సోనియా అల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. సంజయ్ భండారీతో రెగ్యులర్ టచ్..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సంజయ్ భండారీ నుండి వాద్రా లండన్ లో ఓ లగ్జరీ ప్లాట్ ను బహుమతిగా స్వీకరించారని కూడా అంటున్నారు. అయితే వీటిపై స్పందించిన సోనియా మాత్రం.. పిచ్చి ప్రేలాపనలు వద్దు.. విచారణ జరిపించి రుజువు చేయించండి.. అని నిప్పులు చెరిగారు. అయితే సోనియా అన్న మాటలను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్టు ఉంది. అందుకే ఈ సవాల్ ను స్వీకరించి.. వేగవంతమైన దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఒక విషయం బయటకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి గతంలో 2011 లో ఐబీ(ఇంటెలిజెన్స్ బ్యూరో) ఒక నివేదిక ఇవ్వగా ఇప్పుడది బయటకు వచ్చింది. అందులో సంజయ్ భండారీ... వాద్రాతో నిత్యం టచ్ లో ఉన్నట్లు.. తన కంపెనీ పేరిట తీసుకున్న వాద్రా మొబైల్ ఫోన్ కు భండారీ పలుమార్లు ఫోన్లు చేసినట్టు ఉంది. దీంతో వాద్రాకు మరింత ఉచ్చు బిగించినట్టైయింది. మరి దీనిపై సోనియా ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ టీడీపీకి షాక్.. నేడు కారెక్కనున్న ఎంపీ మల్లారెడ్డి..

  ఒక పక్క ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు వరుస పెట్టి వలసలు పోతుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్దంగా పార్టీ నేతలు టీడీపీకి హ్యాండ్ ఇస్తున్నారు. తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ఇప్పటికే అందరూ టీఆర్ఎస్లో చేరారు. ఇంకా ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఎప్పటి నుండో ఆయన టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అంతేకాదు ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ పనితీరును పొగిడేశారు. దీనిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినా తాను మాత్రం వాస్తవాలే మాట్లాడుతున్నానని సమర్థించుకున్నారు. దీంతో ఆయన కూడా టీఆర్ఎస్లోకి వెళతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడు ఆయన కొంత వేచిచూశారు. చివరకు ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. ఈరోజు మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

అలా అయితే కేసీఆర్ 114 సార్లు త‌ల న‌రుక్కోవాలి..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో ఆయనకు తోడుగా ఉండి.. ఉద్యమం విజయవంతం అయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించింది ఎవరంటే తెలంగాణ‌ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం గుర్తుకు వస్తారు. అయితే అప్పుడు కేసీఆర్ కు అంత దగ్గరగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా కేసీఆర్ పై, ఆపార్టీపై విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. ఒకానొక సందర్బంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ  ఏర్పాటు చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మరోసారి కోదండరాం.. కేసీఆర్ కు.. కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు.   కరీంనగర్లో నిర్వహించిన ముస్లిం గర్జన కార్యక్రమానికి హాజరైన ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , బడ్జెట్‌లో వాటో కోసం మైనార్టీలు ఐక్యంగా ఉద్యమించి, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. గతంలో మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు  రంగనాథ్‌ మిశ్రా, సచార్‌ కమిటీలు వేయగా.. అవి కూడా ఆర్థికంగా, విద్యా, ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. అయినా కూడా ప్ర‌భుత్వం ఆమేర‌కు నేటికీ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విమ‌ర్శించారాయ‌న. అంతేకాదు తాను మాట మీద నిలబడే వ్యక్తినని.. కేసీఆర్‌ మాట తప్పితే తలనరుక్కుంటానని ప‌దే ప‌దే చెప్పినా.... ఇప్పటివరకు ఆయన 114 సార్లు మాట తప్పారని ఎన్ని సార్లు త‌ల న‌రుక్కున్న‌ర‌ని కోదండరాం విమ‌ర్శించారు.   మరోవైపు కోదండరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. త‌న రిటైర్మెంట్ త‌రువాత అక్కున చేర్చుకుని శాస‌న మండ‌లిలో త‌న‌కు స్ధానం క‌లిపించ‌నందునే కోదండ‌రాం కేసీఆర్‌ని బ‌ద‌నాం చేస్తున్నార‌న్న‌ది తెరాస వ‌ర్గాల వాద‌న‌. చూద్దాం ... భ‌విష్య ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయో....

నేపాల్‌లో చిక్కుకున్న 65 మంది ఖమ్మం వాసులు.. చేతులెత్తేసిన ట్రావెల్స్

  నేపాల్‌లో పర్యటించేందుకు వెళ్లిన 65 మంది ఖమ్మం వాసులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. మరోవైపు వీరిని తీసుకెళ్లిన ట్రావెల్స్ సంస్థ వారిని వెనక్కి తీసుకరావడంలో చేతులెత్తేసింది. దీంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని సురక్షితంగా స్వస్థలాలకి చేర్చాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు.  దీంతో తుమ్మల ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం విదేశాంగ మంత్రితోపాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో వేణుగోపాలాచారి సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కుటుంబీకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తుమ్మల హామీ ఇచ్చారు.

నాకు లేని బైకు ఎవ్వరికి ఉండకూడదని ఏం చేశాడంటే..?

మనకు లేనిది ఇతరులకు ఉంటే ఎవరికైనా ఈర్ష్య, అసూయ కలగడం సహజం. బయటకి ఎలా ఉన్న లోలోపల మాత్రం ఉడికిపోవడం మానవ సహజం. అయితే అలా ఆ ఉడుకుమోతుతనాన్ని లోపల దాచుకోలేకపోవడం ఢిల్లీ పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య బైకులు తగలబడిపోతున్నాయి. దీనిపై పోలీసులకు లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.  పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఈ కేసులో చిక్కుముడి వీడటం లేదు.   ఈ నేపథ్యంలో మే 28న ఎప్పటిలాగే ఒక బైకు తగులబడుతోంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నంచారు. ఇందులో విచిత్రమేంటంటే ఆ బైకుకు నిప్పు పెట్టిన వ్యక్తి కూడా ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం. ఆ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.  తన పేరు సునీల్ కిశోర్ అని, తనకు బైకులంటే చాలా ఇష్టమని చెప్పాడు. అయితే రోజు కూలిగా పనిచేసే తనకు బైకులు కొనే స్తోమత లేదని అందుకే బైకులు దొంగతనం చేయాలనుకున్నట్టు తెలిపాడు. కాని దొంగతనం చేసిన తర్వాత దొరికిపోతానేమోనన్న భయంతో తనకు లేని బైకులు ఎవ్వరికి ఉండకూడదని వాటిని తగులబెడుతున్నాని చెప్పాడు. దీంతో నిర్ఘాంఘపోవడం పోలీసులవంతైంది.

మహానాడులో ఎమ్మెల్యే డబ్బులు కొట్టేసిన దొంగ అరెస్ట్..

  టీడీపీ మహానాడు సభలు మూడురోజులు ఘనంగా జరిగాయి. కొన్ని వేలమంది టీడీపీ నేతలు ఈ సభలకు హాజరయ్యారు. అయితే పనిలో పనిగా పిక్ పాకెటర్స్ కూడా చాకచక్యంగా తమ చేతికి పనిచెప్పారు. అలా ఒక ఎమ్మెల్యే డబ్బులు కాజేసి దొరికిపోయాడు ఓ దొంగ. మహానాడు సభకు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా వచ్చారు. అయితే సభకు వచ్చిన ఆయన దగ్గర నుండి డబ్బులు కాదు. దాదాపు 95 వేల రూపాయలు దొంగలు కాజేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే డబ్బు పోయిందని పోయిందని జయరాములు ఫిర్యాదు చేయగా, దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అన్నీ పరీశీలించి ఆఖరికి దొంగలను కనిపెట్టారు. జయరాములు వెనుక ఇద్దరు వ్యక్తులు కదలాడుతున్నారని.. వారే దొంగలని గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే నుంచి దొంగిలించిన సొమ్మును రికవరీ చేశారు.

వాహనదారులకు ఒడిషా షాక్.. "నో హెల్మెట్..నో పెట్రోల్ "..!

హెల్మెట్ పెట్టుకోండి..సీటు బెల్ట్ కట్టుకోండి..అని బుద్ధిగా చెబితే ఎవరు వింటారు. అలా చెప్పి..చెప్పి విసిగిపోయారేమో ఒడిషా పోలీసులకు చిర్రెత్తుక్కొచ్చింది. అందుకే ఇకపై కఠినంగానే వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో వచ్చేనెల 15 నుంచి ద్విచక్ర వాహనాలు వినియోగించే వారు హెల్మెట్ లేకుండా బంక్‌కు వెళ్లి పెట్రోల్ పొందాలనుకుంటే..అక్కడి సిబ్బంది వారికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే సమాధానాన్ని చెప్పనున్నారు. ఈ మేరకు  ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వాహనదారులకు, పెట్రోల్ బంక్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ద్విచక్రవాహనాలు అమ్మేటప్పుడే వాటితో పాటుగా హెల్మెట్‌ను కూడా తప్పనిసరిగా అమ్మాలని కూడా అక్కడి  వాహన విక్రయదారులను ఆదేశించారు.

టీడీపీ లోకి వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు బాధ పడుతున్నారు.. వైసీపీ

వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల గురించి వైసీపీ పార్టీ కొత్త విషయాలు బయటపెడుతోంది. వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. టీడీపీలోకి వచ్చిన తరువాత.. ఇలా ఎందుకు చేశామా అని బాధపడుతున్నారని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్, ప్రతాప్ కుమార్లు మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్బంలో పై విధంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా, తమకు వచ్చే నష్టమేమీ లేదని.. విజయసాయిరెడ్డి గెలుపుపై తమకు అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తెదేపాలో చేరిన 17 మందిలో తప్పుతెలుసుకున్న అత్యధికులు తిరిగి వెనక్కు రానున్నారని అన్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

గండిపేటలో కాల్పుల కలకలం..

