English | Telugu
సురేష్ కొండేటితో మాకు సంబంధం లేదు.. అసలు ఆ అవార్డు ఫంక్షన్లో జరిగిందేమిటి?
Updated : Dec 4, 2023
ప్రతి ఏడాది సురేష్ కొండేటి సంతోషం ఫిలిం అవార్డుల ఫంక్షన్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం గోవాలో ఫంక్షన్ను నిర్వహించారు. ఈ ఫంక్షన్లో జరిగిన రచ్చపై మీడియాలో వచ్చిన కథనాలను చూసి షాక్ అయిన అల్లు అరవింద్ ఈరోజు ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ ‘‘ప్రతి అవార్డు ఫంక్షన్ చేసే ఓ వ్యక్తి ఈసారి గోవాలో ఫంక్షన్ చెయ్యాలనుకున్నాడు. కానీ, దాన్ని ఆర్గనైజ్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడు. ఫంక్షన్కి వెళ్లిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు. దీని గురించి మీడియా రాసిన కథనాలు చూసి ఆశ్చర్యం కలిగింది. ఈ అవార్డు ఫంక్షన్ నిర్వహించిన వ్యక్తి మా కుటుంబానికి పీఆర్వో అని కొన్ని పత్రికల్లో రాశారు. వెంటనే నేను ఓ పీఆర్వోకి ఫోన్ చేసి ఎప్పుడైనా ఆ వ్యక్తి మాకుగానీ, మా కుటుంబంలోని ఎవరికైనా పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పామా? ఏదైనా ఫంక్షన్ జరిగినపుడు మా పక్కన ఉన్నంత మాత్రాన మా పీఆర్వో అవ్వడు కదా. అతను గోవాలో చేసిన అవార్డు ఫంక్షన్లో అక్కడకి వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. తెలుగు వాళ్లు ఇంతే, తెలుగు ఇండస్ట్రీ ఇంతే అని ఇతర భాషల వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ అవార్డు ఫంక్షన్కి ఇండస్ట్రీతో సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతం. అలాగే మా కుటుంబంలో ఎవ్వరికీ అతను పీఆర్వో కాదు. ఎవరో ఏదో చేస్తే దాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు’’ అన్నారు.
అసలు ఆ అవార్డు ఫంక్షన్లో జరిగిందేమిటి?
ఇటీవల గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన వారికి అవార్డులు అందించారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులకు ఈ అవార్డు ఫంక్షన్ కోసం ఆహ్వానం అందింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 35 మందిని ఆహ్వానించారు. ఈ అహ్వానం మేరకు.. కన్నడ స్టార్ హీరో రమేష్ అరవింద్, కాంతార ఫేమ్ సప్తమి గౌడ, నిర్మాత శైలజా నాగ్ తదితర ప్రముఖులు గోవా వెళ్లారు. హీరో రమేష్ అరవింద్ కన్నడ సినిమా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో లైట్లు ఆగిపోయాయి. ఎంతసేపైనా లైట్స్ ఆన్ చెయ్యలేదు. రమేష్తోపాటు ఇతర నటీనటులు చీకటిలోనే ఉండిపోయారు. ఆ తర్వాత చేసేది లేక వచ్చిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ విషయం గురించి రమేష్ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేవలం కన్నడ నటీ,నటులకు మాత్రమే కాదు.. అన్ని భాషల నటీనటులకు ఇబ్బంది కలిగింది. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషలకు చెందిన వారిని పిలిచారు. సౌత్ ఇండియా అవార్డ్స్ అని చెప్పారు. అక్కడ ఏదో గొడవ జరిగింది. అదేంటో నాకు సరిగా తెలీదు. తెలుగు అవార్డ్స్ అయిపోయాయి. కన్నడకు సంబంధించి కొన్ని అవార్డులు ఇవ్వడానికి నన్ను స్టేజిపైకి పిలిచారు. ఓ ఇద్దరు ముగ్గురికి అవార్డు ఇచ్చాను. నాలుగో అవార్డు ఇస్తున్నాను. స్టేజి మీద లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఏమైందని ఆరా తీస్తే.. లైట్స్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. వాళ్లు లైట్స్ ఆన్ చెయ్యము అన్నారు. అక్కడ ఏదో ఫైనాన్షియల్ మిస్టేక్స్ అయినట్లు అర్థమైంది. ఫంక్షన్లోనే కాదు హోటల్స్ విషయంలోనూ తెలుగు, తమిళవారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అసలు ఏం జరిగింది? ఇక్కడినుంచి అందరినీ ఫ్లౖౖెల్లో తీసుకెళ్లారు. అంతా బాగానే ఉంది. కానీ, ఫంక్షన్లో జరిగిన దానికి మాత్రం నాతో పాటు వచ్చిన కొత్త నటులకు క్షమాపణ చెప్పాలి. అసలేం జరిగిందో వివరణ ఇవ్వాలి’’ అని అన్నారు.