English | Telugu
A11గా అల్లు అర్జున్.. ‘పుష్ప2’ కేసులో దాఖలైన ఛార్జిషీట్!
Updated : Dec 27, 2025
2024 డిసెంబర్ 5న అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప2’ విడుదలైంది. ఈ సందర్భంగా డిసెంబర్ 4న వేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటన గత ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది.
సంవత్సరం తర్వాత ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్తోపాటు మరో 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు, బన్నీ మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను ఛార్జ్ షీట్లో చేర్చారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1గా, అల్లు అర్జున్ను A11గా చేర్చారు. అందర్నీ కలచివేసిన తొక్కిసలాట ఘటనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.