తెలంగాణా ఎన్నికల చిత్రం

  రానున్న ఎన్నికలు ఒక అనూహ్యమయిన వాతావరణంలో జరగనున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ, తెరాస కాంగ్రెస్ తో విలీనం లేదా పొత్తులకి అయిష్టత చూపుతున్న కారణంగా తెరాస, కాంగ్రెస్, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంది. ఈ పోటీలో తెరాసదే పై చేయిగా ఉండవచ్చు. ఈ ఎన్నికల తరువాత మొట్ట మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న కారణంగా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. అది సహజంగానే తెరాసకు లబ్ది చేకూరిస్తే, మిగిలిన అన్ని పార్టీలకు అడ్డుగోడగా నిలుస్తుంది.     కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తున్నపటికీ, కేసీఆర్ ని డ్డీకొని ఎదురు నిలువగల నాయకుడు, ఆయనంత ప్రజాకర్షక నేతలెవరూ ఆ పార్టీలో లేకపోవడమే ఆపార్టీకి ప్రధాన బలహీనత అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం జైపాల్ రెడ్డిని ముందుకు తీసుకు వచ్చినప్పటికీ, కేసీఆర్ నోటిజోరు ముందు ఆయన కూడా తీసికట్టే!   ఇక తెదేపాకు తెలంగాణాలో బలమయిన క్యాడర్, బలమయిన నాయకులు ఉన్నపటికీ, ఆపార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి కారణంగా రెండు లేదా మూడు స్థానాలకే పరిమితమవవచ్చును. ఒకవేళ మజ్లిస్ పార్టీతో లేదా బీజేపీతో చేతులు కలిపితే పరిస్థితి మరికొంత మెరుగుపడవచ్చును.   ఇక ఈసారి మోడీ ప్రభావం ఈ ఎన్నికలపై చాలానే ఉండవచ్చును. అయితే అది ఆపార్టీ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మాత్రం కాదని చెప్పవచ్చును. ఒకవేళ బీజేపీ తెరాసతో పొత్తులు పెట్టుకొంటే మరికొన్ని సీట్లు అదనంగా గెలవగలదు.

ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం

    ఏకతాటిపైకి అన్నగారి కుటుంబం: ఫలిస్తున్న లోకేష్ ప్రయత్నాలు   తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి క్రియాశీలకంగా పనిచేస్తున్న నారా లోకేష్ ఇప్పుడు అన్న నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల మధ్య వున్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. స్వల్ప భేదాభిప్రాయాల కారణంగా ఎడమొహం పెడమొహంగా వున్న అన్నగారి కుటుంబాన్ని ఒక్కతాటి మీద నడిపే కృషికి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.   ఈ ప్రయత్నాలను గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఇప్పుడు చంద్రబాబు అనుమతితో లోకేష్ అన్నగారి కుటుంబాన్ని కలిపే బాధ్యతను తన భుజస్కందాల మీదకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వున్నట్టు బయటకి తెలియడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని లోకేష్ భావిస్తున్నారు. అందుకే అన్నగారి కుటుంబం మొత్తం కలిసే వుందని, తెలుగుదేశం పార్టీకి అండగా వుందని సంకేతాలు పంపడం ద్వారా అన్న నందమూరి అభిమానులను, తెలుగుదేశం కార్యకర్తలను మరింత ఉత్సాహపరచవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విభజన గందరగోళం నుంచి రాష్ట్రం బయటపడేలోపు అన్నగారి కుటుంబాన్ని ఒక్కటి చేసే ప్రాజెక్టును లోకేష్ చేపట్టినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  లోకేష్ తన ప్రయత్నాల్లో భాగంగా తన పెదమామ నందమూరి హరికృష్ణను కలసి చర్చించారని, వారిద్దరి మధ్య కుటుంబానికి, పార్టీకి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని తెలుగుదేశాన్ని వదిలివెళ్ళడం, ఆ తర్వాత తన ఫ్లెక్సీల్లో అన్న నందమూరి ఫొటో ఉపయోగించిన సందర్భంగా తలెత్తిన వివాదం గురించి లోకేష్ దగ్గర హరికృష్ణ ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడలేదని అన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీకి దూరంగా పెడుతున్నారని హరికృష్ణ బాధపడ్డట్టు తెలిసింది. ఈ సందర్భంగా హరికృష్ణ ఆవేశంగా మాట్లాడితే, హరికృష్ణని లోకేష్ సముదాయించి, ఇలాంటి చిన్నచిన్న విషయాలను మరచిపోదాం మామయ్యా అని అన్నట్టు, దానికి హరికృష్ణ సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హరికృష్ణతో లోకేష్ మరోమారు సమావేశమయ్యే అవకాశాలున్నాయట. ఆ తర్వాత తన మామ బాలకృష్ణ-పెద మేనమామ హరికృష్ణలతో మీటింగ్ ఏర్పాటు చేసి, ఇద్దరి చేయీ చేయీ కలిపే అవకాశం వుందంటున్నారు. ఇదే జరిగితే హరికృష్ణ, ఆయన కుమారులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి మనసువిప్పి మాట్లాడే ఉద్దేశంలో లోకేష్ వున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి, తనకు మధ్య విభేదాలు వున్నాయని గిట్టనివారు సృష్టిస్తున్న వార్తలు నిజంకాదని నిరూపించే ప్రయత్నంలో లోకేష్ వున్నట్టు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు ఆయనకు పార్టీలో సముచిత గౌరవాన్ని కూడా కల్పించాలని పార్టీ అధ్యక్షుడిని కోరనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సరికొత్త సర్వే ఫలితాలు: అగ్రస్థానంలో తెలుగుదేశం

      రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే ఎంతో కీలకమైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయోనన్న ఉత్కంఠ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశమంతటా వుంది. ఎన్నికల ఫలితాల మీద సర్వేలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలను నిర్వహించడంలో విశ్వసనీయత వున్న ఒక సంస్థ, మరో ప్రముఖ సంస్థతో కలసి రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించినట్టు తెలిసింది.   ఆ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఒక తెలుగు ఛానల్‌లో రేపో ఎల్లుండో ప్రసారం కానున్నాయి. ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ‘తెలుగువన్’ చేతికి చిక్కాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని ఏయే పార్టీ ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం వున్నదో ఆ సర్వే చెబుతోంది. ఆ సర్వే ప్రకారం... రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సీట్లలో 117 సీట్లలో గెలిచి తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుంది. రాష్ట్రంలోని మిగతా పార్టీల విషయానికి వస్తే,  వైఎస్సార్సీపీ-87, టీఆర్ఎస్-51, కాంగ్రెస్ పార్టీ-25, బీజేపీ-02, ఎం.ఐ.ఎం.-07, ఇతరులు-05 సీట్లలో గెలిచే అవకాశం వుందని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

డిసెంబర్ 4న కేంద్రానికి జీవోఎం నివేదిక

      రాష్ట్ర విభజనపై కేంద్రం వేగం పెంచించింది. డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదికను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గురువారం నార్తబ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కార్యాలయంలో షిండే, జైరాం రమేష్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ భేటీ అయి జీవోఎం నివేదికకు తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సమాచారం.   మరోవైపు వచ్చె మంగళవారానికి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బిల్లు రూపకల్పన పై కసరత్తు మొదలైంది. సిపారసులతో కూడిన నివేదికను జీవోఎం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం లోపు బిల్లు రూపకల్పన పూర్తవనుంది. అదే సాయంత్రం ఐదు గంటలను ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలపనుంది.    

