కాంగ్రెస్ నేతలు కారుకి రిపేర్లు చేసుకోగలరా!

  తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలకి ఇల్లలకగానే పండుగ కాదని తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టకపోవచ్చునేమో. ఆ సంగతి కారెక్కక మునుపే గ్రహించిన కేశవ్ రావు, తను ఎక్కబోయే కారుకి కొన్ని రిపేర్లు చేసుకోనయినా ప్రయాణం చేయక తప్పదని తన మనసులోమాటను ముందే బయటకి కక్కేశారు.   కాంగ్రెస్ నేతలకు తెరాస కండువా కప్పగానే, కేసీఆర్ “కాంగ్రెస్ నేతలు సన్నాసులు దద్దమ్మలు” అంటూ వారి సమక్షంలోనే తమ సహచరులను తిట్ల పురాణం లంకించుకొంటే వారు బిక్క మొహాలు వేసుకొని చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు. వారి ఆరాధ్య దేవత సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగును కూడా కేసీఆర్ వారి సమక్షంలోనే నోటికొచ్చినట్లు కడిగిపారేశారు. పార్లమెంటులో చప్రాసీకి కూడా తెలంగాణా ప్రజల గోడు అర్ధమయినప్పటికీ ఆ ఇద్దరికీ మాత్రం ఎందుకు అర్ధం కావట్లేదో అని కేసీఆర్ ఈసడిస్తుంటే ఔనని కాదనలేని నిస్సహాయత వారిది. లోక్ సభలో ఉన్న ప్రధానికి అసలు తమ మాటలు అర్ధం అవుతున్నాయో లేదో, అసలు ఆయన వింటున్నాడో లేదో తెలియని స్థితిలో రాయిలా కూర్చోంటాడని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తుంటే వారి నోట మాటలేదు.   తెరాస తీర్ధం పూర్తిగా ఇంకా గొంతు దిగకముందే, కేసీఆర్ తన విశ్వరూపం చూపిస్తుంటే పాపం వారు కక్కలేక మింగలేక అవస్థలు పడ్డారు. బహుశః తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలకి ఇల్లలకగానే పండుగ కాదని అప్పటికే కొంత అర్ధం అయిఉండవచ్చును. కాంగ్రెస్, తెదేపాల తెలంగాణా నేతలు తెరాసలో చేరడానికి ఇప్పటికీ వెనుకంజ వేయడానికి ఇదే ప్రధాన కారణమని కేసీఆర్ తో సహా అందరికీ తెలుసు. కానీ, జనాన్ని చూడగానే పంచ్ డైలాగులు పలికి చప్పట్లు చరిపించుకొనే బలహీనత ఉన్న బక్కన్న కేసీఆర్ ని పార్టీలో ఎవరూ కూడా వారించలేరు కనుక కాంగ్రెస్ నేతలు కూడా కిక్కురుమనకుండా వినక తప్పలేదు.   ఇంత వరకు తెరాసలో విధాన పరమయిన నిర్ణయాలన్నిటినీ కేసీఆరే స్వయంగా తీసుకోవడం, దానికి మిగిలిన వారు ఆమోదించడం ఒక సాదారణ సంప్రదాయంగా వస్తోంది. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చెప్పట్టబోతున్నకేశవ్ రావు కేసీఆర్ ని కాదని స్వయంగా నిర్ణయాలు తీసుకోగలరా? అంటే అనుమానమే.   ఇక మందా, వివేక్ ఇద్దరూ కూడా ఎన్నికలలో పోటీ చేసేవరకు పార్టీలో చేసేదేమీ ఉండకపోవచ్చును. మహా అయితే సభలలో కేసీఆర్ అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీని, తెదేపాను తిట్టడానికి మాత్రమే వారికి అవకాశం ఉంటుంది.   ఇక, కేవలం పార్టీ అధిష్టానాన్ని తప్ప మరెవరినీ ఖాతరు చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పని పరిస్థితి. ఇంత బ్రతుకు బ్రతికి చివరికి తెరాసలో డమ్మీలుగా మిగిలిపోతారా? లేక తమ రాజకీయ అనుభవంతో తామెక్కిన కారుని మరమత్తులు చేసుకొని, దాని డ్రైవర్ ని పక్కకు తప్పించి తామే స్టీరింగ్ దొరకబుచ్చుకొంటారా? అనేది త్వరలోనే తేలిపోతుంది. అయితే, కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్న రాములమ్మనడిగినా, మధ్యలోనే కారులోంచి దూకేసిన ఆలె నరేంద్ర, సమరసింహా రెడ్డి, మహేంద్ర రెడ్డి, రఘునందన్ రావు వంటి వారినడిగినా కారులో వెనుక సీటులో బుద్దిగా కూర్చోగలిగితే కూర్చోవాలి లేకుంటే మళ్ళీ స్వంత గూటికి వెళ్లిపోవాలని సలహా చేపుతారేమో.

కెసిఆర్ సోనియా ఇంటి కాపలా కుక్క

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వల్ల తెలంగాణ రాదని, ఆయన ఓ పొలిటికల్ బ్రోకరని టిడిపి పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కేసీఆర్ తెలంగాణ కాపలా కుక్క కాదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి కాపలా కుక్క అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తెలంగాణ వస్తే దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళితుడిని చేస్తారా అని మోత్కుపల్లి సవాల్ చేశారు.   టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి తనపై కోర్టుకు వెళ్తే అక్కడే అతను దళితుడు కాదని చెబుతానని అన్నారు. అధికారంలో ఉండి తెలంగాణ సాధించని నేతలు తోక పార్టీలో చేరి ఎలా సాధిస్తారని టీఆర్‌ఎస్‌లో చేరిన టీ. కాంగ్రెస్ ఎంపీల నుద్దేశించి మోత్కుపల్లి ప్రశ్నించారు. ద్రోహులు, సన్నాసులు అన్న వారినే అతను తెరాసలోకి చేర్చుకుంటున్నారని  ఆరోపించారు. కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు.

క్రికెటర్ ధోనీపై అనంతపురంలో కేసు

        భారత క్రికెట్ జట్టు కెప్టన్ ధోనీపై అనంతపురంలో కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఓ బిజినెస్ వారపత్రికపై మార్కెట్ గాడ్ గా సంభోదిస్తూ ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్ పీ జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటీషన్ లో విజ్ఞప్తి చేశారు. పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు వారపత్రిక ఎడిటర్, దోనీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదే విషయంపై బెంగళూరులోని ఒక సామాజిక ఉద్యమకారుడు జయకుమార్ గతంలో 6 వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటుకు మే 12 వ తేదీన దేవుడిగా సంభోదిస్తూ హిందువుల మనోభావాలు కించపరిచారని ఫిర్యాదు చేశారు.

నెల రోజుల్లో తెలంగాణ

        తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని, ఆ దిశగా మరికొన్ని సమావేశాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ తెలిపారు.తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు గత కొన్నేళ్లుగా తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులతో సమావేశాలు జరుపుతున్నామని, తాను కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో భేటీ అయ్యానని ఆజాద్ తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యానని గుర్తు చేశారు. "సీట్ల కోసం కాకుండా తెలంగాణను ఆశిస్తున్న వారు ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పార్టీ తీసుకునే తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మేం తుది నిర్ణయం తీసుకునే వరకూ మరే ఇతర నాయకుడూ టీఆర్ఎస్‌లో చేరరు'' అని ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు ఈ నెలలోనే మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, తెలంగాణలో ఉన్న సమస్యలను తాము ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఈ క్రమంలో గతంలో ఉద్యోగాల భర్తీ సమస్య ఎదురైనప్పుడు తాము వెంటనే దానిని పరిష్కరించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి గురించి ప్రస్తావించగా.. దానికి కారణాలు ఉన్నాయన్నారు. జగన్ పార్టీని వీడారని, ఆయన ఎందుకు అలా చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఎన్నడూ ప్రభుత్వానికి మద్దతు పలక లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

డీఎల్ రవీంద్రారెడ్డి కి కాంగ్రెస్ సపోర్ట్

        కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంతో పార్టీలో కలకలం రేగింది. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు కేకె ముఖ్యమంత్రి చర్యను తప్పుపట్టారు. మంత్రి పదవి అంటే గులాంగిరి కాదని, డీఎల్ లాంటి వ్యక్తిని ఇలా అవమానకరంగా తొలగించడం అన్యాయమని విమర్శించారు. మంత్రి జానారెడ్డి కూడా డీఎల్ కు మద్దతుగా మాట్లాడారు. ఆయన బర్తరఫ్ బాధాకరమని, పార్టీలో సమస్యలు చక్కదిద్దేందుకు వెంటనే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు. అంతకుముందు జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. డీఎల్ బర్తరఫ్ వ్యవహారమే వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని జానా అంటున్నారు. ఇక డీఎల్ బర్తరఫ్ ను మంత్రి బస్వరాజు సారయ్య కూడా తప్పుపట్టారు. మీడియాతోనే ఆయన బర్తరఫ్ విషయం తనకు తెలిసిందని, మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయం చర్చిస్తామని అన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కిరణ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామజోగయ్య శాస్త్రికి ఎన్నారైల సన్మానం

        మే 28న డాలస్ లో ప్రముఖ సినీగేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని అభిమానులు, మిత్రులు కలిసి తానా గత అధ్యక్షులు తోటకూర ప్రసాద్, టాన్టెక్స్ అధ్యక్షుడు సురేశ్ మండువ ఆధ్వర్యంలో సన్మానించారు.   ఇదే సందర్భంలో ప్రముఖ గాయకుడు సూపర్ గురు రామాచారి గారిని కూడా సన్మానించారు. విద్య రీత్యా ఇంజనీర్ అయినా, తను జీవితంలో సాధించాలని అనుకొన్న లక్ష్యం వైపు ఎంతో ఆత్మబలంతో సాగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న శాస్త్రి పిల్లలకి, యువతరానికి స్ఫూర్తి అని, సభకు రామజోగయ్య శాస్త్రిని పరిచయం చేశారు, రాయవరం విజయ భాస్కర్.   పిల్లలు, పెద్దలు దాదాపు వందమంది దాకా హాజరైన ఈ సమావేశంలో రామజోగయ్య తన సినీ ప్రయాణంలో ఆరంగేట్రం గురించి, ప్రస్తుతం నడుస్తున్న తీరు, తను పనిచేసే విధానం గురించి వివరించారు. తన జీవితంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రభావం, తను గురువుగా రామజోగయ్య నేర్చుకొన్న సినీపాటల మెళకువలు అన్నీ తన మనసు పరచి పంచుకొన్నారు రామ్-జో. అభిమానులతో ఫోటోలు, ఆత్మీయుల ప్రశ్నలు , చిన్నారుల పాటల మధ్య ఓ మంచి సాయంత్రాన్ని డాలస్ తెలుగువారు రామజోగయ్యకి కానుకగా సమర్పించారు.  ఈ సమావేశానికి వేదికతోబాటు భోజనాల ఏర్పాటు చెయ్యడానికి సహకరించిన స్వగృహ భోజనశాల వారికి, వినోద్ ఉప్పు గారికి,  కృతజ్ఞతలు ప్రకటించారు రాయవరం భాస్కర్.

