Read more!

English | Telugu

ఆ హీరో అమ్మాయిలకు డ్రీమ్‌ బోయ్‌.. తర్వాత విలన్‌.. ఇప్పుడు డైరెక్టర్‌!

ఇండియాలోనే చెప్పుకోదగ్గ నటుడు అరవింద్‌ స్వామి. ‘దళపతి’ నుంచి ఇప్పటివరకు ఎన్నో భాషల్లో హీరోగా, విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ హీరో కమ్‌ విలన్‌ ఇప్పుడు మెగా ఫోన్‌ పట్టనున్నాడు. అతని డైరెక్షన్‌లో 2024లో ఒక సినిమా స్టార్ట్‌ అవ్వబోతోంది. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న ఫాహద్‌ ఫజల్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడు. ఉదయనిధి స్టాలిన్‌ నటించిన ఓ సినిమాలో విలన్‌గా తన విశ్వరూపాన్ని చూపించిన ఫాహద్‌ ఫజల్‌ ఇప్పుడు రజనీకాంత్‌ సినిమాలో కూడా విలన్‌గా నటిస్తున్నాడు. ఫాహద్‌తో అరవింద్‌ చేసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

హీరో నుంచి విలన్‌గా, ఇప్పుడు డైరెక్టర్‌గా మారబోతున్న అరవింద్‌స్వామి కెరీర్‌ని ఒకసారి పరిశీలిస్తే... చాలా విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. సాధారణంగా హీరోలు డాక్టర్‌ కావాలనుకున్నాను, యాక్టర్‌ అయ్యాను అంటూ ఉంటారు. అరవింద్‌ స్వామికి చిన్నతనం నుంచి డాక్టర్‌ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే కాల క్రమేణా చదువుకున్న సబ్జెక్ట్‌ వేరు. చిన్నతనం నుంచి యాడ్స్‌ నటించిన అరవింద్‌ని ఒక యాడ్‌లో చూసి మణిరత్నం తన ‘దళపతి’ సినిమాలో తొలిసారి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాల్లో అరవింద్‌ని అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌ని చేసేశాయి. అమ్మాయిల కలల రాకుమారుడంటే అరవింద్‌ స్వామే. నటుడిగా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. 2000 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా ‘రాజా కో రాణి సే ప్యార్‌ హోగయా’ చిత్రం చేశాడు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత 13 సంవత్సరాల పాటు ఒక్క సినిమా కూడా కమిట్‌ అవ్వలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బిజినెస్‌ రంగంలోకి దిగి అక్కడ కూడా సక్సెస్‌ అయ్యాడు. 2013లో తని ఒరువన్‌తో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు చాలా భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.