Read more!

English | Telugu

మామ-అల్లుడు ద్వయం పోస్టర్ అదిరింది 'బ్రో'!

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి పవన్, సాయి తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

'బ్రో ద్వయం' పేరుతో పవన్, సాయి తేజ్ కలిసున్న పోస్టర్ ను ఈరోజు ఉదయం విడుదల చేశారు. బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి తేజ్ చేతులపై పవన్ చేయి ఉండటం చూస్తుంటే నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా ఉంది. పవన్ కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపిస్తుండగా, సాయి తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతోంది. మొత్తానికి మామ-అల్లుడు ద్వయం పోస్టర్, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

'బ్రో' సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి కానుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.