English | Telugu
హరికృష్ణ 'స్వామి'కి రీమేక్ గా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'?
Updated : Aug 15, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ పాత్ర బాలయ్య పోషిస్తుండగా.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నందమూరి హరికృష్ణ నటించిన 'స్వామి' చిత్రానికి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ నటుడిగా తన ప్రత్యేకను చాటుకున్నారు హరికృష్ణ. ఆయన టైటిల్ రోల్ ప్లే చేసిన 'స్వామి' అనే చిత్రం 2004 లో విడుదలైంది. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, ఉమ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. తన కవల చెల్లెళ్లను ప్రేమ పేరుతో మోసం చేసి, హత్య చేసిన వ్యక్తిపై అన్నయ్య ఎలా పగ తీర్చుకున్నాడు కథతో ఈ చిత్రం రూపొందింది. 19 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా కథనే కొద్దిగా మార్పులు చేసి భగవంత్ కేసరి చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మేకర్స్ చెప్పారు. 'ఈ వార్తల్లో నిజం లేదు.. అసలు నిజం ఏంటంటే అక్టోబర్ 19న బిగ్ స్క్రీన్స్ పై అసలుసిసలైన సెలబ్రేషన్ చూస్తారు' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు మేకర్స్.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు బలంగా నమ్మతున్నారు.