ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేస్తారా? లోకేష్‌

కోటిస్తాం.. చావడానికి మీరు సిద్ధమా? అంటూ వైసీపీ నేతలకు లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే అదే కోటి మీకిస్తాం… చావడానికి సిద్ధమా? అని ముఖ్యమంత్రి జగన్‌ను, మంత్రులను విశాఖ వాసులు, ఎల్జీ పాలిమర్స్ బాధితులు ప్రశ్నిస్తున్నారని లోకేష్ అన్నారు. విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. ప్రజల చావుకు కారణమైన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. పైగా అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారని.. కానీ ప్రశ్నించిన ప్రజలను మాత్రం అణిచివేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. పైగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంటూ మంత్రులు మదంతో మాట్లాడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని అక్కడి నుంచి తరలించాలని లోకేష్ డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీ నష్ట తీవ్రతను జగన్ దాచే ప్రయత్నం చేయడం తగదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విష వాయువుల విడుదల వల్ల జరిగే అనర్థాలకు వాస్తవాలే సాక్ష్యాలంటూ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు చంద్రబాబు. స్థానికుల ఆరోగ్యంపై విష వాయువులు చూపే ప్రభావం సహించలేనిదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కోటి రూపాయ‌లు ఇస్తే.. ఈ ఘటనను మరిచిపోవాలా? సి.ఎం.‌పై మండిపడ్డ స్థానికుడు

నగరంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ జరిగిన ఘటనలో ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి తీరుపై విశాఖకు చెందిన శ్రీనివాస్ పాత్రుడు అనే యువకుడు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన ఆరోజు మధ్యాహ్నం 2 గంటలపాటు ఫ్యాక్టరీ వద్ద ఉండి సమీక్షించామని చెప్పారు. ఆ రెండు గంటల సమయంలో స్టైరిన్ గ్యాస్ పీల్చుకోకుండా N-95 మాస్క్ కూడా ఆపలేపోయిందన్నారు. ఒక్క 2 గంటలకే అలాగుంటే.. అక్కడ 24 విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బందికి కనీసం మాస్క్‌లు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో విశాఖ వచ్చిన జగన్ ముందు ప్రజల వద్దకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లారని పాత్రుడు విమర్శించారు. ఆప్పత్రిలో బాధితులను పరామర్శించిన జగన్.. ఆయా గ్రామాలను పరిశీలించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ స్టైరిన్ ఇళ్లల్లో చిక్కుకుని అలాగే ఉందని, ఒక్కసారి చూడాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తే.. అందరూ ఈ ఘటనను మరిచిపోతారనే ఉద్దేశంతో ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? అని అన్నారు.  ముఖ్యమంత్రి మధ్యాహ్నం వచ్చి.. సాయంత్రం వెళ్లిపోయారు, బాధితులు, గ్రామాలు కోలుకునేవరకు విశాఖలో ఉండలేకపోయారని.. ఇది ఎంతవరకు న్యాయమని శ్రీనివాస్ పాత్రుడు ప్రశ్నించారు.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అన్ని జిల్లాల నాన్‌కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్‌ జేసీలుగా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనంతపురం జేసీ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  అధికారుల బదిలీ అయిన స్థానాలు.. ► శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్ ► శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు ► విజయనగరం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్ ► విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్‌ కుమార్ రావిరాల ► విశాఖపట్నం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి ► విశాఖపట్నం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు ►  తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా ► తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి ► పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి ► పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా ► కృష్ణా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత ► కృష్ణా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్‌ లోతేటి ► గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్‌ దినేష్‌కుమార్ ► గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి ► ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ ► ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్ ► నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్ ► నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి ► చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు ► చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య ► వైఎస్సార్‌ జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి ► వైఎస్సార్‌ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ ► అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్ ► అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి ► కర్నూలు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్ ► కర్నూలు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి

లాక్‌డౌన్-4 వుంటుందా? మ‌ళ్లీ సీఎంలతో ప్ర‌ధాని కాన్ఫరెన్స్‌!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. ఈ నెల 17న లాక్‌డౌన్-3 ముగియనున్న తరుణంలో మోదీ సీఎంలతో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా మోదీ ఇవ్వనున్నారు.  కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

నిబంధనలకు వ్యతిరేకంగా ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతిచ్చింది చంద్ర‌బాబే! మంత్రి క‌న్నాబాబు

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని మంత్రి కురసాల కన్నాబాబు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం నుంచి కింది స్థాయి వరకు అంతా వేగంగా స్పందించామని గుర్తుచేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘1998 లో మీరు సీఎం(చంద్రబాబు)గా ఉన్నప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే అప్పుడు మీరేం చేశారు?. నిబంధనలకి విరుద్దంగా ఎల్‌జీ పాలిమర్స్‌కు మీ హయాం(2015)లో విస్తరణకు ఎలా అనుమతులిచ్చారు?. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా 2023 వరకు ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతులిచ్చింది మీరు కాదా?. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే మానం ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు? నిబంధనలకు విరుద్దంగా అనుమతులివ్వడంపై ప్రశ్నిస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి శర్మకి ముందుగా సమాధానం చెప్పండి.  నిబంధనలను పట్టించుకోకుండా సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాలని డీ నోటిఫై చేసి మరీ ఎల్‌జీ పాలిమర్స్‌కు మీరు అప్పగించలేదా? జీవిఎంసీ పరిధిని ఎల్‌జీ పాలిమర్స్‌ వరకు పెంచినప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీ వల్ల ప్రజలకి ఇబ్బంది అని తెలీదా?  ఐఏఎస్‌ కమిటీలను ఎలా విమర్శిస్తారు? :  ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది. ఐఏఎస్‌లతో కూడిన ఈ కమిటీలను చంద్రబాబు ఎలా విమర్శిస్తారు. వారికేం తెలుసని అడగడం విడ్డూరంగా ఉంది.  చంద్రబాబు నియమించిన టీడీపీ కమిటీలో ఉన్న అచ్చెన్నాయుడు, చిన్నరాజప్ప, రామానాయుడు రసాయన శాస్త్రవేత్తలా? నగరంలో గెయిల్‌ ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చారో అందరికీ తెలుసు. పుష్కరాల తొక్కిసలాట వల్ల చనిపోయిన కుటుంబాలను ఎలా ఆదుకున్నారో ప్రజలందరికీ గుర్తుంది. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు’ అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

ఎక్కడున్నా పోలీసుల వలకు చిక్కక తప్పదు!

సోషల్‌ మీడియా ఫేక్‌ గ్యాంగ్‌లకు ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక   విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులేనని చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వలకు చిక్కక తప్పదన్నారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరించారు.

ఢిల్లీలో మరోసారి భూకంపం: రిక్టర్ స్కేల్ పై 3.4 తీవ్రత

ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో భూకంప కేంద్రం లాక్ డౌన్ ప్రకటించాక ఢిల్లీ ప్రాంతంలో మూడోసారి భూకంపం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది. నష్టం వివరాలు తెలియరాలేదు.  కాగా, భూకంప కేంద్రం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ మధ్యాహ్నం భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని వాతావరణ విభాగం తెలిపింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. గతంలో సంభవిం చిన రెండు భూకంపాల కేంద్రం ఒకే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది.

ట్రంప్ తీరు బాగోలేదు! ఒబామా

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ఒకరితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది.  కరోనాను ట్రంప్‌ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు. స్వార్థం, విభజన, ఇతరుల పట్ల ద్వేషం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయయని ఆయన అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా అసమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు.  కరోనా వంటి విపత్కర పరిస్థితులని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో నాకేంటన్న ధోరణితో, అందరితోనూ గొడవ పెట్టుకుంటున్న పాలకులు ఉండడం ఈ విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా అభిప్రాయపడ్డారు.

కరోనాతో న్యూమోనియే కాదు, హార్ట్ అటాక్ వ‌స్తోంది!

కరోనాతో శ్వాస సంబంధ సమస్యలతో పాటు హృదయ సంబంధ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గుండె కండరాలకు ఇన్ఫెక్షన్ వస్తోంద‌ని తాజా అధ్యయనాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ సోకితే న్యూమోనియా ఏర్పడుతుందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా హార్ట్ అటాక్ కు గురవుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ఈ మహమ్మారి వైరస్ గుండెను కూడా దెబ్బతీస్తోందని గుర్తించారు.  కేరళలో కరోనా కారణంగా సంభవించిన మొదటి మరణంలోనూ హార్ట్ ఫెయిల్యూర్ జరిగినట్టు వైద్యులు తెలుసుకున్నారు. కరోనా సోకితే శ్వాససంబంధ సమస్యలు ఏర్పడడం అనేది ప్రాథమిక లక్షణం. కానీ, కరోనా మరణాలు పెరిగే కొద్దీ ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. గతంలో హృదయ సంబంధ సమస్యలు ఉన్నా, లేకపోయినా... కరోనా సోకిన తర్వాత వారిలో గుండె పనితీరు కూడా ప్రభావితమవుతోందని వైద్యులు గుర్తించారు.  ముఖ్యంగా గుండె కండరాలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ కరోనా ఇదే తరహాలో దెబ్బతీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిలో 45 నుంచి 55 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్, ఆపై మయో కార్డైటైటిస్ సమస్యలు ఏర్పడినట్టు పరిశోధకులు తెలిపారు. ఈ తరహా గుండె సమస్యలు వచ్చిన కరోనా రోగుల్లో 3 శాతం మందే బతికి బట్టకడుతున్నారట.

పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో ఆందోళన 

12 మంది మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజి ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు. ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్‌లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు. మరో వైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌చేస్తూ ఈరోజు ఉదయం నుంచి పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం.. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో పరిశ్రమ వద్దే ఆందోళన కొనసాగిస్తామని ఐదు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నాయకులు ఎవరు వచ్చినా పరిశ్రమలోకి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప గ్రామాల్లోకి వచ్చి చూడటం లేదని వెంకటాపురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తాగునీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీలో మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం

మద్యం దుకాణాలు విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను మరో 13 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరుకు 2,934 దుకాణాలు మాత్రమే పనిచేస్తాయని.. మిగతా వాటిని మూసివేస్తున్నట్టు పేర్కొంది. మద్యపానాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను నెలకొల్పటమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపింది. అదనపు ఎక్సైజ్‌ రీటైల్ టాక్స్‌ పేరిట ధరలు పెంచినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వం ఇప్పటికే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వ్యక్తికి బీర్లు, మద్యం విక్రయాలను 3 సీసాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూంలను కూడా తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బార్ల సంఖ్యను 40 శాతం మేర కుదించి 530కి తగ్గించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

వ్యాక్సీన్ లేకుండానే కరోనా ఖతం! ట్రంప్ కొత్త భాష్యం!

'ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మళ్ళీ వాటి జాడ కనబడదని ..ప్రతిదీ మరణించినట్టే అది కూడా మరణిస్తుందని ట్రంప్‌ చెప్పారు. కరోనా వ్యాధి వ్యాక్సీన్ లేకుండానే ఖతమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ వైరస్ నశించాలంటే మనకు వ్యాక్సీన్ అవసరం లేదని.. ఇది అవసరమంటూ డాక్టర్లు చెబుతున్న దాన్ని తను నమ్మలేనని వ్యాక్సీన్ లేకుండానే కరోనా వ్యాధి నయమవుతుందని ట్రంప్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఒక కాలంలో ఈ వైరస్ లన్నీ నశించడం గ్యారంటీ అని ట్రంప్ 'జోస్యం' చెప్పారు. గ‌తంలో ట్రంప్ కరోనా వ్యాధి చికిత్సకు వ్యాక్సీన్ ఎంతయినా అవసరమని, బహుశా ఏడాదిలోగా ఇది మనకు అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాట మార్చి అసలు ఇది అవసరమే లేదని ఢంకా బజాయిస్తున్నారు.

అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి! అయ్యన్నట్వీట్స్

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడిని ఉద్ద్యేశించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అడిగిన వాడికి, అడగని వాడికి విశాఖ అంతా నాదే అని బిల్డప్ ఇచ్చాడు. కారులోంచి గెంటేయడం హఠాత్ పరిణామమే. ఆయన లేకుండానే విశాఖలో అన్నీ జరిగిపోవడం తట్టుకోలేక తీవ్ర ఫ్రాస్ట్రేషన్‌కి గురయ్యాడు. ఎవరిపై ఏడవాలో తెలియక చంద్రబాబు గారి నామ జపం చేస్తున్నాడు. ముందు తాడేపల్లి కలుగులో పబ్జీ ఆడుతున్న ఏ1ని నిద్రలేపు.. ప్రజలంతా బీచ్ రోడ్డులో పడుకుంటున్నారు సాయిరెడ్డి. నీ ట్వీట్లు చూస్తుంటే జగన్‌కి చేతకాదు రావాలి బాబు గారు, కావాలి బాబు గారు అన్నట్టు ఉంటున్నాయి. ఇంతకీ నువ్వేక్కడ ఉన్నావు. కారు దించేసారు అన్న అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి’’ అంటూ అయ్యన్నపాత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ!

మహా విషాదానికి కారణమైన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు అన్నివిధాల సహకరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని పేర్కొంది. వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కచ్చితమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎల్‌జీ పాలిమర్స్‌ వెల్లడించింది. స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక మద్దతు కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున విషవాయువు లీకావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన 300 మందిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గ్యాస్‌ లీకేజీ వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ. 50 కోట్లను విశాఖ కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఎల్‌జీ పాలీమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిన్న ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను ఈరోజు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన ప్రసాదరావు, జయరాం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిశీలించారు.

కళ్ల ద్వారానే వేగంగా వ్యాపిస్తున్న కరోనా!

క‌రోనాకు సంబంధించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు. కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే 100 రెట్లు వేగంగా కరనా వైరస్ దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఒక అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సురక్షిత చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇలా కంటి ద్వారా మ‌నిషిలోకి చొచ్చుకువెళ్ళ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

అరెస్ట్ లేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు సీఎం ఎక్కడ ఉన్నారు?: చంద్రబాబు ట్వీట్‌

సీఎం జగన్ ఎక్కడ ఉన్నారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఎల్జీ గ్యాస్‌ ప్రమాద బాధితుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ వాసులు రోడ్లపై నిద్రిస్తున్నారని, మృతుల బంధువులు శవాల పక్కన రోధిస్తున్నారని చెప్పారు. ఎల్జీ కంపెనీ పరిసర గ్రామస్తులు న్యాయం కోసం పోరాడుతున్నారని, ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ చేయలేదని, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

జూలైలో కరోనా ఉధృతంగా ఉంటుంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు. సకాలంలో స్పందించడం వల్ల కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేశారని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు. భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పించినంత మాత్రాన కరోనా వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని చెప్పారు. కరోనా కట్టడి చేసే లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.జూలైలో కరోనా ఉధృతంగా ఉంటుంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు. సకాలంలో స్పందించడం వల్ల కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేశారని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు. భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పించినంత మాత్రాన కరోనా వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని చెప్పారు. కరోనా కట్టడి చేసే లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.

మాంసం కోసం పోయి కరోనా తెచ్చుకోవద్దు: హరీశ్ రావు

కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే కరోనాతో సహజీవనం తప్పేటట్టు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఈరోజు గ్యాదరి బాల్ రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావుతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సాయం అందిందని చెప్పారు. సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని... మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అందరం కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొందామని అన్నారు.

అత్యవసర సరుకుల్లో మద్యం! మోదీస‌ర్కార్ నిబంధ‌న‌ల స‌డ‌లింపు!

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూనే మరో వైపు మద్యం అమ్మకాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనువెంటనే మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపేశాయి. ఏమైతేనేం! అత్యవసర సరుకుల్లో మద్యాన్ని చేర్చి మరీ అందుబాటులోకి తీసుకురావడం అత్యంత బాధాకరం. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అందక మానేసిన వారు దాదాపు సాధారణ సమాజ సభ్యులుగా మారిపోయారు. వారిలో 75 శాతం మద్యపాన ప్రియులు ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. పైగా మద్యపానం సేవించే వారిలో సాధారణంగానే వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. ఇది కరోనా వ్యాప్తి చెందేందుకే దారి తీస్తుంది తప్ప నిరోధించేందుకు ఏ మాత్రమూ ఉపయోగపడదు. ఉపాధి కోల్పోయి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ఈ లాక్‌డౌన్‌ సమయంలో మద్యానికి సరిపడా నగదు అందుబాటులో లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పోలీసు స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన రోడ్డు ప్రమాదాల కేసుల్లో 75 శాతం మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల జరిగినవే. సాధార‌ణంగా 20 నుంచి 25 శాతం మద్యపాన సంబంధిత మరణాలే వుంటాయి. సమాజంలో సగం కుటుంబాలు మద్యపానంతో చితికి పోతున్నవే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.2.5 లక్షల కోట్లు. అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. అయితే మద్యపానం ద్వారా సంభవించిన లివర్‌ క్యాన్సర్‌, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబెసిటీ, చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రయివేటు కార్పొరేట్‌ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను, ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.40,000 కోట్లు.