బీజేపీ డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో  బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీ బైపోల్ లో డిపాజిట్ గల్లంతు కావడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతే కాదు.. షేక్ పేట్ డివిజన్ లో కమలం పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు.  బీజేపీ జూబ్లీ బైపోల్ లో ఓటమిని ప్రచార పర్వంలోనే అంగీకరించేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక అంటూ చేసిన కామెంట్ తో ఆ పార్టీ శ్రేణులు సైతం ఓటమి ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే కనీసం డిపాజిట్ కూడా రానంతగా బీజేపీ చ తికిల పడుతుందని పరిశీలకులు కూడా ఊహించలేదు. బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఒకింత పట్టు ఉందని అంతా భావిస్తారు. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ పట్టు అంతంత మాత్రమేనని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 9100 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలో తనకు డిపాజిట్ రాకపోవడంపై స్పందించిన అభ్యర్థి దీపక్ రెడ్డి.. జూబ్లీ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావం అధికంగా ఉందన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 

యావద్దేశ ప్రగతి గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు.. పియూష్ గోయెల్

విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందస్సులో ప్రసంగించిన ఆయన చంద్రబాబును కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రగతి గురించి ఆలోచించే  విజనరీగా అభివర్ణించారు.   చంద్రబాబు వంటి నాయకుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడన్న పియూష్ గోయెల్, స్వర్ణాంధ్ర విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం  గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల కోసం ఢిల్లీలో నిర్మించిన  భారత్ మండపం' తరహాలో  ఏపీలో ఆంధ్రా మండపం నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని   2047 నాటికి భారతదేశాన్ని  సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నే ఈ ప్రగతిని సాధించగలమన్న పియూష్ గోయెల్.. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ విధానంతో  సాంకేతికతను  అందరికీ చేరువ చేస్తున్నామన్నారు.  

పాతికవేల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మెజారిటీ సాధించింది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.  తొలి రౌండ్ నుంచీ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అంతే కాకుండా రౌండ్ రౌండ్ కూ ఆ అధిక్యత పెరుగుతూ వచ్చింది.  ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ లోనూ, నవీన్ యాదవ్ కార్యాలయంలోనూ కాంగ్రెస్ నేతలు, శ్రేణులూ మిఠాయిలు పంచుకుని, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విజయాన్నిపురస్కరించుకుని గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.   జూబ్లీ ఉప ఎన్నిక విజయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలుపుగా ఆయన అభివర్ణించారు.   కాగా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్.. ఈ విజయం ఊహించిందేనన్నారు. ఈ  ఉప ఎన్నికలో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుఅయ్యి చేసిన రాజకీయాలు ఫలించలేదన్నారు.   బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించిందన్నారు. ఈ విజయం విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  

షేక్ పేట్ డివిజన్ లో బీజేపీ స్కోరు జీరో ఓట్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైన క్షణం నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గట్టిపోటీయే ఇచ్చినా వెనుక బడ్డారు. కానీ ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం మాదే.. అందుకు జూబ్లీ విజయంతో తొలి అడుగు వేస్తాం అంటూ  గొప్పలు చెప్పుకున్న బీజేపీ జూబ్లీ బైపోల్ లో అసలు పోటీయే ఇవ్వకపోవడం. జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జూబ్లీ ఉప ఎన్నికలలో ఘోరంగా పెర్ఫార్మ్ చేసింది. కౌంటింగ్ పూర్తి కాకముందే ఓటమి అంగీకరించేసి ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి వేంచేశారు. సరే రాజకీయపార్టీకి గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకోవడానికి కూడా లేనంత ఘోర పరాభవం బీజేపీకి జూబ్లీ ఉప ఎన్నికలో ఎదురైంది. అదెలా అంటారా? కమలం పార్టీలో షేక్ పేట డివిజన్ లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు. ఔను నిజం.. ఓట్ల లెక్కింపులో భాగంగా   షేక్ పేట డివిజన్ లో ఓట్ల లెక్కింపులో బీజేపీ జీరో ఓట్లు స్కోర్ చేసింది. దీంతో కమలం నేతలు షాక్ కు గురయ్యారు. కనీసం ఆ పార్టీ తమ ఏజెంట్లుగా పెట్టుకున్న వారు కూడా బీజేపీకి ఓటు వేయలేదన్న సంగతి తేటతెల్లమైంది.  బీజేపీ పరిస్థితి భాగ్యనగరంలో ఇంత ఘోరంగా ఉందా అని ఆ పార్టీ వ్యతిరేకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యత 19వేల ఓట్లు

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 19 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ జరిగిన ఏడు రౌండ్లలోనూ నవీన్ యాదవ్ కే ఆధిక్యత లభించింది.  రౌండు రౌండు కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ పార్టీ ఏజెంట్లు బయటకు వచ్చేశారు. ఇక బీజేపీ  అభ్యర్థి దీపక్ రెడ్డి అయితే ఐదో రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కాంగ్రెస్ గెలుపు సంబరాలు ఆరంభించేసింది. గాంధీ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. 

ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ మెజారిటీ 12 వేలకు పైనే

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 651   ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ ఇక్కడ మూడో స్థానానికే  పరిమితమైంది. ఇప్పటివరకూ పూర్తయిన ఐదు రౌంట్ల ఓట్ల లెక్కింపులోనూ ప్రతి రౌండ్ లోనూ అనిల్ యాదవ్ కుఆధిక్యత వచ్చింది.  నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 42 వేల 126 వోట్లు, మాగంటి సునీతకు 33 వేల 978 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 6, 856 ఓట్లు వచ్చాయి. 

జూబ్లీ బైపోల్.. కౌంటింగ్ వేళ ఇండిపెండెంట్ ఆభ్యర్థి మృతి

జూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అన్వర్.. కౌంటింగ్ సందర్భంగా తీవ్ర టెన్షన్ కు లోనై గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 40 ఏళ్లు.   ఎర్రగడ్డలో నివాసముండే మహ్మాద్ అన్వర్ ఉదయం నుంచి  కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ఓటమి భయం, ఆందోళనే ఆయన మరణానికి కారణమని అంటున్నారు.  

ఢిల్లీ పేలుడు.. ప్రధాన నిందితుడి ఇల్లు పేల్చివేత

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నడి ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.    జమ్మూ కశ్మీర్  పుల్వామాలోని  అతడి ఇంటిని గురువారం(నవంబర్ 13)  అర్ధరాత్రి దాటిన  తర్వాత  భద్రతా దళాలు పేల్చివేశాయి. పేలుడు పదార్థాలు ఉపయోగించి అతడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి.  ఉమర్ నబీ  తన నివాసాన్ని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా చేసుకోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.  కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో భాగంగానే డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు.   అలాగే ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. సోమవారం (నవంబర్ 10)న జరిగిన ఢిల్లీ పేలుడులో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ కారు నడిపి ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీయే అని దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి. ఆ పేలుడులో ఉమర్ నబీ కూడా మరణించాడు.  

జూబ్లీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యతతో కాంగ్రెస్

జూబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. అయితే బీఆర్ఎస్ కూడా హోరాహోరీ పోరాడినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యత కనబరిచిన కాంగ్రెస్ రెండో రౌండ్లో గట్టిగా పుంజుకుంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 9 వేల 926 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కు 62 ఓట్ల ఆధిక్యత లభించింది.  అయితే రెండో రౌండ్లో నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో ఆయన ఆధిక్యత 1,114కు పెరిగింది. 

అటవీ భూముల కబ్జా నిజమే.. కబ్జాదారుడు పెద్దిరెడ్డే!

ఎంత బుకాయించినా.. చేసిన పాపం దాగదు. నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములను కబ్జా చేశారన్న విషయం వీడియో ఆధారాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటపెట్టారు.  మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి క్రమ ఆక్రమణలు బహిర్గతంచేశారు. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు,  అటవీశాఖ మాజీ  మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ ప్రాంతంలోని 32.63 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారంటూ    డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం పవన్ కల్యాణ్ ఆటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే జరిపిన వీడియోను విడుదల చేసింది.   పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగానే డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసింది. అటవీ శాఖ  మాజీ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారింది? తదితర విషయాలను తనకు నివేదించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  ఈ కబ్జా వ్యవహారంలో  ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను నిర్దేశించారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నఅధికారులు, వెంటనే అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పవన్ కల్యాణ్ కు తెలిపారు. అలాగే ఆక్రమణలు తొలగించి ఆ భూమిని  స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామనీ వివరించారు.    ఇలా ఉండగా పవన్ కల్యాణ్ ఆరోపణలను వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు.  తాము అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించ‌లేద‌నీ, వాటిని   కొనుగోలు చేశామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే తాము భూములు కొనుగోలు చేశామ‌న్నారు. వీటికి సంబంధించి త‌మ‌కు అన్ని ర‌కాల హ‌క్కులు ఉన్నాయ‌న్న మిథున్ రెడ్డి, ఆన్‌లైన్‌లో స‌ర్వే నెంబ‌ర్ల వారీగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌న్నారు. అటవీ భూములను తాము ఆక్రమించుకున్నట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  అలా నిరూపించలేకుంటే.. తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  త‌మ కుటుంబాన్నిఅప్రతిష్ఠ పాలు చేసేందుకే పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.   అయితే మొత్తంగా పవన్ కల్యాణ్ బయటపెట్టిన విషయాలు ఒక్కసారిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలను ఉలిక్కిపడేలా చేశాయి. అటవీ ప్రాంతంలో భూములు వారసత్వంగా ఎలా వస్తాయనీ, ఒక వేళ వాటిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నా, అందుకు అటవీ చట్టాలు అనుమతించవనీ తెలిసిందే. వాస్తవానికి  ఈ విషయంలో గతంలోనే విచారణ చేసిన అధికారులు కబ్జాను గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే తీసి మరీ పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాను వీడియోలు తీసి మరీ బయటపెట్టారు.  అయితే పవన్ ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి కబ్జా చేయలేదని చెప్పకుండా రుజువు చేయాలంటూ సవాల్ విసురుతున్నారు.  అయితే మిథున్ రెడ్డి ఖండనను, సవాల్ ను తోసిపుచ్చుతూ అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల కబ్జా వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. అలా కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకున్నామనీ, విచారణ కొనసాగుతోందనీ ప్రకటించారు.  

భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి

విశాఖలో భాగస్వామ్య సదస్సు ఆరంభమైంది.  విశాఖ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.  ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.  ఈ సదస్సులో రాష్ట్రానికి దాదాపు  10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు, సంస్థలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.   రెండు రోజులపాటు  32 సెషన్లుగా ఈ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.    గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి లోకేశ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, పర్యాటకం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై చర్చలు జరుగుతాయి.  ఇలా ఉండగా తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్​గా ప్రారంభిస్తారు. ఉదయం 11-30 నుంచి 7:30 వరకూ ఏకకాలంలో పాతిక సెషన్లు జరుగుతాయి. రాత్రి 8-30 నుంచి హోటల్ రాడిసన్ బ్లూ రిసార్ట్​లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

బీహార్  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కాగా రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతలలోనూ కూడా భారీ ఓటింగ్ నమోదైంది. అత్యధిక ఓటింగ్ తమకే అనుకూలమని ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన మహాఘట్ బంధన్, ఎన్డీయే కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  తొలి దశలో 121 సీట్లకు, మలి దశలో 122 సీట్లకు పోలింగ్ జరిగింది.  

జూబ్లీ బైపోల్ కౌంటింగ్ షురూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది.  సుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో  ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు షురూ అయ్యింది. నియోజకవర్గ పరిధిలోని  407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో  పాల్గొన్నారు. జూబ్లీ బైపోల్ లో 48.49శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  అత్యధికంగా బోరబండ డివిజన్ లో 55.92 శాతం పోలింగ్ జరిగితే.. అత్యల్పంగా  సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రక్రియను మొత్తం పది రౌండ్లలో పూర్తి చేయనున్నారు. గంట సేపటిలోగా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం రెండు గంటలకల్లా తుది ఫలితం వెల్లడౌతుందని అంచనా.   ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు.  పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు  ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యే ఉంది.  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత రంగంలో ఉన్న సంగతి విదితమే. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.  

భాగస్వామ్య సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వరద

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుండగా, అందుకు ఒక రోజు ముందే అంటే గురువారం (నవంబర్ 13) దాదాపు 35 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి దాదాపు మూడులక్షల  66 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.  అలాగే ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో నెలకొల్పనున్న పరిశ్రమలలో దాదాపు లక్షా 26 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు   ఏబీసీ క్లీన్‌టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో   1,10,250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది.  అలాగే 13,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే రీన్యూ పవర్ కంపెనీ పాతిక వేల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా పది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి.   రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  17 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో సంస్థను ఏర్పాటు చేయానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా 11 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  ఇక రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్ల రూపాయలు,  3250 మందికి ఉద్యోగ అవకాశాలు, నవయుగ ఇంజనీరింగ్ 2, 427 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్, 6300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  ఇంకా చింతా గ్రీన్ ఎనర్జీ,  ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ, ఇండోసోల్, షిర్డీ సాయి సంస్థలు కూడా ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.   అలాగే,   వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్,  స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా, విరూపాక్ష ఆర్గానిక్స్, అనంత్ టెక్నాలజీస్, ఏటీఆర్ వేర్ హౌసింగ్, లారస్ ల్యాబ్స్, మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్,  మల్లాది ఫార్మా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ఇంకా ఈజౌల్, కోరమండల్, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ జూల్,  మణిపాల్ గ్రూప్, బెర్జాయ గ్రూప్, అమరావతి లైఫ్ సైన్సెస్, మైసిటీ, వివెన్స్ గ్రూప్,  ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్, ఏస్ అర్బన్ డెవలర్స్, క్రౌన్ ఎల్ఎన్జీ, ఆర్సీఆర్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.అదే విధంగా ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్, ఐటీసీ ఫుడ్స్, గాడ్రేజ్ అగ్రో వెట్, బిస్లరీ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

పుణె నేషనల్ హైవైపై ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

పూణే, బెంగళూరు జాతీయ రహదారిపై   గురువారం (నవంబర్ 13) జరిగిన   ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  అతివేగంగా వెడుతున్న కంటైనర్ అదుపు తప్పి ఆరు వాహనాలను, మరో  కంటైనర్ ను ఢీ కొంది.   ఈ ఘటనతో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది.  సతారా నుండి ముంబై వైపు వెళుతున్న   కంటైనర్ బ్రేక్ ఫెయిలవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.  

కొండా సురేఖపై కేసును ఉపసంహరించుకున్న నాగార్జున

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినందున ఆమెపై తాను పెట్టిన క్రిమినల్ కేసును ఉపసం హరించు కుంటున్నట్లు  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కాగా గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సురేఖ్, నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువునకు నష్టం కలిగించాలన్న ఉద్దేశం కానీ తనకు ఎందమాత్రం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో పొరపాటు జరిగి ఉంటే అందుకు చింతిస్తన్నట్లు పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమ వేిదక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లోమంత్రి సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిపై విమర్శలు చేస్తూ.. నటుడు నాగార్జున కుటుంబంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.   ఆ వ్యాఖ్యలపై నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.   ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ బుధవారం (నవంబర్ 12) సోషల్ మీడియా వేదికగా గతంలో తాను నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకున్నారు. 

విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ

విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కోరారు.  శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన చంద్రబాబుతో నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు.   ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు.  ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపైనా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. స్వదేశీ నౌకా నిర్మాణం, సాంకేతిక అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.   అలాగే విశాఖ నగరం భవిష్యత్తులో అనేక అవకాశాలకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోందనీ,  ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటోందనీ చెప్పిన చంద్రబాబు..  ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం, నౌకాదళం కలిసి పనిచేయాలన్నారు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగానూ,  అత్యుత్తమ పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఇందుకు నౌకాదళం సహకారాన్ని కోరారు.  నేవీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన పెరిగుతుందన్నారు.   నౌకాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సీఎం హామీ ఇచ్చారు.