English | Telugu
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న జె.డి.చక్రవర్తి!
Updated : Nov 3, 2023
కింగ్ నాగార్జున, రామ్గోపాల్వర్మ కాంబినేషన్లో వచ్చిన సంచలన చిత్రం ‘శివ’. ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన చక్రవర్తి అందులో చేసిన జె.డి. క్యారెక్టర్తో జె.డి.చక్రవర్తిగా మారిపోయాడు. ఆ తర్వాత హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. అంతేకాదు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా, నిర్మాతగా 10 సినిమాల వరకు చేశాడు. ఈమధ్యకాలంలో తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. ఇతర భాషల్లో బిజీగానే ఉన్నాడు.
తాజాగా జె.డి.చక్రవర్తి నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో జె.డి. నటనకుగాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఓటీటీ ప్లే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశ వ్యాప్తంగా ఓటీటీ కంటెంట్లో ఈ అవార్డులను ఈ సంస్థ అందించింది. ‘దయా’ వెబ్ సిరీస్కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో విజేతలు అవార్డులను అందుకున్నారు.
జె.డి. ఒక విలక్షణమైన నటుడు. తన మొదటి సినిమా ‘శివ’లో విలన్ అయినప్పటికీ అతని పెర్ఫార్మెన్స్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మని, గులాబి, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, వన్బైటు, హిందీలో సత్య, ప్రేమ్ ఖైదీ వంటి సినిమాల్లో అతని నటన అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని కెరీర్లో బాగా చెప్పుకోదగిన సినిమా ‘సత్య’. రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో జె.డి. నటన అసామాన్యం. ఈ సినిమాలోని జె.డి. నటనకు తప్పకుండా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. కానీ, ప్రేక్షకులు మాత్రం ‘సత్య’లోని జె.డి. నటనకు జేజేలు పలికారు. వివిధ భాషల్లో 100కిపైగా సినిమాలు చేసినప్పటికీ జె.డి. చక్రవర్తికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది.