స్పెల్లింగ్ బీ విజేత అరవింద్ మహాకాళి

        భారత సంతతికి చెందిన చిన్నారి అరవింద్ మహాకాళి ఈ పదాన్ని పలికి ఏకంగా 86వ స్ర్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. అమెరికాలో ఏటా స్పెల్లింగ్ పోటీలు పలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువ శాతం అక్కడ స్థిరపడిన భారతీయుల చిన్నారులే ముందుంటున్నారు. వీటిల్లో ప్రధానంగా చిన్నారుల బ్రెయిన్ పవర్ ను పరీక్షిస్తారు. 13 ఏళ్ల అరవింద్ మహాకాళి న్యూయార్క్ నగరంలో ఉంటాడు. అరవింద్ 2011, 2012 స్పెల్లింగ్ చాంపియషన్ షిప్ లలోనూ 3వ స్థానంలో నిలిచాడు. అప్పుడు జర్మనీ పదాలను పలకడంలో తప్పులు చేసి చాంపియన్ షిప్ కోల్పోయాడు. ఈ సారి మాత్రం తప్పటడుగు వేయకుండా విజయాన్ని దక్కించుకున్నాడు. అరవింద్ విజయాన్ని భారతీయులు, ఎన్ఆర్ఐలు ఆస్వాదిస్తున్నారు.

సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ బదిలీ

        సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఆయన జూన్ ఏడోతేదీన తన సొంత క్యాడర్ మహారాష్ట్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ అధిపతిగా నియమితులయినట్లు తెలుస్్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాలు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ వెలుగులోకి వచ్చారు. ఆయన ధైర్యం, నిజాయితీ గల అధికారిగా పేరుపడ్డారు. ఈ రెండు కేసుల పరిశోధనలో ఆయనకు రాష్ట్రంలో ఏకంగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. పలు చోట్ల జేడీ ఫోటోతో ఫ్లెక్సీలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆయనను వివాదాస్పదుడిగా చేసే ప్రయత్నం జరిగింది. ఆయన కాల్ డేటా సేకరించడం, ఆయనకు ఇంకొకరితో సంబంధం అంటగట్టే ప్రయత్నాలు, ఆయన ఇతరులు చేస్తున్న వత్తిడి మేరకు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాల్ డేటా సేకరణ నేపథ్యంలో కేసుకూడా నమోదయింది. వీటన్నింటినీ ఆయన హుందాగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. మొత్తానికి జేడీ లక్ష్మీనారాయణ బదిలీతో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి.

స్పాట్ ఫిక్సింగ్ పై సచిన్, ధోని స్పందన

  క్రికెటర్లకు, బీసీసీఐ బోర్డుకు కోట్ల రూపాయలు వర్షం కురిపిస్తున్న ఐపియల్ మ్యాచులలో బయటపడిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు తెర వెనుకున్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలివుడ్ నటుడు విందూ ధారా సింగ్ వంటి పెద్ద తలకాయలను బయట పెట్టడంతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు. అల్లుడు ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్నపటికీ, బోర్డు అధ్యక్ష పదవిని వదిలి పెట్టేదిలేదని శ్రీనివాసన్ గట్టిగా చెపుతుండటంతో, అటువంటి వారి నేతృత్వంలోనడుస్తున్న క్రికెట్ మ్యాచులపై అభిమానులకు నమ్మకం సడలుతోంది.   ఇక ఈ విషయంలో స్పందించవలసిన హేమా హేమీలయిన క్రికెట్ ఆటగాళ్ళు సైతం అనవసరంగా కలుగజేసుకొని తమ అవకాశాలను పాడుచేసుకోవడం ఎందుకని అనుకోన్నారో ఏమో ఎవరూ ఈ విషయం పై నోరు విప్పలేదు.   అయితే లండన్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడటం మంచిదికాదని నేను భావిస్తున్నాను. దీనిపై సరయిన సమయంలో నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం కొందరు ఆటగాళ్ళు మానసికంగా మిగిలిన వారికంటే కొంచెం బలహీనంగా ఉండటేనని నేను భావిస్తున్నాను. ఇంత కంటే ప్రస్తుతం ఎక్కువ మాట్లాడలేను,” అని అన్నారు.   ఇక, ఇటీవలే ఐపియల్ మ్యాచుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ, లక్షలాది ప్రజలు అభిమానించే క్రికెట్ ఆటలో ఇటువంటివి జరగడం నిజంగా నాకు చాల బాధ కలిగిస్తోంది. ఇటువంటి ఆరోపణలతో క్రికెట్ ఆట మీడియా కెక్కిన ప్రతీసారి నాకు చాల బాధ కలుగుతుంది. మేము బాగా ప్రాక్టీస్ చేసి, ఆడి విజయం సాదించాలని మాత్రమే మాకూ శిక్షణలో నేర్పబడుతుంది. ఆటలో ఓడినా గెలిచినా క్రీడాస్పూర్తి నిలపడం చాల ముఖ్యమని మాకూ శిక్షణలో చెప్పబడింది. కానీ, ఇటువంటి వ్యవహారాల వల్ల ఆటకు చెడ్డ పేరు రావడమే కాకుండా, లక్షలాది అభిమానుల నమ్మకం కూడా వమ్ము చేసినట్లవుతుంది. ఇప్పటికేయినా సమూల ప్రక్షాళన చేసి ఆటకు పునర్ వైభవం తీసుకువస్తే అందరూ సంతోషిస్తారు.”   ధోనీ ఆటగాళ్ళ బలహీనతలే ఇటువంటి అవినీతి పనులకు అవకాశం ఇస్తాయని అభిప్రాయ పడితే, క్రికెట్ బోర్డులో చోటుచేసుకొన్న రాజకీయాలను, తద్వారా ఆటను సమూల ప్రక్షాళణం చేయడమే దీనికి పరిష్కారమని సచిన్ అభిప్రాయ పడ్డారు.

గులాబీ కార్లో సీటు దొరకని రాజయ్య

  టీ-కాంగ్రెస్ నేతలు కేశవ్ రావు, వివేక్, మందా జగన్నాధంలకు వారి పుత్రరత్నాలకు కూడా కేసీఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద పార్టీ టికెట్లు, పదవులు హామీలు ఈయడంతో వారు (ఉద్యమాన్నిబలపరిచేందుకు) తెరాసలోకి వెళ్ళడం ఖాయం అయిపోయింది. ఇక మరో టీ-కాంగ్రెస్ యంపీ రాజయ్యకు కూడా ఉద్యమం బలపరచాలని గట్టిగా కోరిక ఉన్నపటికీ టికెట్ దొరకకపోవడంతో గులాబి కారెక్కలేకపోయారు.   రాజయ్య వరంగల్ నుండి డిల్లీకి టికెట్ తీసుకొందామనుకొన్నారు. కానీ, దానిని కడియం శ్రీహరికి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకువచ్చినందున, మానకొండూరు నుండి హైదరాబాద్(అసెంబ్లీ)కి మాత్రమే టికెట్ ఇవ్వగలనని కేసీఆర్ చెప్పారు. దానితో చిన్నబుచ్చుకొన్న రాజయ్య డిల్లీ టికెట్ దొరికే వరకు అమ్మహస్తం పట్టుకొనే నడవాలని ఫిక్స్ అయ్యారు.   కానీ, కిరణ్, బొత్స ఇద్దరూ కూడా ‘బయటకు పోయే వాళ్ళు ఎంచక్కా పోవచ్చునని’ ఇప్పటికే స్పష్టం చేసారు కనుక, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన బొత్స హస్తం పట్టుకొన్నా, కిరణ్ హస్తం పట్టుకొన్నా ప్రయోజనం లేదు. ఇక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తనకి మద్దతు ఇచ్చేవారు లేరని రాజయ్య గ్రహించగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరికినకాడికి ఏదో ఒక టికెట్ తీసుకొని సంతోషపడటమే బెటర్. లేకుంటే మున్ముందు హైదరాబాద్ టికెట్ కూడా దొరకకపోయే ప్రమాదం ఉంది.   ఇక, వరంగల్ టికెట్ వెనుక కేసీఆర్, హరీష్ రావుల మద్య ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అదే నిజమయితే, రాజయ్య వారిరువురి మద్య నలిగిపోవడం కంటే, టులెట్ బోర్డు పెట్టుకొని అభ్యర్దుల కోసం ఎదురు చూస్తున్న బీజేపీలోకి జంపయిపోవడం ఇంకా మంచిది. కావాలంటే, ఆనక గెలిచిన తరువాత అప్పటి రాజకీయ పరిస్తితులను బట్టి ఏ పార్టీలోకి కావాలంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోవచ్చును. ఇంకా తనకి రాజయోగం గాని పడితే, కేంద్రంలో బెజీపీ అధికారంలోకి వచ్చి ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోవచ్చును. బీజేపీ కూడా తెలంగాణా ఉద్యమం చేస్తోంది గనుక అందులో జేరడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పదు. కాకపోతే ఆలశించిన ఆశాభంగం అనే సంగతిని ఆయన తెలుసుకోవడం చాల మంచిది.

