English | Telugu
మెగా ఫ్యామిలీకి ఏమైంది?
Updated : Aug 25, 2023
అదేదో సినిమాలో శాపంతో ఒకే కుటుంబానికి చెందినవారు ఒకరి తర్వాత ఒకరు చనిపోయిన్నట్లుగా.. ఇటీవల మెగా హీరోలు నటించిన సినిమాలు వరుసగా వచ్చినవి వచ్చినట్లు ఫ్లాప్ అవుతున్నాయి. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. జూలై 28న విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తో బయ్యర్లకు రూ.30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకి ఆగస్టు 11న భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ లో బయ్యర్లకు రూ.50 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. ఆ సినిమా వచ్చిన రెండు వారాలకి ఈరోజు(ఆగస్టు 25) మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున విడుదల కాగా, మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. ఎస్వీసీసీ బ్యానర్ లో వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు ల మార్కెట్ ని మించిన బడ్జెట్ తో రూపొందింది. ఈ మూవీ రిజల్ట్ పట్ల చిత్ర బృందం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. సోలో హీరోగా నటించిన గత చిత్రం గని తో తీవ్రంగా నిరాశపరిచిన వరుణ్.. ఈ సినిమాతో లెక్క సరి చేస్తాడని మెగా అభిమానులు కూడా బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం నీరుగారిపోయింది. ఈ సినిమా వరుణ్ కెరీర్ లో మరో గని అంటున్నారు. సినిమా రిచ్ గా చిత్రీకరించారు కానీ, కంటెంట్ పూర్ అని.. కథా కథనాలు పూర్తిగా తేలిపోయాయని చెబుతున్నారు. అసలే సినిమా బడ్జెట్ స్థాయికి తగ్గ బిజినెస్ జరగలేదని ట్రేడ్ వర్గాల మాట. ఇప్పుడు నెగటివ్ టాక్ తో ఆ తక్కువ మొత్తం కూడా రాబట్టడం కష్టమే అంటున్నారు. దీనిని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీని మరో ఫ్లాప్ పలకరించినట్లే. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇలా మూడు ఘోర పరాజయాలు పలకరించడంతో మెగా ఫ్యామిలీకి ఏమైంది అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.