైర్‌ అయ్యింది. నేరుగా డ్రైవర్‌ గుండెల్లోకి దూసుకుపోయింది. కానీ ఈ సంఘటన గురించి చదువుతుంటే ఎవరికైనా కావల్సినన్ని అనుమానాలు కలుగక మానవు.   - అత్యవసర పరిస్థితుల్లో తప్ప లోడ్‌ చేసి ఉంచని తుపాకీని నిండుగా లోడ్‌ చేసి ఎందుకు ఉంచినట్లు.   - నిరంతరం సేఫ్టీలాక్‌లో ఉండాల్సిన గన్‌, ఫైరింగ్‌కి అనుకూలంగా ఎందుకు మారిపోయింది.   - లక్షల ఖరీదు చేసే ఆయుధాన్ని, అందులోనూ లోడ్ చేసి ప్రమాదకరంగా ఉన్నదాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలి వెళ్లినట్లు.   - గన్‌మేన్‌ రవీందర్‌కీ, డ్రైవరు అక్బరుకీ మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఉన్నాయని వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత!   - అనుకోకుండా తుపాకీని పేలిస్తే అది ఎదురుగా ఉన్నవారికి తగలాలి కానీ, తుపాకీని పట్టుకున్న వ్యక్తి గుండెల్లోకి దూసుకుపోవడం ఏంటి!   ప్రస్తుతం కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటంతో నిజానిజాలు ఏమిటో త్వరలోనే వెల్లడి కావచ్చు. అంతవరకూ ఈ మిస్‌ఫైరింగ్‌ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది!

డబ్బు ఎగ్గొట్టినవారి పేర్లు చెప్పండి- సుప్రీం కోర్టు!

  వేల రూపాయల రుణం కావాలంటే నానా ప్రశ్నలూ అడిగే బ్యాంకులు ఈ మధ్య వేల కో్ట్ల రుణాలని మాఫీ చేసేశాయి. 2013-1015 సంవత్సారాలకు మధ్య ఇలా లక్ష కోట్లకు పైగా డబ్బుని వదిలేసుకున్నాయి. ఈ పరిస్థితి చూసి సామాన్య మానవుడికే కాదు సుప్రీంకోర్టుకి కూడా ఒళ్లు మండినట్లుంది. రుణాలను ఎగ్గొట్టినవారిలో బడాబాబుల జాబితాను తన ముందు ఉంచమని రిజర్వ బ్యాంకును ఆదేశించింది సుప్రీం కోర్టు. 500 కోట్లకు మించి రుణాలను ఎగవేసిన వాళ్ల వివరాలు తనకి తెలియాల్సిందే అంది. గత అయిదు సంవత్సరాలుగా ఇలా ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలను ఎగవేసినవారి జాబితాను ఆరు వారాలలోగా తన ముందు ఉంచాలని నిర్దేశించింది. ఆడంబరమైన జీవితాన్ని గడుపుతూ ప్రభుత్వ రుణాలను ఎగ్గొట్టేవారిపై సుప్రీం కోర్టు ఈ సందర్భంగా విరుచుకుపడింది. మరి ఈ జాబితా తన ముందుకు వచ్చిన తరువాత ఉన్నత న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

ఫేస్‌బుక్‌ స్నేహితులే ఆమెను కిడ్నాప్‌ చేశారు

  ముక్కూ మొహం తెలియని వారిని ఫేస్‌బుక్‌లో స్నేహితులుగా అనుమతించేయడం, వారితో అతి చనువుని పెంచుకోవడం ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేందుకు మరో సంఘటన జరిగింది. గోవాకి చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయికి ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. నేరుగా నిన్ను చూడాలని ఉందంటూ ఓ చోటకి రమ్మన్నారు. తీరా అక్కడికి చేరుకున్న అమ్మాయిని ఒక తెల్లకారులోకి ఎక్కించి కిడ్నాప్‌ చేశారు. కాలేజీకని వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ కేసుని అన్ని కోణాలలోంచి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన పోలీసులకు ఎందుకనో ఆమె ఫేస్‌బుక్ మీద కూడా అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితుల ఫోటోలన్నీ ప్రింట్‌ అవుట్ తీసుకున్నారు. బాధితురాలిని చివరిసారిగా చూశామని చెబుతున్నవారికి సదరు ఫొటోలు చూపించడంతో నేరస్తుల గుట్టు రట్టయింది. కిడ్నాప్‌ అయిన కొన్ని గంటల తరువాత నిందితుల కారును పోలీసులు పట్టుకోగలిగారు. ఆ సమయంలో బాలిక కూడా వారితోనే ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారులో ఆమె మీద ఏదన్నా అఘాయిత్యానికి ఒడిగట్టారా అని ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఫేస్‌బుక్‌ స్నేహాల ఖాతాలో మరో ఘోరం నమోదైంది.  