బక్కన్నకి రాములమ్మ జలక్

  ఒకవైపు తెలంగాణా ఉద్యమ సైన్యాదిపతి బక్కన్నకేసీఆర్, పార్టీలోకి రావడానికి చాలాకాలంగా మొరాయిస్తున్న ఇద్దరు టీ-కాంగ్రెస్ యంపీలను అతికష్టం మీద పార్టీలోకి లాక్కొని వచ్చేందుకు తిప్పలు పడుతుంటే, మరో వైపు ఆయనను నిత్యం అంటిబెట్టుకొని తిరిగే చెల్లెమ్మ రాములమ్మ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసివచ్చి ఆయనకు జలక్ ఇచ్చింది.   తన మెదక్ సీటుపై కేసీఆర్ ఇంతవరకు స్పష్టమయిన హామీ ఏమీ ఈయకపోగా, దానిని పార్టీలోకి కొత్తగా జేరిన ఐఏయస్ ఆఫీసర్ రమణాచారికి అప్పగించేందుకు బ్రదర్ బక్కన్న డిసైడ్ అయినట్లు కనిపెట్టింది చెల్లెమ్మ. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనుకొని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తన సరికొత్త అన్నగారిని చూసుకొన్న రాములమ్మ, కాంగ్రెస్ కండువా ఇస్తే కప్పుకోవడానికి తాను సిద్దం అని స్పష్టమయిన సంకేతం ఇచ్చి వచ్చింది.   అయితే శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావు గనుక అమ్మహస్తం పట్టుకొని తిరుగుతున్నకిరణన్నగారు తనకి అభయ హస్తం ఇచ్చేవరకు ఎటువంటి (ఇందిరమ్మ) కలలు కనడం మంచిది కాదని ఆమెకు తెలుసు గనుక, ముఖ్యమంత్రితో తన భేటీని అపార్ధం చేసుకొని రాజకీయం చేయవద్దని, తానూ కేవలం తన మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మెదక్- అక్కన్నపేట రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరడానికే మాత్రమె ఆయనను కలిసానని ఆమె సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నానని చెప్పినా నమ్మని జనం ఆమె మాటలని నమ్మడం లేదిప్పుడు.   ఆమె గతంలోనే ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసివచ్చినపటికీ కాలం కలిసి రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత కిషన్ రెడ్డికి రాఖీ కట్టి బీజేపీలో చేరుదామని చెల్లెమ్మ కొంచెం ఊగిసలాడినా మళ్ళీ బక్కన్నకన్విన్స్ చేసేయడంతో ఇంతవరకు తెరాసనే అంటిపెట్టుకొని ఉంది. కానీ, తన బక్కన్నమళ్ళీ తనకి హ్యాండిస్తునట్లు అనుమానం రాగానే, ఎందుకయినా మంచిదని కిరణన్నని కలిసి తన కర్తవ్యం తానూ నిర్వర్తించి వచ్చింది.   మరి తన బక్కన్న, కిరణన్నలలో ఎవరు ఆమెచేత రాఖీ కట్టించుకొని ఆమెకు మెదక్ లోక్ సభ టికెట్ గిఫ్టుగా ఇస్తారో చూడాలి మరి.

కిరణ్ కుమార్ రెడ్డి నోట అధిష్టానం మాట

  ఇంతకాలం టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ఎన్నడూ కలుగజేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు వారు పార్టీ వీడి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే తనదయిన శైలిలో ప్రతిస్పందించడం విశేషం.   “ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు పార్టీలు మారే స్వేచ్చ ఎప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్చ మరికొంచెం ఎక్కువగా ఉన్నందునే వారు నేడు వేరే పార్టీలోకి స్వేచ్చగా వెళ్ళగలుగుతున్నారు. గత 40-50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణా అంశాన్ని, కొందరు రాత్రికి రాత్రే తేల్చమని చెప్పినంత మాత్రాన్న తేలిపోదు. దానిని వారంలో తేల్చేయమంటూ అధిష్టానానికి డెడ్ లైన్లు పెడితే దానికి పార్టీ తలొగ్గదు. పార్టీలో ఉన్నవారెవరయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే,” అని అన్నారు.   ఆయన కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఉన్న మాటలనే పలుకుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపై తెలంగాణా అంశంపై పార్టీ నిర్ణయానికి లోబడి ఉండలేని వారు, పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడేవారు అందరూ కూడా వివేక్, మందా, కేశవ్ రావులు వెళ్ళినట్లే బయటకి వెళ్లవచ్చునని ఆయన చెప్పకనే చెపుతున్నారు. ఇది పార్టీలో మిగిలిన తెలంగాణా నేతలకి హెచ్చరిక వంటిదే. రేపటి నుండి బొత్స సత్యనారాయణ వంటివారు కూడా ఇటువంటి హెచ్చరికలే చేసినా ఆశ్చర్యపోనసరం లేదు.

కాంగ్రెస్ తో దోస్తీ కటీఫ్...ఇక కేసీఆర్ తో

  టీ-కాంగ్రెస్‌ యంపీలు వివేక్, మందా జగన్నాథం, కె. కేశవరావు ముగ్గురూ కేసీఆర్ తో సుదీర్గ మంతనాలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాము విదించిన గడువులోగా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యం లేదని భావించినందునే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో తెరాసలో అధికారికంగా జేరుతామని వారు ప్రకటించారు.   ఎంపీ వివేక్ ఇంట్లో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో వివేక్‌, కే.కేశవరావు ఆయన కుమారుడు విప్లవ్, మంధా జగన్నాధం, ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. వారి కుమారులకి కూడా టికెట్స్ విషయంలో కేసీఆర్ స్పష్టమయిన హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజయ్యకు పార్టీ టికెట్ హామీ ఇవ్వనందున ఆయన తెరాసలో చేరేందుకు వెనుకడుగు వేయడంతో, కేసీఆర్ ఆయనతో కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఆయనకు కూడా తగిన హామీ ఇచ్చి జూన్ 2న జరిగే సభలో పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ యంపీల రాకతో ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ అన్నారు. వారి చేరికని పార్టీలు మారడంగా చూడకుండా ఉద్యమంలో చేరుతున్నట్లే చూడాలని కేసీఆర్ కోరారు.   ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం తెచ్చినప్పటికీ, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండని వారిపట్ల పార్టీ ఎటువంటి వైఖరి అవలంబిస్తుందో స్పష్టం చేసింది. తెలంగాణా పేరిట తమను ఎవరూ కూడా బ్లాక్ మెయిల్ చేయలేరని, పార్టీకి లోబడి ఉండలేని వారు నిరభ్యంతరంగా బయటకి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేసినట్లయింది. తద్వారా ఇక ముందు మిగిలిన నేతలెవరూ కూడా తెలంగాణా అంశంపై పార్టీని ఇబ్బంది పెట్టే సాహసం చేయరు.   కేవలం ఇద్దరు యంపీలను వదులు కోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ మిగిలిన అందరిపై గట్టి పట్టు సాదించినట్లు అర్ధం అవుతోంది. ఇది చదరంగంలో రాజును రక్షించుకొనేందుకు కొన్ని బంట్లను, సైన్యాన్ని వదులుకొన్నట్లుగానే భావించవచ్చును. అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి దీని వల్ల మేలే జరిగే అవకాశం ఉంది గనుకనే వారి గడువును పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది.   ఇక, తెదేపా నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ జనార్ధన్ రెడ్డి కూడా తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెరాస నేత జితేందర్ రెడ్డి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కోర్టులో నీ చిట్టా విప్పుతా: దగ్గుబాటి

