ఛత్తీస్‌ఘడ్ పిసిసి చీఫ్ ను హత్య చేశారు

        కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్న బస్సును పేల్చి, కాల్పులు జరిపి సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను చంపిన మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ను, ఆయన కుమారుడు దినేష్ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఇద్దరి మృతదేహాలు సుకుమా జిల్లా దర్భా వద్ద లభ్యమైయ్యాయి. మావోయిస్టులు నిన్న మందుపాతరతో కాంగ్రెస్ నేతల కాన్వాయ్ని పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘటనలో 25 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా పరిస్థితి విషమంగా ఉంది. నందకుమార్, దినేష్లను కిడ్నాప్ చేసి హత్య చేశారు.

పవన్ కళ్యాణ్ తెదేపాలోకి!

    సినిమాలు, రాజకీయాలలో ఎప్పుడు ఏ వార్త ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను అభినందించడానికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ కలిసి వెళ్ళారనేది ప్రధాన వార్త అయితే, అప్పుడే దానిపై రకరకాల కోణాలలో వేడి వేడి విశ్లేషణలు కూడా వచ్చేస్తున్నాయి.   పవన్ కళ్యాణ్, నాగబాబు చంద్రబాబుని కలిసి ఆయనని అభినందించిన తరువాత వారు వచ్చే ఎన్నికలలో తెదేపా ఘన విజయం సాదించాలని కోరినప్పుడు, దానికి జవాబుగా ఆయన ‘మీ సహాయ సహకారాలుంటే మాపని మరింత సులువవుతుందని’ అన్నట్లు, అప్పుడు పవన్ కళ్యాన్ ‘తెదేపా టికెట్ ఇస్తే నేను కృష్ణాజిల్లా నుండి పోటీ చేయడానికి సిద్దం’ అని జవాబిచ్చారనేది దీనికి అనుబంధ వార్త.   ఇక ఇక్కడి నుండి విశ్లేషకుల బుర్రలకి పదును పెట్టి ఈ వార్తలకి తమ మేధా శక్తితో మరిన్ని సొబగులు అద్దారు.   1.చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ ఆ పార్టీ విజయం కోసం చాలా కష్టపడ్డారు. ఎలాగయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి తమ పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆదర్శవంతమయిన ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకుపోవాలని కలలు కన్నారు. కానీ చిరంజీవి వారిరువురికి హ్యాండిచ్చి మంత్రి పదవికోసం ‘హ్యాండ్ పార్టీ’కి తమ కలల రాజ్యాన్నిఅమ్మిపడేసి వెళ్ళిపోవడంతో వారిరువురూ ఆగ్రహంతో ఉన్నారు. తమ మెగా జీవికి తగిన బుద్ది చెప్పాలనే ఆలోచనతోనే ‘సరయిన సమయంలో సరయిన మనిషిని’ కలిసారని ఒక విశ్లేషణ.   2.ఇక, పార్టీలో తనకు తల నొప్పిగా మారిన హరికృష్ణ, జూ.యన్టీఆర్ లకు చెక్ చెప్పాలంటే పవన్ కళ్యాన్, నాగబాబులని పార్టీలో ఆహ్వానించడమే తగిన మార్గమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు విశ్లేషణ సాగింది. అందువల్ల పవన్ కల్యాణ్ కి మచిలీపట్నం నుండి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు మరో విశ్లేషణ.   3.ఇక, ఈ రకంగా సాగుతున్న విశ్లేషణలకి మనం కూడా ఓ చేయి వేయదలిస్తే ఈ రకంగా వ్రాసుకోవచ్చును. మన లెక్క ప్రకారం తెదేపాలోకి పవన్ కళ్యాణ్, నాగబాబులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్నచిరంజీవిని రాబోయే ఎన్నికలలో తెదేపా ఎదుర్కోవడం సులువవుతుంది. చిరంజీవి కంటే మంచి వాగ్ధాటి, మంచి పేరూ ఉన్న పవన్ కళ్యాణ్ న్ని ముందుంచుకొని తెదేపా ఎన్నికలకి వెళితే ఆయన ప్రభావం తగ్గించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవలనుకొంటున్న ఆయన కాపు కులస్తులను కూడా తెదేపా తనవైపు ఆకర్షించవచ్చును. తద్వారా ఆ కులస్థుల ఓట్లలో పెద్ద చీలిక తేగలిగితే అది కాంగ్రెస్, వైకాపాలా విజయావకాశాలను దెబ్బ తీసి తేదేపాకు విజయం తెచ్చిపెడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని వ్రాసుకోవచ్చును.   ఇక, ఇంటర్నెట్ లో ఇంత జోరుగా ఈ వార్తలు, విశ్లేషణలు సాగుతుంటే, డేగ కళ్ళతో సంచలన వార్తల కోసం తెగ తిరిగేసే ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాకు ఇంకా ఈ వార్త గురించి ఉప్పందలేదంటే విశేషమే. లేకుంటే, ఈ పాటికి ఈ సంచలన వార్తని, మన యాంకరమ్మలు వచ్చీరాని తెలుగులో భయంకరమయిన బ్యాంక్ గ్రౌండ్ మ్యుజిక్కుతో, ఒకే క్లిప్పింగుని తిప్పి తిప్పి చూపిస్తూ, బ్రేకుల మద్య మనకి వడ్డించేసేవారేమో!

ఎండకి కెసిఆర్ మైండ్ బ్లాక్

      టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల కేసీఆర్ ఉచ్ఛనీచాలు మర్చిపోయారని, మతిస్థిమితం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారు టీఆర్ఎస్ వంద సీట్ల కోసం కాదని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లేస్తారని, మీ చేతుల్లో అదే పోస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా కేసీఆర్ భాష ఉందన్నారు. టీడీపీపై పెత్తనం చెస్తే ఓప్పుకోమని హెచ్చరించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ ఎలా కొట్టాలో తమకు తెలుసని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ బుడ్డిపెట్ట బుల్లోడు...తెలంగాణతో సంబంధంలేదన్నారు. వెయ్యి మంది తెలంగాణ విద్యార్థులను పొట్టనపెట్టుకుంది 100 సీట్ల కోసమేనా అని ప్రశ్నించారు. 16 ఎంపీ సీట్లతో తెలంగాణ ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసలు రంగు రఘునందన్ బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగితే తెలంగాణ తీర్మానం ఎందుకు కోరలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

'జయప్రద'కి ఆలీ చెక్

        సినీ నటుడు ఆలీ సడన్ గా రాజకీయ తెర పైకి వచ్చాడు. ఆయన కోసం రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరపున జయప్రద పోటి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైన టిడిపి ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆలీని ఇక్కడినుంచి పోటికి దింపాలని చూస్తున్నారు. మరోవైపు సినీ గ్లామర్ లేని వైఎస్సార్ కాంగ్రెస్ …అలీని వలలో వేసుకోవాలని చూస్తోంది. సినిమా విషయంలో కాస్త బలమైన లాబీయింగ్ ఉన్న పార్టీ టీడీపీయే కావడంతో ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పని అంత సులువు కాకపోవచ్చు. అలీ స్వంత ఊరు రాజమండ్రిలో నటుడిగా ప్రజల్లో పేరు పొందడమే కాకుండా సామాజిక సేవలో కూడా ఆయన తరిస్తున్నారు. జిల్లాలో పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ప్రజా సేవను ఇంకా బాగా చేయొచ్చని ఆలీ భావిస్తున్నట్లు సమాచారం. ఏదమైనా అలీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

తెలంగాణపై టిడిపి డబుల్ గేమ్?

  కేసీఆర్ తెదేపా, దాని అధ్యక్షుడి ద్వంద వైఖరిని ఎండ గట్టారు. తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామంటున్న చంద్రబాబు, ఇకనయినా తన ద్వంద వైఖరికి స్వస్తి చెప్పి త్వరలో హైదరాబాదులో నిర్వహించనున్న మహానాడు సమావేశాలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తమ పార్టీ అనుకూలమని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. తెలంగాణపై తన అభిప్రాయం స్పష్టం చేయకుండా చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలంగాణా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఆయన అన్నారు.   ఈ విషయంలో కేసీఆర్ చెప్పిన మాటలు చేదుగా అనిపించినప్పటికీ అవి నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు. తెలంగాణాలో చంద్రబాబు పాదయాత్ర వల్ల పార్టీ బలపడినప్పటికీ, అది ఆపార్టీకి అవసరమయినన్నిఓట్లు రాల్చకపోవచ్చును.   తెదేపా, వైకాపాలు రెండూ కూడా తెలంగాణాకు పూర్తి అనుకూలం కానప్పటికీ, అలాగని వ్యతిరేఖం కూడా కాదనేది సుస్పష్టం. తెలంగాణా విషయంలో అవి ఇప్పటికీ స్పష్టత ఈయకపోవడానికి ప్రధాన కారణం, అవి స్పష్టత ఇస్తే దానిని బట్టి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొని, తమను రాబోయే ఎన్నికలలో ఎక్కడ దెబ్బ తీస్తుదనో భయం తప్ప మరొకటి కాదు. ఒకవేళ తాము ప్రత్యేక తెలంగాణా అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్దుడయిన తెలంగాణా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ‘సమైక్య రాష్ట్రం’ గేం ఆడితే, అప్పుడు రెండు ప్రాంతాలలో తమ పార్టీలు ఓడిపోతాయనే భయంతోనే ఆ రెండు పార్టీలు ఇంతవరకు స్పష్టత ఈయలేకపోతున్నాయి.   ఈ బలహీనత గురించి తెరాసకు కూడా బాగానే తెలుసు. అయితే అది తెలియనట్లుగా ఉండటమే తమకి రాజకీయంగా మేలు చేస్తుంది గనుక, తెలంగాణా అంశంపై స్పష్టత ఇవ్వాలని పట్టుబడుతోంది. తెదేపా ఈ పరిస్థితుల్లో ఎలాగు నిర్ద్వంద ప్రకటన చేయలేదని కూడా బాగా తెలుసు గనుకనే, తెలంగాణాకి అనుకూలమని ప్రకటన చేయమంటూ ఆపార్టీపై ఒత్తిడి తెస్తూ, దానికి వారు చెప్పే డొంక తిరుగుడు సమాధానాలను కేసీఆర్ తన శైలిలో తెలంగాణా ప్రజల ముందు ఉంచుతూ తెదేపాను, చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా.   అయితే, తెలంగాణా అంశంపై తెదేపా స్పష్టత ఇవ్వడం వలన జరిగే నష్టం కంటే, ఇవ్వకపోవడం వలననే జరిగే నష్టమే ఎక్కువని చెప్పవచ్చును. ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు ఇప్పటికీ ప్రజల మద్య దైర్యంగా తిరుగలేకపోవడానికి ప్రధాన కారణం పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరే. తెలంగాణాకి తాము వ్యతిరేఖం కాదని చెప్పినపటికీ, ‘జై తెలంగాణా!’ అని కూడా అనలేని కారణంగా తెదేపా అక్కడి ప్రజల నమ్మకం పొందలేకపోతోంది.   వారి అనుమానాలను కేసీఆర్ తన వాక్చాతుర్యంతో మరింత బలపరుస్తున్నారు. ఈ సంగతి చంద్రబాబు తో సహా అందరికీ స్పష్టంగా తెలుసు కానీ తమ బలహీనతే తమ కాళ్ళకి బంధంగా మారడంతో నోరు మెదపలేకపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గనుక తెలంగాణాపై స్పష్టమయిన వైఖరి ప్రకటించి ఉంటే, ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ ఉన్న బలం ఖచ్చితంగా రెట్టింపు అయ్యేది. కానీ, ఆ తరువాత కాంగ్రెస్ పన్నే పద్మవ్యూహంలో ఎక్కడ చిక్కడిపోతామనే భయంతోనే స్పష్టత ఈయలేకపోతున్నారు.   అయితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ప్రజల మద్య కేసీఆర్ ఆయన అనుచరులు తమ విద్వేషా ప్రసంగాలతో ఎప్పుడో చిచ్చుపెట్టి, వారి మద్య దూరం పెంచారు. కనుక, ఇక ఈ రెండు ప్రాంతాల ప్రజలు మానసికంగా కూడా ఎప్పుడో విడిపోయారు. ఒకవేళ తెలంగాణా వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టి వారిని మళ్ళీ కలుపుదామని ప్రయత్నాలు చేసినా కూడా ఇటువంటి రాజకీయనాయకులు ఉద్యమాలలో ఉన్నంత కాలం తిరిగి కలిసే అవకాశం ఉండదు.   ఇటువంటి వాస్తవిక ధోరణిలో ఆలోచించి ఉంటే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా తెలంగాణాకి అనుకూలంగా స్పష్టమయిన ప్రకటన చేసి, రెండు ప్రాంతాలలో ప్రత్యేక శాఖలు ఏర్పరుచుకొని, కాంగ్రెస్ తెరాసలకు దీటుగా నిలబడగలిగేవి.   కానీ, ముందే చెప్పుకొన్నట్లు కాంగ్రెస్ వ్యూహానికి బయపడుతూ, తెలంగాణా సమస్యను పరిష్కరించే బాధ్యతని కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేసి దాని భుజాల మీద తమ తుపాకులు ఉంచి రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాదించాలని ఆలోచన చేస్తున్నాయి. అయితే, ఈ ద్వంద విధానం వలన ఆ రెండు పార్టీలకి తెలంగాణా ప్రాంతంలో లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది.   ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన బీజేపీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు రెండూ కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో ప్రజల నుండి వ్యతిరేఖత ఎదుర్కోనలేదనే సంగతిని ఆ రెండు పార్టీలు గమనిస్తే, తాము తెలంగాణాకి అనుకూలమని ప్రకటించినా కూడా ఆంధ్రా ప్రాంత ప్రజలు వ్యతిరేకించరనే సంగతి అర్ధం అవుతుంది.   ఒకవేళ వ్యతిరేకిస్తే వారి ప్రత్యర్ద రాజకీయ పార్టీల నేతలు, వారిచే ప్రేరింపబడిన అనుచరులే వ్యతిరేకిస్తారు తప్ప ప్రజలు కారు. అటువంటప్పుడు వారిని రాజకీయంగా ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచించుకొని, ముందుకు సాగడం మేలు. ఏమయినప్పటికీ చంద్రబాబు తన ద్వంద విధానాల వల్ల రెండు ప్రాంతాల ప్రజల నమ్మకం పోగొట్టుకొంటున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

ఐపీఎల్ 6 ఫిక్సింగ్ : చెన్నై సీఈవో గురునాథ్ అరెస్ట్

        భారత క్రికెట్ సంఘం సారథి ఎన్.శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో గురునాథ్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గురునాథ్ మేయప్పన్ మదురై నుంచి ముంబై రాగానే... దాదాపు మూడు గంటలు ప్రశ్నించి... అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విందూ దారాసింగ్‌తో బంధంపై పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. గురునాథ్ బాలీవుడ్ నటుడు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన విందూ దారాసింగ్‌తో సన్నిహిత సంబంధాలు నడిపారు. విందూ ద్వారా గురునాథ్ భారీగా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గురునాథ్ ఒక జట్టు యజమానికి అల్లుడై ఉండి, ఆ జట్టు సీఈవోగా వ్యవహరిస్తూ బెట్టింగ్‌లకు పాల్పడటం గమనార్హం. శుక్రవారం తమ ముందు హాజరు కావాల్సిందిగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురునాథ్‌కు గురువారం సమన్లు జారీ చేశారు. ఆయన సోమవారం వరకు గడువు కోరినప్పటికీ... పోలీసులు అంగీకరించలేదు.

ప్రజాసేవలో తండ్రీ కొడుకులు

  సినిమాలలో ఒంటి చేత్తో వందమందిని చిదగోట్టేసే రామ్ చరణ్ తేజ్, తనకు దారీయని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పోలీసు స్టేషన్ కి ఈడ్చి వారి ఉద్యోగాలు పోగొట్టడం ఇష్టం లేక, ఏదో లైట్ గా చిన్న కోటింగు మాత్రమే ఇచ్చి వదిలేసి తన విశాల హృదయం ప్రదర్శించుకొన్నాడు. సామాన్య ప్రజల పట్ల అతనికున్న అభిమానం అటువంటిది మరి. అందుకు ప్రజలు సర్వదా అతనికి రుణపడి ఉండక తప్పదు. మళ్ళీ ఎప్పుడయినా అతను ఇంట్లోంచి బయలు దేరినప్పుడు మేకల మందల్లాంటి ప్రజలు పొరపాటున కూడా ఆయన కారుకి అడ్డం రాకూడదని, వస్తే ఏమవుతోందో అందరికీ ఇప్పుడు బాగా అర్ధమయింది కనుక మళ్ళీ తమ వల్ల అటువంటి పొరపాటు జరుగకుండా చూసుకొంటారని ఆశించవచ్చును.   ఇక, నిన్నమొన్నటి వరకు మన హృదయాలలో మెగా స్టార్ గా కొలువయిన చిరంజీవి, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారమో, మరే సూత్రం ప్రకారమో మన రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి అయ్యారు. ఇక ఆయన రాష్ట్రంలో పర్యాటకానికి పట్టం కడదామని పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ ఇప్పటికే రెండు మూడు దేశాలు కూడా తిరిగి వచ్చారు. అంటే ఆయన అంతకు ముందు విదేశాలలో తిరుగలేదని కాదు. అప్పుడు నిర్మాతల ఖర్చులతో, తిరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఖర్చులతో శ్రమ అనుకోకుండా విదేశాలు తిరిగి మన కోసం చాలా జ్ఞాన సముపార్జన చేసుకొని వచ్చారన్నమాట.   ఆయన ఎంతో ప్రయాస పడి, ఐక్యరాజ్యసమితి సభ్యులను అతి కష్టం మీద ఒప్పించి, హైదరాబాదు రప్పించి పార్క్ హైత్త్ హోటల్లో మూడు రోజులు పాటు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందుకు ఆయనను ప్రశంశించక పోగా, కొందరు ఉస్మానియా విద్యార్ధులు, 3 రోజుల పర్యాటక ముచ్చట్ల కోసం రూ.2.14 కోట్ల ప్రజా ధనం చిల్లర పైసల కంటే హీనంగా ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ముందు నిన్న సాయంత్రం ధర్నాచేసారు.   పది మంది ఐక్యరాజ్యసమితి సభ్యులకు ఒక్కో కప్పు టీకి రూ.1200ల చొప్పున రూ.2.40 లక్షలు, ఒక్కో ప్లేటు భోజనానికి రూ.3500 చొప్పున రూ.5.25 లక్షలు, వారు వై ఫి(ఇంటర్నేట్) వాడుకొన్నందుకు రూ.2.40 లక్షలు, ఫోన్ కాల్స్‌ చేసుకొన్నందుకు రూ.1.20 లక్షలు పర్యాటక శాఖా ఖర్చు చేయడం చాలా అన్యాయమంటూ, ప్రతీ చిన్నదానికీ విద్యార్ధులు లెక్కలు తీసి చెపుతూ ప్రజా ధనం వృధా చేసినందుకు వెంటనే చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేయబోయారు.   కానీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసి, ‘పెద్దవాళ్ళని అలా నిలదీయడం తప్పునాయనలారా!’ అంటూ క్లాసు పీకి వదిలిపెట్టేసారు.   కానీ, ఉడుకు రక్తం ఉరకలేస్తున్న ఆ యువకులు అక్కడి నుండి నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ చేతిలో తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ పెట్టి ఈ వ్యవహారంలో చిరంజీవి పాత్రపై ఓ లుక్కేయమంటూ పిర్యాదు చేసారు. మరి, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, మంత్రుల, ఐఏయస్ అధికారుల, బళ్ళారి బాబుల కేసులతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన, ఇక మరో నెలలో తిరిగి తన హెడ్ ఆఫీసుకి వెళ్లిపోనున్న ఈ తరుణంలో, ఇక ఈ ‘మెగా కేసు’ స్వీకరిస్తారోలేదో అనుమానమే.          అయినా మన దేశంలో ఏదయినా ఒక మంచి పని మొదలుపెట్టాలని ఎవరయినా అడుగు ముందుకు వేస్తే, వారి ఉత్సాహం మీద నీళ్ళు జల్లే ఇటువంటి వారు చాలా మందే ఉంటారు గనుక, పర్యాటక శాఖా మంత్రి గారు ఇవన్నీ పట్టించుకోకుండా మిగిలిన ఈ పది నెలల్లో మరిన్ని విదేశీ పర్యటనలు చేసి, ఇటువంటివి మరనేక సదస్సులు మరింత ఘనంగా నిర్వహించాలని కోరుకొందాము.   వెదవ డబ్బు కోసం ఇంత రచ్చ చేయాలా? నెలకి మరో రెండు సర్ చార్జీలు తగిలిస్తే ప్రజలే ఎంత కావాలంటే అంతా కక్కుతారు కదా!

టీడీపీ కార్యాలయానికి దేవినేని ఉమా తమ్ముడు తాళం

        కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ విభేదాలు వీధిన పడ్డాయి. నిన్నటిదాకా అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేదాకా వచ్చాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలోని టీడీపీ కార్యాలయానికి ఈ ఉదయం దేవినేని ఉమ్మ తమ్ముడు చంద్రశేఖర్ తాళం వేశారు. అన్నదమ్ముల మధ్యన ఉన్న ఆస్తి తగాదాలు ఈ సంఘటనకు దారితీసినట్లు సమాచారం. అన్నతో విభేదించిన చంద్రశేఖర్ ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నేతల ప్రోత్పాహంతోనే చంద్రశేఖర్ టీడీపీ కార్యాలయానికి తాళం వేసినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మొదలయిన రాజకీయ వలసల సీజన్

  ఎన్నికల సమయం క్రమంగా దగ్గర పడుతున్న కొద్దీ మెల్లగా రాజకీయనాయకుల కప్ప గెంతులు కూడా మొదలయ్యాయి. తెదేపా నుండి కొంత మంది తెరాస వైపు వెళ్ళగా, కాంగ్రెస్ నుండి మరికొందరు వైకాపా వైపు దూకుతున్నారు. తెదేపా నుండి బయట పడేందుకు ‘తెలంగాణా’ లేదా ‘పార్టీలో పెత్తందారులు’ కారణాలుగా చెప్పబడుతుంటే, తెరాస నుండి బయట పడేందుకు, కేసీఆర్ నియంతృత్వ ధోరణి, ఆపార్టీకి తెలంగాణాపై చిత్తశుద్ధి లేదనే సాకుతో బయటపడుతున్నారు.   ఇక, ఒకే రక్తం పంచుకు పుట్టిన కాంగ్రెస్, వైకాపాల మధ్య కేవలం ‘జగన్’ అనే ఏకైక అంశంతో మార్పులు జరుగుతున్నాయి తప్ప వేరే ఇతర అంశాలు లేవు. జగన్ వ్యతిరేఖించేవారు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోతే, అతని గెలుపు తద్యం అని భావించేవారు అటువైపు మారుతుంటారు. అయినప్పటికీ, జగన్ అక్రమాస్తుల కేసులు ఆ రెండు పార్టీల మధ్య వీడని, కనబడని ఒక గట్టి బంధం ఏర్పరిచింది. ఆ రెండు పార్టీల వారు ఒకరినొకరు దూషించుకొంటున్నపటికీ, కేసులు రాజీనామాల విషయం వచ్చేసరికి వారందరూ ముక్త కంఠంతో ఎవరూ కూడా తప్పు చేయలేదని చెప్పడం ఇందుకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చును.   ఈ నాలుగు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం మొదలుపెట్టగానే ఆ పార్టీల మద్య వలసలు పూర్తి స్థాయిలో జోరందుకోవచ్చును. తెదేప, తెరాసలు రెండు కూడా బహుశః వచ్చే నెలలో ఖచ్చితంగా తమ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది, గనుక అప్పటి నుండి వలసలు మొదలవవచ్చును.   ప్రస్తుతానికి మాజీ మంత్రి డీకే సమరసింహా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రుమాండ్ల రామచంద్రయ్య వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. రామచంద్రయ్య గతంలో స్వర్గీయ యన్టీఆర్ కి అత్యంత ఆప్తుడుగా, తెదేపాకు తెలంగాణా ప్రాంతంలో బలమయిన పునాది వేశారు. కానీ, తెలంగాణా ఉద్యమాలు ఊపందుకోవడంతో రెండు సం.ల క్రితం ఆయన పార్టీని వీడి తెరాసలో చేరారు. కానీ, మళ్ళీ ఇప్పుడు తిరిగి తెలుగు దేశం గూటికే చేరుకొన్నారు.   అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బాజపాలోకి అక్కడి నుండి తెరసలోకి వెళ్ళిన సమర సింహా రెడ్డి కూడా ఈ రోజే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక, ముగ్గురు తెలంగాణా కాంగ్రెస్ యంపీలు మరియు కే.కేశవ్ రావు తదితరులు వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ నుండి తెరాసలో చేరేందుకు ముహూర్తం పెట్టుకొన్నారు. వైకాపా నుండి తాజాగా సస్పెండ్ అయిన కాకాని గోవర్ధన్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది.

వడ దెబ్బకు ఇంటర్ విద్యార్ధి మృతి

        ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసి వస్తుండగా విద్యార్ధి వడదెబ్బతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన రాకేష్ రెడ్డి (18) వరంగల్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అక్కడే సప్లిమెంటరీ పరీక్ష రాసి బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. ఎండ వేడి ఎంత దెబ్బ తీసిందో ఏమో.. ఊరు దాకా రాకముందే బస్సులో స్పృహ కోల్పోయాడు. వడదెబ్బ తాకిడికి ప్రాణాలు ఎప్పుడుపోయాయో తెలియదుగానీ.. కోతిరాంపూర్‌లో దిగాల్సినవాడు దిగనే లేదు. కరీంనగర్ బస్టాండుకు వచ్చాక కూడా అలాగే ఆఖరుసీటులో పడి ఉండటంతో తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు విషయం చెప్పారు. ముఖంపై నీళ్లు చల్లినా కదలకపోవడంతో 108కు సమాచారం అందించారు. వచ్చి చూసిన వైద్య సిబ్బంది.. అతడు మృతి చెందినట్లు చెప్పారు.

పార్ధ సారధి రాజీనామాకై ప్రతిపక్షాల వృధాప్రయాస

  ధర్మాన, సబితల రాజీనామాలు చేసామని చెప్పినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ, దృవీకరించే స్థితిలో లేరు. అసలు వారు నేటికీ మంత్రులుగా కొనసాగుతున్నారా లేక మాజీలుగా మారారా? అనే సంగతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వంలో అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదంటూ హూకరించే కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ విషయంలో నోరు మెదపడానికి భయపడుతున్నారు.   అయినా కూడా ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీకూడా మిగిలిన నలుగురు మంత్రుల వెంటపడటం మానుకోలేదు. కళంకిత మంత్రుల రాజీనామాల కోసం పట్టుబడుతున్న తెదేపా కూడా తన హాయంలో జైలులో ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చింది గనుక, ఆటోమేటిక్ గా ఆ పార్టీకి నైతిక హక్కులు క్యాన్సిల్ అయిపోయినట్లేనని ఆయన ఏదో ఆల్జీబ్రా సిద్ధాంతం ప్రకారం శలవిచ్చారు.   ఇక తను పదవిలో కొనసాగాలా వద్దా? అనేది కాంగ్రెస్ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకొంటారని, అందువల్ల ప్రతిపక్షాల వారు తన రాజీనామా విషయమై శ్రమ పడటం వృధాయని ఆయన సూచించారు. ఇక, తన సంస్థపై ఉన్న ఫెరా ఉల్లంఘన కేసు గురించి తానూ 2004 ఎన్నికల ఎఫిడవిట్ లో సమర్పించానని, కానీ 2009 ఎన్నికల సమయానికి తానూ ఆ సంస్థ డైరెక్టర్ పదవి నుండి తప్పుకొనందువల్లనే తానూ 2009 ఎన్నికల ఎఫిడవిట్ లో పేర్కొనలేదని, ఈ విషయం తెలుసుకోకుండా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వారిపై విరుచుకు పడ్డారు.   ఆయన ఒకవేళ ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి తన పదవికి రాజీనామా చేస్తే, దానిని కూడా ఆయన కంటే ముందుగా రాజీనామాలు చేసిన ఇద్దరు మంత్రుల రాజీనామాల పత్రాల క్రిందనే పెట్టక తప్పదు గనుక ప్రతిపక్షాలు ఆయన వెంట పడటం మానుకొంటేనే మేలు.

జూన్ 3న బీజేపీలోకి నాగం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి తెలంగాణ నగారా సమితి ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి జూన్ 3న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుండి ఎన్నికయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నాగం 28 వేల ఓట్ల మెజార్టీ సాధించాడు. అయితే అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన ఉగాది నాడే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలకు హాజరై తాను బీజేపీలో చేరతానన్న సంకేతాలు ఇచ్చారు. ఈ సారి మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీకి మంచి ఊపు వస్తుందని అయన అన్నారు.

సంజయ్ దత్ ఖైదీ నెం.16656

    ముంబయి పేలుళ్ళ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజయ్ దత్ ను మంగళవారం అర్థరాత్రి అత్యంత రహస్యంగా పూనేలోని ఎరవాడ జైలుకు తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నెల 16న టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్ 42నెలల జైలు శిక్షను ఇంకా అనుభవించాల్సి ఉంది. దీనికి గాను తొలుత ఆర్థర్ రోడ్డు జైలులోని అండా గదిలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం అర్థరాత్రి అత్యంత రహస్యంగా సంజయ్ ను ఆర్థర్ రోడ్డు జైలు నుంచి తరలించారు. బుధవారం వేకువ జామున గంటలకు సంజయ్ ఎర్రవాడ జైలుకు చేరుకున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండే గదిని ఆయనకు కేటాయించినట్లు సమాచారం. భద్రతా కారణాల వల్లే సంజయ్ ను రహస్యంగా తరలించామని అధికారులు చెప్పారు. జైల్లో సంజయ్‌దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి.

కెసిఆర్ రహస్యాలు బయటపడ్డాయి!

  -డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     ఒక స్థానిక దినపత్రిక మొదటిపేజీలో [21-05-2013] పాఠకులు ఓ చిత్రమైన ఫోటో చూసి ఉంటారు. అందులో పైనుంచి కిందివరకూ వరసక్రమంలో కనిపించే ఆధునిక "పంచపాండవుల్ని'' [కొందరు వీరిని మంచపుకోళ్ళు'' అని అంటున్నారు] పాఠకులు కనిపెట్టి ఉంటారు! అందులో ఒకాయన బాగా పాలిపోయిన ముఖంతో కనిపిస్తాడు. మిగతావారు మాత్రం తెచ్చిపెట్టుకున్న మందహాసంతో కనిపిస్తారు. అయితే ఈ అయిదుగురిలో ఒక వ్యక్తి పార్టీవేరు, మిగతా నలుగురి పార్టీ వేరు. కాని, పార్టీలు వేరైనా అయిదుగురికీ పొత్తు ఎలా కుదిరిందన్నది పాఠకుల సందేహం. ఆ పొత్తుకోసమే ఆ రెండు పార్టీల మధ్య కొన్ని మాసాలుగా మంతనాలు సాగుతున్నాయి. ఇందులో ఒక పార్టీ "తెలంగాణా'' వేర్పాటు ఉద్యమం పేరిట ముఖ్యమంత్రి పదవి కోసం వెంపరలాడుతూ తెలంగాణాలో "పరకాయప్రవేశం'' చేసిన 'సీమాంధ్ర దొర' కెసిఆర్ పెట్టిన తెలంగాణా రాష్ట్ర సమితి. కాగా మిగతా నలుగురు నాయకులు తెలంగాణా కాంగ్రెస్ ఎం.పీ.లు. రెండు మూడు మాసాల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంతో కె.సి.ఆర్. ప్రారంభించిన చర్చల వేదిక ఇప్పుడు క్రమంగా హైదరాబాద్ లోని "ఫామ్ హౌస్''ల వద్దకు, "వ్యవసాయక్షేత్రం'' వద్దకు చేరుకుంది. దేశ సమైక్యతను, భాషా రాష్ట్రాల సమగ్రతను కోరుకునే కాంగ్రెస్ కూ కేవలం తన ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణలో పాగా వేసి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న 'సీమాంధ్ర దొర' వేర్పాటువాద స్థానిక పార్టీకీ పొత్తు ఎలా కుదిరింది? ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై బాధ్యతగల ఒక రాజకీయపక్షంగా ఇందిరాగాంధి మాదిరిగా ఒక మాటమీద నిలబడలేక రోజుకొక తీరుగా 'ధ్వని కవిత్వాలు' నేటి కాంగ్రెస్ కేంద్రనాయకత్వం వినిపిస్తున్నందునే రాష్ట్ర సమస్య జటిలం కావలసి వచ్చింది. ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకోవడానికి కేంద్ర నాయకత్వం "తెరాస''లాంటి ఏ పూచికపుళ్ళ కనపడినా దానితో పొత్తు పెట్టుకోడానికి సిద్ధపడుతోంది.   ఈ దౌర్భాగ్యపు వ్యూహంలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకొనే యత్నంలో తద్వారా తెలంగాణలో తోటి తెలుగువారిపై విద్వేష ప్రచారం ద్వారా సీమాంధ్రులను'' గెంటివేస్తే లక్షలాది ఉద్యోగాలు ఖాళీ అయి స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్న ఆశలు కల్పించడం ద్వారా తెలంగాణా బిడ్డలను ఆత్మహత్యలకు పురిగొల్పిన రాజకీయ నిరుద్యోగి కె.సి.ఆర్.కు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ ఆశ చూపించింది ఢిల్లీ చర్చలలో. దాని ఫలితమే నేడు తెలంగాణా కాంగ్రెస్ నూ, "తెరాస'' పార్టీని కలిపేసే ప్రయత్నం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తన చేతులు కాల్చుకోకుండానే తెలంగాణా కాంగ్రెస్ ను తెరపైనిల్పి కెసిఆర్ తో పొత్తుకు ద్వారాలు తెరిచినట్టు కన్పిస్తోంది.   తద్వారా కెసిఆర్ ఆశ, ఇటు కాంగ్రెస్ కు ఉన్న స్థానిక బలంతో తాను ఆత్మహత్యలపాలైన వారి కుటుంబాలనుంచి ఆగ్రహాన్ని, ప్రమాదాన్నీ తప్పించుకోవచ్చు, అటు ప్రత్యేక తెలంగాణా ఏర్పడని పక్షంలో తెలంగాణా ప్రజలనుంచీ ఆగ్రహావేశాలకు తాను గురికాకుండా కాంగ్రెస్ పార్టీ అండతో బయటపడనూవచ్చు! ఇదీ వ్యూహం.  అందుకనే తన ముఖ్యమంత్రి పదవికోసం, తెలంగాణా పేరిట ఎంతమంది కుర్రకారును ఆత్మహత్యల వైపుకు నెట్టినా అతనికి చింతలేదు. ఆ చింత అతనికి లేదనడానికి తాజాగా గతవారం పదిరోజులలో జరిగిన మూడు యువకుల ఆత్మహత్యలే నిదర్శనం. వీళ్ళ జేబుల్లో దొరికాయని లేదా కనిపించాయని ["పర్ పోర్డెడ్ టు బి''] పత్రికలూ అనుమానాస్పదంగా ప్రకటించిన "సూసైడ్'' లేఖల్లో కెసిఆర్ నాయకత్వాన్ని పొగుడుతూ, మిగతా రాజకీయ పక్షాలను తిడుతూ రాయడాన్ని బట్టి 'తెరాస', ఉస్మానియాలో దాని అనుబంధ విద్యార్థి సంఘమూ కలిసి ఆ లేఖను కెసిఆర్ ప్రయోజనాల కోసమే డ్రాఫ్ట్ చేసినట్టు అనిపిస్తోంది! లేకపోతే ఆ ముగ్గురి యువకుల జేబుల్లో ఒకే తరహా లేఖలు ఉండవలసిన అవసరంలేదు. అంటే ఒక నిరుద్యోగి రాజకీయుడు పదవులకు ఎగబాకడం కోసం తన కుటుంబసభ్యుల్ని తన బంధుమిత్రుల్ని మినహాయించుకుని ముక్కుపచ్చలారని, ఎంతో భవిష్యత్తు చూడవలసిన, అనుభవించవలసిన యువకుల్ని ఆత్మహత్యల వైపునకు తప్పుడు ఆశలతో నెట్టడం ప్రజాస్వామిక రాజకీయ పద్ధతులకు పూర్తి విరుద్ధం. పైగా దశాబ్దాల తరబడి దొరల, భూస్వాముల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దాష్టీకాలకు గురవుతూ వచ్చిన తెలంగాణా ప్రజలను తిరిగి 'దొర'ల పాలనా విషకౌగిలిలోకి నెట్టడమంటే, దారుణ చరిత్రను పునరావృత్తం చేయడమే అవుతుంది.   తెలంగాణా ప్రజా బాహుళ్యంలో, ముఖ్యంగా వెట్టిచాకిరీ ద్వారా బానిస బతుకులు అనుభవించిన దళిత బహుజన అట్టడుగు వార్తాలు ఈ పరిణామాన్ని వ్యతిరేకించి, ప్రతిఘతిస్తారని తెలిసిన కెసిఆర్ పన్నిన కొత్త నాటకం - తన పార్టీ (తెరాస) అధికారంలోకి వస్తే దళితుడ్నే "ముఖ్యమంత్రి''ని చేస్తానని పాత 'దొర'తనపు అహంకారాన్ని ఇంతకుముందే ప్రదర్శించడం జరిగింది. కాని, అదే నోటితో, తెరాసలో కొత్తగా తీర్థం పుచ్చుకున్న దళిత నాయకుడు, నిన్నిటిదాకా "తెలుగుదేశం''పార్టీలో అనేక ప్రధానపదవులను అనుభవించిన కడియం శ్రీహరినే 'తెరాస' గెలిస్తే, గిలిస్తే ముఖ్యమంత్రిగా నియమిస్తామని మాత్రం చెప్పలేకపోయాడు! చెప్పడు. ఎందుకంటే దళితులంటే కెసిఆర్ నాయకత్వానికి ఎంతటి చులకనో ఢిల్లీలోని ఆంధ్రభవన్ లో రాష్ట్రప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న దళిత ఆఫీసరు మీద కెసిఆర్ కుటుంబసభ్యుడే చేయి చేసుకొని గాయపరిచిన సంగతిని తెలంగాణాలోని బడుగు బలహీనవర్గాలు మరిచిపోయే ప్రసక్తిలేదు. ఈ దశలో తిరిగి రకరకాల గొంతెమ్మకోరికలు లేదా ఆశలతో ఇటీవల కెసిఆర్ ప్రకటనలు గుప్పిస్తున్నాడు, అవి అమలుకురాని శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలుగా రూపుదిద్దుకుంటాయి.   కాని ఈలోగా కెసిఆర్ చేస్తున్న మరోకపని - 'తెరాస'లోకి ఇతర పార్టీలనుంచి దూకివచ్చే 'జంప్ జిలానీల' సంఖ్య నామమాత్రమేనని పరిణామాలు నిరూపిస్తున్నందున, "ఆ పార్టీనుంచి ఇద్దరు, ఈ పార్టీనుంచి ముగ్గురు'' టి.ఆర్.ఎస్.లోకి వచ్చేస్తున్నారు, రేపోమాపో చేరబోతున్నారు అంటూ చేరబోయే వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ముందస్తు ప్రచార ప్రకటనలు యివ్వడం, వాళ్ళని బలవంతాన 'చక్రబంధం'లోకి లాగడంకోసం శ్రమపడి 'డీలా' అయిపోతున్నాడు! కాని ఈలోగా తెరాసనుంచి ఇతర పార్టీలలోకి జారుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. "కాంగ్రెస్ లోనే ఉంటూ తెలంగాణాకోసం పోరాడతామేగాని మరో పార్టీలో చేరే సమస్యలేదని కొందరు తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యులు తెగేసి చెబుతున్నారు. కాగా, ఈలోగానే తెలంగాణా విద్యార్థి సంయుక్త కార్యాచరణ సంఘం అధ్యక్ష పదవిలో గత పన్నెండేళ్ళుగా ఉన్న రాజారాం యాదవ్ ఆ పదవికి రాజీనామా చేసి రేపోమాపో "తెలుగుదేశం'' పార్టీ తీర్థం పుచుకోడానికి సిద్ధపడ్డాడు! కెసిఆర్ ముఠా అవకాశవాద రాజకీయాలతో విసిగివేసారిన ఉస్మానియా విద్యార్థి సంఘంలో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోందని కొందరు విద్యార్థి మిత్రులు చెప్పారు.   ఇక టి.ఆర్.ఎస్. రాజకీయంతో, కెసిఆర్ వర్గం కుట్రలతో విసిగివేసారిన టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో ముఖ్యసభ్యులు, టి.ఆర్.ఎస్. నాయకుడైన ఎం. రఘునందన్ 'తెరాస' నాయకులు సూటిగా సమాధానం చెప్పలేని కుటుంబ అవినీతి గురించి చేసిన ఆరోపణలు మొత్తం రాష్ట్రరాజకీయాల్లోనే పెద్ద సంచలనం కల్గిస్తున్నాయి.అనేక స్పష్టమైన రుజువులతో ఆ కుటుంబం అవినీతి గురించి రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యానికి రఘునందన్ సిద్ధం కావడంతో తన ప్రాణానికి ఆ కుటుంబంనుంచి ప్రమాదముందని భావించి, రాష్ట్ర డి.జి.పి.ని కలుసుకుని తనకూ, తన కుటుంబానికీ రక్షణ కల్పించాలని రఘునందన్ విజ్ఞప్తి చేయడం గమనార్హం! అంతేగాదు "సిబీఐ''కి కూడా రఘునందన్ కెసిఆర్ లావాదేవీల గురించి ప్రత్యేక నివేదికను అందజేయడం విశేషం. రఘునందన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక "అతనికి మతిభ్రమించింద''న్న ఒక్క మాటతో తప్పించుకోజూస్తున్నారు కెసిఆర్ కుటుంబసభ్యులు. రఘునందన్ ఆరోపణలకు పునాది, స్వయంగా ఆ కుటుంబానికి ఆయన అతి సన్నిహితంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఉన్న సమాచారం కూడా రఘునందన్ కు అందినట్టు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి! ఇదిలా ఉండగానే "తెరాస''లో కొత్తగా తీర్థం పుచ్చుకున్న "దేశం'' ముఖ్యుడు కడియం శ్రీహరికి గతంలో ఇప్పగూడెంలో జరిగిన 'తెరాస' కార్యకర్త పరుశురాం హత్య కేసుతో సంబంధం ఉందన్న రఘునందన్ ఆరోపణను శ్రీహరి ఖండించాల్సి రావటం 'తెరాస' రాజకీయ కుమ్ములాటల్లో సరికొత్త కోణం! కాగా, ఆ హత్యకు మార్కిస్టుపార్టీ కార్యకర్తలు కారణమని శ్రీహరి ప్రకటించి మరొక కల్లోలానికి దారితీశాడు! ఇది యిలా ఉండగా, తెలంగాణాలోని దళితులలో అసంఖ్యాకులు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలలో సహితం, గ్రామాలలోనూ కెసిఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సన్నద్ధమవుతున్నారని దళితమిత్రులు చెబుతున్నారు.

జగన్ ఆర్ధిక ఉగ్రవాది

        వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ పైన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరోసారి సంచలన విమర్శలు చేశారు. జగన్ ను ఆర్థిక ఉగ్రవాది అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కు సన్నిహితుడిగా పేరపడ్డ ఆయన కొన్నాళ్లుగా జగన్ మీద ఆరోపణలు చేయడంలో ఉత్సాహంగా ఉంటున్నారు.జగన్ ను దేశం నుండి, రాష్ట్రం నుండి తరిమికొట్టాలని, ఆర్థిక ఉగ్రవాదం దేశానికి మంచిది కాదని, ఇది సమాజాన్ని ముక్కలు చేస్తుందని, అందుకే ఇక్కడి నుండి పారద్రోలాలని అన్నారు. జగన్ నేలమాళిగలలో లక్షల కోట్లు దాచుకున్నారని, ఆయనను చూసి దేశంలో మిగతావారు తయారవుతున్నారని, దోచుకునేందుకు దారులు వెతుకుతున్నారని అన్నారు. వై.ఎస్.హయంలో పీజ్ రీయింబర్స్ మెంట్, తదితర పదకాలకు బకాయిలు పెద్ద ఎత్తున ఉంటే దానిని కిరణ్ ప్రభుత్వం తీర్చిందని అన్నారు.

గద్దె రామ్మోహన్ వర్సెస్ కేశినేని నాని

        విజయవాడ లోక్ సభ టికెట్ ను దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో పోరు రాజుకుంది. ప్రజారాజ్యం నుండి టీడీపీలో చేరిన ట్రావెల్స్ అధినేత కేశినేని నానికి టికెట్ ఇస్తారన్న అనుమానంతో మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు టికెట్ కోసం స్వరం పెంచారు. దీంతో విజయవాడ టీడీపీలో కొత్త పోరు మొదలయింది. మొన్నటిదాకా వల్లభనేని వంశీ – దేవినేని ఉమామహేశ్వరరావు పంచాయితీ, తరువాత కొడాలి నాని పంచాయితి నెలకొంది. అవి సద్దు మణిగాక ఇప్పుడు గద్దె పంచాయితీ ప్రారంభమయింది. “రాజకీయాల్లో డబ్బు ప్రధానం. అయితే డబ్బే రాజకీయం కాదు. ఎప్పటి నుండో పార్టీలో ఉండి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు వచ్చినవారు డబ్బులు పెడతారని టికెట్ ఇస్తే ఇన్నాళ్లు ఖర్చుపెట్టిన వారి పరిస్థితి ఏంటి ? అని ఆయన చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఎంపీ సీటు కావాలనడం నా డిమాండ్. డబ్బులు ఖర్చుపెట్టమంటే మేమూ పెడతాం అని ఆయన అన్నారు. విజయవాడ ఎంపీ సీటు విషయంలో నాని – గద్దెల మధ్య ఇప్పుడు తీవ్రపోటీ నెలకొంది.

మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకొన్నటీ-కాంగ్రెస్ యంపీలు

  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవ్ రావు సోనియా గాంధీతో ఇటీవల సమావేశం అయిన తరువాత అంతా భేషుగ్గా ఉందని సర్టిఫికేట్ జారీ చేసి రెండు రోజులు కూడా కాక మునుపే ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో ‘మా ఎజెండాలో తెలంగాణా అంశం లేదంటూ’ బాంబు పేల్చడంతో కేశవ్ రావుతో సహా అందరూ అవాక్కయిపోయారు.   అప్పుడు వారికి కోపం రావడం సహజమే. వారు చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఆయన మాటలను ఖండించడమే కాకుండా, తమ అధిష్టానానికి తెలంగాణా అంశంపై స్పష్టమయిన ప్రకటన చేసేందుకు తాజాగా మే 30వ తేదీ డెడ్ లైన్ విదించి, మరో వైపు తెరాసలో చేరబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు పంపారు.   కానీ, ఆవేశంలో ఆవిధంగా అన్నపటికీ, వారికి నిజానికి పార్టీని వీడేందుకు మనస్పూర్తిగా ఇష్టం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే, ఇనుము వేడిగా ఉన్నపుడే సమ్మెట దెబ్బ పడాలనే ఆలోచనతో వారిని వెంటనే తెరాసలో చేరమని కేసీఆర్, హరీష్ రావ్ తదితరులు చాల ఒత్తిడి తెచ్చారు. కానీ, వారు మాత్రం తమ పార్టీ అధిష్టానం తెలంగాణా అంశంపై ఏదోఒకటి తేల్చిన తరువాతనే వచ్చి జేరుతామని స్పష్టం చేయడం, వారు ఆలోచించుకోవడానికి మరింత సమయం కోసమే. తద్వారా వారు తెరాసలో చేరాడానికి ఇంకా వెనుకాడుతున్నట్లే స్పష్టం అవుతోంది.   కానీ, వారు మే30వ తేదీ డెడ్ లైన్ విదించడంతో, అధిష్టానం యొక్క ఆగ్రహానికి గురయ్యి, ప్రస్తుతం పార్టీలోకొనసాగలేని, బయటకు వెళ్ళలేని దుస్థితిని తమకు తామే కల్పించుకొన్నట్లయింది. కొద్ది రోజుల క్రితమే సోనియా గాంధీ స్వయంగా కేశవ్ రావును పిలిపించుకొని ఆయనతో అన్ని విషయాలు మాట్లాడిన తరువాత మళ్ళీ ఆయన ఇప్పుడు తనకి డెడ్ లైన్ విదించడంపై పార్టీ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఎంతగా నచ్చజెప్పుతున్నపటికీ, కొందరు నేతలు పదేపదే ఈవిధంగా తమను ఇరకాటంలో పెట్టి, ఎదురుతిరుగుతుండటం ఇక వారిని ఎంత మాత్రం సహించే పరిస్థిలోలేనట్లు స్పష్టం అవుతుండటంతో, ఇప్పుడు వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. పార్టీకి విదించిన డెడ్ లైన్ ఇప్పుడు వారి పాలిట ఉరిత్రాడుగా మారింది. వారికి వారే విదించుకొన్న ఈ డెడ్ లైన్ ముగియడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నందున, మరో కొత్త ప్రయత్నంలో భాగంగా కేశవ్ రావు నిన్న తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ను కలిసారు.   ఒకవేళ ఆయనచేత కొత్త పార్టీ పెట్టింఛి అందులో చేరేందుకు ప్రయత్నిస్తున్నారేమో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఈసారి తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆవేశంలో తమ మెడకి తామే ఉచ్చు బిగించుకొన్నారనేది మాత్రం సుస్పష్టం.

కోదండరాముడితో కాంగ్రెస్ యంపీలు కొత్త పార్టీ పెట్టిస్తారా

  కాంగ్రెస్ అధిష్టానం ఈనెల 30లోగా తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేయకపోయినట్లయితే పార్టీని వీడి తెరాసలో చేరుతామని కాంగ్రెస్ యంపీలు హెచ్చరించినప్పటికీ, అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.   కానీ, నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే, ఆయన త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపద్యంలో కేశవ్ రావు ఆయనతో సమావేశం అవడం చూస్తే, కాంగ్రెస్ యంపీలు తెరాసలో చేరడం కంటే, మేధావి, విద్యావంతుడు, సంస్కారి, పెద్దమనిషిగా తెలంగాణా ప్రజలలో మంచి గౌరవం కలిగిన ఆయన చేతనే రాజకీయ పార్టీ పెట్టించి, ఆయన నేతృత్వంలో పనిచేయడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.   ప్రొఫెసర్ కోదండరాంకు కూడా కేసీఆర్ తో గతకొంత కాలంగా తరచూ చేదు అనుభవాలు ఎదురవుతున్న నేపద్యంలో, ఆయనకు రాజకీయాలపట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ, ఆయనపై వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయ పార్టీ స్థాపనకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.   తెలంగాణా ఉద్యమాలను పక్కన బెట్టి ఎన్నికలు, టికెట్లు అంటూ కేసీఆర్ పక్కదారి పట్టడంతో ఆయనకి తెలంగాణా సాధనపై చిత్తశుద్ధి లేనట్లు ప్రజలలో అభిప్రాయం వ్యక్తం అవుతుండటం, దానికి బలం చేకూరుస్తున్నట్లు రాబోయే ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టగలవారికే పార్టీ టికెట్స్ అని ఆయన ఇటీవల చేసిన ప్రకటన, ఉద్యమాలు చేసిన వారిని, బడుగు బలహీన వర్గాలవారిని పక్కన బెట్టి ధన రాజకీయాలకు కేసీఆర్ స్వయంగా తెరలేపడం, రఘునందన్ రావు వంటివారు తెరాస నేతల బలవంతపు వసూళ్ల వ్యవహారాలు బయటపెట్టి సీబీఐకి పిర్యాదుచేయడం వంటి అనేక అంశాలు ప్రొఫెసర్ కోదండరాంను కేసీఆర్ కు దూరం చేసాయి. అందుకే ఆయన ఉద్యమ కారులకు, రాజకీయవేత్తలకు, మేధావులకు అందరికీ ప్రాతినిద్యం వహించే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు  ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.   అయితే, ఉద్యమాలు చేయడం వేరు ఒక రాజకీయ పార్టీ స్థాపించి దానిని సమర్ధంగా నడిపించడం వేరే అనే సంగతి ఆయనకు బాగా తెలుసును గనుకనే ఇంతకాలంగా ఎంతమంది ఆయనపై ఒత్తిడి తెస్తున్నపటికీ ఆయన వెనుకంజ వేస్తునట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయాలలో తలపండిన తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఇప్పుడు కొత్త పార్టీ స్థాపనలో, దాని నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేందుకు ముందుకు వస్తునపుడు, ఇక ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి అభ్యంతరం ఉండకపోవచ్చును. అందువల్ల కేశవ్ రావు-ప్రొఫెసర్ కోదండరాంల మధ్య నిన్న జరిగిన సమావేశానికి చాలా ప్రాదాన్యత సంతరించుకొంది.   తెలంగాణా ఉద్యమాలు పూర్తిగా చల్లబడిపోయిన ఈ తరుణంలో వారు తమ సమావేశానికి ఏమి ప్రాదాన్యత లేదని కేవలం తెలంగాణా ఉద్యమం గురించి చర్చించడానికే సమావేశమయ్యామని చెప్పడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.   ఏది ఏమయినప్పటికీ, తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ మరొకటి లేనంత కాలం కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతూనే ఉంటుందని అభిప్రాయపడుతున్నఅనేక మంది రాజకీయ నాయకులు, ప్రజలు కూడా తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఎంతయినా ఉందని, దానికి ఇదే సరయిన తరుణమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ విస్తృత స్థాయి విభేధాల సమావేశం

  ఈ రోజు హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ నేతల మద్య సయోధ్య కుదర్చకపోగా నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను కార్యకర్తల ముందు బయటపెట్టుకొనేందుకు మాత్రమే ఉపయోగపడింది. నేతలు తమ అభిప్రాయ బేధాలు బయటపెట్టుకొంటే, ఈసారి సమావేశానికి హాజరయిన ప్రతినిధులు, నేతలను నిలదీయడం మరో విశేషం.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ఈ సమావేశం లో ముఖ్యమంత్రికి కాస్త గట్టిగానే చురకలు అంటించారు. ‘నేను’ అనుకొంటే అది అహంకారమని, ‘మనము’ అది అనుకొంటే మానవత్వం, ఐకమత్యానికి నిదర్శనమని అంటూ కిరణ్ ఒంటెత్తు పోకడలను ఎండగట్టారు. ప్రభుత్వం ఆర్భాటంగా పధకాలను ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకోకుండా అవి సరిగ్గా అమలవుతున్నాయో లేదో కాస్త పట్టించుకొంటే మంచిదని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ కలుపుకుపోగలిగితేనే రాగల ఎన్నికలలో విజయం సాదించగలమని, అలాకాకుండా ఎవరయినా ఒంటరిగా ఏదో సాదించేద్ధామని అనుకొంటే అది భ్రమే అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చురకలు వేసారు.   ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతల మద్య ఐకమత్యం గురించి మాట్లాడుతున్నపుడు, ఆయన స్టేజ్ దిగివెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్టీలో నేతల మధ్య సమస్యలు ఉంటే వాటిని పార్టీ అంతర్గత సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలి తప్ప మీడియాకెక్కి నలుగురిలో తాము పలుచన అయ్యి, పార్టీని కూడా పలుచన చేయరాదని కోరారు. కార్యకర్తల కృషివల్లే నేడు తాము ఈస్థాయిలో ఉన్నామన్న సంగతిని వేదిక మీద ఉన్న ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకు మెలగాలని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదంటూ వారి మెప్పుపొందే ప్రయత్నం చేసారు. పార్టీలో పనిచేసే వారికి పదవులు వాటంతట అవే వెతుకొంటూ ఇంటికి వస్తాయని ఆయన అన్నారు.   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు కూడా ఇంచుమించు అవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికలలో పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.   అంతకు ముందు కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ తాము పార్టీకోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎన్నడూ పార్టీ గుర్తించలేదని, గత 30 ఏళ్లుగా పార్టీలో కార్యకర్తల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. మరికొంత మంది కార్యకర్తలు నేతలు ఐకమత్యంగా మెలగుతూ పార్టీ విజయానికి కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.   మొత్తం మీద ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలందరూ కార్యకర్తలకి ప్రాధాన్యం ఈయాలని అంటూనే, కొందరు కార్యకర్తలు తమ తీరును తప్పుబడుతుంటే ‘విమర్శలు వద్దంటూ’ వారి మైక్ కట్ చేసి కూర్చోబెట్టేశారు. తమ మద్య ఉన్న అభిప్రాయ బేధాలను మీడియా ముందు బయటపెట్టుకోరాదంటూనే, మీడియా కవరేజ్ చేస్తున్న సమావేశంలో ఒకరిపై మరొకరు బాగానే కత్తులు దూసుకొన్నారు.   మరి కాంగ్రెస్ పార్టీ ఏమాశించి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొంటుందో గానీ, ప్రతీ సారి అసలు కంటే ఈ కొసర్లే ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ, ప్రతీ సమావేశంలో పార్టీలో నేతలందరూ కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి తప్ప మరెవరిని ఎవరూ కూడా ఖాతరు చేయరని తప్పక ఋజువు చేస్తుంటారు.ఈ సారి కూడా అదే మరో మారు ఋజువు చేసారు.