English | Telugu

‘వారిసు’ కాంబినేషన్‌‌లో మైత్రి మేకర్స్ మూవీ!

ఈ సంక్రాంతికి తమిళనాడులో కోలీవుడ్ ఇల‌య దళపతి విజయ్ నటించిన వారిసు, తల అజిత్ నటించిన తునివు చిత్రాలు విడుదలయ్యాయి. వారిసు చిత్రానికి వస్తే దీనిని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తెలుగు దర్శకుడు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళనాట‌ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబ‌ట్టి దిల్ రాజుకు భారీగా లాభాలను తీసుకొని వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొంద‌డం, విజయ్ చాలా కాలం తర్వాత ఇలాంటి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న చిత్రంలో క‌నిపించ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి ప‌ట్టం క‌ట్టారు. దాంతో ఆయన ఒక ఫ్యామిలీ మెన్ గా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియోస్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు పోటెత్తారు.

ఇదిలా ఉంటే విజయ్ మరోసారి వంశీ పైడిపల్లికి అవకాశం ఇస్తున్నాడని కోలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజు తో పవర్ఫుల్ మాస్ క‌థాంశంతో లియో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. విజయ్ కి జోడిగా త్రిష నటించబోతోంది. మ‌రోవైపు విజ‌య్ అట్లీ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత విజయ్ 69వ సినిమా మరల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడట మరి దీన్ని దిల్ రాజునే నిర్మిస్తాడా లేదంటే కోలీవుడ్ నిర్మాతలు నిర్మిస్తారా అనేది వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్‌తో వంశీ పైడిపల్లికి ఓ సినిమా ఉంది. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈసారి విజయ్‌తో సినిమా నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ లో వంశీ పైడిపల్లి విజయ్ సినిమా రావడం మాత్రం పక్కా అని సమాచారం.