Read more!

English | Telugu

బిగ్ సర్ ప్రైజ్.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీక్వెల్ లోడింగ్!

టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్స్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2013 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టగా, ఏళ్ళు గడిచే కొద్దీ మధ్యతరగతి యువత ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ పలు సన్నివేశాల్లో తమని తాము చూసుకుంటారు. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఏకంగా పదేళ్ల తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి సీక్వెల్ తీస్తే బాగుంటుందనే ఆలోచన దిల్ రాజుకి వచ్చిందట. ఇప్పటికే ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ సీక్వెల్ పట్టాలెక్కితే మాత్రం, సీతమ్మ వాకిట్లో అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

అయితే ఈ సీక్వెల్ కి మహేష్ అందుబాటులో ఉంటాడా లేదా అనేదే అసలు ప్రశ్న. తనకు సీతమ్మ వాకిట్లో లాంటి క్లాసిక్ ఫిల్మ్ ని ఇచ్చిన అదే శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' లాంటి డిజాస్టర్ ని కూడా ఇచ్చాడు. అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. ఎస్వీఎస్సీ కాంబో క్రేజ్ ని, అడ్డాల టాలెంట్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. అలాగే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్న మహేష్, ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్ లో 'ఎస్వీఎస్సీ-2' ని పూర్తి చేసే అవకాశాలున్నాయి. మరోవైపు త్వరలో 'పెదకాపు-1'తో పలకరించనున్న శ్రీకాంత్, ఆ తర్వాత 'పెదకాపు-2' పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఇక వెంకటేష్ ఈ ఏడాది చివరిలో 'సైంధవ్'తో పలకరించనున్నాడు. మరి దిల్ రాజు ఆలోచన ఫలించి, ఈ ముగ్గురూ 'ఎస్వీఎస్సీ-2' కోసం రంగంలోకి దిగితే మాత్రం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.