ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం..

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది.. ప్రభుత్వ కార్యక్రమాలు జాతీయదృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామి అన్నారు.. ఇంకా పలు అంశాల గురించి గవర్నర్ ప్రస్తావించారు అవి.. *  కాలేజీ విద్యార్ధులకు కూడా సన్న బియ్యం అమలు చేస్తాం *  వ్యవసాయం 0.8, పరిశ్రమలు 8.3 *  డబుల్ బెడ్ రూం పథకానికి భారీ కేటాయింపులు చేశాం *  మిషన్ ఇంద్రధనస్సులో దేశంలో తెలంగాణ అగ్రస్థానం.. మిషన్ బగీరథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం *  స్వచ్చ భారత్ ను పెద్ద ఎత్తున చేపడతాం *  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 11.7 శాతం అభివృద్ధి సాధిస్తాం *  ఈ ఏడాది నుండి బీసీలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తాం *  సేవారంగం 14.9 వృద్ధి సాధిస్తాం *  ములుగులో ఉద్యానవన యూనివర్శిటీ నెలకొల్పుతాం *  గోదావరి జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాం..

పవన్ కళ్యాణ్, రామోజీరావు సీక్రెట్ మీటింగ్.. ఎందుకో..?

  సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియా మొగల్ రామోజీరావుతో సీక్రెట్ గా మీటింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భేటీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న గబ్బర్ సింగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి.. తమ పార్టీకి సంబంధించిన విషయాల గురించి.. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న భూదందాపై చర్చించినట్టు తెలుస్తోంది.   కాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.

తెలంగాణ టీడీపీ.. ఆఖరికి మిగిలింది వీరే

  తెలంగాణ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ తెరాస గూటికి చేరారు. ఈ సందర్బంగా వారు స్పీకర్ కార్యలయానికి చేరి..తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ అందించారు. దీంతో ఇప్పటివరకూ 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖలు అందించారు. ఇదిలా ఉండగా వీరి చేరికతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పడిపోయింది. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర, ఆర్ కృష్ణయ్య.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఈడెన్ గార్డెన్స్ లోనే

  ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 19 న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరగాల్సిన వేదిక గురించి మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే ధర్మశాల నుండి వేరే ప్రాంతానికి మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు వేదిక మార్పుపై పలు ప్రాంతాలు పరిశీలించిన ఐసీపీ ఇప్పుడు ధర్మశాలకు బదులు కోల్‌కత్తాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం కోల్‌కత్తాతో పాటు మొహాలీ, బెంగుళూరు వేదికలను కూడా బీసీసీఐ పరిశీలించింది. కానీ ఆఖరికి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లోనే మ్యాచ్ నిర్వహించాని నిర్ణయం తీసుకుంది.

ఉమెన్స్ డే రోజు న్యూడ్ ఫొటో.. కావాలనే..

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఇటీవల న్యూడ్ సెల్పీ ఒకటి దిగి ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కిమ్ కావాలనే ఇలా చేసిందని.. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని ఇలాంటి ఫొటోలు తీసి పోస్ట్ చేస్తుందంటూ ఆమెపై పలువురు విమర్శనాస్త్రానాలు విసిరారు. ముఖ్యంగా బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు కిమ్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె వాళ్ల విమర్శలకు రివర్స్ కౌంటర్ గా మరో న్యూడ్ ఫొటో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. అది కూడా ఉమెన్స్ డే రోజు కావడం గమనార్హం. మరి కిమ్ కౌంటర్ కు ప్రత్యర్దులు ఎలా స్పందిస్తారో చూడాలి..

జగన్ పై గోరంట్ల కామెంట్స్.. కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు..

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని భూదందాపై ఇరు పార్టీల వాగ్వాదాలతో సభ దద్దరిల్లిపోతుంది. భూదందాపై జగన్ చేసిన ఆరోపణలకు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. మన సభకు కొన్ని రూల్స్ ఉన్నాయంటూ.. మన దురదృష్టం ఏంటంటే.. ఈ విషయం కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు.. రెండేళ్ల నుండి ఉంటున్నాడు.. ఈ కుర్రాడికి జ్ఞానోదయం కావడంలేదు అని వ్యాఖ్యానించారు. అయితే గోరంట్లు వ్యాఖ్యానిస్తుండగా.. స్పీకర్ అతని మైక్ కట్ చేసి సీనియర్ సభ్యుడైన మీరు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని... చంద్రబాబు సవాల్ కి కనుక కట్టుబడినట్టయితే ఆరోపణలు నిరూపించాలి.. లేకపోతే క్షమాపణలన్నా చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్, చంద్రబాబు.. సవాళ్ల మీద సవాళ్లు..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్ష, ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ నవ్యాంధ్ర రాజధాని భూదందా ఆరోపణలపై రెండు పక్షాల మధ్య వాగ్వాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్షనేత జగన్ సవాళ్లు మీద సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రులపై చేసిన ఆరోపణలు నిరూపించిన తరువాతే సభ జరుగుతుందని.. ఆరోపణలు నిరూపించాలని.. చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. దీనికి జగన్ రాజధానిలో భూదందాపై సీబీఐ విచారణకు సిద్దమా అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు చంద్రబాబే ఇన్ సైడ్ ట్రేడింగ్ .. దీనిపై సీబీఐ ఇంక్వైరీ చేయించాలి అని అన్నారు. దీనికి చంద్రబాబు ఇందులో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఏముందో నాకు అర్ధంకావడం లేదు.. ల్యాండ్ పూలింగ్ ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా అవుతుంది.. రైతులు స్వచ్చందంగానే భూములు ఇచ్చారని అన్నారు.

విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్.. ఇదే రిపీట్ అవుతుందంటున్న కవిత

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పలు ఎన్నికల్లో ఇప్పటికే విజయ ఢంకా మోగించింది. ఈరోజు వెలువడిన వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లో కూడా కారు జోరు సాగించింది. దీంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై కేసీఆర్ కూతురు.. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి చూసే ప్రజలు తమను ఎన్నుకుంటున్నారని.. కేసీఆర్ చేపట్టిన పనులను ప్రజలు అభినందిస్తున్నారని.. దాని ఫలితాలే ఎన్నికల్లో గెలుపులు అని అన్నారు. ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఇదే రిపీట్ అవుద్దని.. 2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ దే గెలుపని జోస్యం చెప్పారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కవిత చెప్పింది నిజమే అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

అధికార పార్టీపై జగన్ ప్రశ్నలు..

  అసెంబ్లీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి ఇప్పటికి రెండేళ్లు అవుతోంది..విభజన హామీలను నెరవేర్చలేకపోతున్నారు.. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామన్నారు.. ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటి వరకూ ఇవ్వలేదు అని ఆరోపించారు. ఇక్కడ బీద ఏడుపులు ఏడ్చే చంద్రబాబు.. ఢిల్లీలో గొప్పలు పలుకుతారు.. హామీల అమలుపై బాబు కేంద్రంపై ఎందుకు పోరాడటంలేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు.. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయారు.. ఇప్పటి వరకూ పోలవరం పనులు ప్రారంభంకాలేదని అన్నారు. ఇక జగన్ ఆరోపణలపై అధికార పక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ధరఖాస్తులు.. జయలలిత ఇంటర్వ్యూ

  ఉద్యోగం కోసం ఇంటర్య్వూలు విన్నాం.. అలాంటిది ఇప్పుడు పార్టీలో పోటీ చేయడానికి కూడా ఇంటర్య్వూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలసింది. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకె పార్టీ తరుపున పోటీచేయడానికి రద్దీ తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో పార్టీ నాయకత్వం అధినేత జయలలిత ధరఖాస్తు చేసుకున్నవారందరికీ ఇంటర్వ్యూ చేశారట. కాగా తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి జయ జనవరిలోనే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. జనవరి 20 నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 6న ముగిసింది. దాదాపు 26 వేల మందికి పైగా దరఖాస్తులను పంపారని పార్టీ నాయకత్వం తన ప్రకటనలో తెలిపింది.

కారులో హెల్మెట్‌ పెట్టుకోనందుకు జరిమానా!

  బండితోలేవారు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం నేరం. మరి కారు నడిపేవారు కూడా హెల్మెట్ ధరించి వెళ్లాలంటే ఎలా! అదంతా మాకు అనవసరం అంటున్నారు బెంగళూరు పోలీసులు. హెల్మెట్‌ ధరించకుండా కారుని నడిపినందుకుగాను 100 రూపాలయ జరిమానా చెల్లించవలసిందిగా ఎమ్‌.ఎస్.పాటిల్‌ అనే వ్యక్తికి చలాను పంపారు. ఇదేదో పొరపాటుగా చేసిందనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్నాళ్ల క్రితమే ఆ రాష్ట్ర బీజేపీ నేత ప్రకాష్‌కు కూడా ఇలాంటి ఒక చలాను పంపారు. ‘ఫలానా రోజున మీ డ్రైవరు కాలు తోలుతుండగా, మీరు పక్కనే కూర్చుని ఉన్నారనీ, అయితే మీరు ఆ సమయంలో హెల్మెట్ ధరించి లేరనీ, అందుకుగాను 100 రూపాయల జరిమానా చెల్లించమనీ...’ ప్రకాష్‌గారికి అందిన తాఖీదులో ఉంది. కారు నడిపేటప్పుడే హెల్మెట్టే దండుగ అయితే, కారులో కూర్చున్నవారు కూడా దాన్ని ధరించాలి అంటే ఏం చేసేది అంటూ బెంగళూరు వాసులు తలలు పట్టుకుంటున్నారు. బెంగళూరు ట్రాఫిక్‌ అధికారులు మాత్రం ఇలాంటి చిన్నాచితకా పొరపాట్లు సహజమే కాబట్టి, వచ్చి వివరణ ఇచ్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంటే! పోలీసులు తప్పు చేసినా కూడా జనాలు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలన్నమాట.

రాహుల్ కు జైట్లీ చురక.. ఆ బిల్లు కూడా పాస్ చేసి క్రెడిట్ తీసుకోండి..

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ పై పన్ను విధింపును ఉపసంహరణ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి.. తన వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని.. తన ఒత్తిడి వల్లే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈపీఎఫ్ పన్ను వెనక్కు తీసుకోవడం తన ఘనతగా రాహల్.. సోనియా చెప్పుకుంటున్నారు.. అలాగే ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బిల్లును కూడా పాస్ చేయించి ఆఘనతను తన ఖాతాలో వేసుకోవచ్చు అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు పార్లమెంటును సవ్యంగా సాగేలా చేస్తే ఇంకా ఎన్నో బిల్లులు ఆమోదం పొందుతాయి.. అప్పుడు వాటి క్రెడిట్ కూడా రాహుల్ గారి ఖాతాలో వేస్తాం.. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వ్యాఖ్యానించారు.