English | Telugu
నరేష్ మాజీ భార్యకి షాక్.. 'మళ్ళీ పెళ్లి'కి అడ్డులేదు.. ఇంట్లోకి ఎంట్రీ లేదు!
Updated : Aug 2, 2023
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే నరేష్ మాత్రం ఇది కల్పిత కథతో రూపొందిన సినిమా అని కొట్టిపారేశారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫారమ్లలో ప్రదర్శించకుండా నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ నిన్న(ఆగస్టు 1న) తీర్పు వెలువరించింది.
మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసును కొట్టివేసిన కోర్టు అంటూ తాజాగా నరేష్ టీం ప్రెస్ నోట్ విడుదల చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్య దాఖలు చేసిన కేసు కారణాలను న్యాయస్థానం సమర్థించలేనివని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది.
మళ్ళీ పెళ్లి విషయంలోనే కాకుండా మరో కేసు విషయంలో కూడా రమ్య రఘుపతికి షాక్ తగిలిందని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. రమ్య రఘుపతిని నానక్రామ్గూడలోని నరేష్ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ నరేష్ మరియు కుటుంబ సభ్యులు కోర్టుని ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది. నరేష్, ఆయన కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ నివాసం ఉండకుండా ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. నరేష్, రమ్య 6 సంవత్సరాల నుంచి కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది.