ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం

  ఏపీలో  నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో నడిచే వివిధ నగరాల్లోని స్థానిక సలహా కమిటీలకు లోకల్ అడ్వైజరీ కమిటీ కూడా కొత్త అధ్యక్షులను నియమించింది. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రమేష్‌ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్‌గా రాధాకృష్ణ నియమితులయ్యారు.   టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులు 1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి 2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్ 3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు 4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఏడుగుండ్ల సుమంత్ రెడ్డి 5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింఘానియా 6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే  

అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు : జగన్

  అమరావతి తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ నిర్వహణ తీరు, మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. జగన్ ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి వ్యవహారాలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు.“అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలన్న తపన కనిపించడం లేదు,” అని ఆయన విమర్శించారు.  కొంతమంది తనకు సలహాలు ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసి ప్రతిపక్షం బలహీనపరచాలని సూచించారని చెప్పారు.“కానీ మేము అలా చేయలేదు. వారి అభిప్రాయాలూ గౌరవించాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఎవరూ గొంతు విప్పకూడదనేది అధికార పక్షం అభిప్రాయంగా కనిపిస్తోంది అని జగన్ తెలిపారు. అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నప్పటికీ, మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షానికే అనుకూలంగా ఉన్నాయని, నిజమైన ప్రతిపక్షం వైయస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.  మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో తగిన సమయం దొరుకుతుంది. ప్రజల తరఫున గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వడంలేదు,” అని అన్నారు.అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, ఆ వేదికలో ప్రజల తరఫున గొంతు విప్పాలని ఎమ్మెల్సీలకు సూచించారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. ప్రజల తరఫున ధైర్యంగా, ఆధారాలతో మాట్లాడాలి. అక్కడ మన వాయిస్ బలంగా వినిపించాలి,” అని జగన్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించి, తమ సూచనలు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు నిరాకరణపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మండలిని ప్రధాన వేదికగా ఉపయోగించాలని ఎమ్మెల్సీలను ఆదేశించారు.

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్

  ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమానికి ఆలస్యంగా హాజరై, ముఖ్య అతిథి విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకలేదని ఆరోపణలు వచ్చాయి.  దీనిపై సీఎంవోకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇక, మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చూపినందుకు తెలంగాణ హైకోర్టు కూడా కలెక్టర్‌పై వారెంట్ జారీ చేసింది. నోటీసులు, వారెంట్‌లు వరుసగా రావడంతో ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా తీరు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బ్రిటన్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్‌షిప్స్ను రాష్ట్ర ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కో-ఫండింగ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్స్ అందించేందుకు హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. సమావేశంలో నూతన విద్యా విధానం, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ రంగాలపై చర్చించారు. రేవంత్ ప్రతిపాదనలపై లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించగా, ఈ చర్చలు తెలంగాణ–బ్రిటన్ సంబంధాలకు కొత్త ఊపు ఇస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మూసీ నది అభివృద్ధి, ఇతర రంగాల్లో పెట్టుబడుల కోసం బ్రిటిష్ కంపెనీలను భాగస్వాములుగా చేయాలని సీఎం కోరారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు సహకారం మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు.   

దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ సంస్కరణలు దిక్సూచి : సీఎం చంద్రబాబు

  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. సంస్కరణలు అంటే నేనప్పుడు ముందుంటాను. అభివృద్ధికి కృషి చేస్తేనే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించకుండా సంక్షేమం ఇవ్వడం సరికాదు. అప్పులు చేసి సంక్షేమం పంచడం సమంజసం కాదు, అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తుచేశారు. వన్ నేషన్ – వన్ విజన్ అడుగులు వేస్తున్నామని, దేశం–రాష్ట్రం ప్రాధాన్యమని తెలిపారు. గతంలో 4 టైర్ల పన్ను వ్యవస్థ (5%, 12%, 18%, 28%) ఉండేదని, ఇప్పుడు 5% మరియు 18% శ్లాబులతో సరళతరం చేశారని వివరించారు. పండుగల వేళ వినియోగం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ సంస్కరణల ఫలితంగా పరోక్ష పన్ను చెల్లింపుదారులు 2017లో 65 లక్షల నుంచి ప్రస్తుతం 1.51 కోట్లకు పెరిగారని, జీఎస్టీ రిసిప్టులు 2018లో రూ.7.19 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.22.08 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, వన్ నేషన్ – వన్ విజన్ నినాదంతో భారత్ డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించే దేశంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బోరబండ, చార్మినార్‌, కుషాయిగూడ, సైనిక్‌పురి వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. వర్షంతో రహదారులు జలమయమై, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు

  తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్త్నె, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేశారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఏపీలో ప్లాస్టిక్ నిషేధం.. ఎప్పట్నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ నిషేధం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని నగరం అమరావతిలోని సెక్రటేరియెట్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలలో వచ్చే నెల 2 నుంచి అంటే గాంధీ జయంతి రోజు నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలులోనికి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక ఆ తరువాత డిసెంబర్ 31 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నట్లు ఆయన తెలిపారు.  విజయవాడలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం (సెప్టెంబర్  18)న జరిగిన స్వచ్ఛతా హి సేవ అవగాహన కార్యక్రమంలో మంత్రి నారాయణ ప్రసంగించారు. ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు.  

ఆర్జీవీపై రాయదుర్గం పీఎస్ లో కేసు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది.  వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వివాదాలలో ఉండే రామ్ గెపాల్ వర్మపై మాజీ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.  మావోయస్టులపై గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన దహనంవెబ్ సీరిస్ కు సంబంధించి అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు. ఆ వెబ్ సిరీస్ లో  అంజనా సిన్హా పేరును  ప్రస్తావిస్తూ.. అంజనాసిన్హా చెప్పిన విధంగానే ఆ వెబ్ సిరీస్ లో కొన్ని సీన్లు తీశామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   రామ్ గోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్లో తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరు వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కేటీఆర్ నువ్వో బచ్చా...నీ తండ్రి వల్లే కాలేదు : మంత్రి పొంగులేటి

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పొంగులేటి బదులిచ్చారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి నీ తండ్రి వల్లే కాలేదు. నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన..ఆయన వల్లే కాలేదని  పొంగులేటి అన్నారు.  నీ వల్ల అవుద్దా..బచ్చాగాడివి ఘాటు  వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా..సంచి సర్దుకుని అమెరికాకు చెక్కుతవా..అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు.. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు.

కొడుకు రిసెప్షన్ రద్దు.. ఆ సొమ్ముతో ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే?

ఆ ఎమ్మెల్యే రైతులను యూరియా కష్టాల నుంచి బయటపడేయాలని తపన పడ్డారు. తపనపడి ఊరుకోలేదు..లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికీ ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయడానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ సొమ్ముల కోసం ఆయన ఏకంగా తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేశారు. ఆ రిసెప్షన్ కోసం వ్యయం చేద్దామని కేటాయించిన రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసుకుని మరీ రెండు కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఆ మేరకు గురువారం (సెప్టెంబర్ 18) తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండుకోట్ల రూపాయల చెక్కు అందించారు. ఆ రెండు కోట్లనూ తన నియోజకవర్గంలోని రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా అందజేయాలని ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి సీఎంను కోరారు.   ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ ను మిర్యాల గూడలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు బత్తుల లక్ష్మారెడ్డిని కదిలించాయి. అంతే కుటుంబ సభ్యులతో చర్చించి కుమారుడి వివాహ రిసెప్షన్ ను  రద్దు చేసి.. ఆ సొమ్ముతో రైతులకు యూరియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.  

జూబ్లీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్!?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమీర్ అలీఖాన్ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక నాయకుడి నివాసంలో గురువారం (సెప్టెంబర్ 18) ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఏడాది జనవరిలో సీనియర్ నేత అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.  అయితే గవర్నర్ కోటాలో వీరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  దీనిపై కొద్ది నెలల కిందట సుప్రీం తీర్పు వెలువరించింది. అమీర్ అలీఖాన్, ఆయనతో పాటుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ల నియామకాలపై స్టే విధించింది. సుప్రీం కోర్టు స్టే పై కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. కోదండరామ్ ను మళ్లీ ఎమ్మెల్సీని చేసి తీరుతామని చెప్పిన రేవంత్ అమీర్ అలీఖాన్ విషయంలో మాత్రం ఏమీ మాట్లాడలేదు.  సరే గత నెలలో   కోదండరాంతో పాటు  మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించిన కాంగ్రెస్ అమీర్ అలీఖాన్ ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న అమీర్  అలీఖాన్ సమయం చూసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారని ఆయన కవితతో భేటీ ద్వారా తెలుస్తోంది.  

