కర్నూలు బస్సు ప్రమాదం.. లగేజీ క్యాబిన్లో వందల ఫోన్లు!

 కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా ఉండటానికి డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్లు తెరుచుకోకపోవడం ఒక కారణమైతే.. బస్సు లగేజీ క్యాబిన్ లో ఉన్న ఫోన్ల పార్శిల్ ప్రధాన కారణమని అంటున్నారు. బస్సు లగేజీ క్యాబిన్ లో  దాదాపు 46లక్షల రూపాయల విలువైన ఖరీదైన సెల్ ఫోన్ లను బస్సులో పార్సిల్ సర్వీసుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫొరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగగానే.. ఆ వేడికి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి.. మంటలు వేగంగా వ్యప్తి చెందాయి. ఆ కారణంగానే బస్సులోని ప్రయాణీకులు బయటకు రావడం కష్టమైందంటున్నారు.  కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి.  హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు   సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం  ఓ కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు.   మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలతో పాటు బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయనీ.. ఈ మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.   

పెట్టుబడులతో వస్తాం.. ఏపీపై యూఏఈ పారిశ్రామికవేత్తల ఆసక్తి

ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన,  పెట్టుబడులకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆవిష్కరించిన తీరు, పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం పాతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు.   అదే విధంగా యూఈఏ ప్రభుత్వ ప్రతినిధులు,  మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఏపీలో ఏయే ప్రాంతాలలో ఏయే రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో కూలంకషంగా వివరించారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఏఐ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వారి కళ్లకు కట్టారు.  విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయనే అంశానికి సంబంధించిన వివరాలను పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.  రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగం, ఎరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ వంటి పరిశ్రమలు, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు..ఆక్వా కల్చర్,   టూరిజం రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సీఏం అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లకు వివరించారు.   ఇక రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని, అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామనీ,  పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని భావిస్తే, అవసరమైతే పాలసీల్లో మార్పులు తేవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలిపారు. భారత్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి చొరవను సీఎం తన పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.   చంద్రబాబు ప్రజంటేషన్ కు ముగ్ధులైన యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ సంస్ధలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇక  చివరిగా   గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది  పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన ఊహించిన దానికన్న సక్సెస్ అయ్యింది. భారీ పెట్టుబడులు వస్తాయన్న ధీమాతో ఆయన తన పర్యటన ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు.  

వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ

ఓలా, ఉబెర్ వంటి   రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్' బ్రాండ్‌తో కొత్త టేక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి.    300 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని..  డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహించనున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్‌డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టేక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్నాయి.  ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు  డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.  తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.  

ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టిఏ దాడులు

కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన ఘటనతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను  క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.  డ్రంకన్‌ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్‌ పత్రాలు, బస్సు లోపల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్మిట్‌ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని   బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ, మెడికల్‌ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్‌ బస్సును సీజ్‌ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. అలాగే శుక్రవారం అర్థరాత్రి హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరా బాద్ శివారు ప్రాంతాలలో కూడా రవాణాశాఖ అధికారులు దాడులు కొనసా గుతున్నారు.  శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవే పైన కూడా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా కెరళా, తమిళ నాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, పాండి చ్చేరి, నాగాల్యాండ్, ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చే  వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ చేపట్టిన ఈ దాడులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఆర్టీఏ తీరు ఉందంటూ పెదవి విరుస్తున్నారు.   

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.శనివారం (అక్టోబర్ 25) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 24) శ్రీవారిని మొత్తం71 వేల110  మంది దర్శించుకున్నారు. వారిలో 25,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.  

చంద్రబాబు.. మనిషక్కడ.. మనసిక్కడ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. క్షణం తీరిక లేకుండా అక్కడ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులతో చర్చలు జరుపుతున్నారు. రోజుకు తొమ్మదికి పైగా సమావేశాలు, సదస్సులతో ఊపిరి తీసుకునే తీరిక కూడా లేనంతగా ఉన్నారు. అయినా ఆయన చిత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై గురువారం (అక్టోబర్ 23)న అక్కడి నుంచే ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.   అంతేనా రాష్ట్రంలో మంత్రులు, అధికారులతో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 24) ఉదయం కర్నూలు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, డీఐజీ, కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.  అధికారులు, మంత్రులు దగ్గరుండి ఈ పనులన్నిటినీ పర్యవేక్షించాలన్నారు. అలాగే ప్రమాదఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

దేశంలో ఏపీయే నంబర్ వన్.. పెట్టుబడులతో తరలిరండి.. లోకేష్

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉంది.. కానీ అతి త్వరలోనే నంబర్ వన్ స్థానినికి చేరుకుంటుంది. ఈ మాట తన ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో అన్న మాట. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అఅండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్  రౌండ్ టేబుల్ సమావేశంలో  లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులకు 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు లీప్  పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని  వివరించారు. ప్రధానంగా తాము 15 రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పిన ఏపీ ఐటీ మంత్రి..  వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్ వన్ అవుతామని గట్టిగా చెప్పారు.  ఏపీతో చేతులు కలిపి మీ ప్రాజెక్టులను సక్సెస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే విశాఖలో జరగనున్న  గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.  కాగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ను  ఒక స్టార్టప్ స్టేట్ గా అభివర్ణించారు. చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన  ఏపీ కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడంతో సరిపెట్టదనీ, ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించుకుని మాతో చేతులు కలిపితే.. అది ఇక ఎంత మాత్రం కేవలం మీ ప్రాజెక్టుగా ఉండదనీ, అది మన ప్రాజెక్టు అవుతుందని అన్నారు. 

కర్నూలు ప్రమాద ఘటన మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్ గ్రేషియా

కర్నూలు వద్ద జరిగిన  బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున అందిచనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ  సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఏమందంటే?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసల వర్షం కూడా కురిపించింది. అంతటితో ఆగకుండా   రెండో విడతగా అమరావతి నిర్మాణానికి 17వందల కోట్ల రూపాయల విడుదలకు పచ్చ జెండా ఊపింది.  ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ మూడు లేదా నాలుగోవారానికల్లా ఈ నిధులు ఏపీకి అందుతాయి.  ఈ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు.  అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది మార్చిలో  తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది కూడా. ఆనిధుల్లో   50 శాతం మేర నిధులను ప్రభుత్వం వివిధ పనులకు వ్యయం చేయడం కూడా జరిగిపోయింది. వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు  తొలి విడత విడుదల చేసిన నిధుల్లో 75శాతం ఖర్చు చేసిన తరువాత మాత్రమే రెండో విడత నిధులు విడుదల అవుతాయి. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులలో ఇప్పటి వరకూ 50 శాతం వ్యయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొలి వారం నాటికి మరో పాతిక శాతం నిధులను కూడా రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేయనున్నట్లు చెప్పింది. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కూడా ఈ పనుల వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో రెండో విడత నిధులకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించవచ్చు.  అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్యారంటీతో వరల్డ్ బ్యాంకు నిధులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇస్తున్న నిధులు ఎలా వినియోగం అవుతున్నాయన్న విషయంపై ఆ బ్యాంకు ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే.   ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా  రూపొందుతోంది. అంటే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. మొత్తం ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ఏడీబీ), కేంద్రం గ్రాంట్లతోనే నిర్మితమౌతోంది. ఇక ప్రపంచబ్యాంక్, ఏడీబీ రుణాల రూపంలో అందజేస్తున్న నిధులకు సంబంధించిన రీపేమెంట్ బాధ్యత అంతా కేంద్రానిదే.   దీంతో ఎవరెన్ని కుట్రలు పన్నిలా, అడ్డంకులు సృష్టించినా ఇక అమరావతి నిర్మాణ వేగం మందగించే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు. 

భారత రక్షణ రంగం మరింత శక్తిమంతం!

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం 79 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   రక్షణ  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 23) జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. రెండు నెలల కిందటే రక్షణ రంగాన్ని శక్తిమంతం చేసేందుకు  67 వేల కోట్ల రూపాయల విలువైన విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. తాజాగా అదే లక్ష్యంతో మరో భారీ కొనుగోలుకు పచ్చజెండా ఊపింది.   డీఏసీ సమావేశంలో ఆమోదించిన కొనుగోళ్లలో  భారత నౌకాదళం కోసం అత్యాధునిక ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పీడీ), నావల్ సర్ఫేస్ గన్స్, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ సిస్టమ్స్ వంటివి  ఉన్నాయి. ఎల్‌పీడీల ద్వారా ఆర్మీ, వైమానిక దళాలతో కలిసి నౌకాదళం ఉభయచర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టార్పెడోలు సంప్రదాయ, అణు జలాంతర్గాములను సైతం లక్ష్యంగా చేసుకోగలవు. అలాగే  సైన్యం కోసం 2వేల 408 ట్యాంక్ విధ్వంసక 'నాగ్ మార్క్-2' గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద డీఏసీ ఆమోదం తెలిపింది.  శత్రువుల యుద్ధ వాహనాలు, బంకర్లను సులభంగా ధ్వంసం చేయడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో పాటు భూతలం నుంచి శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు మొబైల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా, వైమానిక దళం కోసం లాంగ్ రేంజ్ టార్గెటింగ్ సిస్టమ్‌ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.  ఇక పదాతిదళ 380 పదాతిదళ బెటాలియన్లను 'ఆష్ని' డ్రోన్ ప్లాటూన్లతో అనుసంధానం చేసేందుకు ఆమెదం తెలిపింది.   సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచే ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు డీఏసీపేర్కొంది. ప్రతి బెటాలియన్‌కు కేటాయించే ప్లాటూన్‌లో కనీసం నాలుగు నిఘా డ్రోన్లు ఉంటాయని తెలిపింది. దీనితో పాటు 2 వేల770 కోట్ల రూపాయలతో 4.25 లక్షల తుపాకుల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. 