కిరణ్ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళా?

  మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డిని బర్త్ రఫ్ చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గంపై పైచేయి సాధించారని అయన అనుచరులు భావిస్తుంటే, ‘అదొక పొరపాటు నిర్ణయం’ అని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అని ఆ మరునాడే ప్రకటించడమే కాకుండా ఇటువంటి పొరపాట్లు ఇక ముందు జరుగవని కూడా హామీ ఇవ్వడం విశేషం. డీయల్ ను బర్త్ రఫ్ చేస్తున్నట్లు ఆయనకు ముఖ్యమంత్రి ముందుగా తెలియజేయలేదని ఆయన మీడియాతో చెప్పిన మాటలవల్ల అర్ధం అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తుపోకడల గురించి ఇప్పటికే అనేక మార్లు అధిష్టానానికి పిర్యాదులు చేసిన బొత్స సత్యనారాయణ, ఈ రోజు డిల్లీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి చర్చిస్తానని కూడా స్పష్టంగా చెప్పారు. బొత్సతో బాటు మరికొంత మంది మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయంపట్ల తీవ్ర అసంతృప్తి వెల్లడించారు.   ఇక, హోంమంత్రి పదవి ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా ముఖ్యమంత్రి హిట్ లిస్టులో పేరున్నవారే గనుక, ఆయన తనని వెళ్ళగొట్టక ముందే తానే తప్పుకోవాలనుకొన్నారు. కానీ, మంత్రి జానారెడ్డి సలహా మేరకు ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక, వేటుకోసం ఎదురుచూస్తున్న మరో మంత్రి రామచంద్రయ్య, ఈ మద్యన కొంచెం జోరు తగ్గించుకొన్నారు. బహుశః చిరంజీవి ఆయనను వెనక్కి తగ్గమని సూచించి ఉండవచ్చును.   ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి కొంత మందితో తనకొక ప్రత్యేక వర్గం తయారుచేసుకొని ముందుకు సాగుతున్నపటికీ, ఆయనను పార్టీలో వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారనేది సుస్పష్టం. ఆయన తన ప్రస్తుత పద్దతిలోనే ముందుకు సాగితే ప్రస్తుతం ఆయన ఏర్పరుచుకొన్న స్వంత వర్గంలో మంత్రులు కూడా ఏదో ఒకనాడు ఆయనతో విభేదించచ్చును. అప్పుడు ఆయన పార్టీలో ప్రభుత్వంలో ఒంటరి అవడం ఖాయం.   కిరణ్ కుమార్ రెడ్డి రెండున్నర సం.లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నపటికీ ఇంతవరకు తన స్వంత పార్టీకి ప్రభుత్వానికి మద్య సమన్వయము సాదించడంలో విఫలమవడం చాలా ఆశ్చర్యకరమే. అయితే, భేషజానికి పోయి అందరినీ దూరం చేసుకొంటున్న ముఖ్యమంత్రి అందుకు ఇతరులను ఈ విధంగా బలి తీసుకోవడం మరీ ఆశ్చర్యకరం. సహచర మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సమర్ధంగా ప్రభుత్వాన్ని నడిపించవలసిన ముఖ్యమంత్రి వాటిని వ్యక్తిగత విమర్శలుగా భావిస్తూ, వారిని తన శత్రువులని భావించడమే దీనికి మూలకారణం.   తన స్వంత పార్టీలో, ప్రభుత్వంలో ఇంత మంది తనను వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని ఆత్మవిమర్శ చేసుకోకుండా అహానికి పోయి అందరినీ దూరం చేసుకోవడం వల్ల ఆయనకీ ఇంతా బయటా శత్రువులే మిగులుతారు. సాధారణ ఎన్నికలను ఎదురుగా ఉంచుకొని ముఖ్యమంత్రే స్వయంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించుకోవడం వల్ల ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగడమే కాకుండా, ప్రతిపక్షాలకు వరంగా కూడా మారుతుంది.

కాంగ్రెస్ లో అహంకార కి'రణం'

        వైద్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డిని ముఖ్యమంత్రి అధిష్ట్టానం అనుమతితో మంత్రి పదవి నుండి తొలగించిన విషయం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని పరిశీలిస్తే వివిధరకాలైన అంశాలు వెలుగు చూస్తాయి. ఒకప్పుడు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డి.ఎల్ రవీంద్ర రెడ్డి అత్యంత సన్నిహితులు. వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కకపోవటం ఈ సాన్నిహిత్యానికి ఒక కారణం అని చాలామంది ఉద్దేశ్యం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తన మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యమున్న వైద్య, ఆరోగ్య శాఖను డీ.ఎల్. కు పూర్తి స్థాయిలో అప్పగించారు. ఇది పలువురి మంత్రుల అలకలకు కూడా కారణమయ్యింది.              కడప లోక్ సభ ఉప ఎన్నికల వరకు ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ ఎన్నికల సమయంలోనే వివిధ అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అక్కడి నుండే ఇద్దరు ఎడ ముఖం, పెడ ముఖంగా ఉంటూ, ఇద్దరు ఒకరితో ఒకరు విభేదాలు మరింతగా పెంచుకున్నారు.             డి. ఎల్. రవీంద్ర రెడ్డి రాజకీయ ప్రస్తానం 1978లో మొదలైన నాటి నుండి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేడురుమేల్లి ప్రభుత్వాలలో వివిధ కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ చేరారు. ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి 8 సార్లు పోటీ చేసి, 6 సార్లు గెలుపొందటం జరింగింది. అంతగా డి.ఎల్. రవీంద్ర రెడ్డి తన నియోజక వర్గం నుండి ప్రజాదరణ పొందిన రాజకీయ వేత్త.                  అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన సామర్థ్యం ప్రజాదరణ కలిగిన ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడిగా డి.ఎల్. అనేకసార్లు సి.ఎం. యొక్క పరిపాలనా తీరును విమర్శించారు. తనకు కేటాయించిన వైద్య శాఖ నిధులు సరిగా లేవని అనేకసార్లు మొరపెట్టుకుంటే, కావలిసిన నిధులు కేటాయించకపోగా శాఖను కుదించి, కొండ్రు మురళికి కేటాయించటం జరింగింది. ఇది ఒక సీనియర్ నేత పట్ల కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకున్న విధానానికి అద్దం పడుతుంది.                    ఒకనాడు వైయస్ జగన్ ను ఎదురుకోవడానికి ఉపయోగించుకొని, ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఎందుకూ పనికి రాని వాడిగా చిత్రీకరించటం వెనుక కిరణ్ ఉద్దేశ్యం ఏమిటి? ఒక నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తో విభేదించారు. తన వ్యక్తిగత విభేదాలను రాజకీయ విభేదాలుగా చూపించటం వలన పార్టీకి నష్టం జరుగుతున్న విషయాన్ని అధిష్టానం కూడా గమనించక పోవడం ఆశ్చర్యకరం.                 ఇప్పటివరకు మొత్తం విషయాన్ని గమనిస్తే ప్రజాదరణతో ఎదిగిన నేత డి.ఎల్. ప్రజాదరణతో కాకుండా అధిష్ఠానం ఆశీస్సులతో ముఖ్య మంత్రి అయ్యి, అహంకార ప్రవర్తనను ప్రదర్శిస్తున్న నేత కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకులు ప్రజాసంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వ పరిపాలన తీరును ఎండ కడతారనడానికి డి.ఎల్. ఒక ఉదాహరణ అయితే, నడమంత్రపు అధికారం తో దురహంకారిగా ప్రవర్తిస్తూ ఏమాత్రం సామర్థ్యం లేని పరిపాలనకు పాలన కర్తగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఉదాహరణ.                ఈ మొత్తం వైనంలో అధిష్టానం వైఖరి చాలా అసమర్థతగా కనిపిస్తుంది. ముఖ్య మంత్రి అభ్యర్ధిగా అన్ని అర్హతలూ కలిగి ఉండి ఏనాడో ముఖ్య మంత్రి కావాల్సిన డి.ఎల్. రవీంద్ర రెడ్డి నేడు వివిధ స్వార్థ రాజకీయాలకు, దురహంకారానికి గుర్తుగా బర్తరఫ్ కాబడ్డారు. వివిధ రకాల లాబీయింగులకు, భజనపరులకు తలవోగ్గే దిక్కుమాలిన కాంగ్రెస్ అధిష్ఠానం, పనికిమాలిన అసమర్థ రాజకీయ నాయకులకు పట్టం కట్టడం కారణంగానే భారత దేశం ఆర్ధిక పురోగతిని, పురోభివృద్ధిని సాధించటంలో వెనుకబడింది. దీనికి మళ్ళీ ప్రజాస్వామ్యం అని పేరు. నేడు రాష్ట్రం లోను దేశం లోను కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది. 

ఈ రోజు కేశవ్ రావ్ జీవితంలో బ్లాక్ డే

ఈ రోజు సాయంత్రం తెరాసలో జేరనున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవ్ రావ్ ఇది తన రాజకీయ జీవితంలో ‘బ్లాక్ డే’ అని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో ఏర్పరుచుకొన్ననాలుగు దశబ్దాల అనుబంధం తెంచుకొని పార్టీని వీడవలసి వస్తున్నందుకు ఆయన ఆవిధంగా అన్నారు. సోనియా గాంధీ తనకు అన్ని పదవులు ఇచ్చి పార్టీలో సముచిత గౌరవం ఇచ్చారని, కానీ తానడిగిన ఒక్క తెలంగాణా మాత్రం ఈయలేకపోయారని ఆయన అన్నారు. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడినప్పటికీ, మంత్రి డీయల్ బర్త్ రఫ్ పై తీవ్రంగా స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి చాల అవమానకరంగా, రాజ్యాంగ విరుద్దంగా ఆయనను తొలగించారని, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి వేసే భిక్ష కాదని కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.

విలీనం పై హరీష్ రావు మెలిక

        సమైక్యాంధ్రకు జై కొట్టి, తెలంగాణను అడ్డుకున్నందుకు ముందుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బహిరంగ క్షమాపణ చెబుతూ చెంపలేసుకుంటేనే ఆ పార్టీలో తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామని టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. టీడీపీలో టీఆర్ఎస్ విలీనంపై తాను చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అర్థంకానట్టు ఉందని అన్నారు.   "2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తర్వాత టీడీపీ యూటర్న్ తీసుకోవటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక్కి వెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిందే టీడీపీ. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించిన పార్టీ అది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రెండు నివేదికలు ఇచ్చి.. పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం ప్లకార్డులు పట్టింది. ఈ తప్పులన్నింటినీ చంద్రబాబు ఒప్పుకొని బహిరంగంగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. రేవంత్‌రెడ్డికి చేతనైతే ఆ పని చేయించాలి. అప్పుడే విలీనంపై మా పొలిట్‌బ్యూరోలో చర్చిస్తాం'' అని చెప్పారు. ఆ తరువాతే మూడు షరతుల గురించిన చర్చలోకి వెళదామని సూచించారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. "అది కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు.. మహా చోర్ కమిటీ'' అంటూ మండిపడ్డారు.

తానా 19వ మహా సభల్లో స్వామి వివేకానందుల వారి 150 వ జయంతి సంబరాలు !

తానా మహా సభ ల్లో ఆదివారం మే 26 నాడు సాయంత్రము స్వామి వివేకానందుని 150 వ జయంతి సంబరాలు మరియు యువతకు వివేకానందుని సందేశం పై ప్రసంగాలు జరిగాయీ ఈ కార్యక్రమాన్ని తానా ఆధ్యాత్మిక కమిటి ఆధ్వర్యములో గోపాల్ పొన్నంగి మరియు గోపి చిల్లకూరు లు నిర్వహించారు.   మొదటగా జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదానంద మాట్లాడుతూ మనస్సు ,శరీరం ,బుద్ది మద్య వున్నా సంబంధాన్ని సభికులకు వివరించారు .మనస్సుని అదుపులో ఉంచుకోవడం గురించి వివరించారు . శ్రీ పీటం ,కాకినాడ స్వామి పరిపూర్ణ నంద స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగిస్తూ భారత దేశ జీవనం ,సంస్కృతీ ,సనాతన ధర్మాన్ని,ఆద్యాత్మికతను తన అద్బుతమైన వాగ్ధాటి తో ప్రపంచ వ్యాప్తముగా భారత దేశం ఔనత్యాన్ని గౌరవాన్ని నిల్బెట్టారని అన్నారు .. తరువాత చిల్లకూరు గోపి మాట్లాడుతూ స్వామిజి 150 వ దినోస్తావాలు గత మూడు సంవత్సరాలు గా ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్నాయని వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వివేకానందుల వారి త్యాగ జీవితం ,వారి అమూల్య సందేశాన్ని నేటి యువతకు అర్ధం అయ్యేలా తెలియ జెప్పి వారిలో ఆత్మ న్యూనత భావాన్ని,బలహీనతలను పోగొట్టడం ,వారిని కార్యొన్ముకులను చేయడమే అన్నారు . సభలో ముఖ్య అతిధి స్వామి పరిపూర్ణ నందుల వారికి తాన తరపున మొమెంటో అందచేసి దుస్శాలువతో సన్మానించారు .   సభ నిర్వాహకులు గోపి చిల్లకూరు పరి పూర్ణ నందుల వారికి వివేకానందుని ప్రియ శిష్యులు ,స్వామి వివేకానందుల వారి అమెరికా పర్యటనకు ఎంతో కృషి చేసిన తమిళనాడుకు చెందిన గృహస్తు శిష్యుడు అలసింగ పేరుమల్ గారి జీవితం పై రామకృష్ణ మఠ్ వారిచే ప్రచురించిన "అలసింగ పేరుమల్ " పుస్తకము భాహుకరించారు . పరి పూర్ణ నందుల స్వామి వారి చే పిల్లలకు వివేకానందుల స్తిక్కరులు ,ఫోటోలు అంద చేసారు.సమావేశానికి హాజరైన ప్రవాసులకు అందరికి రామ కృష్ణ మఠ్ ప్రచురించిన వివేకానందుని జీవితం మరియు సందేశం 150th Birthday special edition పుస్తకం ను అంద చేసారు . జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదత్మానంద ను తాన మొమెంటో బహుకరించి సాలువాలతో ఘసన్మానించారు .సినీ గేయ రచయత జొన్న విత్తుల,స్వామి వివేకానందుని 150 వ జయంతి సభ నిర్వహణకు కృషి చేసి న చిల్లకూరు గోపి కి తాన మహా సభల ప్రత్యెక మొమెంటో ను బహుకరించి శాలువాలతో తో సన్మానించారు. చివరగా తాన లో ఆద్యాత్మిక సమావేశములు ఘనం గా నిర్వహించిన గోపాల్ పొన్నంగిని ప్రత్యెక మొమెంటో అందచేసి శాలువా తో సన్మానించారు . సభలో ప్రముఖులు సినీ గేయ రచయత జొన్న విత్తుల ,జ్యోతిష పండితులు డాక్టర్ రాఘవెంద్ర ప్రసాద్, dr రేణుక బసవ రాజు ,Mahesh Choppa,చెరుకు పల్లి రాజేష్, వసంత సూరి ,పమిడి శ్రీనివాస్ ,శివ అడుసుమల్లి, Priya Korrapati,Dr Raju Nakta,Subrahmanyam Cheruvu,Abhinav Dahagam,Aditya Chilukuri,Anand Chellappa,Anita Basavaraju,Basivi Reddy,Bhaskar Aluru,Ghanshyam Mudigonda,IV Rao,Kalarani Kakarla,Koushik ,Krishna Athota Mohan Reddy,Prabhat Kasarneni,Dr Prabhav Tella,Pranamya Suri,Ramakrishna Kondapalli,Sai Prasad Kalinga,Shastry Anipindi,Srinivas Raju Nakta, Dr Sujatha Tella,Varun Anand,Vijay Kumar Basavaraju,Viswas Mudigonda పాల్గొన్నారు. ఏక విద్యాలయ ఫౌండేషన్ వారు సమావేశపు హాలు లో శ్రీ రామకృష్ణ పరమహంస ,మాతృశ్రీ శారద దేవి చిత్రాలతో పాటు స్వామి వివేకానంద జీవితం ,సందేశం ,సూక్తులు కలిగిన ఫోటోలు సభికుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసారు.

డీఎల్ రవీంద్రారెడ్డి ఆపరేషన్ ఎలా ఉండబోతోంది?

  వైద్య శాఖా మంత్రి డీ.యల్ బర్త్ రఫ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత టీం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆ పదవిని తనకి అత్యంత సనిహితుడయిన కొండ్రు మురళికి అప్పజెప్పారు. గతంలో డీ.యల్. దగ్గర నుండి తప్పించిన వైద్య విద్య, ఆరోగ్యశ్రీ, వైద్య బీమా, 104, 108, వైద్య మౌలిక సదుపాయాలు తదితర శాఖలు చూస్తున్న కొండ్రు మురళికే ఈ కొత్త బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీ.యల్. సోమవారం నాడు హైదరాబాద్ తిరిగి వస్తారు. అయితే, ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండానే అయన గైర్హాజరీలో ముఖ్యమంత్రి ఆయనను బర్త్ రఫ్ చేయడం గమనిస్తే, ఆయన డీ.యల్.పై ఎంతగా రగిలిపోతున్నారో అర్ధం అవుతుంది.   ఈ పరిణామాలను డీ.యల్ ఊహించకనే ఇంత కాలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసారని భావించలేము. అయితే పార్టీ అధిష్టానం పట్ల తన విదేయత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో తనకున్న సత్సంబందాలు తనని కాపడుతాయనే ధీమా ఆయనలో ఉండేది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తనని బర్తరఫ్ చేయడంతో, డీయల్ రేపటి నుండి తన ఆపరేషన్ మొదలుపెడతారు.   ఆయన పార్టీలో ఇతర అసమతి నేతలను కూడ గట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డిపై తన దాడిని మరింత తీవ్రతరం చేయవచ్చును. అది మరింత తీవ్రతరమయితే, అది అంతిమంగా ఆయన పార్టీ నుండి కూడా బహిష్కరించబడే పరిస్థితులు కల్పించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆయన తన కడప జిల్లాలో బలంగా ఉన్న వైకాపా వైపు మళ్ళినామళ్ళవచ్చును. కానీ, ఆజిల్లాలో వైకాపా తరపున పోటీ చేసేందుకు చాలామందే అభ్యర్దులున్నారు గనుక డీ.యల్.కి ఆ పార్టీ టికెట్ ఆఫర్ చేయగలదా లేదా? అనే దానిని బట్టి, ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఎటువంటి వైద్యం చేయాలో నిశ్చయించుకొనే అవకాశం ఉంది.   ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవలసి వస్తే, ముఖ్యమంత్రి ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేయవచ్చును గనుక, ఆయనను వ్యతిరేఖించే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో, రామచంద్రయ్య ద్వారా చిరంజీవితో జతకట్టి, ముఖ్యమంత్రికి పొగపెట్టడం ప్రారంబించవచ్చును. బొత్స సహాయంతోనే డీ.యల్. టికెట్ సంపాదించుకొని మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి సవాలు చేయవచ్చును.   ఒకవేళ వైకాపా నుండి తగిన విధంగా ఆహ్వానం అందితే, పార్టీ నుండి బహిస్కరించేబడేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరగడం ఖాయం. సోమవారం ఆయన లండన్ నుండి తిరిగి రాగానే ముఖ్యమంత్రిపై ఘాటయిన విమర్శలతో మీడియా ముందుకు ఎలాగు వస్తారు గనుక, ఇక తినబోతూ గారెల రుచి అడగడం అనవసరం ఇప్పుడు.

తెరాస, తెదేపాలు సవాళ్ళు దేనికి?

     హరీష్ రావు: తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తెలంగాణకు చెందిన దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇస్తే, తెరాసను తెదేపాలో విలీనం చేయడానికి మేము సిద్దం.   రేవంత్ రెడ్డి: హరీష్ రావు ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము. అయితే, దానిని తెరాస రాజకీయ కమిటీలో ఆమోదించి, కేసీఆరే స్వయంగా లిఖిత పూర్వకంగా ఇస్తే, మేము కేసీఆర్ కేంద్రానికి వ్రాసి పంపదలచిన ఏ లేఖమీదయినా సంతకం పెట్టడానికి సిద్దం.   తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెపితే, ఆయన మేనల్లుడు హరీష్ రావు మూడు షరతుల మీద తమ పార్టీని తెదేపాలో విలీనం చేస్తామని తాజాగా ప్రకటించడం, దానిని తెదేపా స్వాగతించడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతోంది.   సీమంద్రా పార్టీలయిన తెదేపా, వైకాపాలను తెలంగాణా నుండి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిస్తుంటే, హరీష్ రావు అదే సీమంద్ర పార్టీలో తమ ఉద్యమ పార్టీని విలీనం చేస్తామని చెప్పడం చూస్తే, రఘునందన్ రావు చెప్పినట్లు తెరాసలో ఆధిపత్యపోరు సాగుతోందని, హరీష్ రావు, కేసీఆర్ ల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు స్పష్టం అవుతోంది. లేకుంటే ఆయన ఇటువంటి కీలకమయిన ప్రతిపాదన తనంతట తానుగా చేయడానికి సాహసించేవారు కాదు. అందుకే, తెదేపా నేత రేవంత్ రెడ్డి ‘ఈ ప్రతిపాదనకు కేసీఆర్ ఆమోదం ఉందా లేదా? అని ప్రశ్నించారు.   ఏమయినప్పటికీ, హరీష్ రావు ప్రకటన తెలంగాణా ఉద్యమాలలో తెరాస నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ఆ పార్టీ లక్ష్యం తెలంగాణా సాధనా లేక వచ్చే ఎన్నికలలో విజయం సాదించడమా? అనే అనుమానం రేకెత్తిస్తోంది. కానీ, ఇటువంటివి వాటిని అవలీలగా కొట్టిపారేయగల వాక్చాతుర్యం కేసీఆర్ స్వంతం గనుక, పార్టీలో లొసుగులు బయటపడకుండా, ఏదో ఒక మెలికతో ఆయన బంతిని మళ్ళీ తెదేపా కోర్టులో పడేయడం ఖాయం.   ఇక, రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు ప్రతిపాదనను స్వాగతించడం చూస్తే, మరి ఆయన ప్రతిస్పందనకు చంద్రబాబు ఆమోదం ఉందాలేదా? అనే సంగతి ఆయనే స్పష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న చంద్రబాబుని కాదని, తెలంగాణకు చెందిన ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ తరపున ఆయన చెప్పడం ఎంతవరకు సాధ్యమో, అది సాధికార ప్రతిస్పందనో కాదో ఆయనే చెప్పాలి.   ఈ మద్య తరచుగా తెరాస నేతలు, “తెదేపాలో అయితే చంద్రబాబు లేకుంటే బాలకృష్ణ తప్ప తెలంగాణకు చెందిన వారు ఎన్నటికీ ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ముఖ్యమంత్రి అసలే కాలేరని” తెదేపాలో తెలంగాణా నేతలను రెచ్చగొడుతున్నారు. బహుశః తెదేపాలో తెలంగాణా నేతలు వారి మాటలకు ప్రభావితమయినందునే లోనయ్యరేమోనని రేవంత్ రెడ్డి ప్రతిస్పందన అనుమానాలు రేక్కిత్తిస్తోంది.   వచ్చేఎన్నికలలో కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు ఒకవేళ చేతులు కలిపితే, వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ తెదేప, తెరాసలు పొత్తులు పెట్టుకొని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ఈ సవాలు, ప్రతిసవాళ్ళు అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించవచ్చును.   ఏమయినప్పటికీ, తమ ఉనికిని నిలుపుకోవడానికి తిప్పలుపడుతున్న తెదేపా, తెరాసాలు ఇటువంటి వివాదాస్పద ప్రకటనలు, విమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళతో మీడియా ద్వారా జనం నోళ్ళలో నిత్యం నానేలా చూసుకొంతున్నాయని చెప్పవచ్చును.

జగన్ పొలిటికల్ బుకీ

        వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పొలిటికల్ బుకీ అని, అది కలెక్షన్ల పార్టీ అని కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అభివర్ణించారు. విజయసాయిరెడ్డి జగన్‌కు బ్రోకర్ అని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు సార్లు అటాచ్ చేసినా వాటిపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ విడిచిన బాణం షర్మిలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ఆనం వివేకా ప్రశ్నించారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్టీని వీడడం ఆహ్వానించదగిన పరిణామమని ఆనం వివేకా అన్నారు. ఆలస్యంగా వెళ్లినా తమ నెత్తిన తెలంగాణ ఎంపీలు పాలు పోశారని ఆయన అన్నారు.

అసమ్మతి నేతలే ముఖ్యమంత్రిని నిలువరించారా?

  ముఖ్యమంత్రి మళ్ళీ డిల్లీ తిరిగొచ్చారు. ఈసారి కూడా ఆయన మంత్రి వర్గంలో అసమ్మతి వాదులను బయటకి పంపేందుకు, మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పుల ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలుపకపోవడంతో ఆయన నిరాశగా తిరిగి వచ్చి మళ్ళీ తన ఇందిరమ్మ కలలలో మునిగిపోయారు. ఈసారి ఆయన పర్యటనలో కొన్ని నామినేటడ్ పదవులను నింపుకోవడానికి మరికొన్ని శాఖపరమయిన మార్పులు చేసుకోవడానికి మాత్రమే అనుమతి సంపాదించుకొన్నారు.   అసమ్మతి మంత్రులను తొలగించి, దానివల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి సిద్దపడుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేయడం విశేషం. ప్రస్తుతం తెలంగాణా యంపీల తెరాస జంపింగ్ సీరియల్ నడుస్తోంది గనుక, మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసి కొత్త సమస్యను నెత్తినెత్తుకోవడం కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేసి ఉండవచ్చును. లేదా, బొత్స సత్యనారాయణ తదితర అసమ్మతి నేతలు అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా చేస్తున్న పిర్యాదులను దృష్టిలో పెట్టుకొని, ఎవరినీ ఖాతరు చేయని కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ మరో రాజశేఖర్ రెడ్డిలా తయారు కాకూడదనే ఆలోచనతోనే ఆయన ప్రతిపాదనలను ఆమోదించకుండా, ఆయనకు పక్కలో బల్లెంలా అసమ్మతి నేతలను ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కావచ్చును. అందువల్ల మరికొంత కాలం రామచంద్రయ్య, డీ.యల్.రవీంద్రా రెడ్డి వంటి వారికి వెసులు బాటు దొరికినట్లే.   ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారి నెత్తిపై కట్టి వ్రేలాడుతున్నట్లేనని చివరికి మీడియా కూడా దృడంగా నమ్ముతోందంటే, వారిపట్ల ముఖ్యమంత్రికి ఎటువంటి అభిప్రాయం ఉందో అర్ధం అవుతుంది. అధిష్టానం వారిని తొలగించడానికి ఆమోదముద్ర వేయలేదు కనుక, త్వరలో మళ్ళీ ఎదో ఒక అవకాశం దొరకగానే మళ్ళీ ముఖ్యమంత్రి పై విమర్శల వర్షం కురిపించవచ్చును. ఇది ముఖ్యమంత్రి ఇబ్బందికరమే అయినప్పటికీ భరించక తప్పదు.

నారాయణ మూర్తి మళ్ళీ వచ్చారు

        ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా మరోసారి నారాయణ మూర్తి నియామకమయ్యారు. ఎగ్జిక్యూటీవ్ బోర్డులోని సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. నారాయణ మూర్తి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన కె.వి.కామత్ (65 ) తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.   2011లో ఇన్పోసిస్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు బాధ్యతల నుంచి నారాయణ మూర్తి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక నారాయణమూర్తి ఈ పదవీ కాలంలో కేవలం ఏడాదికి ఒక్క రూపాయి జీతంతోనే పనిచేస్తారు. జూన్ 1వ తేదీ నుంచి  నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.1981లో ఇన్ఫోసిస్‌ ను నారాయణమూర్తి ప్రారంభించారు. 1981నుంచి 2002 వరకు ఆయన సిఇఒగా పనిచేశారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్ కెవి కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే  విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.  

టీడీపీలో టీఆర్ఎస్ విలీనం!

        టీఆర్ఎస్ ని టీడీపీలో విలీనం చేయడానికి రెడీ అని ప్రకటించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాకపోతే ఆయన మూడు కండీషన్లు పెట్టాడు. “పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు, బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అధికారంలోకి వస్తే తెలంగాణ బిల్లుమీద మొదటి సంతకం పెట్టాలి. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇవ్వాలి… ఈ మూడు అంశాల మీద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో స్పష్టత ఇస్తే టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయడానికి ఎప్పుడయినా సిద్దం” అని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశాడు. టీఆర్ఎస్ ను టీడీపీలో విలీనం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.   ఈ మూడు అంశాలమీద చంద్రబాబుతో స్పష్టత ఇప్పించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా ? అని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ మీద టీడీపీ మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందని, పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే మోత్కుపల్లి, కేఎస్ రత్నం లాంటి వారికి కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ మీద డెడ్ లైన్లు పెడితే లొంగమని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా అంటున్నారని, అసలు డెడ్ లైన్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

అందని ద్రాక్ష పుల్లనంటున్న రాజయ్య

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్, కేశవ్ రావు, వివేక్, మందాలకు సకుటుంబ సపరివారంగా పార్టీలో జేరెందుకు టికెట్స్ పంచిఇచ్చి తనకు మాత్రం హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన రాజయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకొంటున్నారు.   ‘కాంగ్రెస్ పార్టీ లోంచి తెరాసలోకి జంపు చేసేస్తున్నానహో!’ అని చాటింపు కూడా వేసేసుకొని మూట ముల్లె సర్దుకొని రోడ్డు మీదకి వచ్చేసిన తరువాత, కేసీఆర్ తనని మాత్రం వదిలిపెట్టి మిగిలిన ముగ్గురినే తన కారెక్కించుకొని బుర్రు మంటూవెళ్లిపోయి తన పరువు తీసాడని ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ తనని మోసం చేసాడని ఆయన ఆక్రోశిస్తున్నారు.   అటువంటి వాడిని నమ్మి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళకపోవడమే మంచిదయిందని తనను తానూ సముదాయించుకొని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలంగాణా కోసం నిరంతర పోరాటం చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా సాదించేవరకు తన పోరాటం ఆగదని పనిలోపనిగా ప్రకటించేశారు.   కేవలం తెలంగాణా ఉద్యమంలో పాల్గొనడానికే తెరాసలోకి వెళ్తున్నామని చెప్పుకొంటున్న ఆ ముగ్గురు నేతలు, కాంగ్రెస్ పార్టీలో చిక్కుకుపోయిన రాజయ్య అందరి ఆలోచనలు కూడా తమకీ, తమ సంతానానికి, ఇంకా వీలయితే తమ బందుగణానికి టికెట్స్ సంపాదించుకోవడమేనని ఈ వ్యవహారాలతో స్పష్టం అవుతోంది.   టికెట్స్ ఇస్తే ఉద్యమం కోసం పార్టీ మారుతారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉద్యమం చేస్తామంటారు. దీనిని బట్టి తెలంగాణా సాదించుకోవడం పట్ల వారికెంత గొప్ప నిబద్దత ఉందో అర్ధం అవుతోంది. వారి ప్రాదాన్యత కేవలం పార్టీ టికెట్స్ కే తప్ప తెలంగాణాకి కాదని మరోమారు నిరూపించారు.   ఇక, ఉద్యమం కోసం ఇంతకాలం పోరాడిన వారిని కాదని, టికెట్ ఎరలు వేసి ఇతర పార్టీలలోని ‘సౌండ్ పార్టీలను’ తమ పార్టీలోకి ఆకర్షించాలనుకోవడం కేసీఆర్ నైజం తెలియజేస్తోంది. ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా సాధన కంటే రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ సంపాదించుకోవడమే నేడు అందరి ప్రధానధ్యేయంగా మారిందని జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.