రాహుల్‌గాంధి... మరో 3నెలలు బిజీ బిజీ!

  రాహుల్ గాంధి ఇప్పుడు మరో సమస్యని తలకెత్తుకున్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఆయన గిరిజనులని సంఘటితం చేయాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అటవీ చట్టాలను దుర్వినియోగం చేస్తోందనీ, తనకి తోచిన వారికి అటవీ భూములను కట్టబెడుతోందన్నది రాహుల్‌ గాంధి ఆరోపణ. ఇదే విషయాన్ని మరింత రాజకీయం చేసి, కాంగ్రెస్‌కు దూరమైన ఓటుబ్యాంకును తిరగి దక్కించుకోవాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఈమేరకు ఆయన తన సహచరులందరికీ తగిన సూచనలందించారట! ఇందుకోసం రాహుల్‌ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, మధ్యప్రదేశ్ వంటి ఆరు రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు సమాచారం.   మూడు నెలల పాటు ఆయన ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తూ, పాదయాత్రలు చేస్తూ, ఉపన్యాసాలు దంచేస్తూ బిజీ బిజీగా గడపనున్నట్లు సమాచారం. దేశంలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్న రాహుల్ ఈ సమస్య కోసమైన తుదివరకూ పోరాడతారా లేకపోతే మరో సమస్య రాగానే అక్కడికి ఎగిరిపోతారా అన్నది వేచి చూడాల్సిందే! ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే... రాహుల్‌ పర్యటించనున్న ఆరు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అడవులు విపరీతంగా ఉన్న హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల జోలికి ఆయన పోనే పోవడం లేదు. మరి రాహుల్ గాంధి అటవీభూముల గురించి ఆందోళనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లా లేక స్థానికంగా ఉన్న ప్రభుత్వాల మీద ఆందోళన రగిల్చేందుకు బయల్దేరుతున్నట్లా!

ప్రేమ కవితలతో వేధించిన శాస్ర్తవేత్త

      అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన పర్యావరణవేత్త ఆర్‌.కే.పచౌరీ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. The Energy and Resources Institute (TERI) అనే సంస్థకు డైరక్టరుగా ఉన్న పచౌరీ తన తోటి ఉద్యోగినులను లైంగికంగా వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే నిందితుడు చాలా ప్రముఖుడు కావడంతో ఇప్పటివరకూ అటు అధికారులూ, ఇటు సంస్థ యాజమాన్యం కూడా ఈ ఆరోపణలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. కానీ పచౌరీకి పాపం పండినట్లుంది.   గత నెల TERI ఆయన పదోన్నతి కల్పించడంతో, పచౌరీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వెల్లువెత్తాయి. దాంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేయక తప్పలేదు. ఇందులో భాగంగా పచౌరీ మీద లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక ఉద్యోగిన దాఖలు చేసిన కేసుకి సంబంధించి 500 పేజీల ఛార్జిషీటును తయారుచేశారట. ఇందులో పచౌరీ ఆమె కోసం ప్రేమను ఒలికిస్తూ పంపిన వేలాది ఫోన్‌ మెసేజిలూ, వాటికి ఆమె తిరస్కరణలూ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రేమ కవితలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఫిర్యాదు చేసిన ఉద్యోగిన వయసు 29 సంవత్సరాలు కాగా, పచౌరీగారి వయసు 75 ఏళ్లు. పిదపకాలం!

కాంగ్రెస్‌కు మరింత కష్టకాలం

నారాయణఖేడ్‌లో ఉప ఎన్నికల ఫలితం తెరాసకు అనుకూలంగా రాబోతోందన్న ఊహలు నిజమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఖేడ్‌లో ఉప ఎన్నికలను తెరాస నేత హరీశ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ మెజారటీతో ఆ పార్టీ విజయం దక్కించుకోనుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే ప్రకటించాయి. సాధారణంగా ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అతని వారసులను తదుపరి ఎన్నికలలో నిలబెట్టడం, సదరు వారసులు సునాయాసంగా సీటుని గెల్చుకోవడం జరుగుతాయి. కానీ కాంగ్రెస్ సీనియర్‌ ఎమ్మెల్యే మరణంతో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ రివాజుని తోసిరాజని తెరాస తన అభ్యర్థిని గెలిపించుకోనుంది. ఇప్పటికే గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్‌ తాను కేసీఆర్‌కు భావి వారసుడిగా ప్రచారాన్ని పొందారు. ఇప్పడు ఖేడ్‌ ఫలితం ద్వారా తాను ఇప్పటికీ తెరాస ముఖ్యనేతనే అని హరీశ్‌ నిరూపించబోతున్నారు. మరోపక్క ఖేడ్‌లో పరాజయం దక్కితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పరాజయాల పరంపర కొనసాగుతున్నట్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుని దక్కించుకోలేని పార్టీ, గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలని ఇంకేం నియంత్రించగలదని విశ్లేషకుల సందేహం. ఇప్పటికే దానం నాగేందర్‌ వంటి ప్రముఖుల తెరాసలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక జానారెడ్డి, వీ.హెచ్‌ వంటి నేతలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, వారి చిత్రమైన వ్యాఖ్యలతో తెరాసకే ప్రచారాన్ని అందిస్తున్నారు. మరి ఇకమీదట తెలంగాణలో కాంగ్రెస్‌కి జవజీవాలు కల్పించే సత్తా ఉన్న నేత ఎవరో!

తెదెపాతో బీజేపీ బంధం ముగిసిపోయిందా?

గ్రేటర్‌ ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాలను బీజేపీ ఇంకా జీర్ణించుకోనట్లుంది. త్వరలో జరగబోయే వరంగల్ నగర కార్పొరేషన్ ఎన్నికలకు సొంతంగానే పోటీ చేద్దామంటూ ఆ పార్టీ నాయకులు దిల్లీ పెద్దలకు కబురు పంపుతున్నారట. అంతేకాదు! వరంగల్‌ నగర పరిధిలోకి వచ్చే 58 డివిజన్లకు అభ్యర్ధులను కూడా ఖరారు చేసేసినట్లు సమాచారం. గ్రేటర్‌ ఎన్నికలలో తెదెపా వల్ల తమకు నష్టమే కానీ లాభం కలగలేదని స్థానిక నేతలు భావించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికలలో 63 వార్డులలో పోటీ చేసిన భాజపాకు 4 స్థానాలు దక్కగా, మిగతా 87 స్థానాలలో పోటీకి దిగిన తెదెపా కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. సీట్ల సర్దుబాటులో భాగంగా, తాము గెలిచే అవకాశాలు ఉన్న చోట్లను కూడా తెదెపా లాక్కొందని బీజేపీ ప్రధాన ఆరోపణ. మిగిలిన చోట్ల కూడా తెదెపా తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించలేదని, ఓటమి తరువాత ఒకరినొకరు ఓదార్చుకున్నారు బీజేపీ పెద్దలు. ఈ సందర్భంగా కలిసి ఉంటే ఎలాగూ విజయాలు దక్కడం లేదు కాబట్టి, వేర్వేరు కుంపట్లతోనే బరిలోకి దిగుదామని వారు తెదెపాకు సంకేతాలు పంపుతున్నారట. ఫలితాలు కలిసి వస్తే కూటమిగానే వరంగల్ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుందామని చెప్పకనే చెబుతున్నారట. ఈ స్నేహపూర్వక శత్రుత్వం ఎక్కడి వరకూ వెళ్తుందో, ఏ ఎన్నికలను ఎలా నడిపిస్తుందో చూడాలి మరి!

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా... ఓ తమిళ తంబి

అమెరికాలో ఉన్న భారతీయులు కేవలం చిన్నాచితకా స్థానాలతో సరిపెట్టుకోవడం లేదు. తమ ప్రతిభతో దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర గవర్నరులుగా, అధ్యక్షునికి సలహాదారుగా, రక్షణ రంగంలో కీలక సభ్యులుగా ఇప్పటికే వారు తామేమిటో నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి మరో పదవి చేరే అవకాశం ఉంది. భారతదేశంలో పుట్టన ‘పద్మనాభన్‌ శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌’ అనే తమిళుడు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాసన్‌ చిన్నతనంలోనే అతని కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. అక్కడే విద్యని పూర్తిచేసుకున్న శ్రీనివాసన్‌, గొప్ప న్యాయవాదిగా పేరు సంపాదించాడు. ఒబామా, జార్జ్‌ బుష్‌ ప్రభుత్వాల తరఫున ఎన్నో క్లిష్టమైన కేసులలో వాదించి ప్రభుత్వానికి మంచి పేరే తీసుకువచ్చారు. శ్రీనివాసన్‌ ప్రతిభను గుర్తించిన ఒబామా ప్రభుత్వం ఆయనను 2013లో కొలంబియాలోని ఒక న్యాయస్థానానికి, జడ్జిగా నియమించింది. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మంది న్యాయమూర్తులలో ఒకరైనా ‘ఎంటోనియన్‌ స్కాలియా’ అకస్మాత్తుగా మరణించడంతో, ఆ పదవి ఖాళీ అయ్యింది. ఒబామా సర్కారు ఆ పదవికి శ్రీనివాసన్‌ పేరుని సూచించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వ పంతమే నెగ్గితే కనుక ఆ పదవిని చేపట్టిన తొలి భారతీయునిగా శ్రీనివాసన్ మిగిలిపోతారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకాన్ని సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆ పదవి జీవితకాలం కొనసాగుతుంది. ఆ పదవిలో ఉండే వ్యక్తులు వెలువరించే తీర్పులు దేశప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరి కొన్ని దశాబ్దాల పాటు అమెరికా ప్రజల జీవితాలని శాసించే ఈ పదవి శ్రీనివాసన్‌ను వరిస్తుందో లేదో చూడాలి.

ICU లో అత్యాచారాలు

పసిపిల్లల మీదా, మానసిక వికలాంగుల మీదా అత్యాచారాలు జరిగిన వార్తలను విన్నాం. కానీ ఇప్పుడో మృగం హాస్పిటల్‌లోని ICU వార్డులలో ఉండే స్త్రీలని లక్ష్యంగా చేసుకుని సాగించిన దారుణాలు వెలికివస్తున్నాయి. దిల్లీకి కేవలం 30 కిలోమీటర్లు ఉండే బహదూర్‌ఘర్‌ అనే ఊరిలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆ ఊళ్లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ ముందు ఒక ఖరీదైన కారు అగింది. ఆ కారులోంచి ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి నేరుగా హాస్పిటల్లోని ICU వార్డులోకి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. డాక్టరేమో అని కొందరు, పేషెంటు తాలూకానేమో అని మరి కొందరు చూసి కూడా చూడనట్లు ఉండిపోయారు. నేరుగా ICUకి చేరుకున్న అతను అక్కడ నిస్సహాయంగా పడి ఉన్న ఒక పచ్చి బాలింతరాలి మీద తన అకృత్యాన్ని సాగించాడు. పని ముగిసిన తరువాత అంతే ఠీవిగా తిరిగి వెళ్లిపోయాడు. అక్కడితో అతని పైశాచికం ఆగలేదు. దగ్గరలో ఉన్న మరో హాస్పిటల్ లోపలికి వెళ్లి అక్కడా ఇలాంటి దారుణానికే ఒడిగట్టేందుకు చూశాడు. కానీ బాధితురాలు గట్టిగా అరవడంతో పారిపోయాడు. నిందితుడి మొహం ఆ రెండు ఆసుపత్రులలో ఉన్న సీసీ టీవీలలో రికార్డు కావడంతో అతణ్ని పట్టుకోవడం ఎలాగూ ఖాయం. కానీ ఆసుపత్రుల సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం మరో రూపంలో పొంచి ఉండదా అన్నదే రోగుల సందేహం. చీకటి పడేసరికి, పేషెంట్ల తాలూకు బంధువులు కూడా ఎవ్వరూ హాస్పిటల్లో ఉండకూడదంటూ తరిమేసే హాస్పిటల్‌ సిబ్బంది... అర్ధరాత్రి దాటాక వచ్చిన ఆ ఆగంతుకుని సాదరంగా లోపలికి పంపడం వెనుక ఉన్న నిర్లక్ష్యం సామాన్యమైనది కాదు! నిందితుడి వాలకం చూస్తే ఇదేమీ అతనికి కొత్త కాదేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.  మత్తులోనో, నిస్సహాయంగానో ఉన్న ఆడవారు గట్టిగా అరవలేరు అన్న ధీమాతో అతను సాగించిన పైశాచికానికి మృగాలు సైతం తలలు వంచుకుంటున్నాయి.

రాహుల్‌ రూటే సపరేటు!

రోహిత్ వేముల ఆత్మహత్య తరువాత హుటాహుటిన హైదరాబాదుకి ప్రత్యేక విమానంలో వచ్చి, సెంట్రల్‌ యూనివర్శటీ విద్యార్థులకు తన సానుభూతులను అందచేశారు రాహుల్. జాతిపిత గాంధిలాగానే రోహిత్‌ కూడా సంఘవిద్రోహ శక్తుల చేతిలో హతమయ్యారని వాపోయారు. ఇప్పుడు అదే రాహుల్‌ దిల్లీలో తన సానుభూతులను తెలియచేసేందుకు సిద్ధపడుతున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పాకిస్తాన్‌కీ, తీవ్రవాది అఫ్జల్ గురుకి అనుకూలంగా కొందరు విద్యార్థులు నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదానికి కారణమైన విద్యార్థులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇప్పడు వారందరికీ తన మద్దతును తెలిపేందుకు రాహుల్‌ గాంధి బయల్దేరుతున్నారట. ఈ దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉందనీ, దానిని ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందనీ రాహుల్‌ ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ భావస్వేచ్ఛ తీవ్రవాదులనీ, వారిని ప్రోత్సహించే దేశాలనీ పొగిడే స్థాయికి చేరుకుందని దిల్లీ సంఘటనతో దేశ ప్రజలకు దిమ్మతిరిగేలా అర్థమైంది. ఇలాంటి సందర్భంలో ఆచితూచి స్పందించాల్సిన రాహుల్‌ బాబు పోయి పోయి పాకిస్తాన్‌ భజనపరులకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారేమిటా అని కాకలు తీరిన కాంగ్రెస్ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి విలక్షణమైన పనులను చేయడంలో రాహుల్‌ గాంధి దిట్ట కదా! ఆయనను భావి ప్రధానిగా కొలుచుకుంటున్నవారికి ఆ విషయం తెలియదా ఏం?

