English | Telugu
హీరోయిన్ గా పల్సర్ బైక్ ఝాన్సీ!
Updated : Nov 24, 2023
సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'. జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సీ కథానాయికగా పరిచయం అవుతోంది. ప్రజా గాయకుడు గద్దర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇది ఆయన చివరి చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ మరియు సాంగ్స్ ను గద్దర్ కుమార్తె వెన్నెల లాంచ్ చేశారు.
గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు మాట్లాడుతూ, "మా నాన్నగారైన గద్దర్ గారు ప్రజల కోసం ఎంతో పాటు పడేవారు. ఆయన రాసిన పాటలు గాని గేయాలు గాని అన్ని ప్రజల కోసము ప్రజల సమస్యల మీదనే ఉండేవి. కరోనా సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా ఆయన రాశారు పాడారు. అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాలను ఎక్కువగా నటించిన నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతోపాటు నటించారు." అన్నారు.
కండక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది ఎక్కువగా విస్తరిస్తుంది. సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. అలాగే సినిమాలు కూడా మంచిగానే చెడును గాని తెలిపేందుకు మార్గ దర్శకాలుగా ఉన్నాయి. ఈ సినిమాలో నేను నటించడానికి కారణం జన సమస్యలను పరిష్కరించే ఒక మంచి చిత్రం ఇది మంచి అంశాలతో కూడుకున్న కథ అందువల్లనే చిత్రంలో నటించాలని అనుకున్నాను. అలాగే నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి ధన్యవాదాలు" అని అన్నారు.
దర్శకుడు త్రినాధరావు నక్కిన గారు మాట్లాడుతూ "గద్దర్ గారు గొప్ప రచయిత అలాగే గాయకుడు మంచి నటుడు ప్రజా సమస్యల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. ఆయన్ని కలవాలని అనుకోని వారు ఉండరు. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. ఈ చిత్రం ద్వారా ఆయనని కలిసే అవకాశం నాకు లభించింది.. అది అదృష్టంగా భావిస్తున్నాను. నేనొక కమర్షియల్ దర్శకుని అయినా నాకు ఉద్యమంతో కూడినవి అలాగే ప్రజా సమస్యలతో కూడిన ఉద్యమాలు చేసే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు సత్య రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
విశాఖపట్నం (చోడవరం) ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ "ఈ చిత్రానికి సంబంధించి నన్ను కూడా ఒక భాగము చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. విశాఖ ఉక్కు సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల వారు ఎంత కృషి చేశారు, ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు అన్న దాని గురించి ఉక్కు సత్యాగ్రహంగా ఈ సినిమాను తీసుకురావడం చాలా మంచి విషయం. అలాగే రచయిత గాయకుడు నాయకుడు అయిన గద్దర్ గారు ఈ సినిమాలో రెండు పాటల్లో నటించారు, ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి మాతో ఉండి మాకు ధైర్యాన్ని మాకు ఇచ్చారు" అని అన్నారు.
దర్శకుడు సత్యా రెడ్డి గారు మాట్లాడుతూ "ఈ సినిమా నేను చేయడానికి గల ముఖ్య కారణం గద్దర్ గారు. ఆయనతో నాకున్న అనుబంధం మర్చిపోలేనిది. గద్దర్ గారు నాకు తండ్రితో సమానం. ఆయన వయసుతో సంబంధం లేకుండా అందరితోనూ కలివిడిగా కలిసిపోయి ఉండేవారు. ఆయన ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కాకపోతే ఆయన కూతురు అయిన వెన్నెల గారిని ఆయన రూపంలో మాకు బహుమతిగా అందించారు. ఈ సినిమా విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యల్ని తెలియజేస్తూ తీశాము" అన్నారు.
వైజాగ్ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ కోటి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గద్దర్ తో పాటు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ కూడా పాటలు రాయడం విశేషం.