English | Telugu
ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్.. ఆస్కార్ విన్నర్ దుస్థితి
Updated : Sep 12, 2023
మ్యూజిక్ అంటే ఇష్టపడనివాళ్ళు ఉండరు. అందులోనూ ఎ.ఆర్.రెహమాన్ వంటి సంగీత దర్శకులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అలాంటి మ్యూజిక్ మాస్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఆధ్వర్యంలో కాన్సర్ట్ ఏర్పాటు చేస్తే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉండదని మరోసారి ప్రూవ్ చేసారు మ్యూజిక్ లవర్స్. కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ, వివాదాలు, విమర్శలు చుట్టు ముట్టాయి. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్టుగా తయారైంది రెహమాన్ కాన్సర్ట్.
బిటిఓఎస్ ప్రొడక్షన్స్, ఎసిటిసి ఈవెంట్స్ సంస్థ కలిసి ఎ.ఆర్.రెహమాన్తో ఓ భారీ మ్యూజిక్ కాన్సర్ట్ను కండక్ట్ చేశాయి. దీని కోసం నెలరోజుల ముందు నుంచే టిక్కెట్ల అమ్మకాన్ని మొదలు పెట్టారు. 5వేలు, 10వేలు, 20వేలకు టికెట్స్ అమ్మారు. ఈవెంట్ రోజున వర్షం పడడంతో ఈవెంట్ను వాయిదా వేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. ఈవెంట్ వాయిదా పడిరదని తెలుసుకొని వెనుదిరిగారు. కాగా, ఈవెంట్ కోసం మరో డేట్ని ఫిక్స్ చేసి సెప్టెంబర్ 10న చెన్నయ్లోని ఓ ఓపెన్ ప్లేస్లో కాన్సర్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగిందని, గొప్ప సక్సెస్ అయిందని నిర్వాహకులు చెప్పుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందనేది సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఈవెంట్ మేనేజ్మెంట్ అస్సలు బాగా లేదని, అక్కడికి వచ్చిన తాము చాలా ఇబ్బందులు పడ్డామని పోస్ట్ చేస్తున్నారు. ఈవెంట్ జరిగిన ప్లేస్కి రెండు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఇచ్చారని, దాని వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని వారు తమ బాధను చెప్పుకున్నారు. అంతేకాదు, టిక్కెట్స్ ఉన్న చాలామందిని లోపలికి పంపలేదని, దాంతో తొక్కిసలాట జరిగిందని, చాలా మందికి గాయాలయ్యాయని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మేనేజ్మెంట్ చాలా చెత్తగా ఉందని అభిమానులు ఫైర్ అవుతున్నారు. గంట గంటకు ఇలాంటి పోస్టులు పెరుగుతుండడంతో ఇది వైరల్గా మారింది.
ఈ వివాదం రెహమాన్ దగ్గరికి చేరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘నా కాన్సర్ట్కి టిక్కెట్ కొనుక్కొని లోపలికి రాలేకపోయిన వాళ్ళంతా మీ టికెట్ కాపీని arr4chennai@btos.inకి పంపి, కాన్సర్ట్ వల్ల మీరు పడిన ఇబ్బందులను కూడా తెలియజేయండి మేం స్పందిస్తాం’ అని ట్వీట్ చేశారు.
ఈ వివాదంపై పోలీసులు స్పందిస్తూ ‘25,000 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. వాస్తవానికి 25,000 మందికి ఆ ప్లేస్ సరిపోతుంది. కానీ, 50,000 మంది వచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు చెప్పిన దానికంటే ఎక్కువ టిక్కెట్లు అమ్మారు. దీనిపై విచారణ జరిపిస్తాం అన్నారు.
కొన్ని వేల మంది హాజరైన కాన్సర్ట్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా కేవలం నిర్వాహకుల వైఫల్యం వల్ల ఎ.ఆర్.రెహమాన్ స్పందించాల్సిన అవసరం, సమాధానం చెప్పాల్సిన అగత్యం ఏర్పడ్డాయి. దీనిపై కొందరు నెటిజన్లు రెహమాన్ను విమర్శిస్తుండగా, మరికొందరు ఈవెంట్ నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని, నష్టపోయిన వారికి న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.