10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    ఏపీ అసెంబ్లీ పది రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆరు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులు తీసురావాలని భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 30 తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 20, 21, 28 తేదీల్లో శాసన సభకి  సెలవులు ఉండనున్నాయి. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  జీఎస్టీ సంస్కరణలపై నేడు శాసనసభలో చర్చ జరుగుతుంది. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్‌-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్‌, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగనుంది.  నేటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ, మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. 

బూరుగు రమేష్, విక్రాంత్ నివాసాల్లో ముగిసిన ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల సొమ్మును దారిమళ్లించారన్న ఆరోపణలపై ఈడీ నిర్వహిస్తున్న ఈ సోదాలలో భాగంగా మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాలలో దాదాపు ఏడుగంటల పాటు నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఈ సోదాలలో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.  కాస్పో లీగల్ సర్వీసెస్, మహదేవ జ్యువెల్లరీస్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలలోకి ఏపీ మద్యం కుంభకోణం కేసు నగదు మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా బూరుగు రమేష్ నివాసంలో నగదు, షెల్ కంపెనీల పత్రాలు సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు నగదును హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో  ముగ్గురికి బెయిల్ లభించింది. కాగా నకిలీ ఇన్వాయిస్, పెంచిన మద్యం ధరలతో అక్రమంగా సొమ్ములు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈడీలు  సోదాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో లింకులున్నాయని గుర్తించిన ఈడీ ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తోంది.  

కవిత రాజీనామాపై మండలి చైర్మన్ ఏమన్నారో తెలుసా?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె రాజీనామాను ఇప్పటి వరకూ ఆమోదించకపోవడానికి కారణం కూడా చెప్పారు. కల్వకుంట్ల కవిత తన రాజీనామా ఆమోదించాల్సిందిగా  కోరుతూ కవిత తనకు ఫోన్ చేసిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం గురించి వివరించారు. పార్టీ నుంచి సస్పెండైన తరువాత కవిత భావోద్వేగంతో రాజీనామా చేసి ఉంటారని భావించాననీ, అందుకే రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించానీ గుత్తా చెప్పారు.  కవిత రాజీనామాపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు.

వైసీపీ బెంగళూరు భజన.. కారణమేంటంటే?

అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.  అందుకు ఇటీవలి కాలంలో వైసీపీయులు చేస్తున్న బెంగళూరు భజనను ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు. ఇంతకీ వైసీపీ బెంగళూరు భజన ఎందుకు, ఎలా మొదలైందంటే..  బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో కర్నాటక రాజధాని నగరంలో  మౌలిక సదుపాయాలు అత్యంత దారుణమని విమర్శిస్తూ.. ఇలాంటి నగరంలో తమ సంస్థను కొనసాగించడం ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విమర్శ చేశారు.   బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదా రుల అధ్వాన పరిస్థితిపై ఆ పోస్టుతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.   బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టు బెంగళూరులో రహదారుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది.   తమ కంపెనీ సిబ్బంది కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి పట్టే కనీస ప్రయాణ సమయం గంటన్నరకు మించి ఉంటోందనీ, దీనికి తోడు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానమనీ ఆయనా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనీ, ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడుతుందన్న ఆశ లేదనీ ఆ పోస్టులో పేర్కొన్న సీఈవో ఈ పరిస్థితుల్లో తమ సంస్థను బెంగళూరులో కొనసాగించడం తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొన్నారు.  సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తనకున్న శ్రద్ధను, చిత్త శుద్ధినీ చాటుకున్నారు.  బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి  బెంగళూరులో రవాణా కష్టాలు ప్రస్తావిస్తూ.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టిన గంటల వ్యవధిలో లండన్ పర్యటనలో ఉన్న లోకేష్ స్పందించారు. విశాఖపట్నంను హైలైట్ చేస్తూ.. బెంగళూరు నుంచి మీ సంస్థను తరలించాలని భావిస్తే.. విశాఖకు రావాలని కోరుతూ ఆయనను కోరారు.  విశాఖ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్దాల్లాంటి రహదారులు ఉన్నాయనీ, శాంతి భద్రతల విషయంలో విశాఖ నంబర్ వన్ అని పేర్కొన్నారు.  దీంతో వైసీపీయులు ఒక్కసారిగా బెంగళూరు భజన ప్రారంభించేశారు. బెంగళూరు నుంచి పరిశ్రమను తరలించాలని లోకేష్ కోరడం ఇరు  రాష్ట్రాల మధ్యా సత్సంబంధాలను దెబ్బతీయడమేనంటూ విమర్శలు గుప్పించడం ఆరంభించారు. అయినా ఒక రాష్ట్రంలోని కంపెనీని ఏపీకి తరలించాలంటూ ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. లోకేష్ చర్యలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం మంత్రి నారాలోకేష్ స్పందన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, శ్రద్ధకు తార్కానంగా విశ్లేషిస్తున్నారు. బెంగళూరు నుంచి తమ కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో  పేర్కొన్న తరువాతే లోకేష్.. ఏపీ బెస్ట్ చాయిస్ అంటూ ఆహ్వానించారనీ, అందులో తప్పేమిటనీ అంటున్నారు. అయితే ఏపీ అభివృద్ధి పట్ల ఇసుమంతైనా అక్కర లేని వైసీపీ మాత్రం బెంగళూరు నుంచి పరిశ్రమను లోకేష్ ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ గుండెలు బాదేసుకోవడం వెనుక తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట,  లోకేష్ ప్రతిష్ఠ పెరుగుతాయన్న దుగ్ధ తప్ప మరో కారణం లేదంటున్నారు 

