తెలంగాణ సీఎం: హరీష్ వర్సెస్ కేటీఆర్

      తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సీఎం అంశం ముదురు పాకానపడింది. తెలంగాణకి మా అన్న సీఎం అంటే మా అన్న సీఎం అని హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. తాజాగా కొంతమంది పార్టీ నాయకులు తెలంగాణకి హరీషే సీఎం అని బాహాటంగా ప్రకటించడంతో ఈ రెండు వర్గాల మధ్య లొల్లి ముదిరింది. తెలంగాణ సీఎం పదవి మీద మొదటి నుంచి హరీష్ రావు, కేటీఆర్‌లకు కన్నుంది. ఒకరి లక్ష్యానికి మరొకరు అడ్డుగా వున్నారు కాబట్టి ఈ బావాబామ్మర్దులిద్దరికీ మొదటి నుంచీ ఒకరంటే మరొకరికి పడదు. ఒకరి ప్రస్తావన మరొకరు తేరు. ఒకరిమీద వచ్చిన అవినీతి ఆరోపణలను మరొకరు ఖండించరు. ఇద్దరూ ఒకే సందర్భంలో చాలా అరుదుగా కనిపిస్తారు. రాష్ట్రాన్ని చీల్చాలని ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ ఈరకంగా ఏనాడో చీలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కేసీఆర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దర్లో ఎవర్ని జాగో అనాలో ఎవర్ని భాగో అనాలో అర్థంకాక, ఫామ్‌హౌస్‌లో తపస్సు చేసినా పరిష్కారం లభించక ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోతున్నారు. కేసీఆర్‌లోని తండ్రి మనసు కొడుకు వైపే మొగ్గుచూపుతున్నా, దాన్ని బయటపెట్టలేక బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి హరీష్‌రావేనని ఆయన వర్గీయులు బాహాటంగా ప్రకటిస్తూ వుండటం టీఆర్ఎస్‌లో వున్న ఆల్రెడీ వున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

శంకర్ రామన్ కేసు: కంచి స్వాములకు ఊరట

      కంచి కామకోఠి పీఠాధిపతులకు తొమ్మిదేళ్లుగా వేధిస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వాములను నిర్దోషులుగా తేల్చుతూ బుధవారం ఉదయం పాండిచ్చేరి కోర్టు తీర్పును వెలువడించింది. జయేంధ్ర సరస్వతి, విజయేంధ్ర సరస్వతి సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చనింది. ఈ కేసులో నిందితుల ప్రమేయంపై ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.2004 సెప్టెంబరు నెలలో శంకరరామన్ హత్య జరిగింది. శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్‌పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు.

తెలంగాణా ఏర్పాటుకి కేసీఆర్ బీజేపీని ఒప్పించగలరా

  డిశంబర్ 5నుండి 20వరకు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుండటంతో, కాంగ్రెస్ అధిష్టానం తనను పక్కనబెట్టినప్పటికీ కేసీఆర్ కూడా తనవంతు ప్రయత్నాలు చేసేందుకు వచ్చే నెల3న డిల్లీకి బయలుదేరబోతున్నారు.   ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, ఏపీ ఎన్జీవోలు డిల్లీలో జాతీయ పార్టీలను కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఓటువేసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని అభ్యర్దించిన నేపధ్యంలో, కేసీఆర్ కూడా వారినందరినీ కలిసి తెలంగాణా ఏర్పాటుకి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్క బీజేపీ తప్ప దాదాపు ఇతర పార్టీలన్నీకూడా ఈవిషయంలో స్పష్టమయిన వైఖరితోనే ఉన్నాయి. గనుక, కేసీఆర్ బీజేపీ అగ్ర నేతలతో జరిపే సమావేశమే కీలకమని చెప్పవచ్చును.   2014 ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ, కేసీఆర్ అభ్యర్ధనను మన్నించడం కష్టమే. ఎందుకంటే, ఆయన అభ్యర్ధనను మన్నించి ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీతో సహకరించి తెలంగాణా ఏర్పాటుకి దోహదపడితే, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా, పొత్తులు పెట్టుకొన్నా బీజేపీకి నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండబోదు. అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపచేయలేక చేతులెత్తేసేట్లు చేయగలిగితే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలుంటాయి,   ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే అప్పుడు తెరాసకు బీజేపీయే దిక్కవుతుంది. అందువల్ల బీజేపీ కేసీఆర్ కి నచ్చజెప్పి పంపేసే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ ఆ రెండు పార్టీ నేతలు ఈ సమావేశంలోనే ఎన్నికల తరువాత మద్దతు గురించి ఒక అవగాహనకి వచ్చినట్లయితే, కేసీఆర్ సమావేశం తరువాత బయటకు వచ్చి మీడియాతో “మా అభ్యర్ధనకు బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు” అంటూ ఒక్క రొటీన్ డైలాగ్ పలకవచ్చును.

