మంచి రోజులు వస్తాయి అధైర్య పడకండి : జగన్

  మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడకుండా ఉండాలని,  ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రజా దర్బార్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకొని వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఈ సందర్భంగా  వైసిపి పార్టీ నాయకులు,  కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, ప్రభుత్వం వినకపోతే పోరాటాలు చేసే దానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిని  ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు.  కూటమి నాయకులు దాడులకు ఎవరు భయపడకూడదని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని వారికి సూచించారు. మంగళవారం ఉదయం తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. *ఘన స్వాగతం  పులివెందుల కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ దగ్గర మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషా , కడప ఎంపీ  వైయస్ అవినాష్ రెడ్డి , కడప నగర మేయర్ కే సురేష్ బాబు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్ మనోహర్ రెడ్డి  అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్చం, శాలువాలు లతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది.

వరద బాధిత మృతులకు రూ.5లక్షల పరిహారం : సీఎం రేవంత్

  వరద సహాయక చర్యలను అధికారులు పకడ్బందీగా అందించాలి  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు , పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  వరదల వల్ల మరమ్మతులకు గురైన పంచాయతీ రోడ్లు, రోడ్లు భవనాల శాఖ రోడ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల క్రింద పునరుద్ధరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.  వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విపత్తుపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులను సీఎం సూచించారు.

సిద్దం సిద్దం అన్నారు... అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమా!

  సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి ఓ సవాల్ విసురుతున్నాను. వైసీపీని సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా ?అసెంబ్లీకి రండి  ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసిపి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసిపి సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఫైర్ అవుతూ సవాలు విసిరారు . అంతేకాదు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికైపైనా చర్చకు సిద్ధం, బాబాయి హత్య పైనా చర్చకు సిద్ధం, దళిత డ్రైవర్ ను  డోర్ డెలివరీ చేసిన ఘటన  పైనా చర్చకు సిద్ధం ,కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామాల పైనా సిద్ధిమంటూ సవాల్ విసిరారు. ప్రజల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ ,బంగారు కుటుంబాలు ,తదితర కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన  అనంతరం ఆయన ప్రజా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసిపి పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఇందుకోసం వైసీపి వారు అసెంబ్లీ కి వచ్చి చర్చించాలన్నారు. ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు     రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే నా ఆశయంమని, ఎవరైనా పింఛను తీసుకోకున్నా వచ్చే నెల అందిస్తున్నామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యంమని అన్నారు .అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి - ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయిని పేర్కొన్నారు .రాయలసీమ ఇకనుంచి రాళ్ల సీమ కాదు, రతనాల సీమను చేస్తామన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని,కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత  చూపించాన్నారు. *గత పాలకు రక్తం పాలించారు. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని,మేం వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని అన్నారు.కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నామని మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని,మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవని ఆడవాళ్ళు పై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీకు చివరి రోజని హెచ్చరించారు. *రాజంపేట మీదుగా కోడూరు కు నీళ్ళు కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని, రాజంపేటలో వ్యవసాయం తగ్గి ఉద్యానపంటలు పెరిగాయని అన్నారు .రాజంపేటలో డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందని అన్నారు. ఒంటిమిట్టను టిడిపి దత్తత తీసుకుందని, అనే కార్యక్రమాలు చేపడతామని, మా దృష్టిలో అభివృద్ధి వేరు రాజకీయాలు వేరని అన్నారు. *నదులు అను సంధానం  గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే చాలు కొండలనైనా పిండి చేస్తామని అన్నారు. *ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని సంజీవని పేరుతో ప్రాజెక్టు తెస్తున్నామని,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసి కొలుస్తున్నారు. *అనర్హులకు పించన్లు సరైనదేనా! అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని,అలాంటి వారికి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా...? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని అన్నారు. వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు, పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారని అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారని,తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని,మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారని అన్నారు. *సీమకు నీళ్ళిచ్చే దారి చూపిన ఎన్టీ ఆర్  రాయలసీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని,రాయలసీమకు నీళ్లు తెస్తామని,నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లానని  భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తామని,రాయలసీమకు కరవు లేకుండా చేస్తామని బరోసా ఇచ్చారు. కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చాని,ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు. సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదని అన్నారు.నా బలం బలగం ప్రజలే అన్నారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అన్నారు. *ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అయినా పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నాని,పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి,సంక్షేమం చేయడమే నాకు తృప్తి కలిగిందన్నారు. అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరని,అప్పు చేసి పప్పు కూడు తింటే... చిప్పే మిగులుతుందని అన్నారు.ఆదాయాన్ని పెంచిపేదలకు సంక్షేమం అందించాలి.. అదే నేను చేస్తున్నానన్నారు. ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని,కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే కారణమన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని,బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాలు చేసినవి గుర్తు పెట్టుకోండి.. అభివృద్ధి వైంకుఠపాళి కాకూడదని అన్నారు.  2019-24లో ప్రభుత్వం మారిందిని, రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని అన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారని ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు . రాజంపేట చంద్రబాబు పర్యటనలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్ధన్ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి  జగన్మోహన్ రాజులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఇతర అధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కవితపై చర్యలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ

  బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై గులాబీ పార్టీ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించినట్లు సమాచారం. అటు బీఆర్‌ఎస్ ఫాలోవర్ల కవిత ట్వీట్టర్, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. మరోవైపు  కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన షాకింగ్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.  కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. కవిత కామెంట్స్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌తో‌ కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.    

కారుని ముంచుతున్న కాళేశ్వరం.. ఆంధ్రా రాగం అందుకున్న గులాబి దళం

లైఫ్ జాకెట్ గా పనికొస్తుందనేనా?  కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీ  సుదీర్ఘంగా చర్చించి ఆ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.  దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుని తమ పుట్టి ముంచుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టా ల్సిందిగా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నాలు, రాస్తారోకోలు,  ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించడానికి కాంగ్రెస్, బిజెపి కుట్రగా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ నిర్ణయాన్ని అభివర్ణించారు. ఈ  కుట్ర ను తీవ్రంగా ప్రతిఘటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏముంది?  కేటీఆర్ మాటలు, వ్యాఖ్యలు, ఆందోళనలకు పిలుపునివ్వడం ఇవన్నీ ఆయనలో, బీఆర్ఎస్ లో ఆందోళనకు, నిరాశకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడిన ప్రతి సారీ ఆ పార్టీకి తెలంగాణ వాదం గుర్తుకువస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ పై విద్వేషం తన్నుకొస్తుంటుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత అయిన దానికీ కాని దానికీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువ కావచ్చునన్నది వారి యోచనగా కనిపిస్తోంది.  

ఇంతదాకా వచ్చాకా బీఆర్ఎస్ ఉంటే ఏంత? పోతే ఎంత

అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ కుమార్ కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర కవిత సంచలనం తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉందనీ కుంబడద్దలు కొట్టారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు కనుకే రెండో టర్మ్ లో ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చెప్పిన కల్వకుంట్ల కవిత... హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వల్లనే  కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని చెప్పారు.  తనపై కుట్రలు చేసినా సహించానన్న ఆమె.. ఇప్పుడు తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  అవినీతి అనకొండలైన హరీష్, సంతోష్ లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కవిత.. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు.  తాను ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్న ఆమె.. సామాజిక మాధ్యమంలో తనపై హరీష్, సంతోష్ కు ఇష్టమొచ్చినట్లుగా రాతలు రాయిస్తున్నారని ఆరోపించిన ఆమె  కేసీఆర్ పైనే సీబీఐ కేసులుపెట్టే స్థాయికి వచ్చిన తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ భావోద్వాగానికి లోనయ్యారు.  

ఆడుదాం ఆంధ్రా స్కాం.. మాజీ మంత్రి రోజా అరెస్టుకు ముహూర్తం ఖరారైందా?

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో  రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలకు, మరీ ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ విజిలెన్స్ దర్యాప్తు తేల్చడంతో ఇప్పుడు ఇహనో అరెస్టు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రత్యర్థులపై  నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆడుదాం ఆంధ్రా స్కాంపై దర్యాప్తు పూర్తయ్యింది. విజిలెన్స్ తన దర్యాప్తు నివేదికను డీజీపీకి అందజేయడం కూడా జరిగింది. దీనిపై సాప్ చైర్మన్ రవినాయుడు ఈ నెల 5వ తేదీ లోగా ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్య తీసుకుంటామని చెప్పారు.  ప్రభుత్వానికి ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి విజిలెన్స్ నివేదిక అందింది ఈ స్కాంలో ప్రమేయం ఉన్న వారందరిపై లింగ వివక్షకు   తావులేకుండా చర్యలు తీసుకుంటామని, ఈ నెల 5 లోగా అరెస్టులు ఉంటాయనీ  సాప్ చైర్మన్  రవినాయుడు చేసిన వ్యాఖ్యలతో రోజా అరెస్టునకు రంగం సిద్ధమైందా అన్న చర్చ జోరందుకుంది.   జగన్ హయాంలో ప్రభుత్వం రూ. 119 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసిన ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉణ్న సంగతి తెలిసిందే.   బహుమతి డబ్బు పంపిణీలో దుర్వినియోగం,  నాసిరకం  స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీపై పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి.  జాతీయ కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్  ఆడుదాం ఆంధ్ర అక్రమాలు, కుంభకోణంపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొత్తం అప్పటి మంత్రి రోజా, అప్పటి సాప్ చైర్మన్  పెత్తనం కిందే జరిగింది.   ఈ నేపథ్యంలోనేఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని వారెంతటి వారైనా సెప్టెంబర్ 5 లోగా అరెస్టు చేస్తామంటూ శాప్ చైర్మన్ రవినాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా రోజా అరెస్టు తధ్యమన్న చర్చకూ తెరలేపాయి.  

రేవంత్ వ్యూహంతో మారిన జూబ్లీ సీన్!

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అనివార్యం అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ముహూర్తం ఇంచుమించుగా ఖారారైంది. అందరూ అనుకుంటున్నట్లుగానే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, జూబ్లీ ఉప ఎన్నిక జరగ వచ్చని అన్నారు. అంటే అక్టోబర్ లేదా  నవంబర్ లో జూబ్లీ ఉపఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  ఉప ఎన్నిక ముహూర్తం విషయం పక్కన పెడితే..  జూబ్లీ ఉపఎన్నిక రోజు రోజుకు రంజుగా మారుతోంది. ఆసక్తిని పెంచుతోంది. కొత్త కోణాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ  జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ ,మాజీ ఎంపీ అజారుద్దీన్  బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.అంతే కాదు..  ఆయన రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా  నేరుగా ఢిల్లీ నుంచే  టికెట్’ కన్ఫర్మ్  చేసుకున్నారనే  ప్రచారం కూడా జరిగింది.  అయితే.. కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా అజారుద్దిన్ ను గవర్నర్ కోటాలో పెద్దల సభ (శాసనమండలి) కి పంపాలని నిర్ణయించింది.  ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటుగా అజారుద్దీన్ ను శాసన మండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నిజానికి.. మాగంటి మరణ వార్త చెవిన పడిన క్షణం నుంచే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్  జూబ్లీ టికెట్ తనదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పడు అజారుద్దీన్  టికెట్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అదలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా లెక్కలతోనే..  అజారుద్దీన్ ను రేసు నుంచి తప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వం పట్ల అంత సుముఖంగా లేరనీ,  అందుకే  అజారుద్దీన్  తనకు తానుగా  జూబ్లీ అభ్యర్ధిగా ప్రకటించుకున్న సమయంలో  పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్  గట్టి వార్నింగ్’ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తపరిచిన నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ అజారుద్దీన్ ను గాంధీభవన్  కు  పిలిపించి మరీ క్లాసు తీసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాల్లో వినిపించింది.       అలాగే..  కాంగ్రెస్ పార్టీ అనధికార మిత్ర పక్షం ఎంఐఎం కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మరోవంక లక్షకు పైగా ముస్లిం ఓటర్లున్న జూబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలంటే  ఎంఐఎం మద్దతు అనివార్యం.  అందులో అనుమానం లేదు. ఈ కారణంగానూ  అజరుద్దీన్  ను తప్పించి  గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీ చేసిన బీసీ నాయకుడు నవీన్ యాదవ్  ను ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి..  మొదటి నుంచి కూడా నవీన్ పేరు వినిపిస్తూనే వుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నవీన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది.  అలాగే  నవీన్ యాదవ్ ను బరిలో దించితే ఎంఐఎం మద్దతు పొందడమే కాకుండా, బీసీ ఛాంపియన్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అవుతుందని, బీసీ నినాదానికి మరింత బలం చేకూరుతుందని  విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా.. బీజేపీ, హిందుత్వ రాజకీయాలను, హిందూ ఓటు బ్యాంక్  పోలరైజేషన్  ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్ట వచ్చని రేవంత్ రెడ్డి  భిన్న కోణాల్లో లెక్కలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.  అయితే..  ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బి.రామ్మోహన్, మైనారిటీ వర్గం నుంచి ఫహీం ఖురేషి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు  తెలుస్తోంది. అయితే..  చివరకు ఏమి జరుగుతుంది? హస్తం టికెట్ ఎవరి చేతికి చిక్కుతుంది?  అన్నది స్టిల్ ఏ పజిల్ .. ఇప్పటికీ ఎటూ తేలని ప్రశ్నేై!

బీజేపీయే రైట్ అని తేలింది.. కేంద్ర మంత్రి బండి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై తాము చేస్తున్న పోరాటం నేటికి ఫలించిందనీ, కాళేశ్వరంపై బీజేపీ వైఖరే సరైనదని రుజువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడాన్ని స్వాగతించిన బండి సంజయ్.. సోమవారం మీడియాతో మాట్లాడారు.  కాళేశ్వరం అవినీతిపై బీజేపీ తొలి నుంచీ సీబీఐ విచారణ కోరుతున్న సంగతిని గుర్తు చేశారు.  ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలని ఆయన రేవంత్ ను కోరారు.  

కాళేశ్వరంపై రేవంత్ సేఫ్ గేమ్

  కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించిన రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే… అవును అనే అంటున్నారు పరిశీలకులు…. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు.  కమిషన్ నివేదిక రాగానే ఆలస్యం చేయకుండా క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆదివారం సెలవు దినం అయినా ఆఘమేఘాలపై అసెంబ్లీని సమావేశపరిచి కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు ఉపక్రమించారు. చర్చలో మంత్రులంతా మూకుమ్మడిగా విడివిడిగా బీఆర్ఎస్ పై దాడిచేసి ఉక్కిరి బిక్కిరి చేశారు.  అర్ధరాత్రి వరకు చర్చను నడిపి చివర్లో సీబీఐ విచారణకు ఆదేశించారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఆయన బాస్ రాహుల్ గాంధీ లు సీబీఐ అనేది కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు చేశారు. అదే కీలుబొమ్మ అని విమర్శలు గుప్పించిన సంస్థకే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించిన రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.   కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే అంతుతేలుస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.. బీజేపీ నేతల ప్రకటనలను అవకాశంగా తీసుకొని తను సేఫ్ గేమ్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. సీబీఐ విచారణలో అవకతవకలు గుర్తించి కేసీఆర్, హరీష్ లపై కేసులు నమోదు చేసి అరెస్టులకు దారితీస్తే తాను ఎవరినీ వేధించడం లేదని చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పవచ్చు… అదే సమయంలో తాను అనుకున్నది సాఫీగా తన చేతులకు మట్టి అంటకుండా జరిగిపోతుందని రేవంత్ భావిస్తున్నారు.  ఒకవేళ విచారణ సమయంలో జాప్యం జరిగినా తాను ఆశించినది  జరగకపోయినా బీజేపీ- టీఆర్ఎస్ లు ఒకటేననే ఆయుధాన్ని బయటకు తీసి రెండు పార్టీలను ఎండగట్టే అవకాశం తనకు ఎలాగూ ఉంటుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తనపైన కాంగ్రెస్ పార్టీపైన బీఆర్ఎస్- బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ విచారణ అంశం పనకివచ్చే  అవకాశముంది. ఎటుచూసినా బీజేపీ- బీఆర్ఎస్ లను ఇరుకున పెట్టే దిశగా రేవంత్ పావులు కదిపారు..

సీబీఐ విచారణట.. వింటున్నారా రాహుల్?.. కేటీఆర్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ వేడిని రగిలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు, అవకతవకలు అవినీతి జరిగిందని తొలి నుంచీ ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్ల నిర్విరామ పోరాటంతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ను శిక్షిస్తారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతుంటే... కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్ గాంధీ సీబీఐపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ.. ఏపీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అంటోంది.. దీనిపై మీ స్పందనేంటి అంటూ ప్రశ్నించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా..  మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ  సీఎం కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.  ఆ విషయం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.  తంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందనీ,  అవి ప్రతిపక్షాలను నాశనం చేసే సెల్స్ గా మారిపోయాయని రాహుల్ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఆప్పట్లో రాహుల్ ఈ మేరకు చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్లను కూడా తన పోస్టుకు జోడించారు.  ఒకప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించిన దర్యాప్తు సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను ఎలా అప్పగిస్తుందని కేటీఆర్ నిలదీశారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా   తగ్గేదే లేదని పేర్కొన్నా ఆయన రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామన్నారు.   న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా తమకు పూర్తి విశ్వాసముందన్న కేటీఆర్  స కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

కేసీఆర్, హరీష్ కు హైకోర్టులో చుక్కెదురు

కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిలిపివే యాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది.  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న వారి విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు... మంగళవారం ఉదయం ఈ పిటిషన్ విచారణ చేపడతామని పేర్కొంది. అయితే  అప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటి రోజే  అంటే సోమవారం (సెప్టెంబర్ 1)  కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

హైటెక్ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణం.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేక మైన రోజు. ఆయన ఒక్కరికే కాదు.. ఆయనను అభిమానించే కోట్లాది మందికి కూడా ఇది చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కిందట ఆయన తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఔను 1995 సెప్టెంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ తరువాత ఆయన మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన మొట్టమదటి సారి ముఖ్యమంత్రి అయిన రోజు మాత్రం ఎవరూ ఎప్పటికీ మరచిపోరు. ఇక ఆయన కుటుంబీకులకు అయితే ఈ రోజు మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎమోషన్ అయ్యారు.  తన తండ్రి తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. తన మెంటార్, బాస్ అన్నీ నాన్నే అంటూ ఆయనకు విషెస్ తెలిపారు.  హైటెక్ నుంచి క్వాంటమ్ వాలీ వరకూ, బయోటెక్ ఆస్పిరేషన్ నుంచి డేటా ఆధారిత వ్యవస్థల వరకూ చంద్రబాబు అద్భుత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.  తనకు రాజకీయాలలో ఓనమాలు దిద్దించి, వేలుపట్టుకుని నడిపించిన తండ్రి సాధించిన ఈ ఘనత మైలు రాయికంటే గొప్పదని లోకేష్ పేర్కొన్నారు. ఇంట్లో నాన్నా అని పిలుచుకునే చంద్రబాబును పని ప్రదేశంలో బాస్ అని పిలిచే అద్భుత అవకాశం, అదృష్టం తన సొంతమని తండ్రికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.  

కాళేశ్వరంపై దర్యాప్తు సీబీఐకి.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై  రాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) ప్రకటించారు. కాళేశ్వరంపై రాష్టర ప్రభుత్వం నియమించిన కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఆదివారం (ఆగస్టు 31) సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం సీఎం రేవంత్ కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, అవకతవకల కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు  ప్రకటించారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను,  అవకతవకలను ఎత్తిచూపాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది. ఇక ఆదివారం (ఆగస్టు 31) సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై ఆదివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు సుమారు 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.   అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకూ,  జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు సమగ్రంగా సభకు తెలిపారు.   

చంద్రబాబు అను నేను @30

ఏపీ అంటే బాబు- బాబు అంటే ఏపీ. అది ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అయినా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అయినా ఆయ‌న ముద్ర చాలా చాలా స్ప‌ష్టంగా ఉంటుంది. రాజ‌కీయాలంటే జ‌న‌సామాన్యంలో.. ఒక ఆస‌క్తి క‌ల‌గ‌జేసింది కూడా చంద్ర‌బాబు అనే చెప్పాలి. అటు ప్ర‌ధానుల‌ను, రాష్ట్ర‌ప‌తుల‌ను కాదు.. ఒక‌రిద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుదే.  ఇక చంద్ర‌బాబు ప్ర‌భావంతో ఎంత మంది యువ‌త ఐటీ నిపుణుల‌య్యారో చెప్ప‌లేం. త‌న సతీమణి భువ‌నేశ్వ‌రి  స‌హా ఎంద‌రు మ‌హిళా మ‌ణులు వ్యాపార‌వేత్త‌లుగా రాణించారో.. ఎంద‌రు ఆయ‌న స్ఫూర్తిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక చంద్ర‌బాబంత‌! చంద్ర‌బాబు సీఎంగా తొలి సారి ప‌గ్గాలు చేప‌ట్టి 2025, సెప్టంబ‌ర్ 1నాటికి సరిగ్గా ముప్పై ఏళ్లు అవుతోంది. ఈ ముప్పై ఏళ్ల‌లో నాలుగు సార్లు సీఎం అయ్యారాయ‌న‌. అప్పుడ‌ప్పుడూ ఓట‌మి ద్వారా ఏర్ప‌డ్డ r ఉత్థాన పతనా ల‌ను ఎదుర్కుంటూనే తిరిగి కోలుకోవ‌డంలో ప‌డిలేచిన కెర‌టానికే పాఠాలు నేర్పించ‌గ‌ల స‌మ‌ర్ధుడు చంద్ర‌బాబు. బాబు అంటే మోడ్ర‌న్ అడ్మినిస్ట్రేష‌న్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని    బిల్ క్లింట‌న్, బిల్ గేట్స్ ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.   వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం చ‌దివినా తెలిసిపోతుంది. బాబు సామ‌ర్ధ్యానికి ప‌రీక్ష పెట్టిన ఎన్నిక‌లు 1999 నాటివి. అస‌లైన ఎన్టీఆర్ వార‌సులెవ‌రో ప్ర‌జ‌లు త‌మ ఓటుతో తెలియ చెప్పే ఎన్నిక‌లు కూడా అవే. ఆ ఎలెక్ష‌న్ల‌లో చంద్ర‌బాబు..   44.14 శాతం ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  తర్వాత 2004, 2009ల్లో వరుస ఓటములు ఎదుర‌య్యాయి. అవి ఇటు పార్టీకి కానీ, అటు బాబుకు కానీ అత్యంత క‌ఠిన‌మైన రోజులు. మాములుగా అయితే ఇలాంటి క‌ష్ట‌కాలం త‌ట్టుకోలేక ఇత‌రులు పారిపోతారు. పార్టీ ప‌ట్టు జార‌విడుస్తారు. కానీ బాబులో ప‌ద‌వి, అధికారం ఉండ‌టం వ‌ల్ల మాత్ర‌మే రాణించ‌డం అనేది ఉండ‌దు గాక ఉండ‌దు.  బాబు- బ్ల‌డ్ పాలిటిక్స్, బాబు- ఫుడ్ పాలిటిక్స్, బాబు- బెడ్ పాలిటిక్స్.. అవి త‌ప్ప త‌న‌కేమీ తెలీదు. ఆ మాట‌కొస్తే రాజ‌కీయ‌మంటే అధికారంలో ఉండ‌టం మాత్ర‌మే కాదు.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంలోనే మ‌రింత ఎక్కువ రాజ‌నీతి ప్ర‌ద‌ర్శించే అవ‌కాశ‌ముంద‌ని దాన్ని కూడా విప‌రీతంగా ప్రేమించి అక్క‌డా త‌న‌దైన మార్క్ పాలిటిక్స్ తెలుగు జాతికి చ‌వి చూపిన  వన్ అండ్ ఓన్లీ లీడ‌ర్ చంద్ర‌బాబు. చంద్ర‌బాబును ప్ర‌త్యేకించి పొగ‌డ‌క్క‌ర్లేదు. ఆయ‌నేం చేశారో చెబితే చాలు.. అదే అతి పెద్ద ప్ర‌శంస‌గా మారుతుంది. 2014లో  న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా..  మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు చంద్ర‌బాబు. ఆ తర్వాత 2019లో మ‌ళ్లీ  మ‌రో మారు ఓటమి ప‌ల‌క‌రించింది. అయినా స‌రే, అద‌ర‌క బెద‌ర‌క వెన్ను చూపించ‌క‌.. ముందుకెళ్లి పోరాడ్డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేశారు. ఒక ప‌క్క త‌న శ్రేణులు ఎన్నో ఎదురు దెబ్బ‌లు తింటున్నారు.. మ‌రో ప‌క్క ఇటు త‌న పార్టీ లీడ‌ర్లు అరెస్టులు, దాడులు వంటి ప్ర‌మాదాల‌ను ఎదుర్కుంటున్నా.. ముందుకెళ్ల‌డం త‌ప్ప వెన‌క్కు మళ్ల‌డం సాధ్యం కానిద‌ని బ‌లంగా న‌మ్మారు చంద్ర‌బాబు. ఆ మాట‌కొస్తే ఆ విధంగా ముందుకెళ్ల‌డ‌మే బాబు మార్క్ పాలిటిక్స్ గా ఈ తెలుగు రాష్ట్రాల‌కు చాటి చెప్పారాయ‌న‌. 2019-24 మ‌ధ్య ఆ ఐదేళ్ల జగన్ పాల‌న‌లో ఏపీ ఎన్నిర‌కాలుగా న‌ష్ట‌పోయిందో లెక్క క‌ట్ట‌డం చాలా చాలా క‌ష్టం. మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతం అత్యంత దారుణంగా దెబ్బ తింది. ఏ దుష్ట‌క‌న్ను ప‌డింతో..తెలియ‌దు కానీ ఒక్క‌సారిగా జ‌నం విల‌విల‌లాడిపోయారు. ఇటు జ‌నం మాత్ర‌మే కాదు అటు బాబు సైతం వ్య‌క్తిగ‌తంగా ఎన్నో అవ‌మానాల‌ను చ‌వి చూశారు. చివ‌రికి ఆయ‌న స‌తీమ‌ణిని సైతం అవమానించడానికి వెనుకాడలేదు జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న‌.  అల‌నాడు నిండు స‌భ‌లో ద్రౌప‌దికి జ‌రిగిన అవ‌మానంలాంటిది చేసి చూపింది జ‌గ‌న్ దుర్యోధన‌, దుశ్శాస‌న  పాల‌న‌. ఈ కురుస‌భ గౌర‌వ స‌భగా మారిన‌పుడు మాత్ర‌మే తాను తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడ‌తాన‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేసి బ‌య‌ట‌కెళ్లిపోయారు  చంద్ర‌బాబు. ఆ త‌ర్వాత 2023 సెప్టంబ‌ర్ 9న  బాబు జైలుకెళ్ల‌డం రాష్ట్ర చరిత్ర‌లోనే ఒక చీక‌టి అధ్యాయంగా న‌మోద‌య్యింది. అయినా స‌రే ఆ అష్ట‌క‌ష్టాల‌కు ఓర్చి... 2024లో కూట‌మి క‌ట్టి విజ‌య ఢంకా మోగించారు చంద్ర‌బాబు.  ఇది 1999 ఎన్నిక‌ల నాటిక‌న్నా అతి పెద్ద విజ‌యంగా న‌మోద‌య్యింది. కూట‌మితో ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. కూట‌మి స‌పోర్టు లేకున్నా.. పెద్ద మొత్తంలో మెజార్టీ సాధించి బాబు త‌న‌దైన మ్యాజిక్  చేసి చూపించారు. నాలుగో సారి   ముఖ్య‌మంత్రి అయ్యి తిరిగి న‌వ్యాంధ్ర ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేలా చేశారు.  ఒక స‌మ‌యంలో నాకొక్క ఛాన్స్ అంటూ అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ జ‌నం కూడా మాకొక్క ఛాన్స్ వ‌చ్చి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే తిరిగి చంద్ర‌బాబు చేతికే పాల‌న అందించాల‌న్న కృత నిశ్చయానికి వచ్చారు. దీంతో ఆయ‌న మ‌రోమారు ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్కి బాబు@4. 0 పాల‌న‌కు శ్రీకారం చుట్టారు. ఇది క్లుప్తంగా చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త చ‌రిత్రే అయినా.. ఇది  రెండు రాష్ట్రాల‌కు చెందిన సుమారు 10 కోట్ల మంది చ‌రిత్ర కూడా. ఉమ్మ‌డి, విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముప్పై ఏళ్ల నాటి రాజ‌కీయ r ఉత్థాన పతనాల చ‌రిత్ర కూడా.

ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు మంత్రి లోకేష్ కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేశ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి మంత్రిలోకేష్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటై ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానాన్ని పంపారు.   ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో లోకేష్ చేస్తున్న కృషిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసిస్తూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ ను కోరింది. ఈ ప్రతిష్ఠాత్మక స్పెషల్ విజిట్స్ లో   ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2001లో  పాల్గొన్నారు. లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామి కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమై ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలైనా, విద్యా, స్కిల్ డెవలప్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై  చర్చించేందుకు దోహదపడుతుంది.  

పులివెందులపై జగన్ పట్టు సడలిందా?

నాలుగున్నర దశాబ్దాలకు పైబడి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు పరస్థితి మారుతోందా? జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? పులివెందుల నాయకులు, స్థానిక ప్రజలకు ఆయన దూరం అవుతున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  జగన్ సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ దూరం ప్రారంభమైందంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా జగన్ పులివెందుల నియోజకవర్గ వాసులతో మమేకమైన పరిస్థితి లేకపోవడం, అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక, కేవలం నియోజకవర్గ ఎమ్మెల్య స్థాయికే పరిమితమైన సమయంలో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకావడానికి ఇసుమంతైనా ప్రయత్నించకపోవడంతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.  ఆ అసంతృప్తే ఇటీవల పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిఫలించిందన్న చర్చ జోరుగా సాగుతోంది.    వాస్తవానికి పులివెందుల ప్రజలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న కలివిడి తనమే ఆయన, ఆయన కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో రాణించే అవకాశానికి కారణమైంది.  వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లవేళలా పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పులివెందుల నుంచి ఎవరు వచ్చినా  ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, వారు ఏ పనిమీద వచ్చారో కనుక్కుని ఆ పని చేసి పంపించేవారు.  ఆయన పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల వాసులు ఆయననూ, ఆయన కుటుంబాన్నీ గుండెల్లో పెట్టుకునేలా చేసింది. పులివెందుల ప్రజలకు ఆయన పట్ల ప్రజలలో ఉన్న అభిమానమే.. ఆయన తదననంతరం జగన్ ను కూడా అక్కున  చేర్చుకునేలా చేసింది. అయితే జగన్ ఆ ఆదరణను నిలుపుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్  నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా జనాలకు కూడా దురమయ్యారని స్థానికులే చెబుతున్నారు.  ఆ కారణంగానే జగన్ కు పులివెందులలో మునుపటి స్థాయి ఆదరణ, పట్టు కొరవడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైయస్ ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రిగా  బిజీగా ఉన్నా ఆయన అందుబాటులో లేని లోటు కనిపించకుండా  సోదరుడు దివంగత వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే వారు. అటువంటి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టుకోవడం కూడా పులివెందుల ప్రజలు జగన్ కు దూరం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారిందంటున్నారు.  అలాగే వైఎస్ కుటుంబ విభేదాల కారణంగా కూడా పులివెందుల జనంలో జగన్ పట్ల విముఖతకు కారణంగా చెబుతున్నారు. పులివెందులలో ఇప్పటివరకు జరిగిన జడ్పిటిసి ఎన్నికల విషయానికి వస్తే 1994, 2001, 2007, 2013, 2021  ఎన్నికల్లో గెలిచినా, ఏకగ్రీవం అయినా వై ఎస్ కుటుంబ మద్దతుతో పోటీ చేసిన వారే . అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1978 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వై ఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు.  చివరగా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గత ఎన్నికల మెజారిటీ తగ్గినా మరో సారి జగన్ మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడానికి కారణమయ్యాయి. అయితే  2019 ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన పరిణామాలు  పులివెందులలో జగన్ పట్టు జారిపోవడానికి కారణం అని చెప్పాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కు వైఎస్ కుటుంబం మొత్తం అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయ్ వివేకానందరెడ్డి.. ఇలా అందరూ అన్ని విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కూడా జగన్ కు ప్రజా సానుభూతి వెల్లువెత్తి వైసీపీ ఘన విజయానికి దోహదం చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ముందు సోదరి, ఆ తరువాత తల్లి ఆయనకు దూరం కావడం, అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం దర్యాప్తులో ఎస్టాబ్లిష్ కావడం, వివేకా కుమార్తె న్యాయపోరాటం ఇవన్నీ జగన్ కు పులివెందులలో బలం తగ్గడానికి కారణాలయ్యాయి. అలాగే జగన్  హయాంలో నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి పలు అభివృద్ధి పనులు చేసిన పార్టీ శ్రేణులకు చెందిన కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపునకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా నియోజకకర్గంలో జగన్ కు ఆదరణ తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కలిసి పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా చేశాయి.  ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుంటే.. ఉన్న కొద్దిపాటి పట్టూ జారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాదా?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ పరిస్థితిని రాష్ట్రంలో నానాటికీ దిగజారేలా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అధిష్టానం జోక్యం కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని మెరుగుపరచచడంలో విఫలమైంది. ఇప్పటికీ రాష్ట్రపార్టీలో ముఠాల కుమ్ములాటలు, గ్రూపు తగాదాలూ అలాగే ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బహిరంగంగా ఆ పార్టీ ఎంపీ నుంచే ఘోర పరాభవం, అవమానం ఎదురైంది.  విషయమేంటంటే.. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహరచన తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం  పార్టీ సీనియర్లు, కీలక నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అవమానం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు పదే పదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పేర్కొన్నారు.   ఒక సారి అయితే పొరపాటు అనుకోవచ్చు. కానీ రఘునందనరావు తన ప్రసంగంలో కనీసం అరడజను సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు. పరిశీలకులు, పార్టీ వర్గాలూ కూడా రఘునందనరావు ఉద్దేశపూర్వకంగా, రామచంద్రరావును అవమానించే  లక్ష్యంతోనే అలా మాట్లాడారని అంటున్నారు. రఘునందనరావు, రామచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావును అవమానించడం, చిన్నబుచ్చడమే లక్ష్యంగా రఘునందనరావు అలా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మోడీ నోట తెలంగాణ విమోచన దినం మాట!

ప్రధాని నరేంద్రమోడీ నోట తెలంగాణ విమోచన దినోత్సవం మాట వచ్చింది. తెలంగాణ హైదరాబాద్ నియంతృత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి చెందిన సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు అన్న సంగతి తెలిసిందే. అలాంటి తెలంగాణకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు గురించి ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. మోడీ మన్ కీ బాత్ 125వ ఎపిసోడ్ లో ఆదివారం (ఆగస్టు 31)న తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ  నిజాం నియంతృత్వ కబంధ హస్తాల నుంచీ,  రజాకార్ల దురాగతాల నుంచి విముక్తి చెంది నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిన రోజు సెప్టెంబర్ 17 అన్నారు.  నిజాం పాలనలో  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినా, వందేమాతరం అని నినదించినా చంపేసేవారని పేర్కొన్న మోడీ..  సర్దార్ పటేల్   ఆపరేషన్ పోలోతో తెలంగాణను నిజాం కబంధ హస్తాలనుంచి విముక్తి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ రేడియోలో చేసిన ప్రసంగాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో వినిపించారు.