రాహుల్ బీహార్ పర్యటనలో రేవంత్ కు దక్కిన గౌరవం మామూలుగా లేదుగా?!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్  అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలవడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలే ప్రచారం చేశాయి. ఈ కారణంగానే గత కొద్ది కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పట్ల వ్యతిరేకతతో ఉందని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రైవేటు సంభాషణల్లో గట్టిగానే చెప్పారు. కొందరైతే బాహాటంగానే రేవంత్ వ్యతిరేక వ్యఖ్యలు చేశారు. అయితే అవన్నీ వాస్తవాలు కావనడానికి  తాజాగా తేటతెల్లమైపోయింది. ఆయనకు అధిష్ఠానం వద్ద పలుకుబడి తగ్గడం అటుంచి అనూహ్యంగా పెరిగిందనడానికి  రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహించిన తాజా ప్రచారంలో తేలింది. బీహార్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల నుండి ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.  రాహుల్,  ప్రియాంకలతో రేవంత్ ప్రజార రధాన్ని పంచుకున్నారు. వారిరువురితో కలిసి ఒకే ప్రచార రథంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇదే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడికి, ప్రతిష్టకు, ప్రాధాన్యతకు తిరుగులేని నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషించారు .రేవంత్ నిస్సందేహంగా కాంగ్రెస్ హైకమాండ్ ధృష్టిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నాయకుడని బీహార్ ప్రచారం ద్వారా రుజువైపోయిందని అంటున్నారు.   

పవన్ కల్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన గణేష్ చతుర్థిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని విఘనాయకుడిగా, తలపెట్టే పనులకు ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని భక్తులు పూజిస్తారన్న ఆయన తాను కూడా ప్రజలు తలపెట్టే అన్ని మంచి కార్యాలకూ ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని  ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే పర్యావరణ హితంగా ప్రజలంతా మట్టివినాయకుడినే పూజించాలని పిలుపునిచ్చారు.  

ట్రంప్ ఫోన్ కాల్స్ ను రిజెక్ట్ చేసిన ప్రధాని మోడీ!?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ పేర ఇండియాపై 50శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు ఒకింత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంత కంటే ముందు ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానంటూ క్రెడిట్ కొట్టేయాలన్న ట్రంప్ ప్రయత్నాలను భారత్ బలంగా తిప్పికొట్టింది. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకుంటే టారిఫ్ లు తధ్యమంటూ చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయలేదు.  అమెరికా పెద్దన్న పెత్తనాన్ని ఇసుమంతైనా సహించే ప్రశక్తి లేదని ఇండియా మాటల్లో చేతల్లో విస్పష్టంగా తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు అంత సామరస్యపూరితంగా లేవు. అయితే.. భారత్ తో సంబంధాలను దెబ్బతీసుకుంటే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న భావన అమెరికా వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ట్రంప్ వైఖరిని అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జర్మన్ కు చెందిన ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్  ప్రచురించిన వార్త ప్రకారం ఇటీవలి కాలంలో అంటే భారత్ పై సుంకాల ప్రకటన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీకి పదేపదే ఫోన్ చేశారు. అయితే ఆ ఫోన్ కాల్స్ ను ప్రధాని రిసీవ్ చేసుకోలేదు. అసలు ట్రంప్ తో మాట్లాడేందుకు కూడా మోడీ విముఖంగా ఉన్నారు. ట్రంప్ కనీసం నాలుగు సార్లు మోడీకి ఫోన్ చేశారు. అయితే ప్రధాని మోడీ మాత్రం సంప్రదించలేదు.    ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్  ప్రచురించి వ్యాసం  మేరకు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను చనిపోయిందంటూ చేసిన వ్యాఖ్య.. అలాగే   రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కొనసాగింపునకు వ్యతిరేకంగా భారత్ పై సుంకాల విధింపు విషయంలో మోడీ ఆగ్రహంగా ఉన్నారు.   అందుకే ట్రంప్ టారిఫ్ లు అమలు అయ్యే బుధవారం (ఆగస్టు 27)కు ముందు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మోడీతో సంప్రదించడానికి శతధా ప్రయత్నించినా మోడీ స్పందించలేదు. ట్రంప్ సుంకాల విధింపు అన్యాయమని విస్పష్టంగా తేల్చేసిన భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేయలేదు. అమెరికా ఆంక్షలకు, ఒత్తిడికి తలొగ్గేది లేదని విస్పష్టంగా చెప్పడమే కాకుండా, ట్రంప్ ఫోన్ కాల్స్ ను అటెండ్ చేయకపోవడం ద్వారా మోడీ అమెరికాకు గట్టి హెచ్చరిక లాంటి సందేశం ఇచ్చారని ఆ వార్తా పత్రిక పేర్కొంది. 

స్టైల్ గా గంజా సిగరెట్ తాగుతూ పట్టుబడిన విద్యార్థులు!

తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపా దించాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తూ ఉంటారు. కానీ మరోవైపు విద్యా ర్థులు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియకుండా రహస్యంగా చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తు ను పాడు చేసుకుంటున్నారు. యువత డ్రగ్స్ అనే మహమ్మారి మాయలో పడి దాన్ని సేవించడమే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించడానికి వాటి విక్రయించి, చివరికి  జైలు పాలవుతున్నారు. ఓ పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడిన ఘటన ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగు లోకి వచ్చింది.  బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగిల్ టీం గుర్తించింది. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్‌ స్వాధీనం చేసుకున్నారు.  ఈ విద్యార్థులు.. పోలీసుల కంట పడకుండా గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు.  మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విద్యార్థి ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నాడు. ఆ గంజాయిని నోవెల్ల ఒక్కో గంజాయి సిగరె ట్‌ను రూ.2500కు మిగతా విద్యార్థు లకు అమ్ముతు న్నాడు. ఈ గంజాయి కేసులో నోవెల్ల,అంబటి గణేష్‌, శివకుమార్, జావెద్‌  అనే నలుగురు విద్యార్థులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించి, ఆ నలుగురిని అరెస్టు చేశారు. గంజాయి, ఓజీ కుష్‌ కలిపి సిగరెట్లు తయారు చేసి అమ్మకాలు జోరుగా కొనసాగి స్తున్నారు.అయితే ఢిల్లీకి చెందిన అరవింద్‌ శర్మ అనే వ్యక్తి అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్ చేస్తున్నట్లు  అధికారులు గుర్తించారు.నోవెల్ల అనే విద్యార్థి ఢిల్లీకి చెందిన ముఠాతో  గంజాయి తెప్పించుకుం టున్నాడు.కేవలం విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని గంజాయి విక్రయాలు చేస్తున్నాడు.

కావలి మాజీ ఎమ్మెల్యే ఇంజినీరింగ్ కాలేజీలో మద్యం లోడు!

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ కాలేజీలో మూడు లోడ్ల మద్యం ఉందంటూ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టకున్న ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తన హత్యకు కుట్రపన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెడుతున్న తనపై కక్షగట్టి వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన అవినీతి, అక్రమాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. రాజకీయాలలోకి రాకముందు నుంచే తనకు క్వారీ వ్యాపారం ఉందన్న కావ్యకృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గానికి సంబంధం లేని ఉదయగిరిలొ ఉన్న క్వారీ మీద అధికారులతో దాడి చేయించారని, న్యాయస్థానం వైసీపీ హయాంలోనే తనకు క్లియరెన్స్ ఇచ్చిందనీ పేర్కొన్నారు.   ప్రజలు చిత్కరించుకుంటుంటే తట్టుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో శాంతిభద్రతల విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావలిలో రౌడీ షీటర్లు సంస్కృతిని పెంచి పోషించిందే ప్రతాప్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కావ్యకృష్ణారెడ్డి డోన్ కెమేరాలతో తన కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశారన్నారు.   ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కాకణి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. హత్యారాజకీయాలలో ఆరితేరిన కాకణి, ప్రతాప్ రెడ్డిలు ఇద్దరు కల్తీ మద్యం ముద్దాయిలు, దొంగలు అని విమర్శించారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు లేదనీ, అదే కాకాణిమీదైతే 14 కేసులు కాకణి,   ప్రతాప్ కుమార్ రెడ్డి ఎనిమిది కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని కావ్య విమర్శించారు.

భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ అమలు ఎప్పటి నుంచంటే..?

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదన్న ఒకే ఒక్క కారణంతో.. అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. ఇంకొన్ని గంటల్లోనే అమల్లోకి రానున్నాయి.  దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్.. భారత్‌కు అధికారికంగా నోటీసులు పంపింది.  ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచి.. ఈ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టైమ్ దాటిన తర్వాత నుంచి.. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు  ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుత్తం అదే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. భారత్‌పై ఇప్పటికే.. అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి..  అమల్లోకి వచ్చాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో.. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ప్రెసిడెంట్ ట్రంప్. దాంతో కలిపి.. ఇండియాపై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. టెక్స్‌టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే.. ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే.. ఈ అదనపు టారిఫ్‌లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో.. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.  మరోవైపు.. ప్రధాని మోడీ కూడా ఈ సుంకాల విషయంలో  స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో.. రాడీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెరిగినా.. భరిస్తామని స్పష్టం చేశారు. ఈ అదనపు సుంకాల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దానిని తగ్గించేందుకు  ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి - ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు.  సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైనా చర్చించారు. 50 శాతం సుంకాలు.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలున్నాయి. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.

కుమారుడి నిశ్చితార్ధంపై క్లారిటీ ఇచ్చిన క్రికెట్ లెజెండ్ సచిన్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్ధంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.  సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని ధృవీకరించి గత కొంత కాలంగా అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంపై అభిమానులలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు.    క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిందన్న వార్త ప్రస్తుతం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఓ ముంబై వ్యాపారవేత్త మనుమరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగిందని మీడియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే, ఈ అంశంపై సచిన్ కుటుంబం కానీ, సానియా కుటుంబం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇది అభిమానుల్లో ఉత్కంఠకు దారితీసింది. అయితే..  ఈ విషయమై సచిన్ టెండుల్కర్ తొలిసారిగా స్పందించారు. సచిన్ టెండుల్కర్ ఇటీవల సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించాడు. అభిమానుల ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ప్రస్తావన తెచ్చారు.  అతడికి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం నిజమేనా అని సచిన్‌ను ప్రశ్నించాడు. దీనికి ఆయన అవునని సమాధానం ఇచ్చారు. అవును.. ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతడి జీవితంలో ఓ కొత్త అధ్యాయం ఆరంభమైంది. ఇది మాకెంతో ఆనందం కలిగించే అంశమని రిప్లై ఇచ్చారు. తనయుడిపై సచిన్ తొలిసారి స్పందించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్.  సానియా కుటుంబం.. హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వారివే.  ఇక అర్జున్, సానియాల ఎంగేజ్‌మెంట్ వేడుక అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది.  అర్జున్ ప్రస్తుతం క్రికెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్‌కు బ్యాటింగ్‌పైనా పట్టు ఉంది. గోవా తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టి 532 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టి 119 పరుగులు చేశాడు. 18 లిస్ట్ ఏ మ్యాచుల్లో కూడా ఆడి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 2023 ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచులు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఆ తదుపరి సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.

అవినీతి అనకొండ శ్రీలక్ష్మి.. భూమన సంచలన ఆరోపణలు

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు.   జగన్ అక్రమాస్తుల కేసులోనూ, అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులోనూ కూడా శ్రీలక్ష్మి నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కోన్నారు. కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.   రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. అయితే 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఏపీకి వచ్చేశారు. ఆమెను ఏపీకి తీసుకురావడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేసీఆర్ ను కోరారు. సరే ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ ఆమెకు కీలకమైన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలలో తిరుగులేని పెత్తనం చెలాయించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమెకు తిరుగులేని స్వేచ్ఛ, అధికారాలు అప్పగించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ఖాతరు చేయలేదు.  ఆ తరువాత 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత పరాభవాన్ని ఎదుర్కొంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు ఆమె నుంచి కనీసం బొకే అందుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన క రుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మిని అవినీతి అనకొండగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశేషమేమిటంటే తెలుగుదేశం ఇంత కాలం శ్రీక్ష్మిపై చేసిన విమర్శలన్నిటినీ ఇప్పుడు తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. శ్రీలక్ష్మి ఆమె నిర్వహిస్తున్న శాఖ మంత్రిని కనీసం గౌరవించలేదు సరికదా అవమానించారంటూ ఆరోపించారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్ అన్నారు.  తన కింది ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించేవారని దుయ్యబట్టారు.  తన అక్రమాలకు సహకరించని నాయకులపై ఆమె అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు.  అయితే భూమన ఆమెపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడటం అందరినీ విస్మయపరుస్తోంది. అసలు భూమన ఈ విమర్శలు , ఆరోపణలు జగన్ కు తెలిసే చేశారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో జగన్ భూమనను సమర్ధిస్తారా లేక శ్రీలక్ష్మిని డిఫెండ్ చేస్తారా అన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. లేదా అసలేం జరగనట్లు భూమన ప్రెస్ మీట్ ను పూర్తిగా విస్మరించి మౌనం దాలుస్తారా? చూడాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీలక్ష్మిపై భూమన విమర్శలు జగన్ హయాంలో ఆమె అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఎందుకంటే శ్రీలక్ష్మికి డబ్బు సంపాదించాలన్న యావ తప్ప నైతిక విలువలు లేవని భూమన విరుచుకుప్పడారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో, టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన చెప్పుకొచ్చారు. అందుకే శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం అందించి4 తాను రెండు వేల కోట్టు దోచుకున్నట్లు అసత్య ప్రచారం చేయించారన్నారు.  శ్రీలక్ష్మి 35 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పని చేసినా వందల, వేల కోట్ల లూటీకి పల్పడ్డారనీ, ఆమె అవినీతి వ్యవహారం సుప్రీం కు కూడా తెలుసునని చెప్పరు.  

దావోస్ లో చర్చలు.. ఏపీలో పెట్టుబడులు.. చంద్రబాబు విజన్ కు మరో నిలువెత్తు నిదర్శనం

 ప్రతి అడుగూ ఒక యుద్ధం.. ప్రతి మలుపూ ఒక సంక్షోభం.. ప్రతి యుద్ధం ఒక విజయం.. ప్రతి సంక్షోభం ఒక అవకాశం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితం గురించి  చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చాలు.  ఆయన దూరదృష్టి, రాష్ట్రప్రగతి, ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఆరంభించిన పథకాలు... ఆయన నిర్మిం చిన సైబరాబాద్.. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి ఇలా ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆస్తిగా, ఒక అవకాశాల గనిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన ఈ ఏడాది కూడా దావోస్ లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన అనేక మంది పారిశ్రామిక వేత్తలూ, పెట్టుబడి దారులతో బేటీ అయ్యారు. చర్చలు జరిపారు. ఆ ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల రూపంలో కనిపిస్తున్నాయి.    చంద్రబాబు తన దావోస్ పర్యటనలో భాగంగా  ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా సంస్థ మెర్స్క్ సీఈవోతో బేటీ అయ్యారు. ఈ కంపెనీ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు.  ఆ చర్చల ఫలితం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకువచ్చింది.  ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతాన్ని మెర్స్క్ లాజిస్టిక్ కార్యకలాపాల నిర్వహణ కోసం పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించింది.   మెర్స్క్ అనుబంధ సంస్థ అయిన ఏపీఎం టెర్మినల్స్ నుండి ఆగస్టు 25, 2025న ప్రకటించిన బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డులో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయనున్న తొమ్మిదివేల కోట్ల రూపాయల పెట్టుబడిలో భాగం.  కాగా మెర్క్స్ పెట్టుబడులు రాష్ట్రంలో వర్షించడానికి బీజం.. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో చంద్రబాబు, మెర్స్క్ సీఈవీల మధ్య జరిగిన చర్చలలో పడింది. ఇప్పుడు ఏపీలో పెట్టుబడుల ద్వారా ఆ బీజం మొలకెత్తింది.  

ఉచిత ప్రయాణమే కాదు.. ఆ బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా.. దటీజ్ సీబీఎన్

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు.. అందుకు సంబంధించిన బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా   ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్నిటినీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత 15 నెలల వ్యవధిలోనే ఒక్కటొక్కటిగా అమలు చేసి  ప్రజల హర్షామోదాలను పొందిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలోనూ అనితర సాధ్యమైన చొరవను, ఆసక్తిని చూపిస్తున్నది.  ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఈ నెల 15 నుంచి అమలులోనికి వచ్చింది. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి పథకం అమలులో ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాలలోలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అత్యంత పకడ్డందీగా, ప్రణాళికా బద్ధంగా మొదలైంది. రోజుల వ్యవధిలోనూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మొదటి రోజు గుర్తింపు కార్డుల విషయంలో నెలకొన్న చిన్న గందరగోళం వినా ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. బస్సుల కొరత మాటే వినిపించలేదు. ఓవర్ లోడింగ్, కోట్లాటలు వంటివి కూడా పెద్దగా జరగలేదు.  ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు మందుకు వేసి ఉచిత బస్సుల లైవ్ ట్రాకింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉచిత బస్సు పథకంపై అధికారులతో సమీక్షలో భాగంగా ఆయనీ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సులన్నినీ టి లైవ్ ట్రాకింగ్ చేయాలనీ, ఇది మహిళల భద్రతకు దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు.  అంతే కాదు..  లైవ్ ట్రాకింగ్ మహిళలు ఈ బస్సుల సమయాలను ట్రాక్ చేయడానికి అందుకు అనుగుణంగా  వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చిందంటే ఈ పథకం ప్రజాదరణ, ప్రజామోదం పొందిందనడానికి తార్కానంగా చెప్పుకోవచ్చు.  అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ పథకం పై ప్రభుత్వానికి అందిన ఫీడ్ బ్యాక్ ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. వారి అవసరాల నిమిత్తం మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నారు.  

ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ సమావేశం

  తెలంగాణ కేబినేట్ సమావేశం ఈ నెల 29న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనున్నారు. అనంతరం ఆ రిపోర్టును శాసన సభ సమావేశాల తొలి రోజే సభలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి.  ఈ నెల 29న మంత్రి వర్గ భేటీలో స్పెషల్‌ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెం‍బ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణ రావు ఇవాళ సర్క్యూలర్ జారీ చేశారు  

ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు రిమాండ్ పొడిగింపు

    ఏపీ మద్యం  కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో సిట్ అధికారులు నిందితులను న్యాయస్ధానంలో హాజరుపరిచారు.  రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను జైళ్లకు అధికారులు తరలిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. మిగిలిన 9 మందిని విజయవాడ జైలుకు... అలాగే మరో ఇద్దరిని గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసును ఖండించారు. కస్టోడియల్ విచారణ అని సెట్ తనను అరెస్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఎక్కడా లేదన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినా.. ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆరోపించారు. గతంలో కానీ.. ప్రస్తుతం కానీ ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. లిక్కర్ కేసులో తప్పించి.. ఇప్పటి వరకు తాను అరెస్ట్ కాలేదని చెప్పారు.  

లోకేష్ చొరవతో గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్

తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణానికి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మరింత శోభను ఇచ్చింది. తెలుగురాష్ట్రాలలో బుధవారం (ఆగస్టు 27) నుంచి వినాయక చవిత నవరాత్రులు అత్యంత వైభవంగా, అంబరాన్నంటే సంబరంతో జరగనున్నాయి. వీధి వీధినా గణేష్ పందిళ్లు వేసి తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రులను అత్యంత వేడుకగా జరుపుకోవడం తెలుగురాష్ట్రాలలో ఆనవాయితీ. ఇక ఈ వేడకకు మరింత శోభ, నిర్వాహకులకు, భక్తులకు మరింత ఆనందం చేకూర్చేలా మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మండపాల నిర్వాహకుల వినతి లోకేష్ వద్దకు చేరింది. ఆయన క్షణం ఆలోచించకుండా అందుకు సానుకూలంగా స్పందించారు.   మండప నిర్వాహకుల వినతిపై యఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకు వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడతాయి. అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆయన అన్నట్లుగానే గణపతి మంటపాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాదు. వినాయక చవితి తరువాత వచ్చే దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు కూడా ప్రభుత్వం విద్యుత్ ను ఉచితంగా అందించనుంది. ఈ రెండు పండుగలకూ సంబంధించి ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం పాతిక కోట్ల రూపాయలు కేటాయించింది.  ఈ నిర్ణయంతో మంత్రి లోకేష్ ప్రజా నాయకుడిగా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నట్లు అయ్యింది.   చూడటానికి గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అన్నది ఒక చిన్న చర్య గా కనిపించవచ్చు. కానీ ఇది ప్రజా హృదయాలపై చాలా బలమైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. ఆబాలగోపాలం ఆనందంగా భాగస్వాములై నిర్వహించుకునే ఈ రెండు పండుగల విషయంలో లోకేష్ చూపిన చొరవ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచేయడమే కాదు.. తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను కూడా ఇనుమడింప చేసిందనడంలో సందేహం లేదు.  

తీరు మారని ట్రంప్... ప్రపంచ దేశాలకు మళ్లీ యూఎస్ వార్నింగ్

  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా మరోసారి ఆయన ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా టెక్ సంస్థల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గట్టివార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి కంప్యూటర్ చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఆల్ఫబెట్, మెటా, అమెజాన్.. వంటి అమెరికా కంపెనీలపై డిజిటల్ పన్నులు, ఇతర ఆంక్షలు పెట్టే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురొడ్డి నిలబడతామని అన్నారు. డిజిటల్ ట్యాక్స్‌లు, డిజిటల్ సర్వీస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ నియంత్రణలు అన్నీ అమెరికా కంపెనీలపై వివక్ష చూపించేందుకు రెడీ చేశారని విమర్శించారు. చైనా కంపెనీలకు మాత్రం ఈ దేశాలు ఎలాంటి అడ్డంకులు కల్పించట్లేదని, పద్దతి మార్చుకోవాలని సూచించారు. అలాంటి దేశాలను అప్రమత్తం చేస్తున్నానని, అమెరికా కంపెనీలు మీకు కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ వంటివి కావని,  అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ప్రపంచ దేశాలపై మండిపడ్డారు. డిజిటల్ పన్నుల విషయంలో అమెరికా కెనడాపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే.  కెనడాతో వాణిజ్య పరంగా తెగదెంపులు చేసుకుంటామని జూన్‌లో గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాల్లో ఈయూ మాత్రం అమెరికా అనుకూల ధోరణితో ముందుకు వెళుతోంది. ఇలాంటి వాణిజ్య అడ్డంకులు తొలగింపునకు కలిసి పనిచేస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య ఓ సంయుక్త ప్రకటన చేశాయి. ఎలక్ట్రానిక్ ప్రసారాలపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీలు విధించబోమని పేర్కొన్నాయి. నెట్‌వర్క్ యూసేజీ ఫీజులను కూడా విధించబోమని కూడా ఐరోపా సమాఖ్య పేర్కొంది. ప్రస్తుతం అనేక దేశాల ప్రభుత్వాలు అమెరికన్ కంపెనీల నుంచి సగటున 3 శాతం వరకూ పన్ను వసూలు చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు ఆయా దేశాల్లో పొందుతున్న ఆదాయంపై ఈ పన్ను విధించాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.  

కాంగ్రెస్‌‌పై జగన్ సీరియస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు

  ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ  రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలనే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడే అదే స్ట్రాటజీ అవలంభిస్తోంది.  ఆ క్రమంలో కాంగ్రెస్‌తో టచ్ ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట. వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలు వచ్చేనాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహమన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావు దెబ్బతగిలింది. దివంగత వైఎస్ మరణాంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్‌కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు.  మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అవి నిర్ణయాత్మక ఓట్లు కాకపోయినా ఎన్డీఏ, ఇండియా కూటములకు అవి కీలకమే.అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా, వైసీపీ పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు.   అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి పదేళ్లు వైసీపీ పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపించి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాధ్ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి,  ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతిచ్చింది.  తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున  బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్దరించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టీస్ సుదర్శనరెడ్డిని ఇండియా కూటమి అభ్యర్ధిగా ప్రకటించినా జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.... రాజ్యసభలో ఏడుగురు సభ్యుల బలమున్న వైసీపీనీ కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ ఆవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరారు.   ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్‌కి టచ్‌లోకి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కి చెందిన కీల‌క నాయ‌కులు న‌లుగురు వైసీపీ తో ట‌చ్‌లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథరెడ్డి ఏకంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గేతోనూ స‌మావేశమ‌య్యారు. త‌న‌కు ఖ‌ర్గేతో 30 ఏళ్ల‌కుపైగా అనుబంధం ఉంద‌ని.. అందుకే క‌లిశాన‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత స‌ద‌రు నేత‌ను వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు డీకే శివ‌కుమార్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న చిదంబ‌రం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వ‌చ్చాయ‌ని స‌మాచారం. వచ్చే నెల 9న జ‌ర‌గ‌నున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి అభ్య‌ర్థి బి. సుద‌ర్శ‌న్ రెడ్డిని గెలిపించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంత‌ర్గ‌త స‌మావేశంలో కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిపై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న మంద‌లించిన‌ట్టు తెలిసింది. అస‌లు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నార‌ని.. ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. తనపై కేసులు పెట్టిన విష‌యం.. తమ పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్ప‌టికీ ష‌ర్మిల‌తో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియ‌దా? ఎవ‌డో మాణిక్యం ఆయ‌న కూడా మ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారని మండిపడ్డారంట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మ‌నం ఎందుకు స్పందించాలి. ఇక‌, నుంచి ఫోన్లు కూడా తీయొద్దని సీరియ‌స్ గా చెప్పేశార‌ని.. తాడేప‌ల్లి కార్యాల‌యానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ ఒక‌రు ఆఫ్‌ ద రికార్డుగా మీడియా వారితో అన్నారంట. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఉన్నా.. లేకున్నా.. త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ సీనియర్లు కొందరు అంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. మీరు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నామని ఖ‌ర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విష‌యంపై ఆలోచ‌న చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు. త‌ట‌స్థంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మ‌రి వైసీపీ మాత్రం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్రమంలో బీజేపీతో అంటకాగడానికే జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.  

బీహారు ఓటరుపై...ఓటు చోర్ యాత్ర ప్రభావం?

  త్వరలో జరగానున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’ చివరాఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17 న ససారలో ప్రారంభమైన రాహుల్ యాత్ర, సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. అయితే, రాహుల్ గాంధీ సాగిస్తున్న ఈ యాత్ర రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా ? అంటే, రాజకీయ విశ్లేషకుల నుంఛి అవుననే సమాధానమే వస్తోంది.  అయితే, రాహుల్ యాత్ర ప్రభావం, ఆయన ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా అయితే, ఉండకపోవచ్చని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కావల్సినంత వ్యతిరేకత వుంది. ముఖ్యంగా అటునుంచి ఇటు ఇటునుంచి అటూ గోడలు దూకుతూ,14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని కూర్చున్న నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రమే కాదు, ఒక విధమైన ఏహ్య భావం కూడా ఏర్పడిందని, అంటున్నారు.   దానికి తోడు, నిరుద్యోగం,క్షీణిస్తున్న శాంతి భద్రతల సమస్యలు తదితర సమస్యల కారణంగా, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. అవును   ఇటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల, అటు, ఎన్డీఎ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలను గమనిస్తే రాష్ట్రంలో, కేవలం 18 శాతం మంది ఓటర్లు మాత్రమే, ఎన్డీఎ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో 48 మంది ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.  అన్నిటికీ మించి, ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు, 25 శాతం మంది నితీష్ కుమార్’ కు జై కొడితే, 32 శాతం మంది ఆర్జేడీ, నాయకుడు,మహా ఘటబంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్’కు జై కొట్టారు. ముఖ్యంగా యువత తేజస్వీ యాదవ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. నితీష్ కుమార్’కు తేజస్వీ యాదవ్’  బలమైన ప్రత్యర్ధిగా ఓటర్లు గుర్తిచినట్లు సర్వేలు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్, నవంబర్ నెలలో జరగనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, ఎగసి పడుతున్న నితీష్ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంలో వీస్తున్న తేజస్వీ అనుకూల పవనాలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, మహా ఘట బంధన్’ విజయావకాశాలు’ మరింత మెరుగ్గా ఉండచ్చని పరిశీలకులు అంటున్నారు.  అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర’ వలన కూడా మహా ఘటబంధన్’ కు కొంత ప్రయోజనం జరగవచ్చు కానీ, ఎన్నికల కథా కథనం స్థానిక సమస్యల నుంచి పక్కకు వెళ్ళే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’కు ఆశించిన స్థాయిలో స్పందన రాక పోగా, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదనే విషయం తేట తెల్లం కావడంతో, ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలు మినహా ఇతర వర్గాల ప్రజలు రాహుల్ యాత్రను అసలు పట్టిచుకోవడం లేదని అంటున్నారు.  అలాగే,అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సహజంగా స్థానిక సమస్యలు,స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ, జాతీయ అంశాలకు మరీ ముఖ్యంగా, ఎన్నికల అక్రమాలకు సంబదించిన అంశాలకు ఓటర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని పరిశీలకులు బావిస్తునారు. నిజానికి,  నితీష్ వర్సెస్ తేజస్వీగా సాగ వలసిన ఎన్నికల  ప్రచారం, రాహుల్ ఎంట్రీతో మోదీ వర్సెస్ రాహుల్. పోల్ బ్యాటిల్’ గా మారుతోందని, ఇది మహా ఘట బంధన్’ కు అంతగా మంచిది కాదని అంటున్నారు.అంతే కాకుండా మహా ఘట బంధన్’ కు అనుకూలంగా ఉన్న వాతావరణం తిరగబడే ప్రమాదం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు.  

మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్

  ఏపీ మాజీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్‌పిక్‌ పేరును సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. 2022 జులైలో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.  అయితే ఈ కేసులో సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వాన్‌పిక్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపారు సీబీఐ అధికారులు. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.  

అభ్యర్థులు ఎంపికే అగ్నిపరీక్ష అన్ని పార్టీలదీ అదే స్ధితి

  బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడుతుందా? ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా, అంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్’ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక మాత్రం ఖాయంగా జరిగి తీరుతుంది.  అది కూడా రెండు మూడు నెలల్లోనే జరుగుతుంది. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం,ఓటర్ల జాబితా సవరణతో ఉప ఎన్నిక కసరత్తుకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్’ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దశదిశను నిర్దేశిస్తాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాగే, ఎవరి కారణాలు వారికి ఉన్నా జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక నుంచే మూడు ప్రధాన పార్టీలకు, ముగ్గురు ముఖ్య నేతలకు అగ్ని పరీక్ష కానున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా,అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఘోర పరాజయంతో పాటుగా, ఇప్పటికే జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’కు మరీ ముఖ్యంగా, పార్టీ పగ్గాలను తమ గుప్పిట్లోకి తీసుకున్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీ రామరామా రావు (కేటీఆర్’) కు జూబ్లీ ఉప ఎన్నిక అగ్ని పరీక్షే అంటున్నారు.  వరస ఓటములతో పాటుగా, బజారుకు ఎక్కిన కుటుంబ కలహాలతో సతమతమవుతున్న, గులాబీ పార్టీ, మరో సిట్టింగ్ స్థానంలో ఓటమి ఎదురైతే, పార్టీ భవిష్యత్’ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరో వంక, ప్రత్యర్ధుల విషయం ఎలా ఉన్నా, కేటీఆర్’ నాయకత్వాన్ని ఇప్పటికే డిస్కార్డ్’ చేసి తిరుగుబాటు జెండా ఎగరేసిన సోదరి కవిత’ అన్నకు వ్యతిరేకంగా మరింతగా విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.నిజానికి., కవిత అలాంటి అవకాశం కోసం ఎదురు  చూస్తున్నారని, సో.. అవకాశం వస్తే .. ఆమె  తగ్గేదేలే ..అన్నట్లు రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. అలాగే, కారణాలు ఏవైనా, పార్టీ అధినేత కేసీఆర్’ క్రియాశీల రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటున్నారు. సో .. జూబ్లీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’ కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.   అదలా ఉంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజరినా, బీఆర్ఎస్’ హైదరాబాద్ నగరంలో తిరుగులేని ఆధిక్యతను నిలబెట్టుకుంది.అయితే,ఇప్పడు ఆ పరిస్థతి కనిపించడం లేదని అంటున్నారు.ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్’కు అండగా నిలిచిన ఎంఐఎం’ ఇప్పడు కాంగ్రెస్ పక్షాన చేరింది.  అలాగే, 2022 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 కి 44 డివిజన్లలో విజయ సాధించి, ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానం సొంతం చేసుకున్న కారు పార్టీ కథ, అసెంబ్లీ ఓటమితో పాటుగా తిరగబడింది. మేయర్, మాజీ మేయర్ సహా కారు పార్టీ కార్పొరేటర్లు’ చాలా వరకు అధికార పార్టీ గూటికి చేరి పోయారు. మరోవంక దానం నాగేందర్ సహా కొందరు నగర ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. సో.. జూబ్లీ సీటు నిలుపుకోవడం బీఆర్ఎస్’ కు అంత  తేలికైన వ్యవహారం కాదని, పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే .. జూబ్లీ ఉప ఎన్నిక కారు పార్టీకి ..అంతకంటే ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు అంటున్నారు.  ఇక అధికార కాంగ్రెస్’ పార్టీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీ ఉపఎన్నిక సవాలు కానుందని అంటున్నారు.కంటోన్మెంట్ సీటుకు సొంత చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  జూబ్లీ సీటును కూడా కైవసం చేసుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నేతగా తమ స్థానాన్ని, పదిల పరచు కుంటారు.  కానీ, ఓటమి ఎదురైతే మాత్రం, ఆయన ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్లు అవుతందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, అధికార పార్టీగా కాంగ్రెస్’ పార్టీకిగెలుపు అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి,అయితే, అభ్యర్ధి ఎంపిక విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు చెపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన  మాజీ క్రికెటర్’ అజారుద్దీన్’ పేరు మరో మారు ప్రముఖంగా వినిపిస్తున్నారు. బీసీ నామ జపం చేస్తూ ముస్లింకు టికెట్ ఇస్తే, హిందూ ఓటు పోలరైజ్’ అయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా,బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున నేపధ్యంలో, అజారుద్దీన్’కు మరో ఛాన్స్’ ఇవ్వడమా, బీసీ అభ్యర్ధిని బరిలో దింపడమా , సెలబ్రిటీని పోటీ చేయించాలా అనే విషయంలో హస్తం పార్టీ  తర్జన  భర్జన  పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు కూడా ఇది తొలి పరీక్ష కాగలదని అంటున్నారు.