టీఆర్ఎస్ కు గుత్తా రాజీనామా చేస్తారా? 

టీఆర్ఎస్ లో సంచలనాలు జరగబోతున్నాయా? కీలక నేతలు కారు దిగిపోనున్నారా? ఇదే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. కీలక పదవులు అనుభవించిన నేతలు కొందరు గులాబీ గూటికి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ముగిసి చాలా రోజులైన మళ్లీ అపాయింట్ చేయలేదు కేసీఆర్. అంతేకాదు రెండు దశాబ్దాలుగా గుత్తా కుటుంబం చేతుల్లో ఉన్న నార్మాక్స్ డైయిరీకి కొత్త చైర్మెన్ ను నియమించారు. ఈ పరిణామాలతో కలత చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు గుత్తాతో చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది.  అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.  టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని అన్నారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలెవరు తనతో చర్చలు జరపలేదన్నారు. రైతులు చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న దమనకాండకు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం  చెబుతారన్నారు.  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు  ఎప్పుడో ఖాయమైందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీకి భారీ ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా ఆపాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.   

రైతుల‌ను చంపిన కేంద్ర‌మంత్రి త‌న‌యుడు.. రంగంలోకి ప్రియాంక‌గాంధీ..

అహంకారం త‌ల‌కెక్కింది. తండ్రి కేంద్ర‌మంతి అని పొగ‌రు పెరిగింది. ఆవేశంతో రైతుల‌ను కారుతో గుద్దేశాడు ఆ త‌న‌యుడు. న‌లుగురిని పొట్ట‌న‌పెట్టుకున్నాడు. రైతులు ఆగ్ర‌హించడంతో యూపీలో తీవ్ర ఉద్రిక్త‌త త‌లెత్తింది. విష‌యం తెలిసి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఘ‌ట‌నా స్థలానికి బ‌య‌లు దేరారు. ఆమెను పోలీసులు మ‌ధ్య‌లోనే ఆపేయ‌డం మ‌రింత టెన్ష‌న్ క్రియేట్ చేసింది. రైతుల హ‌త్య‌ను నిర‌సిస్తూ.. దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం రైతులపైకి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారు దూసుకెళ్లింది. ఈ  ఘటనలో నలుగురు రైతులు చ‌నిపోయారు. రైతులు ఆగ్ర‌హంతో చెల‌రేగిపోయారు. ఎదురుదాడి చేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్పింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జ‌ర‌గ‌కుండా స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపివేశారు.  కారు దూసుకెళ్లి న‌లుగురు రైతుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఆశిష్‌ మిశ్రాపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆ కారులో తన కుమారుడు ఉన్నాడన్న వార్తలను కేంద్ర‌ మంత్రి ఖండించారు. ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ రైతు సంఘాలు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.  మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను సీతాపుర్‌ పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మ‌ధ్య‌ వాగ్వాదం నెల‌కొంది. ‘నేనేం నేరం చేయడం లేదు. బాధిత కుటుంబాలను కలిసి, వారి బాధను పంచుకోవాలనుకుంటున్నాను. నన్ను అరెస్టు చేసేందుకు మీ వద్ద తగిన వారెంట్ ఉందా?. మీరు నన్ను, నా కారును ఏ కారణంతో ఆపుతున్నారు?’అని ప్రియాంక గాందీ పోలీసులను ప్రశ్నించారు.  ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాఘేల్‌, పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి ఎస్‌ఎస్‌ రాంధవా తదితరులను లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది.   

చిరు అన్నయ్య అడుగుజాడల్లో  తమ్ముడు పవన్?

చరిత్ర తిరగబడుతోందా, 2009 కథ పునరావృతం అవుతోందా? చిరు అన్నయ్య అడుగుజాడల్లోనే తమ్ముడు పవన్ అడుగులు వేస్తున్నారా, అంటే, అవునని అనలేము కానీ, కాదనీ గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. ఇంచుమించిగా గత వారం పదిరోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, “పంచలు ఊడతీసి కొడతాం” అన్న పాత డైలాగు ఎవరికైనా గుర్తుకొస్తే, రావచ్చును. అది వాళ్ళ తప్పు కాదు, “తాట తీసి నార తీస్తా” వంటి ఫ్రెష్ డైలాగులు చెవిన పడినప్పుడు, రీలు గిరిగిరా ... వెనక్కి తిరిగి పవన్ కళ్యాణ్ పాత  డైలాగు గుర్తుకు రావచ్చును. ప్రస్తుతం వైసీపీ, జనసేన పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మాములుగా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే, వైసీపీ మీద యుద్దమే ప్రకటించారు. సినిమాటిక్’గా పంచ్’లు పేల్చారు. కానీ, నిజంగా ఆయన యుద్ధానికి సిద్దంగా ఉన్నారా? అన్నదే అనుమానం. నిజంగా వైసీపీ అరాచక పాలనను, ఎదుర్కోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం  అయితే, బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలలో, తటస్థంగా ఉండాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంతేకాదు, పవన్ కళ్యాణ్ తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు సెంటిమెంట్ కార్డ్’ ను జత చేశారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చింది కాబట్టి, ఆమెను గెలిపించడమే న్యాయం ధర్మం అన్నట్లుగా మాట్లాడారు. అందుకే జనసేన పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. అంటే, జనసేన కార్యకర్తలు, అభిమానులు వైసీపీ అభ్యర్ధి పట్ల సానుభూతి చూపించి, ఆమెకు ఓటేసి గెలిపించాలని చెప్పకనే చెప్పారు. అలాగే, ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి ఉచిత సలహాకూడా ఇచ్చారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ అన్నచిరంజీవి అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అలాగే సినిమా టికెట్ల గోలను, రాజకీయ రచ్చగా మలుపు తిప్పడం మొదలు  అనంతపురంలో బద్వేల్ ఎన్నికల బరిలో దిగడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించే వరకు సాగిన వీధి భాగోతం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, అరుపులు అన్నీ, ‘మగళగిరి’ ప్రొడక్ట్స్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో, తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేదు. కానీ కొన్ని జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో స్థానికంగా కొన్ని కొన్ని చోట్ల రెండు పార్టీల స్థానిక నాయకులు లోపాయికారీ ఒప్పదం కుదురుచుకున్నారు. అలా ఎక్కడైతే, తెలుగుదేశం, జనసేన దగ్గరయ్యాయో అక్కడల్లా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపధ్యంలో వైసీపీ వ్యూహకర్తలు పవన్ కళ్యాణ్’తో డీల్ కుదుర్చుకున్నారని, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కుదిరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, పాత కాపులు, 2009 ఎన్నికలకు ముందు, మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పేరిట సాగించిన రాజకీయం గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి, ప్రజారాజ్యమే అన్నట్లుగా దూకుడు ప్రదర్శించారు.  కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ప్రజారాజ్యం పార్టీని , చిరంజీవిని టార్గెట్ చేసింది. ఇప్పుడు వైసీపే, తాడు బొంగరం లేని జనసేన, పవన కళ్యాణ్’కు ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.అయితే ప్రజారాజ్యం పార్టీ వైఎస్సార్ సృష్టి అనే విషయం ఆయన పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపినా తర్వాత కానీ తేలలేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి 36 శాతం తెలుగు దేశం పార్టీకి, ఇంచుమించుగా 29-30 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం ఐదారు శాతం మాత్రమే, కానీ, తెలుగు దేశం పార్టీ సారధ్యం లోని గ్రాండ్ అలయన్స్’కు 106 సీట్లు వచ్చాయి, అందులో 91సీట్లు టీడీపీకి వస్తే మిగిలిన స్థానాల్లో తెరాస (10), సిపిఐ, సిపిఎం (5) సీట్లు గెలుచుకున్నాయి.అయితే, ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్ష కూటమి ఓటమికి చిరంజీవి ప్రజారాజ్యం కారణం. ప్రజారాజ్యం పార్టీ 16.32 శాతం ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కానీ, చివరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. అందుకే ఇప్పుడు కొందరిలో చరిత్ర్ర పునరావృతం అవుతోందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్న మెగాస్టార్ అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా ?అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. 

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? పవన్ కు ఢిల్లీ సిగ్నల్ వచ్చిందా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? జనసేన చీఫ్ దూకుడు పెంచిందా అందుకేనా? ఈ ప్రశ్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా తీవ్రంగా పతనమైన వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని,  ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనలు వినిపించాయి. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంతో పాటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు పవన్ కల్యాణ్. రెండు సభల్లోనూ ఉద్వేగ ప్రసంగం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించిన పవన్ కల్యాణ్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే తన ప్రసంగంలో పదే పదే రానున్న ఎన్నికలు, రానున్న ఎన్నికలు అంటూ ప్రసంగించారు పవన్ కల్యాణ్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. రానున్న ఎన్నికలు అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. కేంద్రం పెద్దలతో పవన్ కల్యాణ్ కు మంచి సంబంధాలున్నాయి. గత నెలలో ఢిల్లీకి వెళ్లారు జన సేన చీఫ్. ఆ సమయంలో బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తేవడంతో.. ఆ దిశగా కేంద్ర నుంచి ఆయనకు ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జగన్  ప్రభుత్వ కాలం ఇంకా రెండున్నర ఏళ్ళకు పైగా ఉంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ గతం నుండి పేర్కొంటున్నట్లు జమిలి ఎన్నికలకు ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తారా? లేక మరే కారణముతో ముందుగానే రాష్ట్రంలో  ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది.   చాలా కాలంగా రాజకీయంగా సైలెంటుగా ఉన్న పవన కల్యాణ్.. ఇటీవల కాలంలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. పవన్ పిలుపుతో జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. నరకప్రాయంగా మారిన రోడ్లపై జనసేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తూ రోడ్లు బాగుచేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై గతంలో ఎప్పుడు లేనంతగా రెచ్చిపోతున్నారు పవన్ కల్యాణ్. ఇంతేకాదు రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లోనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు బూతు పురాణం అందుకోవడంతో రచ్చ రచ్చైంది.  వైసీపీని పవన్ ఇంతగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దల నుంచి సంతేకాలు రావడం వల్లే పవన్ కల్యాణ్ ఒక్కసారిగా స్పీడ్ పెంచారని అంటున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలు, బీజేపీ-జనసేన నేతల దూకుడుతో ఏదో జరగబోతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

గులాబీ గూటికి మల్లన్న టీం.. కేసీఆర్ తీన్మార్ సక్సెస్సేనా? 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. క్యూ న్యూస్ అధినేత‌గానే అంద‌రికీ తెలుసు. చాప‌కింద నీరులా ఆయ‌న తెలంగాణ వ్యాప్తంగా ఓ వ్య‌వ‌స్థ‌ను సెట్ చేసుకున్నారు. మ‌ల్ల‌న్న పేరు మీదుగా దాదాపు ప్ర‌తీ జిల్లాల్లో ప్ర‌త్యేక టీమ్‌లు ఉన్నాయి. ఊరూరా మ‌ల్ల‌న్న నెట్‌వ‌ర్క్ ఉంది. మ‌ల్ల‌న్న టీమ్‌లో వేలాది మంది స‌భ్యులు ఉన్నారు. ఆయ‌న కోసం అనేక మంది ప‌ని చేస్తున్నారు. అందుకే, తెలంగాణ‌లో ఏ మారుమూల‌న ఎలాంటి న్యూస్ వ‌చ్చినా.. అది క్ష‌ణాల్లో మ‌ల్ల‌న్న‌కు చేరిపోతుంది. విష‌యం పెద్ద‌దైతే.. వెంట‌నే క్యూ న్యూస్ బృందం రంగంలోకి దిగుతుంది. ఇక మ‌ల్ల‌న్న టీమ్ పేరు మీదుగా వంద‌లాది సోష‌ల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు న‌డుస్తున్నాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి ఉన్నంత సీక్రెట్ నెట్‌వ‌ర్క్ తీన్మార్ మ‌ల్ల‌న్నకు ఉందంటారు. చింత‌పండు న‌వీన్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన‌ప్పుడు.. ఆ మ‌ల్ల‌న్న గ్రూపుల సాయంతోనే  ఆయ‌న త‌న వాయిస్‌ను బలంగా వినిపించ‌గ‌లిగారు. ఎమ్మెల్సీగా గెల‌వ‌కున్నా.. గెలిచినంత ప‌ని చేసి.. స‌ర్కారుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. అందుకే, కేసీఆర్ స‌ర్కారులో అంత‌టి బెదురు అంటారు. ఆ భ‌యంతోనే ర‌క‌ర‌కాల కేసులు పెట్టి మ‌ల్ల‌న్న‌ను జైల్లో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయ‌న బ‌య‌టికొస్తే టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి దెబ్బ‌ని.. బెయిల్ రాకుండా చేస్తూ.. వారాల త‌ర‌బ‌డి జైల్లోనే మ‌గ్గేలా చేస్తున్నారని మల్లన్న అనుచరులు అంటున్నారు.   తెలంగాణలో పాదయాత్రకు ప్లాన్ చేసిన తీన్మార్ మల్లన్న రాజకీయంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ మేర‌కు ఆయ‌న స‌తీమ‌ణి జాతీయ బీజేపీకి లేఖ రాశారు. జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌డం ఇక లాంఛ‌న‌మే. అయితే రాజ్యం ఒత్తిడి త‌ట్టుకోలేక‌.. ర‌క్ష‌ణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధ‌మ‌య్యారనే చర్చ ఉంది.  అయితే కాషాయ కండువా క‌ప్పుకోవాల‌నే మల్లన్న నిర్ణ‌యాన్ని.. ఆయ‌న అనుచ‌రులంద‌రూ ఆమోదించ‌లేక‌పోతున్నారు. మ‌ల్ల‌న్న నిర్ణ‌యంపై తీవ్రంగానే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌ల్ల‌న్న టీమ్ గ్రూపుల నుంచి చాలామంది స‌భ్యులు వైదొలుగుతున్నారు. ఈ క్ర‌మంలో తీన్మార్ మ‌ల్ల‌న్నకు రైట్‌హ్యాండ్ లాంటి ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడు, రిటైర్డ్ సీఐ దాస‌రి భూమ‌య్య సైతం మ‌ల్ల‌న్న టీమ్‌ను వ‌దిలేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  దాస‌రి భూమ‌య్య‌. మ‌ల్ల‌న్న గురించి తెలిసిన వారంద‌రికీ ఈయ‌న సుప‌రిచిత‌మే. మాజీ పోలీస్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ అయిన భూమ‌య్య‌.. మ‌ల్ల‌న్న త‌ర‌ఫున బ‌లంగా వాయిస్ వినిపించేవారు. ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డేవారు. యూట్యూబ్ వీడియోస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించేవారు. మ‌ల్ల‌న్న‌కు రైట్‌హ్యాండ్ లీడ‌ర్‌గా ఉండేవారు. అలాంటి దాస‌రి భూమ‌య్య‌కు సైతం మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌డం న‌చ్చ‌లేదు. దీంతో.. ఆయ‌న మంత్రి హ‌రీష్‌రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేర‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. ఇన్నాళ్లూ ఏ టీఆర్ఎస్ స‌ర్కారునైతే కుమ్మేసేవారో.. ఇప్పుడు అదే పార్టీలో చేర‌డం రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్యం అనే దానికి నిద‌ర్శ‌నం. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మల్లన్న టీమ్ లో కీలకంగా పనిచేసిన వ్యక్తులు కూడా మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరికొందరు మల్లన్న అనుచరులు ఆయనకు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.  తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ నాయ‌కుడు. బ‌డుగుల‌కు రాజ్యాధికార‌మే త‌న ల‌క్ష్య‌మంటారు. ఏ పార్టీలో చేర‌కుండా, ఏ పార్టీని స్థాపించ‌కుండా.. ఇన్నాళ్లూ ఓ వ్య‌క్తిగా వ్య‌వ‌స్థ‌పై పోరాడారు. కేసీఆర్ వ్య‌తిరేక వాయిస్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. ఆయ‌నకు ప్ర‌ధాన మ‌ద్ద‌తుదారులుగా ఉన్న‌దంతా.. ద‌ళితులు, మైనార్టీలే. తాజాగా, మ‌ల్ల‌న్న బీజేపీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించ‌డంతో.. ఆ వ‌ర్గ‌మంతా మ‌ల్ల‌న్న‌ను వీడుతున్నారు. ఆ జాబితాలో మ‌ల్ల‌న్న టీమ్‌లో కీల‌క నేత‌గా ఉన్న దాస‌రి భూమ‌య్య సైతం ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌ల్ల‌న్న జైలు పాల‌వ‌డం.. బీజేపీలో చేరుతుండ‌టంతో.. ఇక‌పై మ‌ల్ల‌న్న నెట్‌వ‌ర్క్ అంతా క‌కావిక‌లం కానుందా? అనే అనుమానం. ఏ పార్టీలో లేరు కాబ‌ట్టి ఇన్నాళ్లూ అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ల్ల‌న్న‌కు స‌పోర్ట్‌గా నిలిచారు. ఆయ‌న కాషాయ‌రంగు పులుముకుంటే.. ఆయ‌న అనుచ‌రులు సైతం ఎవ‌రి దారి వారు చూసుకునే అవ‌కాశం ఉంది. 

TOP NEWS @ 7pm

1. బద్వేలు ఉప ఎన్నిక కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో ఆయ‌న‌ సతీమణినే అధికార‌పార్టీ రంగలోకి దింపడంతో ఆ స్థానంలో పోటీ చేయ‌కూడ‌ద‌ని టీడీపీ నిర్ణ‌యించింది. బ‌ద్వేల్ బ‌రి నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైదొలిగింది. ఇప్ప‌టికే జ‌న‌సేన సైతం పోటీ చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఇక బీజేపీ మాత్రం బ‌ద్వేల్‌లో వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తుగానే వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన‌, టీడీపీలు పోటీ నుంచి త‌ప్పుకున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2. బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదనే ఆగ్ర‌హంతో ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. తమ ఊరికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులనూ గ్రామంలోకి అనుమతించమని హెచ్చరిక బోర్డు పెట్టారు.   3. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బెదిరింపులకు జగన్‌ ప్రభుత్వం భయపడదని మంత్రి కొడాలి నాని స్ప‌ష్టం చేశారు. పవన్‌ జీవితంలో జగన్‌ను ఓడించలేరని అన్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని కొందరు పెద్ద నిర్మాతలు.. విచ్చలవిడిగా బెనిఫిట్ షోలు వేసి ప్రజల డబ్బు దోచుకున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు బతకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని కొడాలి నాని చెప్పారు. 4. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నానన్నారు. త్వరలోనే రిప‌బ్లిక్ సినిమా చూస్తానని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.  5. కాంగ్రెస్ దళితుల పార్టీ అని, ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరో వేలుగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితున్ని రాష్ట్రపతిని చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. పంజాబ్‌లో పేద దళితున్ని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. తెలంగాణలో శాసనసభా పక్ష నేతగా దళిత నాయకుడు భట్టికి అవకాశం ఇచ్చిందని.. ఏపీలో దళిత బిడ్డ శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించిందని అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు.  6. తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఈట‌ల గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ అన్నారు. అసెంబ్లీలో త్రిబుల్ ఆర్‌.. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజేంద‌ర్‌లు ప్ర‌జ‌ల ప‌క్షాన బ‌ల‌మైన వాయిస్‌ను వినిపిస్తార‌ని బండి తెలిపారు. 7. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారి రమేష్‌కు నోటీసులు జారీ చేశారు. హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ కార్యాలయంలో ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని పోలీసులు ఆదేశించారు. మస్తాన్ వలి, రాజ్‌కుమార్‌తో అధికారుల సంబంధాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రఫీతో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపించారని ప్రశ్నించే అవకాశం ఉంది.  8. ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ అక్ర‌మాల కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ కస్టడీలో ఆశించిన స్థాయిలో సమాచారం  లభించలేదని చెబుతున్నారు. సెక్షన్‌లో సిబ్బంది అందరికీ సిస్టం యాక్సెస్ ఉండటంతో నకిలీ బిల్లులపై ఆధారాలు లభించలేదు. చెల్లింపులు నిర్ధారించే యూజర్ ఐడీల గోప్యతలో లోపం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సాంకేతిక సాక్ష్యాల కోసం ఏసీబీ ప్రయత్నిస్తోంది.   9. ఏపీలో ఊరూ-పేరూ లేని మ‌ద్యం అమ్ముతుండ‌టంతో.. బ్రాండెడ్ లిక్క‌ర్‌ స్మ‌గ్లింగ్‌ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. తాజాగా ఏపీలో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర మద్యాన్ని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ మీదుగా గుంటూరు జిల్లా రేపల్లె తరలిస్తున్న రూ.7 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న బస్సును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  10. ‘‘నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పింది’’ అంటూ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ విక్ట‌రీ మెసేజ్ ఇచ్చారు. బెంగాల్‌లో జ‌రిగిన‌ తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా చతికిల పడింది. బైపోల్ జ‌రిగిన చోట్ల బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు రావ‌డం విశేషం. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.92 శాతం ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. తాజా ఉప ఎన్నికల్లో 18 శాతానికి పైగా ఓట్లు సంపాదించడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. 

ప‌వ‌న్‌ది కుల రాజ‌కీయమా? క‌మ్మ‌, కాపు, బ‌లిజ‌ల‌ను ఏకం చేస్తున్నారా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. పుట్టుక‌తో కాపు. కానీ.. త‌న‌కు కులం, మతం, ప్రాంతం లేద‌ని.. తాను భారతీయుడిని మాత్ర‌మేన‌ని చెబుతుంటారు. ఆ విష‌యాన్ని ప‌దే ప‌దే బ‌హిరంగ వేదిక‌ల‌పై గ‌ట్టిగా, బ‌లంగా వినిపించారు. తాను కుల రాజ‌కీయాలు చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ఓ సంద‌ర్భంలో త‌న‌కు కాపు సంఘం నాయ‌కుల‌ మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని.. మిమ్మ‌ల్ని మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నేనేమ‌న్నా అడిగానా? అని కూడా అన్నారు. ఇదంతా జ‌న‌సేన స్థాపించిన కొత్త‌లో. కానీ, ఎక్కువ శాతం ప్ర‌జ‌లు జ‌న‌సేన‌ను కాపుల పార్టీగానే ప‌రిగ‌ణించారు. అందుకే, ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వం ఎదురైంది. కులాల లెక్క‌ల్లో జ‌న‌సేన కొట్టుకుపోయింది.  కాలం గ‌డుస్తున్నా కొద్దీ ప‌వ‌న్‌కు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. కులాల ప్ర‌స్తావ‌న లేకుండా ఏపీలో రాజ‌కీయంగా రాణించ‌డం క‌ష్ట‌సాధ్య‌మ‌ని తెలిసొచ్చిన‌ట్టుంది. అందుకే కాబోలు కొన్ని రోజులుగా జ‌న‌సేనాని ప్ర‌సంగాలు కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. బ‌లమైన వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు.. వ్యూహాత్మ‌కంగా కుల రాజ‌కీయం చేస్తున్న‌ట్టున్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఆస‌క్తిక‌రమైన విష‌యం ఏంటంటే.. కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి.. కులాల‌తో పాటు క‌మ్మ వారిని సైతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లుపుకు పోయేలా రాజ‌కీయం నెరుపుతుండ‌టం జ‌న‌సేన‌ సోష‌ల్ ఇంజినీరింగ్‌కు నిద‌ర్శ‌నం. తెలుగుదేశం పార్టీని కమ్మవారి పార్టీగా, జనసేనను కాపుల పార్టీగా ముద్రేసి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌రెడ్డి ఎత్తుగ‌డ‌కు చెక్ పెట్టేలా ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా కులాల టాపిక్ తీసుకొస్తున్నార‌ని అంటున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగాల్లో అడుగ‌డుగునా కుల ప్ర‌స్తావ‌న వ‌స్తోంది. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని.. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని జ‌న‌సేనాని మండిపడ్డారు. క‌మ్మ‌ల‌ను ఉద్దేశించే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రెడ్డి పార్టీ అయిన వైసీపీ.. క‌మ్మ‌ల‌ను శ‌త్రువులుగా చూడ‌టం త‌గ‌ద‌ని.. ప‌లు పోరాటాల్లో క‌మ్మ వ‌ర్గీయులు ప్ర‌ముఖ పాత్ర వ‌హించారంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప‌వ‌న్‌క‌ల్యాన్ స‌డెన్‌గా క‌మ్మ కులానికి మ‌ద్ద‌తుగా స్టేట్‌మెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పీకేపై కాపు అనే ముద్ర వేసి.. క‌మ్మ వారు ఆయ‌న్ను దూరం పెట్టార‌ని అంటారు. ఆ వ‌ర్గ‌మంతా టీడీపీకి మ‌ద్ద‌తుదారులుగా ఉన్నారు. తాను క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకం కాద‌నే భావ‌న క‌లిగేలా.. వైసీపీ ప్ర‌భుత్వం క‌మ్మ‌ల‌ను టార్గెట్ చేయ‌డం స‌రికాద‌న్న‌ట్టు చెప్ప‌డం  ఆ వ‌ర్గాన్ని ఆకర్షించే ప్ర‌య‌త్నంలో భాగ‌మే అంటున్నారు.  ఇక‌, అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారంటూ.. తాను ఏ కులానికీ వ్యతిరేకం కాదన్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. మంగళగిరి స‌మావేశంలో కాపు నాయకుడిగా పేరొందిన వంగవీటి రంగా హత్య గురించి ప‌వ‌న్‌ ప్రత్యేకంగా ప్రస్తావించడం కాక‌తాళీయం కాక‌పోవ‌చ్చు. ఇక‌, రాజ‌మండ్రి స‌భ‌లోనూ కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి.. కుల‌స్తులంగా ఐక్యంగా ముందుకు క‌ద‌లి.. మిగతా వ‌ర్గాల‌కూ నాయ‌క‌త్వం వ‌హించి.. రాజ్యాధికారం సాధించాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు బ‌లమైన మ‌ద్ద‌తుగా నిలిచే కాపుల‌ను తెల‌గ‌, బ‌లిజ‌,  ఒంట‌రిల‌తో స‌హా మిగ‌తా వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు, ద‌ళితుల‌ను అంద‌రినీ క‌లుపుకు పోయేలా ప‌వ‌న్ ప్ర‌సంగం సాగ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్-కాపు అంటూ త‌న‌ను మిగ‌తా వ‌ర్గాలు ప‌క్క‌న పెట్టేయ‌కుండా.. ఇలా అన్ని కులాల ప్ర‌స్తావ‌న తీసుకొస్తూ.. మెజార్టీ వ‌ర్గాలకు ద‌గ్గ‌ర కావాల‌నేదే పీకే ప్ర‌య‌త్నంలా క‌నిపిస్తోంది.   అందుకే, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కమ్మ కులస్థులకు.. రెడ్డి కులస్తులు వ్యతిరేకమని, కాపు కులస్తులు కాదని అన్నారు.  ప‌నిలో ప‌నిగా తాను రెడ్డి వ‌ర్గానికీ వ్య‌తిరేకం కాద‌ని.. కేవ‌లం వైసీపీకి మాత్ర‌మే వ్య‌తిరేకం అనే భావ‌న క‌లిగేలా.. అనంత‌పురం స‌భ‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స్టేట్‌మెంట్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎందరో తన ద‌గ్గ‌ర‌ బాధలు చెప్పుకున్నారన్నారు. జిల్లాలో తమ పార్టీ నాయకుడు చిలకం మధుసూదనరెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారని.. టీడీపీకి చెందిన‌ జేసీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలు తనకు ఆవేదన, బాధ కలిగించాయన్నారు. ఇలా, రెడ్ల‌నూ మేనేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.  ఇలా, కులాల వారీగా ప్రాంతాల‌ను బ‌ట్టి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేస్తున్న ప్ర‌సంగాలు ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడి మాట‌ల్లా ఉన్నాయి. కాదు కాదంటూనే.. జ‌న‌సేనాని సైతం క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని అంటున్నారు. వైసీపీని గ‌ద్దె దించేందుకు.. ఆ పార్టీ త‌ర‌హాలో కులాల రాజ‌కీయం చేస్తే త‌ప్పేముంద‌ని స‌మ‌ర్థించేవారూ లేక‌పోలేదు. మ‌రి, ఈ త‌ర‌హా ప్ర‌సంగాలు.. ప‌వ‌న్‌ను ఆయా కులాల‌కు ద‌గ్గ‌ర చేస్తాయా?  పీకే ల‌క్ష్యం నెర‌వేరుతుందా?

భవానీపూర్ లో మమత రికార్డ్ విజయం.. 

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్  అసెంబ్లీ  నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణామూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58,389 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. భారీ మెజార్టీతో బెంగాల్ లో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు మమతా బెనర్జీ. 2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓడించింది. 34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తాజాగా భవానీ పూర్ ఉప ఎన్నికలో ఆ రికార్డును ఆమె  తిరగరాశారు.  2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. అనంతరం 2011లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేత నందిని ముఖర్జీపై 54,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. 6 నెలల లోపు ఆమె ఎమ్మెల్యే కావాల్సి ఉంది. తాజా విజయంతో  మమత ముఖ్యమంత్రి పదవికి చిక్కులు తొలగిపోయాయి. ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్, జంగీపూర్ శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయం సాధించింది.  తన విజయంపై స్పందించారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు.‘‘దేశంలోని తల్లులకు, సోదరసోదరీమణులకు అందరికీ కృతజ్ణతలు. 2016లో కొన్ని వార్డుల్లో మాకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌లో 46 శాతం బెంగాల్‌కు చెందని వారే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు నాకు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మమ్మత్ని అధికారం నుంచి తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోంది. నా కాలికి కూడా గాయమైంది. మాపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ణతలు’’ అని మమతా బెనర్జీ అన్నారు. తన ఓటమిపై బీజేపీ అభ్యర్థి ప్రియాంక స్పందించారు. ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని అన్నారు. అయితే ఈ ఆటలో తాను ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''గా నిలిచానని చెప్పారు. మమతా బెనర్జీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గంలో తాను పోటీ చేసి, 25,000కు పైగా ఓట్లు గెలుచుకున్నానని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని అన్నారు. మునుముందు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. 

ఈటల రాజేందర్ పై దాడికి టీఆర్ఎస్ కుట్ర? హుజురాబాద్ లో కలకలం.. 

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అదే సమయంలో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు లీడర్లు. కొన్ని రోజులుగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఉప ఎన్నిక ప్రచారంలో దాడులు జరగవచ్చనే వాదన రావడం కలకలం రేపుతోంది.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈట‌ల రాజేంద‌ర్‌పై దాడి జ‌రుగబోతోందంటూ కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  టీఆర్ఎస్ నేతలు ఇదే చెబుతున్నారు. అయితే ఓట్లర్లలో సానుభూతి కోసం ఈటల తనపై తానే దాడి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించి సంచలనానికి తెరతీశారు ఎమ్మెల్యే బాల్కసుమన్.  కోడి క‌త్తి దాడి త‌ర‌హాలోనే రాజ‌కీయంగా లాభ‌ప‌డ‌టానికి ఈట‌ల‌నే.. త‌న‌పై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్ర‌చారం అవుతుండ‌టం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది.  తనపై జరుగుతున్న ప్రచారంపై ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. కావాల‌నే త‌న‌పై ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉండే ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేత‌లు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు హుజురాబాద్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. తాను గన్ మెన్‌లపై ఆధారపడి ఉండలేదని, తనలాంటి వాళ్లను కాపాడుకునే కర్తవ్యం తెలంగాణ ప్రజలకు ఉందని ఈటల అన్నారు. ఉద్యమాలు చేసినప్పుడు.. ఇప్పుడూ అలాగే ఉన్నామని స్పష్టం చేశారు.  నీచమైన కార్యక్రమాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడడుతున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని విమర్శించారు.  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ధర్మంగా కొట్లాడాలన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు.    

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే విజయం! ఏపీ లేటెస్ట్ సర్వేలో సంచలనం.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుందని ఇటీవల వెల్లడైన కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది. ఇండియా టుడే లాంటి జాతీయ ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేలోనూ ఏపీ సీఎం జగన్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది. ఏపీ జనాలు కూడా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అధ్వాన్న రోడ్లు, పతనమైన ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు క్షీణించడం, మహిళలపై పెరిగిపోతున్న దాడులు, ఉద్యోగాల భర్తీ లేకపోవడం వంటి అంశాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. కొన్ని రోజులుగా సీఎం జగన్, వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే సాగుతుందని తెలుస్తోంది.  తాజాగా ఎన్నికల సర్వేల్లో ఖచ్చితమైన అంచనాలు ఇస్తుందనే పేరున్న ఆత్మ సాక్షి సంస్థ నిర్వహించిన సర్వేలోనూ సంచలన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ‌లుగా పేరుగాంచిన ఐఐటీల్లో విద్య‌న‌భ్య‌సించిన నిపుణుల ఆధ్వ‌ర్యంలో ఈ సర్వే జ‌రిగింది. ఏపీలో జ‌గ‌న్ పాల‌న రెండున్న‌రేళ్లు పూర్తి కావ‌స్తోంది. అంటే.. జ‌గ‌న్ త‌న ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో ఇప్ప‌టికే స‌గం మేర పాల‌న‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఆత్మసాక్ష్మి సంస్థ సర్వే జరిపింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగేతే ఏపీలో టీడీపీదే విజయమని ఆ సర్వేలో తేలింది. ఆత్మ సాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతానికి వైసీపీ కంటే టీడీపీకి మూడు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు.  2019 ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ సీట్ల‌లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఏక‌ంగా 151 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. పోలైన మొత్తం ఓట్ల‌లో దాదాపుగా 50 శాతం ఓట్ల‌ను వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన‌ టీడీపీకి 39 శాతం మేర ఓట్లు వ‌చ్చాయి. అంటే. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల‌లో 11 శాతం తేడా ఉంది. అయితే జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల పాల‌న ముగుస్తున్న సమ‌యానికి ఆత్మ సాక్షి సంస్థ సర్వే ప్రకారం  వైసీపీ నుంచి 4.5 శాతం ఓటర్లు దూర‌య్యారు. వీరంతా విప‌క్ష టీడీపీ వైపు మ‌ళ్లారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ద‌క్కే ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. వైసీపీ ఓట్ల శాతం 45.5 శాతానికి ప‌డిపోయింది. అంటే.. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 2 శాత‌మే. అయితే ఆత్మ సాక్షి సర్వేలో 4.75 శాతం మంది ఓట‌ర్లు ఎవ‌రి ప‌క్షం వ‌హించలేదు. అంటే ఈ 4.75 శాతం మంది ఓటర్లు ఎవరి వైపు అయినా మళ్లవచ్చు.  జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నాల్లో భారీగా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో త‌ట‌స్థంగా ఉన్న ఈ 4.75 శాతం ఓట‌ర్లు టీడీపీ వైపున‌కు తిరిగే ఛాన్సే ఎక్కువ‌ అంటున్నారు. అదే జ‌రిగితే.. టీడీపీకి ప‌డే ఓట్ల శాతం 48.25 శాతానికి చేరుతుంది. వైసీపీ ఓట్ల శాతం మాత్రం 45.5 శాతం దగ్గరే ఉండనుంది, ఈ లెక్కన  వైసీపీ కంటే కూడా దాదాపు 3 శాతం మేర ఓట్ల‌ను అధికంగా సాధించ‌నున్న టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుంది. జగన్ పాలనపై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఎన్నికల సమయానికి ఓట్ల మార్జిన్ భారీగా పెరుగుతుందని, టీడీపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆత్మ సాక్షి సర్వేను విశ్లేషించిన తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు.  ఆత్మసాక్షి సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 46 మంది ఓడిపోవ‌డం ఖాయమని తేలింది. వీరిలో 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీలుగా గెలిచిన 23 మందిలో 7 మంది ఏం చేసినా కూడా తిరిగి గెల‌వ‌రట. ఓట‌మి అంచుల్లో ప‌య‌నిస్తున్న మంత్రులు ఏకంగా 11 మంది ఉంటే.. వారిలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. హోం మంత్రిగా కొన‌సాగుతున్న మేక‌తోటి సుచ‌రిత‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప‌శ్రీవాణి, రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ ఉన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి శంక‌ర‌నారాయణ‌, కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వ‌నిత‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు, జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ ఓడిపోతారని ఆత్మ సాక్షి సంస్థ సర్వేలో తేలింది. ఆత్మసాక్షి  సర్వే ప్రకారం ఓట‌మి దిశ‌గా సాగుతున్న ఎంపీల్లో బెల్లాన చంద్ర‌శేఖ‌ర్(విజ‌య‌న‌గ‌రం), ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌(విశాఖ‌ప‌ట్నం), మార్గాని భ‌ర‌త్ రామ్‌(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం), ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(న‌ర‌సాపురం), నందిగం సురేశ్‌(బాప‌ట్ల), గోరంట్ల మాధ‌వ్‌(హిందూపురం), చింతా అనురాధ‌(అమ‌లాపురం), సంజీవ్ కుమార్‌(క‌ర్నూలు) ఉన్నారు. వైసీపీ పాలన రెండున్నర ఏండ్లు పూర్తైన సమయంలో నిర్వహించిన ఆత్మసాక్షి సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ నేతలను, సీఎం జగన్ రెడ్డిని కలవరానికి గురి చేస్తున్నాయని తెలుస్తోంది

బ‌ద్వేల్‌తో బీజేపీకి జ‌న‌సేన‌ రాం రాం.. టీడీపీకి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ద‌గ్గ‌ర‌వుతున్నారా?

బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య విభేదాలు. ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌తో దానిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. బ‌ద్వేల్ బై ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసేది లేదంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తేల్చి చెప్పేశారు. బీజేపీ మాత్రం తాము బ‌రిలో నిలుస్తామ‌ని చెబుతోంది. ఇలా ఎవ‌రికి వారే.. వేరు వేరు పొలిటిక‌ల్ స్టాండ్స్ తీసుకోవ‌డం.. ఆ రెండు పార్టీలు బ్రేక‌ప్ చెప్ప‌బోతున్నాయ‌నే వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది.  తిరుప‌తి ఎంపీ ఉప‌ ఎన్నిక‌ల్లోనే బీజేపీ-జ‌న‌సేన‌ల మైత్రికి బీట‌లు వారాయి. తిరుప‌తిలో ఆ రెండు పార్టీలు క‌లిసే పోటీ చేసినా.. ఒకే ఒక్కరోజు మాత్ర‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జారిపోయాయి. క‌డ‌ప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హ వివాదంలో జ‌న‌సేన క‌ల‌గ‌జేసుకోలేదు. తాజాగా, ప‌వ‌న్‌కల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య ఆన్‌లైన్ టికెట్ల గొడ‌వ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నా.. ప‌ర‌స్ప‌రం బూతులు తిట్ట‌కుంటున్నా.. క‌మ‌ల‌నాథులు పీకేకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు. ఇలా కొంత‌కాలంగా ఎవ‌రి రాజ‌కీయం వారిదే. మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన‌ధికారికంగా జ‌న‌సేన‌-టీడీపీ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుని ప‌లుస్థానాలు గెలుచుకోవ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్.  బ‌ద్వేల్ బైపోల్‌తో బీజేపీ-జ‌న‌సేన‌ల విభేదాలు మ‌రోసారి వెలుగుచూశాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు త‌మ‌ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధా.. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌లు బ‌రిలో నిలిచారు. మ‌రి, బీజేపీ-జనసేన కలిసి అభ్యర్థిని బరిలోకి దింపుతాయా..? లేదా..? అనే విషయంపై ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా.. బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ విష‌యాన్ని తేల్చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో.. తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించడం ఆస‌క్తిక‌రంగా మారింది.  బీజేపీతో చ‌ర్చించ‌కుండానే జ‌న‌సేన ఈ నిర్ణ‌యం తీసేసుకుంద‌ని అంటున్నారు. ఓవైపు బ‌ద్వేల్‌లో పోటీ చేసి.. బ‌లం నిరూపించుకోవాల‌ని బీజేపీ బ‌లంగా భావిస్తోంది. ఇటీవ‌ల క‌డ‌ప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఎపిసోడ్‌తో బీజేపీకి మైలేజ్ పెరిగింద‌ని.. ఆ టెంపో కంటిన్యూ చేసేలా ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందులోనూ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో మ‌రింత ప్రాధాన్యంత పెరిగింది. ఇలాంటి కీల‌క త‌రుణంలో.. బీజేపీకి స‌పోర్ట్ చేయ‌కుండా.. జ‌న‌సేన హ్యాండ్స‌ప్ అన‌డం ఆ పార్టీకి మింగుడుప‌డ‌ని అంశం. బీజేపీపై కొంత‌కాలంగా గుర్రుగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. కావాల‌నే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌మ‌ల‌నాథులు అనుమానిస్తున్నారు. ముందుగా ఇరు ప‌క్షాలు క‌ల‌సి చ‌ర్చించుకోకుండా.. ఓ ఏకాభిప్రాయానికి రాకుండా.. స‌డెన్‌గా బ‌హిరంగ వేదిక‌పై ఇలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే.. బీజేపీని పీకే పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది స్ప‌ష్టం అవుతోంది. జ‌న‌సేన త‌ట‌స్థంగా ఉండ‌టం ఎవ‌రికి లాభం? అంటే,, నిస్సందేహంగా టీడీపీకే ప్ర‌యోజ‌నం అంటున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీకి ఓటు వేయ‌రు. ఇక బీజేపీతో విభేదాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో.. ఆ పార్టీకి స‌పోర్ట్ చేయ‌రు. ఇక మిగిలింది టీడీపీ మాత్ర‌మే. క్రిందిస్థాయిలో ఇప్ప‌టికే జ‌న‌సేనికులు, తెలుగు త‌మ్ముళ్లు కులిసి మెలిసి రాజ‌కీయం చేస్తున్నారు. ఇప్పుడు బ‌ద్వేల్‌లో జ‌న‌సేన న్యూట్ర‌ల్‌గా ఉంటే.. ప‌వ‌న్ అభిమానులంతా బీజేపీకి కాకుండా టీడీపీకే ఓటేసే ప‌రిస్థితి ఉంటుంది. ఈ విష‌యం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలియంది కాదు. టీడీపీపై జ‌న‌సేన‌కున్న సాఫ్ట్ కార్న‌ర్‌తోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.  బీజేపీతో చ‌ర్చించ‌కుండా బ‌ద్వేల్ బ‌రి నుంచి జ‌న‌సేన త‌ప్పుకోవ‌డం.. ఆ పార్టీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ దూర‌మ‌వుతున్నార‌నే అనుమానానికి మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీపై జ‌న‌సేన ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల టీడీపీని, క‌మ్మ వ‌ర్గాన్ని వైసీపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోందంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మండిప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌చార‌మే నిజ‌మైతే.. టీడీపీ-జ‌న‌సేన‌ల మైత్రి మ‌రోసారి చూడొచ్చు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...

టాప్ న్యూస్ @ 1PM

రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు --------- వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా 25 వేల కోట్ల అప్పులు తేవడానికి విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను రాత్రిపూట తనఖా పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై విష్ణుకుమార్ మాట్లాడుతూ.. ‘జగన్ సర్కార్.. టెంపరరీ ప్రభుత్వం’ అని వ్యాఖ్యానించారు.  ---------  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు.వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడం స్వాగతిస్తున్నామన్నారు.  ----------- నెల్లూరు రూరల్ పరిధిలో గల నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెలు తగలబడ్డాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు గుడిసెలకు నిప్పటించినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంత కాలంగా స్థానికంగా నివాసముంటున్న దళితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇలా గుడిసెలు తగలబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ----- ఎంజే నాయుడు హాస్పటల్స్ ఆధ్వర్యంలో దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్ విజయవాడ బెంజిసర్కిల్ నుంచి స్టేడియం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగర సిపి శ్రీనివాసులు వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక నూతన విధానాలను అమలు‌ చేస్తుందన్నారు. -------- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై ప్రభుత్వం వేటు వేయడంతో ఆయన రాజీనామా చేశారు.  ----  స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొత్త చీరలు కొనిచ్చి అవ్వ-అయ్యా, అత్తా-మామ, భర్త కూడా అవుతుండని కామెంట్ చేశారు. లింగాల ఘనాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  -------- తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 43 కోట్ల నిధులు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదట 43 కోట్ల నిధులే అనుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల డిపాజిట్లను ముఠా కొట్టేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రూ.54 కోట్లతో పాటు ఇతరుల డిపాజిట్లు కూడా మస్తాన్‌వలీ ముఠా కాజేసింది ----------- రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ ఏడాది మొదట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఢిల్లీలో 'బందీ'గా ఉంచారంటూ వ్యాఖ్యానించారు. నెలల క్రితమే బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆయన న్యూఢిల్లీలో నిర్బంధంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ చీఫ్‌ కావాలనుకుని కలలు కంటున్న కొందరు వ్యక్తులు పార్టీలో ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. ------ స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చ‌ేసింది. నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న‌ పేరును స‌మంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెల‌ల క్రితం అక్కినేని పేరును తొల‌గించింది. త‌న పేరును 'ఎస్' గా పెట్టుకుంది. త‌న పేరులో మొద‌టి అక్ష‌రాన్ని మాత్ర‌మే ఆమె ఉంచింది.  చైతూతో విడిపోతున్నాన‌ని ఆమె అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత మ‌ళ్లీ  'ఎస్' అక్ష‌రాన్ని తొల‌గించి 'స‌మంత'గా మార్చేసుకుంది. --- ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు  

ఆప్ఘన్ డ్రగ్స్ దందా వెనుక విజయసాయి రెడ్డి? బిగ్ బాస్ డైరెక్షన్ లోనే మాఫియా..? 

ఆప్ఘనీస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడ అడ్రస్ తో రవాణా అవుతూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కేసులో విచారణ కొనసాగుతోంది. దాదాపు 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ కావడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. డ్రగ్స్ దందా వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. డీఆర్ఐ విచారణలోనూ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన హెరాయిన్ విజయవాడకు రవాణా అవుతుండటంతో ఏపీలో పెను సంచలనమైంది. మచిలిపట్నంతో పాటు కాకినాడ పోర్టులు డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆప్ఘనీస్తాన్ నుంచి రవాణా అవుతున్న డ్రగ్స్ దందా నడిపిస్తున్న మాఫియాకు ఏపీలోని అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకయ్య సంచలన ఆరోపణలు చేశారు.  రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో ఎంపీ విజయసారెడ్డి ప్రమేయముందని ఆయన ఆరోపించారు. మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్నారు బుద్దా వెంకన్న. ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తెలియవచ్చిందన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్ వ్యవహారం గుట్టుమట్లు బయటపడతాయన్నారు.  డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్‌కు సహకరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. బిగ్ బాస్‌కు తెలియకుండా విజయసాయిరెడ్డి ఏమీ చేయరనేది వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామాల్లో అరుగుల మీద కూర్చునే ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం విజయసాయి అక్రమార్జన, అవినీతి గుట్టుమట్లను చేధిస్తుందన్నారు. ఏ2 చేసిన అవినీతికి శిక్షలు వేయాలంటే రాజ్యాంగంలో ఇప్పుడున్న శిక్షలు సరిపోవని బుద్దా వెంకన్న అన్నారు. 

కేసీఆరే అందరికి భర్త అయ్యాడట.. నోరు జారిన ఎమ్మెల్యే రాజయ్య! వైరల్ వీడియో..

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యే టి.రాజయ్య మాట జారారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. జనగామ జిల్లా లింగాలఘణపురంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.  ఎమ్మెల్యే రాజయ్య ఏమన్నారంటే.. ‘బాలింత మహిళలు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చే సూట్‌కేసు పిక్కుటంగా ఉంటది. దాని జిప్‌ తియ్యంగానే బాలింత చీరలు బయటపడుతాయి. మెత్తటి పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్‌లు, తుడుచుకునేందుకు తువ్వాలలు ఉంటాయి. ఎనుకట ముక్కిపోయిన బట్టలు తీసుకుని ముసలోళ్లో, అవ్వగారొళ్లో, నాయనమ్మ బాపమ్మలు పట్టుకొని వచ్చేవారు. సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు’ అని  రాజయ్య చెప్పారు.  కేసీఆరే అందరికి భర్త అయ్యాడంటూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే మట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జారిన ఆ మాట చర్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్లు వివాదాస్పమయ్యాయి.    

తెలంగాణలో త్రికోణం తప్పదా? రేవంత్ రాకతో మారిన సీన్.. 

భారతీయ జనతా పార్టీ - బీజేపీ - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలిమజిలీ చేరింది. తొవిడత పాదయాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది.ఈ సందర్భంగా హుస్నాబాద్’లో ఏర్పాటు చేసిన బహిరణ సభలో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా కేంద్ర,రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తానికి 36 రోజుల పాటు సాగిన బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర ఆశించిన విధంగా ఉప ఎన్నిక జరుగతున్న హుజూరాబాద్’ లో ఎంటర్ కాకుండానే, ఉప ఎన్నికల నగారా మోగింది. దీంతో హుజూరాబాద్’ బదులుగా హుస్నాబాద్’లో ముగింపు సభ జరిగింది. నిజానికి, బండి పాదయాత్ర హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని చేసిన పాదయాత్ర కాదు.2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర.  అయితే ఈ పాదయత్ర సక్సెస్ అయిందా అంటే, అయిందనే బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పాదయాత్ర లక్ష్యం, 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అయితే, అది ఇంతటితో, తొలి మజిలీతో తేలే విషయం కాదు. తెలంగాణలో అధికారం అనేది, బీజేపీకి, ఆ మాట కొస్తే, బీజేపే కంటే మరో పది మెట్లు ముందున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సుదూర స్వప్నం. నిజానికి, ఈరోజు ఉన్న  పరిస్థితిని గమనిస్తే, సీట్ల సంఖ్య, ఓట్ల శాతం లేదా పాపులర్ పర్సెప్షన్’ ఏది చూసినా,తెరాస, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడవ స్థానంలో బీజేపీ ఉంది. అంటే, బీజేపీ డైరెక్ట్’గా తెరాసతో తలపడాలి అంటే కాంగ్రెస్’ను వెనక్కి నెట్టి, బీజేపీ ... మరో మెట్టు పైకి ఎక్కవలసి ఉంటుంది. నిజానికి, ప్రజా సంగ్రామ యాత్ర తొలి గమ్యం కూడా అదే. అయితే, ఒక్కప్పుడు అయితే ఏమో కానీ,రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అది అంత ఈజీ టాస్క్ కాదు. రేవంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో   రాజకీయ  సమీకరణలు  వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్ళిన నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు  ఎవరూ వెనక్కి రాకపోయినా వలసలు అయితే ఆగిపోయాయి. పార్టీ పట్ల నాయకుల్లోనే కాదు, ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది.  నిజానికి, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి చిట్ట చివరగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల  ఫలితాలను గమనిస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక సీటు ఎక్కువగా \ నాలుగు సీట్లు దక్కాయి. కానీ, ఓట్ల లెక్కలలోకి వస్తే, కాంగ్రెస్,బీజేపీల మధ్య పది శాతం వరకు ఓట్ల వ్యత్యాసం వుంది.బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి పది శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్’కు 29.48 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి వచ్చిన ఓట్లు 19.49 శాతం. తెరాస ఏకంగా 41.29 శాతం ఓట్లతో అందనంత ఎత్తులో ఉంది. సో.. రానున్న రెండేళ్లలో, బీజేపీ, ఇప్పుడున్న బలాన్ని రెట్టింపు చేసుకుంటేనే గానీ,  అధికారం కోసం నేరుగా తెరాసతో తలపడే  పరిస్టితి రాదు.  అలాగని అది అసాధ్యమా అంటే కానే కాదు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్ర పక్షం ఆర్జేడీ అన్నట్లుగా సింకింగ్ బోటు.. మునుగుతున్న పడవ.. బీజేపీ రాష్ట్రంలో ఎలా ఉన్నాజాతీయ స్థాయిలో అక్కడా ఇక్కడా చిన్న చిన్న ఎదురుదెబ్బలు తిన్నా ఎదుగుతున్న పార్టీ ... ఈశాన్య రాష్ట్రాలలో జీరో నుంచి మొదలు పెట్టి కాంగ్రెస్ కంచుకోట అస్సాం, వామ పక్షాల ఎర్ర కోట త్రిపుర సహా మొత్తం ఏడు రాష్ట్రాలలో పాగా వేసింది. అయితే, బీజేపీ  అక్కడ అలా విజయం సాధించింది కాబట్టి, ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది, అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజానికి, ఎన్నికల లెక్కలు, ప్రతి ఎన్నికకు మారి పోతూనే ఉంటాయి. ఇదే బీజేపీకి ఇదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీటు ఒకటి, పువ్వు గుర్తుకు పోలైన ఓట్లు  7.1 శాతం. కానీ సంవత్సరం తిరగకుండానే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 12 శాతం మేర పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటుకు పరిమిత మయిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు, అంటే ఇంచుమించుగా 25 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యతను సాధించింది.  కాబట్టి ఎన్నికల లెక్కలు ఎన్నికల లెక్కలే ... ఆ సమయానికి ఉన్న  లెక్కలను బట్టి ఫలితాలు ఉంటాయి .. తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయముంది. సో .. ఇపుడే లెక్కలు తీయడం.. టూ ఎర్లీ .. తొందరపాటు అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఇలాగే, కొనసాగితే మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.

ఇదెక్కడి దౌర్భాగ్యం! గాంధీజీకి నివాళి అర్పించని  కేసీఆర్.. 

మహాత్మ గాంధీ.. భారతదేశ జాతిపిత.. బాపూజీ జయంతిని దేశమంతా పండుగలా నిర్వహిస్తారు. పల్లె నుంచి పట్నం వరకూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు జరుపుతారు. గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని దేశ రాష్ట్రపతి, ప్రధాని వరకూ అంతా గాంధీజీకి నివాళి అర్పిస్తారు. బాపూజీ 152వ జయంతి సందర్భంగా శనివారం దేశమంతా వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని బాపూజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు నివాళులర్పించారు. దేశానికిమహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనను స్మరించుకున్నారు. దేశమంతా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం మొక్కుబడిగా నిర్వహించారు. హైద‌రాబాద్ లోని బాపూఘాట్ వ‌ద్ద ప్ర‌తి ఏటా సీఎం, ప్ర‌జా ప్రతినిధులు, మేధావులు వ‌చ్చి నివాళి అర్పించ‌టం ఆన‌వాయితీ. ప్రతి ఏటా ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. కాని ఈసారి మాత్రం గాంధీ జయంతిని తూతూమంత్రంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాపూఘాట్ కే రాలేదు. గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బాపూఘాట్ లో గాంధీజీకి నివాళి అర్పించారు. గాంధీకి నివాళి అర్పించడానికి కేసీఆర్ రాకపోవడంతో అందరిని షాక్ కు గురి చేసింది.  గాంధీ జయంతి సందర్భంగా బాఫూఘాట్ కు రాని కేసీఆర్.. కనీసం ఇంట్లో అయిన నివాళి అర్పించిన‌ట్లుగా బ‌య‌ట‌కు స‌మాచారం లేదు. అంతేకాదు బాపు ఘాట్ లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కే ఏర్పాట్ల‌ను అధికారులు తొల‌గించారు. గాంధీ జ‌యంతి రోజున ఆయ‌న మ్యూజియంను మూసివేశారు. గాంధీ జయంతి రోజున టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జాతిపితకు నివాళి అర్పించడానికి సీఎం కేసీఆర్ బాపూఘాట్ రాకపోవడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. జాతిపిత గాంధీకి పూల‌దండ వేసే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా…? అని  కాంగ్రెస్ సీనియర్ నేతలు  వీహెచ్, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. గాంధీని కేసీఆర్  అగౌర‌వ ప‌రుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సీఎంను గ‌తంలో ఎప్పుడూ చూడలేదన్నారు  కాంగ్రెస్  నేత‌లు. తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌న్నారు. 

వైసీపీకి జనసేన సపోర్ట్! బద్వేలుపై పవన్ కల్యాణ్ సంచలనం..

ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అధికార వైసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రమదానం నిర్వహించిన పవన్.. తర్వాత జరిగిన సభలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే రాజమండ్రి నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చిన జనసేనాని.. అక్కడి సభలో మాత్రం సంచలన నిర్ణయం ప్రకటించారు. వైసీపీకి ఊరటనిచ్చే ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బైపోల్ నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ దివంగత ఎమ్మెల్యే సతీమణిని తమ అభ్యర్థిగా ప్రకటించగా... గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను మళ్లీ బరిలోకి దింపుతోంది టీడీపీ. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. తిరుపతిలో బీజేపీ పోటీ చేసినందున.. బద్వేలులో జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటంతో.. బద్వేలు ఉప ఎన్నికను పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. బద్వేలు ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందని అంతా భావిస్తున్న సమయంలో బాంబ్ పేల్చారు పవన్ కల్యాణ్. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరికి షాకిచ్చారు జనసేన చీఫ్. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని పుట్టపర్తి సభలో ప్రకటించారు పవన్ కల్యాణ్.  పుట్టపర్తి సభలో బద్వేలు ఉప ఎన్నికపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జనసేన పోటీ చేయకపోవడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వ్యూహం ప్రకారమే పవన్ కల్యాణ్ అలా ప్రకటించారని అంటున్నారు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేన పోటీ చేయకూడదని నిర్ణయించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

గెల్లుకు వెంకట్ తో చెల్లు.. రేవంత్ దెబ్బకు టీఆర్ఎస్ లో వణుకు!

తేలిపోయింది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌రో స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం-ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షులు బాల‌మూరి వెంక‌ట్‌ను హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది అధిష్టానం. అంత‌గా బ‌లంలేని చోట‌.. బ‌ల‌మైన నాయ‌కులైన పొన్నం, కొండాల‌ను బ‌రిలో దింప‌కుండా వ్యూహాత్మ‌కంగా వెంక‌ట్‌ను రంగంలోకి దింపారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. యువ‌కుడు, విద్యార్థి సంఘం నాయ‌కుడైన బాల‌మూరి వెంక‌ట్‌ను హుజురాబాద్‌లో ప్ర‌యోగించ‌డం వెనుక రేవంత్ వ్యూహం అదుర్స్ అంటున్నారు. ఎంత కాద‌న్నా.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. పార్టీకి సైతం ఆ స్థానంపై అంత‌గా ఆస‌క్తి లేదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాబ‌ట్టి.. పోటీ చేయాల్సిందే కాబ‌ట్టి.. బ‌రిలో దిగుతోంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. హుజురాబాద్‌లో ప్ర‌ధాన పోరు.. టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్యే. ఈట‌ల రాజేంద‌ర్ గెలిస్తే.. కేసీఆర్‌కు దిమ్మ తిరిగే షాక్ త‌ప్ప‌దు. హుజురాబాద్ ఫ‌లితంతో కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు కూడా. టెక్నిక‌ల్‌గా ఆయ‌న బీజేపీలో ఉన్నా.. ఈ ఎన్నిక టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ కానే కాదు. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ మాత్ర‌మే. కారు గుర్తుపై గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీలో ఉన్నా.. ఆయ‌న్ను చూసి కాకుండా.. అధికార పార్టీపై రెఫరెండంగానే హుజురాబాద్ ఉప ఎన్నికను చూడాల్సి ఉంటుంది. కేసీఆర్‌ను ఆమోదిస్తే టీఆర్ఎస్‌కు ఓటేస్తారు.. లేదంటే ఈట‌ల‌ను గెలిపిస్తారు.. ఇది వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే ఫైట్ మాత్ర‌మే. ఇలాంటి ప్ర‌త్యేక సంద‌ర్భంలో అన‌వ‌స‌రంగా కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య‌లో దూరి.. కొండా సురేఖ‌లాంటి లీడ‌ర్‌ను నిల‌బెట్టి.. కేసీఆర్ వ్య‌తిరేక ఓటును చీల్చే త‌ప్పిదానికి పోకుండా.. వ్యూహాత్మ‌కంగా కాస్త త‌గ్గి నెగ్గే వ్యూహం ర‌చించారు రేవంత్‌రెడ్డి.  బాల‌మూరి వెంక‌ట్ అభ్య‌ర్థిత్వం విష‌యంలోనూ ప‌క్కాగా స్కెచ్ వేశారు పీసీసీ చీఫ్‌. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ విద్యార్థి సంఘం అధ్య‌క్షులు గెల్లు శ్రీనివాస్ బ‌రిలో ఉండ‌టంతో.. ఆయ‌న‌కు స‌రిస‌మాన స్థాయి ఉన్న ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బాల‌మూరి వెంక‌ట్‌ను పోటీలో నిలిపారు రేవంత్‌రెడ్డి. సో.. ఏ యువ‌త‌నైతే అట్రాక్ట్ చేద్దామ‌ని అధికార పార్టీ భావించిందో.. అదే యూత్ టార్గెట్‌గా బాల‌మూరిని ముందుంచింది కాంగ్రెస్‌. యువ‌త‌, నిరుద్యోగులు, విద్యార్థులు ఓట్ల‌న్నీ.. ఆ ఇద్ద‌రు విద్యార్థి సంఘం నాయ‌కుల మ‌ధ్య చీలిపోతాయ‌నేది హ‌స్తం పార్టీ అంచ‌నా. బాల‌మూరి వెంక‌ట్‌తో టీఆర్ఎస్ ఓట్ల‌కు భారీ గండి పెట్టాల‌నేది కాంగ్రెస్ వ్యూహంలా క‌నిపిస్తోంది. ఇలా, కారుకు ప‌డాల్సిన ఓట్ల‌ను కాంగ్రెస్ పార్టీ చీల్చి.. ఆ మేర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌యోజ‌నం జ‌రిగేలా.. ప‌రోక్ష వ్యూహం ర‌చించార‌ని తెలుస్తోంది.  హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపు దాదాపు అసాధ్యం అని తెలుసు కాబ‌ట్టే.. తాము ఓడినా.. కేసీఆర్ గెల‌వ‌కుండా చేసేందుకే.. గెల్లు గెలుపును బాల‌మూరితో చెల్లు చేసేలా.. విద్యార్థి సంఘం నాయ‌కుడిని హుజురాబాద్ బ‌రిలో నిలిపార‌ని అంటున్నారు. వారెవా.. రేవంత్‌రెడ్డి వ్యూహ‌మంటూ విశ్లేష‌కులు కొనియాడుతున్నారు.

TOP NEWS @ 7pm

1. నాగచైతన్య–సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఇక నుంచి మేం భార్యభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు జరిపి ఎంతో ఆలోచించిం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్ర‌యాణించాలని అనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహ బంధం కొనసాగినందుకు మేం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మా స్నేహబంధమే వివాహబంధానికి కీలకం అనే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అభిమానుల సపోర్ట్‌ కావాలి. మా ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చైతన్య, సమంత తమ పోస్ట్‌లో తెలిపారు.   2. త‌న‌ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని.. ఇక నుంచి ఊరుకునేది లేద‌ని.. తొక్కి ప‌ట్టి నార తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. తాను యాక్షన్‌, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదని.. త‌న సహనాన్ని ఇక పరీక్షించొద్దని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ అన్నారు.  3. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతుంటే వేల మందితో సభ ఎలా నిర్వ‌హిస్తార‌ని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.2200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని.. నవంబర్‌ నుంచి రోడ్ల‌ మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 4. అవినీతిపరుల చేతులకు అధికారమిచ్చి గాంధీజీ కోరుకున్న సమాజాన్ని నిర్మించగలమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మత్తు, మాదకద్రవ్యాలు లేని విధంగా దేశం రూపుదిద్దుకోవాలన్నారు. మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని నారా లోకేష్ అన్నారు.  5. బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 18 ఏళ్లు నిండి, ఆహార భద్రత కార్డ్ ఉన్న ప్రతి ఒక్క అడబిడ్డకూ బతుకమ్మ చీర ఇస్తామని తెలిపారు. మొత్తం 7,28,154 మంది అర్హులుగా గుర్తించి.. ఆ మేర‌కు చీరలను రెడీ చేస్తోంది తెలంగాణ స‌ర్కారు.  6. లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని.. అలాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా? అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి? శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా? అని ప్ర‌శ్నించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే జంగ్ సైరన్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్తత త‌లెత్తింది. దీంతో ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రేవంత్‌రెడ్డి.  7. సీఎం కావాలని పాదయాత్ర చేయడం లేదని, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వ‌హించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంపైనే మొదటి సంతకం పెడుతామని ప్రకటించారు. టీఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 8. తెలుగు అకాడమీ కుంభకోణంపై రిమాండ్ రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు ఉన్నాయి. నకిలీ లెటర్‌ హెడ్‌లతో పాటు నకిలీ సంతకాలతో నిధులను మళ్లించినట్టు గుర్తించారు. ఎఫ్‌డీల వెనుక తెలుగు అకాడమీ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేల్చారు. అకాడమీ ఖాతా నుంచి నిధులు.. ఏపీ మార్కెట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు బదలాయించారు.  9. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స్టేష‌న్ల వారీగా నేర‌గాళ్ల జాబితా సిద్ధం చేస్తూ.. రౌడీల అడ్రస్‌లు, లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. 10. టీఆర్ఎస్‌ అరాచకపాలనకు చరమగీతం పాడాలని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పిలుపు ఇచ్చారు. తెలంగాణలో నిరుదోగ్య సమస్య పెరిగిందని.. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతీ ఇరానీ.