లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠినచర్యలు:ఏపీ ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ నీలం సాహ్ని  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రమంతటా లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం జగన్‌ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి మార్చి 31వ తేదీ వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజా రవాణా వ్యవస్థ తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆటోలు, ట్యాక్సీలు సైతం నిలిపివేయాలని నిర్ణయించింది. ఆస్పత్రులకు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లేందుకు పరిమితంగా మినహాయింపు నిచ్చింది. రాష్ట్రాల మధ్య ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. నిత్యావసరాలు మినహా మిగతా దుకాణాలు, మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు 31వ తేదీ వరకూ మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు, గోదాములు ముందస్తు అనుమతితో పరిమిత సిబ్బందితో పని చేయాలని సూచించింది. మతపరమైన ప్రార్థనలు, పూజలు 31వ తేదీ వరకు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ 200 నుంచి 300 పడకల అత్యాధునిక చికిత్స సౌకర్యాలతో వార్డులు ఏర్పాటు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో పది మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పని సరిగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, మందులు లాంటి అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పించినట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటు రైతులు, రైతు కూలీలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్‌ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు, పోలీసులకు ప్రభుత్వం సూచించింది.

నాయుడు, జగన్ కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచించిన కె ఏ పాల్

* తెలంగాణా, ఆంధ్రా సి.ఎం. లకు  పాల్ బంపర్ ఆఫర్ * రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చని వారిద్దరికీ హితవు * ఎవరి విశ్వాసం ప్రకారం వారు దేవుడిని ప్రార్ధించండి : కె ఏ పాల్ * మత మార్పిడులకు తానేమీ ప్రయత్నించటం లేదని స్పష్టం చేసిన కె ఏ పాల్ * ఛారిటీ సిటీ, చిట్టి వలసల్లోని తన భవనాలను క్వారంటైన్ సెంటర్స్ గా వినియోగించుకోవాలని ఇద్దరు సి.ఎం . లకు సూచన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సి ఎం లకు ఆఫర్ ఇచ్చిన కె ఏ పాల్. చిట్టివలసల లోని తన పాతిక ఎకరాల భూమిలో -వంద పడకల భవనాన్ని క్వారంటైన్ సెంటర్ గా ఉపయోగించుకోవాలని కె ఏ పాల్ సూచించారు. తెలంగాణా లో ఛారిటీ సిటీ లో వెయ్యి ఎకరాలు-300 ఎకరాలలో ఉన్న భవనాన్ని కూడా క్వారంటైన్ సెంటర్ గా వినియోగించుకుని , కరోనా బాధితులకు బాసటగా నిలబడాలని కె ఏ పాల్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ మతస్తులైనా, వారి వారి మత విశ్వాసాల ప్రకారం దేవుని ప్రార్ధించాలని, ఎవరినీ మత మార్పిడి కోసం తానూ ఒత్తిడి చేయటం లేదనీ కె ఏ పాల్ స్పష్టం చేశారు. అమెరికా ఏడాది వ్యయం ఎంత ఉంటుందో, ఈ కరోనా దెబ్బకి అమెరికా ఆ మేరకు దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు నష్పోయిందనీ కూడా కె ఏ పాల్ చెప్పుకొచ్చారు. తెలుగు దేశం , బీ జె పీ , కాంగ్రెస్ ప్ఫటీల నాయకులకు కూడా కె ఏ పాల్ సుద్దులు చెప్పారు. భూకంపం సమయం లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన కె ఏ పాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రెస్ మీట్ పెట్టి  ఒక 'ఏకతా భావన ' తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కనిపిస్తే లోపలెయ్యండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు!

ఈ నెల 31 వ‌ర‌కు ఇంట్లో ఉంటారా? లేక జైల్లో ఉంటారో తేల్చుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిస్తున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని కేంద్ర‌ ప్రభుత్వం రాష్ట్రాల‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైన విషయాలకు తప్పితే, ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేవ‌లం 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాలంటూ లేటెస్ట్‌గా కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 425కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల నుంచి 18,383 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది.

రోడ్డు మీద క‌నిపిస్తే వెహిక‌ల్ సీజ్ చేస్తానంటున్న డీజీపీ

సోమవారం ఉదయం ప్రజలు ఎలాంటి భ‌యం లేకుండా, ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల్ని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు రోడ్లపైకి వాహనాలు రాకుండా ఉండాలని అత్యవసరమైతేనే రావాలని సూచిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు. రోడ్లపై వచ్చేందుకు బలమైన కారణం ఉండాలి. బైక్ మీద ప్రయాణించే వారు ఇద్దరు మాత్రమే వెళ్లాలి. కారులో వెళ్లాలనుకుంటే ఇద్దరికే పర్మిషన్. అత్యవసర షాపులు తప్ప అన్నీ బంద్. ప్రజలు సహకరించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించారు. వచ్చే 10-15రోజులు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చ‌రించారు. తెలంగాణలో ముప్పైకి పైగా కరోనా కేసులునమోదు కావడంతో సర్వత్రా అలర్ట్ ప్రకటించారు.

తెలంగాణలో కరోనా 2వ స్టేజ్ 30కి చేరిన కేసులు!

తెలంగాణలో కరోనా విశృంఖలంగా విస్తరిస్తోంది. సోమ‌వారం ఒకే రోజు మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరీంనగర్ లో ఒక పాజిటివ్ కేసు.. మరో రెండు హైదరాబాద్ లో నమోదైనట్టు తెలిపారు. దీంతో మొత్తం కేసులు 30కి చేరాయని బులిటెన్ లో తెలిపారు. ఈనెల 31వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని.. ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సోమవారం ఫ్రాన్స్ - ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులకు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. అలాగే 30 ఏళ్ల వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వీరికి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ లో మరో కేసు నమోదైంది. 23 ఏళ్ల కరీంనగర్ యువకుడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా బృందంతో ఇతడు కలిశాడు. వారితో కలిసి తిరిగాడు. తాజాగా చేసిన పరీక్షల్లో ఇతడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కలకలం రేగింది.

ఇళ్లు దాటాలనిపిస్తే ఇటలీని గుర్తు తెచ్చుకోండి..!

ఆ..! నేను బాగానే ఉన్నా. బయటకు ఎందుకెళ్లొద్దు అన్న నిర్లిప్తతకు తావివ్వొద్దు. *ఇటలీలో ప్రభుత్వం చెప్పినా తమ సన్నిహితులను కలుస్తూ గుమిగూడుతూ పరిస్థితిని పీకలమీదకు తెచ్చుకున్నారు.* *గుర్తుంచుకోండి!* మనం పాటించే స్వచ్ఛంద కర్ఫ్యూ కరోనాను అడ్డుకోవడానికి చేస్తున్న ప్ర‌య‌త్న‌మే. అయినా మీకు బ‌య‌టికి వెళ్ళి క‌రోనాను అంటించుకొని చావాల‌నిపిస్తే ఏ ట్యాంక్‌బండో చూసి చావండి. అంతే కాని మీ కుటుంబ‌స‌భ్యుల‌ను, ప‌క్కింటివారిని, మీ బ‌స్తీవారిని చంపాల‌నుకుంటే మీరు రోడ్డుమీద‌కు వెళ్లండి. వాస్త‌వ ప‌రిస్థితుల్ని తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. అర్థం కాక‌పోతో ఇట‌లీ లో బాధితుల వీడియోల‌ను చూడండి. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే *సంకల్పం* , *సంయమనం.* *ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి ప‌ని. ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలు దాటిపోయాయి. వారం రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలు దాటినా ఆశ్యర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టులా ఉంది. ఇటలీలోనైతే మరణ మృదంగమే మోగుతోంది. వయసు మళ్లిన వృద్ధులకు వైద్యం అందించలేమని ఇటలీ ప్రభుత్వమే చెప్తోందంటే పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ యువతి తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకింది. ఐసోలేషన్‌లో వేర్వేరుగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. తండ్రి చనిపోయాడు. ఈ సంగతి అతడి భార్యకూ తెలియదు. ఇంట్లో ఉన్న బిడ్డకు సమాచారం అందించారు. అయితే కనీసం తండ్రి ఆఖరి చూపునకూ నోచుకోలేని పరిస్థితి. పౌరులెవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ శాసనం. శ్మశాన వాటికకు తీసుకెళితే అక్కడా మృతదేహాల వరుస. ఏ సమయంలో విద్యుత్‌ దహనం చేస్తారో తెలియని ఆవేదన. అమ్మ బతుకుతుందో లేదోనన్న బెంగ. ఈ పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మన దేశం ఎంత భద్రంగా ఉందో తలచుకోండి. *మనమిలాగే సురక్షితంగా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మనముందున్న ఏకైక మార్గం.* *సామాజిక దూరం అనుసరించడం. పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవడం.* *కరోనా వైరస్‌ గాల్లో 3 గంటలు, రాగి పాత్రలపై 4 గంటలు, కార్డ్‌బోర్డులపై 24 గంటలు, స్టీల్‌ పాత్రలపై 2-3 రోజులు, ప్లాస్టిక్‌ పాత్రలపై 4 రోజులు బతికుంటుందని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌లో వచ్చిన పరిశోధన వెల్లడించింది.* కాబ‌ట్టి మీతో పాటు మీ కుటుంబాన్ని ఘోరాతి ఘోరంగా చంపాల‌నుకుంటే రోడెక్కండి.

క‌రోనా తెలుగుజనాలకు కామెడి అయిపోయిందా?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కామెడీ అయిపోయింది. అవును నిజంగానే కరోనా వైరస్ నిజం కామెడీగానే చూస్తున్నారు. మరి దాని తీవ్రత అర్థం అయిందో అర్థం కాలేదో తెలియదు గానీ సోషల్ మీడియాలో కరోనా వైరస్ మీద కామెడీ చేస్తూ జనాల్లోకి దాని సీరియస్ నెస్ వెళ్లకుండా కొందరు వెటకారంగా పోస్ట్ లు పెడుత‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరు, తెలంగాణాలో 27కు క‌రోనా బాధితుల సంఖ్య చేరింది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకపక్క జనాలు బయటకు వెళ్ళవద్దని ప్రభుత్వాలు అన్ని విధాలుగా చెప్తున్నా బయటకు వెళ్తే ప్రాణాలు పోతాయి అని చెప్తున్నా సరే ఎవరూ కూడా మాట వినే పరిస్థితి కనపడటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ చేస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మానకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తున్నా పొద్దున్నే వాకింగ్ మానడం లేదు. పిల్లలు ఆడుకోవడానికి మానట్లేదు. అలాగే ఆ పార్టీ, ఈ పార్టీ, కిట్టి పార్టీ లు అంటూ బయటకు వెళ్లడం. చిన్న చిన్న ఫంక్షన్ లో కూడా. అర్ధం చేసుకునే పరిస్థితిలో ఆంధ్ర‌తెలంగాణా జనాలు లేర‌ని బ‌య‌టి దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది. కరోనా వైరస్ గురించి ఇలాగే ఇటలీ తక్కువ అంచనా వేసి ఇప్పుడు నానా సంక నాకుతుంది. ఒకపక్కన ఇటలీలో వేలాదిమంది చచ్చిపోతున్నా ఇక్కడ మాత్రం ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించటం నిజంగా బాధాకరం. లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే "చాలా మంది లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ సూచనలను సీరియస్ గా ఫాలో కండి. నిబంధనలను కఠినంగా అమలయ్యేగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను" అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలొో మృతుల సంఖ్య 2 శాతంగా ఉంది. దయచేసి మీ జీవితాలను కాపాడుకోండి..మీ కుటుంబాన్ని రక్షించుకోండి.

ఇట‌లీలో కరోనా విలయతాండవం పిట్టల్లా రాలిపోతున్న జ‌నం!

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో మిగతా దేశాలకు ఇటలీ పరిస్థితి గుణపాఠం నేర్పుతుంది. ఇప్పటికే కోవిడ్-19 మరణాల్లో ప్ర‌పంచంలో అత్యధికంగా 5476 మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఆ దేశంలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు. ఇటలీలోని వేలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ను అదుపు చేయడం ఇటలీకి తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఆ దేశం సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. 60 వేల మంది కరోనా బారి పడగా.. 5476 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులోనే ఇటలీలో 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో... శవాలను ఖననం చేయడానికి కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఆ ప‌రిస్థితిని చూడ‌లేక ఇట‌లీ అధ్య‌క్షుడు భోరున విల‌పించారు. రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!! కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు. ఈ దృశ్యాల‌ను చూసైనా తెలుగు ప్ర‌జ‌ల్లో మార్పు రావాల్సి వుంది. నిర్భంగా బ‌య‌టికి రాకుండా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ఇట‌లీ నేర్పిస్తున్న గుణ‌పాఠం.

ఏపీలోని ప్రైవేట్‌ల్యాబ్‌ల్లో క‌రోనా టెస్ట్‌కు అనుమ‌తిలేదు!

NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఎపికి స్థానం ద‌క్క లేదు. CMR మార్గదర్శకాల ప్రకారం క‌రోనా పరీక్షలను నిర్వహించే సామర్థ్యం ఉన్న NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక్క ల్యాబ్ కు కూడా చోటు ద‌క్క‌లేదు. అయితే తెలంగాణాలో ఐదు ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్.ఎ.బి.ఎల్. అనుమ‌తిచ్చింది. ఉన్న‌త‌స్థాయి ప్ర‌మాణాలున్న ల్యాబ్‌ల‌కే ఎన్.ఎ.బి.ఎల్‌. గుర్తింపు ఇస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న క‌రోనా టెస్ట్ ల్యాబ్‌ల వివ‌రాలు ఇలా వున్నాయి. 1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, 3. జిఎంసి, అనంతపురం. 4. విజ‌య‌వాడ సిద్ధార్థ కాలేజ్ ఈ నాలుగు చోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ శాంపిల్‌ను పరీక్షించిన అనంతరం వచ్చిన ఫలితాలను నిర్ధారించేందుకు పూణేలోని నేషనల్‌ వైరాలజీ లేబొరేటరీకి పంపించేవారు. అక్కడ నుంచి రిపోర్టులు రావడానికి మూడు రోజుల సమయం ప‌ట్టేది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను నిర్ధారించే రియల్‌ టైం పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పరికరం ఏర్పాటు చేసింది. కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ విజయవాడ ల్యాబ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇక్కడకు ప‌రీక్షిస్తున్నారు. ఇక్కడి ఫలితాలు, పూణే ఫలితాలు సరిగా ఉన్నట్లు తేల‌డం వ‌ల్ల పూణే ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం లేకుండానే విజయవాడ ల్యాబ్‌లోనే పరీక్షలు నిర్వహించి కేవ‌లం ఆరు గంటల్లోనే రిపోర్టు ఇవ్వగలుగుతున్నారు. తద్వారా రోగికి అవసరమైన చికిత్స సత్వరమే అందడానికి వీలవుతుంది. కరోనా సోకిన వ్యక్తికి రోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఎంత త్వరగా కనుగొంటే అంత రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే టెస్టులు పూర్తి చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం విజ‌య‌వాడ‌లో వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కేవ‌లం గాంధీ మెడికల్ కాలేజ్‌లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే 5 ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌డానికి అక్క‌డి ల్యాబ్‌ల‌కు అనుమ‌తి ల‌భించింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రైన ప్ర‌మాణాలు లేక‌పోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రైవేట్ ల్యాబ్‌ల‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ల‌భించ‌లేదు.

కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా?

* పంచాయతీ భవనాలకు వై సి పీ రంగులు వేయడం పై సుప్రీమ్ ఆగ్రహం * హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏ.పి . ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేత సుప్రీమ్ కోర్టులో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఏ.పి . ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.  కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది .  హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10 వ తేదీన షాక్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.  గవర్నమెంట్ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడంపై కీలక తీర్పు వెలువరించింది. వెంటనే పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి పది రోజుల్లోగా మళ్లీ రంగులు వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైసీపీ జెండా రంగు తరహా రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను రద్దు చేసింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది.  

కరోనా దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్ !

  స్టాక్ మార్కెట్ నేలచూపులు మొదలెట్టింది.  2,600 పాయింట్ల నష్టంతో ఈ రోజు ట్రేడింగ్ మొదలైంది. పలు దేశాల్లో లాక్ డౌన్ తో వృద్ధి తగ్గే ప్రమాదం. 8 శాతానికి మించి పడిపోయిన సెన్సెక్స్. నిఫ్టీ-50లో అన్ని కంపెనీలూ నష్టాల్లోనే. కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్ ను ఇంకా వీడలేదు. పలు దేశాల్లో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందంటూ వచ్చిన విశ్లేషణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్ సరళి, నేటి ఆసియా మార్కెట్ల నష్టాలు కూడా ప్రభావం చూపడంతో, ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభమైన క్షణాల వ్యవధిలో 2,600 పాయింట్లకు పైగా నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, ఈ ఉదయం 9.40 గంటల సమయంలో 2,460 పాయింట్ల నష్టంతో 8.23 శాతం పడిపోయి, 27,456 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 679 పాయింట్ల నష్టంతో, 7.77 శాతం దిగజారి, 8,066 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి.  బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర కంపెనీలు 10 శాతానికి మించి పతనమయ్యాయి. నేటి ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, నిక్కీ మాత్రమే 1.77 శాతం లాభంలో ఉంది. స్ట్రెయిట్స్ టైమ్స్ 7.30 శాతం, హాంగ్ సెంగ్ 3.75 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.49 శాతం, కోస్పీ 4.07 శాతం, సెట్ కాంపోజిట్ 6.13 శాతం, జకార్తా కాంపోజిట్ 3.61 శాతం, షాంగై కాంపోజిట్ 1.60 శాతం నష్టపోయాయి.

రాజధాని ప్రాంతం లో ఇతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్టే

రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి  ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది.రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని రైతులు  హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. అయితే ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని కోర్టు కి తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది. దీనిపై తీర్పును లోగడ రిజర్వ్ చేసిన హైకోర్టు, నేడు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

నైతిక విలువలుంటే, నీలం సహానీ రాజీనామా చేయాలి: సి పి ఐ నేత రామకృష్ణ

ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. " బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.  ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతోంది. మన దేశంలో 2వ దశలో ఉంది. మరో వారం రోజుల్లో 3వ దశకు చేరుకుంటుందని, అలా జరిగితే పెను విపత్తే సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కరోనా తీవ్రతను గుర్తించిన కేంద్రం 75 జిల్లాలలో లాక్ డౌన్ ప్రకటించింది. అందులో మన రాష్ట్రానికి చెందిన విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలున్నాయి. కరోనా ప్రభావం ఏపీలో 3 వారాల పాటు ఉండదని ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు. మీ లేఖని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల కమీషన్ స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఏపీలో జరిగేదికాదు," అంటూ రామకృష్ణ చీఫ్ సెక్రెటరీ కి రాసిన లేఖలో సుదీర్ఘంగా వివరించారు . కరోనా తీవ్రత పెరిగి ప్రపంచంలో అభాసుపాలయ్యేవాళ్ళమన్న ఆయన,  నిన్నటి నుండి నేటి వరకు పోలింగ్ ఏర్పాట్లు జరిగి ఉంటె , బారులు తీరిన ఓటర్లకు కరోనా సోకి లక్షలాది మంది వ్యాధి బారినపడేవారు. దీనికంతా మీరే కారకులై ఉండేవారు. అసలు ఎవరి సలహా ప్రకారం 3 వారాలపాటు కరోనా ప్రభావం ఉండదని ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారంటూ రామకృష్ణ చీఫ్ సెక్రెటరీ ని నిలదీశారు. లేదంటే మీ పదవి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా లేఖ రాశారా? ఒక చారిత్రక తప్పిదానికి మీరు మూల కారణమయ్యేవారు. ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇంట్లో ఉన్నంత మాత్రాన కరోనా రాదా?

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్ల వద్దనే ఉండాలని, ఏదైనా అత్యవసరమైతేనే బయటకు రావాలని.. అది కూడా కుటుంబానికి ఒక్కరు చొప్పునే బయటకు రావాలని ప్రభుత్వాలు సూచించాయి. ఇదంతా బానే ఉంది కానీ, మనం ఇంట్లో ఉన్నంత మాత్రాన కరోనా రాదా?. మనం ఇంట్లో ఉన్నా వైరస్ సోకే అవకాశాలున్నాయని అంటున్నారు. మనం ఇంట్లో ఉన్నాం కదా, మనకేం కాదని నిర్లక్ష్యం ఉండకూడదని.. ఇంట్లో ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   ఇంట్లో ఉన్నా కూడా.. కూరగాయలు, పాలు మరియు కొన్ని నిత్యావసరాలు బయట నుండి తెచ్చుకునే అవకాశముంది. కావున, కూరగాయలు శుభ్రంగా కడగాలి. పాల ప్యాకెట్ కూడా చేతులకి గ్లౌజ్ వేసుకొని తాకాలి. కొందరికి పాల ప్యాకెట్ ని నోటితో కత్తిరించే అలవాటు ఉంటుంది. అలా కాకూండా, చాకు లేదా కత్తెరతో కత్తిరించాలి. రోజుకి రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయాలి. వీలైనన్ని సార్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఉతికిన బట్టలనే ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే.. తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు.. కర్చీఫ్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతిని అడ్డుపెట్టుకుంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి. న్యూస్ పేపర్ అలవాటు ఉన్నవారు కొన్నిరోజుల పాటు ఆ అలవాటుని మానుకుంటే మంచిది. లేదా చేతికి గ్లౌజులు వేసుకొని పేపర్ తాకాలి. ఇలా ఇంట్లో ఉన్నా సరే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట నుండి తెచ్చుకునే వస్తువులను తాకేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అప్పుడే వైరస్ బారిన పడకుండా ఉంటాం.

మోత మోగిపోతున్న కూరగాయల ధరలు... కిలో బెండ కాయలు 120 రూపాయలు..

    * అధిక ధరలపై సి.ఎం. కె సి ఆర్ హెచ్చరికలు బేఖాతర్ * పత్తా లేని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఇదెక్కడో సూపర్ మార్కెట్లలో అనుకుంటే పొరపాటే. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో ధరలు చుక్కలని తాకాయి... నిత్యావసరాలు, పాలు, కూరగాయల ను జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించినప్పటికీ, ఆ విషయం మీద నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి  కె సి ఆర్ మాట్లాడుతూ-నిత్యావసరాలు అధిక  ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ -గుడిమల్కాపూర్ మార్కెట్ లో వినియోగదారులను వ్యాపారులు  దాదాపుగా దోచేశారు. మొన్నటి వరకు కిలో 30 రూపాయలు పలికిన బెండకాయల ధర ఈ రోజు కిలో 120 రూపాయలు,  దొండకాయలు కిలో 90 రూపాయలు, బీర కాయలు కిలో 100 రూపాయలు, చిన్న కొత్తిమీర కట్ట 10 రూపాయలు, చిన్న పుదీనా కట్ట 40 రూపాయలు.... వంకాయలైతే ఏకంగా 110 రూపాయలు... నిజానికి, అక్కడి వ్యాపారులకు లేదా రైతులకు, ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది... కానీ, వారిని నియంత్రించటానికి , వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవటం తో అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచేశారు. కె సి ఆర్ సార్.. మీరు కొరడా ఝుళిపించారు సరే.. ఇక్కడి వ్యాపారాలు మాత్రం మీ మాట ఖాతరు చేయటం లేదు... ప్రజల జేబులను దోచేస్తున్నారు.. ఒక్కసారి మీరు నజర్ పెట్టండి.. వీళ్ళు లైన్ లోకి వస్తారంటున్నారు వినియోగదారులు..

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు మూసివేత

ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు . అమరావతి లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిపివేస్తున్నట్టు  ముఖ్యమంత్రి ప్రకటించారు. " నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి," అంటూ ముఖ్యమంత్రి సూచించారు .అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి. విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి  పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి,  ఏప్రిల్ 4వ తేదీన ₹1,000 విలువైన నిత్యావసర సరుకులు అందచేస్తామన్నారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు  విక్రయిస్తే వారిపై కేసులు పెడతామని సి ఎం హెచ్చరించారు. రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవున్నారు. తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి  వస్తోందని చెప్పిన సి ఎం, ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలని సి ఎం సూచించారు.

అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయండి

అత్యవసర సేవలు మినహా, తెలంగాణ అన్ని సేవలు బంద్! కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు అలాగే మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు సి.ఎం. తెలిపారు.  ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆయ‌న సూచించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు.  గర్భిణులను కంటికి రెప్పలా చూసుకుంటామని కేసీఆర్ చెప్పారు. వారి కోసం అమ్మ ఒడి వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు. ఒకే రోజు ఆదివారంనాడు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం తెలిపారు. వీరిలో  ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారని సి.ఎం. తెలిపారు. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 26కు పెరిగినట్లు తెలిపారు. అయితే.. బాధితులెవరికీ ప్రమాదమేమీ లేదని వివరించారు.