చంద్రబాబుకు కేంద్రం ఝలక్.. జగన్ కు ఛాన్స్ దొరికిందోచ్..

  కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు వరుస ఎమ్మెల్యేల వలసలతో సతమతమవుతున్న వైసీపీ పార్టీ అధినేత జగన్ కు మాత్రం మంచి అవకాశం దొరికింది. ప్రత్యేక హోదా అనే అస్త్రంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.   ప్రత్యేక హోదా పై జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ, బీజేపీ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.. ఇప్పుడు అది కుదరదని చెబుతున్నారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించేవారే లేరు.. ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం చెబుతోంది.. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెరుగుతాయి.. పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడతాయి.. పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో ఎన్నో ఉపయోగాలు.. ఎక్సైజ్ సుంకాలు కట్టే అవసరం లేదు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై కూడా విరుచుకు పడ్డారు.. పథకం ప్రకారమే ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరు గారుస్తున్నారు.. చంద్రబాబు వ్యాఖ్యలతోనే కేంద్రం వెనక్కి తగ్గింది అని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరంలేదు.. మంత్రి చౌధరి

ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం ఏపీ ప్రత్యేక హోదా పై మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ఏం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి వారి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని, నీతి ఆయోగ్ కూడా ఇదే చెప్పిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ.. విభజన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నాము.. వెనుకబడిన జిల్లాలకు రెండేళ్లలో రూ.750 కోట్లు ఇచ్చామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రెండేళ్లలో రూ.2050 కోట్లు ఇచ్చామన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడలలో విమానాశ్రయాల విస్తరణకు భూసేకరణ జరుగుతోందని చెప్పారు. ఏపీకి ఆర్థిక సాయంపై నీతి అయోగ్ పరిశీలిస్తుందని చెప్పారు.   దీంతో కేంద్ర వైఖరిపై ఇప్పుడు ఏపీ ప్రజలతో పాటు.. టీడీపీ సహా అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. అంతేకాదు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసలను చేసేందుకు గాను.. ఉద్యమాల హోరు వినిపించేందుకు అప్పుడే సమాయత్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రజా సంఘాలు చర్చల్లో మునిగిపోయాయి. అయితే కలిసి ఉద్యమిద్దామని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నప్పటికీ.. ఆయా పార్టీలు మాత్రం ఒంటరిగానే ఉద్యమించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడిగానైనా, విడివిడిగానైనా... ‘హోదా’ కోసం ఏపీలో ఉద్యమాలు హోరెత్తడం మాత్రం ఖాయమేనని తెలుస్తోంది.  

అగస్టా స్కాం... మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగికి ఈడీ సమన్లు

  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అగస్టా స్కాం డీల్ లో త్యాగికి భారీగా ముడుపులు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. అగస్టా వ్యవహారంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఈడీ... త్యాగికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇలా వాయుసేన అధిపతిగా పనిచేసిన అధికారికి ఈడీ సమన్లు జారీ కావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమట.

అగస్టాపై సుప్రీం విచారణ..

  అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్ట్ర్ కుంభకోణంలో ఇప్పటికే రాజ్యసభ.. ప్రతిపక్ష, అధికార పక్ష నేతల వాదనలతో రణరంగంగా మారింది. ఒకపక్క ముడుపులు ఎవరికి ముట్టాయో సోనియా బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంటే.. పేర్లు బయటపెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అయితే ఇప్పుడు ఈకేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని దాఖలై న పిల్‌పై వచ్చేవారం విచారణ జరుపనున్నటు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు ఆర్ భానుమతి, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజంపై విచారణ జరుపుతున్నది. ఈ వ్యవహారంపై సత్వరమే విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎమ్మెల్ శర్మ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వచ్చేవారం విచారణకు లిస్టింగ్ చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

మహిళలపై పోలీసు అధికారి దాడి.. కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు

అధికారం చేతిలో ఉంది కదా అని ఈ మధ్య కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా ఓ పోలీసు అధికారి మహిళలపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మ‌ద్య‌మాల్లో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బీహార్ రాజ‌ధాని పాట్నాలోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లోని భూమిలో కొందరు గుడిసెలు వేసుకుని నివ‌సిస్తున్నారు. అయితే ఆస్థలం నుండి వారిని ఖాళీ చేయించడానికి ఒక బిల్డర్ త‌న అనుచ‌రుల‌తో వారిపై దాడికి దిగాడు. దీంతో అక్కడ ఉంటున్నవారు కూడా తిరిగి వారిపై దాడికి దిగారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో సదరు బిల్డర్ తరపు అనుచరులు పారిపోయారు. దీంతో పోలీసులు అక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మహిళపై చేయి చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. త‌రువాత సోష‌ల్ మీడియాలోకి ఎక్కేశాయి. అంతే మ‌హిళ‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించి, చేయి చేసుకున్న పోలీసు అధికారిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

నాగినీ డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన..

  నిరసన తెలపాలంటే ఒకొక్కరికీ ఒక్కో పద్దతి ఉంటుంది.  అయితే మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు మాత్రం చాలా విచిత్రంగా.. నవ్వు తెప్పించే విధంగా తమ నిరసనను తెలియజేశారు. అసలు సంగతేంటంటే.. మహారాష్ట్రలోని బుల్దానా టౌన్ లో రోడ్డు పనులు రెండేళ్లుగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో.. విసుగెత్తిపోయిన ఎన్సీపీ కార్యకర్తలు పీడబ్బ్యూడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు తమ ఫిర్యాదు అందజేశారు. అయితే, ఈవిషయమై అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఎన్సీపీ కార్యకర్తలు నాగినీ డ్యాన్స్ చేస్తూ తమ నిరసనను తెలియతజేశారు.

21 బంతుల్లో శతగ్గొట్టేసిన క్రికెటర్..!

  క్రిస్ గేల్ ఐపిఎల్ లో కేవలం 30 బంతుల్లో సెంచరీ కొట్టేసి రికార్డ్ సాధించాడు. ఇక ఎవరూ ఈ రికార్డును బద్ధలుగొట్టలేరని అందరూ అనుకున్నారు. కానీ మరో ఆటగాడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అది కూడా కేవలం 21 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసి ప్రపంచరికార్డులన్నింటినీ తుడిచేశాడు. ఇరాక్ థామస్ అని పేరున్న ఆ ఆటగాడు కూడా వెస్టిండీస్ వాడే కావడం విశేషం. క్రికెట్ కు టి20 ప్లేయర్లను అందించే వెస్టిండీస్ కు ఇప్పుడు ఈ కొత్త కుర్రాడు దొరికాడు. ప్రపంచపు దృష్టిని  23 ఏళ్ల ఇరాక్ థామస్ ఆకర్షించాడు. త్వరలోనే అతను ఐపిఎల్ టీంకు ఆడితే ఆశ్చర్యపోవక్కర్లేదు. అతని 21 బంతుల సెంచరీలో 15 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ లోని ట్రినియాడ్ అండ్ టొబాగోలో జరుగుతున్న టి20 టోర్నీ లో ఈ రికార్డ్ నమోదైంది. లోకల్ గా ఉన్న స్క్రాబరో టీమ్ కు స్ప్రే సైడ్ కు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్ప్రేసైడ్ మొదట బ్యాటింగ్ చేసి 152 పరుగులు చేసింది. స్క్రాబరో తరపున ఆడుతున్న ఇరాక్ బరిలోకి దిగి కేవలం 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసేశాడు. మొత్తం 31బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం.

ఆదర్శ్ కుంభకోణంపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం.... బిల్డింగ్ కూల్చేయండి

  మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదర్శ్ సొసైటీ అక్రమంగా నిర్మించిన 31 అంతస్థుల భవనాన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని.. అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని కోర్టు తెలిపింది.   కాగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ సొసైటీ భవనంలో ముగ్గురు బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆదర్శ్ భవనంలోని 102 ప్లాట్లలో 25 ప్లాట్లు అక్రమంగా ఇచ్చినవేనని 2013లో జ్యూడిషియరీ కమిషన్ గుర్తించిం కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు భవంతిని కూల్చేయాల్సిందిగా ఆదేశించింది.

ప్రధాని విద్యార్హతలేంటో చెప్పండి.. కేజ్రీవాల్

  ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుండి ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనిపించినట్టుంది. అందుకే మోడీ విద్యార్హతలు తెలియజేయాలని ఏకంగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై పలు అనుమానాలు ఉన్నాయని.. మోడీకి ఎలాంటి విద్యార్హతలు కానీ.. డిగ్రీలు కానీ లేవని ఆరోపణలు వస్తున్నాయి.. ఈనేపథ్యంలో ఆయన విద్యార్హతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు నా విద్యార్హతల గురించి సీఐసీ తెలుసుకుంది.. మరి ప్రధాని విద్యార్హతల గురించి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. మరి కేజ్రీవాల్ కోరినట్టు ప్రధాని విద్యార్హతల గురించి చెబుతారో లేదో చూడాలి.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె మృతి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె కర్ణిక సింగ్ మృతి చెందింది. గత కొంతకాలంగా కర్ణిక సింగ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆమె గత ఏడాది యూఎస్ లో చికిత్స కూడా చేయించుకున్నారు. కానీ పూర్తిగా నయం కాకపోవడంతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు తరలించనున్నారు.   కాగా దిగ్విజయ్ సింగ్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. దిగ్విజయ్ భార్య ఆశా 2013లో మృతి చెందారు. అనంతరం దిగ్విజయ్ టీవీ యాంకర్ అమృతారాయ్ ని వివాహం చేసుకున్నారు.

యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు.. ఫ్లింటాఫ్ అలా అన్నందుకే కొట్టాను..

  డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన దీనికి ఎప్పటికీ మరచిపోలేము. అయితే తాను ఆరు సిక్సులు కొట్టడానికి గల కారణం ఏంటో చెప్పాడు. తొలి టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరుగుతుండగా.. స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. అయితే దీనికి అదే జట్టులో ఉన్న ప్లింటాఫ్ తో జరిగిన గొడవే కారణమంటూ అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టానని, అవి చెత్త షాట్లంటూ ఓ బూతు పదం అతను వాడాడని, నేనూ ఓ బూతు తిట్టానని.. దానికి ఏం మాట్లాడావని అతను తనని అడిగాడని, దానికి తాను ఘాటుగానే.. నువ్వు సరిగ్గానే విన్నావని చెప్పానని తెలిపాడు. దానికి అతను 'నీ గొంతు కోస్తానని' తనను అన్నాడని యువీ చెప్పాడు. దీనికి కోపం కట్టలు తెచ్చుకొని వచ్చిందని దానికి ప్రతి బాల్ బౌండరీ దాటించాలని అనుకున్నా అని చెప్పాడు.

అగ్రకులాలవారికి పదిశాతం రిజర్వేషన్లు..

  గుజరాత్ ముఖ్యమంత్రి అనంది బెన్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలవారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉపాధి ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు.. ఏడాదికి ఆరు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని.. మే 1వ తేదీ నుండి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ఆమె తెలిపారు. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని తెలిపారు. కాగా రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సమీప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

భారత్, పాకిస్థాన్ యుద్దం.. ఇందిరా గాంధీ బెడ్‌కవర్లను మార్చుతూ కూర్చున్నారు..

  మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి ఆమె దగ్గర పనిచేసిన వైద్యుడు కేపీ మాథుర్.. ఇందిరా గాంధీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 92 ఏళ్ల కేపీ మాథుర్ ఇందిరాకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసేవారు. అయితే ఆయన రాసిన "ద అన్‌సీన్‌ ఇందిరా గాంధీ" పుస్తకంలో ఇందిరా గాంధీ గురించి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్యర్చపోవాల్సిందే. ముఖ్యంగా భారత-పాక్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇందిరా గాంధీ ఏం చేశారో ఆయన తెలిపారు. 1971 నవంబర్‌ 5వ తేదీన 'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తేదీన నేను వెళ్లేసరికి ఇందిరా గాంధీ స్వయంగా బెడ్‌కవర్లను మార్చుతూ కనిపించారు.బహుశా ఈ పని ద్వారా ముందురోజు అర్థరాత్రి వరకు ఉన్న పని ఒత్తిడి నుంచి ఆమె బయటపడి ఉంటారు' అని తన పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు ఇంకా ఆమె గురించి తెలుపుతూ.. ప్రధాని అయిన మొదట్లో ఇందిరా చాలా ఒత్తిడికి గురయ్యేవారు.. శని, ఆదివారాల్లో ఏ మాత్రం వీలుదొరికినా.. పుస్తకాలు చదివేవారన్నారు. మధ్యాహ్న భోజనం ముగిశాక కొన్నిసార్లు పేకాట ఆడేవారని రాశారు.

టీవీ చర్చా సమయంలో మంత్రి గారిపై రాళ్లు, కుర్చీలు...

  కేరళలోని కార్మిక మంత్రి బేబి జాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై రాళ్లతో దాడి చేశారు. వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాం ప్రాంత శంకరమంగళం జంక్షన్లో  ఓ టీవీ ఛానెల్ చర్యా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండగా కొందరు వారిపై రాళ్లు రువ్వి, కుర్చీలు విసిరారు.. తమ ప్రాంతంలో తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మల్యే శిబు ఎంత మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో శిబు మద్దతుదారులు అడిగినవారిపై దౌర్జన్యం చేయటంతో వారూ రెచ్చిపోయి రాళ్లు విసిరారు. దీంతో మంత్రి జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.  గాయపడిన నేతలను ఆసుప్రతికి తరలించి చికిత్స చేశారు.

గల్లా జయదేవ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి గుంటూరు వెళుతున్న ఆయనకు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరులో ఐటీసీసంస్థ రూ. 150 కోట్లతో 'మై ఫార్చూన్‌' పైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. దీంతో స్థానికి ఎంపీగా గల్లా జయదేవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గల్లా జయదేవ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు బయల్దేరారు. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడకు తరలించి అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు.   ఇటీవలే గుంటూరులో ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కూడా ఆయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.