ప్రజారాజ్యం వైకాపా దొందుకు దొందే: లోకేష్

  ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే ట్వీటర్ లోనే ఎక్కువ కనిపించే నారా లోకేష్ మళ్ళీ తమ ప్రత్యర్ద వైకాపా పైకి మరో ట్వీట్ బాణం సందించాడు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, తరువాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల మధ్య అట్టే తేడా లేదని, కేవలం విలీనం, పొత్తులనే అంశాలలోనే కొద్దిపాటి తేడాలుంటే ఉండవచ్చని, మిగిలిన విషయాలలో రెండూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రజారాజ్యం ఏవిధంగా సీట్లను నోట్లకి అమ్ముకొందో ఇప్పుడు వైకాపా కూడా అదే చేస్తోందని ట్వీట్ చేసారు. దీనిపై వైకాపా ఎలా స్పందింస్తుందో ఊహించడం కష్టమేమి కాదు. అయితే లోకేష్ కూడా తన ట్వీట్ లోకం నుండి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాగ ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చి చురుకుగా పాల్గొంటూ ఉంటే, అతని మాటలకు విలువ ఏర్పడేది.

జీఓయం తుది నివేదిక 4న

  కొద్ది సేపటి క్రితమే కేంద్రమంత్రుల బృందం(జీఓయం) సమావేశం ముగిసింది. ఆర్ధికమంత్రి చిదంబరం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో షిండే, జైరామ్ రమేష్ పాల్గొన్నారు. అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల 4న జీఓయం తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో ప్రవేశపెడుతుందని తెలిపారు. హైదరాబాద్, భద్రాచలం పై ఎటువంటి సమస్యలు లేవని, ఎవరికీ బాధ కలిగించని విధంగానే తమ నివేదిక తయారుచేస్తున్నామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.   అందువల్ల ఈ రోజు జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో జీఓయం నివేదిక ఉండబోదని స్పష్టమయింది. అయితే నాలుగవ తేదీలోగా రాష్ట్ర నేతలతో షిండే మరికొన్ని సార్లు చర్చించి నివేదికకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. నాలుగవ తేదీన జరిగే మంత్రి మండలి సమావేశంలో బిల్లుని ఆమోదించిన వెంటనే అదే రోజు రాష్ట్రపతికి పంపబడవచ్చును. ఆయన దానిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, వెంటనే రాష్ట్ర శాసనసభకు పంపుతారు. అంటే వచ్చేనెల 9లోగా ఎప్పుడయినా తెలంగాణా బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించవచ్చును.   శీతాకాల సమావేశాలలోనే బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నందున, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు అట్టే సమయం ఈయకపోవచ్చును. బహుశః రెండు మూడు రోజులలో, మహా అయితే ఒక వారంలోనే బిల్లుపై సభ చేత ‘మమ’ అనిపించేసి డిల్లీ తిప్పి పంపేయవచ్చును. ఇంత క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తున్న తీరు చాలా అసంబద్దంగా అనిపిస్తున్నప్పటికీ, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండటంతో తనకు నచ్చిన విధంగా కధ నడిపిస్తోంది.

రాష్ట్రానికి సీఎం కిరణా?అశోక్ బాబా?

      సమైక్య రాష్ట్రం కోసం అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ వీ.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం కిరణా?...అశోక్ బాబా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్టాడితే తాము ఖండిస్తామని...మీరు అశోక్ బాబు నోరు మూయిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని జీవోఎంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ యూటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయలసీమ నేతల ధాటికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములే మిగల్లేదని, మళ్లీ రాయల తెలంగాణ ఎందుకని వీహెచ్ వ్యాఖ్యానించారు.

కావూరి కంపెనీ బ్లాక్ లిస్టులో

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర, తెలంగాణా ప్రజలకి ఏమి ఒరుగుతుందో తెలియదు కానీ రాజకీయ నేతలకు, ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొనే నేతలకు మాత్రం నాలుగు కాదు..కాదు పద్నాలుగు రాళ్ళు వెనకేసుకొనే అవకాశం కలుగబోతోంది. తెలంగాణా రాష్ట్రంలో అందరి కంటే మొట్ట మొదటగా ప్రయోజనం పొందేది రాజకీయ నేతలే. కొందరికి మంత్రి పదవులు, మరి కొందరికి భారీ కాంట్రాక్టులు తధ్యం.   ఇంతవరకు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకొని కేకలు పెట్టిన సీమాంధ్ర రాజకీయ నేతలకయితే తంతే బూర్లె గంపలో పడినట్లే అనుకోవచ్చును. రాజధానితో సహా భారీ ఎత్తున జరుగబోయే నిర్మాణ కార్యక్రమాల ద్వారా వారు ఊహించని విధంగా లబ్ది పొందబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతలు మై కాస్త ఎక్కువ లబ్ది పొందగలరు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి రానప్పుడే అనేక ప్రాజెక్టులు దక్కించుకొని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్న రాజకీయ నేతలు ఇప్పడు ఏకంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేసే అవకాశం వస్తే ఎంత వెనకేసుకొంటారో ఊహించవచ్చును.   అయితే లక్షల కోట్లతో భారీ ఎత్తున జరిగే ఈ నిర్మాణ పనుల కోసం భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహాయం కూడా తీసుకోవచ్చును. అయితే పాపం ఇటువంటి కీలక సమయంలోనే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు అనుకోని విధంగా పెద్ద కష్టమోచ్చిపడింది పాపం!   ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ అనే సంస్థపై అవినీతి, దగా వంటి అభియోగాలు నమోదు అవడంతో ప్రపంచబ్యాంకు పదకుండేళ్లపాటు ఆ సంస్థని బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ప్రకటించింది. అందువల్ల ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో జరిగే ఎటువంటి ప్రాజెక్టులలో కావూరి గారి సంస్థ వేలుపెట్టలేదు. అయితే రాష్ట్రంలో అన్ని ప ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంక్ సహకారంతోనే జరగవు గనుక కావురివారు ఏదో ఒక ప్రాజెక్టు పట్టుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చును.   కానీ ముందు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి కదా! గెలవకపోతే దానికి కావూరి మాత్రం ఏమి చేయగలరు? ప్రపంచ బ్యాంకు మాత్రం ఏమి చేయగలదు?

డిసెంబరు 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!

      డిసెంబరు మొదటివారంలో అసెంబ్లీ సమావేశపరచడానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్న నేపధ్యంలో... డిసెంబరు 20లోపు అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. డిసెంబరు 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు కూడా 20వ తేదీనే ముగియనున్నాయి. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రావాలంటే డిసెంబరు 20 లోపు అసెంబ్లీలో చర్చించి, అభిప్రాయాలను పార్లమెంటుకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌కు, సిఎంకు ఉన్నతస్థాయిలో సూచనలు అందినట్లు తెలిసింది.   అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.

కిరణ్‌ పార్టీ విధేయుడే

  తెలంగాణ విషయంలో కొద్ది రోజులుగా అధిష్టానాన్ని దిక్కరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సియం కిరణ్‌కుమార్‌ రెడ్డి దిగ్విజయ్‌ సింగ్‌ అండగా నిలిచారు. కిరణ్‌ కేవలం తన అభిప్రాయం మాత్రమే చెపుతున్నారని, ఆయన పార్టీని కానీ, సీడబ్ల్యూసి నిర్ణయాన్ని కానీ వ్యతిరేఖించటం లేదన్నారు. విభజనకు సంబందించిన జీవోయం కసరత్తు దాదాపుగా పూర్తయిందని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ బిల్లు అసెంబ్లకి వస్తుందన్నారు.

తెలంగాణ నావల్లే వచ్చింది

  కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఈ ఘనత సాధించిన రికార్డును తమ ఖాతలో వేసుకోవడానికి అన్నిపార్టీలతో పాటు కొందరు జాతీయ నాయకులు కూడా తెగ ఆరాటపడిపోతున్నారు. మేము చేసిన సంప్రదింపులు, లాబీయింగ్‌ల వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని ప్రతి సందర్భంలో చెపుతూ ఆ క్రెడిట్‌ తమకే సొంతం అని మురిసిపోతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని ఆయన అన్నారట. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. తాను లేకుంటే ఈ నిర్ణయమే వచ్చేది కాదని కూడా ఆయన తెగేసి చెప్పారట. అయితే ఇవన్ని కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ ముఖ్యమంత్రి పదవి కోసం నేతలు ఇప్పటి నుంచే చేస్తున్న గ్రౌండ్‌ వర్క్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఏర్పాటు తమ వల్లే సాద్యమయిందన్న మైలేజ్‌ ఇప్పటి నుంచే సొంతం చేసుకుంటే అది తరువాత కూడా తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట నేతలు.

త్వరలో జేసీకి, శ్రీనివాస రావుకి బొత్స గంట కొట్టనున్నారా

  కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం తరువాత రవాణా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేఖంగా తిరుగుతున్నఅనేక ప్రైవేట్ బస్సులను పట్టుకొంటున్నారు. వాటిలో జేసీ బ్రదర్స్ యొక్క దివాకర్ ట్రావెల్స్ కి చెందిన బస్సులు కూడా చాలానే ఉన్నాయి. దానితో సహజంగానే జేసీ సోదరులకు బొత్సపై ఆగ్రహం కలగడం సహజమే. అయితే వారి పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా అవడంతో ఈ విషయంపై నోరు మెదపలేక నానా అవస్థలు పడుతున్నారు.   అయితే అందివచ్చిన రాష్ట్ర విభజన అంశం సాకుగా తీసుకొని బొత్సపై ఇంతవరకు పరోక్ష విమర్శలు చేస్తూన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధానకారకుడని ఇప్పటికే బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకొన్న బొత్ససత్యనారాయణ, దివాకర్ రెడ్డి గుప్పిస్తున్న తీవ్ర విమర్శల కారణంగా మరింత అభాసుపాలవుతాననే ఆలోచనతో ఆయన కూడా ఎదురు దాడికి దిగారు.   “పార్టీలో కొందరు నేతలు వేరే పార్టీలో టికెట్స్ ఖరారు చేసుకొని పార్టీని అప్రదిష్ట పాలుచేసె విధంగా మాట్లాడుతూ, ప్రజల ముందు పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి పేర్ల లిస్టు సిద్దం అయ్యింది. వారిపై చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం కూడా అనుమతి ఇచ్చింది. నేడో రేపో వారికి నోటీసులు పంపబోతున్నాను,” అని హెచ్చరించారు. ఇది జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించేనని చెప్పనవసరం లేదు.   తెగించిన వాడికి తెడ్డే ఆయుధం అన్నట్లు,  తమ మధ్య యుద్ధం క్లైమాక్స్ దశకు చేరుకుందనో లేక ఇంత కాలమయినా తమ బస్సులను తిరగనీయకపోవడంతో సహనం నశించిందో ఏమో గానీ, దివాకర్ రెడ్డి వెంటనే బొత్సపై ఎదురుదాడి చేసారు. “అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా తోడు దొంగలవంటి వారే. వారికి రాష్ట్ర విభజన గురించి అంతా ముందే తెలుసు. అయినా తెలియనట్లు నటిస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు. వీరికే కాదు, సీమాంధ్ర కేంద్రమంత్రులందరికీ కూడా ఈ విషయం చాలా ముందు నుండే తెలుసు. అయినా అందరూ చివరి నిమిషం వరకు ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. బొత్స ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చును,” అని ఘాటుగా జవాబిచ్చారు.   అయితే ఈ సారి ఆయన ముఖ్యమంత్రిని కూడా బొత్సతో కలిపి నిందించడం చూస్తే ఆయన ఇక పార్టీతో తెగ తెంపులకి సిద్దంగా ఉన్నారని అర్ధం అవుతూనే ఉంది. తెదేపాతో టచ్చులో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బొత్సని ఘాటుగా విమర్శించారు. శాస్త్ర ప్రకారం జరగవలసిన ఈ విమర్శల తంతు కూడా పూర్తయింది గనుక ఇక బొత్సదే ఆలశ్యం మరి.

