English | Telugu
ఇద్దరూ హీరోలే.. పైగా అన్నదమ్ములు.. ఆ ఇద్దరితో శంకర్ పాన్ ఇండియా మూవీ?
Updated : Nov 14, 2023
సూర్య, కార్తీ.. పేరుకి ఇద్దరూ తమిళ హీరోలే.. కానీ, తెలుగులో వీరికి మామూలు ఫాలోయింగ్ లేదు. టాలీవుడ్ హీరోల సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో.. దానికి సమానంగానే వీరిద్దరి సినిమాలను కూడా ఆదరిస్తారు. పైగా.. ఇద్దరూ అన్నదమ్ములు కూడా.
1997లో వసంత్ దర్శకత్వంలో రూపొందిన ‘నెరుక్కునేర్’ చిత్రంతో కోలీవుడ్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు సూర్య. ఈ సినిమాలో దళపతి విజయ్తో కలిసి నటించాడు. ఆ తర్వాత మౌనం పేసియాదే, కాక కాక వంటి సూపర్హిట్ సినిమాల్లో నటించినా వాటిని తెలుగులో ఎవరూ రిలీజ్ చేయలేదు. 2003లో విక్రమ్, సూర్య హీరోలుగా బాల దర్శకత్వంలో వచ్చిన ‘పితామగన్’ చిత్రాన్ని తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్ చేశారు. ఆ సినిమాలోని సూర్య నటన తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దాంతో తమిళ్లో సూర్య చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేందుకు కొందరు నిర్మాతలు ముందుకు వచ్చారు. అప్పటి నుంచి సూర్య తమిళ్లో చేసిన సినిమాలు దాదాపు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఆ క్రమంలోనే మౌనం పేసియాదే చిత్రాన్ని తెలుగులో ‘కంచు’ పేరుతో విడుదల చేశారు.
కార్తీ గురించి చెప్పాలంటే.. మణిరత్నం దర్శకత్వంలో సూర్య చేసిన ‘యువ’ చిత్రంలో అతని ఫ్రెండ్ క్యారెక్టర్లో మొదటిసారి కనిపించాడు. ఆ తర్వాత అమీర్ దర్శకత్వంలో రూపొందిన ‘పరుత్తివీరన్’ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నాడు కార్తీ. తొలి సినిమాతోనే అవార్డులు కూడా గెలుచుకున్నాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత చేసిన ‘పయ్యా’ చిత్రం తెలుగులో ‘ఆవారా’గా రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగులోనూ సూపర్హిట్ అవ్వడంతో టాలీవుడ్లోనూ కార్తీకి ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుంచి అతను హీరోగా చేసిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతూ వస్తున్నాయి.
తెలుగులో వీరిద్దరికీ ఇంత ఫాలోయింగ్ వచ్చినప్పటికీ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపించడం లేదు. రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర 2’లో మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్య నటించాడు. కార్తీ విషయానికి వస్తే నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ చిత్రం చేశాడు. వీరిద్దరూ తెలుగులో ఒక్కో సినిమా చేశారు. అయితే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని కోలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇద్దరం కలిసి నటించేంత గొప్ప కథ వస్తే తప్పకుండా చేస్తామని ఇద్దరూ చెప్తూ వస్తున్నారు. ఒక దశలో వీరిద్దరూ కలిసి చేసే సినిమా తెలుగులోనే ఉంటుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సూర్య, కార్తీ కలిసి నటించే సినిమా పట్టాలెక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, తమిళ్ అనే భేదం లేదు. ఏ సినిమా అయినా సౌత్లోని నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీరిద్దరితో సినిమా తీసేందుకు డైరెక్టర్ శంకర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
మంచి కథ దొరికితే తప్పకుండా కలిసి నటిస్తామని సూర్య, కార్తీ చెబుతున్న నేపథ్యంలో అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ను శంకర్ టీమ్ రెడీ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సూర్య, కార్తీ కలిసి నటించే సినిమాకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా చేసేందుకు శంకర్ అన్నీ సిద్దం చేసుకుంటున్నాడని సమాచారం. ఇక శంకర్లాంటి డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే అది ఒక సంచలనమే అవుతుంది. సూర్య, కార్తీ ఇద్దరి ఇమేజ్కి తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్హాసన్తో ‘ఇండియన్ 2’, రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలతో బిజీగా ఉన్న శంకర్ నెక్స్ట్ చేయబోయే సినిమాలో సూర్య, కార్తీ హీరోలుగా నటిస్తారని కోలీవుడ్లో బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాను ఏ బేనర్లో, ఎవరు నిర్మిస్తారనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.