కిరణ్ అధిష్టానం మాట జవదాటడు: దిగ్విజయ్ సింగ్

  “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విదేయుడు. ఆయన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఆయన రాష్ట్ర విభజనకు ఇదివరకే అంగీకరించారు,” అంటూ కొద్ది రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ అన్నమాటలను కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఖండించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేమో కానీ తన సమైక్యవాదంలో ఎటువంటి మార్పు లేదని, ఉండబోదని నిర్ద్వందంగా ప్రకటించారు. నేటికీ ఆయన అదే పంధాను కొనసాగిస్తున్నారు కూడా.   అయితే ఈ రోజు అంటోనీ నివాసంలో జరిగిన కేంద్రమంత్రుల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ మళ్ళీ కిరణ్ గురించి అదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఈ సమావేశంలో మిగిలిన ఇతర అంశాలతో బాటు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే దిగ్విజయ్ ఈ విధంగా మాట్లాడటం చూస్తే ముఖ్యమంత్రి నిబద్దతపై ప్రజలలో అనుమానాలు రేకేత్తించేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పిన ప్రకారమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏమయినప్పటికీ మరికొద్ది రోజులలో అందరి అసలు రూపాలు బట్టబయలవడం ఖాయం.

యు.టి. ఎందుకు వద్దంటే..!

      హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్ యు.టి. ప్రతిపాదనకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని విభజనవాదులు విరుచుకుపడుతున్నారు. యు.టి. పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ విభజనవాదులు యు.టి.ని ఎందుకు వద్దంటున్నారంటే... 1. హైదరాబాద్ మాదే అని పోజులు కొట్టడానికి వీలుండదు. 2. హైదరాబాద్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుంటుంది కాబట్టి లోకల్ రాజకీయ నాయకుల ఆటలు చెల్లవు. 3. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా దక్కుతుంది. 4. స్థానికంగా వుండే రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. హైదరాబాద్‌ని      ఉద్ధరించేస్తామని చెబుతున్నవాళ్ళకి ఆ ఛాన్స్ వుండదు. 5. సీమాంధ్రులను హింసించడానికి వీలుండదు. భయభ్రాంతులను చేయడానికి అవకాశం వుండదు. వాళ్ళని హైదరాబాద్ నుంచి తరిమేస్తాం అనడానికి కూడా ఛాన్స్ వుండదు.   6. పదేళ్ళ తర్వాత యు.టి. శాశ్వతంగా కంటిన్యూ అయ్యే అవకాశం వుంది. 7. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తులపై దాడులు చేయడానికి వీలుండదు. 8. సీమాంధ్రులను హింసించడానికి కొత్తకొత్త చట్టాలు క్రియేట్ చేయడానికి అవకాశం లేదు.    9. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో  సీమాంధ్రులను అనాథలు చేసే అవకాశం వుండదు. ఈ విషయంలో సీమాంధ్రులు, తెలంగాణవాళ్ళు అనే తేడా వుండదు. అందరూ సమానమే. 10.  యు.టి. అయితే కబ్జాలు కుదరవు. కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలి. 11.  యు.టి.కి ఒప్పుకుంటే తెలంగాణ విభజనకు అడ్డంకులు వుండవు. తెలంగాణ సమస్య పరిష్కారమైపోతుంది. విభజనులకు, ఉద్యమాలు చేసేవాళ్ళకు పని వుండదు. .... ఇవి కాక ఇలాంటి నష్టాలు ఇంకా బోలెడన్ని వున్నాయి. అందుకే యు.టి. వద్దంటారు!

కిరణ్ పై హరీష్ పిల్

      నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లా తాగునీటి పథకానికి రూ.4,300 కోట్లు కేటాయించడాన్ని తప్పుపడుతూ టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్తూరు తాగునీటి పథకానికి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ గత అక్టోబర్ 10న జారీచేసిన 14,15 జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆయన తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు. కేవలం ఎన్నికలలో లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు నిధులు తరలించుకెళ్లారని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయవద్దని తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినప్పటికి జీవోలు జారీ చేసి పనులు కూడా మొదలు పెట్టారని తెలిపారు. ఈ జీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని, పనులు జరగకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, గ్రామీణ నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఇక నెల్లూరు నీటిని అక్రమంగా తరలించడం మీద ఇప్పటికే అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు గనక కోర్టు పనులు నిలపాలని ఆదేశాలు ఇస్తే ముఖ్యమంత్రికి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి.

జెట్ స్పీడుతో పయనించనున్న టీ-బిల్లు

  రాష్ట్ర విభజనపై కేంద్రం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లుగా నటిస్తూనే, మరో పక్క తెలంగాణా బిల్లుని జెట్ స్పీడుతో పార్లమెంటుకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణా బిల్లుపై చర్చజరిపేందుకు వచ్చేనెల రెండు మూడు తేదీలలో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చునని తెలుస్తోంది.   స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న శాసనసభ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యి సభ నిర్వహణ గురించి చర్చించారు. మళ్ళీ ఈరోజు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశామయ్యి భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.   ఈ ప్రత్యేక సమావేశాలలో కేవలం రాష్ట్ర విభజన, తెలంగాణా బిల్లుపై తప్ప వేరే ఏ ఇతర అంశాలపై చర్చకు అనుమతించరు. ఒకవేళ అవసరమను కొంటే, స్పీకర్ ఈ సమావేశాలను మరొక్క రోజు మాత్రమే పొడిగించవచ్చును. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించమని రాష్ట్రపతే నేరుగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయబోతున్నందున ఇక శాసనసభని ప్రోరోగ్ చేయమంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయనకి అందిన లేఖను పట్టించుకొనవసరం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.   ఈ ప్రకారం చూస్తే ఈరోజు జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశమే తుది సమావేశమని భావించవచ్చును. వారు రేపు జరిగే కేంద్రమంత్రి వర్గం సమావేశానికి తమ తుది నివేదిక సమర్పించడం, అక్కడి నుండి తెలంగాణా బిల్లు జెట్ స్పీడుతో పయనిస్తూ అందరి ముద్రలు వేయించుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాలలోగానే డిల్లీ చేరుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.   ఇదే నిజమయితే, రాజ్యాంగ స్పూర్తికి, విధివిధానాలకు పూర్తి విరుద్దంగా తెలంగాణా బిల్లును ఆఘమేఘాలపై కదిలించడం దేనికంటే బహుశః వచ్చేనెల 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకేనని భావించాల్సి ఉంటుంది.   ఇది చాలా ఆహేతుకంగా ఉన్నపటికీ సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడిన మాటలు వింటే నిజమని నమ్మక తప్పదు. ”అమ్మ తలుచుకొంటే ఏదయినా సాధ్యమే! ఈ అంటోనీ కమిటీలు, కేంద్రమంత్రుల బృందాలు అంతా ఒట్టోట్టివే! ఎవరెన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకొన్నా అమ్మ నిర్ణయమే తుది నిర్ణయం. ఆమె మాటే వేదవాక్కుఅందరికీ,” అని అన్నారు.   సోనియాగాంధీ తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నారు గనుక, ఆ ప్రకారమే కాంగ్రెస్ లో అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. అవసరమయితే పరుగులు తీస్తాయి కూడా.

