వైసీపీ ఎంపీలకు.... నిర్మల సీతారామన్ షాక్

  వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రైవేటీకరణ కాదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో మాత్రమే చేస్తున్నారని నిర్మల సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్తువకు లోనయ్యారు. ​ పీపీపీ అంటే ప్రైవేట్ కాదు: నిర్మల సీతారామన్ ​వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, "మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు. మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి?" అని సూటిగా అడిగారు. ​దీనికి సమాధానంగా, వైసీపీ ఎంపీలలో ఒకరైన, జగన్ బాబాయి సుబ్బారెడ్డి, "అవును, అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి" అని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్, "మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని 'ప్రైవేట్' అని ఎందుకు చెబుతున్నారు?" అని ప్రశ్నించారు. ​ఎంపీలు ఏదో చెప్పబోతుండగా, "పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం..." అని అన్న సమయంలోనే నిర్మల సీతారామన్ కలుగజేసుకున్నారు. "నో, నో. మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.. నిర్మల సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో, వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు.  

నెల్లూరు నెంబ‌ర్ గేమ్

  నెల్లూరు మేయ‌ర్ పై అవిశ్వాసం  పెట్టింది టీడీపీ. ఈ నెల  ప‌ద‌హారున ఈ అవిశ్వాస  తీర్మానం  జ‌రుగుతుండ‌టంతో.. అటు వారు ఇటు- ఇటు వారు అటు అనే నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.. ఇప్ప‌టి  వ‌ర‌కూ ఉన్న వారెంత‌?  లేని వారెంద‌రు? ఎవ‌రి  బ‌లాబ‌లాలేంటి? అన్న‌ది  ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు మారుతూనేఉన్నాయి. సంద‌ట్లో స‌డేమియాలా కొంద‌రు కార్పొరేట‌ర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీలోకి వెళ్లిన  ఐదుగురు వైసీపీ కార్పొరేట‌ర్లు ఇటు తిరిగి ఇటు వ‌చ్చేశారు. వీరిలో ఒక ఇద్ద‌ర్నిత‌మ పార్టీ అధినేత జ‌గన్ ముందు తీస్కెళ్లి  ప్ర‌వేశ పెట్టారు మాజీ మంత్రి అనిల్, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ప‌ర్వ‌త‌రెడ్డి. దీంతో గ‌ణాంకాల్లో తేడా వ‌చ్చింది. మ‌రో ఇద్ద‌రుగానీ టీడీపీని వీడిపోతే.. అవిశ్వాస‌మేవీగిపోతుంది. కానీ ఇక్క‌డే టీడీపీ మేజిక్ చేయ‌గ‌లిగింది.. జ‌గ‌న్ ని క‌లిసిన ఆ ఇద్ద‌రూ తిరిగి టీడీపీలోకి వ‌చ్చేసిన‌ట్టు వారే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. ఇంత‌కీ నెల్లూరు మేయ‌ర్ వ్య‌వ‌హారంలో అస‌లేం జ‌రిగిందో చూస్తే..  నెల్లూరు మేయ‌ర్ పొట్లూరి స్ర‌వంతిపై అవిశ్వాస  తీర్మానం ఎందుకు పెట్టారో చూస్తే.. నాలుగేళ్ల క్రితం  నెల్లూరు కార్పొరేష‌న్లో 54 డివిజ‌న్ల‌ను వైసీపీసొంతం చేసుకుంది. ఈ పార్టీకి  చెందిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి  శ్రీధ‌ర్ రెడ్డి కూట‌మిలోకి వ‌చ్చారు. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు శ్రీధ‌ర్ రెడ్డి  వెంబ‌డి న‌డిచారు. దీంతో మేయ‌ర్ భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ షాడో మేయ‌ర్ గా అధికారం చ‌లాయించాడు. అక్ర‌మాలు చేసి  ఫోర్జ‌రీ  కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో నెల్లూరు న‌యా అభివృద్ధి కోసం  కొత్త  పాల‌క వ‌ర్గాన్ని  ఎంపిక చేసేందుకు 42 మంది కార్పొరేట‌ర్లు సిద్ధ‌ప‌డ్డారు. మంత్రి నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని క‌లిసి  క‌లెక్ట‌ర్ అనుమ‌తి  పొందారు. చివ‌రికి అవిశ్వాస  తీర్మానం కోసం  రంగం సిద్ధ‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో క్వార్జ్  అక్ర‌మాల విచార‌ణ‌లో ఉన్న జిల్లా నేత‌లు, వారికి అండ‌గా ఉన్న గంజాయి బ్యాచ్ కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌లోభ  పెట్ట‌డం  ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయ‌డం ప్రారంభించారు. టీడీపీ లోకి వ‌చ్చిన వారిని బెదిరించ‌డంతో పాటు ప్ర‌లోభాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యం మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్యే  కోటంరెడ్డి దృష్టికి వెళ్ల‌డంతో.. వారీ విష‌యం సీరియ‌స్ గా తీస్కున్నారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే వారి వివ‌రాలివ్వాల్సిందిగా.. కోరారు. వారి డీటైల్స్ పోలీసుల‌కు అందించి క‌ఠిన  చ‌ర్య‌లు తీస్కోవ‌ల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడ‌క్క‌డి ప‌రిస్థితి  ఎలా త‌యారైందంటే.. ఇటు వైసీపీ అటు టీడీపీ వ‌ర్గాలు కార్పొరేట‌ర్ల  నివాసాల ముందు నిఘా ఏర్పాటు చేశారు. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దని వైసీపీ  చేయ‌ని  ప్ర‌య‌త్నం లేదు. మ‌రికొంద‌రు ఫోన్ల‌లోనే బేర‌సారాలు మొద‌లు పెట్టారు. ఏ కార్పొరేటర్​కి ఫోన్ చేసి బెదిరించినా వెంటనే సమాచారం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరగనున్న ప‌రిస్థితిలో మేయ‌ర్ ఎన్నిక‌ నగరంలో తీవ్ర‌ చర్చనీయంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వైసీపీ నేతలు ఎలాంటి ప్ర‌లోభాల‌ ప్రయోగాలు చేస్తారో వేచి చూడాలి. మేయర్​గా ఉన్న పొట్లూరి స్రవంతికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వ‌ర‌కే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. అంతే  కాదు త‌మ‌కంత‌టి సంఖ్యాబ‌లం లేదంటూనే లోలోప‌ల లోపాయికారీ బేర సారాలు ఆడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారేలా క‌నిపిస్తోంది.

రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ...సీపీ కీలక ఆదేశాలు

  ఫుట్​బాల్​ అభిమానులకు ఈ నెల 13న పండగే పండగ. ఎందుకంటే ఫుట్​బాల్​ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఉప్పల్​ స్టేడియం వేదిక కానుంది. అయితే మెస్సీ పాల్గొనే మ్యాచ్​లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు. క్రీడాకారుడు లియోనల్​ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మ్యాచ్​లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.  మెస్సీ ఫుట్​బాల్​ మ్యాచ్​ నేపథ్యంలో ఉప్పల్​ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి , మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.   శుక్రవారం (ఈ నెల 12) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.శనివారం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని... ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు.  మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని... ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు.  ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రత విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేంద్రం నిర్ణయం

  కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. యూపీఎ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏ’ పథకాన్ని 2006లో ప్రారంభించింది. జనాభా లెక్కలు-2027కు ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ బృహత్ కార్యక్రమానికి రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ‘కోల్  సేతు విండో’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం నూతన పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్  కొబ్బరి క్వింటాలుకు  400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి  క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.   

సీఎం రేవంత్‌ను కలిసిన ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్

  భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొ. అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న  అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయనను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు. 

రాష్ట్రపతి తెలంగాణ పర్యటన... మినిస్టర్ ఇన్ వైటింగ్‌గా మంత్రి సీతక్క

  శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో   రాష్ట్రపతి పర్యటకు మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ టెండర్లు, ప్రత్యేక వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.  

భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు

  భర్త వేధింపులు భరించలేక  భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు... రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.  అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.  కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి  కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.  మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...  

బిల్లులందు పురుష బిల్లులు వేర‌యా!

  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ గురించి మ‌నం వినే  ఉంటాం. అలాంటిదిపుడు జాతీయ పురుష క‌మిష‌న్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 6న రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లు ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే పురుషుల హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, వారి సంక్షేమం వంటి విష‌యాల్లో ఈ బిల్లు  వారికి ఎంత‌గానో ఉప యోగ‌ప‌డుతుంది.  ఇంత‌కీ పురుషుల హ‌క్కులు అంటూ ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు. మాన‌వ హ‌క్కులే పురుషుల హ‌క్కుల కింద‌కు వ‌స్తాయి. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కేటాయించేలాంటి  సీట్లు పురుషుల‌కంటూ ఉండ‌వు. ఇ ఇక రిజ‌ర్వేష‌న్ల‌లో ఓసీకంటూ ప్ర‌త్యేకించీ రిజ‌ర్వేష‌న్లుండ‌వు. ఎక‌నామిక‌ల్లీ బ్యాక్ వ‌ర్డ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాంటిదేన‌ని చెప్పాల్సి వ‌స్తుంది.  అయితే,  ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌స్తుతం మూడు ర‌కాల‌ జండ‌ర్లు త‌యారై కూర్చున్నాయి. ఒక‌ప్పుడు ఆడ మ‌గ మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు థ‌ర్డ్ జండ‌ర్ ఒక‌టి త‌యారైంది. ఇక పురుషుడు అంటే ఎవ‌రు? అత‌డ్ని ఎలాంటి గుణ‌గ‌ణాల కొద్దీ డిసైడ్ చేస్తారు? అన్న‌ది కూడా చ‌ర్చ‌నీయంశ‌మే. ఈ విష‌యాల‌పై ఈ బిల్లు ద్వారా ఒక క్లారిటీ రావ‌ల్సి ఉంది. పురుషత్వం అంటే ఏమిటి? అన్న‌ది  కూడా ఒక‌ డిబేట‌బుల్ పాయింటే. ఇటీవ‌లి కాలంలో పుంస‌త్వ స్థాయిలు విప‌రీతంగా ప‌డిపోతూ వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయి కొన్ని గ‌ణాంకాలు.  దానికి తోడు రాన్రాను ఫిమేల్ డామినేష‌న్ పెరిగి మేల్ ఢ‌మాల్ అంటున్న ప‌రిస్థితి కూడా ఉంది. స‌హ‌జీవ‌నాలు పెరుగుతున్న ఈ కాలంలో, ఎల్జీబీటీ కి హై ప్ర‌యారిటీ ఇస్తోన్న ఈ సంద‌ర్భంలో.. పురుషుల హ‌క్కులు ప్ర‌శ్నార్ధ‌క‌మే. ప్ర‌స్తుత యువ‌త‌రం మాట అటుంచితే.. వీరి తండ్రుల త‌రంలో చాలా మంది భార్యా బాధితులున్నారు. వీరిపైన రివ‌ర్స్ లో గృహ‌హింస వంటి త‌ప్పుడు కేసులు పెడుతుంటారు. ఇలాంటి వాటిలో పురుష  క‌మిష‌న‌న్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందేమో చూడాలి. ఆపై గ‌త ఐదేళ్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భ‌ర్త‌లు త‌మ త‌మ భార్య‌ల చేతిలో హ‌త‌మ‌య్యారు. అది కూడా వారి  వారి ప్రియుల సాయంతో ఆయా భార్యామ‌ణులు త‌మ  త‌మ భ‌ర్త‌ల‌ను చంపేసిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పురుష  క‌మిష‌న్ ఏదైనా పురుషుల‌కు  ర‌క్ష‌ణ క‌ల్పించ‌ గ‌ల‌దా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పురుషాధిక్య ప్ర‌పంచంగా పిలిచే ఈ స‌మాజంలో పురుషుల హ‌క్కుల‌కే ర‌క్ష‌ణ  లేకుండా పోవ‌డం కూడా తీవ్ర విషాద‌క‌రం. చ‌ర్చ‌నీయాంశం కూడా.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

  ఫోన్ ట్యాపింట్ ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావు ఇప్ప‌టి  వ‌ర‌కూ సుప్రీం ద్వారా  పొందుతోన్న తాత్కాలిక ర‌క్ష‌ణ  నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏసీబీ వెంక‌టగిరి ముందు లొంగిపోమ‌ని ఆదేశించింది సుప్రీం  కోర్టు. దీంతో ప్ర‌భాక‌ర్ రావుకు ఇదొక షాకింగా మారింది. అలాగ‌ని ప్ర‌భాక‌ర్ రావును ఫిజిక‌ల్ గా టార్చ‌ర్ చేయొద్ద‌నీ.. థ‌ర్డ్ డిగ్రీ అస‌లే ప్ర‌యోగించ‌వ‌ద్ద‌ని  పేర్కొంది  సుప్రీం కోర్టు. ఇంత‌కీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి?  దీని  పూర్వాప‌రాలు ఎలాంటివి? అన్న‌దొక చ‌ర్చ‌గా మారింది. ఆ విష‌యాలేంటో చూస్తే.. మార్చి 2024లో పంజాగుట్ట స్టేషన్‌లో ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదు న‌మోద‌య్యింది. కేసు నమోదు నాటికి అమెరికాలో ఉన్నారు ప్రధాన నిందితుడైన‌ ప్రభాకర్‌రావును దేశానికి రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు పోలీసులు. విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు  కూడా పంపించారు పోలీసులు. ఆరోగ్యం బాగోలేదని, ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక వస్తానంటూ సమాచారమిచ్చిన ప్రభాకర్‌రావు.. పోలీసులు ఇచ్చిన గడువు ముగిసినా హైదరాబాద్‌కు రాలేదు. దీంతో ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించారు పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌రావు 2025, మే 29న మూడు రోజుల్లో భారత్‌కు వచ్చి విచారణకు సహరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.  తాత్కాలిక పాస్‌పోర్ట్‌పై హైదరాబాద్‌కు వచ్చారు ప్రభాకర్‌రావు. 2025 జూన్ 9, న జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు ప్రభాకర్‌రావు. జూన్‌లో మొత్తం 6 సార్లు విచారణకు హాజర‌య్యారు ప్రభాకర్‌రావు. జూన్ 11, 15, 17, 19, 20 తేదీల్లో ప్రభాకర్‌రావు విచారణ జ‌రిగింది. విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించ లేదాయ‌న. పోలీసులకే రివర్స్‌లో వార్నింగ్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులోని ప్ర‌ధాన నిందితుడు ప్రభాకర్‌రావు. అన్ని రోజులు మీవే ఉండవనీ, మావి కూడా వస్తాయంటూ ప్రభాకర్‌రావు వార్నింగ్ పాస్  చేశారు.  ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇంతవరకూ జరిగిందేంటి? అని చూస్తే.. ఇంతవరకూ 270 మంది స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు. A1గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు కాగా, A2గా ఇంటెలిజెన్స్ మాజీ DSP డి.ప్రణీత్‌రావు, A3గా ఇంటెలిజెన్స్ మాజీ ASP N.భుజంగరావు, A4గా ఇంటెలిజెన్స్ మాజీ ASP M.తిరుపతన్న A5గా టాస్క్‌ఫోర్స్ మాజీ DCP T.రాధాకిషన్‌రావుగా ఉన్నారు. ఇక A6గా ఐన్యూస్ ఛానల్ ఎండీ A.శ్రవణ్‌రావు, కేసులో అరెస్ట్‌ అయిన వారందరికీ బెయిల్ రాగా.. ప్రభాకర్‌రావుపై 68 పేజీల ఛార్జ్‌షీట్ వేసింది సిట్.   ఫోన్ ట్యాపింగ్‌లో వాంగ్మూలం ఇచ్చినవాళ్లు ఎవ‌ర‌ని చూస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్‌, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, TRMES చైర్మన్ ఫయీమొద్దీన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డీ గద్వాల్ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్‌, పనిమనిషి చక్రధర్‌గౌడ్ వంటి వారున్నారు.  విచారణకు హాజరైన వాళ్లు ఎవ‌రో చూస్తే.. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు మాజీ సీఎం కేసీఆర్ OSD రాజశేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రభాకర్‌రావును ఎలాంటి ప్రశ్నలు అడ‌గ‌నున్నారో చూస్తే.. - ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఏ రాజకీయ నేతలు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారు?, రెండు ఐఫోన్లను అమెరికాలోనే ఎందుకు దాచిపెట్టి వచ్చారు?   హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయమని చెప్పిందెవరు?, ఎందుకు చెప్పారు?, SIB నుంచి మాయం అయిన హార్డ్‌డిస్క్‌లు ఎక్కడికి వెళ్లాయి?, రూల్ 419/419A ప్రకారం సంఘవిద్రోహ శక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి ఉండగా.. రాజకీయ నేతల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేశారు?  ఫోన్ ట్యాపింగ్‌పై రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రశ్నలు వేసే అవకాశం క‌నిపిస్తోంది. ఫైన‌ల్ గా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్స్‌కు హోం సెక్రటరీ, GAD ప్రిన్స్‌పల్ సెక్రటరీ, DGP అనుమతి ఇచ్చారా? అని ప్ర‌భాక‌ర్ రావును విచార‌ణాధికారులు అడిగేలా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే అస‌లు ప్ర‌భాక‌ర్ రావుకు ఈ క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే ఆయ‌న విచార‌ణ‌కు అస్స‌లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికి  తోడు ఆయ‌న ఐ క్లౌడ్ పాస్ వ‌ర్డ్ చెప్ప‌కుండా డేటా మొత్తం డిలీట్ చేసిన‌ట్టుగానూ తెలుస్తోంది. దీంతో సుప్రీం కోర్టు మీరు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు కాబ‌ట్టి  అరెస్టు ముప్పు కొని తెచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించింది.

లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్

  నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి, ముగ్గురినీ నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ  అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకు పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు.అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.  ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు..అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్. జయప్రకాశ్‌, షేక్‌ షాహుల్‌ హమీద్‌లపైనా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.  

కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ సంచలనం

  తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి?  పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.  విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.  రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.  

స‌రికొత్త సనాత‌న సార‌ధి.... సాయిరెడ్డి!?

  విజ‌య‌సాయి రెడ్డి హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నారా? ఎందుకీ మాట అనాల్సి వ‌స్తోంది? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  సాయిరెడ్డి స‌నాత‌న‌త్వం అని ఒక‌టి వెలుగు చూస్తోందా? ఇలా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంద‌ని చూస్తే ముచ్చ‌ట‌గా మూడు కామెంట్ల‌లో ఆయ‌న  ప్ర‌య‌త్నం, ప్ర‌యాణం, ప‌ద ప్ర‌యోగం ఏంటో చూడొచ్చు.. అందులో భాగంగా స్టెప్ వ‌న్.. ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న వైసీపీ  నుంచి అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి  పేరు ప‌దే ప‌దే చెప్పారు.  తాను రాజ‌కీయ స‌న్యాసం  త‌ర్వాత వ్య‌వ‌సాయం  చేస్తాన‌ని  చెప్పుకొచ్చారు. వీలుంటే  మీడియా సంస్థ పెడ‌తానేమోగానీ రాజ‌కీయాల్లోకి రాను. రాలేను. రాబోను.. అంటూ కుండ  బ‌ద్ధ‌లు కొట్టారు. క‌ట్ చేస్తే మ‌రో కీల‌క‌మైన కామెంట్ ఏం చేశారో చూస్తే.. సిక్కోలు గ‌డ్డ మీద నుంచి తాను ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. బీజేపీలో చేర‌బోతున్న మాట అవాస్త‌వ‌మ‌నీ.. అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అదే స‌మ‌యంలో ఆయ‌న అవ‌స‌ర‌మైతే పార్టీ పెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌న‌ని అన్నారు.  ఈ టైంలో ఆయ‌న చివ‌రాఖ‌రిగా అన్న మాట‌లేంట‌ని చూస్తే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు రెండు ద‌శ‌కాల‌కు పైగా  సాన్నిహిత్య‌ముంద‌ని ఒక చిన్న‌హింట్ ఇచ్చారు. సేనాని ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో త‌మిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రిగిన‌ మురుగ‌న్ మానాడుకు హాజ‌ర‌య్యారు.  నిన్న మొన్న  త‌మిళ కార్తీక దీపోత్స‌వం వ్య‌వ‌హారంలో తీర్పునిచ్చిన స్వామినాథ‌న్ అనే ఒకానొక జ‌డ్జిపై ఇండి కూట‌మి ఎంపీలు అవిశ్వాసం పెట్టే  య‌త్నం జ‌రిగింది. ఇలాంటి విష‌యాల్లో హిందుత్వ వాదుల వైపు పోరాడ్డానికి స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్యావ‌శ్య‌కంగా సెల‌విచ్చారు సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.  రీసెంట్ గా విజ‌య‌సాయి రెడ్డి  హిందుత్వ ప్రోగా అన్న మాట‌ల విష‌యానికి వ‌స్తే.. హిందూ దేవాలయాలపై ఒక‌ ట్వీట్ చేశారు. దీని సారాంశ‌మేంటో చూస్తే.. హైంద‌వ‌ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.. దేవాలయాలపై ప్రభుత్వ  నియంత్రణ- ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు.  ఇతర మతాలకు చెందిన ప్రార్ధ‌నాలయాలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయనీ.. అన్ని మతాలకు సమానత్వం కల్పించాలనీ కోరారు స‌రికొత్త స‌నాత‌న సార‌ధి సాయిరెడ్డి. రాజ్యంగ బద్ధంగా మతాల మధ్య సమానత్వం ఉండాలనీ.. ప్రస్తుత విధానాలను కేంద్రం పున:పరిశీలించాలనీ డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. హోంమంత్రి అమిత్ షా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని కూడా కోరారాయన. వీట‌న్నిటిని బ‌ట్టీ.. సాయిరెడ్డి పోక‌డ చూస్తుంటే హిందుత్వ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీలో చేర‌డ‌మా?  లేక స‌నాత‌నాన్ని భుజానికెత్తుకుని తిరుగుతోన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌డ‌మా రెండిట్లో ఏదో ఒక‌టి జ‌రగ‌డం ఖాయంగా తెలుస్తోందంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. ఎనీహౌ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫ‌ర్ యువ‌ర్ లేటెస్ట్ స‌నాత‌న సార‌ధ్యం అని మ‌నం కూడా ఓ శుభాకాంక్ష‌లు చెప్పి ఉంచుదాం. ఎప్ప‌టికైనా ప‌నికొస్తుందేమో చూద్దాం.

ర‌జ‌నీకాంత్‌కి చంద్ర‌బాబు....అంటే ఎందుకంత ఇష్టం!?

  ఏ ట్రిబ్యూట్ టు త‌లైవ అంటూ షారుక్ ఖాన్ త‌న చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగి డ్యాన్స్ పెట్టాడంటే.. ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన షారుక్ కి బాలీవుడ్ బాద్షా వంటి బిరుదులున్నాయి. అంటే ఆయ‌న మార్కెట్ ర‌జ‌నీ మార్కెట్ క‌న్నా ఎంతో పెద్ద‌ది. ఆయ‌న నెట్ వ‌ర్క్, నెట్ వ‌ర్త్ ఎంత లార్జ్ అయినా స‌రే ర‌జ‌నీకాంత్ కి ఎంత విలువ ఇచ్చారో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క‌.  ఇది ఎప్పుడో పాత‌కాలం ముచ్చ‌టే కాద‌న‌డం లేదు. కానీ ర‌జ‌నీకి బాబా సినిమా  కాలం నాటి నుంచే దేశ విదేశీ అభిమాన భ‌క్తులున్నారు. తొలి ద‌క్షిణాది  పాన్ వ‌ర‌ల్డ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంతంటే  అతిశ‌యోక్తి కాదేమో. అంత‌గా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన ఫ్యాన్ మెయిల్ ప్ర‌పంచ‌మంతా ప‌రిచేశారు. ఇక త‌మిళులు అధికంగా  ఉండే మ‌లేసియా, సింగ‌పూర్ లో ఆయ‌న అభిమాన‌గ‌ణం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. న‌ట‌న ప‌రంగా  క‌మ‌ల్ హాస‌న్  ని కొట్టే వాడు లేక పోయినా.. ఆయ‌నంత అందం, అభిన‌యం లేక పోయినా త‌న‌దైన స్టైల్లో ర‌జ‌నీ మాస్ ప్రేక్ష‌క జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డం  పీహెచ్డీ  చేయ‌ద‌గ్గ‌ర స‌బ్జెక్ట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక ర‌జ‌నీకాంత్ జాలి, ద‌య‌.. దాన గుణాల గురించి చెబితే ఒక నాన్ డీటైల్డ్ బుక్ లో పెట్ట ద‌గ్గ‌ అతి పెద్ద పాఠ‌మే అవుతుంది. త‌నను తొలినాళ్ల‌లో ఆద‌రించిన వారెవ‌రినీ ఆయ‌న మ‌ర‌చి పోలేదంటారు.  తాను వేషాల కోసం వెతుక్కుంటున్న రోజుల్లో పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితుల్లో కాసింత ఎక్కువ ప్ర‌సాదం పెట్టిన పూజారి  ర‌జ‌నీకి ఇంకా గుర్తే. త‌న  డ్రైవ‌ర్ ఇంటికి చాటుగా వెళ్లి వారికి కొత్త ఇల్లు కొనిచ్చిన ర‌జ‌నీ దాతృత్వం కూడా చాలా చాలా పెద్ద‌ది. ర‌జ‌నీకి ఎదురుప‌డ్డ ఎవ‌రైనా స‌రే, ల‌బ్ధి  పొందాల్సిందేనంటారు. అంత‌గా ఆయ‌న ఫీల‌వుతార‌ని  చెబుతారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఆయ‌న ఎప్పుడైనా హైదరాబాద్ వ‌స్తే మోహ‌న్ బాబు గెస్ట్ హౌసుల్లో దిగుతుంటారు. రాత్రి పూట సిట్టింగ్ కి ఏర్పాట్లు చేసే ఆఫీసు బాయ్ కి కూడా ఆయ‌న 500లో, వ‌య్యో చేతిలో పెడ‌తారట‌. ఈ విష‌యం ఆ ఆఫీస్ బాయ్ గ‌ర్వంగా  చెప్పుకుంటాడు. ఇక సింప్లిసిటీ విష‌యంలో ర‌జ‌నీ త‌ర్వాతే  ఎవ‌రైనా. ఒక సాదా సీదాగా కృష్ణానగ‌ర్, ఇంద్ర‌న‌గ‌ర్ గ‌డ్డ మీద సాయం కాలం వేడి  వేడి పునుగుల‌ను తిన్న ఉదంతాలున్నాయి. ఒక  సాధార‌ణ ప్ర‌యాణికుడిలా..  హిమాల‌యాల‌కు వెళ్ల‌డం వంటి వార్త‌ల‌ను త‌ర‌చూ వింటూనే ఉంటాం. ఆయ‌న మొన్నా మ‌ధ్య శ్రీశైలం వెళ్లి అక్క‌డ ద‌ర్శ‌నం ముగిశాక‌.. రోడ్డుపై కూర్చుని ఉంటే, ఒక మ‌హిళా భక్తురాలు ప‌ది రూపాయ‌ల‌ను దానం చేసింద‌న్న వార్త గుప్పు మంది. దీన్నిబ్ట‌టీ ఆయ‌న ఎంత  సింపుల్ గా  క‌నిపిస్తారో చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ  పోతే ర‌జ‌నీకాంత్ గురించిన విశేషాలు కోకొల్ల‌లు. దాదాసాహేబ్ తో పాటు ప‌లు ప‌ద్మ అవార్డుల‌తో పాటు ఇంకా ఎన్నో ఘ‌న‌కీర్తులు సాధించిన ర‌జ‌నీకాంత్ మార్కెట్ స్టామినా ఎంత స్ట్రాంగ్ అంటే రీసెంట్ గా ఆయ‌న జైల‌ర్ అనే మూవీ రూ.500 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించింది. సూప‌ర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సూప‌ర్ స్టార్ అన్న పేరు సాధించారు.  75 ఏళ్ల వ‌య‌సులోనూ ఇంకా మార్కెట్ రారాజుగా వెలుగొందే ర‌జ‌నీకాంత్ రాజ‌కీయంగా అడుగులు వేయాల‌ని భావించారు. కానీ, ఆయ‌న త‌మిళ‌నాడు లోక‌ల్ కాదు. ఎక్క‌డో మ‌హారాష్ట్ర‌లో పుట్టి క‌ర్ణాట‌క‌లో పెరిగిన వాడు కావ‌డం వ‌ల్ల‌... ఆయ‌న‌కు త‌మిళ‌నాట రాజ‌కీయం చేయ‌డానికి త‌గిన ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ర‌జ‌నీకాంత్ అంటే చ‌ప్పున గుర్తుకు వ‌చ్చేది ఒక‌టి ఉంది. అదే  కండ‌క్ట‌ర్ టు సూప‌ర్ స్టార్ గా ఆయ‌న ఎదుగుద‌ల దాని ప‌రిణామ క్ర‌మం. అంతే కాదు.. తొలినాళ్ల‌లో నెగిట‌వ్ కేరెక్ట‌ర్స్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై ఒకానొక‌ సూప‌ర్ స్టార్ గా ఎద‌గ‌డం ఎలా.. అన్న‌ది. ఈ విష‌యంలో ఆయ‌నొక  రూట్ మ్యాప్ వేసి  సినీ గైడ్ గా అవ‌త‌రించారన‌డం అబ‌ద్దం కాదేమో. ఈ పంథాలో తెలుగులో చిరంజీవితో పాటు మ‌రెంద‌రో త‌మిళ, మ‌లయాళ, క‌న్న‌డ‌ హీరోలు సైతం ఫాలో అయ్యారంటే అతిశ‌యం కాదు.  ఇక‌ 1995లో విడుద‌లైన ర‌జ‌నీకాంత్- బాషా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే అది తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ, క‌న్న‌డ అన్న భాషా బేదాల్లేకుండా ఇర‌గ‌దీసేసింది. ఆ త‌ర్వాత బాషాలాంటి ప్యాట్ర‌న్  తో వ‌చ్చిన సినిమాల ప‌రంప‌ర  కూడా లెక్క‌లేన‌న్ని.  ఇదొక స‌క్సెస్ ఫుల్ సినీ ఫార్ములాగానూ చెలామ‌ణి అయ్యిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఇంపాక్ట్ ఆఫ్ ర‌జ‌నీకాంత్ ఆన్ సౌత్ సినిమా ప‌వ‌రేంటో. తెలుగు రాజ‌కీయాల‌తో కూడా ర‌జ‌నీకాంత్ కి ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఇటీవ‌ల  ఆయ‌న ఏపీలో జ‌రిగిన‌ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి  ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యారు. బేసిగ్గా ర‌జ‌నీకాంత్ తాను రాజ‌కీయాల్లో రాణించ‌లేక పోయినా.. చంద్ర‌బాబు, ఆయ‌న మార్క్ పాలిటిక్స్ అంటే ఎంతో విలువ‌నిచ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారు. గ‌తంలో చంద్ర‌బాబు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా  ఉండ‌టం కూడా ర‌జ‌నీతో ప‌రిచ‌యానికి ఒక కార‌ణంగా  చెబుతారు కొంద‌రు.  దానికి తోడు ఒకానొక రోజుల్లో సీఈఓ ఆఫ్ ద స్టేట్ గా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు అతీతంగా సాధించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి సైతం ర‌జ‌నీకీ బాగా  ఇష్టం. అందుకే ఆయ‌న బాబును ఎంత‌గానో అభిమానిస్తారు. త‌న‌కు కోట్లాది మంది అభిమానులున్నా.. తాను మాత్రం బాబుకు పెద్ద ఫ్యాన్ అంటూ బాహ‌టంగానే ప్ర‌క‌టిస్తారు ర‌జ‌నీకాంత్.  త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ర‌జ‌నీ  ప్ర‌భావం ఎంత అంటే  సాక్షాత్ ప్ర‌ధాని  మోడీయే పంచ క‌ట్టుకుని ర‌జ‌నీని వ‌చ్చి క‌లిశారంటే దటీజ్ మేజిక్ ఆఫ్ సూప‌ర్ స్టార్.  అలాంటి ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం నార్త్ లో బిగ్ బీ అమితాబ్ ఎలా నాన్ స్టాప్ సినీ మార‌థాన్ చేస్తున్నారో.. సౌత్ లో అక్కినేని త‌ర్వాత అంత‌టి మూవీ  మార‌థాన్ చేస్తున్న వ‌న్ అండ్ ఓన్లీ ర‌జ‌నీకాంత్. హ్యాపీ బ‌ర్త్ డే ర‌జ‌నీ సార్!   

ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా...కవిత వార్నింగ్

  పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తాని కవిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.  తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన  దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతాని కవిత అన్నారు.  జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను...2014 నుంచి ఇప్పుటి వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు

జూబ్లీహిల్స్ పీఎస్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.  కోర్టు ఆయనపై ఉన్న ముందస్తు బెయిల్‌ను సడలిస్తూ వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆయన సిట్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రభాకర్‌రావు తన సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు ఇవ్వడానికి నిరాకరించినట్లు సిట్ తన పిటిషన్ లో పేర్కొంది. అదేవిధంగా, సెన్సిటివ్ సమాచారం ఉన్న దశాబ్దాల డేటాను ధ్వంసం చేయించినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది.ఇంకా ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న ముఖ్యమైన వివరాలను కూడా ప్రభాకర్ రావు దాచి పెడుతున్నారని కస్టోడియల్ విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అందచేత ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ రద్దుచేసి కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పిటిషన్ లో పేర్కొంది.  ఈ మేరకు సుప్రీంకోర్టు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపి... ముందస్తు బెయిల్ ను సడలిస్తూ... వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు నేటి నుంచి వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు.  కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రభాకర్‌రావును జాయింట్ సీపీ తఫ్సర్ ఇక్బాల్ నేతృత్వంలోని సిట్ ప్రశ్నిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని రూల్ నెంబర్ 419, 419A ఉల్లంఘిస్తూ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అనుమతి లేకుండా ట్యాప్ చేసినట్లు గుర్తించారని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా మొత్తం 26 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో 7 కొత్త హార్డ్‌డిస్క్‌లను రీప్లేస్ చేసిన అంశంపై కూడా లోతుగా విచారిస్తోంది.ధ్వంసం చేసిన డిస్క్‌లను ఎక్కడ దాచి పెట్టారనే కీలక ప్రశ్నకు సమాధానం కోసం సిట్ కస్టడీ విచారణను అత్యంత వేగవంతం చేసింది.     

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా గెలిచిన ఎమ్మెల్యే తండ్రి

  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి  ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అభినందించారు.  100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు.   సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను,  మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు. మొదటి విడత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైంది

సిమెంట్ బస్తాలు కూలి కార్మికులకు తీవ్ర గాయాలు

  సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ సిమెంట్ గోడౌన్‌లో గురువారం రాత్రి సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాల లాట్ ఒక్కసారిగా కూలిపడడంతో అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని బొల్లారంలోని ఫస్ట్ ఛాయిస్ పరిశ్రమకు చెందిన సిమెంట్ నిల్వ గోడౌన్‌లో కార్మికులు రోజువారీగా సిమెంట్ మరియు అనుబంధ పదార్థాల బస్తాలను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్నారు.  ఇదే సమయంలో సిమెంట్ తయారీలో వినియోగించే లెడ్ క్రీమ్ బస్తాలు పెద్ద ఎత్తున ఒకేసారి కుప్పకూలి కార్మికులపై పడ్డాయి.ఈ ఘటనలో కార్మికులు అక్కడికక్కడే అమాంతం నేల మీద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.సహచరులు వెంటనే గాయపడిన వారిని బొల్లారంలోని PBR హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు తొమ్మిది మందిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బొల్లారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. గోడౌన్‌లో జరిగిన ఈ ప్రమాదానికి  భద్రతా ప్రమాణాలు పాటించాయా లేక నిర్లక్ష్యం కారణమా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్

  విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి లోకేశ్  ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో కార్యాలయం ఏర్పాటైంది. వెయ్యి సీటింగ్‌ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ‘కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం. అందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఐటీ క్యాంపస్‌ను సంస్థ మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది.   

ట్యూషన్ టీచర్ దారుణం... ఏడేళ్ల బాలుడిపై అట్లకాడతో దాడి

  పిల్లల్లో కొంతమంది చదువులో ముందుంటారు. మరి కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ట్యూషన్ పెట్టించి తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తమ చిన్నారి బాలుడిని ట్యూషన్ కి పంపించారు. కానీ ట్యూషన్ టీచర్ ఆ బాలుడు పై చేసిన దారుణం . ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ట్యూషన్ టీచర్ చదవడం లేదనే పేరుతో ఏడేళ్ల చిన్నారిపై అమానుషంగా దాడి చేసిన ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో భయభ్రాంతులకు గురిచేసింది.. ఓయూ కాలనీకి చెందిన  వల్లు తేజ నందన్ రెగ్యులర్‌గా ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే చదువుపై దృష్టి పెట్టడం లేదన్న కారణంతో ట్యూషన్ టీచర్ శ్రీ మానస ఆగ్రహం చెంది చిన్నారిపై తీవ్ర హింసకు పాల్పడినట్టు తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. చిన్నారి తేజ నందన్ చేతులు, కాళ్లు, ముఖం తదితర భాగాలపై మొత్తం ఎనిమిది చోట్ల అట్లకాడతో కాల్చినట్టు బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి శరీరంపై గాయాలు చూసిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు .ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం బాలుని ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, కాళ్లపై గాయాల కారణంగా నడవడంలో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారిపై అట్లకాడతో దాడి చేసిన టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.