జగన్‌కు రాజధాని రైతుల అల్టిమేటం... రాజధానిపై ప్రకటనకు డిమాండ్...

రాజధాని రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఇప్పటికే అమరావతిపై నీలినీడలు కమ్ముకోగా, అసలు రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలతో అయోమయానికి గురవుతున్న రాజధాని రైతులు... అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి... రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడుతోన్న రాజధాని రైతులు... అసలు ప్రభుత్వ విధానమేంటో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రి బొత్స ప్రకటనలతో రైతులకు టెన్షన్ పట్టుకుంటే... ఇఫ్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని, అదీగాక పెద్దఎత్తున నిర్మాణం అవసరం లేదంటూ బుగ్గన ప్రకటన చేయటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అందుకే, ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అసెంబ్లీకి సమీపంలో... రాజధాని భూముల్లో దీక్షలు చేపడతామని రైతులు హెచ్చరించారు. ఒకరోజో రెండ్రోజులో కాదు... అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నిరసన తెలుపుతామని 29 గ్రామాల రాజధాని రైతులు ప్రకటించారు. రాజధానిపై రోజుకో ప్రకటన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. రాజధానిపై అభిప్రాయ సేకరణకు నిపుణుల కమిటీ వేయడాన్ని ఇప్పటికే హైకోర్టులో సవాలు చేసిన రైతులు....ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా అల్టిమేటం ఇచ్చారు. కమిటీ రిపోర్టుల పేరుతో రాజధానిని మారిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తాము భూములిచ్చింది పార్టీలకు కాదని, ప్రభుత్వానికని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ శీతాకాల సమావేశాల్లో సీఎం జగన్ ప్రకటన చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. మొత్తానికి బుగ్గన ప్రకటనతో రాజధాని రైతుల్లో మళ్లీ అలజడి రేగింది.

కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

  కృష్ణా జిల్లా బంటుమిల్లులో టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీనిపై బంటుమిల్లి సీఐ కేసు నమోదు చేశారు. పాత కక్షలతోనే ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారని సీఐ చెప్పారు. కృష్ణా జిల్లాలో బంటుమిల్లిలో నవంబర్  22న అర్ధరాత్రి వైసీపీ - టీడీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో ప్రధానంగా పొలానికి సంబంధించిన వివాదానికి టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీళ్లందరూ టీడీపీ వర్గానికి చెందిన అనుచరులని పోలీసులకు కూడా గుర్తించారు. వైసీపీకి చెందిన అనుచరులు దాడి చేశారని.. టిడిపి నేతలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశామన్నారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కృష్ణ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి గ్రామాల్లో ఉన్న టీడీపీ వర్గీయులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  