చదువుకోండిరా బాబూ!

మన పెద్దవాళ్లని ఎవరనినన్నా కదిపితే... ‘అప్పట్లో మాకు చెప్పేవాళ్లు లేక సరిగా చదువుకుని ఏడవలేదు. కనీసం మీరన్నా బుద్ధిగా చదువుకోండిరా బాబూ!’ అని కళ్లెమ్మట నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తారు. కానీ చదువు సంగతి దేవుడెరుగు... అసలు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో యువత ఉంటే, దేశం ఎలా బాగుపడుతుంది? యువకులకు ఆవేశం ఉండటంలో తప్పు లేదు- అది వారి స్వభావం! మనుషులకు భావస్వేచ్ఛ ఉండటంలో తప్పులేదు- అది వారికి అవసరం! కానీ ఆ ఆవేశానికి ఒక దిశ అంటూ లేకపోతే, వారి భావస్వేచ్ఛలో విచక్షణ లేకపోతే? దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీని భావిస్తారు. ఇక్కడి ప్రాంగణంలో విద్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచనకీ అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే దిగ్విజయ్‌ సింగ్‌ మొదలుకొని సీతారాం ఏచూరి వరకూ వందలాది రాజకీయ నాయకులను ఈ దేశానికి అందించింది. కానీ అదే విశ్వవిద్యాలయం ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఫిబ్రవరి 9 2016 నాటికి అఫ్జల్ గురు అనే తీవ్రవాదిని ఉరితీసి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు అఫ్జల్‌ గురుకి అనుకూలంగా సభను నిర్వహించారన్నది ఒక ఆరోపణ. అఫ్జల్ గురు అమాయకుడేమీ కాదు... పాకిస్తాన్‌లో తీవ్రవాదుల దగ్గర ఓనమాలు నేర్చుకుని మన దేశపు పార్లమెంటు మీద దాడి చేసేందుకు సహకరించినవాడు. మరో దేశంలో ఇలాంటి పని చేస్తే ఎంత త్వరగా చర్యలు తీసుకుంటారో కానీ, మన దేశంలో అతనికి 12 సంవత్సరాల తరువాత 2013లో రహస్యంగా ఉరితీశారు. మనుషులని ఉరితీయడం అన్న సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించవచ్చు, అందులోనూ రహస్యంగా ఉరితీసిన విధానాన్ని నిరసించవచ్చు. కానీ... ‘నువ్వు (అఫ్జల్) తలపెట్టిన కార్యక్రమాన్ని మేం పూర్తి చేస్తాం’ అని ఎవరన్నా నినదిస్తే వారిని దేశద్రోహులుగా ఎందుకు భావించకూడదు. ‘భారతదేశం నాశనం అయ్యేదాకా, మేం పోరాడుతూనే ఉంటాం’ అని ఎవరన్నా ప్రతిజ్ఞ చేస్తే అది భావస్వేచ్ఛగా ఎలా అనుకోగలం. సరే! మనుషులన్నాక రకరకాలు ఉంటారు. అందులో కొందరికి అఫ్జల్‌గురు నచ్చవచ్చు. కానీ అలాంటి మనుషుల చుట్టూ అల్లుకుంటున్న రాజకీయమే ఇప్పుడు మరింత కలవరపరుస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా, అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం భావస్వేచ్ఛ అనీ, సహృద్భావ చర్చలో భాగం అనీ కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఖండించాల్సిన సందర్భంలో అలా చేయడం తమ పార్టీలకు అవమానంగా భావిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ దేశం గురించి మాట్లాడే హక్కు ఒక్క RSS, ABVP, BJP వంటి సంస్థలకు మాత్రమే లేదుకదా! మరి దేశభక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడితే అది BJPకి లాభపడుతుందనుకుని విభిన్నమైన స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నట్లు? దళితులకు అన్యాయం జరిగితే ఒక పార్టీ, అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక పార్టీ; దేశభక్తి గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ, దేశంలోని వివాదాల గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ... ఇలా ఈ దేశ ప్రజల్నీ, దేశ సమస్యలనీ... ఆఖరికి దేశభక్తిని కూడా పార్టీలవారీగా పంచేసుకున్నారా ఏంటి? రాజకీయ వేత్తల నుంచి ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలను ఆశించలేము. కానీ కనీసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులన్నా ఈ పరిస్థితి గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చినట్లుంది. తమ పిల్లలు లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధించాలనుకునే తల్లిదండ్రులు, ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి చేతులు దులిపేసుకునే ఉపాధ్యాయులూ... అసలైన బాధ్యత అది కాదనీ, ఒక మంచి పౌరుడిని ఈ దేశానికి అందించడంలోనే తమ జీవితానికి సార్థకత ఉందనీ గ్రహించాల్సిన సమయం వచ్చినట్లుంది. యాదృచ్ఛికమో మరేదో కానీ దిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ సభ జరిగిన రోజే సియాచిన్‌లో హనుమంతప్ప అనే సైనికుడు చావుబతుకుల మధ్య కనిపించాడు. దేశం కోసం 20000 అడుగుల ఎత్తున, -50 డిగ్రీల చలిలో, చావుతో సహజీవనం చేసే వేలాది సైనికులలో హనుమంతప్ప ఒకడు. అదృష్టమో, దురదృష్టమో కానీ హనుమంతప్ప మృత్యువుతో పోరాడుతూ దిల్లీలోనే చనిపోయాడు. అతనికి స్పృహ వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రజల కోసమా నా జీవితాన్ని అంకితం చేసింది అనుకునేవాడేమో కదా! చదువుకోండిరా బాబూ! మీరంతా మరో హనుమంతప్పలా మారనవసరం లేదు. కనీసం మన దేశాన్ని కాలపా కాస్తున్న సైనికులు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు తీసుకురాకండి.