సియం, బొత్స తోడు దొంగలు

  రాష్ట్ర విభజన అంశం తెరమీదకు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ మీద గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌ రెడ్డి మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు.  విభజన అంశాలను దాచటంలో  కిరణ్, బొత్స సత్యనారాయణ ఇద్దూ ఇద్దరే అని వారు తోడు దొంగలని అన్నారు. ఈ ఇద్దరికే కాదు సీమాంద్ర కేంద్ర మంత్రులకు కూడా విభజనకు సంబందించిన అన్ని విషయాలు తెలుసన్నారు. కావాలనే జాతీయ నాయకులు సీమాంద్ర ప్రజలని మభ్యపెట్టారని అందరికి అంత తెలిసే ప్రజలని మోసంచేశారన్నారు. పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తప్పవన్న బొత్స వ్యాఖ్యలను జెసి సమర్ధించారు. చర్యలు తీసుకునే అధికారం బొత్సకు ఉందన్నారు.

అసంపూర్తిగా ముగిసిన జీఓయం భేటీ

కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై ఈరోజు సుదీర్ఘమయిన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి, ఇటీవల ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్, జలవనరులు, విద్యుత్, ఆర్ధిక, పరిపాలనా శాఖల అధికారులతో కూడా ఆయా అంశాలపై లోతుగా చర్చించింది. రేపు కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఉన్న కారణంగా ఈరోజు సమావేశంలోనే తన తుది నివేదిక తయారు చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది వీలుకాలేదని షిండే మాటల ద్వారా అర్ధం అవుతోంది. రేపటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తమ తుది నివేదికను సమర్పించడం సాధ్యం కాదన్నట్లు ఆయన మాట్లాడారు. మళ్ళీ రేపు మరో మారు సమావేశమవుతామని కూడా తెలిపారు. అయితే జలవనరులు, ఉద్యోగాలు, ఆర్టికల్ 371 (డీ) వంటి కొన్ని అంశాలపై తుది నిర్ణయం అయినట్లు సమాచారం. కానీ హైదరాబాద్ అంశంపై ఇంకా చిక్కుముడి అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః రేపటి సమావేశంలో దానిపై కూడా ఒక స్పష్టత రావచ్చునేమో! రాష్ట్ర విభజనపై లోతుగా చర్చిస్తున్నకొద్దీ అది ఎంత క్లిష్టమయినధో కేంద్ర మంత్రుల బృందానికి కూడా ఇప్పుడు అర్ధం అవుతోంది. నిజానికి ఈ ప్రక్రియకు ఎంత సమయం అవసరమో కూడా బహుశః వారికి ఈపాటికే అర్ధం అయి ఉండవచ్చు. అయితే ఇది స్వయంకృతాపరాదమే గనుక ఇప్పుడు ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు.

భద్రాచలం జోలికి వస్తే తడాఖా చూపిస్తా: రేణుకా

      భద్రాచలం తెలంగాణలోనే వుండాలని, భద్రాచలాన్ని ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే తన శవం మీద నుంచి తీసుకెళ్ళాలని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం జోలికి ఎవరైనా వస్తే తన తడాఖా ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరగకపోయినా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ ‘భద్రాచలాన్ని సీమాంధ్రకి ఇచ్చే సవ్వాలే లేదు’ అని నొక్కి వక్కాణించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఏమైనా చేస్తారు.. దేనినైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేణుకా చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకురాలేమోనన్న సందేహాలు ఆమె మాటల్ని వింటే కలుగుతున్నాయి.