        టి. సుబ్బిరామిరెడ్డి కోర్టుకు వెళితే తనకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. టీఎస్ఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడిన అంశాలపై స్పందించిన దగ్గుబాటి...మాట్లాడుతూ టీఎస్ఆర్‌పై మీడియాలో చాలా తక్కువగా మాట్లాడానని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని, కోర్టులో అన్ని అంశాలు బయట పెడతానని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. నిన్నటితోనే అన్ని విషయాలు వదిలివేస్తారని అనుకున్నామని, ఈరోజు మళ్లీ మీడియాతో టీఎస్ఆర్ మాట్లాడారని దగ్గుబాటి అన్నారు. ఆయన సివిల్, క్రిమినల్ కేసులు పెడితే భయపడేది లేదని, గతంలో సుబ్బిరామిరెడ్డి ఎలాంటి అవకతవకలకు పాల్పడింది అన్ని విషయాలు కోర్టులో బయటపెడతానని దగ్గుబాటి అన్నారు. నిన్నటితోనే అన్ని వదిలివేద్దామని అనుకున్నామని, ఈరోజు మళ్ళీ బలవంతంగా మాట్లాడే పరిస్థితి టీఎస్ఆరే కల్పించారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో కష్టాల్లో ప్రజలు!

        ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు... ఎటు చూసినా సమస్యలే... వీటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక మధ్య తరగతి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభం కాబోతోంది, అయినా పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. దీనికి స్వయాన విద్యాశాఖ మంత్రే ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అందుబాటులో లేని స్కూలు ఫీజులు... పెత్తందారీ తనంతో కార్పోరేట్ పాఠశాలల దౌర్జన్యం నానాటికి పెరిగిపోతోంది. ఆటో ఛార్జీల ధరలు చెప్పనవసరం లేదు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిపోయాయి. వైద్యం గురించి, కార్పోరేట్ హాస్పిటళ్ళ ధన దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ ఆసుపత్రుల విషయం మరీ దారుణం. మనిషి అనే వాడు మనలేని పరిస్థితి.  విద్యుత్తు కోతలు ఎప్పటికి అదుపులోకి వస్తాయో తెలీదు. విద్యుత్తు ఛార్జీల మోత నుండి ఎప్పటికి ఉపశమనం ఉంటుందో అసలే తెలీదు. గ్యాస్ సిలిండర్ ధర పెరగటమే కాదు, సం.రానికి 9 సిలిండర్లు అంటూ మళ్లి అదో శరాగాతం.           ఇవన్ని ఇలా ఉంటె రెక్కలొచ్చిన బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు, పేద, మధ్యతరగతి ప్రజలను మరింతగా వణికిస్తున్నాయి.  ఇన్ని సమస్యలతో సామాన్య మానవుడు అత్యంత దయనీయమైన స్థితిని గడుపుతున్నాడు. ముఖ్యంగా కూరగాయల ధరలు చూస్తే ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా పెరిగిపోయాయి.          టమాటోలు కిలో 60/- రూపాయలు, బీన్స్ 100/- రూపాయలు, పచ్చిమిర్చి, బెండ, చిక్కుడు.... అన్ని కిలో 50/- రూపాయలు. అన్నిటికి మించి అల్లం 180/- రూపాయలకు చేరిపోయాయి. రైతు బజార్లలోను, బహిరంగ మార్కెట్లలోను ఒకే విధంగా రేట్లు ఉన్నాయి. దళారులు, అక్రమార్కులు రైతు బజార్లను, కూరగాయల మార్కెట్లను శాసిస్తున్నారు. అనూహ్యంగా రేట్లు పెంచేసి దండుకుంటున్నారు.          అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్ళుమూసుకొని చోద్యం చూస్తోంది. వేసవిలో ధరలు పెరగటం సహజం. ఈ ధరలు పెరిగే సమయంలో ప్రభుత్వం రంగంలోకి దిగి మార్కెట్లో జోక్యం పథకం కింద ఆయా కూరగాయలను దిగుమతి చేసుకొని తక్కువ ధరలకు విక్రయించాలనే కనీసపు అవగాహన కుడా లేని పాలకులు మనల్ని పరిపాలించేది.            విద్య, వైద్యం, విద్యుత్తు, రైతు బజార్లు, మద్యం... ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నేతలు, కార్పోరేట్ వ్యక్తులు కలిసి మెలిసి మంచి అవగాహనతో ఒకరిని ఒకరు శాసించుకుంటూ పోతున్న ఫలితం సామాన్య ప్రజానీకం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడిపోవడం.            ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ... వైకాపా ని, కాంగ్రెస్ ని పనికిమాలిన విషయాల మీద, లేదా అందరికి తెలిసిన అవినీతి మీద తూర్పారాపడతారు. ఇంకా తన స్థాయిని దిగజార్చుకొని ఎవరో జైళ్లలో నీలి చిత్రాలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ రోజున సామాన్య ప్రజానీకానికి కావాల్సింది ఈ పనికి మాలిన వ్యాఖ్యానాలా? లేక ప్రజాసమస్యలపై ప్రజల తరుపున  పోరాడి, వారి సమస్యలను ఒక కొలిక్కి తెచ్చి, తేగలిగిన సత్తా ఉన్న నేతా? ఎందుకంటే ప్రతి పక్ష నేత కర్తవ్యం అదే కదా!              మరో పార్టీ వైకాపా కి కావాల్సింది తమ జగన్ కు ఎప్పుడు బెయిల్ వస్తుందని. తల్లి, చెల్లి, ఆవిడ అని ముగ్గురు వివిధ చానెళ్ళకెక్కి తమ గోడు వెళ్ళబోసుకుంటారు.... లేదా రోడెక్కి యాత్రలు చేస్తూ చంద్ర బాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.... లేదా రోడ్డు మీద పడి రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. అంతే కానీ సామాన్యుడు నేడు అనుభవిస్తున్న సమస్యలన్నిటికీ కారణం ఏమిటి?అనే విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాన్యుడికి సమస్యలనుండి ఊరటనివ్వాలనే ధ్యాస, బాధ్యత ఎంతమాత్రం లేదు.                ఇక మన ముఖ్య మంత్రి విషయానికొస్తే.... మన బియ్యం, అమ్మహస్తం, అభయహస్తం, అమృతహస్తం, సబ్ ప్లాన్ బిల్లు అంటూ పనికిమాలిన పథకాల మీద దృష్టి పెట్టారే కాని, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు, విద్యారంగం, వైద్యరంగం ఎలా దారి తప్పి పోతున్నాయో పట్టించుకొనే తీరిక లేదు. ఎంతసేపు ఆయన కుర్చీని గురించిన ఆలోచన.... లేదంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టటం మినహా ఎవరి బాధలు ఆయనకు అవసరం లేదు.               ఇవీ నేడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మంచినీటి సమస్య, రహదారుల సమస్య, అంటూ వ్యాధుల సమస్య, ట్రాఫిక్ సమస్య, అధిక జనాభా.... ఇవన్నీ ఎప్పుడూ ఉండే సమస్యలే అని సదరు నేతలు తమని తాము చాలా హుందాగా సమర్ధించుకోవచ్చు. కాని ఈ సమస్యలు ఎప్పటికీ తీరని సమస్యలు గానే ఎందుకు ఉంటున్నాయి? ఈ సమస్యల తీవ్రత నానాటికి ఎందుకు పెరిగిపోతోంది? ఇది ఎవరి వైఫల్యం? తప్పు మీదంటే మీదని ఒకరినొకరు దుయ్యబట్టుకుంటారు. కాని ఇక్కడ తప్పు ప్రతి ఒక్కరిది. పాలనా సామర్థ్యం లేని పాలకులది. అధికార పార్టీలని నిలదీయలేని ప్రతిపక్షాలది. ఎవరికీ వారు రాబోయే ఎన్నికలలో మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి చేస్తాం అంటారే కాని, గతం లో వారు ఎక్కడ వైఫల్యం చెందారో ప్రజల ముందు ఒప్పుకునే ధైర్యం చెయ్యరు. ప్రతి ఒక్కరికి కావాల్సింది అధికార పీఠం. మరి సామాన్య ప్రజానీకం సంక్షేమం.... గాలిలో దీపమేనా?

టిడిపి కి జెసి బ్రదర్స్ షాక్

        మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ టీడీపీ ఇంఛార్జి జెసి బ్రదర్స్ అధినేత మర్రి జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై టిడిపిలో స్పష్టత లేదని భావించిన మర్రి జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపారు. జనార్ధన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన భవిష్యత్ కార్యాచరణను కటించనున్నారు. ఉప ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టిడిపి అభ్యర్థిగా మర్రి జనార్ధన్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన నాగం జనార్థన్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

కేసీఆర్ తో రాజయ్య కటీఫ్

        కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాజయ్య టీఆర్ఎస్ లో చేరడంపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ టిక్కెట్పై టీఆర్ఎస్ హామీ ఇవ్వకపోవటంతో వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆయనకు మానకొండూరు అసెంబ్లీ టిక్కెట్ను ఆఫర్ చేస్తోంది. కాగా మరోవైపు పౌరసరఫరాల శాఖమంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ను వీడొద్దంటూ రాజయ్యకు నచ్చచెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు స్థానంపై కెసిఆర్ హామీ ఇచ్చారు. మానకొండూరు సీటు కోసం పలువురు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యకు కెసిఆర్ నుండి హామీ రాలేదని సమాచారం. దీంతో టీఆర్ఎస్ లోకి వెళ్తే వచ్చేదేమీ లేదని భావించిన రాజయ్య కాంగ్రెసులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

దగ్గుబాటి..మీ భార్యను చూసి నేర్చుకో

        కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం లోక్ సభ టికెట్ వివాదం అప్పుడే ముదురుతోంది. ఎన్నికల ఏడాది ముందే ఎలాగయినా ఈ స్థానం పోటీ చేయాలన్న ఆశతో సుబ్బరామిరెడ్డి దీని కోసం చేయని ప్రయత్నం లేకుండా పోయింది. పనిలేని నటులతో బిరుదులు ఇప్పించుకునే సుబ్బరామిరెడ్డి అని దగ్గుబాటి అనడంతో సుబ్బరామిరెడ్డి ఆగ్రహించారు. అక్కినేని నాగేశ్వర రావు, మోహన్ బాబు, బ్రహ్మానందం పనిలేని నటులా అని ఆయన ప్రశ్నించారు. దగ్గుబాటి వ్యాఖ్యలు అర్ధరహితమని, పురంధేశ్వరిని చూసి సంయమనం పాటించడం నేర్చుకోవాలని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నర్సారావుపేట, లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని పురంధేశ్వరికి తానే సూచించానని, ఇప్పుడు విశాఖపట్నం స్థానం నుండి తాను అయితేనే గెలుస్తానని, పురంధేశ్వరి ఓడిపోతుందని అన్నారు. విశాఖపట్నానికి తూర్పు పడమర తెలియన దగ్గుబాటి వెంకటేశ్వరరావు విశాఖ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇక దగ్గుబాటి చేసిన అవినీతి ఆరోపణలను సుబ్బరామిరెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, దగ్గుబాటి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

మళ్ళీ మొదలవనున్న తెలంగాణా ఉద్యమాలు

  నిరంతరం ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేయాలన్నా ఎవరికయినా కష్టమే. అందుకే అపుడప్పుడు పండుగ శలవులు, పరీక్షల శలవులు, వేసవి శలవులు వంటివి అప్రకటితంగా అమలు చేస్తుంటారు మన ఉద్యమ నేతలు. ఇక, కేసీఆర్ కూడా ఉద్యమాలకి గుడ్ బై చెప్పేసి ఓట్లు-సీట్లు జపం అందుకోవడంతో ఆచార్యుల వారు ముఖ్యమంత్రి పుణ్యామాని బయ్యారం గనుల వ్యవహారం అందిపుచ్చుకొని కాలక్షేపం చేస్తున్నారు.   నిన్న టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన టీ-జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి హాజరయిన కేసీఆర్‌, జి. కిషన్‌రెడ్డి తదితరులు వచ్చే నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో మళ్ళీ ఉద్యమం రీ-స్టార్ట్ చేయాలని నిశ్చయించుకొన్నారు. అనంతరం ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తాము ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా హింసకు తావివ్వకుండా శాంతియుతంగా, చట్టబద్దంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.   షరా మామూలుగానే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముఖ్య మంత్రి అనుమతి నిరాకరించడం, దానిని తెరాస, టీ-జేయేసీ నేతలు తప్పు పడుతూ మీడియా ముందుకొచ్చి మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా మంత్రులు, శాసనసభ్యులు దద్దమ్మలని కేసీఆర్ తిట్ల దండకం అందుకోవడం, దానికి వెంటనే ముఖ్యమంత్రి అనుచరుడు జగ్గారెడ్డి దీటుగా జవాబు చెప్పడం వంటి కార్యక్రమాలు కూడా త్వరలో జరుగనున్నాయి. తెలంగాణా నుండి ఆంధ్రా పార్టీలను తరిమి కొట్టాలని ఒకవైపు కేసీఆర్ తన కార్యకర్తలకు ఉద్బోదిస్తుంటే, ప్రొఫ్. కోదండరాం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరడం విశేషం.

టీ-కాంగ్రెస్ ఏంపీల రాజీనామాలు నేడే

  టీ-కాంగ్రెస్ యంపీలు తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేసేందుకు అధిష్టానానికి విదించిన గడువు ఈ రోజుతో ముగుస్తున్నపటికీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతో అవమానకర పరిస్థితుల్లో వారు తెరాసలోకి వెళ్ళవలసి వస్తోంది. ఈ రోజు యంపీ వివేక్ ఇంటికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వచ్చి వారితో టికెట్స్ ఖరారు చేసిన తరువాత, వారు పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించవచ్చును.   కానీ, వారిలో రాజయ్యకు మాత్రం కేసీఆర్ టికెట్ ఖరారు చేయకపోవడంతో ఆయన మరికొంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేందుకు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. కే.కేశవ్ రావ్ మరియు టీ-కాంగ్రెస్ యంపీలు-వివేక్, మందా జగన్నాథం వచ్చే నెల 2న హైదరాబాద్ నిజం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అధికారికంగా తెరాసలో జేరుతారు.   టీ-కాంగ్రెస్ యంపీలు పార్టీ నుండి వెళ్లిపోతున్నా కూడా అధిష్టానం ఖాతరు చేయనట్లు నటిస్తున్నపటికీ, వారి వెనుక మరి కొందరు శాసన సభ్యులు కూడా వెళిపోతే, కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందని ఆందోళన చెందుతోంది.   ఇక, తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా మహానాడు సమావేశాలు నిర్వహించుకొని రెండు రోజులయినా కాక మునుపే మెహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. గత ఉపఎన్నికలలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన కూడా తెరసాలోకి వెళ్లవచ్చునని సమాచారం.

