English | Telugu
ఎన్టీఆర్ కోసం ముంబై నుంచి...
Updated : Aug 28, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సముద్రం బ్యాక్ డ్రాప్ తో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తారక్ డ్యూయెల్ రోల్ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు పొక్కింది. అదేంటంటే.. ఇందులో అండర్ వాటర్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ముంబై నుంచి స్పెషల్ ట్రైనర్స్ ను మేకర్స్ రప్పించారు.
RRR సినిమా తర్వాత దేవర సినిమాను స్టార్ట్ చేయటానికి తారక్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నప్పటికీ సినిమాను మాత్రం శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా..విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. రీసెంట్ గా సైఫ్ కి సంబంధించిన లుక్ ను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.