జగన్ పార్టీలోకి ధర్మాన

  జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో పదవి కోల్పోవటంతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ధర్మాన ప్రసాద్‌ రావు త్వరలో పార్టీ మారున్నారు. ఇప్పటికే ప్రసాద్‌రావు తమ్ముడు కృష్ణదాస్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతుండగా ఇప్పుడు ధర్మాన ప్రసాద్‌ రావు కూడా అదే పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు.  రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని మాజీమం త్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గతంలోనే చెప్పారు. అయితే ఇటీవల పలు ప్రెస్‌మీట్‌లలో జగన్‌కు వ్యతిరేఖంగా స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటంతో పాటు రాజశేఖర్‌ రెడ్డిని కూడా విమర్శించిన ధర్మానకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పిస్తారన్న చర్చ మొదలైంది.  

హైదరాబాద్ పై శీలంగారి బేరాలు

  రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది ఎవరి దారి వారిదే. కొందరు విభజన జరగదని భరోసా ఇస్తుంటే, మరి కొందరు విభజన తధ్యమని బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు. ప్యాకేజీలు పుచ్చుకోవడమే తక్షణ కర్తవ్యమని కొందరు, “శాసనసభలో ఎవరి వాదనలు వారు వినిపించడంలో తప్పు లేదు. కానీ అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని” బొత్స వంటి వారు లౌక్యం ప్రదర్శిస్తుంటారు.   ఇక జేసీ సోదరులయితే ఇంకా హైదరాబాద్ పట్టుకొని వ్రేలాడటం దండుగ! వెంటనే ఎక్కడో అక్కడ కొత్త రాజధాని పెట్టుకొని అక్కడి నుండి బయటపడటం మేలని ఉచిత సలహా ఇస్తుంటే, కేంద్రమంత్రి పదవి అందుకొన్న తరువాత “అధిష్టానం ఎంత చెపితే అంతే!” అని పలికిన జేడీ శీలం ఇప్పుడు “హైదరాబాద్ ని ఒక ఆరేడు సం.లకి యూటీ చేయడానికి తెలంగాణా నేతలు అంగీకరిస్తే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో మాట్లాడి ఒప్పించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసే బాధ్యత నాదని” తాజాగా ఓ ప్రతిపాదన చేసారు.   “60 ఏళ్ళుగా మనం కలిసున్నాము. మరో ఆరేడేళ్ళు కలిసి ఉండటానికి కష్టం ఏమిటి? హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని మేము ఒప్పుకొంటున్నాము. పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పాటుకి మేమందరం పూర్తిగా సహకరిస్తాము. విద్య, విద్యుత్, ఉపాధి, నీటి సమస్యలను కూడా ఇద్దరికీ నష్టం కలిగించని విధంగా అన్నిటినీ పరిష్కరించుకొందాము. మీరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని మా సీమాంధ్ర నేతలందరి తరపునా నేను హామీ ఇస్తున్నాను"   "తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలనే మీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవసరం. లేకుంటే చివరి దాక కూడా ఈ ఘర్షణ వాతావరణం తప్పకపోవచ్చు,” అని శీలం తెలంగాణా నేతలకి నయాన్న, భయాన్న నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.   జేడీ శీలం హైదరాబాద్ ని యూటీ చేస్తే రాష్ట్ర విభజనకు సహకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి తరపున హామీ ఇస్తున్నారు. బాగానే ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, “ఈ సమైక్య రాష్ట్రానికి తను ఆఖరి ముఖ్యమంత్రిని కానని, తన తరువాత ఇంకా చాలా మంది వస్తారని” నిన్ననే మరోమారు రచ్చబండ సాక్షిగా ప్రకటించారు. మరి ఆయన ఆలపిస్తున్నఈ పాటలన్నీరోటికాడ పాటలేనని శీలంగారి అభిప్రాయమా?   “కిరణ్ చాలా మంచోడు. అమ్మ మాట జవ దాటాడు. రాష్ట్ర విభజనకు తలూపేడు కూడా!” అని దిగ్విజయ్ సింగ్ అంతటి వాడు మీడియా ముందు ప్రకటిస్తే, “అది ఒట్టి అబద్దం. అది కేవలం ఆయన అపోహ మాత్రమే!” అని టకీమని జవాబిచ్చిఆయన నోరు మూయించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకొని,శీలం చేస్తున్నఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని హామీ ఏమయినా ఇచ్చేరా? ఇక రాష్ట్ర విభజన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని శీలం భావిస్తున్నారా? ఏమో!

ఈ నాన్చుడేందిరో!

    సమైక్య సింహంగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలూ పడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాను నూటికి నూరుశాతం కాంగ్రెస్ వాదినే అని చెబుతున్న కిరణ్ చాపకింద నీరులా తన కొత్త పార్టీ ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ ప్రకటించే నాటికి సీమాంధ్రులను పూర్తిగా తనవైపు తిప్పుకునే కిరణ్ ప్రయత్నిస్తున్నారు.   అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో తానెంత గొప్పపాలకుడో తానే చెప్పుకోవడంతోపాటు సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ‘‘సమయం వచ్చినప్పుడు నాకు మీ మద్దతు కావాలి’’ అని ప్రజల్ని బతిమాలుకుంటున్నారు. ‘మద్దతు’ అంటే ఇంకేంటి తాను పెట్టబోయే కొత్త పార్టీకి ఓట్లు వేయమనే అర్థమని ప్రజలు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పాడె ఎక్కి చాలాకాలం కావడంతో ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పార్టీ మారే ఆలోచనలో వున్నారు. సమైక్య సింహాన్నని చెప్పుకుంటున్న కిరణ్ తాను పెట్టబోయే పార్టీ ఏదో త్వరగా పెట్టేస్తే అందులో దూకేద్దామన్న ఐడియాతో వున్నారు. అయితే కిరణ్ పార్టీ పెట్టే విషయంలో స్పష్టత ఇవ్వకుండా ఇష్యూను నానుస్తూ వుంచడం పట్ల జంప్ జిలానీల్లా మారడానికి సిద్ధంగా వున్న కాంగ్రెస్ నాయకులు చిరాకుపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు మీ మద్దతు కావాలని కిరణ్ ప్రజలను అడుగుతున్నారు. అయితే కిరణ్ కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఎప్పుడో వచ్చిందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్‌కి పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెబితే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో వారున్నారు. కిరణ్ ఇప్పటికైనా ఈ నాన్చుడు ధోరణిని వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్ పార్టీ పెట్టకుండా కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంటే తమదారి తాము చూసుకునే ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని కీలకమైన కాంగ్రెస్ నాయకులందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కిరణ్ అటో ఇటో తెలిస్తే వాళ్ళందరూ ఇటో అటో దూకేయడానికి రెడీగా వున్నారు. ఇప్పుడు బంతి కిరణ్ కుమార్ రెడ్డి కోర్టులో వుంది.

విభజనకు మరికొన్ని సమావేశాలు తప్పవేమో: షిండే

  రాష్ట్ర విభజనపై కసరత్తు చేస్తున్న కేంద్రమంత్రుల బృందం రేపు సమావేశం కాబోతుంటే, కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు సమావేశం కాబోతోంది. రేపు అంటోనీ నివాసంలో జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారు చేసి, ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిని ప్రవేశపెట్టాలని ముందు నుండి అనుకొంటున్నారు. అయితే  కేంద్రమంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్నషిండే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “ఇంకా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అందువల్ల రేపటి సమావేశమే ఆఖరుదని ఇప్పుడే చెప్పలేము. అవసరమయితే మరి కొన్ని సమావేశాలు జరిపి, అన్ని సమస్యలను ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కరిస్తాము. ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.   రేపు కేంద్రమంత్రుల బృందం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే ఈ బృందం ఏర్పడిన తరువాత జరిగే అత్యంత సుదీర్గ సమావేశామిదే అవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం గట్టిగా భావిస్తున్నందున, బహుశః ఈ సమావేశంలోనే వారు తమ నివేదికను దాదాపు ఖరారు చేసినా చేయవచ్చును. ఇంతవరకు కాంగ్రెస్ పెద్దలు ప్రతీ అంశంపైనా ఇదేవిధమయిన సందిగ్దత ప్రదర్శిస్తూనే, విభజన ప్రక్రియను సకాలంలోనే పూర్తి చేస్తున్నారు. బహుశః ఇప్పుడు కూడా షిండే మళ్ళీ అదే పద్ధతి అమలుచేస్తున్నారేమో.

కాంగ్రెస్ కష్టాలు తీర్చిన కిరణ్..!

      కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ముచ్చట తీరి మూడు సంవత్సరాలు ముగిసిన రోజున ఆయన రాయచోటిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే అసలు గొడవే వుండేది కాదు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా వుందని, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు వరకూ కూడా పథకాలు సక్రమంగా అమలు కాక ఎన్నో బకాయిలు వుండిపోయాయని, అలాంటి ఘోరమైన పరిస్థితులన్నీ తాను రాగానే చక్కదిద్దానని ఆయన చెప్పుకున్నారు. ఇది పైకి చాలా సింపుల్ విషయంలా కనిపించినా, కాంగ్రెస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ లాంటి విషయం.   కిరణ్ చెప్పిన మాటల ప్రకారం..వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరమ అధ్వాన్నంగా వున్నట్టు! డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చున్నట్టు! కిరణ్ గారు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు!!

కిరణ్ కొత్త పార్టీ పెట్టరు: బొత్ససత్యనారాయణ

  రాష్ట్ర విభజన ను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి వేరే కొత్త పార్టీ పెడతారని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఎన్నడూ గట్టిగా ఖండించేప్రయత్నం చేయలేదు. కానీ ఆయన తరపున పార్టీలో ఇతర నేతలు మాత్రం మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ పెడితే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందో తెలుసుకొనేందుకే బహుశః ఆయన ఈపద్ధతి ఎంచుకొన్నారేమో మరి తెలియదు.   నిన్న బొత్ససత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “పార్టీ నుండి బయటకు పోదలచిన వారు పోవచ్చు. శాసనసభకి బిల్లు వచ్చేవరకు వేచి చూడనవసరం లేదు. పార్టీకి నష్టం కలిగిస్తున్నవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం అనుమతించింది. త్వరలోనే చర్యలుంటాయి,” అని ప్రకటించారు. ఆ వెంటనే ‘కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోరని’ మరో కొత్త కబురు చెపుతున్నారు.   ఒకవైపు పోయేవాళ్ళు పొండని చెపుతూ, పోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీలో కొనసాగుతారని బొత్స చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బయటకి వెళ్ళకపోతే మరప్పుడు పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపిస్తున్న బొత్స పరిస్థితి ఏమిటి?   కనీసం వచ్చే ఎన్నికల వరకయినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై అధికారం వెలగబెట్టే అవకాశం ఉంటుంది కనుక మరి ఆలోగా రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారు?కిరణ్ కుమార్ రెడ్డా? బొత్ససత్యనారాయణా? లేక కన్నా లక్ష్మినారాయణా లేక కొత్తగా నాలుగో కృష్ణుడు రంగం మీదకి వస్తాడా?

కొడుకు కోసమే కాదు, అల్లుడి కోసం కూడానట!

  అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం చాలా సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవే సామాన్య ప్రజలకు తెలియని అనేక ఆసక్తికరమయిన విషయాలను తెలియజేస్తుంటాయి. అయితే ప్రస్తుతం మన వ్యవస్థలో డబ్బు, అధికారం చేతిలో ఉంటే అవినీతిపరులు కూడా నీతి సూక్తులు వల్లిస్తూ జనాల చేత జేజేలు పలికించుకోగల సౌలభ్యం ఉంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొనేవాళ్ళకంటే, అటువంటి వారినే ఆదర్శప్రాయంగా భావిస్తూ వారి తరపున వాదించేవారే ఎక్కువ ఉన్నారిప్పుడు.   ఇక విషయంలోకి వస్తే తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు గానీ ఆ ఆరోపణలు, జరుగుతున్న పరిణామాలను కలిపి చూసినట్లయితే నిప్పులేనిదే పొగ రాదు కదా! అనిపించక మానదు.   అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సమైక్యచాంపియన్ గా ఎదిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ లో తెలంగాణా బిల్లుపై తన వాదనలు వినిపించిన తరువాత పదవికీ, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దానిని ముఖ్యమంత్రి ఎన్నడూ గట్టిగా ఖండించకపోవడం చూస్తే ఆయనకి ఆ ఆలోచన ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.   సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అతని సోదరుడు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, బొత్ససత్యనారాయణ తదితరులు కిరణ్ సోదరులపై చేసిన పిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు విచారణకు అనుమతించలేదని ప్రశ్నించారు.   కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే కాంగ్రెస్ హయంలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయని, అదేవిధంగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా అక్రమాలు కూడా బయటపడటం ఖాయమనే భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేసేందుకు ప్రయత్నిస్తోందని సోమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.   అయితే ఇంతవరకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజన చేస్తున్నారని వాదిస్తున్నతెదేపా నేతలు ఇప్పుడు వాటికి అదనంగా మరో కొత్త పాయింటు కూడా జోడించినట్లున్నారు. ఏమయినప్పటికీ సోమిరెడ్డి చేస్తున్నతీవ్ర ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే అందులో ఎంతో కొంత నిజముండకపోదని అనిపిస్తుంది.

సీమాంద్ర కేంద్ర మంత్రులతో జైరాం భేటీ దేనికోసం?

      సీమాంద్ర కేంద్ర మంత్రులకు మళ్లీ పిలుపు వచ్చింది. అయితే కేంద్ర మంత్రి జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని తనతో భేటీ అవ్వాల్సిందిగా సమాచారం పంపడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర విభజన స్వరూపాన్ని డిజైన్‌ చేస్తోంది జైరాం రమేష్‌.. అంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. భద్రాచలం సీమాంధ్రలోనే వుండాలనీ, హైద్రాబాద్‌ని యూటీ చేయాలనీ జైరాం రమేష్‌ ప్రతిపాదనలు చేశారంటూ ఓ నివేదిక ఒకటి బయటకొచ్చిందామధ్య. దాంతో, జైరాం రమేష్‌ - సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఏం సమాచారమిస్తారు.? సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి ఆయన కొత్తగా ఏం తెలుసుకుంటారు.? అనే విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు టి.బిల్లును అడ్డుకుంటారా!

      రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం సమన్యాయం చేయకుంటే తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. కేసుల మాఫీ కోసమే జాతీయ నాయకుల చుట్టూ జగన్ తిరుగున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ సంప్రదాయల ప్రకారం విభజన జరగకపోతే వ్యతిరేకిస్తామని చంద్రబాబు తెలిపారు.

సోనియాతో జీవోయం భేటి

  రాష్ట్ర విభజనపై సమర్పించాల్సిన నివేదికకు ఇప్పటికే ఓ తుది రూపు తీసుకువచ్చిన జీవోయం సభ్యులు సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాందీని కలిసి చర్చించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ తయారు చేసిన 20 పేజీల ముసాయిదా నివేదికను ఆమెకు అందజేశారు.ఈ సమావేశంలో 371డి కి సంభందించి కూడా చర్చించినట్టుగా సమాచారం.ఈ రోజు, రేపు కూడా మరోసారి జీవోఎం సమావేశం అయి బిల్లుకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఈ భేటిలతో నివేదిక పూర్తి స్థాయిలో రెడీ చేసి పార్లమెంట్‌ సమావేశాలలోపు రాష్ట్రపతికి పంపాలని కేంద్ర భావిస్తుంది.

అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే

  రాష్ట్ర ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కేంద్ర పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ తీర్మానం లేకుం డా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. 371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్న ఆయన, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము కూడా ఒప్పకోబోమని హెచ్చరించారు.