రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం తొలగింపు

హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. అలాగే మండపాలలో ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమలు  వినూత్నత, సృజన ఉట్టిపడేలా ఉంటాయి. భిన్న రూపాలలలో సమాకాలీన అంశాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు.  అందులో భాగంగానే హైదరాబాద్ హబీబ్ నగర్ లో కాంగ్రెస్ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. తమ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫురింప చేసేలా ప్యాంటు, షర్టు ధరించిన గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రూపాన్ని స్ఫురింపచేసేలా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వివాదాస్పదంగా మారింది.  విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా  మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  అభిమానం ఉండాలే కానీ అది హద్దులు దాటకూడదు,  హీరోలు, రాజకీయ నాయకుల రూపాలలో గణేష్ ప్రతిమలు చేయడం సరికాదంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి,  హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రూపాన్ని స్ఫురింప చేసేలా వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం తగదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మండపం వద్దకు బుధవారం (ఆగస్టు 27) వెళ్లి పరిశీలించిన సౌత్ జోన్ డిసిపి  రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుని విగ్రహం ఉండడం చూసి, వెంటనే మండపం ఏర్పాటు చేసిన ఫిషిరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిలిపించి భక్తుల మనోభావాలు దెబ్బతీయ వద్దనీ, వెంటనే విగ్రహం మార్చా లంటూ పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహ కులు  రేవంత్ రెడ్డి రూపం లో ఉన్న విగ్రహం మార్చి మరో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.  

వరద బాధిత జిల్లాల్లో సిఎం ఏరియల్ సర్వే!

తెలంగాణలో  భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న  జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే  చేయనున్నారు. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాలపై   తన జూబ్లీహిల్స్ నివాసంలో  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంలోనూ ఎటువంటి ఉదాశీనతా ఉండకూడదని స్పష్టం చేశారు.  కాగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె. రామకృష్ణా రావు  భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,  నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో  బుధవారం (ఆగస్టు 27)  రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు.   విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు  కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.   గురువారం (ఆగస్టు 28) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను  యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలన్నారు.

వినాయక పూజ చేసి ప్రసాదం స్వీకరించిన జగన్.. ఈ మార్పు వెనుక మర్మమేంటో?

జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది.   జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. ఆయన హయాంలో  తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయట పడింది. అంతే కాదు.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో  అన్యమతస్తులకు  కొలువులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అదే విధంగా దేవుడి ప్రసాదం తినడానికి కూడా జగన్ ఇష్టపడరన్న ఆరోపణలు ఉన్నాయి.    జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ ప్రసాదం ముట్టలేదని అంటారు.  ఆయన మత విశ్వాసం మారిందో, లేక మారినట్లు కనిపిస్తే తప్ప జనం మద్దతు పొందలేమనుకున్నారో కానీ వినాయకచవిత సందర్భంగా బుధవారం (ఆగస్టు 27)న ఆయన గణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వినాయకచవితి సందర్భంగా జగన్   తాడేపల్లిలోని  వైసీపీ ప్రధాన కార్యాలయంలో  గణపతి పూజ చేశారు. ఆయన నేరుగా పూజలో పాల్గొనడం, పూజ చేయడం ఇదే తొలిసారి. పూజ అనంతరం పూజారులు ఆయనకు ప్రసాదం అందించారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. దీనిపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  జగన్ ప్రసాదం స్వీకరించడం ద్వారా  జగన్ ఇంత కాలం తన తీరుకు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తి కలిగిస్తోంది. ఏది ఏమైనా వినాయక చవితి సందర్భంగా జగన్ ప్రసాదం స్వీకరించడం మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

జగన్ వినాయకుడ్ని ఏం కోరుకునుంటారు?

జగన్  హిందూ మత విశ్వాసాలను నమ్మరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన క్రిష్టియన్ సంప్రదాయాలకు విరుద్ధంగా మరో మారు హిందూ దేవతలకు పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన తాను సీఎంగా ఉండగా వెంకన్న సెట్ వేసి.. అక్కడ భక్తి రాహిత్యంతో కూడిన పూజల కారణంగా ఓడిపోయారని అంటారు పలువురు పాస్టర్లు. ఎందుకంటే ఎవరైతే  ఏసు ప్రభువును నమ్ముతారో వారు మరొక మతానికి చెందిన దేవుళ్లు, దేవతలకు పూజలు నిర్వహించరాదని అంటారు వీరు.  కానీ జగన్ తనపై ఉన్న క్రిష్టియన్ సీఎం అన్న ముద్ర చెరుపుకోడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఫైనల్ టచ్ ఇద్దామని వెంకన్న సెట్ వేసి మరీ స్వామి వార్ని భారీఎత్తున కాకా పట్టేద్దామని గట్టిగా ట్రై చేశారు. కానీ తన సతీమణి భారతీరెడ్డి తిరుమలలో ఏర్పాటు చేసిన తన సైన్యం ఎఫెక్టూ.. దీంతో పాటు ప్రసాదం న్యాప్ కిన్ కి చుట్టిన పాప ఫలితమూ.. అది కాస్తా బెడిసి కొట్టి స్వామివారు నాతో పెట్టుకుంటే పంగనామాలే అన్న కోణంలో.. పదకొండు సీట్లు ఇచ్చారని అంటారు   శ్రీవారి భక్తులు. ఇప్పుడు చూస్తే వినాయక చవితి సందర్భంగా మరోమారు హిందూ భక్తావతారం ఎత్తారు జగన్. ఈ సందర్భంగా స్వామివారిని ఏదో కోరుకుంటున్నట్టు కనిపించింది. ఆ మర్మరింగ్ కి మీనింగేంటా? అదే ఏం కోరుకుని ఉంటారా? అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.  అదెలంటిదంటే.. ‘గతంలో వైయస్ కుమారుడిగా ఒకే ఒక్క ఛాన్స్ అన్నాను. జనం ఇచ్చారు. వారిని నిండా ముంచాను. ఇప్పుడు చూస్తే నన్ను కనీసం ప్రతిపక్షానికి కూడా దిక్కులేకుండా చేశారు. ఇప్పుడందరూ నన్ను సాధారణ ఎమ్మెల్యే.. సాధారణ ఎమ్మెల్యే.. అని దెప్పి పొడుస్తున్నారు. నువ్వే ఎలాగోలా, ఏదో ఒకటి చేసి మరో మారు నన్ను ముఖ్యమంత్రి చేయి వినాయకా’ అంటూ ఆయన మొక్కినట్టు.. అందుకు వినాయకుడు కూడా వైల్డ్ గానే రియాక్టయినట్టూ భావిస్తున్నారు. చాలయ్యా జగనూ.. చాలు! జనం సొమ్ము నువ్వు పప్పు బెల్లాల్లా పంచి.. రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలు. ఇకనైనా ఆ అమరావతిని ఎదగనీ. ఆ మాటకొస్తే ముందు నువ్వు నీ వాళ్లు నాలాంటి దేవతలు కొలువైన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దుష్ప్రచారం చేయించింది ఇక చాలు. దేవతలు అని అక్కడ ఉన్నా కూడా.. నువ్వు దాన్ని వేశ్యలంటూ నీ మీడియా ద్వారా చేయించిన రభస కైలాసం వరకూ రాలేదనుకున్నావా? నాకు మా కరస్పాండెంట్ నారదడు చెప్పారు. ఆపై నా మూషికం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఈ సారి భూలోకం వెళ్లినపుడు మీరు జగన్ కి అట్టే వరాలు ఇవ్వకండి స్వామి.. అతడేం మీ భక్తుడు కాడు. అంతా నాటకం.. హిందూ ఓటర్లను బుట్టలో పడేసే యత్నం. పూజారులు ఏదైనా ప్రసాదం ఇచ్చినా జగన్ ఉండచుట్టి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎవరైతే హిందూ దేవతల ప్రసాదం తింటారో వారు ఆయా దేవుళ్ల భక్తులవుతారన్న నమ్మకాలున్నాయ్. వాటి ప్రకారం వారెట్టి పరిస్థితుల్లోనూ మన ప్రసాదాలను   ముట్టరు. కాబట్టి అట్టే ఆ దొంగ భక్తిని చూసి మురిసిపోకండి స్వామీ అని నాతో చెప్పే పంపింది. మా అమ్మ పార్వతమ్మ కూడా ఇదే చెప్పింది. కారణమేంటంటే.. నేను ఏమీ లేని పిండి బొమ్మ నుంచి నిన్ను పుట్టించాను. అక్కడ బాబు కూడా ఏమీ లేని ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి ఒక రాజధాని పుట్టించాలని చూస్తున్నాడు. దాన్ని దేవతల రాజధాని అని కూడా అంటారు. నేను చేసే పిండి బొమ్మను ఎవరైనా ధ్వంసం చేయాలని చూస్తే నాకెలా ఆగ్రహం కలుగుతుందో.. అక్కడి ప్రజలకు కూడా సరిగ్గా అలాగే కోపం వస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు నా కుమారుడిగా జగన్ని మాత్రం అస్సలు కనికరించవద్దు. ఎందుకంటే అతడు ఇంకా మారలేదు….ఒక రాజధానిని పట్టుకుని అతడి మనుషులు చేపలు పట్టడానికి కూడా పనికిరాదనడం, పులస చేపలు ఇక్కడ దొరకొచ్చని వెటకారం చేయడం.. అక్కడి జనాల్లో కోపం తెప్పిస్తోంది.. ఎవరైతే జన వాక్యం పట్టకుండా అనుచిత వ్యాఖ్యానాలు వినిపిస్తారో వారిని మనం అస్సలు క్షమించరాదు.. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ బేటా! అంటూ మా అమ్మ కూడా చెప్పింది. ఇక మా నాన్న సంగతి సరే సరి. ఆయన మల్లికార్జునుడిగా కొలువైన  శ్రీశైలం వేదికగా అన్యమతస్తులను మీ హయాంలో ఎలా ప్రోత్సహించారో.. ఆయన భక్తుల మనోభావాలకు ఎలాంటి కష్టం కలిగించారో ఒక సారి గుర్తు చేశారు. కాబట్టి నీ కోర్కెలు నేను తీర్చితే- జనం కోర్కెలకు గోరీ కట్టడమేనని ఆ వినాయకుడు కూడా జగన్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోందన్న కామెంట్లు వినవస్తున్నాయ్.

అన్నా చెళ్లెళ్లు ఒకే బైక్ పై.. బీహార్ లో కాంగ్రెస్ ర్యాలీ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన  ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.   ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఓట్ అధికార యాత్రలో భాగంగా జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ బైక్ ను స్వయంగా నడిపారు. ఆ బైక్ పై వెనుక ఆయన సోదరి, కాంగ్రెస్ సీనియర్ నేత, వాయనాడు ఎంపీ ప్రింయాంకా గాంధీ కూర్చున్నారు. ఈ   అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై ర్యాలీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ చేపట్టిన ఓట్ అధికర యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి   65 లక్షల మందికి  పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటిమి ఈ ఓట్ అధికార్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ససారామ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర  మొత్తం 1,300 కిలోమీటర్ల మేర సాగి వచ్చేనెల 1న ముగియనుంది.  

ఐక్యతా భావాన్ని పెంచే వినాయకచవితి

విజయవాడలోని సీతార సెంటర్‍లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు, నేతలు స్వాగతం పలికారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు..విఘ్ననాయకుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని  ప్రార్థించానని చెప్పారు. వినాయకచవితిని అందరిలో ఐక్యాతా భావాన్ని పెంచే పండుగగా అభివర్ణించిన ఆయన గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు.   గణేష్ చతుర్థతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.    సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.   72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననీ,  విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాట్లు చేయడం చాలామంచి కార్యక్రమమనీ  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం...రేపు విద్యా సంస్థలకు సెలవు

  తెలంగాణలో రికార్డు స్ధాయి అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో అత్యధికంగా 50 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్ధాయి వర్షపాతం మొదలైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పశువుల పాకలు సైతం నీట మునిగాయి. పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల్లో చిక్కుకుపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలంలో ఉన్న ధూప్‌సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు ఇండ్లు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. తమను కాపాడాలంటూ ప్రజలు ఆర్తనాదాలు పెట్టారు. మెదక్ జిల్లాలో రెప్పల ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఒకవైపు పోలీసులు ఫైట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్కే చేసి బోట్లు ద్వారా ప్రజలను రక్షిస్తూ ఉండగా... మరోవైపు ఇండ్ల పైకి ఎక్కిన ప్రజలు హెలికాప్టర్ సహాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతోంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు పది అడుగుల తీవ్రతతో కిందికి దుంకుతున్నది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగిపొర్లుతోంది.  తద్వారా భారీ బుంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే పోచారం ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో రేపుగురువారం)విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

శేషాచల అడవుల్లో పెద్దపులి సంచారం

  ఎప్పుడూ కనిపించని ఉమ్మడి కడప జిల్లాలోని చిట్వేలి  ప్రాంతంలో గల శేషాచల అడవుల్లో పెద్ద పులి కనిపించింది .తిరుమల అడవులతో కలిసి ఉన్న శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు అమర్చిన  కెమెరాల్లో పులుల  సంచార దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. చిట్వేలు రేంజ్ అధికారులు ఆ రేంజ్ పరిధిలో 30 ట్రాప్ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పెద్దపులి రాత్రి సమయంలోనే కాకుండా పగటి కూడా తిరుగుతున్నట్టు కనిపించట్లు గుర్తించారు .రెండు నుంచి మూడు పులులు ఈ అడవుల్లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.  ఈ పెద్ద పులులు కర్నూలు జిల్లా గుండ్లబ్రహ్మేశ్వరం  శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి నల్లమల శేషాచలం కారిడార్ ద్వారా చిత్తూరు ప్రాంతానికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు.గతంలో లంకమల పరిసర ప్రాంతాల్లో పులి కనిపించిన ప్రచారం జరిగింది . నల్లమల ,లంకమల,శేషాచలం అడవులను కలుపుతూ టైగర్ జోన్ ను కూడా గతంలో ఏర్పాటు చేశారు . ఈ పరిస్థితుల్లో నలమలశేశాచలం అటవీ కారిడార్ లో పులి ప్రత్యక్షం కావడం చూస్తే ఇక నలమల, లంకమల  శేషాచలం అడవుల్లో కూడా పులుల సంచారం పెరిగే  అవకాశాలు ఉన్నాయి.

భారీగా ఎర్రచందనం స్వాధీనం...నలుగురు స్మగ్లర్లు అరెస్ట్

  ఉమ్మడి కడప జిల్లాలో ఎర్రచందనం తరలిపోతూనే ఉంది .టాస్క్ ఫోర్స్ పోలీసులు  దాడులు చేసి పలు చోట్ల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు‌. స్మగ్లర్ లను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా స్మగ్లర్లు ఏదో ఒకచోట స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మైదుకూరు మండలంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం పోలీసు స్వాధీనం చేసుకున్నారు .ఇందుకు  సంబంధించిన వివరాలను మైదుకూరు డీఎస్పి రాజేంద్రప్రసాద్ విలేకరులకు వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 ఎర్రచందనం దుంగలు ,గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్న టాగ్లు తెలిపారు. దుంగలను స్వాధీనం చేసుకుని స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారు పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడికి దిగినట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో విజవంతంగా విధులు నిర్వహించిన మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్, దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ సిబ్బందిని డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ అభినందించారు.  

ఏపీలో కుండపోత వానలు... గోదావరి ఉగ్రరూపం

  ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయి.. ప్రజలకు ఇబ్బందులు కాకుండా చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఇప్పటికే రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. ఇక కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు .ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రేపు(గురువారం) ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. గోదావరి నదిలో అంతకంతకూ వరద పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరదలకు సంబంధించి సమాచారాన్ని, పరిస్థితిని పరీవాహక ప్రజలకు అందించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ హెల్ప్‌లైన్ నంబర్ 91549 70454 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

కుప్పంలో 2 కొత్త పారిశ్రామిక పార్కులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో రెండు  కొత్త పారిశ్రామిక పార్కులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పార్కుల్లో మదర్ డైరీ ఆధ్వర్యంలో డైరీ క్యాటిల్ ఫీడ్, ఫ్రూడ్ పల్ప్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పాలు, పండ్ల ఉత్పతులకు విలువ పెరుగుతుంది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లబ్థి చేకూరనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తాయని పరిశ్రమల కార్యదర్శి ఎన్. యువరాజ్ తెలిపారు.  కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని  అన్నారు. పాడి మరియు పశువుల దాణా ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఇప్పటికే భూమిని కేటాయించారు మరియు "మదర్ డెయిరీ త్వరలో పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుందని" ఆయన పేర్కొన్నారు.   కుప్పం డివిజన్‌లో పేదరిక నిర్మూలన మరియు గ్రామీణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో ఈ ప్రాజెక్టులు కేంద్రంగా ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. "కుప్పం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ఈ రెండు పార్కులు సిద్ధంగా ఉన్నాయి, వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయి" అని ఆయన అన్నారు. 

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

  2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బీడ్ వేసేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గోనన్నాయి. భారత్ బీడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది.  కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.  2026 గ్లాస్గో క్రీడల మాదిరిగా కాకుండా, 2030లో పూర్తిస్థాయిలో అన్ని క్రీడాంశాలతో గేమ్స్ నిర్వహిస్తామని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రోహిత్ రాజ్‌పాల్ అన్నారు. "భారత్‌కు ఎక్కువ పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ వంటి క్రీడలతో పాటు మన దేశీయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోలను కూడా చేర్చాలనియోచిస్తున్నాం" అని ఆయన వివరించారు. కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో సమావేశమై ఆతిథ్య దేశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్ గతంలో 2010లో ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

వరదలో చిక్కుకున్న హాస్టల్‌ విద్యార్థులు...వర్ష బీభత్సం

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీరుతో పొంగిపొర్లుతున్నాయి.. ఈ క్రమంలోని మెదక్‌లో  ఉన్న హాస్టల్లో వరద నీరు భారీగా చేరుకోవడంతో ఆ హాస్టల్లోని  400 మంది విద్యార్థులు తమను రక్షించాలంటూ అధికారులను వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు హాస్టల్కు చేరుకున్నారు. ఫైర్ బోట్ల ద్వారా 150 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు.ఇంకా మిగిలిపోయిన విద్యార్థులని బయటకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు సహాయంతో ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీరుతో జలమయమయ్యాయి. వరద నీటిలో  చిక్కుకుపోయిన ప్రజలను పోలీసులు, ఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు రెస్క్యూ చేసి వారందరినీ రక్షించి బోట్ల ద్వారా సురక్షిత మైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది.  కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

‘ఈ’ కార్లు ఇక...ఇక్కడి నుంచి ఎక్స్ పోర్ట్

  దేశంలో విద్యుత్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ గుజరాత్ హన్సల్ పుర్ మారుతీ సుజుకి మోటార్ ప్లాంట్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ విటారాతో పాటు హై బ్రెడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే  తొలి ప్లాంటు కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనో పాల్గొన్నారు. భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదెంతో కీలకమని.. ఇక్కడ ఉత్పత్తి చేయనున్న కార్లు వంద దేశాలకు ఎక్స్ పోర్ట్ కానున్నాయని.. ఈ కార్యక్రమానికి ముందు మోడీ ఎక్స్ వేదికగా రియాక్టయ్యారు. ఇ విటారా.. తొలి కారు యూకేకి ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానున్నాయి. దీంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్ కారు ఇ విటారాను జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. తద్వారా భారత్ ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా తీర్చి దిద్దాలనుకుంటున్నట్టు సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అప్పట్లో ఈ విషయం చెప్పారు.. కూడా. మారుతీ సుజుకీ ఇ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోందని అన్నారు.  భారత్ లో ఇ విటారా తయారీకి 2 వేల 100 కోట్లు వెచ్చించినట్టు చెబుతున్నారు సుజుకీ ప్రతినిథులు. తమ ఈవీలో కొన్న వారికి స్మార్ట్ హోం ఛార్జర్, ఇన్ స్టలేషన్ సపో్ట్ ను అందించేలా చెప్పారు. తొలి దశలో వంద ప్రధాన నగరాల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు పెడుతున్నట్టు చెప్పారు. ప్రతి ఐదు పది కిలోమీటర్లకు ఒక మారుతీ సుజుకీ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.

భూమన చెప్పిన...ఈ రజియా సుల్తానా ఎవరు శ్రీలక్ష్మీ?

  భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా అంటూ మండి పడ్డారు. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుందీ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిణి కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరనే దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. ఒక వేళ అదే నిజమైతే.. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్- మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సి వస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకూ ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయినా ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకుని, పురుషాధిక్యతను అధిగమించి.. సింహాసనం అధిరోహించి.. సైన్యాన్ని నడిపించి, రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లేడీ లీడర్ గా చెబుతుంది ఆమె బయోగ్రఫీ. ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలసి యుద్ధరంగంలో పోరాడేదని చెబుతుంది చరిత్ర. అంతే కాదు.. ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మాములుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్ గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు. ఇదంతా ఇలా ఉంటే.. ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ప్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైయస్ హయాంలో.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలు అన్నీ చేయించుకుని.. ఇప్పుడామెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేని పోని మారు పేర్లను తగిలించడం.. ఏమనుకోవాలన్నది చాలా మంది వేస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సీపీఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి- వైయస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై.. జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకూ వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో... ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం. ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం వారి స్వలాభ.. స్వార్ధం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమై పోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.

తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్.. రేపు శ్రీవారి దర్శనం

  శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు.  గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి.నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.  ఈ ఉప రాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుంది. అదే రోజు.. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.  

మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు...రెడ్ అలర్ట్ జారీ

  తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ  రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా రేపు ఉదయం వరకు ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు.  కాచిగూడ-మెదక్‌, నిజామాబాద్‌-తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే వరద కారణంగా మూసివేశారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. రేపు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో ప్రకటించారు   

కాణిపాకం దేవస్థానంలో అన్నప్రసాద భవనం ప్రారంభించిన మంత్రి ఆనం

కాణిపాకం దేవస్థానంలో వినాయక చవితి పర్వదినం రోజున నూతన అన్న ప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడడి ప్రారంభించారు   పూతలపట్టు  ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్,  దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన అనంతరం  మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటశాలను   పరిశీలించారు.  అనంతరం అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. కాగా కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు వేభవంగా జరిగాయి. వినాయకచవితా రోజున కాణిపాకంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తారు. వినాయక చవితి మరుసటి రోజు నుంచీ కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. ఈ ఏడాది వినాయకచవితి బుధవారం (ఆగస్టు 27)న వచ్చింది. దీంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు గురువారం (ఆగస్టు 28) నుంచి ఆరంభమౌతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా   వాహన సేవలు, వినాయక కల్యాణోత్సవం, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.