తెదేపాలో చేరనున్న కొణతాల

  తెలుగుదేశం పార్టీలోంచి తన రాజకీయ శత్రువు దాడి వీరభద్రరావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి, పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉన్న తనను కాదని దాడి వీరభద్రరావుకే ఎక్కువ ప్రాదాన్యం ఇవ్వడంతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.   ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని మంత్రి గంట శ్రీనివాసరావు ప్రకటించారు. కొణతాల రామకృష్ణ మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందున, ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరు కొంటారని అందరూ భావించారు. కానీ, అయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడి దూతలతో ఆయన జరిపిన సంప్రదింపులు ఫలవంతమయ్యాయని ఇక నేడోరేపో ఆయన తెదేపాలో చేరడం ఖాయం అని సమాచారం.   అదే జరిగితే, వైకాపా ఒక బలమయిన నాయకుడిని కోల్పోతే, తేదేపాకు ఒక నమ్మకస్తుడయిన, బలమయిన నాయకుడు దొరికినట్లవుతుంది. కేవలం శాసన మండలి టికెట్ ఈయనందుకు పార్టీతో ఉన్న 30ఏళ్ల అనుబంధం పుటుక్కున తెంపుకుపోయిన దాడి వీరభద్రరావుని తీసుకొని వైకాపా ఏమి బావుకొంటుందో తెలియదు. కానీ, కొణతాల రామకృష్ణ వంటి చురుకయిన నాయకుడు దొరకడం వల్ల తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తి ప్రయోజనం పొందుతుందని చెప్పవచ్చును.   ఇక కర్నూల్ నుండి భూమానాగి రెడ్డి దంపతులు కూడా తెలుగుదేశం పార్టీతో పూర్తి ‘టచ్చులో’ ఉన్నట్లు తాజా సమాచారం. తమ జిల్లాలో తమ వ్యతిరేఖ వర్గానికి వైకాపా అధిష్టానం ప్రోత్సాహం ఇస్తోందని వారు పార్టీపై ఆగ్రహంతో వారు పార్టీ మరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా సదరు నేతలే దృవీకరించవలసి ఉంది. ఏమయినప్పటికీ, త్వరలో వైకాపా నుండి తెదేపాలోకి కొన్ని వలసలు మాత్రం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.

సుబ్బిరామిరెడ్డి చరిత్ర చెప్పిన దగ్గుబాటి

  రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేయాలని పరితపిస్తున్నారు. అయితే సిట్టింగ్ యంపీ పురందేశ్వరి కూడ అక్కడి నుండే పోటీ చేయాలను కావడంతో సమస్య మొదలయింది. నాటి నుండి ఆమెకు పొగపెట్టే పనిలో పడ్డారు రెడ్డి గారు.   ఆమెకు ఆ సీటు పొందానికి తానూ ఏవిధంగా సహాయం చేసింది వివరిస్తూ, ఇప్పుడ తానూ పోటీ చేయాలను కొంటున్నందున ఆమె విశాఖ నుండి తప్పుకొని, నరసరావు పేట నుండి పోటీ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. సిటింగ్ యంపీకే టికెట్ ఇవ్వాలని రూలేమీ లేదని మరో లాజిక్ పాయింటు కూడా చెప్పారు. ఇటీవలే సోనియా గాంధీని కలిసి, విశాఖ లో తానూ చేస్తున్న సేవా కార్యక్రమాల లిస్టు వివరించి తనకే విశాఖ టికెట్ ఇవ్వాలని నచ్చజెప్పి వచ్చారు. దానితో ఆమె తనకు హామీ ఇచ్చినట్లే భావించిన ఆయన టికెట్ పై వంద శాతం ఉండే తన నమ్మకం కాస్తా 1000 శాతానికి పెరిగినట్లు ఆయనే చాటింపు వేసుకొన్నారు. పనిలో పనిగా మళ్ళీ మరోసారి పురందేశ్వరికి నరసరావు పేటకు వెళ్ళిపొమ్మని చెప్పారు.   అయితే, పురందేశ్వరి మాత్రం అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపుచ్చేసారు.   కానీ రాన్రాను పెరుగుతున్న రెడ్డి గారి ఒత్తిడి భరించడం మాత్రం కష్టంగానే ఉండటంతో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రంగంలో దిగక తప్పలేదు. ఆయన పీసీసీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ ‘సుబ్బిరామి రెడ్డి ‘80ల్లో నాగర్జున్ సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు చేస్తూ బ్లాకులో సిమెంట్ అమ్ముకొంటున్నపటి నుండి ఏవిధంగా పైకి వచ్చిందీ నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి వద్దకు మేమేనాడు సహాయం కోసం వెళ్లలేదు. పైగా ఆయనే నా భార్యకి టికెట్ ఇవ్వొదంటూ హైకమండుకి లేఖ వ్రాసినట్లు కూడా మాకు తెలుసు. అయినా మేము అవన్నీపట్టించుకోలేదు. ఎందుకంటే హైకమండుకి ఎవరు ఎటువంటి వారో ఎవరికీ టికెట్ ఈయాలో బాగా తెలుసు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఇతరులకి ఈ విధంగా ఉచిత సలహాలు ఇచ్చినపుడే సమస్య వస్తుంది, ”అని చురకలు వేసారు.   మరి శివ భక్తుడయిన రెడ్డిగారు ఇప్పుడు దగ్గుబాటి ఆరోపణలకు ఏవిధంగా శివ తాండవం చేస్తారొ చూడాలి.

మాట మార్చిన చంద్రబాబు

  కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అవసరమయితే వచ్చే నెల 10వ తేదీ నుండి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసమ్మతి తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటింఛి ఒక కొత్త చర్చకు తెర తీసారు. కానీ, నిన్న జరిగిన మహానాడులో ఇప్పుడు అంత అవసరం లేదనట్లు మాట్లాడారు. వైకాపా నేతలు తనకీ కిరణ్ కుమార్ రెడ్డికి మద్య రహస్య ఒప్పందం ఉందంటూ చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికే బహుశః ఆయన ఎత్తువేసి ఉండవచ్చును. కానీ, వైకాపా నేతలందరూ గత రెండు రోజులుగా జగన్ మోహన్ రెడ్డి జైల్లో నిర్బందించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన దీక్షలు ర్యాలీలతో బిజీగా ఉన్న సమయం చూసుకొని చంద్రబాబు మళ్ళీ ఈ ఉపసంహరణ ప్రకటన కూడా చల్లగా చేసారనుకోవచ్చును.

అన్నగారిని మరచిన వారసులు

  స్వర్గీయ యన్టీఆర్ పై సర్వ హక్కులు తమవేనని వాదించేవారు తెలుగుదేశం పార్టీలో చాల మందే ఉన్నారు. ఇక పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టే హక్కు తమదంటే తమదే అని ఆయన కుమార్తె పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు ఏకంగా ఒక దశాబ్ద కాలం పాటు తీవ్ర యుద్దం చేసారు. ఎట్టకేలకు ఎలాగయితేనేమి యన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించడం జరిగింది. అంతటితో ఆ కదా సమాప్తం అయిపోయినట్లు అందరూ చేతులు దులుపుకొని హైదరాబాద్ వచ్చేసారు. నిన్న యన్టీఆర్ 90వ జయంతి సందర్భంగా హైదరాబాదులో యన్టీఆర్ ఘాట్ వద్ద మూకుమ్మడిగా వచ్చిఘనంగా నివాళులు అర్పించిన నందమూరి వారు, తెలుగుదేశం పార్టీ నేతలు తాము పోటీలు పడి మరీ డిల్లీలో నెలకొల్పిన యన్టీఆర్ విగ్రహానికి ఈ సందర్భంగా ఒక దండ వేయించాలనే సంగతి మరిచిపోయారు.   ఇక అయినవారికే శ్రద్ధ లేనప్పుడు డిల్లీలో ఉండే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? ఎవరూ పట్టించుకోకపోయినా పార్లమెంటు నియమావళి ప్రకారం లోక్ సభ స్పీకర్ అధికారికంగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి అక్కడ నెలకొల్పిన మహానీయుల విగ్రహాలకు తప్పనిసరిగా పూలమాలలు వేసి ఒకసారి వారిని స్మరించుకోవడం ఆనవాయితీ. కానీ, అది కూడా నిర్వహించలేదు. కనీసం యన్టీఆర్ అసలయిన వారసులు తామేనని వాదులాడుకొనే తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబంలో ఏఒక్కరూ కూడా నిన్న ఆయన విగ్రహానికి ఒక దండ వేయించే ఏర్పాటు చేయలేకపోయారు.

జగన్ తీహార్ జైలుకు!

        ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైఎస్ జగన్ ను తీహార్ జైలుకు తరలించేందుకు రంగం సిద్దం అయిందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగుతులుండవని” టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణపై టీడీపీ స్పష్టంగా ఉందని, 2008లో రాసిన లేఖకు కట్టుబడి ఉందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని టిడిపి లేఖ రాసిందని నామా అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ, సీమాంధ్రలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.   కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, అది కలెక్షన్ పార్టీ అని మాటలు చెప్పి మూటలు తీసుకుంటారని, సోనియాను కలిసిన కేశవరావు మళ్లీ కేసీఆర్ ను కలిశారని, కేసీఆర్ పార్టమెంటుకు రారని, తెలంగాణ ప్రజల సమస్యలపై నోరు విప్పరని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ అసమర్ధుడని, అవినీతి, అసమర్ధ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేసిందని, టీడీపీ చొరవవల్లనే కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని, దేశానికి, రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని అన్నారు.