  హైదరాబాద్ నగరంలోని గండిపేటలో కాల్పుల కలకలం రేగింది. గండిపేటలోని పుప్పాలగూడ వద్ద నిన్న రాత్రి జరిగిన కాల్పుల వల్ల అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం.. గోల్కొండ రిసార్ట్‌లో నిన్న రాత్రి ఓ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ ఫంక్షన్ కు  గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్, న‌ల్గొండ జిల్లా కోదాడ‌కు చెందిన ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు. అయితే వీరిద్దరికి ఓ ఆస్తి వివాదంలో వాగ్వాదం జరుగగా.. ప్ర‌శాంత్‌ను బెదిరించేందుకు ప్ర‌భాక‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. అయితే కాల్పులు జ‌రిపిన స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ తాగి ఉన్నాడ‌ని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నామని తెలిపారు.

మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి... పిచ్చి మాటలు వద్దంటున్న సోనియా..

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అందునా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే వారి కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అలాగే ఈసారి కూడా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి సోనియా గాంధీ అల్లుడుపై ఆరోపణలు గుప్పించారు. సోనియా గాంధీ అల్లుడు, వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా... బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని.. త్వరితగతిన బ్రిటన్ పౌరసత్వం పొందేందుకే వాద్రా ఈ నిధులు వెచ్చించారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు, పౌరసత్వం రాగానే బ్రిటన్ చెక్కేసేందుకు వాద్రా సన్నాహాలు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వాద్రాపై నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.   మరోవైపు ఈ ఆరోపణలపై సోనియా గాంధీ స్పందించి బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. "ప్రతి రోజూ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇదో అలవాటైపోయింది. ఏవైనా ఆధారాలుంటే, విచారణ జరిపి ఆరోపణలను రుజువు చేసి చూపండి. పిచ్చి మాటలు ఎందుకు?" అని ఆమె అన్నారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న అజెండాతో సాగుతున్న బీజేపీ ఈ తరహా కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, మోదీ కేవలం ప్రధానమంత్రే తప్ప, షహన్ షా (రాజు) కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఏపీ ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు కొత్త లెక్కలు..

  ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం పరోక్షంగా అర్ధమైపోయింది. ఇప్పటికే కేంద్ర పెద్దల నుండి.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా రాదని.. ఇచ్చే అవకాశం లేదని తేటతెల్లమైపోయింది. గతంలో ఏపీకి అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని.. ఏమాత్రం అలక్ష్యం చేయదని చెపుతూ.. ప్రత్యేక హోదా ఇస్తే... కేంద్రం నుంచి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే వస్తాయని.. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే... కేంద్రం నుంచి ఏపీకి ఏకంగా రూ.42 వేల కోట్ల మేర నిధులు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని ఆయన వాదించారు.

చనిపోయిన శవాన్ని బైక్ కు కట్టుకొని..

  భువనేశ్వర్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ శవాన్ని బైక్ కు కట్టుకొని వెళుతున్నఘటన అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల ప్రకారం.. భువనేశ్వర్ భారాముండా గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టం చేసిన తరువాత.. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అలా ప్యాక్ చేసిన మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు బైక్ వెనుకాల కట్టుకొని తీసుకెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక  వారు అలా చేశారా? లేక  వాహనంలో తరలించేందుకు అవసరమైన  డబ్బులు లేక అలా చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.   మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా స్పందించి.. ఆ చుట్టుపక్కల 20కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని.. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామని ఆమె  తెలిపారు.

వెనక్కి తగ్గిన కేంద్రం.. ఒక శాతం పన్ను తొలగింపు..

  కేంద్రం వివిధ రకాల విలువైన లోహాలతో తయారుచేసే ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అరుణ్ జైట్లీ వీటిపై కొత్త పన్ను విధిస్తూ ప్రతిపాదించగా.. దానిని వ్యతిరేకిస్తూ ఆభరణాల దుకాణాదారులు దాదాపు ఆరు వారాల నుండి సమ్మె చేశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తామని ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది.

కోర్టులపై పారికర్ సంచలన వ్యాఖ్యలు.. అర్థరహిత ఆదేశాలు..

  కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాలు రద్దు చేయాలంటూ ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పారికర్.. కోర్టుల ఆదేశాలు అర్థరహితమంటూ వ్యాఖ్యానించారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండానే అర్థరహిత ఆదేశాలు ఇస్తున్నారు అని అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు. ‘‘ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఓ నివేదిక చదివాను. కోర్టు తీసుకున్న నిర్ణయాలు తమకు అర్థం కావట్లేదంటూ వారు భారత దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపేశారు. డీజిల్ వాహనాల నిషేధం వెనుక ఉన్న తర్కాన్ని తాము అర్థం చేసుకోలేకపోతున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు అని చెప్పారు. కోర్టులు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు వల్ల దేశానికే నష్టమని.. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు.