English | Telugu
బ్లాక్ బస్టర్ సినిమాని పట్టించుకోని ఓటీటీ సంస్థలు!
Updated : Jun 26, 2023
ఈమధ్య సినిమాలకు ఓటీటీ బిజినెస్ కూడా కీలకంగా మారింది. ఓటీటీ ద్వారా భాషతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా చేరువ అవుతుండటంతో.. థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ మీద దృష్టి పెడుతున్నారు మేకర్స్. మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఇక పాన్ ఇండియా రీచ్ ఉన్న బ్లాక్ బస్టర్ సినిమా అయితే ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా 'ది కేరళ స్టోరీ' నిలిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలకు ముందు ఈ సినిమాని పలు వివాదాలు చుట్టుముట్టాయి. 2023 మే 5న విడుదలైన ఈ మూవీ మౌత్ టాక్ తో రోజురోజుకి థియేటర్లు, వసూళ్లు పెంచుకుంటూ ఘన విజయం సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రావడంలేదట. దీని వెనుక కొందరి కుట్ర ఉందని దర్శకుడు సుదీప్తో సేన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటిదాకా మాకు సరైన ఓటీటీ ఆఫర్ రాలేదు, ఏదైనా ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్ వస్తూందేమోనని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. మా సినిమా విజయం పరిశ్రమలోని కొందరిని కలవరపాటుకు గురి చేసిందని, దీంతో వారు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని సుదీప్తో సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.