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కుటుంబం బలి

కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు.  నెల్లూరు జిల్లా వింజమూరు మండలం  గొల్లవారి పల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం మొత్తం ఈ బస్సు ప్రమాదంలో మరణించింది. గోళ్లరమేష్ (35), ఆయన భార్య అనూష (30), పిల్లలు మన్విత (10), మనీష్ (12) ఈ ప్రమాదంలో అశువులుబాసారు.    బెంగళూరులో స్థిరపడిన గోళ్ల రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదంలో చిక్కుకుని మరణించింది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన పీఎం కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న   కర్నూలు  సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.  క్షతగాత్రులు పూర్తిగా, తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బస్ దగ్ధమై 20మందికిపైగా సజీవ దహనం కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీఐటీ మంత్రి లోకేష్ కూడా బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.   క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.    వైసీపీ అధినేత జగన్ కూడా బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొంటూ,  సానుభూతిని తెలియ జేశారు. బాధితులను ప్రబుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కాలం చెల్లిన బస్సు.. మాన్యుఫాక్చరింగ్ లోనూ లోపాలు!

కర్నూలు చిన్న టేకూరు వద్ద శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున ఘోర ప్రమాదానికి గురైన  వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బస్సు ఫిట్నెస్ గడువు, ఇన్సూరెన్స్ పాలసీ, టాక్స్ అన్నీ గత ఏడాదితో ముగిసిపోయాయి. అలాగే  పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్ఫైర్ అయినట్టు అధికారులు గుర్తించారు. గురువారం (అక్టోబర్ 23) రాత్రి మూసాపేట్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్ సహా 43 మంది ఉన్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అతివేగంతో వెడుతూ ముందు వెడుతున్న బైక్ ను ఢీకొనడం, ఆ వేగానికి బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించడమే కాకుండా, బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా ప్రమాద తీవ్రతను, మంటల వ్యాప్తి వేగాన్ని అంచనా వేయడంలో  విఫలమైన డ్రైవర్లు.. ప్రయాణీకులను అప్రమత్తం చేయడంలో ఆలస్యం చేశారని కూడా అధికారులు భావిస్తున్నారు. ఆ జాప్యం కారణంగానే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు అగ్నికి ఆహుతయ్యారనీ, అలాగే ఈ ప్రమాదం తరువాత బస్సు డోర్ ఓపెన్ కాకపోవడం వల్ల కూడా ప్రాణనష్టం అధికంగా జరిగిందని అంటున్నారు.  అంతే కాకుండా అసలు బస్సు మాన్యుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయని కర్నూలు రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ అన్నారు.  బస్సులు ప్రమాదాలకు గురైతే.. ప్రయాణికుల ప్రాణనష్టం తగ్గించేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడటం లేదని చెప్పారు.  బస్పులో ప్రికాషన్స్ కూడా లేవన్నారు.  

బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

కర్నూలు సమీపంలో జరిగిన   బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్రమాదంలో  మృతులలో అత్యధికులు తెలంగాణ వాసులే కావడం దురదృష్టకరమన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు.     ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  వెంటనే హెల్ప్​ లైన్​ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు  జెన్​కో సీఎండీ హరీష్​ను  వెంటనే  ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు.  మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

కావేరీ ట్రావెల్స్ బస్సు.. అన్ని ఉల్లంఘనలే

కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి విదితమే.  అయితే ఈ బస్సు ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది ఇప్పటికే ఈ బస్సు మీద నో ఎంట్రీ, రాంగ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్  వంటి ఉల్లంఘనలకు సంబంధించి 23 వేల రూపాయలకు పైగా చలాన ఉంది.  కావేరి ట్రావెల్స్ బస్సు పటాన్ చెరులో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసు నుండి గురువారం రాత్రి  9 గంటలకు బయలు దేరింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే  కలెక్టర్ సిరి ఘటన స్థలానికి చేరుకున్నారు. హైదరాబాదు నుండి బెంగళూ రుకు వెళ్తుండగా ఈరోజు ఉదయం మూడున్నర, నాలుగు గంటల మధ్య చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది.  ఈ బస్సు అతి వేగంగా వెడుతూ ముందున్న బైక్ ను ఢీకొంది. ఈ సంఘటనలో బైక్ పై వెడుతున్న ఇద్దరు వ్యక్తులూ మరణించారు. అలాగే బైక్ బస్సుకిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగాయి. అంతే కాకుండా ఈ ప్రమాద ఘటనలో బస్సు డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ వైర్ కూడా తెగిపోయింది. దీంతో బస్సు డోరు తెరుచుకోలేదు.  కొందరు ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు రాగలిగారు. మరి కొందరు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేసారు. అయితే 20 మంది ప్రయాణీకులు మాత్రం బయటకు రాలేక మంటలకు ఆహుతైపోయారు. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్లతో కలిసి 41 మంది ఉన్నారు. వీరిలో 21 మంది ప్రాణాలతో బయటపడగా, 20 మంది మృత్యువాత పడ్డారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   కుకట్‌పల్లి నుంచి ఆరుగురు, వనస్థలి పురం నుంచి ఒక్కరు, ఎస్ ఆర్ నగర్ నుంచి ముగ్గురు,కుత్బు ల్లాపూర్ నుంచి నలుగురు,ఎల్ బీ నగర్ నుంచి ఇద్దరు, ఎర్రగడ్డ నుంచి ఇద్దరు,మూసా పేట్ నుంచి ఇద్దరు, భరత్ నగర్ నుంచి ఒకరు,ప్యారడైజ్ నుంచి ఇద్దరునాంపల్లి నుంచి ఒకరు,లక్డీకా పూల్ నుంచి ఇద్దరు, పటాన్ చెరువు నుంచి ఒకరు, బీరంగూడ నుంచి ఒకరు,మియాపూర్ నుంచి ఒకరు బస్సులో ఎక్కారు.. ఇప్పటివరకు వీరి గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శుక్రవారం (అక్టోబర్ 24) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 23) శ్రీవారిని మొత్తం 60వేల 896 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 33ర   9:36 AM 10/24/2025 `    దడ లక్షల రూపాయలు వచ్చింది. 

కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరు సమీపంలో మంటల్లో చిక్కుకుంది. ఈ బస్సు బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మొత్తం 41 మంది ఉన్నట్లు తెలు స్తోంది. కిటికీ అద్దాలు పగులగొట్టుకుని 21 మంది బయటపడ్డారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీశారు.    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.   ఏసీ బస్సు కావడం, సంఘటన జరిగిన సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంలో ప్రమాద తీవ్రత అధికమైందని తెలుస్తోంది.  మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులే అని తెలుస్తోంది.   కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.  మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షేడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా బిజెపి నేతలను అదేశించిచారు.  

ఏపీకి రెండు హైస్పీడ్ రైల్వే కారిడార్లు

ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి.  దక్షిణ మధ్య రైల్వే    హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ రెండు ప్రతిష్ఠాత్మకమైన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి రూట్ మ్యాప్‌ను ఖరారు చేసింది.  గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.5.42 లక్షల కోట్లు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఎక్కువ మార్గం ఏపీ మీదుగానే వెడుతుంది.   మొత్తం 1,365 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు కారిడార్లలో సుమారు 767 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్ భూభాగం గుండానే వెడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-బెంగళూరు మార్గానికి రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై మార్గానికి రూ.3.04 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ మొత్తం పొడవు 605 కిలోమీటర్లు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా సాగుతుంది. ఈ నాలుగు జిల్లాలలోనూ కలిపి 263 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ను నిర్మితమౌతుంది. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో  ఆరు కొత్త స్టేషన్లు రానున్నాయి. మరోవైపు హైదరాబాద్-చెన్నై కారిడార్ మొత్తం పొడవు  760 కిలోమీటర్లు కాగా ఇది రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా 504 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో  మొత్తం 9  ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.  ఈ మార్గానికి తరువాత దశలో అమరావతిని కూడా అనుసంధానించే అవకాశా లున్నాయని రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది.   సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన సర్వే పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నట్లు సమాచారం.  

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో పిల్లలను వేధిస్తున్న ఓ   ఉపాధ్యాయునికి భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు దేహశుద్ధి చేసిన సంఘటన  బుధవారం (అక్టోబర్ 22) సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.  భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో వారిని వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు బుధవారం సాయంత్రం ఆ పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థినులతో ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సోషల్ మీడియాలో వేధిస్తున్నట్లు పలువురు విద్యార్థినులు తమకు ఫిర్యాదు చేయడంతోనే ఆ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశామని విద్యార్థి పరిషత్ నాయకులు చెప్పారు.