పరారీలో నిత్యానంద... ఇద్దరు మైనర్ బాలికలను బంధించాడని కేసు నమోదు

  వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో స్వామి నిత్యానంద దేశం విడిచి పారిపోయాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిత్యానంద కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణతో నిత్యానందపై కేసు నమోదైంది. ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలను బంధించారని వారి తల్లిదండ్రులు నిత్యానంద ఆశ్రమంపై ఫిర్యాదు చేశారు. గుజరాత్ కు చెందిన జనార్దన శర్మ తన కుమార్తెల కోసం చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిత్యానంద ఆశ్రమంలో ఉన్న జనార్దన శర్మ ఇద్దరు కూతుళ్లు కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఇంటికి రావడానికి నిరాకరించారు. తన కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనార్దన శర్మ. ఈ కంప్లయింట్ గుజరాత్ హై కోర్టు వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిత్యానందకు చెందిన సర్వజ్ఞ ఆశ్రమానికి పోలీసులు వెళ్లడంతో అక్కడ జరుగుతున్న భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. తమను బాగా హింసించారని.. పనిచేయాలని పదిరోజులకుపైగా ఒక ఫ్లాట్ లో అక్రమంగా నిర్బంధంలో ఉంచారని పోలీసులకు చెప్పారు బాధితులు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు చిన్నారులకు బంధ విముక్తి కల్పించారు. యోగిని సర్వజ్ఞ పీఠములో ఉన్న బాలికలను విడిపించిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్, అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం లాంటి ఆరోపణలతో నిత్యానంద శిష్యులైన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. నిత్యానంద దేశం విడిచి పారిపోయారని అనుమానిస్తున్న తరుణంలో ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఆయన ఎక్కడ ఉన్నాసరే వదిలే ప్రసక్తే లేదని గుజరాత్ పోలీసులు ప్రకటించారు. అవసరమైతే విదేశాలకు వెళ్లిన నిత్యానందను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖతో వివిధ విభాగాలకు సమాచారమిచ్చి నిత్యానంద కోసం వేట సాగిస్తున్నారు గుజరాత్ పోలీసులు.  ఆశ్రమం పేరుతో సెక్స్ పాఠాలు చెప్పడం.. అదేమంటే తానే భగవంతుడని బుకాయించటం నిత్యానందకు అలవాటు అయిపోయాయి. శిష్యులపై కన్నా శిష్యురాలు అంటే ఎక్కువ ప్రేమ చూపించి నిత్యానంద ఏకంగా సినీ నటి రంజితకే వలేశాడు. రంజితను శిష్యురాలిగా చేర్చుకొని మా ఆనందమయి అంటూ కొత్త పేరు పెట్టారు. ఆమెతో కలిసి ఆశ్రమంలో చేసిన రాసలీలలు టేపులుగా బయటకు రావడంతో నిత్యానంద గుట్టు రట్టైంది. 2010లో వెలుగులోకి వచ్చిన నిత్యానంద, రంజిత టేపులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అప్పట్లో పోలీసులు నిత్యానంద, రంజితను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో నిత్యానంద చెప్పిన విషయాలు మరింత చర్చ నీయాంశంగా మారాయి. తాను అస్సలు మగాడినే కాదని నిత్యానంద బుకాయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు జరపాలని పోలీసులు ప్రయత్నించారు. దీనికి అంగీకరించని నిత్యానంద కోర్టును ఆశ్రయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో చివరకు టెస్టులకు అంగీకరించాడు. నిత్యానంద పురుషుడేనని డాక్టర్ లు తేల్చడంతో మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. కొన్నాళ్ల పాటు జైలులో వున్న నిత్యానంద తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.  కొన్నిరోజులు గప్ చుప్ గా ఉండి మళ్లీ తన స్టైల్ పనులు మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం నిత్యానంద ఆశ్రమంలో యువతి శవం బయటపడటం సంచలనం రేపింది. యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఒకటి రెండు కాదు నిత్యానందపై పెద్ద సంఖ్య లోనే ఫిర్యాదులున్నాయి. అమ్మాయిల్ని అక్రమంగా నిర్బంధించడం వారిని రాసలీలల కోసం ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇద్దరు మైనర్ బాలికల సంగతి వెలుగులోకి రావడంతో విదేశాలకు పారిపోయాడు నిత్యానంద. చివరికి పిచ్చి వాడు అయ్యేలా ఉన్నడంటూ కొందరు.. వీడి పిచ్చితో చిన్న పిల్లలని బానిసలుగా చేసుకుంటున్నాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు అడ్డాగా డ్రగ్స్ దందా.. ఆ వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడని డౌట్!!

  గుంటూరులో డ్రగ్స్ కలకలం రేగింది. సౌదీ దేశస్తుడు షాజీ నల్లపాడు సమీపం లోని ఓ అపార్టుమెంట్ లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకొని అందులో డ్రగ్స్ తయారు చేస్తూ ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు. దీని పై సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్ మెంట్ కి వెళ్లి షాజీని అదుపు లోకి తీసుకున్నారు. షాజీ ఫ్లాట్ లో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు బొమ్మ చేతులు, గ్లౌజులు, ముఖం మాస్కులు దొరికాయి. నిందితుడు ఇక్కడ ఎన్నాళ్ల నుంచి ఉంటున్నాడు? ఎప్పటి నుంచి డ్రగ్స్ తయారు చేసి ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. అతనికి ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఇక షాజీ వాడే ఖరీదైన స్పోర్ట్స్ బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి ముందువైపు కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ ప్లేట్ ఉండగా వెనకాల నెంబర్ ప్లేట్ లేదు. అంతేకాదు బైక్ పెట్రోల్ ట్యాంక్ పై జగన్ స్టిక్కర్ అతికించి ఉంది. షాజీ జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దాంతో పోలీసులు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఆయనకు.. షాజీకి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై కుపీలాగుతున్నారు.

కేసీఆర్ కు తలనొప్పి...  నియోజకవర్గానికి రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ తమ్ముళ్లు

  టీఆర్ఎస్ లోకి ఈ మధ్య చాలా మంది నేతలు జంపయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిన చోట కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీ లోకి వచ్చిన నేతలు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నించడంతో అసలు సమస్య మొదలైంది. అసలే పదవులు లేక పరేషాన్ అవుతున్న పాత నేతలని పట్టించుకోక పోవడంతో నియోజక వర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో.. కమిటీల్లో.. పాత ఎమ్మెల్యేలను లెక్కలలోకి తీసుకోకపోవడంతో వర్గపోరు జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ మధ్య జూపల్లి వర్గాన్ని చీల్చి తన బలాన్ని పెంచుకోవాలని హర్షవర్దన్ ప్రయత్నం చేసినట్లు చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో జూపల్లి - హర్షల మధ్య చిచ్చు రాజుకున్నట్లు క్యాడర్ చర్చించుకుంటోంది. హర్షవర్ధన్ రెడ్డి , మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో చేరటం జూపల్లి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు కొల్లాపూర్ కోట వివాదం విషయంలో మాజీ మంత్రి బహిరంగ సభలు పెట్టి మరీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోట కథ వెనకాల ఎమ్మెల్యే వర్గీయుల ప్రమేయం ఉంది అన్నది జూపల్లి బ్యాచ్ వాదన. ఇక పాలేరు నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ యాక్టివ్ గా తిరుగుతున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉపేంద్ర వైపు వెళ్లకుండా తుమ్మల ఈ స్కెచ్ వేసినట్లు పార్టీలో ప్రచారం అవుతోంది. తుమ్మలపై ఉపేందర్ పార్టీ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఉపేందర్ రెడ్డి వర్గీయులు అవసరమైతే పార్టీ మారాలని వత్తిళ్ళు కూడా తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

బాబు, జగన్ అప్రమత్తంగా ఉండాలి... బోండా ఉమ కీలక వ్యాఖ్యలు

  భార్యను పేదరికంలో పరీక్షిస్తే... కష్టకాలంలో సహకరిస్తుందో లేక కాల్చుకు తింటుందో తేలిపోతుందని అంటారు. ఇక మనం దుఖంలో ఉన్నప్పుడే బంధువులను, స్నేహితులను, సన్నిహితులను పరీక్షించాలని, అప్పుడే ఎవరు హితులో... ఎవరు స్నేహితులో అర్ధమవుతుందని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే... మనిషి మనస్తత్వం... కష్టకాలంలోనే బయటపడుతుంది. రాజకీయాలకు వచ్చినా ఇదే సూత్రం వర్తిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే... నిజమైన విధేయులెవరో తెలుస్తుంది. 2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది బోధపడింది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా అర్ధమవుతోంది.  అయితే, రాజకీయాల్లో పార్టీలు మారడం అత్యంత సహజమే అయినా, కొందరు నేతలు వెళ్లిన తీరు, చేసిన విమర్శలు గుర్తుండిపోతాయి. అయినా కూడా పరస్పర రాజకీయ అవసరాల కోసం ఆయా పార్టీల అధినేతలు రాజీ పడుతూ ఉంటారు. అందుకే, చంద్రబాబు, జగన్ ఎవరూ అతీతులు కారు. కానీ, ఏ పార్టీ అధినేత అయినా, కొందరు లీడర్లపై గట్టి నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి నేతలు పార్టీని వీడినప్పుడు, ఘాటు విమర్శలు చేస్తున్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు ఆ పరిస్థితిని జగన్ ఎదుర్కొంటే... ఇప్పుడదే పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అయితే, అది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ముందుముందు ఇది ఇంకా తీవ్రంగా ఉండబోతోంది. అయితే, ఇలాంటి లీడర్ల విషయంలో అటు జగన్... ఇటు చంద్రబాబు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే, ప్రస్తుతం టీడీపీలో పరిస్థితిపై బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో స్ర్కాప్ బయటికి వెళ్లిపోతోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్నారని మండిపడ్డారు. ఇలా పార్టీలు మారుతున్న వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని బోండా ఉమ ఫైరయ్యారు. రేపు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే... మళ్లీ తెలుగుదేశంలో చేరి సొంత గూటికి వచ్చామంటారని అన్నారు. అధికారాన్ని బట్టి పార్టీలు మారే నేతల విషయంలో ఇఫ్పటికైనా చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పుడు వైసీపీ పచ్చగా ఉందని వెళ్తున్న నేతలంతా, ఎండటం మొదలుకాగానే మళ్లీ బయటికి వచ్చేస్తారని, అలాంటి లీడర్లను జగన్ కూడా నమ్మొద్దన్నారు.

చంద్రబాబు... జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారా? 

  చంద్రబాబు అండ్ లోకేష్ పై కొడాలి నాని మాటల తూటాలు కొనసాగుతున్నాయి. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతోన్న కొడాలి నాని... మరోసారి తన నోటికి పనిచెప్పారు. అసలు చంద్రబాబు, లోకేష్ పేరు ఎత్తుతూనే ముందొక తిట్టు... వెనుకొక తిట్టు జోడిస్తున్నారు. మంత్రిగా ఉంటూ అలా మాట్లాడటం తప్పు కాదా అంటే... దానికి సమాధానం చెబుతున్నారు. మరి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మంత్రులతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో తమను చంద్రబాబు తిట్టించలేదా అంటున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ, చింతమనేని... ఇలా పలువురు నేతలు... ఏకంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని, తనను బూతులు తిట్టారని, అప్పుడెందుకు వాళ్లను ప్రశ్నించలేదని రివర్స్ కౌంటరిస్తున్నారు.  అయితే, తాజాగా కొడాలి నాని మరో సీక్రెట్ ను బయటపెట్టారు. 2009లో తనకు, వల్లభనేని వంశీకి సీట్లు ఇచ్చింది చంద్రబాబు కాదని.... జూనియర్ ఎన్టీఆర్ అని కొత్త బాంబు పేల్చారు. తనకు, వల్లభనేని వంశీకి టికెట్లు ఇప్పించడానికి చంద్రబాబుతో ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేశాడని, అందుకే ఇప్పటికీ తాము ఎన్టీఆర్ కుటుంబానికి కృతజ్ఞతతో ఉన్నామన్నారు. అయితే, చంద్రబాబులాగా... తాము జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మాత్రం పట్టుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ చంద్రబాబు.... జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని అప్పటి పరిస్థితులను చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారన్న కొడాలి నాని.... ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకి ఉందా అంటూ సవాలు చేశారు. ఇక, జగన్ క్రిస్టియానిటీ విమర్శలపైనా కొడాలి డిఫరెంట్ గా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకివ్వాలో చంద్రబాబు చెప్పాలన్నారు. జగన్ ఒక మతానికో... ఒక కులానికో... ముఖ్యమంత్రి కాదని డిక్లరేషన్ ఇవ్వడానికి అన్నారు. అయినా, వెంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు... ఒక్కసారైనా... తిరుమల కొండపై గుండు చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఓటమిని జీర్జించుకోలేకే మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తిరుమల లడ్డూను మద్యాన్ని ఒకేలా పోల్చినందుకు... అలిపిరి దగ్గర కొండకు తల బాదుకుని క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.  

కన్నాకు రాజ్యసభ.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సుజనా చౌదరి!!

  ఏపీ బీజేపీలో మార్పులు రాబోతున్నాయని అంటున్నారు కమలనాథులు. వచ్చే నెలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు ముగుస్తాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడితో పాటు రాష్ట్రాలకు కూడా కొత్త సారథులు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏపీ కూడా కొత్త ప్రెసిడెంట్ వస్తారని తెలుస్తుంది. ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను రాజ్యసభకు పంపించి వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కేంద్ర మంత్రిని చేస్తారని కార్యకర్తల్లో టాక్. ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే ఆయన ప్లేస్ లో ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ కూడా వినిపిస్తుంది. అధ్యక్ష రేసులో బీజేపీలో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రెసిడెంట్ రేసులో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో పాటు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డికి పగ్గాలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది. యువతకు చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది.. సీనియర్లకూ మరోసార అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది.. అనే దానిపై అధిష్టానం వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం సుజనకు కేంద్రంలో బెర్తిస్తే అధ్యక్ష రేసులో కన్నా విష్ణువర్దన్ రెడ్డి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినెట్ బెర్త్ గానీ అటు ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో తీవ్ర పోటీ నెలకొంది. మరో నెలలో ఏపి బిజెపిలో మార్పులు మాత్రం ఖాయమని తెలుస్తుంది. కొత్త ఏడాదిలో కొత్త అధ్యక్షుడు వస్తారనేది మాత్రం గ్యారెంటీ. ఆయన ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

మూగబోయిన ప్రజాగాయకుడు... ఉద్యమానికి దూరంగా ఉండటానికి కారణమేంటి?

  గత ఆరునెలలుగా ప్రజాగాయకుడు గద్దర్ జాడ కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమం నుండి 2018 మహా కూటమి వరకు చాలా చురుగ్గా ఉన్నారు గద్దర్.  49 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే గద్దర్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న చక్కర్లు కొడుతుంది. ఉద్యమం అంటే ముందుండి.. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజ పరుస్తారు గద్దర్. ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఆర్టీసీ సమ్మెకు గద్దర్ ఎందుకు దూరంగా ఉన్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. గద్దర్ మౌనానికి కారణమేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ రాజకీయాలకు.. ప్రజా సమస్యలకు.. దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.  2018 ఎన్నికల టైంలో సోనియగాంధీ మొదలు చంద్రబాబు వరకు హేమాహేమీలతో సమావేశమవుతూ బిజీ బిజీగా గడిపిన గద్దర్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాకూటమి పరాజయం తరువాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం గద్దర్ సొంత పనుల్లో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికీ ఆయన లోకల్ లో ఎక్కువగా ఉండటం లేదంటున్నారు. కానీ ఆయన లేని లోటు మాత్రం సమ్మెలో స్పష్టంగా కనిపించిందని ఆయన అభిమానుల వర్షన్.

పేర్ని నాని పంచ్ లు... బాబు, లోకేష్, పవన్, సుజనాపై నిప్పులు...

  చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ పై మంత్రి పేర్ని నాని పంచ్ లు పేల్చారు. యూటర్న్ చంద్రబాబు.... మరోసారి యూటర్న్ తీసుకున్నారని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు.... ఇప్పుడు తామే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్‌.... దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌.... కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు తాము ప్రయత్నిస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దన్న బాబు.... ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు కూడా ఉండాలనడం యూటర్నే అన్నారు పేర్ని నాని. ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు అలాగే ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయని తాము మొదట్నుంచి చెబుతున్నామని అన్నారు.  అయితే, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.... మతం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే... బీజేపీ, శివసేన, ఎంఐఎమ్మే బెటర్ అన్నారు. కనీసం వాళ్లు... తాము తమతమ మతాల కోసం పనిచేస్తామని డైరెక్టుగా చెబుతారని, కానీ తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇక, బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. సుజనాచౌదరి... చంద్రబాబు ఏజెంటన్న పేర్ని నాని... ఇది బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే.... కాల్‌ డేటాను మీడియా ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు. ఇక, ఎప్పటిలాగే సుజనా... ఒక బ్యాంకుల దొంగ, మోసగాడు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.  

కేసీఆర్ మాస్టర్ ప్లాన్... ఆర్టీసీలో మొదలుకానున్న వీఆర్ఎస్ స్కీం!

  ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. స్టాఫ్ తగ్గించటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 50 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. యాభై శాతం ప్రైవేట్ రూట్లకు ప్రైవేటు బస్సులను తీసుకు వస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది అయిదు వేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకూ 10,400 ల బస్సులకు ఈ యాభైవేలమంది కార్మికులు పనిచేసేవారు. బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో విఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పై కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చు అనేది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత యాభైవేలమంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్ ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్సాహకంగా ఆర్టీసీ ఇచ్చే బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వం కూడా కొంత నగదును కలిపే అవకాశముంది. వాలెంటరీ రిటైర్ మెంట్ పథకాన్ని అమలులోకి తెస్తే అప్పటికప్పుడు కాకుండా ఒకట్రెండేళ్లలో సగం మంది ఉద్యోగులు తగ్గుతారని ఆర్టీసీ యాజమాన్యం అంచనా. ప్రభుత్వం వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే రిటైర్ మెంట్ దగ్గరగా లేదా మరో ఐదారేళ్ల సర్వీసున్న కొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  దీనిపై విమర్శలు రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వెనక ప్రతిపక్షాల రాజకీయ లబ్ది ఉందని అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఈ సమ్మె వల్ల ఆర్టీసి కోలుకోలేని ఆర్ధిక భారం మూటగట్టుకున్నదని ఇక ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమే అంటూ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించాలనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. అయితే యాభై శాతం మించకుండా ఉంటుందనేది సీఎం స్పష్టంగా చెప్తున్న మాట. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంస్థల్లో వీఆర్ఎస్ తీసుకొస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం లేదు.

ప్రమాదాలకు అడ్డాగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్.. కారు పడి మహిళ మృతి!

  హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి ఒక్కసారిగా  కిందపడింది. ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాదు.. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో సహా దాదాపు 8 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  ఫ్లైఓవర్‌పై మలుపు దగ్గర  స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించి నెల రోజులు కూడా గడవక ముందే.. ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. ఫ్లైఓవర్‌ డిజైన్‌లో లోపం, చాలా మలుపులు ఉండటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి  ప్రయోజనం చేకూర్చడం కోసం.. ఫ్లైఓవర్ డిజైన్‌లో హడావుడిగా మార్పులు చేసి నిర్మించడం వల్ల.. నిర్మాణంలో లోపాలు ఏర్పడి  ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంజాయి మత్తులో విద్యార్థులు... అమ్మడం కూడా మొదలుపెట్టారు!!

  విశాఖ ఏజెన్సీలో దట్టమైన అడవులు పచ్చని వాతావరణం ఘాట్ రోడ్లు పర్యాటక ప్రాంతానికే కాదు గంజాయి అక్రమ రవాణాకి కూడా విశాఖ ఏజెన్సీ అడ్డాగా మారింది. ఏజెన్సీ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్క పోలీసులు, మరో పక్క ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు ఎన్ని దాడులు చేసినప్పటికి  లాభం లేకుండా పోతుంది. గంజాయి పట్టకున్నట్లు ప్రతి రోజు వార్తలు వస్తున్నాయి. అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన వారు జైల్లో మగ్గుతున్నారు. ఇంత జరుగుతున్నా గంజాయి అక్రమ రవాణాను అక్రమార్కులు వదలటం లేదు.  ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా అనేది లాభదాయకమైన వ్యాపారం. అందుకే గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు వివిధ పద్ధతులను వాడుకుంటున్నారు. చివరకు విద్యార్థులకు పాకెట్ మనీ ఆశ చూపి విద్యార్థులతో గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నట్టు ఇటీవల పోలీసుల దాడుల్లో బయటపడింది. ఇది తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ ఎంజాయ్ లైఫ్ కు అలవాటు పడిపోయారు. కాలేజ్ కు వెళ్తున్న విద్యార్థులకు ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఉదయం ఇంట్లో కాలేజీకి వెళ్లిన విద్యార్థి రాత్రి ఏ సమయానికి వస్తాడో తెలియని పరిస్థితి తల్లిదండ్రులకు ఎదురైంది.  విద్యార్థులంతా ఒక చోట చేరుకొని సిగరెట్, కాఫీ, కూల్ డ్రింగ్ తాగుతూ చర్చలు పెట్టుకుంటారు. అక్కడితో ఆగకుండా వీకెండ్ అంటూ ప్రత్యేక పార్టీలు, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటారు. ఒక పక్క బిజీ లైఫ్ తో పాటు మరో పక్క ఎంజాయ్ మెంట్ ను కోరుకోవడంతో విద్యార్థులు అక్రమార్కుల చేతిలో అడ్డంగా బలవుతున్నారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది విద్యార్థులు ముక్లబ్ ఏజెన్సీ నుంచి గంజాయి తెస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారమందింది. దీంతో ఆ విషయం విద్యార్థులకు తెలిసిపోవడంతో గంజాయిని దారిలోనే పడేసి జాగ్రత్త పడ్డారు. పోలీసులకు పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని మార్గమధ్యంలోనే వదిలేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇదే విధంగా ఆరిలోవ పరిధిలో ఇంజనీరింగ్ డిస్ కంటిన్యూ చేస్తున్న ముగ్గురు విద్యార్థులు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు విక్రయిస్తూ పట్టుబట్టారు. ఇక తాజాగా ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సాగర్ లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణా స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో 30 ఏళ్ళలోపు వారే అధికంగా ఉన్నారని, అందులో విద్యార్థులు ఉన్నారని తేలింది.

పేరుకే రైతే రాజు... నీటినిచ్చే నది భూములను ఆక్రమిస్తున్న వైసీపీ నేతలు!

  ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ నిర్మాణం నదీ పరివాహక ప్రాంతంలో ఉందని పగలగొట్టించారు. నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ తన సొంతూరైన నెల్లూరు ఇరిగేషన్ స్థలాలు ఆక్రమిస్తే సహించేదేలేదని.. ఎవరు ఆక్రమించినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆక్రమించటానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. కానీ ఇటీవల కాలంలో నగర నడిబొడ్డులోనే అత్యంత విలువైన స్థలాల దురాక్రమణ పరంపర యథేచ్ఛగా సాగిపోతుంది. ఒక వైపు రైతులు, రైతు సంఘాలు, ప్రతి పక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు నీటి వనరుల శాఖ అధికారులు కొత్త చట్టాలు, జిఓలు కావాలంటున్నారు.  నెల్లూరు నగరం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ కాలానికి పూర్వమే పెన్నా నది నుంచి సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలు వంటివి ఉన్నాయి. నెల్లూరు ప్రజలు వ్యవసాయం చేయడం, ప్రధానంగా వరి పండించడంలో వారికి వారే సాటి. బ్రిటిష్ కాలంలో పెన్నానదిపై వారధిని నిర్మించి కాలువలని ఆధునీకరించారు. ఈ కాలువల ద్వారా లక్ష ఎకరాలకి అధికారికంగానే సాగు నీరు అందుతుంది. మిగులు నీటితో రైతులు మరో లక్ష ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. నగరం అభివృద్ధి చెందే కొద్ది.. మరీ ముఖ్యంగా 20 ఏళ్లలోనే కాలువల స్థలాలన్నీ కొందరు ఆక్రమించి పెదపాటి నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. 2015 లో భారీ వర్షాలు రాగా నగరమంతా మునకకు గురైంది. అందుకు ఆక్రమణలే అసలు కారణమని అందరూ నిర్ధారించారు, కొన్నింటిని తొలగించారు, ఇళ్లలో ఉండే వారికి పునరావాసం చూపి గత పాలకులు తొలగిస్తామన్నారు.  ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరిగేషన్ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్రమణలన్నీ తొలగిస్తామంటూ స్వయాన సీఎం జగనే ప్రకటించారు. అదే తరహాలో నీటి వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ కూడా ప్రకటనలు చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రైతుల ప్రభుత్వం అని, నీటి పారుదల ప్రాధాన్యమిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతుంటే..మరోవైపు అంత కంటే వేగంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

ప్లాస్టిక్ ఫ్రీ పెళ్లి... ఆదర్శంగా నిలిచిన మహబూబాబాద్ దంపతులు

  పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఈ పెళ్లి వేడుక వారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జంగాల నరేష్, దివ్య రేఖల కల్యాణం స్థానిక బాలాజీ గార్డెన్స్ లో బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన వారు అందరికీ అర్థమయ్యేలా ప్లెక్సీలు లేకుండా తెల్లటి బట్టపై ఫోటోలను అతికించారు. వచ్చిన వారందరికీ స్టీలు గ్లాసులలో మంచినీటిని అందించారు. ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు వేసి ఆహారాన్ని అందించారు. ఇది చూసిన వారందరూ పూర్వీకులు గుర్తుకొచ్చారని చెప్పుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని వివాహాన్ని ప్లాస్టిక్ రహిత వివాహంగా ఆహ్వానించామని అన్నారు. వివాహానికి వచ్చిన వారంతా ఇన్ స్పైరై ఎలాంటి విందులు వినోదాలలో ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగించకూడదనే సంకల్పంతో ఈ ఏర్పాటు చేశామని దీనికి అందరూ సహకరించాలని కోరారు. తన పెళ్లి వల్ల కొందరిలో అయిన ఆలోచన మొదలైందని పెళ్ళికుమారుడు బంధువు నవీన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా చేయటంలో ఎంతో సంతృప్తి నిచ్చిందని వచ్చిన వారంతా మాలాగా ప్లాస్టిక్ రహిత వేడుకలు నిర్వహిస్తే కనీసం కొంతమేరైనా ప్లాస్టిక్ నివారించినవారమవుతామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఈ వివాహ వేడుకను చూసైనా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేసి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని ఈ వేడుకకు వచ్చిన వారు అనుకుంటున్నారు.

ఒకే వేదికపైకి టీడీపీ, జనసేన, బీజేపీ.! జగన్ భయానికి కారణమిదేనా?

  తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజల మద్దతు ఉంటే... ఎంతమంది శత్రువులు ఏకమైనా... ఎదుర్కొనే శక్తి తనకుందంటూ జగన్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆర్నెళ్లు కూడా కాలేదు... అయినా ఎన్నికల హామీల్లో 80శాతం అమలు చేయడమే కాకుండా, 4లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, అయినా తనపై కుట్రలు పన్నుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని, అపనిందలు వేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఎంతమంది శత్రువులు ఏకమై తనపైకి వచ్చినా, ప్రజల ఆశీర్వాదముంటే అందర్నీ ఎదుర్కొంటానని, ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతానని వ్యాఖ్యానించడం వెనుక భవిష్యత్ రాజకీయం ఉందంటున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనలు... జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక, ఏపీలో ఎలాగైనా బలపడాలనుకుంటోన్న బీజేపీ కూడా వైసీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వివాదానికి మతాన్ని జోడించి ఇటు టీడీపీ, జనసేన... అటు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం వెనుక మత మార్పిడుల కుట్ర ఉందంటూనే, జగన్ క్రిస్టియానిటీని ఎక్కువగా హైలేట్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ... ఈ మూడు పార్టీల విమర్శలూ... దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మత కోణంలోనే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దాంతో, భవిష్యత్లో ఈ మూడు పార్టీలూ ఏకమైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ... ఈ మూడు పార్టీలకూ ఎవరి లక్ష్యాలు వాళ్లకున్నా, జగన్ ను ఎదుర్కోవడానికి ఒకే వేదికపైకి వచ్చే అవకాశముందంటున్నారు. అందుకే, ముమ్మడివరం సభలో ... ఎంతమంది శత్రువులు ఏకమైనా... ఎదుర్కొనే సత్తా తనకుందంటూ జగన్ ప్రత్యేకంగా నొక్కి చెప్పారని అంటున్నారు. ఇక, నిన్నమొన్నటివరకు బీజేపీపై అంత ఘాటుగా విమర్శలు చేయని వైసీపీ నేతలు... ఇటీవల కొంచెం డోసు పెంచారని, ముందుముందు టీడీపీ, జనసేనపై విరుచుకుపడినట్లే... బీజేపీపైనా నిప్పులు చెరుగుతారని అంటున్నారు.

ఆర్టీసీ సమ్మెను అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్న బీజేపీ!

  తెలంగాణలో ఇన్ని రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగినా ప్రభుత్వం ఆశించిన రీతిలో స్పందించలేదు. హై కోర్టు సైతం కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు సమ్మె విరమించక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు సహా సుమారు 50వేల మంది కార్మికులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిజెపి కేంద్ర పెద్దలు తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని కార్మికుల్లో అత్యధికులు విశ్వశించారు. ఏదో ఒక సందర్భంలో కేంద్రం చొరవ తీసుకుంటుందని భావించారు. సమ్మెకు అర్థవంతమైన ముగింపు పలికేందుకు దోహద పడుతుందని చివరి క్షణం వరకూ వారు నిరీక్షించారు. బిజెపి రాష్ట్ర నేతల మాటలు కూడా ఆర్టీసీ కార్మికులలో ధైర్యం నింపిన మాట నిజం. ఆర్టీసీ సమ్మె విషయాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక పంపుతున్నామని బిజెపి ముఖ్యనేతలు అడపాదడప ప్రకటన చేయడం గమనార్హం. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని కేంద్రం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయలేదన్న ప్రచారం సైతం కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేయడానికి దోహదపడ్డాయి. నిజానికి ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టటానికి త్రిసభ్య కమిటీని కమలం పార్టీ నియమించింది. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చారు. త్రిసభ్య కమిటీ వేయడంతో ఆర్టీసీ కార్మికులు ఆశలు మరింత చిగురించాయి. ఈ కమిటీ సభ్యులు తమ సమ్మెకు మద్దతుగా ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవని మాట ఇపుడు ఆర్టీసీ కార్మిక వర్గాల్లో వినిపిస్తుంది. తమ మనోధైర్యం సన్నగిల్లిన ప్రతిసారి ఆర్టీసీ కార్మికులు మాత్రం కేంద్రంలో అధికారం ఉన్న బిజెపిని తలచుకుని ముందుకెళ్తారు. సరైన సమయంలో ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందిస్తుంది. సమ్మె తీవ్రతను అమిత్ షాకు వివరిస్తున్నామని రాష్ట్ర బిజెపి పెద్దల మాటలు పై పూర్తి విశ్వాసం ఉంచడం వల్లనే ఆర్టీసీ కార్మికులు 47 రోజుల పాటు సమ్యను కొనసాగించగలిగారు అన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇదిలా వుంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె ద్వారా కార్మిక వర్గాల్లో బలం పెంచుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. కార్మికుల సమ్మెకు పరిష్కార మార్గం చూపితే 50 వేల మంది కుటుంబాలకు దగ్గరకావచ్చని కూడా కమలనాథులు అంచనా వేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించిన బలమైన ఆర్టీసి జెఎసి నాయకులు సైతం కాషాయ కండువా కప్పుకుంటారని వారు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది.  

అమరావతే ఏపీ రాజధాని... వైసీపీకి షాకిచ్చిన కేంద్రం... టీడీపీ మాటకు విలువ..!

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో అమరావతి పేరు లేకపోవడాన్ని... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో కేంద్రం స్పందించింది. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానమని, ఎందుకంటే అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధానే శంకస్థాపన చేశారంటూ  గల్లా చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని కదిలించాయి. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు. గల్లా అలా అడిగారో లేదో నెక్ట్స్ డేనే కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది.ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి మ్యాప్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్ ఇండియా... మ్యాప్‌ ను సరిచేసింది. అయితే, నవంబరు 8న కేంద్రం విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంపై విమర్శలు చెలరేగాయి. అన్ని రాష్ట్రాల రాజధానులను మ్యాప్ లో ప్రస్తావించిన కేంద్రం... ఏపీ కేపిటల్ అమరావతిని మాత్రం ఎందుకు విస్మరించదనే అనుమానాలు వచ్చాయి. అయితే, రాజధానిపై ఏపీలో గందరగోళం నెలకొనడం, కొత్త ప్రభుత్వం ఆలోచన ఏంటో తెలియకపోవడంతోనే అలా చేసిందేమోనని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ ఎంపీలు... మ్యాప్ అంశాన్ని పార్లమెంట్ ప్రస్తావించలేదు. అయితే, అనూహ్యంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్... మ్యాప్ వివాదాన్ని ప్రస్తావించడం.... కేంద్రం వెంటనే దాన్ని సరిచేసి... ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మళ్లీ మ్యాప్ ను విడుదల చేయడం సంచలనంగా మారింది. కేంద్రం విడుదల చేసిన మ్యాప్ తో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించినట్లే భావించాలి. అది కూడా టీడీపీ రిక్వెస్ట్ తర్వాత కేంద్రం మ్యాప్ ను సరిచేసి విడుదల చేయడమంటే అది వైసీపీకి దెబ్బగానే అనుకోవాలి. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా... మళ్లీ ఇఫ్పుడు టీడీపీ దగ్గరవుతుందనే మాట వినిపిస్తోంది. అందుకే, వైసీపీ కంటే టీడీపీ నేతల మాటకే కేంద్రం ఎక్కువ విలువ ఇస్తుందని అంటున్నారు.