శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు‌లో భారీగా గంజాయి పట్టివేత

  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించిన ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయంపై ఇండియాలో కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ కొనసాగుతోంది. హైడ్రోపోనిక్‌ గంజాయి అనేది మట్టి అవసరం లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పండించే అధిక నాణ్యత గల గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందించడంతో, కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో ఇవి వేగంగా పెరుగుతాయి. సాధారణ గంజాయితో పోలిస్తే ఇందులోని మత్తు పదార్థం టెట్రా హైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. విదేశాల నుంచి, ముఖ్యంగా థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి ఇది అక్రమంగా భారత్‌కు రవాణా అవుతోంది. కొన్ని దేశాల్లో సాగుపై నిబంధనలు సడలింపులు ఉండటంతో స్మగ్లింగ్‌ ముఠాలు దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఒక్క కిలో హైడ్రోపోనిక్‌ గంజాయి ధర రూ.1 కోటి వరకూ చేరుతోంది. తరచుగా మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.53 కోట్ల విలువైన హైడ్రోపోనిక్‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

చెత్తను తొలిగించి...చెత్త పాలిటిక్స్ క్లీన్‌ చేస్తాం : చంద్రబాబు

  గతంలో పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ పాలనంతా ముఠా నాయకులే చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేదని  ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో భాగంగా మాచర్లలో జరిగిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తను మాత్రమే కాకుండా, చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా శుభ్రం చేస్తామ‌ని స్పష్టం చేశారు.  “పల్నాడులో అరాచకాలు, దాడులు జరగనివ్వం. రౌడీయిజం, నేరాలు, ఘోరాల విషయంలో చూస్తూ ఊరుకోం. ప్రజల ఆస్తులను కాపాడేందుకు మేమే రక్షణగా నిలుస్తాం,” అని ఆయన హెచ్చరించారు.రాయలసీమలో గతంలో ముఠా సంస్కృతిని అణచివేశామని, పల్నాడులో కూడా అలాంటి పరిస్థితులకు తావివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.  రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిపై పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పన్నును రద్దు చేశామని గుర్తుచేశారు.“చెత్తను రోడ్ల నుండి తొలగించడం మాత్రమే కాదు, మనసులలోని చెత్తను కూడా తొలగించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు. మాచర్లలో ఇటీవల వరకు ప్రజాస్వామ్యానికి స్థానం లేకపోయిందని, ఎవరి ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు.

వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల పెద్దరెడ్డి తన అసమ్మతినీ, అసంతృప్తినీ బాహాటంగానే పార్టీ నేతల వద్దా, తన అనుచరుల వద్దా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.  వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. అంతే కాకుండా వైఎస్ హయాం నుంచీ కూడా పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి విధేయంగా ఉంటూ వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ తో కూడా అదే సాన్నిహిత్యం, విధేయతా ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే జగన్ ఆయనకు తన కేబినెట్ లో మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లూ మంత్రిగా కొనసాగనిచ్చారు.  ఇక గత ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో తన పట్టు నిలుపుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్టయ్యారో అప్పటి నుంచీ పెద్దిరెడ్డిలో అసహనం మొదలైందంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైన తరువాత ఇంత వరకూ జగన్ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. కారణాలేమైనా ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు.. మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ కూడా జగన్ రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఆ విషయం అలా ఉండగా తాజాగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్  పెద్దిరెడ్డికి కీలక బాధ్యత అప్పగించారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరై పార్టీ వాయిస్ ను గట్టిగావినిపిచాలన్న జగన్  పెద్దిరెడ్డిని  ముందుండి పార్టీ సభ్యులను గైడ్ చేయాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి ఆ ఆదేశాలను పాటించలేదు.. సరికదా తన వల్ల కాదని ముఖంముందే కుండబద్దలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సభను బాయ్ కాట్ చేసి తనను వెళ్లమనడమేంటని పార్టీ  నేతలతో ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విషయమే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పెద్దిరెడ్డి వంటి నేతే జగన్ ఆదేశాలను ఖాతరు చేయలేదంటే.. పార్టీపై జగన్ పట్టు సడలినట్టేనని అంటున్నారు.  సొంత పార్టీ నేతల విశ్వాసంపొందడంలోనే విఫలమైన జగన్ ను  జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

హెచ్ 1 బి వీసాలలో అమెజాన్ టాప్.. రెండో స్థానంలో టీసీఎస్

హెచ్1బి విసాలఫీజును భారీగా పెంచుతూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ల అమెరికా కలలను భగ్నం చేసిందనే చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన  ట్రంప్ నిర్ణయం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న  భారతీయ   కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఇండియన్ ఐటీ సంస్థలు  నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాలో నియమించుకోవడానికి H1-B వీసాపైనే ఎక్కువగా ఆధారపడతాయి. అలాగే  అమెరికన్ టెక్ దిగ్గజాలు కూడా ఈ వీసా   ద్వారా పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకుంటాయి. ఈ పరిస్థితుల్లో వీసా ఫీజు భారీగా పెంచడం ద్వారా అటువంటి నియామకాలపై పెను ప్రభావం పడిందనే చెప్పాలి.  అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  తాజా డేటా  ప్రకారం చూస్తే..  2024–25 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధిక సంఖ్యలో H1-B వీసాలను అందుకుంది. ఇక  రెండో స్థానంలో టీసీఎస్ ఉంది.   అమెజాన్ డాట్ కామ్  సర్వీసెస్ 10,040 హెచ్1 బివీసాలను, టీసీఎస్ 5,505 హెచ్1బీ వీసాలను తీసుకున్నాయి. ఇక మూడో స్థానంలో  మైక్రోసాఫ్ట్ 5,189 వీసాలతో, మెటా 5,123, ఆపిల్ 4,202 వీసాలతో వరుసగా ఆ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అలాగే దిగ్గజ టెక్ సంస్థలు  ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా  కూడా  పెద్ద సంఖ్యలోనే హెచ్1 బి వీసాల ఆధారంగా ఇండియన్స్ ను అక్కడ కొలువుల్లో చేర్చుకున్నాయి.  

ఓపిక పట్టు.. జాక్ పాట్ కొట్టు.. సేనాని సంయమనం కథ!

ఇది నిజంగా ఒక విజ‌య గాథ‌. ప్ర‌స్తుతం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌య చైర్మ‌న్ గా నియ‌మితులైన కొట్టేసాయి.. అప్ప‌ట్లో నిజంగానే సీఐ అంజూ యాద‌వ్ చేతిలో చెంప‌దెబ్బ కొట్టించుకున్నారు. ఆ అవ‌మాన భారం ఆయ‌న్ను ఎంత‌కీ వ‌ద‌ల్లేదు. ఎందుకంటే అది ప‌బ్లిక్ లో జ‌రిగింది. దానికి తోడు వీడియోల్లోనూ రికార్డ‌య్యింది.  కానీ కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది. ఆ శివ‌య్య కూడా స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓర్పు వ‌హించు నీకూ మంచి కాలం వ‌స్తుంద‌ని అభ‌య‌మిస్తుంటాడు. మ‌న‌మే దాన్ని గ్ర‌హించాల్సి ఉంటుంద‌ని సాయి అలా ఓపిక ప‌డుతూ వ‌చ్చారు. ఈలోగా రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న అంత‌మై కూట‌మి పాల‌న మొద‌లైంది. జనసేనాని తొలిచూపు.. కొట్టే సాయి వైపు మ‌ళ్లింది. అప్పుడు పార్టీ కోసం చెంప దెబ్బ తిన్న నేత‌కు ఏదైనా సాయం చేస్తే మేల‌నిపించింది. వెంట‌నే కొట్టేసాయిని అదే ఆల‌యం చైర్మ‌న్ గా చేశారు. ఈ మ‌ధ్య కాలంలో సేనాని ప‌దే ప‌దే ఇదే మాట అంటున్నారు. ఇటీవ‌ల మ‌చిలీప‌ట్నం ఉదంతం తీస్కుంటే, సేనాని ఇదే చెప్పారు. మీరెవ‌రూ చ‌ట్టాన్ని చేతిలోకి తీస్కోవ‌ద్దు. అంతా చ‌ట్ట ప్ర‌కార‌మే వెళ్దాం. కాస్త సంయ‌మ‌నం వ‌హించ‌మ‌ని అన‌డం మాత్ర‌మే కాదు త‌న శ్రేణుల‌ను ఉద్దేశించి.. పెద్ద ఎత్తున ట్వీట్ లెట‌ర్ రాశారు కూడా.  ఇప్పుడు కొట్టే సాయి రూపంలో.. అదే నిరూపించారు. సంయ‌మ‌నం వ‌హిస్తే క‌ఠిన కాలం క‌రుగుతుంది. అదృష్ట‌కాలం వ‌రిస్తుంది. ఇదిగో ఇలాంటి ప‌ద‌వులు సైతం పొందే అవ‌కాశం ల‌భిస్తుంది. కాబ‌ట్టి ఓపిక ప‌ట్టు జాక్ పాట్ ప‌ట్టు అన్న‌ది ఇందు మూలంగా మ‌నం నేర్చుకోవ‌ల్సిన పాఠంగానూ తెలుస్తోంది.

అయ్యో జ‌గ‌న్.. ఉన్న ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఊస్టింగేనా!?

  నేను అసెంబ్లీకి రాను. కావాలంటే మీరు వెళ్లండి. అవ‌స‌ర‌మైతే మీకు పెద్దిరెడ్డినిచ్చి పంపిస్తా! అంటూ త‌న ఎమ్మెల్యేల‌తో అన్నారు జ‌గ‌న్. అంతే కాదు మ‌న‌మంతా క‌ల‌సి.. ఆ 11 సీట్ల‌కు కూడా  రాజీనామా చేసేద్దాం.. నేనైతే ఎంపీగా పోటీ చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చేస‌రికి ప‌క్క‌నే ఉన్న అవినాష్ రెడ్డి ఒక్క‌సారిగా అదిరిప‌డ్డారట‌. ఇదేందిదీ..... ఉరుము ఉరిమి మం*లం మీద ప‌డ్డ‌ట్టు నా మీద ప‌డ్డాడేంటని ఒక్క‌సారిగా కంగారు ప‌డ్డార‌ట భార‌తీరెడ్డి బావ అవినాష్ రెడ్డి. అంతే కాదు.. హీరో, విల‌న్ కొట్టుకుని మ‌ధ్య‌లో క‌మెడియ‌న్ని చంపేసిన‌ట్టు.. న‌న్నిలా టార్గెట్ చేశారేంట‌ని అవినాష్ లోలోన తెగ కుమిలిపోతున్నార‌ట‌. ఇదంతా ఇలా ఉంటే.. జ‌గ‌న్ గానీ, ఒక వేళ పులివెందుల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. అవినాష్ చేత క‌డ‌ప ఎంపీగా రిజైన్ చేయించి.. ఆ  ఎంపీ పోస్టుకు తాను పోటీ చేశారే అనుకుందాం. ఆబ్వియ‌స్ గా అవినాష్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండొచ్చు. ఓకే ఇన్నాళ్లు వైయ‌స్ ఫ్యామిలీ నుంచి కాకుండా అదే ఫ్యామిలీ అయినా కాస్త దూర‌పు మ‌నిషి ఒక‌రు ఈ సీటు నుంచి పోటీ చేశారే అనుకుందాం.. మొన్న‌టి జెడ్పీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో పులివెందుల‌లో వైయ‌స్ పులి.. గాండ్రిపున‌కు బ‌దులు.. మియాం మియాం అని అరిస్తే ప‌రిస్థితేంటి? అంతే కాదు.. ఇటు ఉన్న‌దీ బాయె అటు ఉం* కున్న‌దీ పాయె అన్న‌ట్టుగా మారే సీన్ ఎదుర‌వుతుంది. దీంతో జ‌గ‌న్ కండీష‌న్ అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌గా మారుతుందని అంటారు విశ్లేష‌కులు. ప్రెజంట్ జ‌గ‌న్ స్కెచ్ ఏంటంటే.. తానుగానీ ఎంపీగా పోటీ చేస్తే ఇక్క‌డకు కేంద్ర బ‌ల‌గాలు దిగుతాయ‌ని.. జ‌నంలోని వ్య‌తిరేక‌త కూడా బ‌య‌ట ప్ర‌పంచానికి తెలుస్తుంద‌ని ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. రిస్క్ తీస్కోవ‌డం మంచిదే! కాద‌న‌డం లేదు. కానీ, నీటిలోని ముస‌లి.. అధికారంలో ఉన్న పార్టీ మోస్ట్ ప‌వ‌ర్ఫుల్ గా ఉంటాయి. పులివెందుల‌లో మొన్న ఎలాంటి సీన్ జ‌రిగిందో.. సేమ్ టూ సేమ్ సీన్.. వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లోనూ జ‌రిగితే..  జ‌గ‌న్ 2. 0 అనే ఆశ‌ల్లోంచి 2 ఎగిరిపోయి.. కేవ‌లం జీరో మిగిలితే.. !!!ఊహించుకోడానికే భ‌య‌మేస్తోంది జ‌గ‌న‌న్నా.. త‌గ్గు త‌గ్గు.. అన్న‌ది వైసీపీ కేడ‌ర్ అలెర్ట్ గా తెలుస్తోంది.

వినాశకాలే విపరీత బుద్ధి!

అమెరికా అధ్యక్షుడు హెచ్ 1 బి వీసా ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధేగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్. అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ట్రంప్‌ టారీఫ్ లు, విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా..  తాజాగా హెచ్1 బీ వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఏడాదికి లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 88 లక్షల రూపాయలు. అమెరికా కంపెనీలలో, అమెరికాలోని భారతీయ కంపెనీలలో ఈ హెచ్ 1 బీ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారి సంఖ్య లక్షలలో ఉంటుంది.  ఇంత కాలం ఈ విసాల ఫీజును  భారత ఉద్యోగులు పని చేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి. ఇకపై అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండక పోవచ్చు.  దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు. ట్రంప్ కోరుతున్నది కూడా అదే. అలా కాకుంటే  పెద్ద  సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకపోతే.. విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు.. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకుని.. భారత్, చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనాలు, విశ్లేషణలూ కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్ కే మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి.   తమతమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంత మాత్రం ఫీజబుల్ కాదనడంలో సందేహం లేదు.  కనుక తొలుత ఉద్యోగుల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గిచుకున్నా..ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించు కుంటూ విదేశాలలో అంటే అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.  అమెరికా అధ్యక్షుడు హెచ్1 బి వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతు గుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు.  ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. 

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

  విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద జరిగే దసరా వేడుకల్లో ఈసారి ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. భద్రత కోసం ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు అమర్చనుండగా, చిన్నారుల రక్షణ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ చేతి బ్యాండ్‌లు అందించనున్నారు. ఉత్సవాల వివరాలు, సేవలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ మరియు చాట్‌బాట్‌ను రూపొందించారు. ‘దసరా–2025’ పేరుతో ఆ యాప్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. యాప్‌లో పొందుపరిచిన ఫీచర్లు, వినియోగదారులకు అందే సౌకర్యాల గురించి అమరావతి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ చింత అనిల్‌కుమార్‌ వివరించారు.  

కాళేశ్వరం వినా హరీష్ పై వేరే కోపం లేదు.. కవిత

బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత వాయిస్ ఇప్పుడు ఒకింత నెమ్మదించిందా? బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేైసి పార్టీ నుంచి సస్పెండైన కవిత.. సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ వందల మందితో చర్చించిన తరువాతనే పార్టీ పెట్టారని గుర్తు చేశారు. తాను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన కవిత.. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కుమార్తెను తానునని చప్పారు.  ఇక తను తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు గురించి మాట్లాడుతూ కాలేశ్వరం విషయంలో తప్ప ఆయనపై తనకు వేరే కోపం ఏమీ లేదన్నారు. ఇరిగేష్ శాఖకు సంబంధించి అవకతవకలు, అక్రమాలు, అవినీతి గురించి 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పిన కవిత.. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో పూర్తి బాధ్యత అంతా కేసీఆర్ పై నెట్టేవేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు.  ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై మాట్లాడుతూ.. తాను స్పీకర్ ఫార్మట్ లోనే రాజీనామా సమర్పించానని స్పష్టం చేశారు. రాజీనామా ఇవ్వడమే కాకుండా వెంటనే ఆమోదించాల్సిందిగా ఫోన్ చేసి మరీ  కోరానని తెలిపారు. బతుకమ్మకు సంబంధించి తనకు చాలా ఆహ్వానాలు వస్తున్నాయన్న కల్వకుంట్ల కవిత.. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ను తమ స్వగ్రామం చింతమడకలోనే జరుపుకుంటానన్నారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్తు ఉందని ముక్తాయించారు. 

సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యేపై విచారణ

  బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌లు విచారించారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయన్ను సుమారు 30 నిమిషాల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కిషోర్ మాట్లాడుతు తాను కేటీఆర్‌పై సీఎం రమేష్ అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కుట్రపూరితంగా  కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.  చట్టాలను గౌరవించి విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదని తెలిపారు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని  కిషోర్‌ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేది లేదు అని  కిశోర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు.. ఆరు నెలలు జైలుకు పోయిన నిఖార్సైన ఉద్యమకారుణ్ణి నేను అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

ఆల్మట్టి ఎత్తు పెరిగితే.. తెలంగాణ భూములు క్రికెట్ స్టేడియాలే!

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ పొలాలు సాగు భూములుగా ఉండవనీ, క్రికెట్ స్టేడియంలుగా మారిపోతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలోని ఐదు జల్లాలకు వరప్రదాయిని వంటి కృష్ణానది రాష్ట్రంలో ఉనికిమాత్రంగా కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదని రేవంత్ సర్కార్ దానిని ఆపాలని డిమాండ్ చేశారు. శనివారం (సెప్టెంబర్ 20)న మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో మహాబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్‌  జిల్లాలకు అత్యంత ప్రధానమైన జలవనరు కృష్ణానదే అన్నారు. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చుక్క నీరు అందదని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదన్న కవిత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మట్టి హైట్ పెంచకుండా జీవో ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి అయినా కోట్లాడి అయినా ఆల్మట్టి ఎత్తు పెంచకుండా చూడాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సోనియాతో ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంపును విరమించుకునేలా చేయాలని ఆమె రేవంత్ ను కోరారు.   త్వరలో  జరగనున్న కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ కు  సీఎం స్వయంగా వెళ్లి ఆల్మట్టి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 

ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట అమెరికా!

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందా? అగ్రదేశాధినేత ట్రంప్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాల కారణంగా అగ్రరాజ్యం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుందా అంటే అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖ ఫైనాన్షియల్ రేటింగ్ కంపెనీ మూడీస్ ఔననే అంటోంది. మూడీస్ చీఫ్ మార్క్ జాండీ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోనుందని హెచ్చరించారు. ఆ దేశంలో పెట్టుబడులు మందగిస్తున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. కొన్ని దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్.. ఆ దేశాలపై కంటే, అమెరికాపైనే తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ చీఫ్ మార్క్ జాండీ అభిప్రాయపడ్డారు.  అలాగే ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం కారణంగా దేశంలో ఉద్యోగ నియామకాలు తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. ఇక ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వ్యాపార రంగం తీవ్రంగా ప్రభావితమౌతుందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు మందగించి ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తు న్నాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ రంగం, ఉత్పాదక రంగాలలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని ఉదహరించారు.  ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం ఇంకా అమెరికాలో వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడలేదనీ, త్వరలో అది కూడా జరుగుతుందని హెచ్చరించిన మార్క్ జాండీ.. ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 

అన్నమయ్య జిల్లాలో వర్ష బీభత్సం.. రాయచోటిలో నలుగురు మృతి

అన్నమయ్య జిల్లా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా రాయచోటిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. రాయచోటీలో భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో ఓ తల్లి, కుమారుడు కొట్టుకుపోయారు. వారికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక రాయచోటిలోనే మరో ఘటనలో యామిని అనే చిన్నారి గల్లంతైంది. ఈ ఘటనలతో రాయచోటిలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం ప్రకారం షేక్ మున్నీతన కుమారుడితో పాటు  ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ సమీపంలో నడుస్తూ వెడుతుండగా కాలువపై రాతిపలక విరిగిపోవడంతో కాలువలో పడిపోయారు.  వారిని కాపాడేందుకు ప్రయత్నించిన గణేష్ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు.  ఈ ముగ్గురి మృతదేహాలూ లభ్యమయ్యాయి. ఇక కే. రామాపురం పరిధిలోనొ ఓ కాల్వలో యామిని అనే ఏడేళ్ల చిన్నారి గల్లంతైంది. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.

భార‌త్ లో జెన్ జీ కి స్కోపెంత‌?

భార‌త్ లో జెన్ జీ మూమెంట్ వ‌స్తుంది. అందుకు మా పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ంటున్నారు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ.  నేపాల్లో జ‌రిగిన ఈ జెన్ జీ ఉద్య‌మంలో  విద్యార్ధుల‌దే కీల‌క పాత్ర‌.  మొన్నా మ‌ధ్య బంగ్లాదేశ్ లో జ‌రిగిన ఉద్య‌మాల‌కు కూడా ఆయువు ప‌ట్టు అక్క‌డి విద్యార్ధులే. నేపాలీ విద్యార్ధులు పాల‌కుల అవినీతి మీద ఫైర్ అయితే, బంగ్లాలో రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారంలో భ‌గ్గుమ‌న్నారు. దీంతో ప్ర‌భుత్వాలు కూలిపోయాయి. అలాంటి సిట్యువేష‌న్ ప్రెజంట్ భార‌త్ లో ఉందా? ఇక్క‌డి యూత్ అంత‌టి  ఆగ్ర‌హావేశాల‌తో ర‌గ‌లిపోతున్నారా? అన్న‌ది ప‌రిశీలించాల్సి ఉంది. ప్ర‌స్తుతం   భార‌త్ లోని విప్ల‌వాగ్ని జ్వాల‌లు బాగా త‌గ్గిపోయాయి. వ‌ర్సిటీ టూ ఫారెస్ట్ వెళ్లే యూతే లేదిప్పుడు. అంతా క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్. థ‌ర్డ్ ఇయ‌ర్ లోనే ఆయా విద్యార్ధుల‌ను ఎగ‌రేసుకుపోతున్నాయి   కార్పొరేట్ కంపెనీలు. కొండొక‌చో ఒక్కో టాలెంటెడ్ విద్యార్ధికి కోట్లాది రూపాయల ఆఫ‌ర్లు అందుతున్నాయ్. దీంతో యూత్ మూడ్ కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తీ.. అన్న‌ట్టుగా ఉంది. ప్రెజంట్ ఏపీ తెలంగాణ యూత్ విష‌యానికి వ‌స్తే.. ఏదో సోసోగా బీటెక్ చేశామా.. అమీర్ పేటలో ఒక డిప్ల‌మో కోర్సు చ‌దివామా.. ఫేక్ ఎక్స్ పీరియ‌న్స్ పెట్టామా.. యూఎస్ చెక్కేశామా అన్న కోణంలో థింక్ చేస్తున్నారు త‌ప్ప‌ దేశస్థితిగతులు, సమస్యలూ.. ఇవన్నీ పట్టించుకునే వాతావరణం లేదనిపిస్తోంది.  ఇప్పుడు అమెరికాకు చెక్కేసే  సిట్యువేష‌న్ కూడా లేక పోవ‌డంతో.. వీరంతా ప్ర‌స్తుతం ఇక్క‌డే స్థిర‌ప‌డేలా కొత్త‌దారులు వెతుకుతున్నారు. బీటెక్ చ‌దివి కూడా ఏమేం చేసి సంపాదించుకోవ‌చ్చో పరిశీలిస్తున్నారు. అంతెందుకు ఈ మ‌ధ్య బీటెక్ పానీపూరీ వాలా అంటూ ఒక అమ్మాయి ఏకంగా త‌న డిగ్రీ పేరిట బోర్డు పెట్టేసింది. అంత‌గా యువ‌త ఇక్క‌డే ఉండి ఎలా ఎద‌గొచ్చో ప‌రిశీలిస్తున్నారు. మారిన కాల‌మాన ప‌రిస్థితుల కార‌ణంగా.. న‌గ‌ర జీవ‌నం ఎలా సాగించాలో అడ‌వుల్లోకి వెళ్లి వెతుక్కోవ‌డం లేదు. ఇక్క‌డే ఇంటి ప‌ట్టునే ఉండి.. యావ‌రేజ్ గా నెల‌కో యాభై వేలు ఎలా సంపాదించాలో చూస్తున్నారు. త‌ద్వారా.. వారికంటూ విప్ల‌వానికి సంబంధించిన ఆశ‌లు ఆశ‌యాలేం పుట్ట‌డం లేదు. అమిత్ షా అన్న‌ట్టు ప‌కోడీలు అమ్ముకునైనా బ‌త‌కొచ్చ‌న్న కోణంలో థింక్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఏదైనా ట్రిప్ వెళ్లిన‌పుడు ఆ యా టూరింగ్ స్పాట్స్ లో చిన్నా చిత‌కా బిజినెస్ చేసే వాళ్ల‌ను చూడండి.. వారి వారి క్వాలిఫికేష‌న్లు అడ‌గండి.. బీటెక్, ఎంటెక్ అంటారు.  ఇక స్టార్ట‌ప్ ల సంగ‌తి స‌రే స‌రి. ఈ స్టార్ట‌ప్ ల‌కు వాటి తాలూకూ ఇంక్యుబేట‌ర్ల‌కు స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ పేరిట ఇస్తున్న ప్రోత్సాహ‌కాల కార‌ణంగా కొంద‌రు కొత్త కొత్త ఐడియాలు వేసి.. కోట్లు సంపాదించ‌డం ఎలా? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఆ మాట‌కొస్తే.. తాను ఒక‌రి కింద ప‌ని చేయ‌డం ఏంటి? ప‌ది మందికీ తానే జాబ్స్ ఇస్తే ఎలా ఉంటుందో బిల్ గేట్స్ కా బాప్ రేంజ్ లో థింక్ చేస్తున్నారు. ఇపుడీ జ‌న‌రేష‌న్ ఎంజాయ్ మెంట్ ని ఎక్కువ‌గా కోరుకుంటోంది. ఇక్క‌డ వారికి కావ‌ల్సింది ప‌ని, డ‌బ్బు, ఆపై ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్. అది దొరికితే చాలు ఇక విప్ల‌వాలు వాటి కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డం ఎందుకు? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఉద్య‌మాలు న‌డిపేంత తీరుబాటు వెస‌లుబాటు ఎవ‌రికీ లేదిక్క‌డ‌. మ‌రి భార‌త్ లో జెన్ జీ మూమెంట్ ఎలా వ‌స్తుంది? రాహుల్ ఆశ‌లు ఆశ‌యాలు నెర‌వేరే దారేద‌ని చూస్తే.. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా అందుకు త‌గిన అవ‌కాశాలు వ‌స్తుంటాయి. కానీ అవి చాలా చాలా ప‌రిమితంగా మాత్రమే ఉంటున్నాయి. ఎవ‌రూ రిస్క్ తీస్కుని అక్క‌డేదో త‌గ‌ల‌బ‌డుతోంద‌ని ఆ మంట‌ల్లో ప‌డి మాడి మ‌సై పోవ‌డం లేదు. అంత జాగ్ర‌త్త‌గా ఉంటోంది ప్రెజంట్ యూత్. బేసిగ్గా ఉద్య‌మాల ద్వారానే నాయ‌కులు పుట్టుకొస్తారు. ప్ర‌స్తుతం చెలామ‌ణిలో ఉన్న నాయ‌కులంతా గ‌తంలో ఒక ఎమ‌ర్జెన్సీ టైంలో వ‌చ్చిన వారే. ఆ త‌ర్వాతి కాలంలో.. తెలంగాణ ఉద్య‌మం లాంటి వాటి ద్వారా వ‌చ్చారు. ఇప్పుడు రాహుల్ రాజేస్తున్న ఈ ఉద్య‌మంలోకి యువ‌త అంత‌గా దూసుకురావాలంటే అందుకంటూ త‌గిన వాతావ‌ర‌ణ స్థితిగ‌తులు ఏర్ప‌డాలి. అలాంటి ప‌రిస్థితులు కూడా త‌యారు కావాలి. దానికి తోడు ఇటు పాక్ అటు బంగ్లా ఆపై నేపాల్లో కావాల‌నే అల‌జ‌డులు సృష్టించి.. అటు పిమ్మ‌ట ఆ జ్వాల‌లు.. భార‌త్ లోకి తీసుకురావాల‌న్న‌ది రాహుల్ కొంద‌రు విదేశీయుల‌తో క‌ల‌సి చేస్తోన్న కుట్ర‌గా అంచ‌నా వేస్తున్నారు. అందుకే ఈ జెన్ జీ కామెంట్లు గుప్పిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న యువ‌త.. మాన‌సిక‌- సామాజిక- ఆర్ధిక- రాజ‌కీయ స్థితిగ‌తుల్లో రాహుల్ గాంధీ ఆశిస్తున్న‌ట్టు ఈ జెన‌రేష‌న్ క‌దులుతుందా? అన్న‌ది అనుమాన‌మే అంటారు చాలా మంది.

ఈ పిట్రోడాకి ఏమైంది?

పాక్ కి వెళ్తే  సొంతింటికి వెళ్లిన‌ట్టు ఉంటుంద‌న్నారు కాంగ్రెస్ విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు శ్యాంపిట్రోడా. కొంప‌దీసి పిట్రోడా కూడా అద్వానీలా పాకిస్థాన్ లో పుట్ట‌లేదు క‌దా అన్న అనుమానంతో ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ త‌ర‌చి చూసిన వారికి పిట్రోడా ఒడిశాలో పుట్టిన గుజ‌రాతీ అని తెలిసింది. హ‌మ్మ‌య్య బ‌తికిపోయాం లేకుంటే ఈ ర‌చ్చ ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయేద‌న్న ఆందోళ‌న  నుంచి వారు ఒక్కసారిగా బయటపడ్డారు. నిజానికి ఒక ప్రాంతం ప‌ట్ల పైకి క‌నిపించేది వేరు లోప‌లికి క‌నిపించేది వేరు. టెన్ మిత్స్ అబౌట్ పాకిస్తాన్ అంటూ ఎప్పుడో రామ‌చంద్ర గుహ వంటి వారు రాసిన వ్యాసాల సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ కి సంబంధించి  ఎన్నో అపోహ‌లు ఉంటూనే ఉంటాయి. అక్క‌డ పైకి మ‌న‌కు ఉగ్ర‌వాద‌మే క‌నిపిస్తుంది. లోప‌ల మ‌రోలా ఉంటుంది. ఉండొచ్చు కూడా.  కానీ పిట్రోడా ఈ కామెంట్ చేయాల్సిన  టైం మాత్రం ఇది కాదంటారు పరిశీలకులు. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. పాక్ వ‌ల్ల భార‌త్, అమెరికా మధ్య  త‌గువులొచ్చిన సీన్ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికీ పాక్, అమెరికా సాయంతో థ‌ర్డ్ పార్టీ మీడియేష‌న్ తో భార‌త్ తో స‌యోధ్య‌కు ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు భార‌త్ స‌సేమిరా అంటోంది. దానికి తోడు అమెరికా చేయి విడిచి చైనా, ర‌ష్యాల‌తో చెలిమి చేస్తోంది భార‌త్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఎప్పుడైతే ట్రంప్ త‌న కుటుంబ పెట్టుబ‌డులు పాక్ లో పెడుతున్నారో,  అప్పటి నంచీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు. అప్ప‌టి  నుంచీ అమెరికాకు మ‌న‌కూ మ‌ధ్య దూరం  పెరుగుతూ వ‌స్తోంది. భార‌త్, పాక్ ఘ‌ర్ష‌ణ‌లు ఆపింది ట్రంపే అన్న కోణంలో పాక్ ఆయ‌న‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తికి ప్ర‌తిపాదించ‌డం, భార‌త్ ఇందుకు ఒప్పుకోక పోవ‌డం వంటి కార‌ణాల రీత్యా ప్ర‌స్తుతం భార‌త్, అమెరికా మ‌ధ్య సంబంధాలు  దిగ‌జారుతూ వ‌స్తున్నాయ్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఈ క్ర‌మంలో పిట్రోడా ఈ పిచ్చి ప్రేలాప‌న చేయ‌డంతో అంద‌రిలోనూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడ్ పాక్ విషయంలో చేసిన కామెంట్లతో ఊరుకోకుండా..   నేపాల్, బంగ్లా  ఎంత ప్ర‌శాంతంగా ఉన్నాయో చూడ‌మంటున్నారు. ఇటీవ‌లే  నేపాల్ మొత్తం త‌గ‌ల‌బ‌డగా.. ఇక బంగ్లా లో మిల‌ట‌రీ వ‌ర్సెస్ తాత్కాలిక ప్ర‌భుత్వంగా  మారింది  ప‌రిస్థితి. తాత్కాలిక బంగ్లా ప్ర‌ధాని తో బంగ్లా ఆర్మీ ప‌డ‌లేక పోతోంది. కొత్త‌గా ఎన్నిక‌లు జ‌రిపి తీరాల్సిందే అని ప‌ట్టుబ‌డుతోంది  బంగ్లాదేశ్ సైన్యం. మొన్నా మ‌ధ్య విద్యార్ధులంతా రోడ్ల‌పైకి వ‌చ్చారు కూడా. పాత‌ ప్ర‌భుత్వం దిగిపోయేట‌పుడు బంగ్లాలో జ‌రిగిన హింస  కూడా ఏమంత త‌క్కువ కాదు. అలాంటి నేపాల్, బంగ్లా ల్లో ఆయ‌న‌కు అంత‌టి శాంతి సౌభ్రాతృత్వాలు ఎక్క‌డ క‌నిపిస్తున్నాయో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు నెటిజ‌న్లు. ఇదంతా భార‌త్ వ్య‌తిరేక వాద‌న‌లో భాగ‌మ‌ని అంటారు చాలా మంది. వీరు మోడీ  ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఇక్క‌డున్న స‌మ‌స్య‌ల‌పై విమ‌ర్శ‌లు చేయాలిగానీ మ‌న బ‌ద్ధ శ‌తృవు పాకిస్తాన్ సొంతిల్లు లాంటిద‌న‌డం.. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లు.. ప్ర‌శాంతంగా ఉంటాయ‌న‌డం స‌రికాద‌న్న స‌ల‌హాలు అందుతున్నాయి.

తెలుగుదేశంలోకి అలాంటి వారికి నో ఎంట్రీ!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీటీపీ గూటికి చేరారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రిరాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవ్తరిలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  వీరి చేరికకు ముందు చంద్రబాబు వారితో విడివిడిగా మాట్లాడారు. ఒక్కొక్కరితో పదే నిముషాల సేపు మాట్లాడిన ఆయన వారు తెలుగుదేశం గూటికి చేరడానికి కారణం, వారు పార్టీలో ఏ స్థానం కోరుకుంటున్నారు. ప్రజలలో వారికి ఉన్న ఆదరణ ఏంత అన్న విషయాలపై చంద్రబాబు వారితో మాట్లాడినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారి వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఆరా తీశారు.  ఆ తరువాతే వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏమీ పుష్పకవిమానం  కాదన్నారు. ప్రజల కోసం పని చేసే వారికి మాత్రమే పార్టీలోకి ఎంట్రీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఎవరినిబడితే వారిని పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజాకంటకులుగా వ్యవహరించిన  ఆ పార్టీ నేతలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. 

జగన్ సోదరుడి కంపెనీల్లో సిట్ సోదాలు

సిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలు, నివాసాలలో సోదాలు నిర్వహించింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు.  చెన్నైలోని   మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్ తో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, ఇంజంబాక్కం, చెన్నై అళ్వార్‌పేట్ ల్లోని అనిల్‌రెడ్డి  నివాసాల్లో సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు పది ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిట్ కీలక డాక్యుమెంట్లు, హర్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపేనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ అందుకు సంబంధించి ఆధారాల సేకరణకు ఈ సోదాలు నిర్వహించింది.   శుక్రవారం (సెప్టెంబర్ 19)న ఏకకాలంలో పది చోట్ల సిట్ చేపట్టిన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ సాగాయి.   కాగా సిట్‌ సోదాలు చేసిన కంపెనీల్లో  షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా  2019లో  జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది.  అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు? , వీటి కార్యకలాపాలేంటి? అన్నదిశగా సిట్ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇటీవలే అనిల్‌రెడ్డి పీఏ దేవ రాజ్‌ సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో దేవరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలలో సిట్ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  సిట్‌    షిలో ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , క్వన్న ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , వర్క్‌ ఈజీ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ఇండోరాక్స్‌ ఎల్‌ఎల్‌పీ , ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,శ్రీ గోవిందరాజా మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  ట్రాన్‌సెల్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్, హైదరాబాద్‌ తదితర కంపెనీల్లో సోదాలు చేసింది.  

ఫిరాయింపులపై ఎవరి భాష్యం వారిదే!

ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్ర‌మైన వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయ్. ఓట్ల చోరీ  కంటే ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద నేరమంటారు  కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్.. అస‌లు ఫిరాయింపు ఎక్క‌డుంది?  ఒక సీఎం అన్నాక‌.. ఎంద‌రో ఎమ్మెల్యేలు  వ‌స్తుంటారు పోతుంటారు. ఆ టైంలో వారికి కండువాలు క‌ప్పుతుంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాష్యం చెబుతారు. అబ్బే తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారాయన.  ఇదే విష‌యంలో..   క‌డియం శ్రీహ‌రి మరో చిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తాను ఏ పార్టీ అన్నది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదంటున్నారు కడియం శ్రీహరి.  ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీక‌ర్ తేల్చ‌డ‌మేంటి?  అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంతు అవుతోంది. ఆయ‌న  ఏ పార్టీ ద్వారా బీఫాం తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాట్లలోని వితండం ఎక్కడిది అంటే.. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి అదేంటంటే.. ఇదే స్టేష‌న్ ఘ‌న్ పూర్ సీటు త‌న‌కు ద‌క్కాల్సింది పోయి.. శ్రీహ‌రి త‌న్నుకుపోయార‌ని అంటారు రాజ‌య్య‌. టికెట్ ఇవ్వ‌కుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తాన‌ని బెదిరించి మ‌రీ క‌డియం ఈ టికెట్ బ‌ల‌వంతానా తీసుకున్నారని చెబుతున్నారాయన.   ఇక పోతే ఇదే క‌డియం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే అన్న మాట‌.. ఏంటంటే, ఏదైనా జ‌ర‌గొచ్చు. కాంగ్రెస్ అధికారం వెంట‌నే కోల్పోవ‌చ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంద‌రు మా ట‌చ్ లో ఉన్నార‌ంటూ ఫీలర్లు వదిలారు.  ఆ వెంట‌నే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదే మంటే నియోజ‌క‌ర్గం కోస‌మే ఇదంతా చేస్తున్నానంటారు. కావాలంటే చూడండీ ఇప్ప‌టి వ‌ర‌కూ వెయ్యి కోట్ల‌కు పైగా నిధులు ప‌ట్టుకొచ్చానని చెప్పుకుంటున్నారు.  ఇటు చూస్తే సీఎం అస‌లు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అస‌లు ఓట్ల చోరీక‌న్నా  ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద‌ద‌ని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటు కాని సందిగ్దావ‌స్త ఈ ఎమ్మెల్యేల‌ది. మొన్న‌టికి మొన్న బీఆర్ఎస్ గ‌ద్వాల్ స‌భ జ‌రిగితే ఎమ్మెల్యే బండ్ల త‌న ఫ్లెక్సీల‌కు ప‌ర‌దాలు క‌ప్పుకున్న దృశ్యం క‌నిపించింది. దీంతో తెలంగాణ‌లో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాష్యం చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శనివారం (సెప్టెంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  18 గంటల సమయం పడుతోంది.ఇక శుక్రవారం(సెప్టెంబర్ 19) శ్రీవారిని మొత్తం 71 వేల 249 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 4 లక్షల  రూపాయలు వచ్చింది.