ధర్మాన చేరికతో వైకాపాకి ఓదార్పు

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు సీబీఐ చార్జ్ షీట్లో ఎక్కడంతో తన మంత్రి పదవి కోల్పోవడమే కాక, ఇప్పుడు కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పడం లేదు. లోపం తనలో ఉంచుకొని, ఇంత కాలం తనకి ఉన్నత పదవులు కట్టబెట్టి పార్టీలో, సమాజంలో ఒక హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చే నెల 7న వైకాపాలో జేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ స్వయంగా ప్రకటించారు.   సర్పంచే స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన ధర్మానకు ఆ సీబీఐ మరకలు అంటి ఉండకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవారు. ఇంకా ఉన్నత పదవులను కూడా పొందగలిగేవారని ఖచ్చితం చెప్పవచ్చును. అయితే మునిగిపోయే ఓడ వంటి కాంగ్రెస్ నుండి ఆశావహకంగా కనిపిస్తున్న వైకాపాలోకి దూకేసేందుకు ఇంత కంటే మంచి సాకు, సమయం వేరే ఉండవని భావించిన ధర్మాన త్వరలో ఆ పార్టీలోకి దూకనున్నారు.   తనకు జగన్మోహన్ రెడ్డి అండ దొరుకుతుందని ఆయన దైర్యం చేస్తుంటే, ఆయన రాక వలన శ్రీకాకుళం జిల్లాలో తమ పార్టీ మరింత బలపడుతుందని జగన్మోహన్ రెడ్డి సంతోషపడుతున్నారు. అయితే ధర్మానకు అతని అండ దొరకడం సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన చేరికతో జిల్లాలో పార్టీ బలపడటం ఖాయం.   రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ జిల్లాలో విభజనను సమర్దిస్తున్న కిల్లి క్రుపారాణి వంటివారి వలన మరింత బలహీనంగా తయారయింది. ఇప్పుడు ధర్మాన కూడా తప్పుకొని, ప్రత్యర్ధి వర్గంలో చేరిపోవడంతో, జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో అక్కడ తెదేపా కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ వైకాపాకు కలిసివచ్చే అంశంగా మారవచ్చును.   కానీ, వైకాపాకు ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనని ప్రజలు భావిస్తే ధర్మాన బలయిపోయే ప్రమాదం కూడా ఉంది.

తెలంగాణ సీఎం: హరీష్ వర్సెస్ కేటీఆర్

      తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సీఎం అంశం ముదురు పాకానపడింది. తెలంగాణకి మా అన్న సీఎం అంటే మా అన్న సీఎం అని హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. తాజాగా కొంతమంది పార్టీ నాయకులు తెలంగాణకి హరీషే సీఎం అని బాహాటంగా ప్రకటించడంతో ఈ రెండు వర్గాల మధ్య లొల్లి ముదిరింది. తెలంగాణ సీఎం పదవి మీద మొదటి నుంచి హరీష్ రావు, కేటీఆర్‌లకు కన్నుంది. ఒకరి లక్ష్యానికి మరొకరు అడ్డుగా వున్నారు కాబట్టి ఈ బావాబామ్మర్దులిద్దరికీ మొదటి నుంచీ ఒకరంటే మరొకరికి పడదు. ఒకరి ప్రస్తావన మరొకరు తేరు. ఒకరిమీద వచ్చిన అవినీతి ఆరోపణలను మరొకరు ఖండించరు. ఇద్దరూ ఒకే సందర్భంలో చాలా అరుదుగా కనిపిస్తారు. రాష్ట్రాన్ని చీల్చాలని ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ ఈరకంగా ఏనాడో చీలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కేసీఆర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దర్లో ఎవర్ని జాగో అనాలో ఎవర్ని భాగో అనాలో అర్థంకాక, ఫామ్‌హౌస్‌లో తపస్సు చేసినా పరిష్కారం లభించక ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోతున్నారు. కేసీఆర్‌లోని తండ్రి మనసు కొడుకు వైపే మొగ్గుచూపుతున్నా, దాన్ని బయటపెట్టలేక బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి హరీష్‌రావేనని ఆయన వర్గీయులు బాహాటంగా ప్రకటిస్తూ వుండటం టీఆర్ఎస్‌లో వున్న ఆల్రెడీ వున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

శంకర్ రామన్ కేసు: కంచి స్వాములకు ఊరట

      కంచి కామకోఠి పీఠాధిపతులకు తొమ్మిదేళ్లుగా వేధిస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వాములను నిర్దోషులుగా తేల్చుతూ బుధవారం ఉదయం పాండిచ్చేరి కోర్టు తీర్పును వెలువడించింది. జయేంధ్ర సరస్వతి, విజయేంధ్ర సరస్వతి సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చనింది. ఈ కేసులో నిందితుల ప్రమేయంపై ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.2004 సెప్టెంబరు నెలలో శంకరరామన్ హత్య జరిగింది. శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్‌పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు.