English | Telugu
భగీరథకు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు
Updated : Mar 1, 2023
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన "మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్" అన్న పుస్తకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి.పార్ధసారధి ఆవిష్కరించారు. దుబాయ్ లోని గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్లో కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహానటుడు ఎన్ .టి రామారావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్ధ సారథి 'మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు, రెండవ కాపీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు అందించారు.
నందమూరి తారక రామారావు గారు, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఇద్దరూ యుగ పురుషుల ని, తెలుగు వారందరికీ వారు గర్వకారణం అన్నారు. దుబాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఎన్.టి.రామారావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత భగీరథ ను ఆయన అభినందించారు. కళ, కలయిక ఫౌండేషన్ తరుపున పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. భగీరథకు ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డును ప్రదానం చేశారు .
ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ.. "మహానటుడు రామారావు శత జయంతి సందర్భంగా తాను రచించిన "మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్" పుస్తకం తొలి ముద్రణను రామారావు గారి కుమార్తెలు లోకేశ్వరి, పురందేశ్వరి హైదరాబాద్ లో ఆవిష్కరించారని, రెండవ ముద్రణను ఎన్నికల ముఖ్య అధికారి పార్ధ సారధి దుబాయ్ లో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. కళ పత్రిక సంపాదకుడు మహమ్మద్ రఫీ, కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ కు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు.