కొవిడ్ టీకాతో సేఫ్ రెండు నెలలే! తాజా అధ్యయనంతో కలకలం..

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే డెల్టా వేరియంట్ వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో మరణ మృదంగం మోగించిన డెల్టా వేరియంట్... ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషనే ప్రధానమని సైంటిస్టులు చెప్పడంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి కొవిడ్ గండం తప్పినట్లేనని చెబుతూ వస్తున్నాయి. కొన్ని దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించాయి.  అయితే కొవిడ్ టీకాలపై తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఆందోళన కల్గిస్తోంది. రెండు టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరు వారాల తర్వాత క్రమంగా క్షీణిస్తున్నట్టు  బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తఅధ్యయనంలో తేలింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలపై అధ్యయనం చేసి ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేతలు. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు వాళ్లు గుర్తించారు. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా అవి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న సైంటిస్టులు చెప్పారు, ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భారత్‌లో ఇస్తున్న కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం బుధవారం వెల్లడించింది.  తాజాగా అమెరికా కూడా తమ కొవిడ్ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. కొంతకాలం క్రితం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ దేశంలో డెల్టా వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ప్రజలు మాస్కులు ధరించడమే మంచిదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఉండే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది.  కే-12 స్కూళ్లలో పనిచేసే టీచర్లు, విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా స్కూళ్లలో కూడా మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది.

నిండుకుండలా శ్రీశైలం డ్యామ్.. 14 ఏండ్ల తర్వాత జూలైలోనే గేట్లు ఓపెన్! 

ఎగువన నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. జురాలతో పాటు తుంగభద్ర నుంచి డ్యాంలోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో బుధవారం సాయంత్రం  డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  జలాశయం గేట్లను  పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. 2007 తర్వాత జూలై నెలలోనే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారని చెబుతున్నారు. శ్రీశైలం జలాశాయానికి  ఇన్ ఫ్లో బుధవారం ఉదయం 4,66,864 క్యూసెక్కులుగా ఉంది.  ఔట్‎ఫ్లో: 62 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం : 879.30 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 215.8070 టీఎంసీలు కాగా,..ప్రస్తుతం 184.27 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.  శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనుండటంతో దాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహ పడుతున్నారు. దీంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర పర్యాటకుల సందడి పెరిగింది. నాగార్జున సాగర్ లోనూ ప్రస్తుతం 190 టీఎంసీలకు పైగానే నీళ్లు ఉన్నాయి. ఎగువ నుంచి మరో మూడు రోజులు వరద కొనసాగే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజుల్లోనే నాగార్జున సాగర్ డ్యాం కూడా పూర్థిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

కుర్రాడు  బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డ్.. నెల్లూరులో వింత సమస్య.. 

కొంత మంది సంవత్సరాలు ఇంట్లో నుండి పారిపోయి. లేదంటే తప్పిపోయి కనబడకుండా పోతుంటారు. ఆ తర్వాత వాళ్ళు బతికి ఉన్నారో చనిపోయారో తెలియదు.. కొన్ని ఏళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి అతని కుటుంబ సభ్యులు చనిపోయాడు అనుకుంటారు ఆ తర్వాత అతను చనిపోయాడు అన్న  విషయం గవర్నమెంట్ రికార్డు లో నమోదు చేశారు..కొన్ని సార్లు కొంత మంది వ్యక్తులు  చనిపోయినట్లు రికార్డ్ లో నమోదు అయ్యాక కూడా ఆ వ్యక్తులు తిరిగి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా కళ్ళ ముందు కనిపిస్తూ.. ప్రాణాలతో ఉన్న ఓ బాలుడు చనిపోయాడని  గవర్నమెంట్ రికార్డ్ లో నమోదు అయింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..  అది నెల్లూరు జిల్లా. సంగం మండలం. తిరమనతిప్పలో నివసిస్తున్న నిరుపేద చేనేత కుటుంబం. ఆమె పేరు  పల్లా రత్నమ్మ, అతని పేరు పెంచలయ్య ఇద్దరు దంపతులు. వారి కుమారుడు ప్రతాప్. ఆ బాలుడి పేరు రైస్ కార్డులో నమోదు కాలేదు. దాంతో వారు సచివాలయం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. రేషన్ కార్డులో తమ కుమారుడి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ వాళ్లకు అనుకోని సంఘటన ఎదురైయింది. తమ కుమారుడు  చనిపోయినట్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు అయింది.. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.  అక్కడికి వెళ్లిన రత్నమ్మకు 'మీ కుమారుడు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదైందని.. మేమేం చేయలేమని' అధికారులు చెప్పుకొచ్చారు. తన కుమారుడు బతికే ఉన్నా చనిపోయినట్లు నమోదు కావడం ఏంటని, ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. స్థానిక తహసీల్దారు దగ్గర తన గోడు వెల్లబోసుకున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబానికి చెందిన రత్నమ్మ రోజులో కొంచెం సేపు మగ్గం పని ఆపుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తన సమస్యను అర్ధం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

రామప్పలో నమ్మలేని నిజం: 800 ఏళ్ల క్రితమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ

రామప్ప ఆలయ వైభవం, అందులోని శిల్పకళా నైపుణ్యం గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పుకోవడమే కానీ.. అసలక్కడి ఆహాలకు, ఓహోలకు అసలైన ఆనవాళ్లేంటో ఎవరూ చెప్పడం లేదు. అదేంటో తెలుగువన్ డాట్ కామ్ పాఠకులకు మేం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చదివి ఆనందించండి.. మన శిల్పాచార్యుల నైపుణ్యానికి గర్వించండి.  1213 లో నిర్మాణమైన రామప్ప ఆలయాన్ని ఆనాటి శిల్పాచార్యులు 40 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. అంటే దాదాపు ఒక తరం పూర్తిగా, రెండో తరం కొంత భాగం జీవితకాలాన్ని ధారవోశారు. అనేక అద్భుతమైన గుళ్లు, గోపురాలను ఇలాగే తీర్చిదిద్దారు. ఇక రామప్ప ఆలయం గురించి సామాన్య ప్రజలకు తెలియని విషయం మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం.  రామప్పను ఇదివరకే దర్శించినవారికి అక్కడ ఆలయంలో ఓ విగ్రహాన్ని మీటితే అది సరిగమలు పలుకుతుందని తెలుసు. అయితే ఒక రాతి చెక్కడం వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలైన శబ్దాలను ఏ విధంగా ఇవ్వగలుగుతుందన్నది ఇటీవలి కాలం వరకు కూడా ఎవరికీ తెలియదు. నమ్మశక్యం కాని ఆ టెక్నాలజీ పేరే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ. అంటే ఇతర లోహాల్లాగే రాతిని కరిగించి తాము అనుకున్న ఆకారంలోకి ఒంపుకోవడం. రాయేంటి.. దాన్ని కరిగించడమేంటి అనిపిస్తోంది కదా... అందుకే ఇది నమ్మలేని నిజం. రామప్ప ఆలయంలో వివిధ శబ్దాలు చేసే (సరిగమలు పలికే) శిల్పాలతో పాటు కొన్ని స్తంభాలకు సైతం ఈ టెక్నాలజీ వాడారు. అన్ని విగ్రహాలకు, అన్ని శిల్పాలకు దీన్ని వాడలేదు. ఇది కృష్ణుడు వేణువు వాయిస్తున్న శిల్పంలో బయట పడింది. ఆ శిల్పంలో వేర్వేరు చోట్ల తడిమితే వేర్వేరు శబ్దాలు వస్తున్నాయి. ఇంకో చోట అసలు ఏ శబ్దమూ రావడం లేదు. మామూలు పరిస్థితులకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యవహారం.  వస్తువు సాంద్రత మారడం వల్ల అది వెలువరించే శబ్దాల్లో మార్పు సాధ్యమవుతుంది. అదే సూత్రాన్ని ఆనాటి శిల్పాచార్యులు ఇక్కడ అప్లై చేశారు. అలాగే నల్లరాతి శిల్పంలో మన ప్రతిబింబం చూసుకునేంత నునుపుదనం ఊహించశక్యం కానిది. మామూలు చెక్కడాల్లో అంత నునుపుదనం రాదని అనుభవజ్ఞులు సైతం చెబుతున్నారు. ఆ నునుపుదనం, నాజూకుదనం రావడానికి, రాతిలో సాంద్రతను మార్చి శబ్దాల్లో మార్పులు రావడం కోసమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ వాడినట్లు 2016లో జరిగిన పరిశోధనల ద్వారా రుజువైంది. న్యూయార్క్ లోని బఫలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాతిని 2500 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర కరిగించి మోల్డ్ చేయవచ్చని నిరూపించారు. దీంతో 800 ఏళ్ల క్రితం రామప్పలో చేసింది కూడా అదే టెక్నాలజీగా నిర్ధారణ అవుతోంది.  సన్నని, నునుపైన ఇసుకను ముందుగా ఊహించుకున్న ఆకారం మేరకు పేర్చి, కూర్చి మూసగా తయారుచేసి... అందులోకి కరిగిన రాతి ద్రవాన్ని (లావా అన్నమాట) పంపించి చల్లబరుస్తారు. దీంతో ఆ రాతి సాంద్రతలో తేడాలు వస్తాయి. ఫలితంగా ధ్వనుల్లో కూడా తేడాలు వస్తాయి. అలాగే గుడి శిఖరానికి ఉపయోగించిన రాళ్లకు నీళ్లమీద తేలియాడే గుణం కూడా ఇలాగే రాబట్టారు. రాతిని కరిగించినప్పుడు ఇతరత్రా మరికొన్ని ఖనిజాల మూలకాలు కలపడం ద్వారా ఆ రాయి సాంద్రత గణనీయంగా తగ్గిపోయింది. ఆ తగ్గిన రాళ్లనే అనుకున్న ఆకారంలో దిమ్మెల్గుగా చెక్కి గుడిని తేలికగా మార్చడం జరిగింది. పాలంపేట పరిసరాల్లో ఉన్న నల్లరాతి నేలను తట్టుకొనేందుకు ఇంతటి భారీ టెక్నాలజీని 800 ఏళ్ల క్రితమే మనవాళ్లు వాడారంటే... ఆనాటి శిల్పాచార్యులు ఎంత గొప్ప శాస్త్రవేత్తలో అర్థం చేసుకోవచ్చు. రామప్పలో సరిగమలు పలికే శిలలో జరిగింది కూడా ఇదేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.  

మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి.. రౌడీ రాజ్యమని చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. సామాన్య జనాలనే కాదు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై  దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వసమయ్యాయి.  గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను పరిశీలించేందుకు వెళ్లారు దేవినేని ఉమ. అక్రమ మైనింగ్ను పరిశీలించి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద ఉమా వాహనం పై రాళ్ళ దాడికి దిగారు దుండగులు.రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దేవినేనిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పీఎస్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. అయినా ఘటన జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  సీఎం జగన్‌ కనుసన్నల్లో, సజ్జల నాయకత్వంలో తనపై దాడి జరిగిందని దేవినేని ఉమ ఆరోపించారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తనపై రాళ్లురువ్వారని మండిపడ్డారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ జరిగిందన్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్నానని తనపై కక్షగట్టారని ఆరోపించారు. తన అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. గ్రావెల్ దోపిడీపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా..? అని ఉమ  ప్రశ్నించారు.  ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. దాడిపై డీజీపీ, విజయవాడ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.  దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై జరిగిన దాడిపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత గంట సేపు ఎవరూ రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు గాయపడ్డారన్నారు. పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.దాడికి పాల్పడిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉమకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీని చంద్రబాబు కోరారు

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా బుక్కైన జగన్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులమయంగా మారిందన్నది విపక్షాల ఆరోపణ. జగన్ రెడ్డి సర్కార్ పాలనతో రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేనంతగా ఆర్థిక కష్టాల్లో పడిందని చెబుతున్నారు. ఎడాపెడా అడ్డగోలుగా అప్పులు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం.  ప్రతినెలా ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వాలన్న అప్పు తేవాల్సిన దారుణ స్థితిలో పడిపోయింది. ఆర్థిక రంగ నిపుణులు కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా సీఎం జగన్ తో పాటు మంత్రులు మాత్రం అంతా బాగానే ఉందని కవర్ చేసుకుంటున్నారు. పరిమితికి లోబడే రుణాలు తీసుకున్నామని, అన్ని రాష్ట్రాల్లాగే తాము ముందుకెళ్లామని చెబుతున్నారు. అయితే తాజాగా జగన్ రెడ్డి సర్కార్ బండారం పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. వైసీపీ నేతల నోళ్లకు మూత పడింది.  అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిందిని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఆదాయానికి మించి అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన ఉందని వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఏపీకి కేంద్ర ఆర్థికశాఖ అక్షింతలు వేసింది. 2020-21 సంవత్సరానికి రు.54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్రం తెలియజేసింది. 15వ ఆర్ధిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 30,305 కోట్ల అప్పునకు అనుమతి కోరిందని కేంద్రం తెలిపింది. కొవిడ్‌ కారణంగా మరో రూ.19,192 కోట్ల అప్పునకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 49,497 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. అయితే పరిమితికి మించి ఏపీ రూ.4,872 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.  అప్పుల విషయంలోనే కాదు జగన్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న దిశ చట్టం విషయంలోనూ బండారం బహిర్గతమైంది. ఏపీలోని మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం నుంచి తిరిగి స్పందన రాలేదని లోక్‌సభలో హోంశాఖ తెలిపింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా సమాధానం ఇచ్చారు. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలను హోంశాఖ మంత్రిత్వశాఖ లేవనెత్తింది. దీంతో పలు అంశాలపై వివరణ కోరినట్లు హోంశాఖ పేర్కొంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలకు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు.

క‌రీంన‌గ‌ర్ సీపీ ఆక‌స్మిక బ‌దిలీ.. హుజురాబాద్ ఎఫెక్ట్‌..!

ఎలాగైనా హుజురాబాద్‌లో గెల‌వాలి. గెలిచి తీరాలి. ఇదే కేసీఆర్‌ టార్గెట్‌. అందుకోసం ఏమైనా చేస్తారు. నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని వేల కోట్లైనా ఖ‌ర్చు చేస్తారు. ఆ ప్రాంత నాయ‌కుల‌కు ఎలాంటి ప‌ద‌వులైనా ఇస్తారు. ఆ జాబితాలోనే మ‌రో ప‌ని కూడా చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈట‌ల మ‌నుషులుగా పేరున్న అధికారుల‌ను అక్క‌డి నుంచి త‌ప్పించారు. ప‌లువురు ఆర్డీవోల‌ను, డీఎస్పీల‌ను, ఎస్ఐల‌ను, ఎమ్మార్వోల‌ను ఇప్ప‌టికే ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. తాజాగా, క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ క‌మ‌లాస‌న్‌రెడ్డిని ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఆయ‌న్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. క‌రీంన‌గ‌ర్‌కు కొత్త సీపీగా.. రామ‌గుండం సీపీ స‌త్య‌నారాయ‌ణ‌ను నియ‌మించారు.  అయితే, సీపీ క‌మ‌లాస‌న్‌రెడ్డిని ఈట‌ల మ‌నిషి అనే కార‌ణంతో ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా పేరుగాంచిన‌ ఆయ‌న దాదాపు ఐదేళ్లుగా క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. సుదీర్ఘ‌కాలంగా ఒకే స్థానంలో ఉండ‌టంతో బ‌దిలీ చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది.  త్వ‌ర‌లో హుజురాబాద్ ఉప ఎన్నికలు జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో లాంగ్ స్టాండింగ్ అధికారులను త‌ప్ప‌కుండా బ‌దిలీ చేయాల్సి ఉంటుంది. ఈసీ నిబంధనలు అలా ఉంటాయి. ఒక‌వేళ ప్ర‌భుత్వం ఆయ‌న్ను అలానే ఉంచితే.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక‌.. ఆ రూల్‌ను బేస్ చేసుకొని.. ఈసీ జోక్యం చేసుకొని.. లాంగ్ స్టాండింగ్ ఆఫీస‌ర్‌ను బ‌దిలీ చేసి త‌మ‌కు న‌చ్చిన సీపీని నియ‌మించే అవ‌కాశం ఉంటుంది. అలాంటి రిస్క్ రాకుండా ఉండ‌టానికే.. ఐదేళ్లుగా క‌రీంన‌గ‌ర్ సీపీగా ఉన్న క‌మ‌లాస‌న్‌రెడ్డిని అక్క‌డి నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. 

బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ ? 

మాజీ పోలీసాఫీసర్, ఇటీవల గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రాలతో పాటు దక్షిణాదిన పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీఎస్పీ లో చేరతారని ఢిల్లీలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని లీక్ చేయగా.. తాజాగా ప్రవీణ్ కుమార్ చేరిక తేదీ కూడా ఖాయమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఆగస్టు 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గజారోహణం చేయడం ఖాయంగా తెలుస్తోంది. బీఎస్పీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగును ప్రవీణ్ కుమార్ అధిరోహించబోతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమమే ఎజెండాగా రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్న ఆయన రాకతో  కచ్చితంగా రాజకీయ, సామాజిక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా స్వేరోస్ సభ్యులు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారని అంటున్నారు.  ఇప్పటికే ఇండైరెక్టుగా డిక్లేర్ చేసిన ప్రవీణ్ కుమార్ ఇక ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం అనేది లాంఛనంగానే భావించవచ్చు. ఎందుకంటే.. ఆయన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా రాజీనామా చేయడానికి ముందే పలు సందర్భాల్లో మాయావతిని కలిసి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. దాంతోపాటు రాజీనామా చేశాక ఆయన పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా అంబేద్కర్, జ్యోతిరావుఫూలేతో పాటు కాన్షీరామ్ దార్శనికతను ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడైనా అంబేద్కర్, ఫూలేల గురించే మాట్లాడారు గానీ... కాన్షీరామ్ గురించి ఏ ఒక్క నాయకుడు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం కాన్షీరామ్ త్యాగాన్ని, యూపీలో దళితులు అధికారంలోకి రావడానికి ఆయన పోషించిన భూమికను, స్ఫూర్తిని హైలైట్ చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే మాయావతితో భేటీలో ఏం జరిగింది... ఆయన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసి ఉంటుందో అంచనా వేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. దక్షిణాది నుంచి ఒక పోలీసాఫీసర్ బీఎస్పీలో చేరుతున్నట్టు మాయావతి చెప్పినట్టుగా వార్తలు లీకవడంతో ఆర్ఎస్ ఇంటర్వ్యూ అంశాలను పోల్చి చూసినా ఆయన బీఎస్పీలో చేరడం ఖాయమన్న విషయాన్నే రూఢి చేస్తున్నాయి.  మరోవైపు ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి రహస్యంగా వెళ్లి పలువురు లీడర్లను కలిసి వచ్చినట్టు ఊహాగానాలు వినిపించాయి. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతూ అందుకు సైద్ధాంతిక భూమిక తయారు చేసుకున్న ప్రవీణ్ కుమార్... మొత్తానికి సొంతగా పార్టీ పెట్టి చేదు ఫలితాలు రుచి చూడడం కన్నా అందరికీ తెలిసిన, భావ సారూప్యత గల పార్టీ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయమైన సమాచారం. అయితే త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రవీణ్ కుమార్ లేదా ఆయన పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. హుజురాబాద్ లో దాదాపు 50 వేల వరకు దళిత ఓటర్లు ఉన్నందున.. పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ప్రవీణ్ కుమార్ సన్నిహుతులు మాత్రం హుజురాబాద్ లో పోటీ విషయమై ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి మా పర్సు కొట్టేశాడు మహాప్రభో..

ఏపీలో సర్పంచుల పర్సు గల్లంతయింది. గ్రామ సచివాలయాల ఖాతాలకు చిల్లు పడింది. ఒక్కో గ్రామానికి చెందిన ఖాతా నుంచి లక్షలాది రూపాయలు మాయమైపోయాయి. ఏకంగా 33 కోట్ల రూపాయలకు కన్నం పడిందంటే సర్పంచులంతా ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందతా ఏ సైబరాసురుడి అటాకో, ఆన్ లైన్ స్కామాసురుడి మోసమో కాదు.. అచ్చంగా ఆంధ్రా ప్రభుత్వమే గ్రామ సచివాలయాల ఖాతాల మూలుగలు పీల్చేసింది. ప్రభుత్వ పెద్దలే తమ జేబులకు చిల్లులు పెడితే గ్రామ నిర్వహణ ఎలా చేయాలంటూ ఏపీలో సర్పంచులంతా మొత్తుకుంటున్నారు.  గత ఫిబ్రవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన గ్రామ ప్రథమ పౌరులందరిదీ ఇదే పరిస్థితి. పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని పక్కాగా నిర్వహించాలన్నా, నల్లాల నిర్వహణ చేయాలన్నా, గ్రామంలో చీకట్లు పరుచుకోకుండా స్ట్రీట్ లైట్లు నిర్వహించాలన్నా సర్పంచుల దగ్గర నిధులుండాలి. గాంధీ మహాత్ముడి ఆశయమైన గ్రామ స్వరాజ్య లక్ష్యం సాకారం కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం కేటాయింపుల కింద నిధులను నేరుగా గ్రామాల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీంతోపాటు గ్రామ ప్రజలు చెల్లించే ఇంటిపన్నులు, నీటి పన్నులు వగైరా ఇతర ఆదాయ మార్గాలుంటాయి. ఏ గ్రామ సర్పంచ్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టినా ఈ నిధులే ఆధారం.  కానీ ఆంధ్రా సర్కారు మాత్రం గ్రామాలకు వచ్చే ఆక్సిజన్ పైపునే తొలగించిందంటున్నారు సర్పంచులు. పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచులందరూ ఇదే అభిప్రాయం వినిపిస్తుండడం గమనించాల్సిన అంశం. పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తరువాత చెక్ పవర్ వచ్చిందని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇక అభివృద్ధి పనులు మొదలు పెడదామని బ్యాంకు అకౌంట్లు చూస్తే జీరో బ్యాలెన్స్ దర్శనమివ్వడంతో భూమి కింద నేల చీలిపోయిందన్న ఫీలింగ్ కలుగుతోందని పలువురు సర్పంచ్ లు బాహాటంగానే చెబుతున్నారు. వారిలో అధికార పార్టీకి మద్దతుదారులైన సర్పంచులు కూడా ఉండడం విశేషం. అప్పటికే జమయిన 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కూడా వాడుకోలేకుండా ఫ్రీజ్ చేసిందని తమకు గ్రామ కార్యదర్శి చెప్పేదాకా తెలియదని లబోదిబోమంటున్నారు. ఇప్పుడే మొహం పెట్టుకొని ఊళ్లో తిరగాలో అర్థం కావడం లేదని సర్పంచులంతా బావురుమంటున్నారు.  ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. గ్రామ సచివాలయాలకు ఈ దుస్థితి ఎందుకొచ్చిందో తెలిస్తే బుర్ర తిరగడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కోసం గ్రామ పంచాయతీల నిధులు వాడుకోవడానికి జగన్ సర్కారు భారీ కుట్ర చేసిందన్న అంశం వెలుగుచూస్తోంది. పేరు ప్రఖ్యాతుల కోసం భారీ ఎత్తున పథకాలు, ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్న సర్కారు ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేనివైనం కళ్లకు కడుతోందిప్పుడు. ఆయా సర్పంచులకు గ్రామ కార్యదర్శుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం విద్యుత్ బకాయిల కోసమే పంచాయతీల అకౌంట్లు ఫ్రీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. మీరు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కోసం తమ ఖాతాలు ఖాళీ చేస్తే.. మరి పంచాయతీ చేయాల్సిన అభివృద్ధి పనుల సంగతేంటని వారు సీఎం నిర్వాకాన్ని నిలదీస్తున్నారు.  సఫాయీ సిబ్బందికైనా వేతనాలు చెల్లించకపోతే పారిశుధ్యం ఎలా ఉంటుందంటున్నారు. తాగునీటి సిబ్బందికి, గ్రామ సుంకరులు, నీరటిల వేతనాలు, పాఠశాలల మరమ్మతులు, మరుగుదొడ్లు, శ్మశానవాటికల నిర్వహణ, బురద కొట్టుకుపోయిన వీధులు బాగు చేయడం, ఇంకా ఆగిపోయిన అనేక అభివృద్ధి పనుల కొనసాగింపు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.  ఎన్నికల సమయంలో పోటీపడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా జగన్ సర్కారు భారీ కసరత్తే చేసింది. ఆ సర్పంచులంతా అప్పుడు ఎన్నో ఆశయాలతో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తి చేద్దామనుకునే సమయంలోనే.. గ్రామాభివృద్ధి రథాన్ని అడ్డుకున్న అసలు సైంధవులెవరో ఆలస్యంగా తెలిసిందని వారు వాపోతున్నారు. ఇప్పుడు తాము ఎన్నికై ఏం లాభం.. పనుల కోసం వచ్చే ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి అంటూ వాపోతున్నారు. మరి గ్రామాలకు పట్టిన ఈ దుస్థితి ఎప్పుడు తొలగుతుందీ.. ముఖ్యమంత్రి గానీ, ఆయన కోటరీ గానీ ఈ పరిస్థితికి ఏం జవాబు చెప్తారు.. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది..  

హుజురాబాద్‌లో కొట్లాడుతారా? కాడి దించేస్తారా? రేవంత్ దారేది?

గెలిస్తే నిలుస్తాం. లేదంటే రాజ‌కీయ స‌మాధే. హుజురాబాద్ ఉప ఎన్నిక చావో రేవో మాదిరి. ఈట‌ల‌కు అగ్నిప‌రీక్ష‌.. కేసీఆర్‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌. వారిద్దరిలో ఎలాగైనా గెలిచి తీరాల‌నే పంతం, ప‌ట్టుద‌ల‌. గెలిస్తే రాజ‌కీయంగా ఊపిరి పీల్చుకోవ‌చ్చు. ఓడితే ఇక కోలుకోవ‌డం క‌ష్టం. మ‌రి, టీఆర్ఎస్‌, బీజేపీ సంగ‌తి ఓకేగానీ.. కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? 40 ఏళ్లుగా గెలుపు రుచి చూడ‌ని కాంగ్రెస్.. ఈసారైనా హుజురాబాద్‌లో ప్ర‌భావం చూపిస్తుందా? గెల‌చే విష‌యం త‌ర్వాత‌.. క‌నీసం పోటీ అయినా చేస్తుందా? ఆ పార్టీకి బ‌ల‌మైన కేండిడేట్ దొరికేనా? హుజురాబాద్ సంగ్రామంలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటారా? వీటిపైనే ఇప్పుడు తెలంగాణ‌లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. స‌మాధానాలు కాస్త క్లిష్టంగానే ఉన్నాయి.  పాడి కౌశిక్‌రెడ్డి. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కేండిడేట్‌. టీఆర్ఎస్ చేప‌ట్టిన‌ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇట్టే అట్రాక్ట్ అయిపోయారు. పోతూపోతూ రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ద‌మ్ముంటే హుజురాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోండి చూస్తానంటూ స‌వాల్ చేసి మ‌రీ పోయారు. కౌశిక్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌కు ఉన్న ఆ ఒక్క అనుకూల అంశ‌మూ లేకుండా పోయింది. ఇప్పుడు వాట్ నెక్ట్స్‌? అనేది హ‌స్తం పార్టీని వేధిస్తున్న ప్ర‌శ్న‌. హుజురాబాద్ కోసం దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక‌ క‌మిటీనైతే వేశారు కానీ, బైపోల్‌కు ఎలా ముందుకు పోవాలో కాంగ్రెస్‌కు ఓ ప‌ట్టాన అంతుచిక్క‌డం లేదంటున్నారు. బ‌ల‌మైన అభ్య‌ర్థి వేట‌లో ఉన్నార‌ని.. మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌ను పోటీ చేయిస్తార‌ని మొద‌ట్లో ప్ర‌చారం జరిగింది. ఇప్పుడు ఆయ‌న పేరు కూడా వినిపించ‌డం లేదు. ఓవైపు టీఆర్ఎస్‌, బీజేపీ హోరాహోరీ ప్ర‌చారం చేస్తుండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కూ హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది. మ‌రి, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మదిలో ఎలాంటి ఆలోచ‌న ఉందో ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.  ఆ మ‌ధ్య ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 40 ఏళ్లుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెల‌వ‌లేద‌ని.. అక్క‌డి గెలుపు-ఓట‌మిలు త‌న ప‌నితీరుకు కొల‌మానం కాదంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంటే, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్‌లో కాడి ఎత్తేసిన‌ట్టేనా? బ‌రిలో దిగి దారుణంగా ఓడిపోవ‌డం కంటే.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగం లేని ఎన్నిక‌లంటూ పోటీ నుంచి వైదొలిగి.. ప‌రువు నిలుపుకోవ‌డ‌మే బెట‌ర్ ఆప్ష‌న్ అని భావిస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. హుజురాబాద్‌లో నేరుగా పోటీ చేయ‌కుండా వేరే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిస్తే ఎలా ఉంటుంద‌నే దిశ‌గా ఆలోచ‌న చేస్తోంద‌ట‌. ఈట‌ల గెల‌వాల‌ని బ‌లంగా కోరుకుంటున్నా.. కాంగ్రెస్‌కు బ‌ద్ద విరోదైన బీజేపీని గెలిపించేంత సాహ‌సం మాత్రం చేయ‌బోద‌ని చెబుతున్నారు. అందుకే, వారు వారు త‌న్నుకునేలా కాస్త వీక్ కేండిడేట్‌ను పెట్టాలా? లేక‌, ఉద్య‌మ నాయ‌కుడినో, త‌ట‌స్తుడితోనో పోటీ చేయించి.. ఆ అభ్య‌ర్థికి ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో మ‌ద్దతు ఇస్తే ఎలా ఉంటుంద‌నే దిశ‌గానూ హ‌స్తం పార్టీ అడుగులు వేస్తోంద‌ని తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా.. త‌మ‌ది కాని చోట‌.. త‌మ‌కు అంత‌గా బ‌లం లేనిచోట‌.. కేసీఆర్‌-ఈట‌ల జీవ‌న్మ‌ర‌ణ పోరాటం చేస్తున్న చోట‌.. అన‌వ‌స‌రంగా పెద్ద‌గా హ‌డావుడి చేసే కంటే.. సైలెంట్‌గా ఉండి త‌మాషా చూసేందుకే కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని అంటున్నారు. మ‌రి, హుజురాబాద్‌లో క‌నీసం పోటీ అయినా చేస్తుందా? బ‌ల‌హీన అభ్య‌ర్థిని పెడుతుందా? ఎవ‌రో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇస్తుందా? ఈ మూడింట్లో ఏది జ‌రుగుతుందో చూడాలి...

రాజకీయ మైదానంగా పార్లమెంట్.. ప్రజా సమస్యలు పట్టని పార్టీలు! 

పార్లమెంటు ఉభయసభల్లో అధికార,ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకు శ్రుతిమించి రాగాన  పడుతోందా ? పార్లమెంట్ సమావేశాల పేరిట సాగుతున్న రాజకీయం, ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు మీద ప్రతికూల ప్రభావం చుపుతోందా?అంటే, అవుననే సమాధానమే వస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 తేదీన ప్రారంభమయ్యాయి. ఆగష్టు 13తో ముగుస్తాయి. అయితే, ఇంతవరకు పార్లమెంట్ ఒక్కరోజు కూడా సక్రమంగా పనిచేసింది లేదు. పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు, వెలుగులోకి వచ్చిన పెగాసస్‌ స్పైవేర్‌,హాకింగ్ వ్యవహారం, సంవత్సర కాలానికి పైగా సాగుతున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనఫై చర్చకు పట్టుపడుతున్న విపక్షాలు, ఇతర కార్యక్రమాలు ఏవీ సాగకుండా, సభా కార్యక్రమాలను స్తంభింప చేస్తున్నాయి.అదే తమ విజయంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ రోజు (మంగళవారం) కూడా అదే కథ నడిచింది.దీంతో ప్రతిపక్ష పార్టీలు సభా కార్యక్రమాలను స్థంబింపచేయడం ఒక్కటే ఎజెండాగా ముందుకు సాగుతున్నాయన్న ఆరోపణను ఎదుర్కోనవలసివస్తోంది. ప్రతిపక్షాల నిర్వాకం ఇలా ఉంటే ప్రభుత్వం బిల్లులు పాస్ చేసుకుని బయట పడడం ఒక్కటే, ఎజెండాగా తన పని తాను చేసుకుపోతోంది. అంతే కానీ, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని కలుపుకుపోయే ప్రయత్నం చేయడం లేదు. ప్రజాసమస్యలపై చర్చకు, ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజల ఎదుర్కుంటున్న సమస్యలకు, ముఖ్యంగా కొవిడ్ కారణంగా అన్ని రంగాలు ఎందుర్కుంటున్న సంక్షోభాలకు పరిష్కారం చూపే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగడం లేదు .. ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు.  ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి రాజకీయ ఎజెండాతో ఎవరి పని వారు పని చేసుకుపోతుంటే, ప్రజల సమస్యలు ప్రస్తావించేది  ఎవరు? సమస్యలకు పరిష్కారాలు చూపేది ఎవరు?  నిజమే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న  పెగాసస్‌ స్పైవేర్‌, విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్  అంశం కీలకమైనదే, కాదనలేము. అలాగే, సాగు చట్టాల అంశం కూడా కీలకమైనదే. కానీ,ఆ రెండు అంశాలనే పట్టుకుని విపక్షాలు పార్లమెంట్’ని స్థంబింప చేయడం వలన,అంతకంటే కూడా, దేశాన్ని అతలాకుతలం చేస్తున్నకొవిడ్ సంబందిత సమస్యలు గాలికి కొట్టుకు పోతున్నాయి. ఉదాహరణకు, సోమవారం రాజ్య సభ జీరో అవర్‌లో కొవిడ్‌ టీకాల కొరత, కరోనా వల్ల ఉపాధి కోల్పోవడం, పెట్రో, నిత్యావసర వస్తువుల ధరలు వంటి కీలక అంశాలను ప్రస్తావించడానికి అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాల నిరసన వల్ల వాటిఫై చర్చను చేపట్టలేకపోయామని, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.మంగళవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సభాకార్యక్రమాలు సాగుతున్న  తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రజాప్రయోజనాలకు సంబందించిన అంశాలపై చర్చకు అధికార,ప్రతిపక్షాలు పోటీ పడాలని, నిరసనల్లో కాదని ఆయన సభాముఖంగానే ఇరు పక్షాలకు  చురకలు వేశారు.  ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం, విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విపరీత ధోరణి కారణంగానే సభా కార్యక్రమాలు సాగడం లేదని ఆయన  బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆగ్రహం వ్యక్త పరిచారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని, ముందు ఆ విషయంపై చర్చించిననా తర్వతనే ఇతర అంశాలు చర్చించాలని పట్టు పడుతున్నాయి. హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనీ కూడా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే విపక్షాల ఐక్యతను చూపించేందుకు అంతగా ప్రాధాన్యత లేని అంశం మీద ప్రతిపక్ష పార్టీలు చర్చకు పట్టు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులే కాదు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా తప్పు పడుతున్నారు.  రోజురోజుకు చట్ట సభల పరినితీరు దిగాజరిపోతోందని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు, రాజనీతిజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చు, (ఎంపీల జీతభత్యాలు కాక) సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీనికి ఎంపీల జీత భత్యాలను కలిపితే అది ఇంకెంత ఉంటుందో .. ఉహించుకోవలిందే. ఇలా ప్రజా ధనాన్ని దుర్వునియోగం చేసే అధికారం పార్లమెంట్’కు ఉందా, అని కూడా పెద్దలు ప్రశ్నిస్తున్నారు.  గత సంవత్సరం కొవిడ్ మహమ్మారి కారణంగా పార్లమెంట్ సమావేశాలు అంతంత మాత్రంగానే జరిగాయి. గత సంవత్సరం  మొత్తం 33 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. చివరకు బడ్జెట్ సమావేశాలు కూడా తూతూ మంత్రంగా కేవలం ఎనిమిది రోజులు మాత్రమే జరిగాయి. అంటే ఇంచు మించుగా సంవత్సరం తర్వాత పార్లమెంట్ కొంతలో కొంత ఒక పద్దతి ప్రకారం జరుగుతోంది, ఈ వర్షాకాల సమావేశాలలోనే .. ఇలాంటి సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని పట్టుకుని సభా కార్యక్రమాలను స్తంబింప చేయడం, రాజకీయంగా చూసినా విజ్ఞత కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  కొవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, వాక్సినేషన్ (టీకాల) విషయంలో ఇంకా ఘోరంగా విఫలమైంది, ఇక నిత్యావసర సరకుల ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి,  పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి, పరిశ్రమలు మూతపడి, లక్షలాది కార్మికులు మంది ఉపాధి కోల్పోయి, వీధుల పాలయ్యారు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల కార్మికులు, వీరు వారని కాదు సామాన్య జనం పడుతున్నకస్టాలు ఇన్నీ అన్ని కాదు. ఈ అన్ని విషయల్లోనూ ప్రధాని మోడీ ప్రభుత్వంఘోరంగా విఫలమైంది. మోడీ వైఫల్యాలను ప్రజలు గుర్తించారు. ఆయన పాపులారిటీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వం మీద దండయాత్ర చేసందుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు.  ఇలాంటి ప్రజల అనుభవంలో ఉన్న  ప్రజా సమస్యలు ఇన్ని ఉండగా, అనుమాన స్పదంగా ఉన్న పెగాసస్‌ ను పట్టుకుని వేళ్ళాడడం ఏమిటని, ప్రజలే ప్రశ్నిస్తున్నారు. నిజానికి, నిజమైన ప్రజా సమస్యలను లేవనెత్తితే, ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు మరింతగా లభించేది.ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోలేని డిఫెన్సులో పడేదని అంటున్నారు. అందుకే, రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశాల్లో ప్రతిపక్షలు వ్యవహరిస్తున్న తీరు అనుమానస్పదంగా ఉందన్న మాట కూడా వినిపిస్తోంది. విపక్షాలు చక్కని అవకాశం వదులుకున్నాయని అంటున్నారు.  అందుకే కావచ్చు, ఇంతకీ ప్రశాంత్ కిశోర్ ... ఎవరికోసం పనిచేస్తున్నారు. డీల్ మోడీ తోనా ... సోనియాతోనా ..మోడీతో డీల్ కుదుర్చుకుని, విపక్షాలను తప్పుదారి పట్టిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వినవస్తున్నాయి.

ష‌ర్మిల‌ దీక్షకు కోమ‌టిరెడ్డి స‌పోర్ట్‌.. రేవంత్‌కు వార్నింగా? వాట్ నెక్ట్స్‌?

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే మాకు ప్రాణం.. మిమ్మ‌ల్ని చూస్తుంటే మాకు వైఎస్సార్‌ను చూసిన‌ట్టే ఉంది. మీకు మా సంపూర్ణ మ‌ద్ద‌తు. మా ప్రాంతంలో వైఎస్సార్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. స్వ‌యంగా ఆయ‌నే వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం పుల్లెంల‌లో నిరుద్యోగ‌ దీక్ష చేస్తున్న ష‌ర్మిల‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌లో ఉంటూ కాంగ్రెస్‌కు పోటీగా పార్టీని పెట్టిన ష‌ర్మిల‌కు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఓపెన్‌గా స‌పోర్ట్ చేయ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది.  ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సైతం ఇలానే ష‌ర్మిల పార్టీకి మ‌ద్ద‌తు తెలిపారు. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం సంద‌ర్భంగా ఆ ఈవెంట్ జ‌రిగే క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ముందు ఆగి మ‌రి.. అక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ష‌ర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పడం అప్ప‌ట్లో దుమారం రేపింది.  అప్పుడు అన్న‌.. ఇప్పుడు త‌మ్ముడు.. ఇలా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ష‌ర్మిలకు బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు తెలుపుతూ ప‌రోక్షంగా కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ కాంగ్రెస్ అసంతృప్తులుగా ముద్ర ప‌డ్డారు. రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న అన్న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి వ‌స్తుందేమోన‌నే ఆశ‌తో ఆగిపోయార‌ని అంటారు. అయితే, ఎంతో ఆశ‌ప‌డిన అధ్య‌క్ష ప‌ద‌వి వెంక‌ట్‌రెడ్డికి ద‌క్క‌క‌పోవ‌డంతో.. ఇప్పుడు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పార్టీపై నారాజ్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. వెంక‌ట్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌నంటూనే.. పార్టీతో ట‌చ్‌లో లేకుండా పోయారు. రేవంత్‌రెడ్డికి ముఖం చాటేస్తున్నారు. రేవంత్ సైతం సీనియ‌ర్లు అంద‌రినీ క‌లుస్తున్నారు కానీ, వెంక‌ట్‌రెడ్డిని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో.. ఢిల్లీలో మ‌కాం వేసిన వెంక‌ట్‌రెడ్డి త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.  మ‌రోవైపు త‌న సోద‌రుడికి పీసీసీ పీఠం ద‌క్క‌క‌పోవ‌డం.. ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్‌ను వీడాల‌ని చూస్తున్న రాజ‌గోపాల్‌రెడ్డి.. ఇప్పుడిక మ‌రింత దూకుడు పెంచారు. ఎలాగూ టీఆర్ఎస్‌లో చేరేది లేదు కాబ‌ట్టి తాజాగా మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని ఓ ఆటాడుకున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి 2వేల కోట్లు ఇస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానంటూ స‌వాల్ కూడా విసిరారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. త‌మ‌కిక కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేద‌ని, ఉండ‌ద‌ని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. అయితే, బీజేపీలో చేరుదామ‌ని అనుకున్నా.. ఇటీవ‌ల కాలంలో ఆ పార్టీ దూకుడు బాగా త‌గ్గిపోవ‌డంతో ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని అంటున్నారు.  స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో రాజ‌న్న రాజ్య‌మంటూ ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌డంతో రాజ‌కీయం రంజుగా మారింది. పార్టీ ఆవిర్భావం రోజే ష‌ర్మిల‌కు వెంక‌ట్‌రెడ్డి ఆల్ ది బెస్ట్ చెబితే.. తాజాగా రాజ‌గోపాల్‌రెడ్డి ష‌ర్మిల‌కు ఫోన్ చేసి సంఘీభావం ప‌ల‌కడం ఆస‌క్తిక‌రంగా మారింది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.. ష‌ర్మిల పార్టీకి ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నార‌ని అంటున్నారు. వైఎస్సార్ హ‌యాంలో ఈ సోద‌రులు ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితులుగా మెదిలారు. అదే అభిమానంతో ష‌ర్మిల‌ను బ‌హిరంగంగా స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ మ‌ద్ద‌తు పార్టీ లైన్‌కు వ్య‌తిరేక‌మ‌ని తెలిసే.. ష‌ర్మిల ఎంత బ‌ల‌ప‌డితే కాంగ్రెస్ అంత‌గా దెబ్బ‌తింటుంద‌ని తెలిసే.. ఆ ఇద్ద‌రు ఆమెను ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని అంటున్నారు.  పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయ‌డం కోస‌మే ఇలా చేస్తున్నార‌ని కూడా అనుమానిస్తున్నారు. త‌మ‌కు పార్టీలో ప్ర‌యారిటీ ద‌క్క‌క‌పోతే త‌మ దారి తాము చూసుకుంటామ‌నే మెసేజ్ ఇస్తున్నార‌ని అంటున్నారు. త‌మ‌కు ష‌ర్మిల పార్టీ రూపంలో మ‌రో ఆప్ష‌న్ రెడీగా ఉంద‌ని.. ఇక్క‌డ కాక‌పోతే అక్క‌డ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ.. ఏముందిలో పోతేపోనీ అని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ను లైట్ తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు. ఎందుకంటే.. రాజ‌కీయంగా, ఆర్థికంగా ఫుల్ స్ట్రాంగ్‌. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా మొత్తాన్ని శాసించ‌గ‌ల స‌త్తాది. అంత‌టి బ‌ల‌మైన లీడ‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వ‌దులుకోదు. ఆ విష‌యం తెలిసే.. వాళ్లు కూడా పార్టీని కేర్ చేయ‌కుండా రెబెల్‌గా ఉంటార‌ని అంటారు. కాంగ్రెస్ హైక‌మాండ్ ఏరికోరి మ‌రీ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేశాక కూడా.. ప‌ద‌వి అమ్ముకున్నారంటూ.. రేవంత్‌కు చంద్ర‌బాబే ప‌ద‌వి ఇప్పించారంటూ.. నోటికొచ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేశారు వెంక‌ట్‌రెడ్డి. అధిష్టానం నుంచి గ‌ట్టి షంటింగ్స్ ప‌డ‌టంతో ఆ త‌ర్వాత నోరు మూసుకున్నారు. అలిగి ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్‌లో తాము ఇండిపెండెంట్‌గా ఉంటామ‌ని.. తాము ఏమి చేసినా, ఏమి మాట్లాడినా.. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే విష‌యం ప‌దే ప‌దే చాట‌డానికే ఇలా గ‌డ‌బిడ చేస్తుంటార‌ని అంటారు. కాంగ్రెస్‌కు పోటీగా పార్టీ పెట్టిన ష‌ర్మిలను కోమ‌టిరెడ్డి సోద‌రులు ఇలా బ‌హిరంగంగా స‌పోర్ట్ చేస్తుండ‌టాన్ని కాంగ్రెస్ సీరియ‌స్‌గా తీసుకుంటుందా? లేక‌, వెయిట్ అండ్ సీ అంటూ స‌రైన స‌మ‌యం కోసం వేచి చూస్తుందా? చూడాలి...

వితంతు మహిళకు పోలీసుల వేధింపులు.. 

అది హైదరాబాద్.  బాలానగర్ శోభన కాలనీలో ఒక వితంతు నివాసముంటుంది. మహిళలపై సామాన్యులే కాదు చివరికి పోలీసులు కూడా వేధిస్తున్నారు. ఆ వితంతువు నివసిస్తున్న ఇంటి స్థలాన్ని వదిలి వెళ్లాలని  పోలీసులు బెదిరించారు. చివరికి పోలీసుల వేధింపులు భరించలేక  ఇద్దరు మహిళలు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. బాలానగర్ లో దారుణం చోటుచేసుకుంది. అసలే ఆమె వితంతు. అందులోను మహిళ. వాళ్లను బెదిరించిన, ధమ్కీ ఇచ్చిన ఎవరు ఏం చేయలేరని గ్రహించారు. అదే అదును చేసుకొని  కొంతకాలంగా ఆమె కుటుంబానికి పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. చివరికి ఆ మహిళా చేసేది ఏమి లేక నిస్సహాయ స్థితిలో తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని. బాధితులు వేధింపులు భరించలేక బాలానగర్ ACP పురుషోత్తం, CI వహీదుద్దేన్ పై హెచ్చార్సీలో పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బాలానగర్ శోభన కాలనీకి చెందిన లక్ష్మీ అనే వితంతు మహిళ ముగ్గురు పిల్లలతో 20 సం.లుగా జీవనం సాగిస్తోంది. తాము నివాసం ఉంటున్న ఇంటి స్థలాన్ని వదిలి వెళ్లాలని కొంత కాలంగా  పోలీసులు బెదిరిస్తున్నారని, లక్ష్మితో పాటు మరో బాధితురాలు దంతాల సంధ్య హెచ్చార్సీలో పిర్యాదు చేశారు. కబ్జాదారులు దేవి ఇస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే చివరకు తమ కుటుంబాన్ని కబ్జా దారులతో కుమ్మకై ACP, CI లు కూడా వేధింపులకు గుర్తిచేస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లిన అడ్డుకుంటే కొంత అన్నమైన దొరుకుతుందేమో గానీ పేదవాడికి న్యాయం దొరకదు అని వకీల్ సాబ్ సినిమాలో చెప్పినట్లు.. ఎక్కడికి వెళ్లిన తనకు న్యాయం జరగకపోవడంతో.. కబ్జాదారులు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు డయల్ 100 కి కాల్ చేస్తే పోలీసులు అర్ధరాత్రి మహిళలను సెటిల్ మెంట్ కోసం పోలీస్ స్టేషన్ కి రమ్మంటున్నారు. కబ్జాదారు లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో చంపేస్తామని బెదిరిస్తున్నారు. కబ్జాదారులు, ACP, CI ల నుండి ప్రాణ హాని ఉంది.. వారి నుండి రక్షణ కల్పించాంటూ ఆమె కోరుతున్నారు. దంతాల సంధ్య, లక్ష్మి ఇద్దరు బాధితురాలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.   

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఖర్చు రూ.700 కోట్లు?

హుజురాబాద్ తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ రాకున్నా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నేతలు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎవరూ ఏం అడిగినా వెంటనే సాంక్షన్ చేసేస్తున్నారు మంత్రులు. ఎంతో కాలంగా చెబుతున్నా పట్టించుకోని నేతులు.. ఆఘమేఘాల మీద పనులు మొదలు పెడుతున్నారు.  హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేందుకు పావులు కదుపుతున్న అధికార పార్టీ.. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దళిత బంధును హుజురాబాద్ నుంచి మొదలుపెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ ఒక్క పథకానికే 12 వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇదికాకుండా కుల సంఘాలకు, యువజన సంఘాలకు భారీగా తాయిలాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.  హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ. 400 కోట్ల ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఈ మేరకు భారత ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఈ వ్యవహారాలను నియంత్రించడంతో పాటు వెంటనే ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. టీఆర్ఎస్ ఖర్చు చేస్తున్న డబ్బులపై నిఘా పెట్టాలని, పార్టీ నాయకులకు సన్నిహితంగా ఉన్న ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కంపెనీలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, ప్రధానమైన రియాల్టర్లపై దృష్టి సారించాలని గొనే ప్రకాష్ రావు కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసుల సాయంతో కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నిఘా వర్గాలను రంగంలోకి దింపి ఈటల రాజేందర్‌తో పాటు ఇతర పార్టీల్లో తిరుగుతున్న యువతను గుర్తించి రాత్రి వేళల్లో వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నారని గోనే ప్రకాశ్ రావు ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను దింపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను గోనే ప్రకాష రావు అభ్యర్థించారు. బోగస్ ఓట్లు కూడా నమోదయ్యాయని వాటిని తొలగించేందుకు కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత హుజురాబాద్‌లో పనిచేస్తున్న అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇచ్చారన్నారు. వివిధ శాఖల ద్వారా వ్యాపారులను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు. ఇక్కడ తిరుగుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై కూడా నిఘా పెట్టాలని లేఖలో కోరారు గోనే ప్రకాష్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఓటింగ్ ప్రక్రియను ఎగతాలి చేసే చర్యలకు పూనుకుంటున్నారని గోనె ప్రకాష్ రావు సీఈసీకి రాసిన లేఖలో వివరించారు. దేశ చరిత్రలోనే హుజురాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారాయని గొనే ప్రకాష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలను నిర్వహించేందుకు చొరవ చూపాలని ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు. 

ఏపీ ఉద్యోగుల సమరనాదం.. జగన్ సర్కార్ కు గండం? 

హనీమూన్ అయిపోయిందా? అప్పటివరకు గంటల తరబడి మీటింగులు.. ఒకటే రివ్యూలు.. టార్గెట్లు.. ఈ ఉద్యోగం చేయలేంరా బాబూ.. తలకాయ తినేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. ఒక్క అవకాశం జగన్ కి ఇస్తే.. తాము హాయిగా పని చేసుకోవచ్చు అనుకున్నారు. పైగా అడిగినవన్నీ చేసేస్తానని జగనన్న అభయ హస్తం ఇచ్చారు. సరే అని సై అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే పూజలు, పునస్కారాలు కూడా చేసేశారు. భ్రమ మబ్బులన్నీ పోయాయి.. వర్షం కాదు కదా చుక్క కూడా పడలేదు.. ఇప్పుడు వారికి కన్నీటి చుక్కలే మిగిలాయి.  ఒక వైపు అధికార పార్టీ నేతలు, సలహాదారుల పెత్తనం.. చెబితే వినరు.. తాము వినకపోతే వేటు పడుతుంది..అందుకని గొంతులోనే దిగమింగుకుని పని చేస్తూ పోతున్నారు. రెండున్నరేళ్లు అవుతుండగా ఇక వారి సహనం అసహనంగా మారుతోంది. వ్యవహారం పీక్స్ కి పోవడంతో ఇక ఆందోళనా కార్యక్రమం చేపట్టారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. అసలు అధికారంలోకి రాగానే వైసీపీ వేగంగా చేసిన పని ఒకటుంది. ఉద్యోగ సంఘాల్లో తెలుగుదేశం వాసనలు ఉన్నోళ్లను బయటకు పంపించేశారు. తమ వాసనలు ఉన్నోళ్లను రంగంలోకి దింపారు. వారు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ సంఘాలపై గ్రిప్ సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినవాళ్లు కావడంతో మిగతావాళ్లు కూడా కిక్కురుమనకుండా ఫాలో అయిపోయారు. చివరకు అమరావతి ఉద్యమం గురించి మాట్లాడటమే కాకుండా..రాజకీయాలు మాట్లాడకూడని స్టేజి నుంచి కోర్టులో కేసులు కూడా వేసేదాకా వెళ్లిపోయారు. విశాఖ వెళ్లడం ఇష్టం లేదని ఉద్యోగులు చెప్పినా.. అందరూ రెడీ అని ప్రచారం చేసేశారు. ఇన్ని చేసినా..తమ డిమాండ్లు నెరవేరుస్తారేమోనని ఎదురు చూశారు. కాని ఆ ఛాయలే కనపడకపోవడంతో ఇక పోరు తప్పదని డిసైడ్ అయ్యారు.  సీపీఎస్ పెన్షన్ స్కీమ్ వద్దని ఎప్పటి నుంచో ఉద్యోగులు పోరాడుతున్నారు. చంద్రబాబు అప్పట్లో అది కేంద్రంతో లింక్ అయి ఉందని.. అంత ఈజీ కాదని చెప్పారు. జగన్ మాత్రం అలా రాగానే ఇలా తీసేస్తానని చెప్పారు. వీళ్లు నమ్మారు. ఇప్పటికి రెండున్నరేళ్లు అయినా దాని మీద అతీ గతి లేదు. ఏంటి సంగతంటే ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయని ఇప్పుడు సెలవిస్తున్నారు. మరి అప్పుడు చంద్రబాబు చెప్పింది కూడా అదేగా అంటే..తప్పించుకుని తిరుగుతున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు సమావేశమై ఆగస్టు మొదటివారంలో క్విట్ సీపీఎస్ అంటూ నిరసనవారం పాటించబోతున్నారు. అంతే కాదు... రెస్పాన్స్ లేకపోతే మరింత తీవ్రం చేస్తామంటున్నారు. ఉద్యోగులతో వైరం పెట్టుకుంటే ఏమవుతుందో.. మనం చంద్రబాబు విషయంలో చూశాం.. రేపు అదే జగన్ విషయంలో జరిగేలా కనపడుతోంది.

కోడలితో అక్రమ సంబంధం.. కొడుకుని చంపిన తండ్రి.. 

నేటి సమాజంలో కొంత మంది  సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు.  రోజు రోజు అక్రమ సంబంధాలతో పక్కద్రోవ పడుతున్నారు. నేటి సమాజంలో వావివరసలు లేకుండా తయారు అయ్యారు. తండ్రి వ్యవహరించాల్సిన వాడు ఇలా అడ్డదారులు తొక్కాడు.తాజాగా ఒక వ్యక్తి తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ఈ విషయం కొడుక్కి తెలియడంతో తండ్రి, కొడుక్కి మధ్య వివాదం జరిగింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ తండ్రి  తన సుఖానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హతమార్చాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు తన కొడుకు కనిపించడం లేదంటూ ముందుగానే వెళ్లి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విచారణలో అసలు నిజం బయటపడటంతో ఈ కిరాతకుడిని పోలీసులు ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అది  బీహార్‌ రాజధాని పాట్నా. ఆ ప్రాంత పరిధిలోని కొద్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతని పేరు  మిథిలేష్‌ రవిదాస్‌. అతని  కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. సచిన్‌ గుజరాత్‌లో ఉద్యోగం చేస్తుండటంతో పెళ్లైన కొద్దిరోజులకే భార్యను వదిలి ఆఫీసుకు వెళ్లాడు.ఇక అంతే ఒంటరిగా ఉంటున్న కోడలిపై కన్నేసిన రవిదాస్. ఆమెను మాయమాటలు చెప్పాడు. ముగ్గులోకి దించాడు చివరికి లోబరుచుకున్నాడు. కొడుకు ఇంట్లో లేకపోవడంతో అతడు నిత్యం కోడలిలో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం గుజరాత్‌లో ఉన్న సచిన్‌కు తెలియడంతో జులై ఏడో తేదీన ఇంటికి చేరుకుని తండ్రిని నిలదీశాడు. తండ్రి కి మాటలు రాలేదు.  ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రవిదాస్ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా అతన్ని మట్టికరిపించాలనుకున్నాడు. ఓ కత్తి తీసుకుని కొడుకు గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా, ఆ హత్యకు సంబందించిన  కేసు బయటికి రాకుండా ఉండేందుకు సచిన్ శవాన్ని తోటలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ ఒక నాటకం మొదలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత తెలివైనోడైనా సరే చిన్న చిన్న తప్పులతో దొరికిపోతారని చెప్పినట్లు. ఈ వ్యవహారం వెనుక అదే ప్రాంతానికి చెందిన ఐదుగురిపై అనుమానం ఉందని తెలిపాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. చివరికి సచిన్‌ శవాన్ని తోటలో గుర్తించిన పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆ రిపోర్టులో అతడిని గొంతు కోసి చంపేసినట్లు తేలడంతో పోలీసులు రవిదాస్‌ను ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. తన కోడలితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తానే కొడుకుని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

న‌డిమంత్ర‌పు మురిపం.. ముందుంది అస‌లు భ‌విత‌వ్యం..

ఏలూరు సైతం వైసీపీ ఖాతాలోనే. ఒక్క‌ కార్పొరేష‌నే అయినా స‌జ్జ‌ల మీడియా ముందు విజ‌య‌గ‌ర్వం ప్ర‌ద‌ర్శించారు. ఇక అంతా త‌మ‌దే రాజ్య‌మంటూ బీరాలు పోయారు. జ‌డ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే గెలుపంటూ గొప్ప‌లు చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ నిజాలే కావొచ్చు. తాజా ఫ‌లితాల్లో ఆమాత్రం ఉత్సాహం ఉండ‌కుండా ఉండ‌దు. అయితే.. ఇదే శాశ్వ‌తం అనుకొని వీర్ర‌వీగొద్ద‌నేది టీడీపీ ఇస్తున్న ఉచిత స‌ల‌హా. రాజ‌కీయం రంగుల‌రాట్నంలా గిర్రున తిరుగుతుంద‌ని.. ఇప్పుడు ఆకాశాన ఉన్న‌వాళ్లు అధఃపాతాళానికి ప‌డిపోక త‌ప్ప‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌త చ‌రిత్ర‌ను ఓసారి గుర్తు చేస్తున్నారు.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఏ ఎన్నిక జ‌రిగినా వైసీపీదే విజ‌యం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, ప‌లు కార్పొరేష‌న్లు, తిరుప‌తి బైపోల్‌.. ఇలా ఎల‌క్ష‌న్ ఏదైనా ఫ్యాను గాలి జోరుగా వీస్తోంది. అది ఎలా వీస్తోంది? న‌యానా? భ‌యానా? అనేది వేరే విష‌యం. అధికారంలో ఉన్న పార్టీకి అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ ఫ్లోలో అలా కొట్టుకొస్తారంతే. ఆ రిజ‌ల్ట్స్ చూసి అంతా ప్ర‌భుత్వానికే అనుకూలం అని అనుకునేందుకు లేదు. ప‌వ‌ర్‌లోకొచ్చి రెండేళ్లే అవుతోంది. ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఉద్యోగుల‌కు వేళ‌కు జీతాలు రాని దుస్థితి మొద‌లైంది. ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండ‌ర్‌పై నిరుద్యోగులు ఆగ్ర‌హంతో ఉద్య‌మిస్తున్నారు. ఇసుక కొర‌త‌, చెత్త ప‌న్ను, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, మ‌ద్యం దోపిడీ.. ఇలా ఏపీలో అంతా దోపిడీ రాజ్య‌మే కొన‌సాగుతోంది. సంక్షేమ ప‌థ‌కాల మాటున ఆ టైమ్ బాంబ్ పేల‌డం ఆల‌స్యం అవుతోంది అంతే.. అని అంటున్నారు.  అధికార పార్టీకి ఇంకా హ‌నీమూన్ పీరియ‌డ్ కంటిన్యూ అవుతోంద‌ని.. ఇంట‌ర్వెట్ బ్యాంగ్ అదిరినా.. సెకండ్ ఆఫ్ ర‌చ్చ రంబోలా కావ‌డం ఖాయ‌మంటున్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఉప ఎన్నిక‌ల‌న్నీ ఈజీగా గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి బొక్కబోర్లా ప‌డింద‌ని గుర్తు చేస్తున్నారు. వైసీపీకీ ముందుముందు అలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.  ఉప ఎన్నిక‌ల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అస‌లే మాత్రం పోలిక ఉండ‌ద‌నే సూత్రం వైసీపీకీ తెలియంది కాదు. అయినా, కావాల‌నే అంత‌గా బిల్డ‌ప్ కొడుతోంద‌ని అంటున్నారు. గ‌తంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నికను ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మ‌రణంతో జరిగిన నంద్యాల బైపోల్‌లో టీడీపీ-వైసీపీ మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్టు పోరు సాగింది. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ గెలిచేది ఎవ‌రోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. తీరా, రిజ‌ల్ట్స్ చూస్తే.. మొత్తం వ‌న్‌సైడ్‌. టీడీపీకి ఓట‌ర్లు ఘ‌న విజ‌యం అందించారు. తిరుగులేని ఆధిక్యంతో గెలిపించారు. క‌ట్ చేస్తే.. రెండేళ్ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నంద్యాల కాదుక‌దా క‌ర్నూలు జిల్లాలోనే ఖాతా తెర‌వ‌లేక‌పోయింది టీడీపీ. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ హ‌వా కూడా అలానే ఉంద‌ని.. అందుకే ఉప ఎన్నిక‌లు, స్థానిక సంగ్రామంలో అధికార పార్టీకే విజ‌యం ద‌క్కుతోంద‌ని.. కానీ, సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి సీన్ మారిపోతుంద‌ని అంటున్నారు. ఇది జ‌స్ట్ ఇంట‌ర్వెల్ మాత్ర‌మేన‌ని.. క్లైమాక్స్ రివ‌ర్స్ అవుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి, అధికార గ‌ర్వంతో ఉన్న వైసీపీ పెద్ద‌ల‌కు ఇలాంటి హిత‌బోధ చెవికెక్కుతుందా? ఎగిరెగిరి ప‌డ‌కుండా సంయ‌మ‌నంతో ఉంటారా?

ఏపీలోనూ పెగాసస్ తరహా హ్యాకింగ్!   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయడంపై స్పందించిన రఘురామ.. బెయిల్‌ బ్యాచ్‌ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.   తన ఫోన్ ను తీసుకున్న సునీల్ కుమార్, ఆ ఫోన్ నుంచి కొందరికి సందేశాలు పంపారని రఘురామ ఆరోపించారు. ఆ ఫోన్ ను వాడకుండానే, దాన్నుంచి మెసేజులు పంపగల ఘనుడు సునీల్ కుమార్ అని వ్యాఖ్యానించారు.టెక్నాలజీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోగల ఘనాపాఠి  సునీల్ కుమార్ అన్నారు రఘురామ రాజు. గతంలో ఆయనకు వివాహం కాగా భార్యతో మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. అయితే భార్య ఉపయోగించే కంప్యూటర్ లోకి ఆమె అనుమతి లేకుండా చొరబడి, ఆ కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారని తెలిపారు. ఈ విషయం రికార్డుల్లో కూడా ఉందన్నారు. నా ఫోన్ నెంబరును ఉపయోగించి కూడా అదే విధంగా సందేశాలు పంపారని రఘురామ రాజు ఆరోపించారు. పీవీ రమేశ్ అప్రమత్తం చేయడంతో తాను అప్రమత్తం అయ్యానన్నారు. గతంలో న్యాయమూర్తులపైనా ఓ సాఫ్ట్ వేర్ ను ప్రయోగించారని పత్రికా కథనం వచ్చిందన్నారు రఘురామ.   సునీల్ కుమార్ పెగాసస్ తరహా సాఫ్ట్ వేర్ లు ఉపయోగిస్తూ ఇలాంటి సందేశాలు రూపొందిస్తున్నారని రఘురామ రాజు ఆరోపించారు. ఏదైనా దరిద్రమైన పని చేసినా అందంగా చేయాలి.. కాని నా విషయంలో ఏదో చేయబోయి దొరికిపోయారని చెప్పారు. నాకు ఎవరితోనో సంబంధం ఉందని, అవతలి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ సందేశం రూపొందించారన్నారు. అది నా అకౌంట్ కాద.. నాకు సంబంధించింది కాదని రఘురామ స్పష్టం చేశారు. కానీ, దాని ఆధారంగా సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు, ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చినట్టు చెబుతున్నారు. మరి సునీల్ కుమార్ ఫిర్యాదు చేస్తే అది సాక్షికి ఎలా వచ్చింది? ఎంపీలను తీసుకుని ఢిల్లీలో అందరినీ కలుస్తున్న దొంగోడు విజయసాయిరెడ్డికి ఎలా అందింది? అంటే సునీల్ కుమార్, విజయసాయి మిలాఖాత్ అయ్యారని అనుకోవాలా? ఇద్దరూ తోడుదొంగలు అనుకోవాలా?" అంటూ రఘురామ కృష్ణరాజు ఘాటుగా ప్రశ్నించారు. 

ఈటలకు హ్యాండిచ్చిన మరో నేత.. హరీష్ దెబ్బకు కమలం విలవిల

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది బలాబలాలు చేంజ్ అవుతున్నాయి. రాజీనామా చేసినప్పుడు ఈటల రాజేందర్ కు భారీగా మద్దతు లభించగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేయడంతో ఈటల వెంట వెళ్లిన నేతలు కూడా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు నియోజకవర్గంలోని నేతలతో మాట్లాడుతూ ఈటలను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది నేతలు ఈటలకు షాకివ్వగా.. తాజాగా మరో కీలక నేత గులాబీ గూటికి చేరారు.  టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈటల రాజేందర్ వెంట నడిచిన జమ్మికుంట మునిసిపల్ వైస్ ఛైర్మన్ దేశిని స్వప్న, ఆమె భర్త, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ కోటిలు తిరిగి టీఆర్ఎస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు. కారు గుర్తుపై గెల్చిన తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని, ఇక్కడ జరుగుతున్న అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనతోనే బీజేపీని వీడి టీఆర్ఎస్ పంచన చేరుతున్నామని స్వప్న, కోటిలు వెల్డడించారు. ఇక నుండి తాము ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. దేశిని స్వప్న కోటి ఈటలకు ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. జిల్లా టీఆర్ఎస్ నేతలు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన ఈటల వెంటే నడిచారు. అయితే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ రాయబారంతో ఆయన మనసు మార్చుకున్నారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లిలో ఉన్న దేశిని కోటి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరిపారు. కోటి సోదరి, మంత్రి శ్రీనివాస్ సోదరి కుటుంంబాల మధ్య బంధుత్వం ఉంది. తమ కుటుంబాల మధ్య ఉన్న బందుత్వం కారణంగానే మంత్రి తమ ఇంటికి వచ్చారని చెప్పినప్పటికీ.. టీఆర్ఎస్‌లోకి రీ ఎంట్రి ఇవ్వాలని కోటి దంపతుల ముందు మంత్రి ప్రతిపాదన పెట్టారనే చర్చ జరిగింది. తాము ఈటలకు మాట ఇచ్చామని, టీఆర్ఎస్‌లో చేరేది లేదని మంత్రితో వ్యాఖ్యనించారని కూడా చెప్పారు. అయితే ఆ తరువాత బంధువుల ద్వారా ఒత్తిడి చేయడంతో కోటి దంపతులు తిరిగి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.