English | Telugu
చిరంజీవి కోసం ఎంత దూరమైనా వెళ్తా.. అల్లు అరవింద్ మాస్ వార్నింగ్!
Updated : Aug 7, 2023
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై 2011 లో జీవిత, రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఏకంగా 12 ఏళ్ళ తర్వాత ఇటీవల నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించడంతో వారికి పైకోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తాజాగా ఈ విషయాన్ని 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పరోక్షంగా ప్రస్తావించిన అల్లు అర్జున్.. చిరంజీవి జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెప్పకనే చెప్పేశారు.
చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న(ఆగస్టు 6న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్.. చిరంజీవిపై తనకి ఎంత అభిమానమో మరోసారి చెప్పారు. "మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగితే, నేను చేస్తూ పెరిగాను. ఆయనంటే ఎంత అభిమానమో నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసే సేవల్ని ఒకళ్ళు నీచంగా మాట్లాడారని వాళ్ళు జైలుకి వెళ్లే వరకు 12 సంవత్సరాలు పోరాడాను." అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.