English | Telugu
మొన్న 'జనతా గ్యారేజ్'.. నిన్న 'రంగస్థలం'.. నేడు 'ఉప్పెన', 'పుష్ప'..!!
Updated : Aug 25, 2023
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అవార్డులు ఒకే సంస్థ నిర్మించిన వేర్వేరు చిత్రాలకుగానూ ఒకే ఏడాది రావడం అరుదనే చెప్పాలి. అయితే, హ్యాట్రిక్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని సుసాధ్యం చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో 'ఉప్పెన'కి గానూ ఒక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్న మైత్రీ.. ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్) విభాగాల్లో 'పుష్ప - ది రైజ్'కి గానూ మరో రెండు అవార్డ్స్ క్రెడిట్ చేసుకుంది. మొత్తంగా.. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మైత్రీకి 'త్రీ' అవార్డ్స్ దక్కాయి.
అయితే, మైత్రీ సంస్థకి నేషనల్ అవార్డ్స్ రావడంఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ జాతీయ పురస్కారాలు దక్కాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో చిత్రం 'జనతా గ్యారేజ్'కి గానూ స్పెషల్ జ్యూరీ కేటగిరిలో మోహన్ లాల్ కి, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో రాజు సుందరం (ప్రణామం సాంగ్)కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా.. తమ సంస్థ మూడో సినిమా 'రంగస్థలం'కిగానూ బెస్ట్ ఆడియోగ్రాఫర్ కేటగిరిలో ఎం.ఆర్. రాజకృష్ణన్ జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు. మరి.. మున్ముందు కూడా మైత్రీ వారి సినిమాలు నేషనల్ అవార్డ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయేమోచూడాలి.