English | Telugu
అక్షరాలా రూ. 100 కోట్ల నష్టం.. మెగా కాంపౌండ్ లేటెస్ట్ రికార్డ్!
Updated : Sep 6, 2023
కేంద్రప్రభుత్వం కొద్ది రోజుల క్రిందట ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. గమ్మత్తేమిటంటే.. అందులో మెగా కాంపౌండ్ హీరోల టచ్ ఉన్న సినిమాలదే హవా. అంతెందుకు.. ఈ ఏడాది ప్రథమార్ధంలో వసూళ్ళ వర్షం కురిపించిన సినిమాల్లోనూ అదే క్యాంప్ సందడి బాగా కనిపించింది. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అంటూ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ముంగిట వీరవిహారం చేస్తే.. వేసవికి వచ్చిన 'విరూపాక్ష'తో 'సుప్రీమ్' హీరో సాయితేజ్ కూడా అదిరిపోయే హిట్టు పట్టాడు. అయితే ఈ విజయాల ముచ్చట అంతా ఆవిరైపోతోంది.. ఆ కాంపౌండ్ నుంచి వస్తున్న వరుస డిజాస్టర్స్ చూస్తుంటే..
ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో రూపొందిన 'బ్రో' తెరపైకి వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ.. రూ. 30 కోట్లకి పైగా నష్టంతో డిజాస్టర్ గా నిలిచింది. దాన్ని మరిచిపోయేలోపే.. ఆగస్టు 11న 'భోళా శంకర్'గా పలకరించారు చిరు. ఔట్ డేటెడ్ కంటెంట్ తో బోల్తా పడ్డ ఈ సినిమా కారణంగా.. రూ. 53.5 కోట్లకి పైగా భారీ నష్టం వచ్చిందన్నది ట్రేడ్ మాట. కట్ చేస్తే.. భోళా చేసిన గాయాన్ని మరిచిపోయేలోపే ఆగస్టు 25న 'గాండీవధారి అర్జున'గా జనం ముందుకొచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆద్యంతం ఏ మాత్రం ఆకట్టుకోని సినిమా ఇదంటూ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచేశారు. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. రూ. 16.5 కోట్ల నష్టం చూసింది. ఏదేమైనా.. నెలలోపు మూడు డిజాస్టర్స్ తో, అక్షరాలా రూ. 100 కోట్ల నష్టంతో మెగా కాంపౌండ్ మరోసారి వార్తల్లో నిలిచింది. మొత్తమ్మీద.. హిట్స్ తోనే కాదు డిజాస్టర్స్ తోనూ మెగా క్యాంప్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందటున్నారు నెటిజన్స్.