చాప కింద నీరులా ఎర్రబెల్లి..

ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ఈయన పార్టీ మార్పుపై ఎప్పటినుండో వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఆయన టీఆర్ఎస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నా ఆయన మాత్రం వాటిని ఖండిస్తూనే వచ్చారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న అనంతరం ఆయన చాలా సైలెంట్ గా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. అయితే పార్టీలోకి ఆహ్వానించే వాళ్లు ఎంత మంది ఉన్నా.. సదరు వ్యక్తికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు కూడా ఉంటారు. అలానే టీఆర్ఎస్ లో కూడా అలాంటి వారు లేకపోలేదు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరకుండా ఎప్పటినుండో అడ్డుకుంటూ వస్తున్న రంగ‌ల్ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేత‌లు ఇప్పుడు ఎర్రబెల్లి చేరికతో ఖంగుతిన్నార‌ట‌. వారెవరోకాదు వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌. ఎందుకంటే ఎర్రబెల్లి చేరికతో ఎప్పటి నుండో మంత్రి పదవి ఆశిస్తున్న వారికి నోట్లో వెలక్కాయ పడినంత పనైంది. అంతేకాదు వీరిద్దరి స్థానంలో ఇప్పుడు ఎర్ర‌బెల్లి మంత్రి అవుతార‌న్న వార్త‌ల‌తో వీరు లోలోన ర‌గిలిపోతున్నార‌ట. మరోవైపు కేసీఆర్ కూడా ఎర్రబెల్లి తన సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న‌కు పెద్ద పీఠ‌వేశార‌ని.. ఇక డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రికి కూడా చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు జిల్లాలో చాలా రోజుల త‌ర్వాత ఎర్ర‌బెల్లి హ‌వా కొన‌సాగేందుకు కేసీఆర్ స్వ‌యంగా మార్గం సుగ‌మం చేస్తున్నార‌న్న టాక్ ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. మరి టీడీపీలో ఉన్నప్పుడు ఎర్రబెల్లికి అక్కడ ప్రాధాన్యత బానే ఉండేది. మరి టీఆర్ఎస్ కేసీఆర్ కూడా తనకు అలాంటి ప్రాధాన్యతే ఇస్త్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చాప కింద నీరులా టీఆర్ఎస్ లో కూడా ఎర్రబెల్లి తన మార్కును అలాగే కొనసాగించేలా ఉన్నారు. దీనిని టీఆర్ఎస్ నేతలు ఎలా జీర్ణించుకుంటారో చూద్దాం..

వేదాలకు లేని బాధ మీకెందుకు- సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించే విషయమై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది. వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ స్త్రీ, పురుషుల మధ్య వివక్షను చూపలేదనీ... అలాంటిది మీరు స్త్రీలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎందుకు అడ్డుపడుతున్నరంటూ ఆలయం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు స్పందిస్తూ శబరిమల ఆలయ బోర్డు తరఫున న్యాయవాది వేణుగోపాల్‌ ‘శబరిమలలో ఆడవారిని అనుమతించకపోవడం అనే ఆచారం దాదాపు వేయి సంవత్సరాల నుంచే ఉందనీ, ఇప్పడు అనవసరంగా దానిని మార్చవలసిన పనిలేదనీ’ వాదించారు. వేణుగోపాల్‌ వాదనలకు స్పందించిన న్యాయమూర్తులు... శబరిమలలో కొనసాగుతున్న ఆచారానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలనీ, ఆ ఆచారాన్ని మొదలుపెట్టేందుకు గల సహేతుకమైన కారణాలనీ ఆరువారాలలోగా కోర్టుకి సమర్పించమని కోరారు. శబరిమల ఆలయం తమకు సమర్పించే ఆధారాలని పరిశీలించిన తరువాత, అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామని న్యాయమూర్తులు తెలియచేశారు. తాము మతపరమైన సున్నిత అంశాల జోలికి పోమనీ, అయితే మరో వైపు రాజ్యాంగం కల్పించిన సమానహక్కులను కాపాడే బాధ్యతని కూడా విస్మరించమనీ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యల బట్టి చూస్తే, శబరిమల ఆలయంలో స్త్రీల ప్రవేశానికి కోర్టు సానుకూలంగానే తీర్పుని వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారతీయ విలేఖరి ప్రశ్నలతో ముషార్రఫ్‌కు అస్వస్థత

నిన్న పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌తో, ఇండియా టుడే విలేఖరి రాహుల్‌ కన్వల్‌ జరిపిన ఇంటర్వూలో అనేక సంచలనాత్మక విషయాలు వెల్లడైన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తీవ్రవాదానికి పాకిస్తాన్‌ ప్రోత్సాహం గురించి రాహుల్‌ కన్వల్‌ తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. పాకిస్తాన్‌ గూఢచర్య సంస్థ ISI తీవ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తోందన్న విషయాన్ని ముషార్రఫ్‌ తన జవాబులలో ఒప్పుకోక తప్పలేదు. ఇంతేకాదు! ముషార్రఫ్ మనసులో ఉన్న అనేక ద్వంద్వ విషయాలను రాహుల్‌ నేర్పుగా ప్రేక్షకుల ముందు ఉంచగలిగారు. సూటిగా వస్తున్న ప్రశ్నల నుంచి తప్పించుకునే దశలో ముషార్రఫ్‌ చాలా ఆగ్రహానికి లోనైనట్లు ఇంటర్వూలోనే కనిపించింది. భారతదేశం మీద దాడి చేసేవారు హీరోలనీ, పాకిస్తాన్‌ మీద దాడి చేసేవారు విలన్లనీ... ముషార్రఫ్‌ పొంతన పొసగని సమాధానాలు చెప్పారు. ఇంటర్వూ ముగిసే సమయానికి ప్రేక్షకులకి ముషార్రఫ్‌ ద్వారా, పాకిస్తాన్‌ పాలకుల ఆలోచనాతీరు ఎలా ఉందో తెలిసిపోయింది. దీంతో ముషార్రఫ్ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇంటర్వూ ముగియడంతోనే ఆయన రక్తపోటు పెరిగిపోయి, ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

పర్వేజ్ ముషార్రఫ్‌... నవ్విపోదురుగాక!

