English | Telugu

ఓటీటీలోకి హాలీవుడ్‌ మూవీ.. ఇదే బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి నెక్స్‌ట్‌ మూవీ!

సాధారణంగా హాలీవుడ్‌ సినిమాలు కూడా రిలీజ్‌ అయిన 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తాయి. కానీ, ఒక సినిమా మాత్రం రిలీజ్‌ అయిన 5 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్‌ అవబోతోంది. అదే ఇండియానా జోన్స్‌.. డయల్‌ ఆఫ్‌ ది డెస్టినీ. సైంటిఫిక్‌ అండ్‌ అడ్వంచరస్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 30, 2023లో విడుదలైంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ఆలస్యమైంది.

హరిసన్‌ ఫోర్డ్‌ హీరోగా ఇండియానా జోన్స్‌ సిరీస్‌ను 40 సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ప్రారంభించాడు. ఈ సిరీస్‌లో మొదటి సినిమాగా ‘రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌’(1981) అనే సినిమా వచ్చింది. ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిన్న పిల్లలను సైతం బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ‘అండ్‌ ది టెంపుల్‌ ఆఫ్‌ ది డూమ్‌’(1984), ది లాస్ట్‌ క్రూసెడ్‌(1989), కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది క్రిస్టల్‌ స్కల్‌(2008) చిత్రాలు వచ్చాయి. ఇండియానా జోన్స్‌ సిరీస్‌ స్టార్ట్‌ అయిన మొదటి పది సంవత్సరాల్లోనే మూడు సినిమాలు వచ్చాయి. నాలుగో సినిమా రావడానికి మాత్రం 19 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు ఐదో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు 15 సంవత్సరాల సమయం తీసుకున్నారు మేకర్స్‌. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సినిమాలనూ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ డైరెక్ట్‌ చేయగా, ఐదో సినిమా ‘ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ(2023) చిత్రానికి మాత్రం జేమ్స్‌ మావోల్ట్‌ దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉండగా... ఇండియానా జోన్స్‌ సిరీస్‌ ప్రభావం టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి మీద బాగానే ఉన్నట్టు తాజా సమాచారం మేరకు తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ కాంబినేషన్‌లో రాజమౌళి చేయబోయే సినిమా ఇండియానా జోన్స్‌ సిరీస్‌ తరహాలో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వంచరస్‌ మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.