బెంగళూరు కంపెనీకి లోకేష్ ఆహ్వానం

మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.  తాజా ఇంగ్లాండ్  పర్యటనలో ఉన్న లోకేష్ బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది.  బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదారుల అధ్వాన పరిస్థితి కూడా  జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. అలాగే అక్కడి సంస్థలు బెంగళూరులో కొనసాగడంపై పునరాలోచనలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే  బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందించారు.  విషయమేంటంటే.. దేశంలో అతి పెద్ద డిజిటల్ ట్రక్కింగ్ ఫ్లాట్‌ఫాంగా ఉన్న బ్లాక్‌బక్ అరే సంస్థను 2015లో నెలకొల్పారు. గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని, ఆఫీసుకు రావాలంటే తమ ఉద్యోగులకు గంటన్నర సమయం పడుతోందని బ్లాక్‌బక్ సీఈఓ రాజేష్ యాబాజి  సోషల్ మీడియాలో ఓ   పోస్టు పెట్టారు. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని, గత అయిదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదని, దీంతో తాము తమ సంస్థను ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించుకున్నామనీ ఆ పోస్టులో పేర్కొన్నారు.  ఆ పోస్టుపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్..  ‘హాయ్ రాజేష్, మీ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు.   భారత్‌లోని అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మౌలిక సుదుపాయాలను మెరుగుపరుస్తున్నారం. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మీ సంస్థను విశాఖకు తరలించే విషయంపై మీ అభిప్రాయాన్ని నాకు నేరుగా సందేశం పంపండి అంటూ లోకేష్ పేర్కొన్నారు.  లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన విషయంలో చూపుతున్న ఆసక్తి, శ్రద్ధలకు ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలలో గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం సోదాలు ప్రారంభించింది. ఈ సోదాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ పై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కుంభకోణంతో  సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ఈడీ వాంగ్మూలాలు తీసుకుంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. ఇప్పుడు ఆ వాంగ్మూలాలు, విచారణలో తేలిన అంశాల ఆధారంగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆఫీసులు, నివాసాలలో సోదాలు ప్రారంభించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు సహా పలు ప్రాంతాలలో ఈ సోదాలు జ రుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బినామీ సంస్థలు, సూట్ కేసు కంపెనీలు, హవాలా ద్వారా దాదాపు 3500 కోట్లు మనీలాండరింగ్ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఈడీ నజర్ పెట్టింది.  

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరౌతారా? లేదా? అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే  ఆ ఉత్కంఠకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తెరపడింది. ప్రజా సమస్యలు జగన్ కు ఆయన పార్టీ సభ్యులకు పట్టవని మరో సారి రుజువైపోయింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ సభ్ములెవరూ హాజరు కాలేదు. వారు ఎక్కడా కనిపించలేదు.  అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులు అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై మాట్లాడానికి వైసీపీ సభ్యులను ఆహ్వానించారు. గైర్హాజర్ కొనసాగితే అనర్హత వేటుపై హెచ్చరించారు. అంతెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభకు వచ్చి సమస్యలపై, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు సిద్ధమా అని సవాల్ కూడా విసిరారు. అయినా జగన్ స్పందించలేదు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన సహా, ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. వాటిని పట్టించుకోని జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం తరువాత సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆయన ఏం మాట్లాడనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేలతో సదరు పార్టీ అధినేత అసెంబ్లీ సమావేశాల సమయంలో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీని బాయ్ కాట్  చేసి ఏమ్మెల్యేలకు ఏం దిశా నిర్దేశం చేస్తారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.