నిన్న ఒక భారతీయ వార్తా ఛానల్‌ ముందు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ సాగించిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు. ఒకపక్క పాకిస్తాన్‌ గూఢచర్య సంస్థ ISI తీవ్రవాదులకి శిక్షణ ఇస్తోందని నిర్భయంగా ఒప్పుకుంటూనే, పాకిస్తాన్‌లో అశాంతికి కారణం ఇండియానే అంటూ విరుచుకుపడ్డారు. ‘మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు’ కశ్మీర్ తీవ్రవాదానికి మద్దతు పలుకుతూనే, భారతదేశాన్ని ఆడిపోసుకున్నారు. పర్వేజ్ ముషార్రఫ్‌ ప్రకారం 'కశ్మీర్‌లో జరుగుతున్న భారత అకృత్యాలను ఎదుర్కొనేందుకు ఆ దేశ రక్షణ సంస్థలు జైష్‌-ఎ-మహమ్మద్, లష్కర్‌-ఏ-తయ్యబా వంటి తీవ్రవాద సంస్థలకి కావల్సిన సహకారాన్నంతా అందించాయి'. అంతేకాదు! ముషార్రఫ్ దృష్టిలో కశ్మీర్‌లో ఉన్న వేర్పాటువాదులంతా గొప్ప నాయకులు. వారు ముంబైలో దాడులు సాగించినా, వందల మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నా... భారత్‌ ఆ విషయాలను పెద్ద మనసుతో మర్చిపోవాలి. ‘పదే పదే మీరు ఇలాంటి సంఘటల గురించి మాట్లాడుతూ, శాంతి చర్చలకు దూరంగా ఎందుకు ఉంటారు’ అంటూ చిరాకుపడిపోయారు ముషార్రఫ్‌. అయితే తీవ్రవాదం గురించి ముషార్రఫ్‌కి ఓ లెక్కుంది. కశ్మీర్‌లోనో, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనో తీవ్రవాదులు దాడులకు తెగబడితే వారు హీరోలు. అదే తీవ్రవాదులు పాకిస్తాన్‌లో దాడులకు తెగబడితే వాళ్లు విలన్లు. ముషార్రఫ్ జిత్తులమారితనం ప్రపంచానికి కొత్తేమీ కాదు. కార్గిల్ పేరిట మన దేశాన్ని దొంగదెబ్బను తీయడానికి పన్నిన వ్యూహం ముషార్రఫ్ మెదడులోదే. ఆ వ్యూహం కాస్తా బెడిసి కొట్టడంతో తన పదవిని నిలుపుకునేందుకు, అప్పటి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను గద్దె దించి తాను కాస్తా ఆ దేశ అధ్యక్షునిగా అధికారం చెలాయించాడు. ఆ సమయంలో ముషార్రఫ్ తన దేశంలోని నిరసన గళాలను నిలువరించేందుకు సాగించిన దాష్టీకం అంతా ఇంతా కాదు. తన పదవిని కాపాడుకునేందుకూ, ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయించేందుకు పాకిస్తాన్‌ రాజ్యాంగాన్ని సైతం ఇష్టం వచ్చినట్లు మార్చిపారేశాడు. 2007నాటికి దేశ ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరిగిపోతోందని గ్రహించిన పర్వేజ్‌, దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసి ఎమర్జెన్సీని విధించాడు. కానీ ఎట్టకేళకి ప్రజాందోళనకి తల ఒగ్గి గద్దె దిగక తప్పలేదు. అయినా ముషార్రఫ్‌లోని పదవీకాంక్ష చల్లారలేదు. ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెంచిందన్న కక్షతో, అప్పటి ప్రతిపక్ష నేత బేనజీర్‌ భుట్టో మీద దాడి చేయించి ఆమె చావుకి కారణమయ్యాడు. ప్రస్తుతం ఆమె హత్య కేసులో ఇంకా పాకిస్తాన్‌ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి శాంతివచనాలు చెబుతున్నాడు- నవ్విపోదురుగాక!

మాటని మార్చడంలో తెదెపా ఎమ్మెల్యే రికార్డు...

తెదెపా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి- తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడం గురించి ఎన్టీఆర్‌ భవన్‌లో ఆవేశంగా ఉపన్యసించారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో కూర్చుని పార్టీ భవిష్యత్తు గురించి చర్చించారు. ఇప్పుడే వస్తాను మాస్టారూ అంటూ అలా బయటకి వెళ్లి ఇలా గులాబీ కండువాతో టీవీలలో కనిపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు పక్కనే కూర్చున్న రాజేందర్‌, నేరుగా తాజ్ కృష్ణాకి వెళ్లి కేటీఆర్‌ని కలిశారు. నారాయణపేటకి తెదెపా ఎమ్మెల్యేగా ఉన్న రాజేందర్‌రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. విభేదాలు ఉంటేనో, తిట్టుకునో కొట్టుకునో విడిపోనవసరం లేదనీ... ఆటోలో మీటర్‌ వేసినంత తేలికగా పార్టీలు మారిపోవచ్చుననీ రుజువు చేశారు. కర్ణాటకలో వైద్యకళాశాల మీద రెండుచేతులా సంపాదించుకున్న రాజేందర్‌రెడ్డి రాజకీయాలలోకి చేరి ఇక్కడా విజయం సాధించారు. అయితే గత ఏడాది ఆయన ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడి చేయడంతో 18 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. అధికార పక్షంలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావనుకున్నారో ఏమో ఇప్పడు హఠాత్తుగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిల్చొని క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచించిన ఆయన, తన మాటలను తిరగరాస్తూ రూటు మార్చేశారు.